చౌడేపల్లె: సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ ప్రసన్న ఆంజనేయ స్వామి మహిమతోనే చోరీకి గురైన బంగారు నగలు, నగదు తిరిగి లభ్యమయ్యాయని బాధితుడు సి.అజయ్ బాబు తెలిపారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాజనాలబండకు చేరుకుని బంగారు నగలు, నగదును స్వామివారి పాదాలచెంత పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చెరుకువారిపల్లెకు చెందిన సి.అజయ్బాబు ఇంట్లో మూడు నెలల క్రితం 62 గ్రాముల నగలు, రూ.25 వేల నగదు చోరీ జరిగింది. అజయ్బాబు ఇంట్లో వారిని, చుట్టుపక్కల వారిని విచారించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. పెద్ద మనుషులతో పంచాయతీ నిర్వహించి రాజనాల బండలో ప్రమాణం చేయాలని తీర్మానించారు. గత శనివారం రాజనాలబండకు చేరుకుని ముందుగానే ఈ నెల 19వ తేదీ శనివారం ప్రమాణం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేసి వారి గ్రామానికి వెళ్లి విషయాన్ని గ్రామపెద్దలకు వివరించారు. శనివారం ఉదయం ఇంటికొక మనిషి రాజనాల బండకు బయలు దేరాల్సి ఉండగా ఇంటి ఆవరణలో నగలు, నగదు ప్రత్యక్షమయ్యాయి. వాటిని గుర్తించిన బాధితులు విషయాన్ని పెద్ద మనుషులకు తెలిపి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకుని పూజలు చేశారు. స్వామి మహిమతోనే పోయిన నగలు తిరిగి వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment