● నేడు కోరుకొండకు సీఎం జగన్ రాక
● ఎన్నికల ప్రచార సభలో
ప్రసంగించనున్న జననేత
● వేలాదిగా తరలి రానున్న జనం
● 2019 ఎన్నికలకు
ముందూ ఇక్కడ జగన్ సభ
● నాడు వైఎస్సార్ సీపీ అఖండ విజయం
● అదే సెంటిమెంట్
రిపీటవుతుందంటున్న విశ్లేషకులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత ఎన్నికల వేళ చెప్పిన మాట చెప్పినట్టుగా అమలు చేయడమే కాదు.. అంతకు మించి చేసి చూపించారు ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. అందువల్లనే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల సమరాంగణాన.. దేశ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఏ రాజకీయ నాయకుడూ సాహసించని రీతిలో.. తన ప్రభుత్వం ద్వారా మీ కుటుంబంలో ఏదైనా మేలు జరిగినట్టు భావిస్తేనే తనకు ఓటేయండని ప్రజలను ధైర్యంగా అడుగుతూ.. దమ్మున్న ఏకైక నాయకుడిగా పేరొందారు. గడచిన ఐదేళ్లుగా ప్రజలకు ఎన్నో మేళ్లు చేసి, వాటిని కొనసాగించేందుకు మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని కోరు తూ ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల మద్దతు కోరుతూ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో మంగళవారం ఉదయం జరిగే సభలో పాల్గొంటున్నారు. ఎన్నికల నోటిపికేషన్ ఇచ్చిన తరువాత ఉమ్మడి జిల్లాలో ఆయన పాల్గొంటున్న రెండో ప్రచార సభ ఇది. సీఎం జగన్ ఎక్కడ సభ నిర్వహించినా కట్టలు తెగిన వరద గోదారిలా వేలాదిగా పోటెత్తుతున్న జనం కదన దళంలా తరలివస్తున్నారు. ‘నీవెంటే మేమంటూ’ వేలాదిగా సమరగళమై గర్జిస్తున్నారు.
ఐదేళ్ల క్రితం..
సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే కోరుకొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి అభిముఖంగా నాడు నిర్వహించిన ఆ ఎన్నికల ప్రచార సభ నభూతో.. అనే రీతిలో సాగింది. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది. నాటి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించింది. రాజానగరం నియోజకవర్గం నుంచి 32 వేల పై చిలుకు మెజార్టీతో జక్కంపూడి రాజా తొలిసారి శాసనసభ్యుడిగా విజయకేతనం ఎగురవేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. నాటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2019 ఏప్రిల్ 7న ఆయన ఇక్కడ జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు. సరిగ్గా ఐదేళ్ల ఒక్క నెల తరువాత.. మే 7న అంటే మంగళవారం తిరిగి అదే కోరుకొండకు సీఎం జగన్ వస్తూండటం విశేషం. నాడు ఎన్నికల ప్రచారానికి వినియోగించిన బస్సు నుంచే.. ఉప్పొంగిన అభిమానంతో అశేషంగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ఐదేళ్ల తరువాత జరుగుతున్న ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల కోసం మంగళవారం అదే ప్రాంతంలో ఆయన బస్సు పైనుంచి ప్రసంగించనుండటం యాదృచ్ఛికమే అయినా సెంటిమెంట్గా భావిస్తున్నారు. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో జరిగే జగన్ ఎన్నికల ప్రచార సభతో నాటి సెంటిమెంట్ రిపీటవుతుందని, రాష్ట్రంలో, రాజానగరంలో వైఎస్సార్ సీపీ విజయబావుటా ఎగురవేయడం ఖాయమని పార్టీ శ్రేణులు ఢంకా బజాయించి మరీ చెబుతున్నాయి. నాడు జగన్ అప్పటి, ఇప్పటి అభ్యర్థి జక్కంపూడి రాజా తన తమ్ముడంటూ, తమ్ముడిని గెలిపిస్తే తనను కూడా గెలిపించినట్టేనని ప్రజల మనసు చూరగొన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలంటే రాజాను గెలిపించాలని నాడు ప్రజలను అభ్యర్థించారు. అదే తరహాలో ఈసారి కూడా ప్రజల మనసుల్ని చూరగొనేందుకు వస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టోలో చెప్పినవే కాదు.. అందులో చెప్పనివి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారు.
‘మేమంతా సిద్ధం’ అంటూ..
గత నెల 18న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన జగన్కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పట్టారు. సంఘీభావంగా నిలిచారు. సంక్షేమ పథకాలతో పేదల తలరాతలు మార్చి, నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపి, కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టించిన జగన్ వైపే తామంతా ఉన్నామని ఘంటాపథంగా చెబుతున్నారు. గత నెల 28న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట సెంటర్లో సీఎం జగన్ పాల్గొన్న తొలి ఎన్నికల ప్రచార సభకు సైతం వేలాదిగా జనం పోటెత్తారు. అదే సెంటర్లో సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019లో జగన్ స భ జరగడం కూడా మరో విశేషం. ఎన్నికలు తుది దశ కు చేరుకుని, మరో ఐదు రోజుల్లో ప్రచార పర్వానికి తెర పడనున్న నేపథ్యంలో సీఎం జగన్ కోరుకొండలో సమరశంఖం పూరించనున్నారు. గడచిన ఐదేళ్లలో రూ.1,773 కోట్లతో అభివృద్ది, రూ.1,377 కోట్లతో సంక్షేమాన్ని, 20 వేల పై చిలుకు ఇళ్లు అందించి, ఇచ్చిన హామీలన్నింటినీ నూరు శాతం అమలు చేసిన రాజాను ఎమ్మెల్యేగా మరోసారి ఆశీర్వదించాలని, ఎంపీగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను గెలిపించాలని జగన్ ప్రజలను కోరనున్నారు. మీ కుటుంబంలో మంచి చేసి ఉంటేనే ఓటేయండని అడగనున్నారు. ఈ ప్రచార సభకు తరలివెళ్లేందుకు వేలాదిగా జనం ‘మేమంతా సిద్ధం’ అంటున్నారు. గత ఎన్నికల్లో సాధించిన ఫలితాల సెంటిమెంటే ఈ సభ ద్వారా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా రిపీటవడం ఖాయమని అంటున్నారు.
వేలాదిగా తరలిరండి
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, 10.30 గంటలకు కోరుకొండ చేరుకుంటారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి రావాలని, సుశిక్షితులైన సైనికుల్లా క్రమశిక్షణ పాటిస్తూ, సభను విజయవంతం చేయాలని కోరుతున్నా.
– జక్కంపూడి రాజా,
ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు