ఏలూరులోని 3 కేంద్రాల్లో 1,320 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): దేశంలోని వైద్య విద్యా కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఆదివారం ప్రశాంతంగా జరిగింది. పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తారని ముందుగానే ప్రకటించడంతో విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచే తమకు నిర్దేశించిన పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో తమకు కేటాయించిన తరగతి గదుల కోసం కేంద్రం బయట ఏర్పాటు చేసి సూచిక బోర్డులో తమ నెంబర్లను వెతుక్కుని కేంద్రాల్లోకి ప్రవేశించారు. పరీక్షా కేంద్రాలలో సంబంధిత అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించారు. వారి వద్ద ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సీఆర్ఆర్ అటానమస్ కళాశాలలో పరీక్ష కేంద్రానికి వచ్చిన విద్యార్థుల్లో ఒక విద్యార్థి చెవి పోగు ధరించడంతో అతని చెవిపోగుకు అధికారులకు ప్లాస్టర్ వేసి పరీక్షా కేంద్రంలోకి పంపారు. విద్యార్థుల అడ్మిట్ కార్డులను, వారి గుర్తింపు కార్డులతో సరిపోల్చిన అనంతరమే వారిని లోనికి అనుమతించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకూ నిర్వహించిన పరీక్షకు ఏలూరులోని మూడు కేంద్రాల్లో కలిపి మొత్తం 1,320 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ అటానమస్ కళాశాలలో 504 మందికి గాను 491 మంది, సీఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో 504 మందికి గాను 487 మంది, ఆదిత్య డిగ్రీ కళాశాలలో 353 మందికి గాను 342 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు సిటీ కో–ఆర్డినేటర్గా వైఎస్ఎస్ చంద్రశేఖర్ వ్యవహరించగా, సీఆర్ఆర్ అటానమస్ కళాశాల అబ్జర్వర్గా ఎం.కృష్ణ, సీఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల పరిశీలకునిగా జీ ప్రభు, సత్రంపాడు ఆదిత్య డిగ్రీ కళాశాల పరిశీలకునిగా ఓ.శ్రీహరి వ్యవహరించారు. విద్యార్థులతో పాటు పరీక్షా కేంద్రాలకు వచ్చిన తల్లిదండ్రులు ఎండలోనే నిరీక్షించాల్సి వచ్చింది.
పరీక్షా కేంద్రం వద్ద సందడి