● త్వరలో అందుబాటులోకి
● డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ
రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి
కాకినాడ క్రైం: మృతదేహాన్ని కోయకుండానే పోస్ట్మార్టం నిర్వహించే అధునాతన సాంకేతికత అందుబాటులోకి రానున్నదని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి తెలిపారు. ఆ దిశగా జరుగుతున్న పరిశోధనలు సఫలీకృతం అవుతున్నాయన్నారు. గురువారం కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో సౌత్ ఇండియా మెడికో లీగల్ అసోసియేషన్ వార్షిక సదస్సు, సిమ్లా–2024 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది ఫోరెన్సిక్ వైద్య నిపుణులు హాజరయ్యారు. ఆర్గనైజింగ్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్వోడీ డాక్టర్ పి.ఉమామహేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫణికిరణ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సదస్సుకు విశిష్ట అతిథిగా డీఎంఈ అకడమిక్ డాక్టర్ రఘునందన్ హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ, ఫోరెన్సిక్ మెడిసిన్ దిఽశదశ సమూలంగా మారిపోనుందన్నారు. వర్చువల్ పోస్ట్మార్టంకు ప్రాధాన్యం పెరుగుతోందని తెలిపారు. దేశ, విదేశాల్లో ఇప్పటికే అధునాతన సాంకేతిక అనుబంధ అటాప్సీ విధానాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. సాంకేతికతను జోడించి చేసే అటాప్సీలో కచ్చితత్వానికి ఎక్కువ అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ క్యాంపస్ ఆఫీసర్, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్ సహా ఫోరెన్సిక్ విభాగం బోధనా సిబ్బంది, పీజీలు పాల్గొన్నారు.
జిల్లా రవాణాశాఖాధికారి
మోహన్ బదిలీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా రవాణాశాఖాధికారి ఎ.మోహన్ విజయవాడ డీటీసీగా నియమితులై గురువారం రిలీవ్ అయ్యారు. ఈయన స్థానంలో కర్నూలు డీటీసీగా ఉన్న శ్రీధర్ నియమితులయారు. ఈ సందర్భంగా మోహన్కు కార్యాలయంలో రవాణాశాఖాధికారులు, కార్యాలయ సిబ్బంది వీడ్కోలు పలికారు. నూతనంగా నియమితులైన శ్రీధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎమ్మెల్యే నానాజీ దౌర్జన్యంపై
త్వరలో ప్రభుత్వానికి నివేదిక
కాకినాడ సిటీ: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం, దాడి సంఘటనపై పౌరహక్కుల సంఘం నిజ నిర్ధారణ కమిటీ బృందం నివేదికను త్వరలో ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు, ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణలు గురువారం కాకినాడలో తెలిపారు. ఇప్పటికే ఈ నిర్ధారణ కమిటీ కాకినాడలో పర్యటించి సిబ్బందిని, డాక్టర్ కలిసి వాస్తవాలను సేకరించిందన్నారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు ఆర్ఎంసీ మైదానంలో ప్రవేశించి మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్పై దాడి చేసి కొట్టారన్నారు. వాలీబాల్ ఆటకు కళాశాల మైదానం బయట వ్యక్తుల ప్రవేశానికి నిరాకరించినందున డాక్టర్ను కొట్టడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే నానాజీ రాజీనామా చేయాలని, కేసులో ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు చేర్చాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు వారు తెలిపారు.
నిరసన విరమణ
కాకినాడ క్రైం: కొద్ది రోజులుగా కాకినాడ జీజీహెచ్లో డిమాండ్లు అమలు చేయాలని కోరుతూ నిరసన బాట పట్టిన కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు తమ నిరసనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు ప్రభుత్వం తరఫున చర్చించి సానుకూల అభిప్రాయాన్ని వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంట్రాక్టు నర్సుల సంఘ నాయకత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. 115 జీవో కోసం సంబంధిత అధికారులకు నోటీసులు అందించి జీవో ప్రొసీడింగ్స్ ఆపారని వెల్లడించారు. జీవో సమస్య కోర్టులో ఉన్న నేపథ్యంలో తిరిగి ఏఎన్ఎంలను వారి స్థానాల్లోనే కొనసాగిస్తున్నారన్నారు. స్టాఫ్ నర్సు పోస్టులు వారితో భర్తీ చేయలేదని వెల్లడించారు. మిగిలిన డిమాండ్లయిన 100 గ్రాస్ శాలరీ, పరస్పర అంగీకార బదిలీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఐదుగురు స్టాఫ్ నర్సుల నియామకం, నర్సులకు భద్రత, విధి నిర్వహణలో మృతి చెందితే కాంట్రాక్టు స్టాఫ్ నర్సు కుటుంబానికి రూ.50 లక్షల బీమా అంఽశాలపై ప్రభుత్వంతో చర్చించి అమలుకు చర్యలు చేపడతామన్నారు. నిర్ణీత కాలంలో స్పందించకపోతే ఉద్యమం అనివార్యమవుతుందని సంఘ నాయకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment