జగిత్యాలక్రైం: వడదెబ్బకు గురైన జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన సంగెపు గంగరాజు (41) చికిత్స పొందుతూ మృతిచెందింది. గంగరాజు మూడు రోజుల క్రితం తక్కళ్లపల్లిలో జరిగిన బోనాల పండుగలో పాల్గొంది. బోనం ఎత్తుకుని ఎండలో ఉండగా.. తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ మోతె గ్రామానికి వెళ్లి ఆమె మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ధర్మపురిలో వృద్ధుడు..
ధర్మపురి: వడదెబ్బకు గురై వృద్ధుడు మృతి చెందిన సంఘటన ధర్మపురిలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఎండీ.జమాల్ (80) ఆదివారం వడదెబ్బకు గురై రాత్రి వాంతులు, విరోచనాలు చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, కూతురున్నారు.
తీగెల వంతెనపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
కరీంనగర్రూరల్: కరీంనగర్ తీగెల వంతెన మీద నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి సోమవారం దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కరీంనగర్రూరల్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వయస్సు సుమారుగా 35–40 ఏళ్లు ఉంటుందని, తెలుపు రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని వివరించారు. ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిస్తే ఎస్హెచ్వో సెల్నంబర్ 8712670764, పోలీస్స్టేషన్ నంబర్ 8331940590లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
చిత్తుగా తాగి.. రూ.200 కోసం ఘర్షణ పడి..
ముత్తారం(మంథని): చిత్తుగా మద్యం తాగి ఆ మత్తులో ఇద్దరు దాడి చేసుకున్నారు. వారిని వారించే క్రమంలో మరో వ్యక్తికి బీరుసీసా గుచ్చుకుని తీవ్రంగా గాయపడ్డాడు. మండల కేంద్రంలోని ఓ వైన్స్షాపులో సోమవారం ఈఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మారం మల్లారెడ్డి, పింగిళి ప్రభాకర్రెడ్డి, మరి కొందరు కలిసి వైన్స్ షాపు వెనకాల ఓ గదిలో మద్యం తాగుతున్నారు. ఆ మత్తులో రూ.200 కోసం ఇద్దరూ గొడవపడుతున్నారు. పరస్పరం తన్నుకుంటూ బీరుసీసాలతో దాడులకు దిగారు. ఈక్రమంలో కేశనపల్లికి చెందిన ఎండీ షరీఫ్ ఆ గొడవ ఆపే ప్రయత్నం చేశారు. దీంతో బీరుసీసా అతడి మెడకు గుచ్చుకుని తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకనున్నారు. తీవ్రగాయాలైన షరీఫ్ను 108 వాహనంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మల్లారెడ్డి, ప్రభాకర్రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఫిర్యాదు అందలేదని ఎస్సై మధూసూదన్రావు తెలిపారు.
వైభవంగా మహాలింగార్చన
వేములవాడ: మాసశివరాత్రిని పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం రాత్రి మహాలింగార్చన వైభవంగా జరిగింది. స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.