బనశంకరి: ఇకపై వీధి కుక్కలకు ఎక్కడపడితే అక్కడ ఆహారం వేయరాదు, వాటికి ఆహారం ఇవ్వడానికి టైంటేబుల్ ఉండాలని పాలికె నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా కూడా విధిస్తుంది. ఇదిలా ఉంటే వీధి శునకాలకు భోజనం అందించే విషయంలో నిబంధనలు రూపొందించాలని అపార్టుమెంట్ క్షేమాభివృద్ది సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అపార్టుమెంటు నివాసులు వీధి శునకాలకు భోజనం వేసే విషయంలో పలుమార్లు వివాదాలకు కారణమైంది. అపార్టుమెంట్లకు ఎదురుగా ఆహారం వేయడంతో వీధి శునకాలు అక్కడే సంచరించడం, ఆహారం కోసం పోట్లాడటం తదితర విషయాల్లో వివాదాలు జరిగాయి. కొన్నిసార్లు నివాసులు మధ్య, మరికొన్ని సార్లు అపార్టుమెంటు వాసులు జంతు ప్రేమికుల మధ్య వివాదాలు తలెత్తాయి. ఎక్కడపడితే అక్కడ కుక్కలకు ఆహారం వేయడంతో నగర సౌందర్యానికి భంగం కలుగుతుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు మహానగర పాలికె పశుసంవర్దకశాఖ నిబంధనలు రూపొందించాలని తీర్మానించింది. వీధి శునకాలకు ఆహారం వేయడానికి కొన్ని నిర్దిష్ట స్థలాలు, వేళలను గుర్తిస్తారు. నిర్దిష్ట సమయంలో మాత్రమే ఆహారం అందించాలనే నిబంధన రూపొందిస్తారు.
శునకాల ఇబ్బందులకు చెక్
వీధి శునకాలు ఒకరోజు ఆహారం వేస్తే అలాంటి వారిని అవి మరచిపోవు. నిత్యం అదే సమయానికి అదే స్థలానికి వచ్చి వేచిచూస్తాయి. నిర్దిష్ట స్థలం, సమయంలో శునకాలు సంచారం అధికంగా ఉంటుంది. మిగిలిన సమయాల్లో వీధిశునకాల ఇబ్బందులు ఉండవని ఆలోచిస్తున్నారు.
బెంగళూరు నగరంలో శునకాలు తగ్గుముఖం
గతంలో బెంగళూరులో 3.10 లక్షల వీధి శునకాలు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 2,79,335కు చేరుకుంది. పాలికె ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు 77,555 శునకాలకు యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ (ఏఆర్వీ) వేశారు. 70 శాతం శునకాలకు సంతానహరణ శస్త్రచికిత్స చేశారు. బెంగళూరు తూర్పు విభాగంలో 9,441, బెంగళూరు పశ్చిమ 8,927, బెంగళూరు దక్షిణ 8,191, రాజరాజేశ్వరినగర 12,795, దాసరహళ్లి 8,665, బొమ్మనహళ్లిలో 11,402 శునకాలకు టీకా వేశారు.
బోర్డులు ఏర్పాటు చేస్తాం :
రాత్రి 10 గంటల అనంతరం పలుచోట్ల జనసందడి తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో వీధి కుక్కలకు ఆహారం వేయాలని అపార్టుమెంట్లు ఆవరణలో బోర్డులు అమర్చడం, అదేవిధంగా సార్వజనిక స్థలాల్లో సరైన స్థలం ఎంపిక చేసుకుని అక్కడ ఆహారం వేయాలని బోర్డులు ఏర్పాటు చేస్తామని బీబీఎంపీ పశుసంవర్దకశాఖ జేడీ డాక్టర్ రవికుమార్ తెలిపారు.
ఆహార వేళలు నిర్ణయిస్తామని
బెంగళూరు పాలికె ప్రకటన
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా
ఎక్కడ పడితే అక్కడ ఆహారం వేయరాదు