నట్టల నివారణతో జీవాల్లో ఎదుగుదల
కర్నూలు(అగ్రికల్చర్): జీవాల్లో నట్టల బెడద సర్వసాధారణం. నేలకు దగ్గరగా మేత మేయడం వల్ల ఆ సమస్య ఉత్పన్నమవుతుంది. మేత లభ్యం కానప్పుడు, పోషకాల లోపం ఏర్పడినప్పుడు, వానకాలం, అనావృష్టి సందర్భాలు, అంటు వ్యాధులు ప్రబలిన సమయాల్లో ఈ పరాన్న జీవుల బెడద అధికంగా ఉంటుంది. అయితే, సకాలంలో నట్టల నివారణ మందులు తాపితే జీవాల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఎదుగుదల కనిపిస్తోందని పశువైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు తాపే కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. కర్నూలు జిల్లాలో 14.07 లక్షలు, నంద్యాల జిల్లాలో 11.88 లక్షల సన్న జీవాలు ఉన్నాయి. సన్న జీవాలు ఆరోగ్యంగా బరువు పెరిగితేనే గొర్రెల పెంపకం లాభసాటి అవుతోంది. వైఎస్ఆర్సీపీ పాలనలో గొర్రెలు, మేకలకు ఏడాదికి మూడు సార్లు నట్టల నివారణ మందులు తాపడం జరిగేది. ఇప్పుడు కొంత ఆలస్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 16వ తేదీన మొదలైన ఈ కార్యక్రమం ఈ నెల చివరి వరకు కొనసాగుతుంది. నట్టల నివారణ మందులు తాపడం వల్ల జీవాల కడుపులో ఉండే అంతరపరాన్న జీవులైన ఏలికపాములు, బద్దెపురుగులు, పొట్టజలగలు, కార్జపు జలగలు నశిస్తాయి. సగటున 2 కిలోలు బరువు పెరుగుతాయి. ఇందువల్ల గొర్రెల పెంపకందారులకు 10 శాతంపైగా ఆదనపు ఆదాయం వస్తుంది. సన్న జీవాలకు సామూహికంగా నట్టల నివారణ మందులు తాపాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.
సగటున 2 కిలోల వరకు
బరువు పెరిగే అవకాశం
ఈ నెల చివరి వరకు నట్టల నివారణ
మందులు తాపే కార్యక్రమం
Comments
Please login to add a commentAdd a comment