మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో నీట్ ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5.20వరకు పరీక్ష నిర్వహించినట్లు సిటీ కోఆర్డినేటర్ పిల్లి కల్యాణ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని రెండు ప్రవేశ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, మహర్షి విద్యాలయంలో 123 మంది విద్యార్థులకు 118 మంది పరీక్షకు హాజరయ్యారని, ఏకశిల ఏజింల్స్ హైస్కూల్లో 576 మందికి 567 మంది హాజరయ్యారన్నారు. రెండు కేంద్రాల్లో 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, పరీక్షలకు సహకరించిన పోలీసు, విద్యాశాఖ సంబంధిత శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
358మంది హోం ఓటింగ్
మహబూబాబాద్ : మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆదివారం హోం ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందని ఆర్వో, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 85సంవత్సరాలు నిండిన వృద్ధులు, శారీరక అంకగవైకల్యం కలిగిన ఓటర్లకు ఇంటివద్దనే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. మొదటిరోజు 358మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.
ఎన్నికలకు ప్రజలు సహకరించాలి
కేసముద్రం: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని బేరువాడ గ్రామంలోని పోలింగ్ బూత్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై వంశీధర్ పాల్గొన్నారు.
ట్రాన్స్ఫార్మర్లలో మంటలు
మహబూబాబాద్ రూరల్ : అధిక ఎండల కారణంగా మహబూబాబాద్ పట్టణంలోని మహర్షి స్కూల్ సమీపంలో, మున్సిపాలిటీ పరిధిలోని రజాలిపేట గ్రామ శివారులోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లలో ఆదివారం మధ్యాహ్నం విద్యుదాఘాతం సంభవించి మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలాలకు చేరుకుని మంటలను ఆర్పారు. దీంతో పెను ప్రమాదాలు తప్పాయి.
మార్కెట్కు సెలవులు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఈ నెల 7నుంచి 14వ తేదీ వరకు వారం రోజులు బంద్ ఉంటుందని ఏఎంసీ కార్యదర్శి షంషీర్ ఆదివారం తెలిపారు. వర్షం సూచన, ఎండల తీవ్రత, హమాలీల సమస్యతో రైతులు అవస్థలు పడొద్దని సెలవులు ప్రకటించామని పేర్కొన్నారు. రైతులు సెలవుల విషయాన్ని గమనించి మార్కెట్కు ఎలాంటి సరుకులు తీసుకురావొద్దని కోరారు. ఈ నెల 15వ తేదీ నుంచి తిరిగి క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు.
బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలి
మహబూబాబాద్ అర్బన్: రాజ్యాంగ రక్షణ కోసం బీఎస్పీ ఎంపీ అభ్యర్థులను గెలిపించి పార్లమెంట్కు పంపాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు సెంటర్లో ఆదివారం బీఎస్పీ నాయకులు ప్రచారం నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, పార్టీ అభ్యర్థి కోనేటి సుజాత పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, శివరాజ్, విజయకాంత్, ప్రసాద్రావు, నాగన్న, శ్రీను, ఉపేందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.