![Who is Sajjan Kumar Ex MP Convicted 1984 Anti Sikh Riots Case Details Here](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/sujankumar.jpg.webp?itok=AwOClku8)
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ను కోర్టు దోషిగా తేల్చింది. బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఆయన్ని ఈ కేసులో దోషిగా ప్రకటించారు. అయితే శిక్ష ఖరారుపై వాదనలను మాత్రం ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేశారు.
1984 నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పంజాబీ బాఘ్ పోలీసులు కేసు నమోదు చేసుకు దర్యాప్తు చేశారు కూడా. అయితే ఆ తర్వాతి కాలంలో ఈ ఘటనను సిట్ దర్యాప్తు చేసింది. మరోవైపు.. 2021, డిసెంబర్ 16వ తేదీన సజ్జన్ కుమార్పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది.
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. ఈ క్రమంలో సరస్వతి విహార్ ప్రాంతంలో అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ను హతమార్చింది. అయితే.. సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్పొనడమే కాకుండా ఆ గుంపునకు నాయకత్వం వహించాడని కోర్టు ఇవాళ్టి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని తెలిపింది.
ఈ తీర్పును ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డీఎస్జీఎంసీ) ప్రధాన కార్యదర్శి జగ్దీప్ సింగ్ కహ్లాన్ స్వాగతించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షా సిట్ను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఢిల్లీ కంటోన్మెంట్లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఆయనకు గతంలోనే యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1984 సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్ను దోషిగా నిర్దారిస్తూ 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది . ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష పడడంతో.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.
ఢిల్లీలో ఓ బేకరీ ఓనర్ అయిన సజ్జన్ కుమార్కు.. సంజయ్ గాంధీతో దగ్గరి సంబంధా ఏర్పడ్డాయి. అలా ఢిల్లీ కౌన్సిలర్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి లోక్సభకు తొలిసారి గెలిచారు. 1991, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానానికి ఆయన ఎన్నికయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు (8,55,543)పోలైన నేతగా రికార్డు సృష్టించారు. అయితే.. 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా కోర్టు ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment