సంఘటనపై ఆరా తీసిన ఖానాపూర్ ఎమ్మెల్యే..
సోమవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2025
మాలేపూర్ ఘాట్ రెండో మలుపు వద్ద బోల్తా పడ్డ ఐచర్ వాహనం
గుడిహత్నూర్ మండలంలోని సూర్యగూడ, ఇంద్రవెల్లి మండలంలోని సాలెవాడకు చెందిన ఆదివాసీ లు జంగుబాయిని దర్శించుకోవడానికి ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఐచర్లో 70 మంది బయలు దేరారు. సూర్యగూడకు చెందిన మాజీ సర్పంచ్ కుమ్ర లింగు దీక్షలో ఉండగా వీరిని కాప్లే జంగుబాయి వద్ద పుణ్యస్నానాలు, దర్శనం కోసం తీసుకెళ్లారు. ఈ క్రమంలో సాయంత్రం 4గంటల సమయంలో నార్నూర్ మండలంలోని మాలేపూర్ రెండో మలుపు ఘాట్ వద్ద వాహనం అదుపు తప్పింది. డ్రైవర్ వాహనాన్ని న్యూట్రల్ చేయడంతోనే ప్రమాదం సంభవించిందని అందులో ప్రయాణిస్తున్న పలువురు పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనాన్ని అజాగ్రత్తగా నడిపి ఉండవచ్చని మరి కొందరు తెలిపారు. ప్రమాదంలో 47 మందికి గా యలవగా ఇందులో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్తో పాటు ఉట్నూర్, నార్నూర్ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో రిమ్స్లో చికిత్స పొందుతున్న గుడిహత్నూర్ మండలం సూర్యగూడకు చెందిన కుమ్ర మల్కు (60) మృతిచెందాడు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
లోయలో పడ్డ వాహనం..
డ్రైవర్ అజాగ్రత్తతో పాటు డీజిల్ ఆదా చేయాలనే కక్కుర్తితోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మొదటి ఘాట్ వద్ద న్యూట్రల్ చేయగా, రెండో ఘాట్ వద్ద వాహనం వేగంతో ముందుకెళ్లింది. ఆ సమయంలో బ్రేక్ వేసినప్పటికీ పడకపోవడంతో డ్రైవర్ తన ప్రాణాలు కాపాడుకునేందుకు అందులో నుంచి బయటకు దూకాడు. వాహనం మొదట రోడ్డు పక్కనున్న స్తంభాలను, ఆ తర్వాత చెట్లను ఢీకొట్టింది. మొదటి చెట్టు విరిగిపోగా రెండో చెట్టు వద్ద బోల్తా పడింది. అందులో ఉన్నవారు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ సంఘటనను చూసి డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కొత్తపల్లి, భీంపూర్కు చెందిన గ్రామస్తులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు ప్ర యత్నించారు. పోలీసులు, 108కు సమాచారం అందించారు. స్వల్ప గాయాలైన వారిని నార్నూర్ ఆస్పత్రికి, తీవ్ర గాయాలైన వారిని ఉట్నూర్, రిమ్స్ ఆస్పత్రులకు తరలించారు. చిన్న పిల్లలకు సైతం స్వల్ప గాయాలయ్యాయి.
క్షతగాత్రులు వీరే..
ప్రమాదంలో వృద్ధులకే ఎక్కువ గాయాలయ్యాయి. చాలా మందికి కాళ్లు, తల, నడుము భాగాల్లో దెబ్బ లు తగిలాయి. రిమ్స్లో చికిత్స పొందుతున్న వారి లో సూర్యగూడకు చెందిన కుమ్ర రాంబాయి, కుమ్ర భీంరావు, వైజాపూర్కు చెందిన మెస్రం నాని, సోయగూడకు చెందిన సోయం జంగుబాయి ఉన్నా రు. ఉట్నూర్ ఆస్పత్రిలో పూర్ణబాయి, కుమ్ర సీతా బాయి, కుమ్ర పాండు, కుమ్ర ప్రవీణ్, జుగాదిరావు, శివకుమార్, యాదవ్రావు ఉన్నారు. మిగతా వారు నార్నూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. విషయం తెలియడంతో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పది మంది వైద్యులు, సిబ్బందితో పాటు స్ట్రెచ్చర్లను అందుబాటులో ఉంచారు. వారికి వైద్య సేవలు అందించారు. సూపరింటెండెంట్ అశోక్ పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా క్షతగాత్రులను తరలించేందుకు సిరికొండ, ఇంద్రవెల్లి, ముత్నూర్, ఉట్నూర్, హస్నాపూర్, లోకారి(కె), గాదిగూడ, జైనూర్ల నుంచి మొత్తం తొమ్మిది 108 అంబులెన్స్లు సేవలందించాయి. కాగా, ఘటనపై కేసు నమో దు చేసి, ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని సీఐ రహీం పాషా తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఘటనాస్థలం వద్ద క్షతగాత్రులు
ఐచర్ వాహనం బోల్తా పడ్డ విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఫోన్ ద్వారా ఉట్నూర్ ఆస్పత్రి వైద్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని రిమ్స్, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment