![ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావుతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్న వంశీమోహన్
- Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/18/17gvm62b-310156_mr_1.jpg.webp?itok=cp1GKyJR)
వైఎస్సార్ సీపీ బందరు ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు
రామవరప్పాడు: చంద్రబాబు దొంగ మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైఎస్సార్ సీపీ బందరు ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు చెప్పారు. రామవరప్పాడులో బుధవారం మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్తో కలిసి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నో అమలు కాని హామీలిచ్చి చంద్రబాబు మోసం చేసిన విషయాన్ని ప్రజలు మరిచి పోలేదన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణే జగన్ను రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తోక పార్టీల కుట్ర రాజకీయం
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక తోక పార్టీలన్నీ కుట్రరాజకీయాలు చేస్తున్నాయని తమ విలువైన ఓట్ల ద్వారా వారికి బుద్ధి చెప్పి తరిమి కొట్టాలని వైఎస్సార్ సీపీ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న జగన్పై ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం చేయించడం దుర్మార్గ చర్య అన్నారు. సంక్షేమమే అజెండాగా జగన్ ప్రజల మధ్యే పర్యటిస్తున్నారన్నారు. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమకు విజయం చేకూరుస్తాయన్నారు. సీఎం జగన్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, తమ రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి అఖండ విజయం చేకూరుస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. గ్రామంలోని ఒకటో వార్డు సభ్యురాలు బర్రె దేవుడమ్మతో పాటు పలు కుటుంబాలు వంశీమోహన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. కార్యక్రమంలో గొల్లపూడి మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ కొమ్మా కోటేశ్వరరావు, ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జెడ్పీటీసీ సభ్యుడు సువర్ణరాజు, నియోజకవర్గ ఎలక్షన్ ఇన్చార్జి ఆర్.వెంకటేశ్వరరావు, పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు శీలం రంగారావు, గ్రామ సర్పంచి వరి శ్రీదేవి, పలు గ్రామాల సర్పంచ్లు, సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.