వంగర: మండల పరిధి కొండచాకరాపల్లి గ్రామ సమీపంలో సువర్ణముఖి నదిలో మట్టి, మడ్డి, ఇసుక(డీసిల్ట్) తొలగింపు పనులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ గురువారం పరిశీలించారు. నదిలో ప్రస్తుతం ఉన్న నీటిప్రవాహం, మడ్డి, మట్టి, ఇసుక వేరుచేసే ప్రక్రియపై సంబంధిత కాంట్రాక్టర్తో చర్చించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. యంత్రాలు ఉపయోగించి సిల్ట్ తొలగించకూడదని, కూలీలతో తొలిగించాలని ఉత్తర్వుల్లో ఉందని అధికారులు జేసి దృష్టికి తీసుకువచ్చారు. బహిరంగ ఇసుక రీచ్లలో యంత్రాలు వినియోగిం చకూడదని, డీసిల్ట్ పనుల్లో యంత్రాలు ఉపయోగించవచ్చునని, ఈ అంశంపై అవసరమైతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని జేసీ వెల్లడించారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఏర్పాటు చేసిన స్టాక్పాయింట్కు వెళ్లే వాహన వివరాలను నమోదు చేయాలని కొండచాకరాపల్లి, కొప్పర సచివాలయాల సిబ్బందిని జేసీ సేతు మాధవన్ ఆదేశించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. నదిలో నీటిప్రవాహం ఉన్నందున డీసిల్ట్ తొలగింపులో కొంత జాప్యం జరుగుతోందని, నదిలో 3.4 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పనులు చేపడతామని తెలియజేశారు. మట్టి, మడ్డిని తమ గ్రామానికి రక్షణ గట్టుగా వేయాలని కొండచాకరాపల్లి గ్రామస్తులు కోరారు. అనంతరం మండల ప్రత్యేకాధికారి కె.సందీప్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దిరిశాల ధర్మరాజు, మైనింగ్, ఇరిగేషన్ అధికారులతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment