పాల ధర తగ్గింపుపై నిరసన
సీతానగరం: విశాఖ పాల డెయిరీ రైతుల నుంచి సేకరించే పాలపై లీటరుకు రూ.5 తగ్గించడంపై రైతులు నిరసన తెలిపారు. సీతానగరం మండలం కాసయ్యపేటలోని పాలసేకరణ (బల్క్ సెంటర్) కేంద్రం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ ఓ వైపు పశుదాణా రేట్లు పెరుగుతుంటే పాలపై ధర తగ్గించడం విశాఖ డెయిరీ యాజమాన్యానికి తగదన్నారు. తగ్గించిన పాల సేకరణ ధర పెంచకపోతే ఈ నెల 29న విశాఖ డెయిరీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకుడు రెడ్డి రమణమూర్తి, రైతు సంఘం నాయకులు గేదెల సత్యనారాయణ, బంటు దాసు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రెడ్డి ఈశ్వరరావు, పాడి రైతులు బి.ధనుంజయ, పైల విశ్వనాథం, సిరికి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
పశుగణన ప్రారంభం
● పశు సంపద మరింత అభివృద్ధి చెందాలి: కలెక్టర్
పార్వతీపురంటౌన్: జిల్లాలో పశుగణన ప్రక్రియకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. పార్వతీపురం పశువైద్యశాల సమీపంలోని ఓ ప్రైవేటు డెయిరీ వద్ద జిల్లా పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పశుగణనను కలెక్టర్ శ్యామప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పశుసంపద మరింత వృద్ధి చెంది, తద్వారా రైతుల ఆదా యం పెరిగి ఆర్థిక వృద్ధి చెందేలా కృషి చేయాలని పశువైద్యాధికారులకు సూచించారు. పశుగణనను పారదర్శకంగా చేపట్టాలన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనసాగనుందని, జిల్లాలోని ప్రతి ఇంటిని సందర్శించి, పశువుల సమగ్ర సమాచారాన్ని సేకరించాలన్నారు. ప్రభుత్వం జారీచేసిన స్టిక్కర్లను ఇంటి గోడపై అతికించాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రోజుకు 10 వేల లీటర్ల పాలు, 10 వేల కిలోల మాంసం విక్ర యాలు జరుగుతున్నాయని, ఇది మరింత పెరిగేలా కృషిచేయాలని అధికారులకు సూచించారు. రైతుల వ్యయాన్ని తగ్గించి, అధిక ఆదాయం వచ్చే మార్గాలపై తగిన సూచనలు చేయాలని, వాటి ద్వారా తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. అనంతరం పశు వైద్యాధికారులకు మైక్రో స్కోప్లు, గణాంక అధికారులకు లైవ్ స్టాక్ సెన్సెస్ బ్యాగులను కలెక్టర్ పంపిణీ చేశారు. 21వ అఖిల భారత పశుగణన పోస్టర్లను ఆవిష్కరించారు. తొలుత గోపూజలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా పశు వైద్య శాఖాధికారి డా.ఎస్.మన్మథరావు, సహాయ సంచాలకులు డా.ఎం.ప్రసాద్, డా.సీహెచ్ దీనకుమార్, ఇతర వైద్యాధికారులు, పశుగణన అధికారులు, గోపాలమిత్రలు పాల్గొన్నారు.
జేఎన్టీయూ జీవీతో ఎంఎస్ఎంఈ ఒప్పందం
విజయనగరం అర్బన్: జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జీవీ)– భారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ విశాఖపట్నం అనే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. సీఎన్సీ టెక్నాలజీస్, ఆటోమేషన్, ఎంబెడెడ్ సిస్టం, ఇండస్ట్రీ 4.0, క్యారియర్–ఆధారిత కోర్సుల ప్రత్యేక డొమైన్లో నైపుణ్యం కలిగిన మానవ శక్తిని అభివృద్ధి చేయడం, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమలకు కావాల్సిన నిపుణులను అందించేలా స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడమే ఒప్పంద ప్రధాన లక్ష్యంగా వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. జేఎన్టీయూలో శుక్రవారం జరిగిన ఒప్పంద కార్యక్రమంలో వర్సిటీ వీసీ డి.రాజ్యలక్ష్మి, రిజిస్ట్రార్ జి.జయసుమ, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, డాక్టర్.జి జె.నాగరాజు, డైరెక్టర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ ప్లేస్మెంట్, బోధనా సిబ్బంది డాక్టర్. ఎం.హేమ, డాక్టర్.బి.తిరుమలరావు, డాక్టర్ ఎ.పద్మజ, డాక్టర్ టి.ఎస్.ఎన్.మూర్తి, ఎంఎస్ఎంఈ టెక్నాలజీ, విశాఖపట్నం డిప్యూటీ జనరల్ మేనేజర్ జి.ప్రసాదరెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ టి.విజయకృష్ణకాంత్, సీనియర్ మేనేజర్ (ప్రొడక్షన్–డిజైన్) డాక్టర్ కె.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment