● చలానాల పేరుతో అడ్డగోలు దోపిడీ ● ప్రభుత్వ దోపిడీకి విస్తుపోతున్న భక్తులు
దర్శి: ప్రభుత్వం చలానాల పేరుతో వినాయకున్నీ వదల లేదు. సంవత్సరానికి ఒక సారి వినాయక చవితి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలు జరుపుకుంటారు. సాధారణంగా వినాయక చవితికి మైక్ పర్మిషన్ కింద రూ.200 చలానా కట్టించుకుని అనుమతులు మంజూరు చేసేవారు. అయితే ప్రస్తుతం మాత్రం ఎన్ని రోజులు పెట్టుకుంటే అన్నీరోజులకు ఒకే సారి చలానా కట్టాలని చెబుతున్నారు. దీనికి తోడు విగ్రహం 3 నుంచి 6 అడుగులు ఉంటే రోజుకు రూ.350, ఆరు అడుగుల పైన ఉంటే రోజుకు రూ.700 లెక్కన చలానా ఎన్నిరోజులు పూజలు చేస్తే అన్ని రోజులు కట్టాలని నిబంధనలు పెట్టారు. మైక్ పర్మిషన్కు రోజుకు రూ.100 చలానా కట్టించుకున్నారు. దాదాపుగా ఎవరైనా 6 అడుగుల పైనే విగ్రహాలు పెట్టుకుంటారు. 9 రోజులు నవరాత్రులు వినాయకున్ని పూజిస్తారు. దీంతో రూ.6300 విగ్రహం పెట్టుకున్నందుకు, మైక్ పర్మిషన్కు మరో రూ.900 కట్టాలి. దీనికి తోడు పోలీసు మామూళ్లు సరేసరి. వినాయక పండపాలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామంటూ ఒక వాట్సాప్ నంబర్ను కేటాయించారు. అనుమతుల కోసం పోలీసుల వద్దకు వెళ్లిన మండప నిర్వాహకులతో ఆ నంబర్లో హాయ్ అని పెట్టిస్తున్నారు. వాట్సాప్లో ఒక ఫాం వస్తుంది. దాన్ని పూర్తి చేసి అప్లోడ్ చేయగా చలానా కట్టాలంటూ అడుగుతుంది. మీ సేవ ద్వారా చలానా కట్టించుకున్న తరువాత ఒక కాపీ పోలీసులు తీసుకుని ఒక కాపీ నిర్వాహకులకు ఇచ్చి పంపారు. 6వ తేదీ నాటికే దాదాపు వినాయక మండపాలకు చలానాలు కట్టడం పూర్తయ్యాయి. 8వ తేదీ హోం మంత్రి విలేకరుల సమావేశం పెట్టి రూపాయి కూడా చలానాలు తీసుకోవడం లేదని చెప్పడంపై భక్తులు మండిపడుతున్నారు. చలానాలు కట్టిన తరువాత ఇప్పుడు కట్టాల్సిన పనిలేదని చెప్పడం ఏమిటని.. చిత్తశుద్ధి ఉంటే ఆ చలానా నగదు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. ఇలా గతంలో ఎప్పుడూ లేదని, ఇదేం దోపిడీ అని భక్తులు మండిపడుతున్నారు. విషయం తెలిసిన కొందరు తమ విగ్రహాల ఎత్తును తగ్గించుకున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు బుక్ చేసుకోవాలనుకున్నవారు కూడా అంత విగ్రహాలు వద్దని చిన్న విగ్రహాలు పెట్టుకున్నారు. దీంతో తయారీదారుల వద్ద పెద్ద విగ్రహాలు నిలిచిపోగా చిన్న చిన్న విగ్రహాలు మాత్రం పూర్తిగా సేల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment