ఒంగోలు: జిల్లాలో 3, 4, 5 తరగతులు నిర్వహిస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, విలీన ఉన్నత, విలీన హైస్కూలు ప్లస్లలో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఈనెల 10, 11 తేదీల్లో బేస్లైన్ టెస్టు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి.సుభద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి టీచింగ్ ఎట్ది రైట్ లెవల్ బేస్లైన్ పరీక్షలు తెలుగు, గణితం పరీక్షలను ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహించాలన్నారు. బేస్లైన్ పరీక్ష నిర్వహణ, విధి విధానాలు, శాంపిల్ పరీక్ష పత్రాలను ఇప్పటికే మండల విద్యాశాఖ అధికారి మెయిల్, వాట్సప్ గ్రూపునకు పంపామన్నారు. ఉపవిద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, సెక్టోరల్ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ పాఠశాలల హెడ్మాస్టర్లు ఈ పరీక్షను 3, 4, 5 తరగుతులు నిర్వహిస్తున్న పాఠశాలలు అన్నింటిలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష నిర్వహణ అనంతరం ఫలితాలను వెబ్సైట్లో సకాలంలో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
హాకీ జట్టు మేనేజర్గా పీఈటీ రవి
చీమకుర్తి: ఏపీ జూనియర్ హాకీ పురుషుల జట్టుకు సంతనూతలపాడు మండలం మైనంపాడు ప్రభుత్వ హైస్కూలు పీఈటీగా పనిచేస్తున్న తిరుమలశెట్టి రవి మేనేజర్గా ఎంపికై నట్లు రవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9 నుంచి 19 వరకు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో నిర్వహించే 14వ హాకీ ఇండియా జూనియర్ పురుషుల జాతీయ టోర్నమెంట్కు మేనేజర్గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా రవిని హాకీ అసోసియేషన్ ప్రకాశం జిల్లా నిర్వాహక కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
నేడు కలెక్టర్ గ్రీవెన్స్ రద్దు
ఒంగోలు అర్బన్: ప్రతి సోమవారం ప్రకాశం భవనంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే మీ కోసం గ్రీవెన్స్ను ఈ సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అధికారులు, ఉద్యోగులు వెళ్లారని, ఈ నేపథ్యంలో మీ కోసం కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వివరించారు. ప్రజలు గమనించి జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల నుంచి సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు రావద్దని కోరారు.
విష సంస్కృతి నుంచి బాలలను రక్షించుకోవాలి
ఒంగోలు టౌన్: యావత్ ప్రపంచాన్ని కబళిస్తున్న సాంస్కృతిక విష సంస్కృతి నుంచి బాలలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉందని డా. చదలవాడ ఫణీంద్ర బాబు పిలుపునిచ్చారు. ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావు 61వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో భవిత కోసం బాలోత్సవం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రజా కళావేదిక కార్యదర్శి బెల్లంపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ బాలోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నేటి సమాజంలో బాలలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కళ్లకు కట్టినట్లు బాల కళాకారులు పలు కళారూపాలను ప్రదర్శించారు. జానపద కళల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అద్దంకికి చెందిన ప్రముఖ వైద్యులు డా.చదలవాడ ఫణీంద్రబాబు, ఎంతో మంది చిన్నారులకు శాసీ్త్రయ నృత్యంలో శిక్షణ ఇచ్చిన చింతపల్లి సుబ్బలక్ష్మిని ఘనంగా సన్మానించారు. ప్రముఖ ఇంద్రజాలికులు బీవీ రామన్ నిర్వహించిన మ్యాజిక్ షో ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేసింది. బొమ్మరిల్లు అనాథాశ్రమం నిర్వాహకులు పి.రాజ్యలక్ష్మి, టీఎల్ కాంతారావు, ప్రధానోపాధ్యాయులు ఎం వెంకట్రావు, కవి కూరపాటి పున్నారావు, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment