తలకొండపల్లి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని మిషన్ భగీరథ కార్పొరేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్, జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి.. ఆమెను సత్కరించారు. అనంతరం శాంతికుమారి వెంకటేశ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ తిర్మణి నిర్మల, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు గోపాల్నాయక్ ఉన్నారు.
బైక్ రైడింగ్పై
మహిళలకు శిక్షణ
బడంగ్పేట్: కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ హాస్టెన్ గోకార్డింగ్లో బైక్ రైడింగ్పై మహిళలకు ఆదివారం శిక్షణ నిర్వహించారు. ఇప్పటికే 200 మంది మహిళలకు పూర్తి శిక్షణ అందించామని, ఐదో విడతలో భాగంగా మరో 50 మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు ఆర్బీ సహవ్యవస్థాపకుడు, సీఈవో అభిషేక్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మహిళా సాధికారతపై దృష్టి సారించి మోటార్ సైకిళ్ల శిక్షణ ప్రారంభించినట్టు నిర్వాహకులు తెలిపారు.
20 కిలోల
గంజాయి పట్టివేత
మంచాల: ఇరవై కిలోల పొడి గంజాయిను పోలీసులు పట్టుకున్న సంఘటన మండల పరిధిలోని ఆగాపల్లి గ్రామం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. సీఐ కాశీవిశ్వనాథ్ కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి, కూర్మనూర్ గ్రామాల నుంచి కొంతమంది హైదరాబాద్కు బస్సులో గంజాయి రవాణా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మహేశ్వర జోన్ ఎస్ఓటీ పోలీసులు, మంచాల పోలీసు సిబ్బంది కలిసి ఆగాపల్లి వద్ద ఓ ప్రైవేట్ బస్సును తనిఖీ చేశారు. గంజాయి తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన సచిన్ సంతోష్ జాదవ్ (22), శరత్ భరత్ పవార్ (19), జోయల్ అనే బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 కిలోల పొడి గంజాయి ప్యాకెట్లు 5, ఐదుకిలోల పొడి గంజాయి ప్యాకెట్లు 2 చొప్పున 20 కిలోల గంజాయి పట్టుకున్నారు. వారి నుంచి రూ.1000 స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా మరో ఇద్దరి పేర్లు వెల్లడించారు. వారిలో మహారాష్ట్రకు చెందిన రాహుల్ ఖరత్, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉమేష్ సునా ఉన్నారు. వీరందరిపై కేసులు నమోదు చేశారు.
క్షుద్ర పూజల కోసం కస్తూరి పిల్లి అవయవాల తరలింపు
శంషాబాద్: క్షుద్రపూజల కోసం కస్తూరి పిల్లికి సంబంధించిన అవయువాలను తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం తెల్లవారు జామున సయ్యద్ అక్బర్ పాషా అనే వ్యక్తి ముంబై వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాడు. లగేజీ స్క్రీనింగ్లో అనుమానిత వస్తువులు కనిపించడంతో సీఐఎస్ఎఫ్ అధికారులు వాటిని విప్పి చూడగా, కస్తూరి పిల్లికి సంబంధించిన అవయవాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా క్షుద్ర పూజల కోసం వాటిని తీసుకెళ్తు న్నట్లు తెలిపారు. కస్టమ్స్ అధికారులు అతడిని అటవీ శాఖ అధికారులకు అప్పగించడంతో వారు అతడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడు వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే దానిపై దర్యాప్తు చేపట్టారు. కస్తూరి పిల్లి శేషాచలం అటవీ ప్రాంతంతో పాటు హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. కస్తూరి పిల్ల అవయవాలను సుగంధ పరిమళాల ఉత్పత్తుల తయారీలో.. కొన్ని రకాల ఔషధాల్లో వినియోగిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment