సాక్షి, సిటీబ్యూరో: సర్కారు బడుల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇటీవల ప్రతి మండలానికి ఒక ఎంఈఓను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. ఈ నెల 29న (మంగళవారం) హైదరాబాద్లో శిక్షణ నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నగర శివారు మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల నుంచి 42 మంది ఎంఈఓలు శిక్షణకు హాజరు కానున్నారు.
పర్యవేక్షణకు ప్రాధాన్యం
● ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 1–5 తరగతుల విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఎఫ్ఎల్ఎన్ (ఫండమెంటల్ లిటరసీ న్యూమరసీ) పేరుతో తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లోని 6–9 తరగతుల విద్యార్థులకు అభ్యస నాభివృద్ధి కార్యక్రమం (లిప్)ను ఉన్నతి పేరుతో అమలు చేస్తున్నారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత కోసం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయిలో విద్యాశాఖ చేపట్టిన తొలిమెట్టు, ఉన్నతి తదితర కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా ఎంఈఓలు పర్యవేక్షణ చేయాలి. వివరాలను పాఠశాల విద్యాశాఖ రూపొందించిన యాప్లో నమోదు చేయడంలో ఎంఈఓలకు శిక్షణ ఇవ్వనున్నారు.
● గతంలో కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయు లు, మండల నోడల్ అధికారి, మండల విద్యాధికారి వ్యవస్థ అమలులో ఉండేది. సీనియర్ హెచ్ఎంలు ఇన్చార్జి ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వహించేవారు. వీరికి (ఒక్కో ఇన్చార్జి ఎంఈఓకు) రెండు నుంచి ఆరు మండలాల అదనపు బాధ్యతలు ఉండటంతో సరైన పర్యవేక్షణ నిర్వహించలేక పోయారు. ఎంఎన్ఓగా పని చేస్తున్న సీనియర్ హెచ్ఎంలను ప్రస్తుతం ఎంఈఓలుగా నియమించారు. మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో 15 మండలాలు ఉండగా.. ఒక ఉప్పల్ మండలానికి మాత్రమే రెగ్యులర్ ఎంఈఓ ఉన్నారు. మిగతా 14 మండలాలకు ఎంఎన్ఓగా పనిచేస్తున్న సీనియర్ హెచ్ఎంలు ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యా ప్రమాణాల పెంపుదలకోసం ఎంఈఓలకు ఒక రోజు శిక్షణ ఇవ్వనున్నారు.
ప్రభుత్వ బడుల బలోపేతంపై నజర్
రేపు నగరంలో ఎంఈఓలకు శిక్షణ
నగర శివారు జిల్లాల నుంచి హాజరు కానున్న 42 మంది ఎంఈఓలు
Comments
Please login to add a commentAdd a comment