మీర్పేట: మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెడుతూ గత నెల 22న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లకు చెందిన 31 మంది కార్పొరేటర్లు కలెక్టర్కు లేఖ అందజేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తీర్మానం విషయమై సోమవారం కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. దీనికి కందుకూరు ఆర్డీఓ సూరజ్కుమార్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. అవిశ్వాసానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆదివారం అధికారులు తెలిపారు.
మాలెపల్లి గ్రామాన్ని సందర్శించిన డీపీఓ
ఆమనగల్లు: మండల పరిధిలోని మాలెపల్లి గ్రామాన్ని ఆదివారం జిల్లా పంచాయతీ అధికారి వి.సురేశ్మోహన్ సందర్శించారు. గ్రామంలో నిర్మించిన డంపింగ్యార్డు, శ్మశానవాటిక, నర్సరీ, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీలత, స్థానికులు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో
బీజేపీ గెలుపు ఖాయం
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి
షాబాద్: లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను బొంద పెట్టాలని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నాంధార్ఖాన్పేట్, లింగారెడ్డిగూడ, సాయిరెడ్డిగూడ, పెద్దవేడు గ్రామాలకు చెందిన 35 మంది వివిధ పార్టీల నాయకులు ఆదివారం బీజీపీలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు సమష్టిగా విజయానికి కృషి చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి 350 కన్నా ఎక్కువ సీట్లను గెలుపొందుతుందని ఆయన జోస్యం చెప్పారు. చేవెళ్ల లోక్సభ పరిధిలో బీజేపీ విజయం ఖాయమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ మండల అధ్యక్షుడు కిరణ్, రాము, కూతురు మహేందర్, కృష్ణ, పొన్న రాజీవ్రెడ్డి, రాజేందర్రెడ్డి, జగదీశ్గౌడ్, రవిగౌడ్, జనార్దన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, క్యామ నారాయణ, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘టీనేజ్ గర్ల్’లో కౌమార భావోద్వేగాలు
మణికొండ: పద్నాలుగు ఏళ్ల బాలిక.. కవిత్వాలతో కూడిన పుస్తకం రాయడం అభినందనీయమని ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి అన్నారు. కోకాపేట జయభేరి పీక్లో ఆదివారం సాయంత్రం ‘మ్యూజింగ్ ఆఫ్ ఏ టీనేజ్ గర్ల్’ కవితా పుస్తకాన్ని ఆయనతో పాటు సైంట్ సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ఏఎస్సీఐ చైర్మన్ కె.పద్మనాభయ్య ఆవిష్కరించారు. ఓక్రిడ్జ్ స్కూల్లో చదువుతున్న సంజన సోమవరపు ఈ పుస్కకాన్ని రచించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పుస్తకంలోని కవిత్వం కౌమార భావోద్వేగాలు సమ్మిళితమై ఉన్నాయన్నారు. అనంతరం సంజన మాట్లాడుతూ.. తన తాత, రిటైర్డ్ లెఫ్ట్నెంట్ జనరల్ హరిప్రసాద్ నుంచి కవిత్వం రాయాలన్న ప్రేరణ కలిగిందన్నారు. పుస్తకాన్ని తన ఉపాధ్యాయురాలు రోసలిండ్, తన తాతకు అంకితం చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో సంజన తల్లిదండ్రులు రేఖ, శశి, బంధుమిత్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment