
ICC Champions Trophy 2025- India vs Australia, 1st Semi-Final:
4 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసిన భారత్
48.1వ ఓవర్: మ్యాక్స్వెల్ బౌలింగ్లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్ను ఫినిష్ చేశాడు. భారత్ 4 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులు చేయగా.. భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో విరాట్ కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ (84) ఆడి భారత్ను గెలిపించాడు.
ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అంతుకుముందు స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
84 పరుగుల వద్ద విరాట్ కోహ్లి ఔట్
42.4 ఓవర్: 225 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్లో డ్వార్షుయిస్కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (84) ఔటయ్యాడు.కేఎల్ రాహుల్కు (31) జతగా హార్దిక్ పాండ్యా క్రీజ్లోకి వచ్చాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
34.5వ ఓవర్: నాథన్ ఇల్లిస్ బౌలింగ్లో అక్షర్ పటేల్ (27) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 35 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 178/4గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 90 బంతుల్లో 87 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. విరాట్కు (68) జతగా కేఎల్ రాహుల్ క్రీజ్లోకి వచ్చాడు.
మూడో వికెట్ కోల్పోయిన భారత్
26.2వ ఓవర్: ఆడమ్ జంపా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ (45) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్కు (51) జతగా అక్షర్ పటేల్ క్రీజ్లోకి వచ్చాడు. టీమిండియా స్కోర్ 134/3గా ఉంది.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్
24.5వ ఓవర్: ఆడమ్ జంపా బౌలింగ్లో బౌండరీ బాది విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్ ఈ ఇన్నింగ్స్లో 53 బంతులు ఎదుర్కొని 4 బౌండరీలు సాధించాడు. విరాట్కు జతగా మరో ఎండ్లో శ్రేయస్ (43) ఉన్నాడు. 25 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 131/2గా ఉంది.
రోహిత్ శర్మ అవుట్
7.5: రోహిత్ శర్మ(29 బంతుల్లో 28) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆసీస్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కూపర్ కన్నోలి బౌలింగ్లో రోహిత్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. కోహ్లి ఐదు పరుగులతో ఉండగా.. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 43-2(8)
గిల్ అవుట్
4.6: శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. డ్వార్షుయిస్ బౌలింగ్లో గిల్ బౌల్డ్ అయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. కోహ్లి క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 21 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 30-1
ఆసీస్ ఆలౌట్..
హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఆడం జంపా బౌల్డ్అయ్యాడు. ఏడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పదో వికెట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. టీమిండియాకు 265 పరుగుల లక్ష్యాన్ని విధించింది. భారత బౌలర్లలో పేసర్లు మహ్మద్ షమీ మూడు వికెట్లు , హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆసీస్
నాథన్ ఇల్లిస్(10) రూపంలో ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి అతడు అవుటయ్యాడు. ఆసీస్ స్కోరు: 262-9(49). తన్వీర్సంఘా క్రీజులోకి వచ్చాడు.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. క్యారీ ఔట్
47.1వ ఓవర్: 249 పరుగుల వద్ద ఆసీస్ ఎనిమిదో వికెట్ను కోల్పోయింది. అలెక్స్ క్యారీ (61) స్ట్రయిక్ తన వద్దే ఉంచుకునేందుకు లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో క్యారీని రనౌట్ చేశాడు.
ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్
45.1 ఓవర్: 239 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో బెన్ డ్వార్షుయిస్ (19) పెవిలియన్కు చేరాడు. అలెక్సీ క్యారీకి (54) జతగా ఆడమ్ జంపా క్రీజ్లోకి వచ్చాడు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్యారీ
42.2 ఓవర్: కీలకమైన తరుణంలో అలెక్స్ క్యారీ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. క్యారీ 48 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ 240/6గా ఉంది. క్యారీ 54, బెన్ డ్వార్షుయిష్ 19 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
ఆసీస్కు బిగ్ షాక్
37.3:ఆసీస్ బిగ్ హిట్టర్ గ్లెన్ మాక్స్వెల్ను అనూహ్య రీతిలో అక్షర్ బౌల్డ్ చేశాడు. ఐదు బంతుల్లో ఏడు పరుగులు చేసి మాక్సీ నిష్క్రమించాడు. క్యారీ 39 పరుగులతో ఉండగా.. డ్వార్షుయిస్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 205/6 (37.3)
ఎట్టకేలకు స్మిత్ అవుట్
36.4: భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఇబ్బంది పెట్టిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు అవుటయ్యాడు. షమీ బౌలింగ్లో బౌల్డ్ అయి 73 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 198/5 (36.5). మాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్
26.6: రవీంద్ర జడేజా బౌలింగ్ జోష్ ఇంగ్లిస్ విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఫలితంగా ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 బంతులు ఎదుర్కొన్న ఇంగ్లిస్ 11 పరుగులు చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. స్మిత్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అలెక్స్ క్యారీ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 144-4
మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్
22.3: లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా అతడు వెనుదిరిగాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. జోష్ ఇంగ్లిస్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 111/3 (22.4)
వంద పరుగుల మార్కు దాటేసిన కంగారూలు
20 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు: 105/2
స్మిత్ 36, లబుషేన్ 24 రన్స్తో ఉన్నారు.
పద్నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు: 72/2
లబుషేన్ 4, స్మిత్ 23 పరుగులతో ఉన్నారు.
8.2: ట్రవిస్ హెడ్ అవుట్
ఆసీస్కు భారీ షాక్ తగిలింది. హార్డ్ హిట్టర్, ఓపెనర్ ట్రవిస్ హెడ్ అవుటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో శుబ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. మార్నస్ లబుషేన్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 54/2 (8.2)
కన్నోలీ డకౌట్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. మూడు ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓపెనర్ కూపర్ కన్నోలీ డకౌట్ అయ్యాడు. షమీ బౌలింగ్లో కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చిన కూపర్ డకౌట్గా పెవిలియన్ బాట పట్టాడు. 3 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 4/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో హెడ్, స్మీత్ కొనసాగుతున్నారు.
టాస్ గెలిచిన ఆసీస్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీ ఫైనల్ మ్యాచ్కు నగారా మోగింది. దుబాయ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ పొడిగా ఉంది. ఇక్కడ మేము రెండు సెషన్ల పాటు ప్రాక్టీస్ చేశాం. బ్యాటింగ్ చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం.
బంతి స్పిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా బలమైన జట్టు. గత మ్యాచ్లో ఆడిన జట్టులో రెండు మార్పులు చేశాం. మాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్ కన్నోలి వచ్చాడు. స్పెన్సర్ జాన్సన్స్థానాన్ని తన్వీన్ సంఘా భర్తీ చేశాడు’’ అని తెలిపాడు.

అదే జట్టుతో భారత్
మరోవైపు టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘పిచ్ స్వభావం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. గత మూడు మ్యాచ్లలో మేము రాణించాం. కివీస్తో ఆడిన జట్టుతోనే మరోసారి ముందుకు వెళ్తున్నాం’’ అని పేర్కొన్నాడు.
కాగా గత మ్యాచ్లో పేసర్ హర్షిత్ రాణాపై వేటు వేసి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఆడించగా.. అతడు ఐదు వికెట్లతో మెరిశాడు. ఇక సెమీస్లోనూ స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నడుమ భారత్తో పాటు ఆసీస్ కూడా వారివైపే మొగ్గు చూపింది.
తుదిజట్లు ఇవే
భారత్
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
ఆస్ట్రేలియా
కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.