అనంతపురం: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు ఆయన రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
మద్యం బాటిళ్ల స్వాధీనం
ముదిగుబ్బ: మండలంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా దాచిన మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీఐ యతీంద్ర తెలిపిన మేరకు... గరుగుతండా, దొరిగల్లు రోడ్డు ఏబీపల్లి తండాలో చేపట్టిన తనిఖీల్లో నేనావత్ నవీన్నాయక్, షేక్ జావీద్ వద్ద నుంచి 160 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.24 వేలుగా ఉంటుంది. నిందితులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
875 క్యింటాళ్ల
చింతపండు రాక
హిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్కు సోమవారం 875 క్వింటాళ్ల చింతపండు వచ్చింది. ఈ–నామ్ ద్వారా వేలం పాటలు నిర్వహించారు. కరిపులి రకం క్వింటా కనిష్టం రూ.8వేలు, గరిష్టం రూ.15వేలు, సగటు రూ.10వేలతో అమ్ముడు పోయింది. అలాగే ప్లవర్ రకం కనిష్టం రూ.4వేలు, గరిష్టం రూ.7,600, సగటు రూ.8వేలు ధర పలికింది. ఈ మేరకు మార్కెట్ యార్డు కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు.
అలరించిన సంగీత కచేరి
ప్రశాంతి నిలయం: సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సంగీత కచేరి నిర్వహించారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు మాళవికాసుందర్ బృందం చక్కటి స్వరాలతో ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కళాకారులను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్రాజు ఘనంగా సన్మానించారు.
కానిస్టేబుళ్ల ఘర్షణపై
ఉన్నతాధికారులకు నివేదిక
రొళ్ల: మండలంలోని పిల్లిగుండ్ల చెక్పోస్టు వద్ద ఆదివారం సాయంత్రం కానిస్టేబుళ్లు శివకుమార్, నారాయణస్వామినాయక్ పరస్పరం దాడి చేసుకున్న ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. కానిస్టేబుళ్లను ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం మడకశిర రూరల్ సీఐ రాజ్కుమార్ ఎదుట హాజరు పరిచి విచారణ చేశారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
పోలీసుల అదుపులో
హత్య కేసు నిందితులు
కదిరి అర్బన్: మండలంలోని జౌకల గ్రామంలో ఈ నెల 4న వైఎస్సార్సీపీ కార్యకర్త నాగభూషణపై హత్య కేసులో నిందితులను కదిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హతుడి అక్క చంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జయచంద్రనాయుడు, జయరాంనాయుడు, గోవర్దన్ నాయుడుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. నేడో.. రేపో వీరిని అరెస్ట్ చూపి రిమాండ్కు తరలించనున్నట్లు తెలిసింది.