పెద్ద అంబర్‌పేట్‌లో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి | Four Year Old Child Ends Life In Hayathnagar | Sakshi
Sakshi News home page

పెద్ద అంబర్‌పేట్‌లో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి

Published Thu, Feb 6 2025 9:19 PM | Last Updated on Thu, Feb 6 2025 9:49 PM

Four Year Old Child Ends Life In Hayathnagar

హయత్‌నగర్‌లో విషాదం జరిగింది. స్కూల్‌ వ్యాన్‌ కింద పడి నాలుగేళ్ల ఎల్‌కేజీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పెద్ద అంబర్‌పేట్‌లో విషాదం జరిగింది. హయత్‌నగర్‌ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల విద్యార్థిని స్కూల్‌ బస్సు కింద పడి  ప్రాణాలు కోల్పోయింది. బాలిక రోడ్డు దాటుతున్న విషయాన్ని గమనించకుండా వ్యాన్‌ను డ్రైవర్‌ రివర్స్‌ చేయడంతో వెనక టైర్ల కింద పడి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు.. బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇంజనీరింగ్‌ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. శంకర్‌పల్లి మండల పరిధిలోని ఎన్‌సీడీ రాయల్‌ పెవిలియన్‌ వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్‌ మండల కేంద్రానికి చెందిన శ్రీహర్ష(19)కు దొంతన్‌పల్లిలోని ఇక్ఫాయ్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ సీటు వచ్చింది. దీంతో అతని తల్లి మోకిలతండాలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇక్కడే ఉంటూ కొడుకును చదివిస్తోంది. శ్రీహర్ష నిత్యం బైక్‌పై కాలేజీకి వెళ్లివస్తుంటాడు.

ఇదిలా ఉండగా బుధవారం కళాశాల ముగిసిన తర్వాత ఉప్పల్‌కు చెందిన క్లాస్‌మేట్‌ హర్షనందన్‌(19)ను తీసుకుని ఫ్రెషప్‌ అయ్యేందుకు మోకిలతండాకు వచ్చారు. సుమారు గంటపాటు రూంలో గడిపిన అనంతరం హర్షనందన్‌ను కాలేజీ వద్ద వదిలిపెట్టేందుకు బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ఎన్‌సీడీ రాయల్‌ పెవిలియన్‌ సమీపంలో కొండకల్‌ వైపు అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఏపీ మోడల్‌ పాఠశాల బస్సు వీరిని బలంగా ఢీ కొట్టింది. బైక్‌ నడుపుపుతున్న శ్రీహర్షకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. హర్షనందన్‌ పాక్షిక గాయాలతో బయటపడ్డాడు. అతన్ని శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మోకిల పోలీసులు శ్రీహర్ష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement