ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి.. | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి అమ్మ ఒడికి..

Published Sat, Sep 23 2023 4:54 AM

parents left their daughter in the hospital as they could not pay the medical bill - Sakshi

సైదాబాద్‌: కుమార్తె వైద్యానికైన బిల్లు కట్టలేక.. ఆస్పత్రిలో వదిలే­సి వచ్చిన తల్లిదండ్రుల చెంతకు ఆ చిన్నారి ఎట్టకేలకు చేరింది. తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సెల్‌ అథా­రిటీ జడ్జి చొరవతో కథ సుఖాంతమైంది. ప్రేమ వివాహం చేసుకుని సింగరేణి కాలనీలో నివసిస్తున్న నితిన్, ప్రవల్లిక దంపతులకు ఈనెల7న పాప పుట్టింది.

తీవ్ర అస్వస్థతకు గురైన పాప మెరుగైన వైద్యం కోసం వారు పిసల్‌బండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల చికిత్సకు రూ.లక్షా16వేల బిల్లు అయింది. వారి వద్ద కేవలం రూ.30 వేలు మాత్రమే ఉండటంతో దిక్కు­తోచక పాపను ఆస్పత్రిలో వదిలేసి వచ్చే­శారు. వారి నిస్సహాయస్థితిపై సాక్షి దినపత్రికలో బుధవారం ‘బిల్లు కట్టలేక బిడ్డను ఆసుపత్రిలో వదిలేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది.

దాంతో పలువురు దాతలు వారిని సంప్రదించి తోచిన సహాయం చేశారు. సాక్షి కథనంపై స్పందించిన తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ జడ్జి కళార్చన, గోవర్ధన్‌రెడ్డి గురువారం ఆస్పత్రికి చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి అదే రాత్రి చిన్నారిని డిశ్చార్జి చేయించారు. తమ పరిస్థితిని వెల్లడిస్తూ కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు, తెలంగాణ లీగల్‌ సెల్‌ అథారిటీ అధికారులకు చిన్నారి తల్లిదండ్రులు నితిన్, ప్రవల్లికలు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement