
మూడున్నర నెలలకుపైగా వాదనలు విన్న హైకోర్టు
రాజ్యాంగపరమైన అంశాల నేపథ్యం కావడంతోనే...
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. రాజ్యాంగపరమైన అంశాల నేపథ్యంలో ఏప్రిల్ నుంచి సుదీర్ఘ వాదనలు విన్నది. పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు పలు తీర్పులను ఉదహరిస్తూ వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కేపీ.వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్.. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్లోకి చేరారని ఆయనను కూడా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మరో పిటిషన్ వేశారు. నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయతి్నంచిన స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ ఎలీ్పనేత మహేశ్వర్రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి బుధవారం మరోసారి విచారణ చేపట్టారు.
దానం, కడియం తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పుల ప్రకారం స్పీకర్కు కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు వీల్లేదు. స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పదిరోజులకే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్కు కనీస గడువు కూడా ఇవ్వకుండానే న్యాయ సమీక్ష కోరడం చెల్లదు. తాజా పిటిషన్లను కొట్టేయాలి.. లేనిపక్షంలో డివిజన్ బెంచ్కు నివేదించాలి.
గత శాసనసభ స్పీకర్ ఎదుట పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లో స్పీకర్కు నిర్దిష్ట గడువు నిర్ణయించేందుకు ఇద్దరు న్యాయమూర్తుల హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది’అని పేర్కొన్నారు. లిఖితపూర్వక వాదనలను శుక్రవారం సమర్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి.. తీర్పు రిజర్వు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment