స్థానిక పోరుకు..
జూన్ 4 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు
క్షేత్రస్థాయిలోకి పార్టీలు..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 3తో ముగియనుంది. 2019 జూలై 4న మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాయి. తిరిగి జూలై 4న కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కావాల్సి ఉంది. దీంతో ఈ ఏడాదంతా సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో వరుసగా ఎన్నికల పండగ కొనసాగనుంది. ఈ క్రమంలో ఆయా ఎన్నికల్లో తమ ప్రాబల్యాన్ని చూపేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలతో మమేకం అయ్యేలా తమ కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలపై నిరసన వ్యక్తం చేయాలని, వరికి రూ.500 బోనస్ విషయంలో తహసీల్దార్లు, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలని పార్టీ శ్రేణులను నిర్దేశించింది. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడితే వెంటనే ప్రతి స్పందించడం, ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్యనేతలను రంగంలోకి దింపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటి వరకు గణనీయ సంఖ్యలో ఉన్న తమ పార్టీ స్థానాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.
● గత అసెంబ్లీ ఎన్నికల జోరు మున్ముందు వచ్చే వాటిలోనూ కొనసాగించేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులదే భవిష్యత్ అంటూ స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తుపై ఆశావహుల్లో ఉత్తేజం నింపుతోంది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తోంది. ఎన్నికలు ఏవైనా తమ ప్రాబల్యాన్ని చూపేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పనితీరు, ఇంటింటికీ చేరుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేపడుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు నేతలు, పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది.
● ఇప్పటికే పూర్తయిన
సర్పంచ్ల పదవీకాలం
● జూలై 3తో ముగియనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం
● లోక్సభ ఎన్నికల కోడ్ తర్వాత స్థానిక పోరు
ఉంటుందన్న అంచనాలు
● ఏర్పాట్లలో యంత్రాంగం..
ప్రయత్నాల్లో ఆశావహుల నిమగ్నం
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్రంలో ఇప్పటికే లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలు జూన్ 4న వెలువడాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలవుతుందన్న అంచనాలు ఊపందుకున్నాయి. ఏడాది ముగిసేలోగానే గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఆశావహులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా తమ ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేడి ఆరకముందే పార్లమెంట్ ఎన్నికలు రావడం.. ఈ ఎన్నికల హీట్ చల్లారక ముందే స్థానిక పోరుతో ఈ ఏడాది మొత్తం రాజకీయ రణరంగం కొనసాగనున్నట్టు జోరుగా చర్చ సాగుతోంది.
పల్లెల్లో ప్రత్యేక పాలన..
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సైతం పూర్తికావడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపైనే అందరి దృష్టిపడుతోంది. ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం పూర్తికావడంతో గత ఫిబ్రవరి 2 నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. 2024 జనవరిలో తిరిగి ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో వెంటనే ఎన్నికల నిర్వహణ చేపట్టకుండా ప్రత్యేకాధికారులను నియమించారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం జూన్ నెలలోనే రిజర్వేషన్ల అంశాన్ని కొలిక్కి తెచ్చి, జూలై, ఆగస్టు నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు కావాల్సిన యంత్ర సామగ్రి ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
జిల్లా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు
మహబూబ్నగర్ 14 184 441
నాగర్కర్నూల్ 20 212 461
వనపర్తి 14 128 255
జోగుళాంబ గద్వాల 12 141 255
నారాయణపేట 11 142 280
రిజర్వేషన్లపైనే సర్వత్రా చర్చ..
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కీలకంగా మారనున్నాయి. గతంలో ఐదేళ్లకోసారి రిజర్వేషన్లను ప్రకటించి పంచాయతీ ఎన్నికలను నిర్వహించేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి రిజర్వేషన్లను పదేళ్లకు పొడిగించింది. కాగా.. వచ్చే ఎన్నికల్లోనూ గతంలోని రిజర్వేషనే అమలయ్యే అవకాశ ం ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడం, స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దా నిపై ఆసక్తి నెలకొంది. లోక్సభ ఎన్నికల కోడ్ ము గిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మొదలవుతుందన్న అంచనాలతో ఇప్పటికే ఆశా వహులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.