దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి రూరల్: ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో 2024–25 విద్యా సంవత్సరానికిగాను పారా మెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సునందిని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. డిప్లొమా ఇన్ అనస్తేషియా టెక్నీషియన్లో 30 సీట్లు, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్లో 30 సీట్లు భర్తీ చేయనున్నట్లు.. ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. బైపీసీ విద్యార్థులు అందుబాటులో లేకుంటే ఇతర గ్రూపుల వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. దరఖాస్తుకు ఈ నెల 30 వరకు అవకాశం ఉందని.. మరిన్ని వివరాలకు కళాశాల వెబ్సైట్ http://
www.gmcwanaparthy.org/ను
సందర్శించాలని సూచించారు.
గవర్నర్ను కలిసిన వీసీ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ వైస్చాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మను హైదరాబాద్లోని రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు నూతన వీసీలను నియమించిన నేపథ్యంలో వీసీలందరూ బుధవారం గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్కు వీసీ శ్రీనివాస్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ యూనివర్సిటీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని, వీసీలు సమన్వయంతో పనిచేసి విద్యాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
పేదలకు ఉచిత
న్యాయసేవలు
వనపర్తిటౌన్: వార్షిక ఆదాయం రూ.3 లక్షల్లోపు ఉన్న పేదలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు న్యాయ సేవాధికార సంస్ధ ఉచితంగా న్యాయసేవలు అందిస్తోందని జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి రజని అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని మండల మహిళా సమాఖ్యలో జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసిస్తే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని తెలిపారు. వరకట్నం కోసం వేధిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అసిస్టెంట్ లీగల్ హెడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.శ్రీదేవి వయోవృద్ధుల హక్కులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సఖి కేంద్రం లీగల్ అడ్వైజర్ డేగల కృష్ణయ్య, చెన్నమ్మ, శారదమ్మ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట
విద్యార్థుల ఆందోళన
వనపర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలు చెల్లించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రమేష్, జిల్లా అధ్యక్షుడు నరేష్ విమర్శించారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కళాశాల విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మొదట కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట వారితో పాటు ఏఐటీయూసీ జిల్లా నేతలు శ్రీరామ్, గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఫీజు రియింబర్స్మెంట్, ఉపకార వేతన బకాయిలు రూ.7,600 కోట్లు ఉన్నాయన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలపై ఆధారపడి ఉన్నత చదువులు చదువుతున్నారని.. ఐదేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నాయని వివరించారు. రూ.1,560 కోట్లు విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు పైసా కూడా ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం పద్ధతినే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తుందని తెలిపారు. ఇప్పటికై నా స్పందించి బకాయిలు విడుదల చేయకుంటే విద్యార్థులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు అరవింద్, భానుప్రకాష్, చరణ్, గణేష్, జస్వంత్, బన్ని, శివయాదవ్, శివ, భాను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment