అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
వనపర్తి రూరల్: సమాజం, దేశం, రేపటి తరాల మంచి భవిష్యత్ కోసం పలువురు పోలీసులు ప్రాణత్యాగం చేశారని.. వారిని ఎన్నటికీ మర్చిపోలేమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా బుధవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మెగా రక్తదాన శిభిరాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు, యువకులు, వివిధ సంఘాల నాయకులు 123 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పోలీసు అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలని, వారి త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవనం గడుపుతున్నామని వివరించారు. పేద ప్రజలు, బాధితులకు సత్వర న్యాయం అందించడం, ధర్మం పక్షాన నిలిచి మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేసినప్పుడే వారి త్యాగానికి మనమందించే ఘనమైన నివాళి అన్నారు. అమ్మ జన్మనిస్తే రక్తదానం పునర్జన్మను ఇస్తుందని.. ఒక్క రక్తదానంతోనే ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి ప్రాణదానం చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. తలసేమియా, క్యాన్సర్, హిమోఫీలియా, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఇతరత్రా జబ్బులతో బాధపడుతున్న వారికి ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందన్నారు. రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడటం ద్వారా మనకు కూడా మంచి చేకూరుతుందని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి ప్రతి 5 నెలలకు ఓసారి రక్తదానం చేయాలని.. దీంతో శరీరం మరింత ఉత్సాహవంతంగా మారుతుందని చెప్పారు. రక్తదానానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాందాస్ తేజావత్, డీఎస్పీ వెంకటేశ్వరావు, సీఐ కృష్ణ, శివకుమార్, నరేష్, అప్పలనాయుడు, శ్రీనివాస్, ఎస్ఐలు, రెడ్క్రాస్ సిబ్బంది, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఎస్పీ రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment