ఏఐఎస్ఎఫ్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
ఫ విద్యార్థి నాయకులు, పోలీసుల మధ్య తోపులాట
ఫ పలువురికి గాయాలు
భువనగిరిటౌన్ : ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ బుధవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ గేట్ ఎదుట బైఠాయించారు. కొందరు కలెక్టర్ కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థి నాయకులకు గాయలయ్యాయి. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వకపోతే విద్యార్థులు ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే బకాయిలు విడుదల చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో ప్రకటించారని, పది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం తగదన్నారు. విద్యాశాఖను తనవద్దే పెట్టుకుని నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు విడుదల చేకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ఈనెల 27లోపు చెల్లించకపోతే ఇందిరాపార్కు వద్ద ధర్నా చేసి హైదరాబాద్ను దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సూరారం జానీ, సహాయ కార్యదర్శి మారపాక లోకేష్, జిల్లా సమితి సభ్యులు రాంపక చందు, సాయిచరణ్, నాయకులు ఉదయ్ కిరణ్ సుమన్ ,విల్సన్, రజిత, ప్రవళిక ,సోనీ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment