Telangana Lok Sabha Elections 2019
-
తాత్కాలిక స్పీడ్ బ్రేకరే:కేటీఆర్
-
ఎదురుదెబ్బ కాదు.. స్పీడ్ బ్రేకరే
సాక్షి, హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ కాదని, వాటిని తాత్కాలిక స్పీడ్బ్రేకర్గా భావిస్తున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అభిప్రాయపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 40 శాతం ఓట్లు, మెజారిటీ సీట్లు వచ్చాయని తెలిపారు. దేశవ్యాప్తంగా మోదీ మళ్లీ ప్రధాని కావాలనే భావన ఏర్పడిందని, బీజేపీకి కార్యకర్తలు లేనిచోట్ల కూడా ఆ పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయన్నారు. లోక్సభ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని, గెలుపోటములకు ఒక్కోచోట ఒక్కో కారణం కనిపిస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 4.5 లక్షల ఓట్లు తగ్గాయని తెలిపారు. అయితే వరంగల్ లోక్సభ స్థానంలో టీఆర్ఎస్కు వచ్చిన మెజారిటీ కాంగ్రెస్, బీజేపీలు గెలిచిన ఏడు స్థానాల్లో సాధించిన మెజారిటీ కంటే ఎక్కువగా వచ్చిందని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపారని, సాంకేతికంగా ఇప్పటివరకు ఎవరూ చేరలేదని చెప్పారు. కేటీఆర్ మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివిధ అంశాలపై కేటీఆర్ స్పందన ఆయన మాటల్లోనే... 16 సీట్లూ గెలుస్తామని ఆశించాం... 2014 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 34 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటి కంటే 2019లో 6శాతం ఓట్లు పెరిగాయి. 16 ఎంపీ సీట్లలో గెలుపు కోసం మేము గట్టిగా ప్రయత్నించాం. టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు బాగా పని చేశారు. లోక్సభ ఎన్నికల్లో మేం కష్టపడినంతగా ఏ పార్టీ పని చేయలేదు. అయితే మేం ఆశించిన ఫలితాలు రాలేదు. మల్కాజిగిరి, భువనగిరిలో వెంట్రుకవాసి తేడాతో కాంగ్రెస్ గెలిచింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ హవా పని చేసింది. అందుకే బీజేపీకి ఇక్కడ సీట్లు వచ్చాయి. ఆదిలాబాద్లో గెలుస్తుందని బీజేపీ నేతలు, అక్కడి అభ్యర్థే ఊహించలేదు. లోక్సభ ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండ్ కనిపించింది. ఈ ఫలితాలు టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ కాదు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకోవడంతో బీజేపీకి ఓటింగ్ పెరిగింది. బీజేపీకి కార్యకర్తలు లేనిచోట్ల సైతం ఆ పార్టీకి ఓట్లు పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీకి 19 వేల ఓట్లు లభిస్తే ఇప్పుడు ఏకంగా 59 వేల ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని గెలుస్తామని బీజేపీ వాళ్లే అనుకోలేదు. కచ్చింగా 16 స్థానాల్లో గెలుస్తామని మేము భావించాం. ఇలాంటి ఫలితాలను ఊహించలేదు. అభ్యర్థుల ఎంపిక సబబే... నిజామాబాద్లో కవిత ఓడిపోయారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని దేవేగౌడ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. గతంలో ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ పరాజయం పాలయ్యారు. రెండోసారి సీఎం అయిన కేసీఆర్ సైతం మొదటి ఎన్నికల్లో ఓడిపోయారు. టీఆర్ఎస్ డక్కామొక్కీలు తిన్న పార్టీ. ఎన్నో క్లిష్ట పరిస్థితులను అధిగమించింది. కొందరు ముఖ్యనేతలు ఓడిపోయినంత మాత్రాన కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందనేది నిజం కాదు. టీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సరిగా లేదనే వ్యాఖ్యలు సరికాదు. ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసిన వినోద్ కుమార్, బూర నర్సయ్యగౌడ్, కవిత ఓడిపోయారు. కొత్తగా పోటీ చేసిన వారు, పార్టీ మారిన వారు గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలుపోటములకు రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక్క కారణం అని చెప్పడానికి లేదు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి గతంలో గెలిచినప్పుడు కిరీటాలు పెట్టలేదు... ఈ ఎన్నికల్లో 16 సీట్లు గెలిచినా కేంద్రంలో ఏమీ చేయలేని పరిస్థితే. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎవరి మద్దతు అవసరంలేదు. లోక్సభ ఎన్నికల ఫలితాలతో కార్యకర్తలెవరూ కుంగిపోవాల్సిన పనిలేదు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్కు కేవలం 4.5 లక్షల ఓట్లు తగ్గాయి. రాష్ట్రంలో 40 శాతం ఓటర్లు టీఆర్ఎస్కే మద్దతు తెలిపారు. మెజారిటీ లోక్సభ స్థానాల్లో మా పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను విఫలమయ్యాయని అనుకోవడంలేదు. గతంలో విజయాలు సాధించినప్పుడు ఎవరూ కిరీటాలు పెట్టలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే లోక్సభ ఎన్నికల ఫలితాలపై లోతైన సమీక్ష చేస్తాం. వరుస ఎన్నికలు, పాలనలో జాప్యం వల్ల మా పార్టీపై ఏమైనా ప్రభావం పడిందేమో పరిశీలించుకుంటాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాం. సింహభాగం సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుంది. కేంద్రంతో రాజ్యాంగపరమైన సత్సంబంధాలు... రాష్ట్రాలు ఎంత బలపడితే దేశానికి అంత మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించే మానసిక పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, టీఆర్ఎస్, డీఎంకే వంటి పార్టీలే ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీని ఎదుర్కొంటాయి. దేశంలో ఫెడరల్ స్ఫూర్తి పెరగడం మంచిదే. కేంద్ర ప్రభుత్వంతో రాజ్యాంగపరంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ సత్సంబంధాలనే కొనసాగిస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో అలాగే ఉంటాం. అయితే రాష్ట్ర సమస్యల పరిష్కారం విషయంలో రాజీపడం. మోదీతో మా సంబంధాలు రాజ్యాంగ పరమైనవిగానే ఉంటాయి. సీఎం కేసీఆర్ కరీంనగర్ ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ ఓటమికి కారణం కాదు. బీజేపీ దేశమంతా గెలిచింది. మరి ఇతర ప్రాంతాల్లో కేసీఆర్లా ఎవరూ మాట్లాడలేదు కదా? హరీశ్రావును పక్కన పెట్టలేదు... మాజీ మంత్రి హరీశ్రావును లోక్సభ ఎన్నికల ప్రచారంలో పక్కనబెట్టామన్న వాదన నిజం కాదు. లోక్సభ సెగ్మెంట్ల బాధ్యతలను సీఎం కేసీఆర్ మంత్రులకు అప్పగించారు. మెదక్ లోక్సభ సెగ్మెంట్ను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తూ హరీశ్రావుకు అప్పగించారు. మెదక్లో టీఆర్ఎస్ మంచి మెజారిటీతో గెలిచినా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్కు ఓట్లు బాగా తగ్గాయి. సిరిసిల్లలోనూ ఇదే జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గంలో బీజేపీకి కార్యకర్తలు లేరు. కానీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే అక్కడ బీజేపీకి భారీగా ఓట్లు పెరిగాయి. సీఎం కేసీఆర్ అన్ని లోక్సభ సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అధినేతగా ఆయన ప్రచారం చేసిన తర్వాత నేనైనా, ఇంకెవరైనా ప్రచారం చేయడం ప్రధానం కాదు. విజయానికి కారకులు ఎక్కువ మంది తామే అంటారు. ఓటమి అనాథ లాంటిది. ఇప్పుడు ఎవరైనా, ఏదైనా మాట్లాడతారు. కవిత ఓటమికి రైతులు కారణం కాదు... నిజామాబాద్లో కవిత ఓటమికి రైతులు కారణం కాదు. అక్కడ నామినేషన్లు వేసింది రైతులు కాదు, రాజకీయ కార్యకర్తలే. జగిత్యాలకు చెందిన ఓ కాంగ్రెస్ నేత ఇంట్లోనే 93 మంది నామినేషన్లు తయారయ్యాయి. నిజామాబాద్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి కాబట్టే కవిత ఓడిపోయింది. టీఆర్ఎస్, నేను, కవిత అనేక డక్కామొక్కీలు తిన్నాం. ఒక్క ఓటమితో మేము కుంగిపోం. కవిత పోరాట యోధుడి కూతురు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడిపోయారు. అంతమాత్రాన కాంగ్రెస్ కార్యకర్తలు దుప్పట్లు కప్పుకొని ఇంట్లో పడుకుంటారా? అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి వస్తే టీఆర్ఎస్కు నష్టం కలిగేది అనే వాదనతో ఏకీభవించను. ఒడిశాలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేడీ గెలిచింది. లోక్సభ ఫలితాల ప్రకారం చూసినా రాష్ట్రంలో టీఆర్ఎస్కు 71 స్థానాల్లో మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సాంకేతికంగా చేరలేదు... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఇప్పటివరకు సాంకేతికంగా టీఆర్ఎస్లో చేరలేదు. మా పార్టీ కండువా కప్పుకోలేదు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించడం వల్ల లోక్సభ ఎన్నికల్లో మాకు నష్టం జరిగిందనే వాదన సరికాదు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. వారికి చెందిన ఎనిమిది సెగ్మెంట్లలో టీఆర్ఎస్కు ఆధిక్యత వచ్చింది. ‘హాజీపూర్’పై రాజకీయాలా? హాజీపూర్ ఘటన నిజంగా దారుణం. అక్కడ జరిగిన దారుణంతో అందరం చలించిపోయాం. అందరం బాధపడ్డాం. ఇలాంటి విషయాల్లోనూ కొందరు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. కొందరు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు. అలాంటి రాజకీయం మేము చేయం. బాధితులకు న్యాయం చేస్తాం. బాధితులను ఆదుకునే బాధ్యత మాది. ఫాస్ట్ట్రాక్ కోర్టుతో విచారణ వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. ఇంటర్మీడియెట్ ఫలితాలపై వివాదాన్ని కొందరు గోరంతలు చేశారు. కొందరు విద్యార్థుల మరణం బాధాకరం. గ్లోబరీనా సంస్థకు, నాకు సంబంధం ఉందని పనికిమాలిన వాళ్లు విమర్శలు చేశారు. ఐటీ మంత్రిగా పని చేసిన నాకు విద్యాశాఖలోని అంశాలతో ఏం సంబంధం ఉంటుంది? జగన్ సొంతంగా గెలిచారు... ఆంధ్రప్రదేశ్లో వై.ఎస్. జగన్మోహన్రెడ్డి గెలిచారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉంటాలని అందరూ కోరుకుంటున్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండాలనేది టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం. అందుకే మహారాష్ట్ర, కర్ణాటకతో బాగానే ఉంటున్నాం. ఆంధ్రప్రదేశ్తోనూ ఇదే రకమైన సంబంధాలు కోరుకుంటున్నాం. ప్రమాణ స్వీకారానికి రావాలంటూ జగన్మోహన్రెడ్డి వచ్చి సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు. అంతేతప్ప ఈ భేటీలో ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు. టీఆర్ఎస్ సహకారంతో జగన్ గెలిచారనేది కరెక్టు కాదు. అక్కడ ప్రజలు తీర్పు చూసిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. జగన్మోహన్రెడ్డి సొంతంగా గెలిచారు. 3,600 కిలోమీటర్లకుపైగా ఆయన పాదయాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తాం. -
‘సీఎం కుడి భుజాన్ని ఓడగొట్టాం’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిస్తే.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశమంతా కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోయిందని వారి పార్టీ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుని పునీతులు అవుతున్నారని అన్నారు. ప్రజలు నమ్మి ప్రతిపక్షస్థానం ఇస్తే కూడా.. వ్యాపారాల కోసం అధికార పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ మీద పోరాటం చేసే స్థాయిలో కాంగ్రెస్ లేదని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరిగిందనీ, ఉత్తమ్ జైలుకు వెళ్తాడని టీఆర్ఎస్ నాయకులు అన్నారు కానీ ప్రస్తుతం వారు లోపాయికారి ఒప్పందంపై ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ నుంచి విజయ దుందుభి మోగించామని, ఉద్దండుల మీద భారీ మెజార్టీతో గెలిచామన్నారు. బీజేపీ ఎంపీలు జెయింట్ కిల్లర్స్.. సీఎం కూతురును, కుడి భుజాన్ని ఓడగొట్టామని గుర్తు చేశారు. కాంగ్రెస్ చుక్కాని లేని నావలా తయారైందన్నారు. జాతీయ స్థాయిలోని వారి నాయకుడే అస్త్ర సన్యాసం చేశారని ప్రస్తుతం దిక్కూ దివాణం లేకుండా ఉందని అన్నారు. బీజేపీ విజయాన్ని చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నంలో కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఉన్నాయని విమర్శించారు. కేటీఆర్ ఇప్పుడు మోదీ హవా అంటున్నాడు.. ఎన్నికల ఫలితాలకు ముందు హవా లేదన్నావుగా అని నిలదీశారు. పోస్టల్ బ్యాలెట్లో 38 శాతం ఓట్లతో బీజేపీదే అగ్రభాగమని తెలిపారు. 17 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని అన్నారు. యూపీలో స్వయంగా రాహుల్ ఓడిపోయాడని ఆరు రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ సీటును మాత్రమే గెలిచిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి గెలిచిన 19మంది ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. ఉత్తమ్, కేసీఆర్తో మ్యాచ్ఫిక్సింగ్తో గెలిచారని కాంగ్రెస్ నాయకులే అంటున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ పోకడతో టీఆర్ఎస్ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ బీజేపీలో చేరారని అన్నారు. అమిత్ షా టార్గెట్ తెలంగాణ అని.. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభమైన ఏ ఉద్యమం ఆగదని, ఇప్పుడు బీజేపీ కూడా అంతేనని అన్నారు. ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను రోడ్ మీద వేశారని, ఇంటర్ తప్పిదాల విషయంలో ఇంటర్ కార్యదర్శి అశోక్ను, విద్యాశాఖా మంత్రిని తప్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. -
మల్కాజ్గిరిలో రేవంత్ది గెలుపే కాదు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ లోక్సభ ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. శాసనసభ్యుల కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్కుమార్ నామినేషన్ వేయడానికి ఎల్పీ ఆఫీసుకు వచ్చిన సందర్భంగా కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. 'లోక్ సభ ఎన్నికల్లో మేము ఆశించిన ఫలితాలు రాలేదు. లోక్సభ ఎన్నికల్లో మాకు సీట్లు పోయినా ఓటు శాతం పెరిగింది. గతం కంటే 6 శాతం ఓట్లు టీఆర్ఎస్కు పెరిగాయి. మల్కాజ్గిరిలో కాంగ్రెస్పార్టీ వెంట్రుక వాసిలో గెలుపొందింది. రేవంత్ రెడ్డిది ఒక గెలుపు కానే కాదు. లోక్సభ ఎన్నికల ఫలితాలు మాకు తాత్కాలిక స్పీడ్ బ్రేకర్లాంటివే. దేశ వ్యాప్తంగా మోదీ హవా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ మంచి సీట్లను గెలుచుకుంది. ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీ గెలుస్తుందని ఊహించలేదు. విచిత్రమైన ట్రెండ్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో కనిపించింది. అలాగే వరుస ఎన్నికలు, పాలనలో జాప్యం ప్రభావం ఉందేమో విశ్లేషిస్తాము. సిరిసిల్లలో బీజేపీకి కార్యకర్తలు కూడా లేరు. అసెంబ్లీ ఎన్నికలకంటే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ ఫలితాలతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందొద్దు. వరంగల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన మెజారిటీ మిగతా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థులకంటే ఎక్కువ వచ్చింది. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు' అని కేటీఆర్ అన్నారు. -
పదవి లేకున్నా ప్రజల కోసం పనిచేస్తా: కవిత
చంద్రశేఖర్కాలనీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు, ఓటములు సహజమని టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓటమి చెందడంతో తట్టుకోలేక నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో ఈనెల 24న పార్టీ కార్యకర్త కిషోర్ గుండెపోటుతో మరణించాడు. సోమవారం మృతుని కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. కిషోర్ కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. అనంతరం కవిత విలేకరులతో మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చెందినందుకు బాధపడటం లేదన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పాటుపడుతుందని అన్నారు. పదవి ఉన్నా, లేకున్నా తాను నిజామాబాద్ను వదిలిపెట్టిపోనని, ప్రజల సమస్యల పరిష్కారంలో, జిల్లా అభివృద్ధిలో తనవంతు కృషి చేస్తానని స్పష్టంచేశారు. పార్టీ కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘హుం దాగా ఉందాం, బంగారు తెలంగాణ కోసం పనిచేద్దాం’అని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మె ల్యే బిగాల గణేశ్గుప్తా, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్కుమార్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ నగర మాజీ మేయర్ డి.సంజయ్, డి.రాజేంద్రప్రసాద్ తదితరులు ఆమె వెంట ఉన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన కవిత -
అందుకే భువనగిరిలో ఓడిపోయాం : హరీశ్ రావు
సాక్షి, సంగారెడ్డి : ప్రజా సేవలో ప్రజాప్రతినిధులకు విశ్రామం ఉండదని, నాయకుడు నిత్య శ్రామికుడై పనిచేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం సంగారెడ్డిలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ఎన్నికలు ముగియడంతో కార్యకర్తల బాధ్యత తీరి, ప్రజాప్రతినిధుల బాధ్యత ప్రారంభమైందన్నారు. ప్రజా ప్రతినిధులకు ఆదివారం, రెండో శనివారం సెలవులంటూ ఏమి ఉండవని, నిత్య సేవకుడై ప్రతి రోజూ పనిచేయాలన్నారు. ఎదిగే కొద్ది ఒదుగుతూ.. ప్రజలకు సేవ చేద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ఇక ప్రతిరోజు పండగేనన్నారు. భువనగిరిలో రోడ్ రోలర్ గుర్తు వల్ల టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చే దిశగా పని చేద్దామని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు లేనిదే నాయకులు లేరు : ప్రభాకర్ రెడ్డి పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్ష వల్లే తాను మరోసారి పార్లమెంట్కు వెళున్నానని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు లేనిదే నాయకులు లేరన్నారు. హరీశ్ రావు నిర్దేశంలో పకడ్బందీగా ప్రచారం చేశామని, ప్రతి కార్యకర్త టీమ్ లీడర్లా పనిచేశారని ప్రశంసించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్దికి కృషి చేస్తానని పేర్కొన్నారు. -
కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన కవిత
-
ఏవీ ఆనాటి మెరుపులు !
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి కొన్నాళ్లుగా ప్రతీ ఎన్నికల్లోనూ భంగపాటు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీచినా.. నరేంద్ర మోదీ హవా స్పష్టంగా కనిపించిన తాజా ఎన్నికల్లో సైతం వరంగల్ లోక్సభ పరిధిలో బీజేపీ అభ్యర్థికి గతంతో పోలిస్తే ఓట్లు ఇంకా తగ్గిపోవడం గమనార్హం. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 2,05,803 ఓట్లు పోల్ కాగా.. ప్రస్తుత ఎన్నికల్లో 83,777 ఓట్లు మాత్రమే రావడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. గతంలో దేశం మొత్తం మీ ద రెండు స్థానాల్లోనే బీజేపీ గెలుపొందగా.. అందులో ఒకరు హన్మకొండ నుంచి గెలవడం చరిత్రగా చెబుతారు. కానీ అదంతా గతంగానే మిగిలిపోగా.. ఇప్పుడు కనీసం డిపాజిట్లు దక్కించుకోలేని స్థితికి ‘కమలం’ చేరుకోవడాన్ని ఆ పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం ఉండేది. అయితే, 1999 తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు పరాజయాన్నే మూటగట్టుకుంటున్నారు. పరకాల, రద్దయిన శాయంపేట, వర్ధన్నపేట, హన్మకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో బీజేపీకి చెందిన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించారు. పాత హన్మకొండ లోక్సభ స్థానం నుంచి బీజేపీకి ప్రాతినిథ్యం ఉంది. అలాగే, రద్దయిన శాయంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున 1978, 1983లో చందుపట్ల జంగారెడ్డి విజయం సాధించారు. 1985, 1989లో పరకాల నుంచి ఒంటేరు జయపాల్, వర్ధన్నపేట నుంచి 1985లో వన్నాల శ్రీరాములు, 1989లో డాక్టర్ టి.రాజేశ్వర్రావు గెలిచారు. ఇక 1999లో రద్దయిన హన్మకొండ నియోజకవర్గం నుంచి మార్తినేని ధర్మారావు విజయం సాధించారు. 1984లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో దేశంలో రెండు లోక్సభ నియోజకవర్గాల నుంచి మాత్రమే బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా.. ఇందులో ఒకరు రద్దయిన హన్మకొండ లోక్సభ నుంచి చందుపట్ల జంగారెడ్డి కావడం విశేషం. ఆ ఎన్నికల్లో రాజకీయ ఉద్దండుడు మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు(ప్రధాని కాక ముందు)ను ఓడించారు. ఇలా గతంలో బీజేపీ గెలిచిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు వరంగల్ లోక్సభ నియోజకవర్గంలోనే ఉన్నా గత ప్రాభవాన్ని సాధించలేక మరింత చతికిలపడడం గమనార్హం. ఇప్పుడు అంతంతే... 1999 అనంతరం జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ పూర్వ వైభవం చాటుతామని బీజేపీ పార్టీ నాయకులు గొప్పలు చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి, రెండో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ తన సత్తా చాటలేకపోతోంది. తాజా లోక్సభ ఎన్నికల్లో దేశంలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. తెలంగాణలోనూ నాలుగు స్థానాల్లో విజయం సాధించినా మోదీ చరిష్మా, బీజేపీ పవనాలు ఇక్కడ పనిచేయలేదు. కాగా, 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున అభ్యర్థులు పోటీ చేసినా ఒక్క స్థానంలోనైనా కమలం వికసించలేదు. ఈసారి గతంలో మాదిరి కాకుండా పార్టీలో సీనియర్ అయిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తిని వరంగల్ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిపారు. అయినా విజయానికి సాధ్యం కాకపోగా.. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. 2014లో టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన రామగల్ల పరమేశ్వర్ను పార్టీ అభ్యర్థిగా నిలిపితే 2,05,803 ఓట్లు వచ్చాయి. 2015 ఉప ఎన్నికల్లో డాక్టర్ పగిడిపాటి దేవయ్యను నిలపగా 1,29,868 ఓట్లు సాధించారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో పార్టీకీ చెందిన అభ్యర్థినే బరిలోకి దింపినా గత రెండు ఎన్నికల్లో పోలిస్తే ఓట్ల సంఖ్య మరింత పడిపోయి కేవలం 83,777 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలా ప్రతీ ఎన్నికకు ఓట్లు తగ్గుతుండడం చర్చనీయాంశంగా మారింది. గడ్డు పరిస్థితులు.. వరంగల్ జిల్లాలో బీజేపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పడంలేదు. అభ్యర్థుల ఎంపికే సమస్యగా మారుతోందని తెలుస్తోంది. గెలిచే వారికి, పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి, ప్రజల్లో పట్టు ఉన్న వారికి కాకుండా.. అధిష్టానం వద్ద పట్టు ఉన్న వారికి టికెట్లు ఇస్తుండడంతో ఓటమి తప్పడం లేదని ఆ పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఇక టికెట్లు పొందిన వారు ఆ పార్టీలోని అసమ్మతి వాదులను కలుపుకుపోకపోవడం కూడా మరో సమస్య మారినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టపర్చకుండా ఎన్నికలకు వెళ్లడం వంటి వైఫల్యాలతో ఆ పార్టీ పూర్వ వైభవం సాధించలేక పోతోందని భావిస్తున్నారు. -
అసంతృప్తి!
సాక్షి, వికారాబాద్: ఎంపీ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ నాయకులకు ముచ్చెమటలు పట్టించాయి. ఫలితాలు తాము ఊహించిన విధంగా లేకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డితోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇటీవల ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న సబితా ఇంద్రారెడ్డి తమవైపే ఉండటంతో భారీ మెజార్టీ వస్తుందని భావించిన అధికార పార్టీ నాయకులకు చుక్కలు కనిపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీపై విముఖత చూపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పని చేయకపోవడం, ప్రజల్లో వ్యతిరేకత కారణంగానే ఆ పార్టీ అభ్యర్థి ఓట్లకు గండిపడినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి గతంలో కన్నా ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ ఓట్లను చీల్చిందనే అభిప్రాయమూ వ్యక్తమైంది. బీజేపీ ఓట్లు చీల్చినప్పటికీ టీఆర్ఎస్ 15వేల లోపు మెజార్టీ మాత్రమే రావడంతో సొంతపార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మెజార్టీ తగ్గడంపై ఎంపీ రంజిత్రెడ్డి సైతం తన అనుచరుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు రావడంపై ఆయన నొచ్చుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి సొంత నియోజకవర్గమైన చేవెళ్ల కంటే ఎక్కువగా వికారాబాద్ నియోజవకర్గంలో అధిక ఓట్లు వచ్చాయి. చేవెళ్లలో కాంగ్రెస్కు 15,831 ఓట్ల మెజార్టీ రాగా వికారాబాద్లో 20,626 ఓట్ల మెజార్టీ లభించింది. అలాగే పరిగి అసెంబ్లీ పరిధిలో 6,574 ఓట్ల మెజార్టీ విశ్వేశ్వర్రెడ్డికి వచ్చింది. మిగితా నియోజకవర్గాలైన రాజేంద్రనగర్, తాండూరు, శేరిలింగంపల్లి, మహేశ్వరంలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డికి కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన గెలుపు సాధ్యమైంది. వికారాబాద్, పరిగిలో కాంగ్రెస్కు మెజార్టీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు తమకు అండగా నిలుస్తారని టీఆర్ఎస్ భావించింది. అయితే అనూహ్యంగా వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్కు ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. ఒక్క తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్కు స్వల్ప మెజార్టీ వచ్చింది. మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ఉన్న తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ఆశించిన స్థాయిలో మెజార్టీ దక్కలేదు. కేవలం 1199 ఓట్ల మెజార్టీ మాత్రమే టీఆర్ఎస్కు వచ్చింది. ఇక వికారాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ఓటర్లు షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ వికారాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి 20,626 ఓట్ల మెజార్టీ వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్రెడ్డికి 49,318 ఓట్లు రాగా కాంగ్రెస్కు 69,977 ఓట్లు వచ్చాయి. విశ్వేశ్వర్రెడ్డి సొంత నియోజకవర్గమైన చేవెళ్ల కంటే వికారాబాద్ ఓటర్లు కొండాకు ఎక్కువ మెజార్టీ కట్టబెట్టారు. ఎమ్మెల్యే సొంత మండలమైన ధారూరులో టీఆర్ఎస్కు 8,397 ఓట్లు రాగా కాంగ్రెస్కు 10,760 ఓట్లు వచ్చాయి. ఎమ ఎమ్మెల్యే ఆనంద్ సొంత గ్రామమైన కేరెళ్లిలో సైతం కాంగ్రెస్కు 251 మెజార్టీ రావటం రాజకీవర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోఉంది. మోమిన్పేట మండలంలో కాంగ్రెస్కు 2,541, మర్పిల్లో 4,077 మెజార్టీ కాంగ్రెస్కు వచ్చింది. వికారాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటింగ్ శాతం తగ్గింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ సరళిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పరిగి నియోజకవర్గంలో సైతం టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్కు మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డికి 6,574 ఓట్లు రాగా టీఆర్ఎస్కు 60,055 ఓట్లు వచ్చాయి. పరిగిలో కాంగ్రెస్కు 6,574 మెజార్టీ వచ్చింది. పూడురు మండలంలో కాంగ్రెస్కు ఎక్కువగా ఓట్లు వచ్చాయి. పూడురు మండలంలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్కు ఎక్కువగా మెజార్టీ వచ్చింది. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గటంపై టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఫలితాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విశ్లేషిస్తున్నట్లు సమాచారం. పార్టీకి మెజార్టీ తగ్గటానికి గల కారణాలపై స్వయంగా ఆరా తీసిన ఆయన ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
అంతర్మథనం..
ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు స్థానాలను అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నా మెజారిటీ తగ్గడంపై ఆ పార్టీ నేతలు అంతర్మథనం చేసుకుంటున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్, వందలాది మంది స్థానిక ప్రజాప్రతినిధులు, వేలాదిగా కార్యకర్తలు, ఇంత బలం.. బలగం ఉన్నా జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో అతి తక్కువ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం ఆ పార్టీ నేతలకు ఒకింత ఆశ్చర్యాన్ని, అసహనాన్ని కలుగజేశాయి. గతం కంటే భారీగా తగ్గిన మెజారిటీపై శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. గత సంవత్సరం డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సంగారెడ్డి సెగ్మెంట్ మినహా మిగతా తొమ్మిదింటిలో గులాబీ గుబాళించినా ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఆ ఆధిక్యత కనిపించలేదు. సంగారెడ్డి: అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన జగ్గారెడ్డి కేవలం 2వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని బట్టి చూస్తే భారీ మెజారిటీతో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లో కైవసం చేసుకుంటామని టీఆర్ఎస్ నేతలు పోలింగ్కు ముందు, పోలింగ్ తరువాత కూడా ధీమా వ్యక్తం చేశారు. తీరా ఓట్ల లెక్కింపును బట్టి చూస్తే మెదక్లో కొత్త ప్రభాకర్ రెడ్డికి కొద్దిగా మెజారిటీ తగ్గినప్పటికీ 3,16,427 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జహీరాబాద్లో మాత్రం ఆశించిన మెజారిటీ రాకపోవడంతో అభ్యర్థి బీబీ పాటిల్తోపాటుగా పార్టీ నేతలంతా ఖంగుతిన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీబీ పాటిల్ స్పల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావుపై కేవలం 6,229 ఓట్ల తేడాతో గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్కు 4,34,244 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావుకు 4,28,015 ఓట్లు వచ్చాయి. ఆద్యంతం చివరి రౌండు వరకు ఉత్కంఠ భరితంగా సాగిన కౌంటింగ్లో ఎట్టకేలకు టీఆర్ఎస్ అభ్యర్థి పాటిల్ గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మొదటిసారి ఎంపీగా పోటీ చేసిన పాటిల్ 1,44,631 ఓట్లతో ఘన విజయం సాధించారు. జహీరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గం తప్ప గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సెగ్మెంట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే ఎల్లారెడ్డి సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన జాజాల సురేందర్ సైతం లోక్సభ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్కు పూర్తిస్థాయి మద్దతునిచ్చారు. దీంతో సెగ్మెంట్లోని ఏడుగురు ఎమ్మెల్యేలు సైతం అధికార పార్టీవారే ఉండడంతో భారీ మెజారిటీ ఖాయమని భావించారు. అయితే ఓటర్లు మాత్రం విలక్షణమైన తీర్పునిచ్చారు. బీబీ పాటిల్ కేవలం 6,229 ఓట్ల తేడాతో విజయం సాధించడంతో పార్టీ అభ్యర్థితో పాటుగా ఉమ్మడి జిల్లా అధికార పార్టీ నేతలు ఖంగుతిన్నారు. ఎక్కడ లోపం జరిగిందంటూ కారణాలు అన్వేషించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా నేతలు, అభ్యర్థులతో సీఎం కేసీఆర్ ఇప్పటికే మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జహీరాబాద్లో మెజారిటీ తగ్గడానికి కారణాలేమిటో అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. జహీరాబాద్ సెగ్మెంట్లో కాంగ్రెస్కు భారీ లీడ్ గత సంవత్సరం డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాణిక్రావుకు 34వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ లభించింది. గత నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ సంఖ్య కొంచెం అటు ఇటుగా పునరావృతమవుతుందని ఎమ్మెల్యేతో సహా పార్టీ నేతలు భావించారు. కాగా ఆర్నెళ్లు తిరగకముందే ఓట్ల తేడాలో భారీ వ్యత్యాసమొచ్చింది. జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి 23,559 ఓట్ల భారీ ఆధిక్యం లభించింది. అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి 16,421 ఓట్లు, ఎల్లారెడ్డి సెగ్మెంట్లో 8,397 లభించాయి. టీఆర్ఎస్కు అందోల్లో 9,778, నారాయణఖేడ్లో 9,365, జుక్కల్లో 15,780, బాన్సువాడలో 20,060 ఓట్ల మెజారిటీ లభించింది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ 6,229 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి మొత్తం 14,11,612 మంది ఓటర్లు ఉండగా, 11,88,780 ఓట్లు 84.21 శాతంతో పోలయ్యాయి. వీటిలో టీఆర్ఎస్ పార్టీకి 5,76,433 ఓట్లు (48.49 శాతం) వచ్చాయి. కాగా 2019 (గత నెలలో) జరిగిన ఎంపీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం ఓటర్లు 14,97,996 మంది ఉండగా, 10,44,504 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీఆర్ఎస్కు 4,34,244 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 సెగ్మెంట్లలో కలిపి 4,43,468 ఓట్లు 37.30 శాతం వచ్చాయి. కాగా గత నెలలో జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కు 4,28,015 ఓట్లు పడ్డాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీకి 2018లో ఏడు సెగ్మెంట్లలో కలిపి 1,32,965 ఓట్లు ఆధిక్యం వస్తే గత నెలలో (2019)లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేవలం 6,229 ఓట్ల ఆధిక్యం మాత్రమే లభించింది. సమన్వయ లోపమే శాపమా..? ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాలను భారీ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మెదక్లో సుమారుగా 5 లక్షలు, జహీరాబాద్లో సుమారుగా 2లక్షలకు పైగానే మెజారిటీ వస్తుందని ఎన్నికల సమయంలో కార్యకర్తల, ప్రచార సభల్లో మాజీ మంత్రి, సీనియర్ నేత హరీశ్రావుతో సహా ఉమ్మడి జిల్లా పార్టీ నేతలంతా ధీమా వ్యక్తం చేశారు. కాగా ఫలితాలు వెలువడిన తరువాత మెదక్ కాస్త పర్వాలేదనిపించినా.. జహీరాబాద్లో మాత్రం కేవలం 6వేల ఓట్లకే మెజారిటీ పరిమితం కావడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్ 2014లో మొదటిసారిగా ఎంపీగా టీఆర్ఎస్ టికెట్పై విజయం సాధించారు. ఆయనకు పార్టీ నేతలతో, సెగ్మెంట్లోని ఎమ్మెల్యేలతో అంతగా సఖ్యత, సాన్నిహిత్యం లేదని ప్రచారం జరిగింది. చాలామంది నేతలు పాటిల్ అభ్యర్థిత్వాన్ని సైతం వ్యతిరేకిస్తూ టికెట్ రెండోసారి కేటాయించకముందే సీఎం కేసీఆర్కు చెప్పినట్లు సమాచారం. పార్లమెంటు స్థానాల వారీగా సీఎం కేసీఆర్ శుక్రవారం ఆయా జిల్లా నేతలు, అభ్యర్థులతో ఓట్ల శాతం, మెజారిటీ గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. అందువల్లనే ప్రచారం సమయంలో కూడా కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అంతగా ఆసక్తి చూపలేదనే అపవాదు కూడా ఉంది. సీఎం కేసీఆర్ ఆదేశాలు తప్ప మనస్ఫూర్తిగా బీబీ పాటిల్కు కొందరు ప్రచారం చేయలేదని కూడా ఆ నోటా ఈ నోటా వినిపిస్తోంది. లోక్సభ అభ్యర్థి పాటిల్ అందరినీ కలుపుకొని పోవడంలో కాస్త విఫలమయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదిఏమైనా 6వేల ఓట్ల పైచిలుకు ఓట్ల తేడాతో గెలవడంతో పార్టీ అభ్యర్థితో సహా పార్టీ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఎక్కడ.. ఎలా?!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ లోక్సభ ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) విజయఢంకా మోగించింది. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పసునూరు దయాకర్, మాలోతు కవిత విజయం సాధించిన విషయం విదితమే. అయితే, గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, తాజా లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను బేరీజు వేసేందుకు ఆ పార్టీ అధిష్టానం పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ గత ఎన్నికలతో పోలిస్తే ‘ఎక్కడ తగ్గాం.. ఎక్కడా పెరిగాం’ అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. కొంత తగ్గిన మెజార్టీ వరంగల్ లోక్సభ పరిధిలో మొత్తం 16,66,085 ఓట్లకు గాను 10,61,672 ఓట్లు పోల్ కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్ 3,50,298 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదే విధంగా మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి మొత్తం 14,24,385 ఓట్లకు గాను 9,83,708 ఓట్లు పోల్ కాగా 1,46,663 ఓట్ల మెజార్టీతో మాలోతు కవిత విజయం సాధించారు. ఇలా రెండు లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగినా... 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో లోక్సభ ఎన్నికలు వచ్చే సరికి టీఆర్ఎస్ అభ్యర్థులకు మెజార్టీ తగ్గింది. తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ ఎన్నికల ఫలితాలపై శుక్రవారం సమీక్ష జరిపిన గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలైన ఓట్లు, మెజార్టీపై ఆరా తీసినట్లు తెలిసింది. నాలుగు చోట్ల పైకి.. ఎనిమిది చోట్ల కిందకు... వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. భద్రాచలం, పినపాక, ఇల్లందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిశీలిస్తే.. ఈసారి పరకాల, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓట్లు పెరిగాయి. ఇక వరంగల్ పశ్చిమ, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో మాత్రం తగ్గాయి. పరకాలలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డికి 59,384 ఓట్లు వస్తే.. ఈసారి ఆ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి 87,567 ఓట్లు నమోదయ్యాయి. భూపాలపల్లిలో గతంలో టీఆర్ఎస్కు 53,567 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 91,628 వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో అనూహ్యంగా మెజార్టీ పెరిగింది. ములుగులో 2018 ఎన్నికల్లో 66,300 ఓట్లు రాగా, ఈసారి 71,518 పార్లమెంట్ అభ్యర్థికి వచ్చాయి. స్టేషన్ఘన్పూర్లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 98,612 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 94,327 ఓట్లు పోలయ్యాయి. పాలకుర్తికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 1,17,694 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 92,437, జనగామలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 91,592 ఓట్లు రాగా.. ఇప్పుడు 68,380, డోర్నకల్లో అసెంబ్లీ పోలింగ్లో 85,467, లోక్సభకు 78,986, మహబూబాబాద్లో అసెంబ్లీకి 85,397, లోక్సభకు 84,031, వరంగల్ పశ్చిమలో అసెంబ్లీకి 81,006, లోక్సభలో 62,669, వర్దన్నపేటలో అసెంబ్లీ ఎన్నికల్లో 1,31,252 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో 97,526 ఓట్లు నమోదయ్యాయి. అయితే, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను పోలిస్తే 12 శాతం పోలింగ్ తక్కువ నమోదు కావడమే మెజార్టీ తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. కానీ మరింత సమన్వయంతో పని చేస్తే ఆ ఎనిమిది సెగ్మెంట్లలోనూ వెనుకబడిపోయే పరిస్థితి ఉండేది కాదన్న అంచనాకు అధినేత వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. ‘ఓరుగల్లు’పై గులాబీ జెండా. ఒకప్పుడు కాంగ్రెస్.. ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న వరంగల్, మహబూబాబాద్పై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురేసింది. హన్మకొండ.. ఆ తర్వాత 2009 పునర్విభజనలో ఏర్పడిన వరంగల్గా ఏర్పడిన పార్లమెంట్ నియోజకవర్గానికి 1952 నుంచి 2015 వరకు మూడు ఉప ఎన్నికలు కలుపుకుని మొత్తం 19 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏడు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు కాంగ్రెస్(ఐ) అభ్యర్థులు విజయం సాధించారు. ఇక టీడీపీ ఐదు, టీఆర్ఎస్ మూడు, టీపీఎస్, పీడీఎఫ్ పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో ధరావత్ రవీంద్రనాయక్ గెలుపొందారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికలో టీడీపీ, 2009లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఎన్నికలో టీఆర్ఎస్ ఈ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కావడంతో 2015 వచ్చిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ విజయం సాధించగా.. తాజా ఎన్నికల్లోనూ ఆయనే మరోమారు విజయం సాధించారు. ఇక ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్, టీడీపీ కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోటల్లా ఉన్న మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో తాజా లోక్సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం ద్విసభ్య నియోజకర్గంగా కొనసాగింది. ఈ సమయంలో 1957, 1962లో సార్వత్రిక ఎన్నికలు, 1965లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మూడు సమయాల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే విజయం వరించింది. ఆ తర్వాత ఈ స్థానం రద్దు కాగా.. 2009లో మళ్లీ ఏర్పడింది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ విజయం సాధించారు. ఇక 2014లో మహబూబాబాద్(ఎస్టీ)లో టీఆర్ఎస్ పక్షాన ప్రొఫెసర్ సీతారాం నాయక్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లోను టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్, టీడీపీ ప్రాభవం కోల్పోయినట్లయింది. -
టీఆర్ఎస్.. పోస్టుమార్టం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్ శిబిరం ఆలోచనల్లో పడింది. కేవలం ఆరు నెలల కిందటి ఆదరణ ఎలా తలకిందులైంది..? గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల నాటి ఓట్ల సునామీ.. ఇప్పుడెందుకు దూరమైంది..? నల్లగొండ లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమికి తప్పుటడుగు ఎక్కడ పడింది..? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో టీఆర్ఎస్ అధినాయకత్వం ఉందని సమాచారం. కచ్చితంగా గెలిచి తీరుతామని భావించిన నల్లగొండ రెండోసారీ నిరాశ పరచడం, సిట్టింగ్ స్థానమైన భువనగిరిని తిరిగి నిలబెట్టుకోలేక పోవడానికి గల కారణాలను అన్వేషిస్తోందని అంటున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి మొత్తంగా 5,00,346 ఓట్లు సాధించారు. కానీ, డిసెంబర్ నాటి ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని దేవరకొండ, నాగార్జు సాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యే అభ్యర్థులకు 6లక్షల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఓటమి పాలైన హుజూర్నగర్ ఓట్లూ ఉన్నాయి. అంటే కేవలం ఆరు నెలల తేడాతో ఆ పార్టీ ఏకంగా లక్ష పైచిలుకు ఓట్లను కోల్పోయింది. ఈ కారణంగానే నల్లగొండ ఎంపీ స్థానం దక్కకుండా పోయిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వ్యూహాత్మకంగా పనిచేసినా..! వాస్తవానికి లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎక్కడా అలసత్వం ప్రదర్శించినట్లు కనించలేదు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పజెప్పారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని వెంట తీసుకుని ప్రతి నియోజకవర్గంలో పర్యటించి ప్రచారం చేశారు. ఒక విధంగా కాంగ్రెస్ అభ్యర్థి చేసిన ప్రచారం కంటే.. అధికార టీఆర్ఎస్ చేసిన ప్రచారమే ఎక్కువ. ఒకసారి పార్టీ అధినేత కేసీఆర్ లోక్సభ నియోజకవర్గ స్థాయి బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేసి వెళ్లారు. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు సైతం అభ్యర్థిత్వం ఖరారుకు ముందు ఒకసారి, చివరలో ఒకసారి నల్లగొండకు ప్రచారానికి వచ్చి బహిరంగసభలో, రోడ్ షోలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలూ ఎవరికి వారూ మండలాలు, గ్రామాలను చుట్టి వచ్చారు. ఇంత చేసినా టీఆర్ఎస్ గెలుపు వాకిట బొక్కబోర్ల పడడాన్ని ఆ పార్టీ నాయకత్వం సీరియస్గానే పరిగణిస్తోందని చెబుతున్నారు. అతివిశ్వాసం కొంపముంచిందా..? అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఆరు నెలలకే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ నాటి ఫలితమే రిపీట్ అవుతుందన్న అతివిశ్వాసమే దెబ్బకొట్టిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కారణంగానే ఎమ్మెల్యేలు అనుకున్నంతగా ప్రజల్లోకి వెళ్లలేక పోయారా..? అదే పార్టీ కొంప ముంచిందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏడింట ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు ఉన్నా.. చివరకు తమకు వచ్చిన మెజారిటీలో సగం ఓట్లు కూడా సాధించలేక పోవడం, పెద్ద మొత్తంలో ఓట్లకు కోత పడడాన్ని ఎవరి వైఫల్యంగా చూడాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. మంత్రి సొంత నియోజకవర్గం సూర్యాపేటలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థికంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇక, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థికి 3,484 ఓట్ల ఆధిక్యం వచ్చినా.. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లు, లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లను పోలిస్తే.. 29వేల పైచిలుకు ఓట్ల తగ్గుదల ఉంది. ఇక, ఏ నియోజకవర్గంలో చూసినా.. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీకి సమంగా ఓట్లు వచ్చినా గెలుపు సాధ్యమయ్యేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దెబ్బకొట్టిన కోదాడ.. హుజూర్నగర్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూర్యాపేట, నల్లగొండల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి లీడ్ వచ్చింది. దేవరకొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి లీడ్ వచ్చినా.. అది నాలుగు వేల ఓట్ల చొప్పునే. కానీ, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఆధిక్యమే టీఆర్ఎస్ అభ్యర్థిని దెబ్బకొట్టిందని విశ్లేషిస్తున్నారు. వరసగా కోదాడలో 11,930, హుజూర్గనర్లో 12,993, మిర్యాలగూడలో 7,186 ఓట్ల చొప్పున లీడ్ వచ్చింది. ఈ మూడు నియోజకవర్గాలే కాంగ్రెస్ అభ్యర్థిని విజయతీరాలకు చేర్చాయన్న అభిప్రాయం ఉంది. మొత్తంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఫల్యం చెందారా ..? అన్న ప్రశ్నలపైనా చర్చ జరుగుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఏమైనా వెన్నుపోటు రాజకీయాలు దెబ్బతీశాయా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే పార్టీ నాయకత్వం ఈ ఓటమిపై పూర్తిస్థాయి సమీక్ష జరిపే వీలుందని చెబుతున్నారు. -
నల్లగొండ నా గుండె
నల్లగొండ : నల్లగొండ నా గుండెలాంటిదని, రాజకీయంగా జన్మనిచ్చి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసేందుకు అవకాశం కల్పించడంతో పాటు ప్రస్తుతం భువనగిరి ఎంపీగా విజయం సాధించానంటే నల్లగొండ ప్రజల చలువేనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. భువనగిరి ఎంపీగా విజయం సాధించిన సందర్భంగా ఆయన శుక్రవారం నల్లగొండలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గడియారం సెంటర్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలని పనిచేసి తెలంగాణ వెంకన్నగా పేరు తెచ్చుకున్నానన్నారు. ప్రస్తుతం ఎంపీ అయ్యానంటే అది కూడా నల్లగొండ ప్రజల చలువేనన్నారు. సీఎం కేసీఆర్ నన్ను ఓడించడం కోసం ఇన్చార్జ్లను పెట్టాడని ఆరోపించారు. నేను చేసిన ఉద్యమం ప్రజలకు తెలుసన్నారు. కేసీఆర్ కూతురు కూడా ఓడిపోయారంటే ప్రజలు టీఆర్ఎస్పై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఉత్తమ్కుమార్రెడ్డి, తాను జిల్లాలో ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా పరిష్కరించడంతో పాటు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ ధర్మం, నీతి, నిజాయతీ విజయం సాధించిందన్నారు. కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని రాబోయేవి కాంగ్రెస్ రోజులేనని గుర్తుంచుకోవాలన్నారు. దుబ్బాక నర్సింహారెడ్డి మాట్లాడుతూ సారు.. కారు.. పదహారు అన్న కేసీఆర్కు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మైండ్ బ్లాక్ చేశారన్నారు. ముగ్గురు మొనగాళ్ల మాదిరిగా కాంగ్రెస్ నుంచి ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్రెడ్డి విజయం సాధించారన్నారు. కోమటిరెడ్డి మీద ఉన్న అభిమానమే భువనగిరిలో గెలిపించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గుమ్మల మోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో అమరేందర్రెడ్డి, తండు సైదులుగౌడ్, బొడ్డుపల్లి లక్ష్మి, బుర్రి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
ఎందుకిలా..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితికి సెంటిమెంట్ కరీంనగర్. పార్టీ ఆవిర్భావం తరువాత కేసీఆర్ 2001లో తొలి సింహగర్జన సభ నిర్వహించింది ఇక్కడే. మొన్నటి లోక్సభ ఎన్నికలకు ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో కేటీఆర్ సన్నాహక సభ నిర్వహించి జోష్ పెంచింది ఇక్కడి నుంచే. చివరికి ఎన్నికల షెడ్యూల్ విడుతలైన తరువాత తొలి బహిరంగసభను కూడా కరీంనగర్ నుంచే మొదలు పెట్టి ఈ జిల్లాపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత ఈ కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్కు షాకిచ్చింది. కరీంనగర్ లోక్సభ స్థానంలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగింట బీజేపీకి ఘననీయమైన ఓట్లు పోల్ కావడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే నిజామాబాద్లో సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమిలో పూర్వ కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్ల భాగస్వామ్యం కూడా ఎక్కువే. పెద్దపల్లి లోక్సభ పరిధిలో సైతం మంథని, రామగుండంలలో టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ మెరుగైన ఓట్లు సాధించింది. మొత్తంగా చూస్తే పూర్వ కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, ధర్మపురి, పెద్దపల్లిలో మాత్రమే టీఆర్ఎస్కు ఊరట లభించింది. మిగతా 8 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు రావడం పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏకంగా 52వేల మెజారిటీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై 14వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఇదే నియోజకవర్గంలో బీజేపీకి ఏకంగా 52,181 ఓట్ల మెజారిటీ లభించడం గమనార్హం. మైనారిటీ వర్గాలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మెజారిటీ వర్గంలో 70 శాతం ఓట్లు బీజేపీకే పోలయినట్లు అంచనా వేస్తున్నారు. మిగతా స్థానాల్లోనూ... ఇక చొప్పదండి, మానకొండూరులలో టీఆర్ఎస్ అభ్యర్థులు రవిశంకర్, రసమయి బాలకిషన్లు అనూహ్యంగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. రవిశంకర్కు అసెంబ్లీ ఎన్నికల్లో 91వేల ఓట్లు పోల్ కాగా, ఈసారి ఇక్కడ టీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు కేవలం 41,396 అంటే దాదాపు 50వేల ఓట్లు మైనస్. బండి సంజయ్కు ఈ నియోజకవర్గం నుంచి ఎవరూ ఊహించని విధంగా 97,441 ఓట్లు సాధించారు. మానకొండూరులో గత ఎన్నికల్లో రసమయికి 89వేల ఓట్లు రాగా, ఈసారి 41వేల ఓట్లకు టీఆర్ఎస్ పరిమితమైంది. ఆ ఎన్నికల్లో 4356 ఓట్లు మాత్రమే వచ్చిన బీజేపీకి 73వేల ఓట్లు పోలవడం గమనార్హం. వేములవాడలోనూ గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు 28వేల మెజారిటీ కట్టబెట్టిన ఓటర్లు ఈసారి బీజేపీ 25వేల ఓట్ల ఆధిక్యతనిచ్చారు. కరీంనగర్ పార్లమెంటులో కరీంనగర్ మినహా మిగతా ఆరు అసెంబ్లీల్లో గత ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ రాకపోగా, ఈసారి భారీగా ఓట్లు పోలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిజామాబాద్, పెద్దపల్లి లోక్సభ పరిధిల్లో సైతం... నిజామాబాద్లో సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమికి ఆ జిల్లాలోని నియోజకవర్గాలతోపాటు కరీంనగర్లోని జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్లు కూడా ప్రధాన కారణమయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కన్నా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్కు భారీగా మెజారిటీ లభించింది. జగిత్యాలలో 7,300, కోరుట్ల నుంచి 20వేల మెజారిటీ బీజేపీకి లభించడం గమనార్హం. నిజామాబాద్లో కవిత ఓటమిలో ఈ రెండు నియోజకవర్గాలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఇక పెద్దపల్లిలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ, మంథని, రామగుండంలలో టీఆర్ఎస్కన్నా కాంగ్రెస్కే ఓట్లు అధికంగా పోలయ్యాయి. మంథనిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా, రామగుండంలో టీఆర్ఎస్ నేతల వర్గపోరుతో కాంగ్రెస్కు 2వేల స్వల్ప ఆధిక్యత లభించింది. కొంప ముంచిన అతివిశ్వాసం అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసిన టీఆర్ఎస్ మూడు నెలల తరువాత జరిగే లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలను తుడిచేస్తుందని ఆ పార్టీ నేతలు నమ్మారు. కరీంనగర్లో ఏడుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, వారి మధ్య సరైన సయోధ్య కరువైంది. సిట్టింగ్ ఎంపీ వినోద్కుమార్తోపాటు మంత్రి ఈటల రాజేందర్ గెలుపుపై పూర్తి ధీమాతో వ్యవహరించారు. కరీంనగర్తోపాటు ఒకటి రెండు పట్టణాల్లో బీజేపీకి ఓటింగ్ పెరిగినా, గ్రామీణ ఓటర్లు టీఆర్ఎస్ వైపే ఉంటారని కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ కోల్పోవడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే బహిరంగసభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అభ్యర్థి ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకోగా, దాన్ని కౌంటర్ చేయడంలో టీఆర్ఎస్ నేతలు విఫలమయ్యారు. రైతుబంధు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలే తిరిగి ఓట్లు తెచ్చిపెడతాయని భావించిన ఎమ్మెల్యేలకు గట్టి దెబ్బ తగిలినట్లయింది. కాగా హుజూరాబాద్లో కాంగ్రెస్ కన్నా 30వేల మెజారిటీ సాధించిన మంత్రి ఈటల రాజేందర్ బీజేపీని మూడోస్థానానికి పరిమితం చేయడం గమనార్హం. టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పోలుకాకుండా ఆయన పకడ్బందీగా వ్యవహరించారు. హుస్నాబాద్లో సైతం 23వేల మెజారిటీ టీఆర్ఎస్ సాధించింది. త్వరలో మేథోమథనం లోక్సభ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ అధిష్టానం త్వరలో పోస్టుమార్టం చేయనుంది. హైదరాబాద్లో పార్లమెంటరీ సమావేశం తరువాత వచ్చిన ఫీడ్బ్యాక్కు అనుగుణంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేస్తారు. కరీంనగర్లో ఓటమికి హిందుత్వ నినాదం, మోదీ ఎఫెక్ట్ బాగా పనిచేసిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయిలో మేథోమథనం జరపనున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ బీజేపీకి పెరగడానికి గల కారణాలపై విశ్లేషణ చేయనున్నారు. -
అసెంబ్లీకి సై... లోక్సభకు ‘నో’..
సాక్షి, సిటీబ్యూరో: ఇంతలో ఎంత మార్పు..ఆరు నెలల్లోనే ఓటరు మనోగతం మారిందా అంటే..అవుననే అన్పిస్తోంది గురువారం నాటి లోక్సభ ఎన్నికల ఫలితాలను గమనిస్తే. గత అక్టోబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏకపక్ష ఓటు వేసిన నగర ఓటరు..సరిగ్గా ఆర్నెళ్ల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పుతో రాజకీయ నేతలందరినీ ఆశ్చర్యపరిచారు. నగరంలోని నాలుగు లోక్సభ స్థానాల పరిధిలోనూ శాసనసభ–లోక్సభ ఫలితాలన్నీ తారుమారయ్యాయి. మంత్రుల నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ కారు జోరు ఒక్కసారిగా తగ్గిపోయింది. మల్కాజిగిరి లోక్సభ పరిధిలో టీఆర్ఎస్ విజయం సునాయాసమేనని భావించినా ఎల్బీనగర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు మెజారిటీ రావటంతో ఆ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ మూడు నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు భారీ మెజారిటీలతో విజయం సాధించినా లోక్సభకు వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. ఎల్బీనగర్లో కాంగ్రెస్కు ఏకంగా 27వేల పైచిలుకు మెజారిటీ రావటం కారు జోరుకు బ్రేకులేసింది. టీఆర్ఎస్కు కేవలం మేడ్చల్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లిలోనే స్వల్ప మెజారిటీ వచ్చింది. సికింద్రాబాద్లో సీన్ రివర్స్ సికింద్రాబాద్ లోక్సభ స్థానంలోనూ సీన్ రివర్స్గా మారింది. టీఆర్ఎస్కు నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు మినహా మరెక్కడా ఆధిక్యం రాలేదు. అంబర్పేటలో బీజేపీ భారీ మెజారిటీ సాధించగా, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ వెనుకబడింది. మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్న జూబ్లీహిల్స్, నాంపల్లిలోనే టీఆర్ఎస్కు ఆధిక్యత వచ్చింది. ఇక చేవెళ్ల లోక్సభ పరిధిలోకి వచ్చే శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్లలో శాసనసభ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీతో పోలిస్తే లోక్సభకు వచ్చే సరికి టీఆర్ఎస్కు నామమాత్రం మెజారిటీలే వచ్చాయి. శేరిలింగంపల్లిలో తొమ్మిది వేల పైచిలుకు, రాజేంద్రనగర్లో28 వేలు, మహేశ్వరంలో 27 వేల మెజారిటీలు నమోదయ్యాయి. మంత్రుల ఇలాకాలో.. ♦ సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని సనత్నగర్ నియోకజవర్గంలో బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డికి ఏకంగా 18867 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ నియోకజవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తుండటం విశేషం. ♦ మల్కాజిగిరి లోక్సభ పరిధిలోని మేడ్చల్ శాసనసభ స్థానంలో శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 80 వేలకు పైగా మెజారిటీ రాగా, తాజా ఎన్నికల్లో మాత్రం 8087 ఓట్ల మెజారిటీ మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖరరెడ్డికి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి చామకూర మల్లారెడ్డి కేబినెట్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
ఓడిన చోటే గెలిచారు!
సాక్షి, ఆదిలాబాద్: ‘ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి’ అనేది పెద్దల మాట. ఈ విషయంలో తాజాగా ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన సోయం బాపురావు, బొర్లకుంట వెంకటేశ్ నేతకు ఈ నానుడి సరితూగుతుంది. గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోయం బోథ్ నియోజకవర్గం, బొర్లకుంట చెన్నూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లో ఒక్క అవకాశం చేజారితే మరో అవకాశం కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఇరువురికి డిసెంబర్ పోయిన వెంటనే ఏప్రిల్ కలిసి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగిన ఇరువురు గెలుపొందారు. పార్టీ మారి.. శాసనసభ ఎన్నికల్లో సోయం బాపురావు బోథ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అంతకు ముందు ఆయన టీడీపీలో కొనసాగుతుండగా, రేవంత్రెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరారు. ఇక బొర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్లో చేరి చెన్నూర్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఇరువురు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలు వీరిద్దరికి కలిసిరాక ఓడిపోయారు. ఈ పరిస్థితిలో కొద్ది నెలలు గడిచిపోయాయి. లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ను సోయం ఆశించారు. అయి తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్ను ప్రకటించింది. దీంతో నామినేషన్ల ఘట్టం మొదలైన తర్వాత సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీని వీడి హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో కమలం గూటికి చేరారు. ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ సాధించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పెద్దపల్లి అభ్యర్థిగా ఎ.చంద్రశేఖర్ను ముందుగా ప్రకటించింది. ఇక టీఆర్ఎస్ నుంచి జి.వివేకానంద పేరు వినిపించినా అనూహ్యంగా నామినేషన్ల చివరి రోజు బొర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వెంటనే పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కూడా ఇచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బోథ్ నియోజకవర్గం, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని చెన్నూర్ నియోజకవర్గాలు ఉండగా, ఈ ఇరువురు నేతలకు డిసెంబర్లో మూసుకుపోయిన విజయం ఏప్రిల్లో మళ్లీ అదృష్టం తట్టింది. పార్టీ మారి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచి విజయం దక్కించుకున్నారు. సారుప్యత.. ఈ ఇద్దరు ఎంపీలకు సారుప్యత ఉంది. ఇరువురు డిసెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. కాగా సోయం బాపురావు 2004లో బోథ్ నుంచి టీఆర్ఎస్ టికెట్కు సంబంధించి అప్పట్లో కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఐటీడీఏలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన పదవి విరమణ తీసుకొని ఆ ఎన్నికల్లో బరిలో నిలిచారు. బోథ్ ఎమ్మెల్యేగా అప్పట్లో గెలుపొందారు. అయితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2008లో ఆయన తొమ్మిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్లో చేరారు. అయితే 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి బోథ్ టికెట్ ఆశించినా దక్కకపోవడంతో నిరాశ చెందారు. 2014లో మరోసారి బోథ్ నుంచే కాంగ్రెస్ టికెట్ ఆశించినా రాకపోవడంతో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక బొర్లకుంట వెంకటేశ్ నేత రవాణా శాఖలో పనిచేస్తూ పదవి విరమణ తీసుకొని డిసెంబర్లో చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఓటమి పాలయ్యారు. 2019 ఏప్రిల్లో సోయం బీజేపీ నుంచి, బొర్లకుంట టీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలిచి గెలుపొందారు. గతం కంటే ఎక్కువే.. ఈ ఇరువురు లోక్సభ బరిలో నిలవగా, డిసెంబర్లో ఆయా నియోజకవర్గాల్లో అప్పుడు వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు అధికంగా రావడం గమనార్హం. సోయం బాపురావుకు బోథ్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో 54,639 ఓట్లు రాగా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 61,003 ఓట్లు వచ్చాయి. విచిత్రమేమిటంటే సోయం బాపురావు అసెంబ్లీ ఎన్నికల్లో 6వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వచ్చిన ఓట్లను పరిగణలోకి తీసుకున్నా ఆయనకు అప్పట్లోనే విజయం దక్కే పరిస్థితి ఉండేది. ఇక వెంకటేశ్ నేతకు చెన్నూర్ అసెంబ్లీ ఎన్నికల్లో 43,848 ఓట్లు వచ్చాయి. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు చెన్నూర్ నియోజకవర్గంలో 67,219 ఓట్లు రావడం గమనార్హం. -
మంత్రులకు షాక్!
కంటోన్మెంట్: లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఇద్దరు మంత్రులకు షాక్ ఇచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అదే విధంగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి మల్కాజిగిరి నుంచి బరిలో నిలచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆయా పార్లమెంట్ స్థానాల్లోని అసెంబ్లీ స్థానాల్లోనే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే స్థానిక నియోజకవర్గంలోనే టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగించలేకపోయింది. ఆయా మంత్రులు ఓటేసిన బూత్లలోనూ టీఆర్ఎస్కు ఆధిక్యం దక్కకపోవడం గమనార్హం. మారేడ్పల్లి నెహ్రూనగర్లో నివాసముండే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన తనయుడు సాయికిరణ్ యాదవ్ల ఓట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కస్తూర్బా కాలేజీలోని పోలింగ్ బూత్ నెం.220లో ఉన్నాయి. ఈ బూత్లో బీజేపీకి 395, కాంగ్రెస్కు 153 ఓట్లు రాగా... టీఆర్ఎస్కు కేవలం 89 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీతో పోలిస్తే టీఆర్ఎస్ 306 ఓట్లు తక్కువ రావడం గమనార్హం. ∙మంత్రి మల్లారెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్న బోయిన్పల్లి సెయింట్ పీటర్స్ స్కూల్లోని పోలింగ్ బూత్లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డికి 207 ఓట్లు రాగా... మంత్రి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డికి 179 ఓట్లు దక్కాయి. ఈ బూత్లో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్కు 28 తక్కువ ఓట్లు పడ్డాయి. బీజేపీ సైతం ఈ బూత్లో 169 దక్కించుకోవడం గమనార్హం. -
జిల్లా అభివృద్ధికి నిధులు తెస్తా..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: లోక్సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో జిల్లా అభివృద్ధికి మరిన్ని నిధులు తెస్తానని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైందన్నారు. పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనను ఆశీర్వదించి ఖమ్మం ప్రజలకు అప్పగిస్తే.. వారు తిరుగులేని విజయాన్ని చేకూర్చారని, ఈ విజయం అపూర్వమైందని అన్నారు. తన విజయానికి కృషి చేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటానని, ప్రజా సేవకుడిగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం తీసుకుంటానన్నారు. తాను కేసీఆర్ అడుగు జాడల్లో నడిచే వ్యక్తినని, నాయకత్వం మాటే తన మాట అని, పార్టీ నిర్దేశించిన పనులు చేయడమే తన ముందున్న కర్తవ్యమన్నారు. గతంలో టీడీపీ లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్న అనుభవం ఉన్నందున.. దానిని జిల్లా అభివృద్ధికి వినియోగిస్తానన్నారు. టీఆర్ఎస్ లోక్సభ పక్ష నాయకుడిగా ఎవరికి అవకాశం ఉందని విలేకరులు ప్రశ్నించగా.. పార్టీ అధినేత అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని, అది వ్యక్తులు నిర్ణయించేది కాదని, పార్టీ తీసుకునే నిర్ణయమని అన్నారు. జిల్లా ప్రజలు తనను ఎంపీగానే చూడాలనుకున్నారని, అందుకే ఇంతటి ఘన విజయం అందించారని, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యమన్నారు. సమావేశంలో మేయర్ పాపాలాల్, టీఆర్ఎస్ నగర పార్టీ అధ్యక్షుడు కమర్తపు మురళి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, బొమ్మెర రామ్మూర్తి, తిరుమలరావు, తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని బేబి స్వర్ణకుమారి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోదం.. ఖేదం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్సభ ఎన్నికల ఫలితాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. నియోజకవర్గాలు, పోలింగ్ బూత్లలో వచ్చి న ఓట్ల ఆధారంగా పోస్టుమార్టం నిర్వహిస్తున్నాయి. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలు మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీకి మోదం కలిగించగా.. కాంగ్రెస్ పార్టీకి ఖేదం మిగిల్చాయి. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగించి.. పార్టీ టికెట్పై పోటీ చేసిన ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ ఘనవిజయం సాధించి ఆరు నెలలైనా గడవకముందే జిల్లాలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం చవిచూడాల్సిన పరిస్థితి నెలకొందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిసి పోటీ చేశాయి. ఇందులో కాంగ్రెస్.. మధిర, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పోటీ చేయగా.. భాగస్వామ్య పక్షమైన సీపీఐ వైరాలో.. తెలుగుదేశం పార్టీ ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోటీ చేశాయి. వీటిలో వైరా, ఖమ్మం మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీకి చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. రాష్ట్రమంతటా టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో జిల్లాలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో జిల్లాలో కాంగ్రెస్కు రాజకీయంగా తిరుగు లేదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు దూరమైనా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తల అండదండలు, సంప్రదాయ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ విజయానికి కృషి చేసినా ఫలితం మాత్రం పార్టీ ఊహించిన దానికి భిన్నంగా వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, మహాకూటమి మిత్రపక్షాల అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కన్నా అత్యంత తక్కువగా రావడమే కాకుండా.. ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్కు మెజార్టీ రావడానికి గల కారణాలపై కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షించే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ విజయానికి ఏ నియోజకవర్గంలో.. ఏ స్థాయిలో కృషి జరిగింది.. ఆయా ప్రాంతాల్లో ఓట్ల శాతం తగ్గడానికి గల కారణాలపై కాంగ్రెస్ నేతలు ఆరా తీసే పనిలో పడ్డారు. ఏడింట్లో మెజార్టీ రాదాయె.. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ మెజార్టీ సాధించలేకపోయింది. అయితే అన్ని నియోజకవర్గాల్లో మాత్రం రెండో స్థానాన్ని మాత్రం కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన పాలేరు, మిత్రపక్షమైన టీడీపీ గెలుపొందిన సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సైతం టీఆర్ఎస్ మెజార్టీ సాధించడం, మధిర నియోజకవర్గంలోనూ ఆ పార్టీయే మెజార్టీ సాధించింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన కొత్తగూడెం నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ది రెండో స్థానమే అయింది. ఇక వైరా నియోజకవర్గంలో టీఆర్ఎస్కు మెజార్టీ వచ్చినా.. మిగితా నియోజకవర్గాలతో పోలిస్తే స్వల్పమే కావడం కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చింది. పార్టీ కోసం పరిశ్రమించే కార్యకర్తలున్నా కొన్నిచోట్ల వారిని పూర్తిస్థాయిలో పార్టీకి పనిచేసే విధంగా నాయకులు చేయలేకపోయారని, నాయకుల చుట్టూ రాజకీయాలు తిరగడం వల్ల పార్టీకి కొంత నష్టం జరిగిందని ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రేణుకా చౌదరి శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తన ఓటమికి గల కారణాలపై అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నామని, పోలింగ్ కేంద్రాలవారీగా వివరాలు వచ్చాక లోపం ఎక్కడ జరిగింది? పార్టీ గెలుపునకు అడ్డు పడింది ఎవరో తెలుస్తుందని.. దాని ఆధారంగా పార్టీ హైకమాండ్కు నివేదిక ఇస్తామన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీకి అనూహ్య రీతిలో పెరిగిన మెజార్టీతో ఆ పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ జిల్లాలో టీఆర్ఎస్ మరింత పుంజుకుంటుందనడానికి నిదర్శనమని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో పరాజయం పాలు కావడంతో ఆ పార్టీలో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. -
‘కేసీఆర్ నియంత పోకడలకు అడ్డుకట్ట’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పోకడలను లోక్సభ ఎన్నికల్లో ప్రజలు అడ్డుకున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సంతృప్తికర పోటీ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం కుంతియా.. గెలిచిన ఎంపీలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ రోజు రోజుకూ పటిష్టం అవుతోందన్నారు. కేసీఆర్ ఒంటెత్తు పోకడలు, రాజకీయ ఫిరాయింపులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, పదహారు సీట్లు అంటూ విర్రవీగిన కేసీఆర్ను సింగిల్ డిజిట్ వద్ద ఆపి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం నేర్పారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజాస్వామ్య వాదిలా పనిచేయాలని హితవు పలికారు. 8 స్థానాల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని, మూడింట గెలిచి, మరో రెండు చోట్ల మెజారిటీతో ఓటమి పాలైందని తెలిపారు. -
‘వైఎస్ జగన్ సీఎం కావడం సంతోషంగా ఉంది’
సాక్షి, నల్గొండ : తాను ఎంపీగా గెలవడం, వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావడం తనకెంతో సంతోషంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజల కోసం దివంగత నేత వైఎస్సార్ ఒక్కడుగు వేస్తే.. వైఎస్ జగన్ రెండడుగులు వేస్తారని పేర్కొన్నారు. పదేళ్ల పాటు ఎంతో శ్రమించి ప్రజాభిమానాన్ని గెలుచుకున్నారని ప్రశంసించారు. తన విజయం గురించి మాట్లాడుతూ.. నీతిగా పని చేశాను కాబట్టే ప్రజలు తనను గెలిపించారని తెలిపారు. ఒక ఎంపీగా విభజన చట్టంలో ఇచ్చిన హామీల కోసం సభలో కొట్లాడతానని పేర్కొన్నారు. పరిపాలనను గాలికొదిలేసి దోపిడీ చేస్తున్న టీఆర్ఎస్, కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఘాటుగా విమర్శించారు. కాగా గురువారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భువనగిరి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్పై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి భారీ ఓటమిని చవిచూశారు. అయినప్పటికి కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డిపై నమ్మకంతో ఆయనకు భువనగిరి లోక్సభ టికెట్ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిజం చేస్తూ కోమటిరెడ్డి విజయం సాధించారు. కోమటిరెడ్డి పుట్టినరోజు నాడే ఆయన ఎంపీగా గెలుపు అందుకోవడంతో అభిమానుల ఆనందం రెట్టింపు అయ్యింది. -
‘మమతను చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి జిల్లాలో బీజేపీ జెండా ఎగిరిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. నిన్న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలకు గెలుచుకున్న విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థుల విజయోత్సవ సభను శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మాట్లాడుతూ.. జీఎస్టీ అమలుపర్చిన ప్రపంచ నాయకుల్లో గెలిచింది కేవలం మోదీనే అని గుర్తుచేశారు. రాజకీయ విశ్లేషకులందరూ బీజేపీపై మానసిక ఒత్తిడి పెట్టారని, మోదీ ముందు కేసీఆర్ పనికిరారని తెలంగాణ ప్రజలు తేల్చారని పేర్కొన్నారు. మోదీని, బీజేపీని విమర్శిస్తే బాగుండదని ఆయన హెచ్చరించారు. మమతను చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలని మురళీధర రావు హితవు పలికారు. కేటీఆర్కు మాటలు రావడంలేదు.. నరేంద్రమోదీ హఠావో అన్న విపక్షాలకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సమావేశంలో లక్షణ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీనే తమకు అంబేద్కర్ అని అన్నారు. తెలంగాణ దాటితే టీఆర్ఎస్ చెల్లని రూపాయని ఆయన ఎద్దేవా చేశారు. ఫలితాలు చూసిన తరువాత కేటీఆర్కు మాటలు రావడంలేదని, రైతులు కవితను సాగనంపారని పేర్కొన్నారు. తెలంగాణలో చరిత్ర సృష్టించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమను అభినందించినట్లు లక్ష్మణ్ తెలిపారు. నియంత పాలన సాగదు: సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రాష్ట్రంలోని ముఖ్యమైన స్థానాల్లో బీజేపీ గెలిచింది. టీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు వ్యతిరేకించారు. అక్రమ కేసుల ద్వారా ప్రజాసంఘాల నాయకులను కేసీఆర్ బయపెట్టాలని చూస్తున్నారు. కేసీఆర్ మజ్లీస్ పార్టీని నమ్ముకున్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నియంత పాలన సాగదు. నా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. బొందుగాళ్లకు స్థానం లేదు: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కార్యకర్తలందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా. ఏ గ్రామానికి వెళ్లినా టీఆర్ఎస్ అహంకారం గురించే మాట్లాడుతున్నారు. ప్రజలకి కేంద్ర పథకాలు తప్ప రాష్ట్ర పథకాలు ఒక్కటీ కూడా అందడం లేదు. టిఆర్ఎస్కి సెంటిమెంట్ అయిన కరీంనగర్లో ప్రజలు బీజేపీకే పట్టాం కట్టారు. తెలంగాణలో హిందువులకు తప్ప, బొందుగాళ్లకు స్థానం లేదని ప్రజలు తేల్చారు. -
‘కోట’లో కవిత
సాక్షి, కొత్తగూడెం: గిరిజనుల కోట అయిన మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కారు జోరు కొనసాగించింది. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం 2009లో ఆవిర్భవించగా ఒకసారి కాంగ్రెస్, మరోసారి టీఆర్ఎస్లు గెలుపొందగా, మూడోసారి ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత స్పష్టమైన ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్పై ఘన విజయం సొంతం చేసుకున్నారు. తొలి నుంచి మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇటీవల టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించడం, మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం, టీఆర్ఎస్ నాయకులు మాలోతు కవితకుఎంపీ టికెటు కేటాయించడంతో గతంలో కంటే మెజారిటీ గణనీయంగా పెరిగింది. ఎవరూ ఊహించని విధంగా మెజారిటీ కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో తొలి గిరిజన మహిళా ఎంపీగా విజయకేతనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి గిరిజన మహిళలకు ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించలేదు. దీంతో టీఆర్ఎస్ మహిళా జనాభా అధికంగా ఉన్న మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీలో నిలిచే అవకాశం మాలోతు కవితకు కల్పించడంతో తొలి గిరిజన మహిళా ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ విషయంలో నిరాశే ఎదురైనప్పటికీ పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉండడంతో ఆమెకు ఎంపీగా కేసీఆర్ అవకాశం కల్పించారు. కొత్త పాత నాయకుల సహకారంతోనే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఇల్లెందు, పినపాక, ములుగు, భద్రాచలం అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందే సీటుగా అందరూ భావిస్తూ వచ్చారు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఆకర్ష్తో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో కొత్త, పాత నాయకులను సమన్వయం చేస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తరచూ పార్లమెంటు పరిధిలో పర్యటించారు. అలాగే కేటీఆర్ రోడ్షో, కేసీఆర్ బహిరంగ సభ నిర్వహణతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం పెరిగింది. పాత, కొత్త తేడా లేకుండా అంతా కలిసికట్టుగా టీఆర్ఎస్ విజయం కోసం ముందుకు సాగారు. దీంతో అనూహ్యంగా గతంలో కంటే టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సాధించింది. భారీ ఆధిక్యతతో విజయం.. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత 1,46,663 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఈ లోక్సభ స్థానం పరిధిలో మొత్తం 9,83,535 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 801 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. మొత్తం ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 4,62,109 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్కు 3,15,446 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి జాటోత్ హుస్సేన్నాయక్కు 25,487, సీపీఐ అభ్యర్థి కల్లూరి వెంకటేశ్వరరావుకు 45,719 ఓట్లు పోలయ్యాయి. టీజేఎస్ అభ్యర్థి అరుణ్కుమార్కు 57,073 ఓట్లు రాగా, నోటాకు 14,082 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత మొదటి రౌండ్ నుంచి చివరి వరకు తన సమీప ప్రత్యర్థి బలరాంనాయక్పై ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చారు. చివరకు 1,46,663 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. -
‘నామా’స్తుతే..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కారు జోరు కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికలకన్నా టీఆర్ఎస్ ఓటింగ్ శాతం పెరగడంతో ఆ పార్టీ ప్రభంజనం సృష్టించింది. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన నామా.. 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకన్నా ఈసారి అత్యధికంగా రావడంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 8 గంటలకు తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో పటిష్టమైన బందోబస్తు మధ్య ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు రాగా..కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రధాన పార్టీల మధ్య ఫలితం దోబూచులాడుతుందనే రీతిలో కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి నెలకొని ఉండగా.. తొలిరౌండ్ ప్రారంభం నుంచి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. లోక్సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి రౌండ్ పూర్తయ్యేటప్పటికి టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సుమారు రూ.11వేల ఆధిక్యంతో ఉన్నారు. అదే ఆధిక్యం చివరి వరకు కొనసాగుతూ ప్రతి రౌండ్కు పెరుగుతూ వచ్చింది. తొలి మూడు, నాలుగు రౌండ్ల వరకు నామా నాగేశ్వరరావుకు, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి మధ్య సుమారు 20వేలలోపు ఓట్ల వ్యత్యాసం ఉండగా.. 6వ రౌండ్ నుంచి ఈ వ్యత్యాసం క్రమేణా పెరుగుతూ వచ్చింది. తొలి రౌండ్ ప్రారంభం కాగానే కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి రెండు రౌండ్లు పూర్తయ్యే వరకు కౌంటింగ్ సరళిని పరిశీలించి కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్కు మెజార్టీ.. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రతి రౌండ్లో మెజార్టీ లభించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడిందనడానికి లోక్సభ ఎన్నికల మెజార్టీయే నిదర్శనమని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు అత్యధిక మెజార్టీ పాలేరు నియోజకవర్గం నుంచి లభించగా.. స్వల్ప మెజార్టీ వైరా నియోజకవర్గం నుంచి లభించింది. పార్టీకి వివిధ వర్గాలు చేరువ కావడంతోపాటు ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేతలు టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకుని.. నామా విజయానికి చేసిన కృషి, నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడం వంటి కారణాలు సైతం పార్టీ మెజార్టీకి కారణంగా ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీ చేసిన నామా నాగేశ్వరరావు రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన ఇప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి పైనే 2009, 2019లో విజయం సాధించడం విశేషం. రేణుకా చౌదరి, నామా ప్రధాన ప్రత్యర్థులుగా ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీపడడం ఇది మూడోసారి. 2004లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావుపై రేణుకా చౌదరి విజయం సాధించగా.. 1999లో టీడీపీ అభ్యర్థి మద్దినేని బేబి స్వర్ణకుమారిపై రేణుకా చౌదరి విజయం సాధించారు. నామా గెలుపుతో ఖమ్మం లోక్సభ నియోజకవర్గంపై టీఆర్ఎస్ తొలిసారిగా పార్టీ ఎన్నికల గుర్తుపై పోటీ చేసి విజయ పతాకాన్ని ఎగుర వేసినట్లయింది. 2014 ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన టీఆర్ఎస్లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు టీడీపీలో ఉండి.. ఆ పార్టీ తరఫున కాంగ్రెస్ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు లోక్సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడమే కాకుండా ఆ పార్టీ ఖమ్మం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నామా నాగేశ్వరరావు విజయంపై టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక దృష్టి సారించడం.. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలు, పార్టీ ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్కుమార్, రాములునాయక్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయడంతోపాటు ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం వంటి కారణాలు టీఆర్ఎస్కు భారీ మెజార్టీ తెచ్చి పెట్టాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కౌంటింగ్ ప్రారంభమై నాలుగు రౌండ్లు పూర్తయ్యాక కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన నామా నాగేశ్వరరావు కౌంటింగ్ సరళిని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యాక నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్ల స్లిప్లను లెక్కించిన అనంతరం ఖమ్మం లోక్సభ ఎన్నికల ఫలితాన్ని కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఆర్వీ.కర్ణన్ అధికారికంగా ప్రకటించారు. విజయం సాధించిన నామా నాగేశ్వరరావుకు ఎన్నికల ధ్రువపత్రాన్ని అందజేశారు. -
ఆదిలాబాద్లో బీజేపీ బోణి
సాక్షి, ఆదిలాబాద్: ఐదు నెలలకే ఎంత మార్పు.. డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకొచ్చేసరికి ఢీలా పడిపోయింది. సిట్టింగ్ పార్లమెంట్ స్థానాన్ని కోల్పోయింది. గులాబీ కోటాలో కమలం వికసించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ బోణి కొట్టింది. టీఆర్ఎస్ రెండో స్థానంలో, కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచాయి. సోయం బాపురావు గెలుపు.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావును విజయం వరించింది. గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి 6వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైన బాపురావు తిరిగి లోక్సభ ఎన్నికల్లో పార్టీ మార్చి బరిలో నిలిచి విజయకేతనం ఎగరవేశారు. 2004లో టీఆర్ఎస్ నుంచి బోథ్ ఎమ్మెల్యేగా సోయం బాపురావు గెలిచారు. ఆ తర్వాత ఆయనకు రాజకీయంగా ఏ పదవి కలిసిరాలేదు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమం ద్వారా గత కొంతకాలంగా ప్రముఖంగా నిలిచారు. లోక్సభ ఎన్నికలకు ముందు నామినేషన్ల ఘట్టం సమయంలో ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరా రు. ఆ పార్టీ లోక్సభ అభ్యర్థిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. మొదటి రౌండ్ నుంచే హవా.. బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు మొదటి రౌండ్ నుంచే హవా కొనసాగింది. ప్రతీ రౌండ్కు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చారు. మధ్యలో టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్కు రౌండ్ పరంగా ఆధిక్యం వచ్చినా సోయం బాపురావుకు అంతకుముందు రౌండ్లలో వచ్చిన ఆధిక్యత ముందు అది బలాదూర్ అయిపోయింది. ఓ దశలో సోయం బాపురావుకు మెజార్టీ 70వేల నుంచి 80వేల వరకు చేరుకుంటుందని ఆ పార్టీ శ్రేణులు భావించారు. అయితే చివరి రౌండ్లలో కొంత ఆధిక్యత తగ్గింది. బీజేపీ మొదటి రౌండ్ నుంచే ఆధిక్యత కనబర్చడంతో టీఆర్ఎస్ నేతలు ముఖం చాటేశారు. కనీసం కౌంటింగ్ కేంద్రాలకు కూడా వారు రాకపోవడం గమనార్హం. సిట్టింగ్ స్థానం కోల్పోయిన టీఆర్ఎస్.. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గోడం నగేశ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ టిక్కెట్ పొందిన ఆయన గెలుపుపై నమ్మకం పెట్టుకున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, సిర్పూర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండటం, ఆసిఫాబాద్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన టీఆర్ఎస్లో కొనసాగుతున్న ఆత్రం సక్కు కూడా ఉండడంతో గెలుపుపై ధీమాతో మెలిగారు. అన్ని నియోజకవర్గాల్లో బలమైన కేడర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గత లోక్సభ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో 1లక్ష 12వేల ఓట్లు కోల్పోయారు. గుడ్డిలో మెల్ల.. కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్ మూడో స్థానంలో నిలిచినా గత ఎన్నికలకంటే ఆ పార్టీ అధిక ఓట్లు సాధించడం గుడ్డిలో మెల్లలాగ నిలిచింది. శాసనసభ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాథోడ్ రమేష్ ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్ చేతిలో ఓటమి చెందారు. ఈ పరిస్థితిలో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆయన ఉవ్విళ్లూరారు. అయితే పరిస్థితులు మాత్రం అనుకూలించలేదు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన రాథోడ్ రమేశ్ గత కొద్ది కాలంగా రాజకీయంగా పదవి లేకపోవడంతో ప్రభావం కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తిరిగి రాజకీయంగా బలపడుదామని ఆయన అనేక ఆశలు పెట్టుకున్నారు. అయితే అవి వమ్ము అయ్యాయి. బీజేపీ శ్రేణుల సంబరాలు.. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో భారతీయ జనతా పార్టీ బోణి కొట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పార్లమెంట్ స్థానం ఏర్పడినప్పటి నుంచి సోషలిస్ట్ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లు ప్రాతినిధ్యం వహించినా బీజేపీ ఇప్పటివరకు ఇక్కడ గెలవలేదు. అయితే ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ బలంగా ఉంది. అనేక మంది సీనియర్ నేతలు పార్టీలో కొనసాగుతున్నారు. ఈ గెలుపు ఆ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ పలుమార్లు పోటీ చేసినా గెలుపొందలేదు. తాజాగా సోయం బాపురావు గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో సంబరాలు జరుపుకున్నారు. పోలింగ్ వివరాలు.. మొత్తం ఓట్లు 14,88,353 పోలైన ఓట్లు 10,69,333 పోలింగ్ శాతం 71.45 అభ్యర్థులకు వచ్చిన ఓట్లు అభ్యర్థి పేరు వచ్చిన ఓట్లు సోయం బాపురావు 3,77,374 గోడం నగేశ్ 3,18,814 రాథోడ్ రమేశ్ 3,14,238 కుమ్రం వందన 8,007 దరావత్ నరేందర్నాయక్ 5,241 పవర్ కృష్ణ 2,705 భీంరావు 6,837 ఆరె ఎల్లన్న 3,019 కుమ్ర రాజు 4,388 గంట పెంటన్న 4,548 నేతావత్ రాందాస్ 5,521 నోటా 13,036 పార్టీల వారీగా వచ్చిన ఓట్లు సోయం బాపురావు బీజేపీ 3,77,374 గోడం నగేశ్టీఆర్ఎస్ 3,18,814 మెజార్టీ58,560(టీఆర్ఎస్పై బీజేపీ గెలుపు) రాథోడ్ రమేశ్ కాంగ్రెస్ 3,14,238 -
గులాబీదే పెద్దపల్లి
సాక్షి, మంచిర్యాల: పెద్దపల్లి లోక్సభస్థానాన్ని టీఆర్ఎస్ తిరిగి నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి బొర్లకుంట వెంకటేష్నేత తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్పై 63 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గురువారం చేపట్టిన ఓట్ల లెక్కింపుల్లో అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ ఆధిక్యతను కనపరిచింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ ఘన విజయాలు సొంతం చేసుకోవడం, ఒక్క పెద్దపల్లిలో మాత్రం చతికలపడడంపై కమలనాథులు అంతర్మథనం చెందుతున్నారు. టీఆర్ఎస్ విజయం పెద్దపల్లి లోకసభ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చి కూడా ఫలితాన్ని రాబట్టుకుంది. ఏప్రిల్ 11వ తేదీన మొదటి విడతలోనే తెలంగాణలో ఎన్నికలు జరగగా.. దేశవ్యాప్తంగా ఏడు విడతలుపూర్తయ్యాక గురువారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. పెద్దపల్లి లోకసభ స్థానం నుంచి టీఆర్ఎస్ నుంచి బొర్లకుంట వెంకటేశ్నేత, కాంగ్రెస్ నుంచి ఆగం చంద్రశేఖర్, బీజేపీ నుంచి ఎస్.కుమార్ పోటీపడ్డారు. 17 మంది పోటీలో ఉన్నప్పటికి, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పెద్దపల్లి లోక్సభ పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, రామగుండం, మంథని, పెద్దపల్లి, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీలోని జెఎన్టీయూ భవనంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. గురువారం రాత్రికి ఫలితం ప్రకటించారు. పార్టీ మార్పు.. దక్కిన ఫలితం జిల్లాకు చెందిన బొర్లకుంట వెంకటేశ్ నేత పార్టీ మారినా ఫలితం దక్కించుకున్నారు. ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారిగా ఉన్న వెంకటేశ్ నేత.. ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బాల్క సుమన్తో తలపడ్డారు. ఆ ఎన్నికల్లో ఓటమి అనంతరం అదే బాల్క సుమన్ సహకారంతో అనూహ్యంగా టీఆర్ఎస్లో చేరి లోకసభ అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. టీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఆయనకు బాగా కలిసొచ్చాయి. అప్పటికే ఎంపీ టికెట్ దాదాపు ఖాయమనుకున్న జి.వివేక్కు బాల్క సుమన్కు మధ్య పొరపొచ్చాలు రావడం అభ్యర్థి మార్పునకు బీజం పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపిస్తూ వివేక్కు టికెట్ రాకుండా చేయడంతోపాటు.. ప్రత్యామ్నయంగా వెంకటేశ్ నేతను పార్టీ నేతలు తెరపైకి తీసుకొచ్చారు. చివరి నిమిషంలో వెంకటేశ్ నేతను పార్టీలో చేర్చుకుని పార్టీ బీ–ఫారం అందజేశారు. ఎమ్మెల్యే కోసం ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన వెంకటేశ్ నేత అనూహ్యంగా పార్టీ మారి ఎంపీగా లోక్సభలో అడుగుపెడుతున్నారు. తగ్గిన మెజార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు సాధించిన టీఆర్ఎస్.. ఈ లోక్సభ ఎన్నికల్లో కాస్త వెనక్కి తగ్గింది. గత లోకసభ ఎన్నికలతో పోల్చితే ఈ సారి మెజార్టీ బాగా తగ్గింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ 2,91,158 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. అప్పటితో పోల్చితే ఇప్పుడు లోక్సభ పరిధిలో మంథని మినహా అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కాని వెంకటేశ్ నేతకు 63 వేల మెజార్టీ మాత్రమే వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి స్థానికేతరుడైనా మెజార్టీ తగ్గడాన్ని టీఆర్ఎస్ నేతలు పలువురు అంతర్గత సంభాషణల్లో ప్రస్తావిస్తున్నారు. కమలనాథుల్లో అంతర్మథనం ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నేతల పరిస్థితి విచిత్రంగా మారింది. ఓ వైపు పక్కనే ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో పార్టీ అభ్యర్థులు ఘన విజయాలు సాధిస్తే.. పెద్దపల్లిలో మాత్రం మూడో స్థానంలో, అది కూడా చాలా తక్కువ ఓట్లు సాధించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ గెలిచిన స్థానాల్లో పార్టీతోపాటు బలమైన అభ్యర్థులు ఉండడం కూడా కారణమైంది. పెద్దపల్లిలో కూడా బలమైన అభ్యర్థి పోటీలో ఉంటే విజయం తథ్యమయ్యేదని చెబుతున్నారు. టీఆర్ఎస్ టికెట్ దక్కని జి.వివేక్ను బీజేపీ నుంచి బరిలోకి దింపేందుకు పార్టీ పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేసినా.. అప్పట్లో ఫలించలేదు. ఒకవేళ వివేక్లాంటి అభ్యర్థి పోటీకి దిగితే కచ్చితంగా ఫలితం వచ్చేదని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఏదేమైనా పక్కనున్న మూడు నియోజకవర్గాల్లో బీజేపీ ఘన విజయం సాధించగా.. పెద్దపల్లిలో మాత్రం పాత కథే పునరావృతం కావడంతో ఊసురుమంటున్నారు. ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు బొర్లకుంట వెంకటేశ్ (టీఆర్ఎస్) 4,41,321 ఆగం చంద్రశేఖర్ (కాంగ్రెస్) 3,46,141 ఎస్.కుమార్ (బీజేపీ) 92,606 బొర్లకుంట వెంకటేశ్(టీఆర్ఎస్)మెజార్టీ 95,180 -
‘కమల’ వికాసం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కంచుకోట కరీంనగర్ స్థానం బీజేపీ వశమైంది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్కు చెందిన సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్పై 89,508 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత 2004 నుంచి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి ఇక్కడ రెండో ఓటమి కాగా, రెండుసార్లు వినోద్కుమారే ఓడిపోవడం గమనార్హం. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో 11,47,824 ఓట్లు పోల్ కాగా, విజేతగా నిలిచిన సంజయ్కి 4,98,276 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కు 4,08,768 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ 1,79,258 ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. నోటాకు 7,979 ఓట్లు రాగా, బీఎస్పీ, ఇతర రిజిస్టర్ పార్టీలు,స్వతంత్రులు ఎవరికీ డిపాజిట్ దక్కలేదు. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో గురువా రం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లను లెక్కించిన పోలింగ్ సిబ్బంది 28 రౌం డ్లపాటు లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లను లెక్కించారు. సంజ య్కుమార్ కరీంనగర్ ఎంపీగా విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రకటించారు. తొలి రౌండ్ నుంచే ఆధిక్యత కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా పోస్టల్ ఓట్ల లెక్కింపు నుంచి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యంలో కొనసాగారు. పోస్టల్ బ్యాలెట్లలో 814 ఓట్లు బీజేపీకి పోలు కాగా, 208 ఓట్లు టీఆర్ఎస్కు, 118 ఓట్లు కాంగ్రెస్కు పోలయ్యాయి. అనంతరం మొదలైన ఈవీఎం ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచే బండి సంజయ్ ఆధిక్యత కొనసాగింది. 19వ రౌండ్ నుంచి స్వల్పంగా మెజారిటీ తగ్గినప్పటికీ, ఆధిక్యత కొనసాగింది. నాలుగు అసెంబ్లీల్లో భారీ ఆధిక్యత కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగింట బీజేపీకి భారీగా ఓట్లు పోలయ్యాయి. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, మానకొండూరులలో టీఆర్ఎస్ కన్నా బీజేపీకి భారీ మెజారిటీ రావడంతో హుజూరాబాద్, హుస్నాబాద్లలో మూడో స్థానంలో నిలిచినప్పటికీ బీజేపీ ఆధిక్యత తగ్గలేదు. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంటులో పోలైన 1,92,614 ఓట్లకు గాను ఏకంగా 1,10,689 ఓట్లు(57.46 శాతం) సాధించిన బీజేపీ చొప్పదండి, మానకొండూరు, వేములవాడల్లో 50 శాతానికి పైగానే ఓట్లను సాధించడంతో విజయం నల్లేరు మీద నడకలా సాగింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో బీజేపీ కన్నా టీఆర్ఎస్ 5,713 ఓట్లు అదనంగా సాధించింది. సత్తా చాటుకున్న ఈటల కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ హుజూరాబాద్, హుస్నాబాద్లలోనే స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరువాత స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఉండడం గమనార్హం. మూడోస్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నిలిచారు. దీంతో కేవలం హుజూరాబాద్లోనే బీజేపీ కన్నా టీఆర్ఎస్ 50వేల పైచిలుకు ఓట్లు ఆధిక్యంలో నిలిచింది. ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ 77,211 ఓట్లు సాధించగా, బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం 25,176, కాంగ్రెస్కు 46,689 ఓట్లు లభించాయి. హుస్నాబాద్లో కాంగ్రెస్ రెండోస్థానంలో నిలిచినప్పటికీ, బీజేపీ కన్నా వెయ్యి ఓట్లే అధికంగా సాధించడం గమనార్హం. ఇక్కడ టీఆర్ఎస్ 66,885 ఓట్లు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 44,123, బీజేపీ 43,144 ఓట్లు సాధించాయి. ప్రభావం చూపని పొన్నం ప్రభాకర్ స్థానికుడిగా, మాజీ ఎంపీగా విజయం కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేక పోయారు. 2009లో కరీంనగర్ ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించిన పొన్నం ప్రభాకర్ తెలంగాణ సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అయినా 2014 ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తరువాత మూడో స్థానంలో నిలవడం గమనార్హం. అయినా ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన పొన్నం ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడా బీజేపీ, టీఆర్ఎస్లపై ఆధిక్యత ప్రదర్శించలేదు. హుజూరాబాద్, హుస్నాబాద్లలో రెండోస్థానంలో నిలవడంతో డిపాజిట్ దక్కింది. -
కవిత ఓటమికి కారణమదే: జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యేల అసమర్థత, నిర్లక్ష్యమే టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత ఓటమికి కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విశ్లేషించారు. గత ఎన్నికల సమయంలో ఆమె ఇచ్చిన హామీలను విస్మరించడం కూడా ఓటమికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. నిన్న వెలువడిన లోక్సభ ఫలితాల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవిత దారుణఓటమికి గురైన విషయం తెలిసిందే. అయితే కవిత ఓటమికి బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కే కారణమని టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై జీవన్ రెడ్డి స్పందించారు. వారి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకైతే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వచ్చిన ఓటుబ్యాంక్ ఎటుపోయిందని జీవన్రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల అసమర్థతే కవిత ఓటమికి కారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణి పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజా ప్రతినిధిగా కాకపోయిన.. ప్రజాసేవకురాలిగా కవితకు మంచి భవిష్యత్ ఉందని అన్నారు. నిజామబాద్ ఎంపీగా విజయం సాధించిన ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీలు దిశగా కార్యచరణ చేపట్టాలని సూచించారు. -
ఇద్దరి మధ్య దోబూచులాడిన గెలుపు
సాక్షిప్రతినిధి, నల్లగొండ/ సాక్షి,యాదాద్రి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నల్లగొండ నుంచి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గెలుపొందారు. నల్లగొండ స్థానం నుంచి అత్యధిక పర్యాయాలు విజయాలు సాధించిన రికార్డును.. కాంగ్రెస్ కాపాడుకుంది. ఆపార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి 25,682 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థివేమిరెడ్డి నర్సింహారెడ్డిపై విజయం సాధించారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఆయన అయిదోసారి విజయం సాధించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించగా.. ఒక్క హుజూర్నగర్లో మాత్రమే 7,466 ఓట్ల మెజారిటీతో ఉత్తమ్ కుమార్రెడ్డి గెలిచారు. కానీ, లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. టీఆర్ఎస్ కేవలం సూర్యాపేట, నల్లగొండ సెగ్మెంట్లలోనే కొంత మెజారిటీ సాధించగా, మిగిలిన కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడెం, నాగార్జున సాగర్, దేవరకొండ సెగ్మెంట్లలో ఆధిక్యం సాధించడంతో ఆపార్టీ గెలుపు సునాయాసమైంది. ఏడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ 5,25,508 ఓట్లు సాధించగా, టీఆర్ఎస్కు 5,00,120 ఓట్లు వచ్చాయి. పోస్టల్, ఇటì పీబీఎస్ ఓట్లు కాంగ్రెస్కు 520, టీఆర్ఎస్కు 226 పోలయ్యాయి. దీంతో మొత్తంగా కాంగ్రెస్కు 5,26,028, టీఆర్ఎస్కు 5,00,346 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్కుమార్రెడ్డి 25,682ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాగా, కాంగ్రెస్కు కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ అసెంబ్లీ సెగ్మంట్లలో 40,371 ఓట్లు ఆధిక్యం రాగా, టీఆర్ఎస్కు సూర్యాపేట, నల్లగొండ సెగ్మెంట్లలో 14,982ఓట్లు ఆధిక్యం మాత్రమే వచ్చింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇలా.. భువనగిరి లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ రెండోసారి కైవసం చేసుకుంది. గురువారం జరిగిన కౌంటింగ్లో ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్కు చెందిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్పై 5,219 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 16,27,527మంది ఓటర్లు ఉండగా 12,10,785మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి 5,32,795 ఓట్లు, బూర నర్సయ్యగౌడ్కు 5,27,576 ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీ అభ్యర్థి పీవీ శ్యామ్సుందర్రావుకు 65, 457, వామపక్షాల అభ్యర్థి గోద శ్రీరాములుకు 28,153 ఓట్లు వచ్చాయి. దీంతో భువనగిరి ఎంపీ స్థానాన్ని రెండోసారి కోమటిరెడ్డి సోదరులు కైవసం చేసుకున్నట్లయింది. 2009లో నూతనంగా ఏర్పాటైన భువనగిరి లోక్సభ స్థానాన్ని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడు ప్రస్తుత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తొలిసారిగా కైవసం చేసుకున్నాడు. 2014లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి విజయం సాధించింది. తొలిసారి ఎంపీ అయిన వెంకట్రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ నియోజకవర్గం నుంచి ఇటీవల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ భువనగిరి ఎంపీ స్థానం నుంచి గెలుపొంది తొలిసారి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 1994లో నల్లగొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2018వరకు శాసనసభ్యుడిగా నల్లగొండ ప్రజలకు సేవలందించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. తాజా లోక్సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో గతంలో పోగొట్టుకున్న ఎంపీ స్థానాన్ని కోమటిరెడ్డి కుటుంబం తిరిగి చేజిక్కించుకుంది. మూడుచోట్ల టీఆర్ఎస్ ఆధిక్యం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడుచోట్ల టీఆర్ఎస్, నాలుగు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యతను కొనసాగించాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన ఆలేరు, జనగామ, తుంగతుర్తిలో ఈసారి ఆధిక్యతను నిలబెట్టుకోగా భువనగిరి, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ మెజార్టీ సాధించింది. అలాగే మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ మెజార్టీ సాధించడం విశేషం. అలాగే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి తన నియోజకవర్గంలో ఆధిక్యతను సంపాదించారు. 2009లో కాంగ్రెస్ విజయం 2009లో ఏర్పాటైన భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విజయం సాధించారు. టీడీపీ బలపర్చిన సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,888ఓట్లతో ఆయన గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన చంద్రమౌళి 1,04,878ఓట్లు సాధించారు. డాక్టర్ల జేఏసీ చైర్మనగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. 3,05,44ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై విజయం సాధించారు. బూ నర్సయ్యగౌడ్కు 4,48,164ఓట్లు రాగా, రాజగోపాల్రెడ్డికి 417620 ఓట్లు వచ్చాయి. బీజేపీ–టీడీపీ కూటమి పక్షాన పోటీ చేసిన సీనియర్ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డికి 1,83,249ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీలో నాలుగు చోట్ల టీఆర్ఎస్, రెండుచోట్ల కాంగ్రెస్, ఒకచోట బీజేపీ ఆధిక్యత పొందాయి. ఇబ్రహీంపట్నంలో బీజేపీకి 6,348 ఓట్ల ఆధిక్యత వచ్చింది. టీఆర్ఎస్కు మునుగోడులో 11,538, భువనగిరిలో 10,012, ఆలేరులో 19,632, జనగామలో 22,084ఓట్ల మెజార్టీ రాగా, కాంగ్రెస్కు నకిరేకల్లో 9,059, తుంగతుర్తిలో 4,273ఓట్ల మెజార్టీ వచ్చింది. 2014లో జరిగిన ఎన్నికల్లో నకిరేకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గెలవగా, ఇక్కడ కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ వచ్చింది. తుంగతుర్తిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ గెలుపొందగా, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మెజార్టీ వచ్చింది. భువనగిరి పార్లమెంట్ గెలుపు ప్రజా విజయం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సాక్షి, యాదాద్రి : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గెలుపు ప్రజా విజయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. గురువారం పట్టణ శివారులోని అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ గెలుపు కేసీఆర్ పరిపాలనకు సమాధానంగా భావించాలన్నారు. గతంలో చేసిన పోరాటాలు గుర్తించి ప్రజలు తమకు విజయాలు అందించాలన్నారు. తక్కువ మెజార్టీ వచ్చినప్పటికీ ధర్మం, న్యాయం గెలిచిందన్నారు. ప్రజలు కోమటిరెడ్డి సోదరులను ఆదరిస్తున్నారన్నారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసినప్పటికీ టీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కేసీఆర్, కేటీఆర్కు బుద్ధి చెప్పినట్లయిందన్నారు. ఈనెల 31న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి లక్ష్మి గెలుపు ఖాయమని చెప్పారు. 27న జరిగే ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ అనంతరం మూడు జిల్లాల జెడ్పీ చైర్మన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్, టీఆర్ఎస్ సాధించిన ఓట్ల వివరాలు నల్లగొండ లోక్సభ స్థానం.. పోలైన ఓట్లు11,75,129 కాంగ్రెస్ 5,26,028 టీఆర్ఎస్ 5,00,346 కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్కుమార్రెడ్డి 25,682ఓట్ల ఆధిక్యంతో వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై విజయం సాధించారు భువనగిరి లోక్సభ స్థానం.. పోలైన ఓట్లు 12,11,156 కాంగ్రెస్ 5,32,031 టీఆర్ఎస్ 5,27,235 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి 4,796 ఓట్ల మెజార్టీతో డాక్టర్ బూర నర్సయ్యగౌడ్పై గెలుపొందారు. భిన్నమైన తీర్పు ఆలేరు : పార్లమెంట్ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గంలో ఓటర్లు భిన్నమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి..టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్పై గెలుపొందారు. నియోజకవర్గంలో వెంకట్రెడ్డికి 72063 ఓట్లు రాగా, బూర నర్సయ్యగౌడ్కు 82223 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో 10,160 ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి మెజార్టీ లభించింది. ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థికి భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రస్తుత ఎమ్మెల్యే గొంగిడి సునీత విస్తృతంగా ప్రచారం చేశారు. ఇది ఇలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్పై 33,086 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. సునీతకు 94,870 ఓట్లు రాగా, భిక్షమయ్యకు 61,784 ఓట్లు లభించాయి. బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన రాంచంద్రారెడ్డికి 11923 ఓట్లు లభించాయి. -
గులాబీ కోటలో విరిసిన కమలం
నిజామాబాద్ ఎంపీగా సాధించిన విజయాన్ని నియోజకవర్గ పరిధిలోని యువకులందరికీ అంకితమిస్తున్నాను. విజయాన్ని ఇందూరు ప్రజలు అందించారు. ఓటర్లందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. యువత వేసిన పునాది మీదే విజయం సాధ్యమైంది. పార్టీ, మోదీ, నాపై అభిమానం చూపి ప్రజలు ఓట్లేసి గెలిపించారు.– విజయానంతరం మీడియాతో బీజేపీ అభ్యర్థి అర్వింద్ సాక్షిప్రతినిధి, నిజామాబాద్: గులాబీ కోటలో కమలం వికసించింది. ఇందూరు పార్లమెంట్ స్థానంపై కాషాయం జెండా ఎగిరింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. ఇందూరు ఎంపీ నియోజకవర్గం చరిత్రలో తొలిసారిగా బీజేపీ పాగా వేసింది. సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై అర్వింద్ 70, 875 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అర్వింద్ 4,80,584 (45.22 శాతం) ఓట్లు సాధించగా, కవితకు 4,09,709 (38.55 శాతం) ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కికి కేవలం 69,240 (6.52 శాతం) ఓట్లు వచ్చాయి. ఆయనకు డిపాజిట్ దక్కకపోవడం గమనార్హం. బీజేపీ విజయం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. పార్లమెంట్ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన విషయం విదితమే. 43 రోజుల ఉత్కంఠకు తెర దించుతూ గురువారం ఓట్ల లెక్కింపు జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు డిచ్పల్లి మండలం సుద్దపల్లిలోని సీఎంసీలో జరిగింది. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించారు. గంటల నుంచి ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. రైతు అభ్యర్థులకు.. పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని, ఎర్రజొన్నకు కనీస మద్దతు ధర కల్పించాలనే తమ సమస్య దేశం దృష్టిని ఆకర్శించేందుకు పసుపు రైతులు బరిలోకి దిగిన విషయం విదితమే. మొత్తం 182 మంది అ«భ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిందరికి కలిపి 94,353 ఓట్లు వచ్చాయి. భారీగా పోస్టల్ ఓట్లు తిరస్కరణ ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులు వేసే పోస్టల్ ఓట్లు భారీగా తిరస్కరణకు గురికావడం గమనార్హం. మొత్తం 1,560 పోస్టల్ ఓట్లకు గాను, 414 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. బీజేపీకి 836 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు 228 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 67, ఇతరులకు 15 పోస్టల్ ఓట్లు వచ్చాయి. దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో బరిలో మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న విషయం విదితమే. సంబురాల్లో బీజేపీ శ్రేణులు.. బీజేపీ ఘన విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. నగరంలోని నిఖిల్సాయి చౌరస్తాలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. దేశ వ్యాప్తంగా కూడా బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా టపాసులు కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సహాల్లో మునిగితేలారు. మొరాయించిన ఈవీఎంలు.. ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల ఈవీఎంలు మొరాయించడంతో కౌంటింగ్కు కాస్త అంతరాయం కలిగింది. బాల్కొండ నియోజకవర్గం పరిధిలో ఆరు ఈవీఎంలు మొరాయించినట్లు సమాచారం. అలాగే బోధన్, నిజామాబాద్ రూరల్లలో రెండు, మూడు పోలింగ్ కేంద్రాల ఈవీఎంలు సతాయించాయి. సాంకేతిక సిబ్బంది సరి చేయడంతో లెక్కింపు కొనసాగింది. ఐదు అసెంబ్లీసెగ్మెంట్లలో ఆధిక్యం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడింటిలో ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆర్మూర్ నియోజకవర్గంలో అత్యధికంగా బీజేపీకి 31,588 ఓట్ల మెజారిటీ వచ్చింది. నిజామాబాద్ రూరల్లో 13,185 ఓట్లు, బాల్కొండలో 11,731 ఓట్లు, కోరుట్లలో 20,022 ఓట్లు, జగిత్యాలలో 7,320 ఓట్ల ఆధిక్యం సాధించింది. నిజామాబాద్ అర్బన్, బోధన్ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ కంటే స్వల్ప మెజారిటీ తగ్గింది. మొత్తం మీద 70 వేలపైచిలుకు మెజారిటీ దక్కింది. రాత్రి వరకు కొనసాగిన లెక్కింపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ఫలితం ఆలస్యమైంది. విజయం సాధించిన అర్వింద్ ధర్మపురికి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.ఆర్.ఎం.రావు ధ్రువీకరణ పత్రాన్ని అందజేయనున్నారు. డిపాజిట్ గల్లంతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్కు డిపాజిట్ గల్లంతైంది. డిపాజిట్ దక్కాలంటే పోలైన మొత్తం ఓట్లలో 1/6వ వంతు ఓట్లు రావాల్సి ఉంటుంది. కానీ ఈ మేరకు ఓట్లు రాలేదు. వచ్చిన ఓట్లు69,240(6.52 శాతం) పోరాడి ఓడి.. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పోరాడి ఓడారు. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చారు. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ కంటే ఆధిక్యం సాధించారు. అలాగే బోధన్ అసెంబ్లీ స్థానంలోనూ టీఆర్ఎస్కు లీడ్ వచ్చింది. మిగిలిన నియోజకవర్గాల్లో కవిత నువ్వా..నేనా.. అన్నట్లుగా పోటీ పడ్డారు. వచ్చిన ఓట్లు4,09,709(38.55 శాతం) అర్వింద్కు వచ్చిన ఓట్లు 4,80,584 (45.22 శాతం)70, 875 ఓట్ల మెజారిటీ -
కారు.. జోరు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉద్యమాల ఖిల్లా.. ఉమ్మడి వరంగల్ జిల్లా జనం మళ్లీ గులాబీ జెండాకే జైకొట్టారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరులూదిన ఈ జిల్లా లోక్సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కే పట్టం కట్టింది. రాజకీయ ఉద్ధండుల కోటగా పేరొందిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి కూడా కారు జోరు కొనసాగించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం రెండు లోక్సభ స్థానాలు ఉండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు కలుపుకుని 14 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఈ ఎన్నికల్లోటీఆర్ఎస్కు 14 చోట్ల కూడా భారీ ఆధిక్యం లభించింది. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వరంగల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 3,50,298 ఓట్ల గణనీయమైన మెజార్టీ సాధించారు. ఇక మహబూబాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్పై 146663 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. టీఆర్ఎస్ నేతల విజయ విహారం వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు మొదటి నుంచి ఆధిక్యం కొనసాగించారు. ప్రత్యర్థులను దరిదాపుల్లోకి రాకుండా రౌండ్ రౌండ్కు మెజార్టీ పొం దారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో వరంగల్ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఈ స్థానం నుంచి 2009లో సిరిసిల్ల రాజయ్య(కాంగ్రెస్) ఎంపీగా గెలుపొందగా, 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కడియం శ్రీహరి 3,92,574 ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి 4,59,403 ఓట్ల మెజార్టీతో గెలు పొంది రికార్డు నెలకొల్పారు. కాంగ్రెస్, టీడీపీకి కంచుకోటగా ఉన్న వరంగల్ నుంచి వరుసగా రెండు సార్లు భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్... ఈ ఎన్నికల్లోనూ విజయపతాకం ఎగురవేసింది. అయితే ఈసారి పోలింగ్ శాతం తగ్గినప్పటికీ... 3,50,289 ఓట్ల ఆధిక్యం సాధించిన దయాకర్ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా రికార్డులకెక్కారు. మానుకోటలో.. 2009లో చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనలో మహబూ బాబాద్(ఎస్టీ) లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి గతంలోని వరంగల్ పార్లమెంట్ స్థానంలోని మహబూబాబాద్(ఎస్టీ), డోర్నకల్(ఎస్టీ), ములుగు(ఎస్టీ), నర్సంపేట(జనరల్) అసెంబ్లీ నియోజకవర్గాలు, రద్దయిన భద్రాచలం(ఎస్టీ) లోక్సభ స్థానంలోని పినపాక(ఎస్టీ), ఇల్లందు(ఎస్టీ), భద్రాచలం(ఎస్టీ) వచ్చి చేరాయి. ఈ స్థానం నుంచి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన పోరిక బలరాం నాయక్కు కేంద్రమంత్రి పదవి దక్కగా.. ఆయనపై 2014 ఎన్నికల్లో ప్రొఫెసర్ సీతారాంనాయక్ టీఆర్ఎస్ అభ్యర్థిగా 34,992 ఓట్ల ఆధిక్యంతో గెలు పొందారు. ఈ ఎన్నికల్లో అదే కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్పై మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత 1,46,663 ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు సాధించడం విశేషం. ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడి కావడంతో 43 రోజుల ఉత్కంఠకు తెరపడినట్లయింది. పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచి ఫలితాల కోసం ఇటు నేతలు, అటు ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇక గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. పోస్టల్, ఈటీపీబీఎస్(ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్) ఓట్లు.. ఆ తర్వాత ఈవీఎంలు, అనంతరం వీవీ ప్యాట్లలోని స్లిప్లను లెక్కించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ లోక్సభ పరిధిల్లో ఏడు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్లో ఏనుమాముల మార్కెట్, మహబూబాబాద్లో సాంఘిక సంక్షే మ బాలికల గురుకుల కళాశాలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు చేపట్టగా ప్రశాతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు స్ట్రాం గ్ రూమ్లో ఉన్న ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓట్లను 14 టేబుళ్లలో లెక్కించారు. వరంగల్ పరిధిలో భూపాలపల్లిలో అత్యధికంగా 24, అత్యల్పంగా వరంగల్ తూర్పులో 16 రౌండ్లలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించారు. అదే విధంగా మానుకోట పరిధిలో అత్యధికంగా ములుగులో 22, అతి తక్కువగా భద్రాచలం నియోజకవర్గంలో 13 రౌండ్లలో లెక్కించాక అధికారులు ఫలితాలను ప్రకటించారు. కాగా, వీవీ ప్యాట్ల విషయంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు చొప్పున లాటరీ పద్ధతిన ఎంపిక చేసి లెక్కించారు. దీనికి అరగంట నుంచి గంట సమయం పట్టింది. కాగా ఎన్నికల ఫలితాలు తెలుసుకోవడానికి ఈసారి సువిధ యాప్ను అందుబాటులోకి తీసుకు రాగా, ఫలితాలను రౌండ్ల వారీగా అధికాకారులు అప్డేట్ చేశారు. ‘ఎర్రబెల్లి’ సూచనలతో ముందుకు.. లోక్సభ ఎన్నికలకు ముందు మంత్రి పదవి చేపట్టిన ఎర్రబెల్లి దయాకర్రావు కృషి ఫలించింది. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల భారీ విజయం సాధించడానికి ఆయన పన్నిన వ్యూహం కలిసొచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక్క ఎర్రబెల్లికే మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం కేసిఆర్.. జిల్లాకు చెందిన రెండు లోక్సభ స్థానాలను గెలిపించాల్సిన బాధ్యతను ఆయన భుజస్కందాలపై ఉంచారు. నాటి నుంచి పలు నియోజకవర్గాల్లో పర్యటించి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు, నాయకులను కలుపుకుని పర్యటనలు చేశారు. పలు నియోజకవర్గాల్లో పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్మలాటలను సద్దుమణిగేలా చేయగలిగారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గినా.. వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని దయాకర్రావు తన రాజకీయ అనుభవంతో రాష్ట్రంలోనే మెజార్టీలో అగ్రస్థానంలో నిలుపగలిగారు. ఇక మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలోనూ విస్తృతంగా పర్యటించిన ఆయన పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి విజయానికి కృషి చేశారు. నాటి వరంగల్.. నేటి మహాబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ, ఎవరికి రాని మెజార్టీ సాధించడం వెనుక మంత్రి కృషి ఉందని చెప్పాలి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలోని అంతర్గత విభేధాలతో ములుగు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పరాజయం పొందడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా జాగ్రత్తలు చేపట్టారు. పార్టీ నాయకుల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేసి మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా కృషి చేశారు. ఈ ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయాన్ని సాధించేలా మంత్రాంగం నడిపిన ఎర్రబెల్లి దయాకర్రావు ప్రత్యేక గుర్తింపు పొందారు. కేసీఆర్ పథకాలతోనే గెలుపు తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే నా గెలుపునకు సహకరించాయి. మంత్రి దయాకర్రావుతో పాటు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలందరూ నా విజయం కోసం అహర్నిశలు శ్రమించారు. వారితో పాటు నాకు ఓటు వేసిన ప్రజలందరికీ రుణపడి ఉంటా. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్పై ప్రత్యేక దృష్టి సారించడంతో అత్యధిక మెజార్టీ సాధించడానికి దోహదపడింది. – పసునూరి దయాకర్, వరంగల్ ఎంపీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. మహబూబాబాద్: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చిన ప్రజలు నన్ను గెలిపించారు. టీఆర్ఎస్ హయాంలో అమలవుతున్న పథకాలే నా విజయానికి దోహదపడ్డాయి. మంత్రి దయాకర్రావు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల సహకారం మరువలేనిది. నన్ను గెలిపించిన ప్రజల సమస్యలు పరిష్కరించేలా అందుబాటులో ఉంటా.– మాలోతు కవిత, మహబూబాబాద్ ఎంపీ వరంగల్ లోక్సభ స్థానం మొత్తం ఓట్లు : 16,66,085 పోలైన ఓట్లు : 10,61,672 విజేత : పసునూరి దయాకర్ (టీఆర్ఎస్) సాధించిన ఓట్లు : 6,12,498 రెండో స్థానం : దొమ్మాటి సాంబయ్య(కాంగ్రెస్) సాధించిన ఓట్లు : 2,62,200 టీఆర్ఎస్ ఆధిక్యం : 3,50,298 మహబూబాబాద్ లోక్సభ మొత్తం ఓట్లు : 14,24,385 పోలైన ఓట్లు : 9,83,708 విజేత : మాలోతు కవిత (టీఆర్ఎస్) సాధించిన ఓట్లు : 4,62,109 రెండో స్థానం : పోరిక బలరాంనాయక్ (కాంగ్రెస్) సాధించిన ఓట్లు : 3,15,446 టీఆర్ఎస్ ఆధిక్యం : 1,46,663 -
వేములవాడలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు
సాక్షి, సిరిసిల్ల : కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ శుక్రవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వేములవాడ చేరుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్డీఏ తరఫున 351 మంది సభ్యులు అధికారంలోకి రావడంతో.. 351 కోడెలను కట్టి రాజన్న మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు బండి సంజయ్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. ప్రజల తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేద ప్రజల కోసం పని చేస్తానని అన్నారు. రాజన్న ఆశీస్సులతోనే తాను గెలిచానని తెలిపిన ఆయన.. ఆలయ అభివృద్ధి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భాగస్వామ్యం అవుతానని.. అందరితో కలిసి ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని తెలిపారు. బీజేపీ ఎటువంటి అవకాశం ఇచ్చినా పని చేస్తానని పేర్కొన్నారు. -
నాలుగు జెండాలాట
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈసారి ‘నాలుగు స్తంభాలాట’ కనిపించింది. గ్రేటర్పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. హైదరాబాద్లో ఎంఐఎం, సికింద్రాబాద్లో బీజేపీ, మల్కాజిగిరిలో కాంగ్రెస్, చేవెళ్లలోటీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆద్యంతం అనేక మలుపులు తిరుగుతూ అందరినీ ఉత్కంఠకు గురి చేసింది. ముఖ్యంగా మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ స్థానాల్లో మెజారిటీ ఒక్క రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థిని వరిస్తే, మరో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది. మొత్తంగా చూస్తే హైదరాబాద్లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ, సికింద్రాబాద్లో బీజేపీ అభ్యర్థి జి.కిషన్రెడ్డి, మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎ.రేవంత్రెడ్డి, చేవెళ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్రెడ్డిలు లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. గడిచిన శాసనసభ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో నగర ఓటర్లు విభిన్న తీర్పునివ్వటం విశేషం. హైదరాబాద్ లోక్సభలో ఎంఐఎం సహజ ఓటు బ్యాంక్తోనే మళ్లీ విజయబావుటా ఎగరేయగా, శాసనసభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని బీజేపీ, కాంగ్రెస్లు సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్సభ స్థానాల్లో మళ్లీ గత వైభవాన్ని సాధించాయి. 2014లో చేవెళ్ల లోక్సభ స్థానాన్ని గెలిచిన టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. లోక్సభకు ముగ్గురు కొత్తే... నగరం నుండి లోక్సభకు ఎన్నికైన నలుగురిలో ముగ్గురు కొత్తవారే. హైదరాబాద్ నుండి విజయం సాధించిన అసదుద్దీన్ ఇప్పటికే పలుమార్లు ఎన్నికవగా, సికింద్రాబాద్ స్థానం నుండి విజయం సాధించిన కిషన్రెడ్డి, మల్కాజిగిరి నుండి విజయం సాధించిన రేవంత్రెడ్డిలు లోక్సభకు కొత్తే. వీరిద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేసినా ఎంపీగా పోటీ చేసిన తొలిసారే లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక చేవెళ్లలో విజయం సాధించిన డాక్టర్ రంజిత్రెడ్డి రాజకీయాలకే పూర్తిగా కొత్త. మొత్తంగా చూస్తే మహానగర ప్రజలు నాలుగు లోక్సభ పరిధిలో నాలుగు పార్టీలు, నలుగురు విభిన్న వ్యక్తిత్వం కలిగిన వారిని లోక్సభకు పంపి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. -
హైదరాబాద్పై ఎగిరిన ‘పతంగి’
సాక్షి,సిటీబ్యూరో: అందరూ అనుకున్నట్టే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంపై మజ్లిస్ పార్టీ మరోసారి తన జెండా ఎగురవేసింది. ఎంపీగా అసదుద్దీన్ ఒవైసీ తిరిగి ఎన్నికయ్యారు. దీంతో వరసగా ఆయన నాలుగోసారి ఎన్నికయ్యారు. ఈ లోక్సభ స్థానంలో మజ్లిస్ వరసగా పదిసార్లు విజయదుందుభి మోగిస్తూ వస్తోంది. 1984 ఎన్నికలతో మజ్లిస్ శకం ప్రారంభమైంది. అప్పటి నుంచి వరసగా సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఆరుసార్లు ఎన్నికవగా, తర్వాత ఆయన వారసుడిగా అసదుద్దీన్ ఒవైసీ తాజాగా ఎన్నికతో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆ పార్టీకి కొంత మెజార్టీ తగ్గింది. వికసించని ‘కమలం’ హైదరాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ హిందుత్వ ఎజెండాతో గట్టిపోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా లక్ష్యం చేరుకోలేకపోతోంది. ప్రతిసారి ఎన్నికల్లో హేమాహేమీలను రంగంలోకి దింపి విజయావకాశాల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. ఆదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసంఘ్ అభ్యర్థిగా ఆలే నరేంద్ర బరిలో దిగి కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయం చేజిక్కించుకోలేక పోయారు. టీడీపీ ఆవిర్భావం అనంతరం మిత్రపక్షం కారణంగా బీజేపీకి పోటీ చేసే అవకాశం దక్కలేదు. తర్వాత బీజేపీ పక్షాన బద్దం బాల్రెడ్డి బరిలోకి దిగిగట్టి పోటీ ఇచ్చినప్పటికి ఓటమి తప్పలేదు. ఒకసారి పార్టీ అగ్రనేత ఎం. వెంకయ్యనాయుడు ఎన్నికల బరిలోకి దిగినా కేవలం ప్రత్యర్థిగా పరిమితం కావల్సి వచ్చింది. తర్వాత వరసగా రెండు పర్యాయాలు తిరిగి బద్దం బాల్రెడ్డి పోటీ చేసినా ఓటమే మిగిలింది. అనంతరం సుభాష్ చంద్రాజీ, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యదర్శి డాక్టర్ భగవంతరావులను ఎన్నికల బరిలోకి దింపినా ఫలితం దక్కలేదు. ఇక టీడీపీ కూడా ఇక్కడ పరాభవమే ఎదురైంది. రెండు ఎన్నికల్లో టీడీపీ పక్షాన సియాసత్ ఉర్దూ పత్రిక ఎడిటర్ జహిద్ అలీఖాన్ గట్టి పోటీ ఇచ్చినా రెండో స్థానానికి పడిపోయారు. వాస్తవంగా టీడీపీ ఆవిర్భావం నుంచి వరసగా రెండు పర్యాయాలు బీజీపీ మద్దతుతో లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగినా పరాజయమే మిగిలింది. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ నుంచి నామమాత్రపు పోటికే పరిమితమైంది. మొన్నటి వరకు మజ్లిస్కు దెబ్బపడకుండా బలహీన అభ్యర్థిని రంగంలోకి దింపినా కాంగ్రెస్ ఈసారి గట్టి అభ్యర్థిని పోటీకి దింపినా పరాభవమే మిగిలింది. హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఇలా.. ఎన్నికలు విజేత పార్టీ సమీప ప్రత్యర్ధి పార్టీ విజేత మెజార్టీ 2004 అసదుద్దీన్ మజ్లిస్ సుభాష్ చందాజీ బీజేపీ 100145 2009 అసదుద్దీన్ మజ్లిస్ జహిద్అలీఖాన్ టీడీపీ 113865 2014 అసదుద్దీన్ మజ్లిస్ డాక్టర్ భగవంతరావు బీజేపీ 302454 2019 అసదుదీన్ మజ్లిస్ డాక్టర్ భగవంతరావు బీజేపీ 2,82187 -
మల్కాజిగిరిలో కాంగ్రెస్ విజయం
సాక్షి,మేడ్చల్జిల్లా: మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎనుముల రేవంత్రెడ్డి విజయం సాధించారు. సమీప టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డిపై 10,919 ఓట్ల మోజారిటీతో గెలుపున ‘హస్త’గతం చేసుకున్నారు. దేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 31,49,710 ఓట్లుండగా ఇందులో 15,63,063 (2,955) పోస్టల్ బ్యాలెట్ కలుపుకుని) ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డికి 6,03,748 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్రెడ్డికి 5,92,829 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచందర్రావుకు 3,04,282 ఓట్లు వచ్చాయి. మల్కాజిగిరి ఓటర్లు ప్రతి ఎన్నికల్లోనూ విలక్షణమైన తీర్పునిస్తారన్న నానుడి ఉంది. ఒకసారి గెలిచిన పార్టీకి మరోసారి అవకాశమివ్వడం లేదు. 2009లో తొలిసారి ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు పట్టం గట్టగా, 2014లో బీజేపీ మద్ధతుతో టీడీపీ విజయం సాధించింది. మల్కాజిగిరి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపుపై కార్యకర్తలు, కేడర్ ఉత్సహంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవడం ఇది రెండోసారి. మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ మెజారిటీ మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎల్బీనగర్, మల్కాజిగిరి, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి రౌండు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్రెడ్డి అధిక్యత చాటారు. ఎల్బీనగర్లో 29 వేలు మోజారిటీ రాగా, మల్కాజిగిరిలో 10 వేలు, ఉప్పల్లో దాదాపు 9 వేల మోజారీని కాంగ్రెస్ సాధించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో వచ్చిన మోజారిటితోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మోజారిటీని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ లోక్సబ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా చతికిలపడింది. నాలుగింటిలో టీఆర్ఎస్కు సల్ప అధిక్యత ఈ సెగ్మెంట్లోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ సల్ప అధిక్యతను సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీతో పోలిస్తే ఇది చాలా సల్పమే. మేడ్చల్లో 9 వేలు, కుత్బుల్లాపూర్లో 10 వేలు, కంటోన్మెంట్లో 12,500, కూకట్పల్లిలో 6 వేల సల్ప అధిక్యతను టీఆర్ఎస్ ప్రదర్శించింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మేడ్చల్ నియోజకవర్గంలో 88 వేల మోజారిటీ రాగా, లోక్సబ ఎన్నికల్లో 9 వేలే రావడంపై తీవ్ర చర్చ సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్లు ఇలా.. అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు రేవంత్రెడ్డి కాంగ్రెస్ 6,03,748 మర్రి రాజశేఖర్రెడ్డి టీఆర్ఎస్ 5,92,829 రామచందర్రావు బీజేపీ 3,04,282 మహేందర్రెడ్డి జనసేన 28,420 చామకూర రాజయ్య సోషల్ జస్టిస్ పార్టీ 1351 డి.భానుమూర్తి ప్రజాసత్తా పార్టీ 720 బి.బాలమణి ఇండియా ప్రజా బంధు 1236 నోటా 17,895 -
లష్కర్ గుండెపై కమలం జెండా
సాక్షి,సిటీబ్యూరో: లష్కర్ లోక్సభ స్థానంపై కాషాయ జెండా మరోమారు జయకేతనం ఎగురవేసింది. సీనియర్ నేతను బరిలో నిలిపి సిట్టింగ్ సీటును ఆ పార్టీ భారీ మెజార్టీతో నిలబెట్టుకుంది. బీజేపీ అభ్యర్థి గంగాపురం కిషన్రెడ్డి సమీప టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్పై 62,114 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. అయితే 2014 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన బండారు దత్తాత్రేయ 2.54 లక్షల ఓట్ల మెజార్టీ సాధించిన విషయం విదితమే. ఈ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ తగ్గినప్పటికీ గెలుపు తీరాన్ని చేరుకుంది. నాంపల్లి మినహా ఈ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ముషీరాబాద్, సికింద్రాబాద్, అంబర్పేట్, సనత్నగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో బీజేపీ హవా కనిపించింది. ఈ స్థానం నుంచి గెలుపొందిన కిషన్రెడ్డి గతంలో బీజేపీ శాసన సభాపక్ష నేతగా, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా, గతంలో బీజేవైఎం అఖిల భారత అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయనకు బీజేపీ శ్రేణులతోపాటు అన్ని నియోజకవర్గాల్లో విద్యావంతులు, మేధావులు, మహిళలు, మైనార్టీలు భారీగా ఓట్లు వేయడంతో విజయం నల్లేరు మీద నడకైంది. గతంలో ఆయన ప్రాతినిథ్యం వహించిన అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవ్గంలో ఆయన ఏకంగా టీఆర్ఎస్ పార్టీ కంటే 45 వేల పైచిలుకు ఓట్ల అధిక్యం సాధించడం విశేషం. ముషీరాబాద్లోనూ టీఆర్ఎస్ కంటే 35 వేల పైచిలుకు ఓట్లను అధికంగా సాధించారు. సికింద్రాబాద్లో 8 వేలకుపైగా అధికంగా ఓట్లు సాధించారు. జూబ్లీహిల్స్లోనూ టీఆర్ఎస్ కంటే బీజేపీ 24 వేల ఓట్లు అధికంగా సాధించింది. సనత్నగర్ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ కంటే బీజేపీ 14 వేల పైచిలుకు ఆధిక్యాన్ని కనబరిచింది. నాంపల్లి నియోజకవర్గంలో మాత్రం బీజేపీ కంటే టీఆర్ఎస్ 30 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యం దక్కడం గమనార్హం. ఈ ఎన్నికల్లో మోడీ ప్రభంజనంతో పాటు ఈ నియోజకవర్గం పరిధిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేవైఎం తదితర సంఘాలకు సంస్థాగతంగా గట్టి పట్టుంది. ఆయా సంస్థల కార్యకలాపాలకు దశాబ్దాలుగా పలు అసెంబ్లీ సెగ్మెంట్లు పెట్టని కోటగా ఉన్నాయి. బీజేపీ అభివృద్ధి నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లడంలో ఆ పార్టీ శ్రేణులు విజయం సాధించాయనే చెప్పవచ్చు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్కు రాజకీయ అనుభవం లేకపోవడం, అతని తండ్రి ఇప్పటికే మంత్రిగా కొనసాగుతండడంతో ఆ కుటుంబానికే తిరిగి ఎంపీ సీటును కట్టబెట్టడం గులాబీ పార్టీ శ్రేణులకు సైతం రుచించలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడుల నేపథ్యంలో దేశ సమగ్రత, భద్రతకు మోదీ సర్కారు పెద్దపీఠ వేస్తుందన్న నమ్మకంతో మెజార్టీ సిటీజన్లు కమలం పార్టీకి ఓట్లు వేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా వ్యాపారులు, ఉత్తరాది ఓటర్లు అత్యధికంగా ఉండే ఈ లోక్సభ నియోజకవర్గంలో ఆయా వర్గాలు బీజేపీకి ఓట్లు వేశాయన్నది కిషన్రెడ్డి గెలుపుతో రూఢీ అయింది. రౌండ్ రౌండ్కు పెరిగిన కిషన్రెడ్డి ఆధిక్యత :14 టేబుళ్లు, 20 రౌండ్లలో లెక్కింపు ముషీరాబాద్: సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. నియోజకవర్గంలో పోలైన 1,39,002 ఓట్లను 14 టేబుళ్లపై 20 రౌండ్లలో లెక్కించారు. ఇందులో బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డికి 65,969 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్కు 41,564 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఎం.అంజన్కుమార్ యాదవ్కు 26,554 ఓట్లు పోలయ్యాయి. కిషన్రెడ్డి తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థిపై నియోజకవర్గంలో 24,395 ఓట్లు అధిక్యాన్ని సాధించారు. మొత్తం 20 రౌండ్లలో 18 రౌండ్లలో బీజేపీ అధిక్యత సాధించగా 8, 9 రౌండ్లలో టీఆర్ఎస్ అధిక్యతను చూపించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏ రౌండ్లోనూ పోటీ ఇవ్వకుండా మూడో స్థానానికి పరిమితమైంది. -
పీసీసీ చీఫ్గా పులులు అవసరం లేదు..
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తామని తాము భావించామని, అయితే మూడు స్థానాల్లో గెలుపొందినా తాము సేఫ్ జోన్లో ఉన్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ 4 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందడం వల్ల తమకేమీ నష్టం లేదని, టీఆర్ఎస్ మాత్రం డేంజర్ జోన్లో పడిందని ఆయన చెప్పారు. గురువారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని, ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్ల రూపంలో మూడు పులులు విజయం సాధించాయని చెప్పారు. బీజేపీ గెలుపుతో రాష్ట్రంలో తమకు నష్టమేమీ లేదని, ప్రస్తుతం రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు 2023లో మూడు పార్టీల మధ్య జరుగుతాయని అన్నారు. భవిష్యత్తులో తమ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లబోరని, టీఆర్ఎస్ నేతలే బీజేపీలోకి వెళతారని చెప్పారు. నల్లగొండ ఎంపీగా ఉత్తమ్ గెలుపొందడం ద్వారా ఖాళీ అయ్యే హుజూర్నగర్ అసెంబ్లీ స్థానంలో కూడా తాము విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు పులులు అవసరం లేదని, వేద మంత్రాలు చదివే సాత్వికులు కావాలని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. -
కారు స్పీడ్ తగ్గింది!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్.. లోక్సభ ఎన్నికల్లోనూ ఆ దూకుడు కొనసాగించలేకపోయింది. కేవలం 9 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిజామాబాద్ లోక్సభ స్థానంలో కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి చెందడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. మొత్తం 17 స్థానాల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 4, ఎంఐఎం 1 స్థానంలో గెలుపొందింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి 16 స్థానాలను గెలుచుకుంటామంటూ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతూ వచ్చారు. సారూ, పదహారూ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే పల్లవి అందుకున్నాయి. 16 సెగ్మెంట్లలో టీఆర్ఎస్ గెలుస్తుందని, ఇంకో స్థానం పరోక్ష మిత్రపక్షమైన ఎంఐఎం గెలుచుకుంటుందని ప్రచారంలోనూ హోరెత్తించారు. తాజాగా వచ్చిన ఫలితాలు మాత్రం కేసీఆర్ అంచనాలను తారుమారు చేశాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కాస్త పుంజుకొని మూడు చోట్ల ( భువనగిరి, నల్గొండ, మల్కాజ్గిరి) గెలుపొందగా, బీజేపీ అన్యూహ్య రీతిలో నాలుగు చోట్ల విజయ దుందుభిని మోగించింది. నిజామాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో కాస్త పుంజుకుంది. ఒక్క చోట కూడా గెలుపు కష్టమే అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించనిరీతిలో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం తలకిందుల చేస్తూ మూడు చోట్ల విజయం సాధించింది. నల్గొండ(ఉత్తమ్ కుమార్ రెడ్డి), భువనగిరి(కొమటి రెడ్డి వెంకట్రెడ్డి, మల్కాజ్గిరి (రేవంత్ రెడ్డి)నియోజకవర్గాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ప్లాన్ ప్రకారం సీనియర్లకు టికెట్ ఇవ్వడం, టీఆర్ఎస్ కొత్త వారికి బరిలోకి దింపడం కాంగ్రెస్కు కలిసొచ్చింది. వికసించిన కమలం ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ భారీగా పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న కమలనాథులు లోక్సభ ఎన్నికల్లో మాత్రందూసుకెళ్లారు. నాలుగు స్థానాల్లో గెలుపొంది రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీగెలుపొందింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర అగ్రనేతల ప్రచారం రాష్ట్రంలో కలిసొచ్చింది. మోదీ ప్రజాకర్షణ మంత్రం, అమిత్షా రాజకీయ చతురత రాష్ట్రంలో పనిచేసింది . 2014 ఎన్నికల్లో కేవలం ఒక్క లోక్సభ (సికింద్రాబాద్) స్థానాన్ని మాత్రమే గెలుచుకున్నబీజేపీ ఆ సారిఅనూహ్యంగా నాలుగు స్థానాలను గెలుపొంది ఎగ్జిట్ పోల్ అంచనాలను తలక్రిందులు చేసింది. అలాగే కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం రాష్ట్ర పార్టీశ్రేణులకు మరింత ఉత్సాహాన్ని కలిస్తోంది. ఎంఐఎంకు ఎదురులేదు ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ పార్లమెంట్ ఈ సారి కూడా తన ఖాతాలోనే వేసుకుంది. వరసగా మూడు పర్యాయాలు విజయం సాధించిన ఎంఐఎంఅధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి హైదరాబాద్ నియోజకవర్గంలో తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు. భారీ మెజారిటితో అసదుద్దీన్ గెలుపొందారు. -
కవిత ఓటమికి కారణాలు అవేనా..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్సభ ఎన్నిక తొలిరోజు నుంచే సంచలనం సృష్టించింది. నామినేషన్ల దగ్గర నుంచి ఇప్పుడు ఫలితాల విషయంలో కూడా దేశం దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను కోల్పోవడం ఆపార్టీ నేతలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. ముఖ్యంగా సీఎం కుమార్తె కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ లోక్సభ స్థానంలో ఓటమి చెందడం రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె ఓటమికి అనేక కారణాలున్నప్పటికీ.. కవితకు వ్యతిరేకంగా రైతులు పోటీ చేయడం ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 68వేల పైచీలుకు ఓట్ల తేడాతే ఓటమిచెందిన విషయం తెలిసిందే. ఆర్మూర్ ప్రాంతంలో పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని, గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని సుమారు 178మంది మంది రైతులు ఆమెకు వ్యతిరేకంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేశారు. అంతటితో ఆగకుండా కవిత ఓటమే లక్ష్యంగా ఆమెకు వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచారం చేశారు. దీని ఫలితమే వారికి అనూహ్యంగా వారికి 90 వేలకు పైగా ఓట్లను తెచ్చిపెట్టాయి. లోక్సభ పరిధిలో రైతులకు దగ్గరి దగ్గరి లక్ష ఓట్లు రావడమనేది సామాన్యమైన విషయం కాదు. స్వయంగా సీఎం కూమార్తె పోటీచేస్తున్న స్థానంలో రైతులకు అన్ని ఓట్లు రావడం దేశం దృష్టిని ఆకర్షించింది. ఆమె లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడమే కాక.. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ని ఓడిమి జగిత్యాలలో గులాబీ జెండాను ఎగరేయడంలో కవిత ముఖ్యపాత్ర పోషించారు. ఎన్నికలు గడిచి మూడు నెలలు కూడా ముగియకముందే ఫలితాలు అనూహ్యంగా మారాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసిన నిజామాబాద్ జిల్లా ఎర్గట్లకు చెందిన రైతు సున్నం ఇస్తారికి 787 ఓట్లు వచ్చాయి. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణకు చెందిన 24 మంది రైతులు నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఆయన 787 ఓట్లు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఫలితాలపై స్పందించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు తమ పార్టీ అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపించారని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమేనని, ప్రజా తీర్పును గౌరవిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 16 సీట్లు గెలవాలని తాము ఆశించామని.. కానీ మా అంచనాలకు విరుద్ధంగా ప్రజలు తీర్పునిచ్చారని కేటీఆర్ నిరాశ వ్యక్తం చేశారు. కాగా 16 సీట్లే లక్ష్యంగా లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్కు ఊహించని ఫలితాలు ఎదురైయ్యాయి. ముఖ్యంగా నిజామాబాద్ లోక్సభ స్థానంలో కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి చెందడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొత్తం 17 స్థానాల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 4, ఎంఐఎం 1 స్థానంలో గెలుపొందగా మిగతా స్థానాలను కారు పార్టీ సొంతం చేసుకోనుంది. -
భువనగిరిలో కోమటిరెడ్డి గెలుపు
సాక్షి, హైదరాబాద్ : భువనగిరి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్పై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి భారీ ఓటమిని చవిచూశారు. అయినప్పటికి కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డిపై నమ్మకంతో ఆయనకు భువనగిరి లోక్సభ టికెట్ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిజం చేస్తూ కోమటిరెడ్డి విజయం సాధించారు. కోమటిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా భువనగిరి ప్రజలు ఈ విజయాన్ని ఆయనకు కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడుతూ.. తన గెలుపుకు సహకరించిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. ఓటమి పాలైన టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. -
తెలంగాణ లోక్ సభ : వారేవా బీజేపీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ పార్టీ ప్రభావం చూపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న కమలనాథులు లోక్సభ ఎన్నికల్లో మాత్రం దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి టీఆర్ఎస్కు గట్టి పోటీని ఇస్తున్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉండగా..ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థి బాపురావు 48వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ 17వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కరీంనగర్లో బండి సంజయ్కుమార్ 70వేల ఓట్ల ఆధిక్యం, సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డి 35వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. -
తెలంగాణ లోక్సభ: విజేతలు వీరే
► తెలంగాణాలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు గానూ 9 స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. నాలుగు స్థానాల్లో బీజేపీ, మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, మరో స్థానంలో ఎంఐఎం గెలిచింది. విజేతలు వీరే: 1) అసదుద్దీన్ ఓవైసీ(ఎంఐఎం)- హైదరాబాద్ 2) బండి సంజయ్(బీజేపీ)-కరీంనగర్ 3)నామా నాగేశ్వర రావు(టీఆర్ఎస్)-ఖమ్మం 4)మాలోతు కవిత(టీఆర్ఎస్)-మహబూబాబాద్ 5) మన్నె శ్రీనివాస్ రెడ్డి(టీఆర్ఎస్)-మహబూబ్నగర్ 6)కొత్త ప్రభాకర్ రెడ్డి(టీఆర్ఎస్)- మెదక్ 7) పోతుగంటి రాములు(టీఆర్ఎస్)- నాగర్ కర్నూల్ 8) ఉత్తమ్ కుమార్ రెడ్డి(కాంగ్రెస్)-నల్గొండ 9) వెంకటేశ్ నేత బోర్లకుంట(టీఆర్ఎస్)- పెద్దపల్లి 10) జి. కిషన్ రెడ్డి(బీజేపీ)- సికింద్రాబాద్ 11) పసునూరి దయాకర్(టీఆర్ఎస్)- వరంగల్ 12) ధర్మపురి అరవింద్(బీజేపీ)- నిజామాబాద్ 13) ఎనుముల రేవంత్ రెడ్డి(కాంగ్రెస్)- మల్కాజ్గిరి 14) కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(కాంగ్రెస్)-భువనగిరి 15) సోయం బాపూరావు(బీజేపీ)-ఆదిలాబాద్ 16) బీబీ పాటిల్(టీఆర్ఎస్)-జహీరాబాద్ 17) జి.రంజిత్ రెడ్డి(టీఆర్ఎస్)- చేవెళ్ల ► జహీరాబాద్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ 5823 ఓట్ల ఆధిక్యతతో ముందంజ ఉన్నారు. ► నిజామాబాద్ లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ అభ్యర్థి అయిన కల్వకుంట్ల కవిత, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి చెందారు. ► ఖమ్మం పార్లమెంటు స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర రావు, తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరీపై 1,66,429 ఓట్ల ఆధిక్యతతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ స్థానంలో టీఆర్ఎస్కు 5 లక్షల 63 వేల 625 ఓట్లు, కాంగ్రెస్కు 3,97,196 ఓట్లు, సీపీఎంకు 56,606 ఓట్లు, బీజేపీకి 20,327 ఓట్లు, జనసేనకు 19,245 ఓట్లు వచ్చాయి. ►మెదక్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు 2 లక్షల 68 వేల 428 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావుకు లక్షా 95 వేల 13 ఓట్లు వచ్చాయి. ప్రభాకర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్పై 3 లక్షల 11 వేల 559 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ►మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. హోరాహోరీగా జరిగిన పోరులో సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్పై 6 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అసెంబ్లీలో ఘోర పరాయం పాలైన కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల ఫలితాలు ఊరట నిచ్చాయి. ► భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. ఓటమి పాలైన టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ► ఎన్నికల తర్వాత 16 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ఆ దిశగా సాగడంలేదు. ఆ పార్టీ 9 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక సిట్టింగ్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె ఓటమి దిశగా పయనిస్తుండటం టీఆర్ఎస్ వర్గాలను కలవరపెడుతోంది. ఇక దేశవ్యప్తంగా మాంచి ఊపుమీదున్న బీజేపీ తెలంగాణలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ మూడుస్థానాల్లో, ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ► కరీంనగర్ పార్లమెంట్ 9వ రౌండ్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన పొన్నం ప్రభాకర్ 69,570, టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 1,58,374, బీజేపీ తరఫున పోటీ చేసిన బండి సంజయ్ 2,13,602 ఓట్లు సాధించారు. ► మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి 10వ రౌండ్లో 3177 ఆధిక్యంలో ఉన్నారు. ►ఖమ్మం పార్లమెంట్ స్థానంలో టీర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థి నామానాగేశ్వరరావు రెండో రౌండ్ పూర్తయ్యేసరికి సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ఐదువేల పైచిలుకు మెజారిటీలో ఉన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత మొదటిరౌండ్ పూర్తయ్యే సరికి 8500 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ►తెలంగాణ వ్యాప్తంగా జోరుమీదున్న టీఆర్ఎస్ నిజామాబాద్లో వెనకంజలో ఉంది. కేసీఆర్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కవిత ఈ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముందంజలో కొనసాగుతున్నారు. 160 మందికిపైగా రైతులు ఇక్కడ పోటీ చేయడంతో బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ► మెదక్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిదిన కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టమైన మెజారిటీ కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆయన 65 వేల పైచిలుకు మెజారిటీలో కొనసాగుతున్నారు. ► తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఆ పార్టీ 9 స్థానాల్లో ముందంజలో ఉంది. మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, భువనగిరి, మహబూబ్నగర్, జహీరాబాద్, ఖమ్మం, నాగర్కర్నూల్, మెదక్, పెద్దపల్లి స్థానాల్లో టీఆర్ఎస్ ఆదిక్యంలో కొనసాగుతోంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం ఆదిక్యంలో ఉంది. ► తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. 41 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు నేటితో తెరపడనుంది. రాష్ట్రంలోని 17లోక్సభ స్థానాలతోపాటు దేశంలోని 542 లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్లను గురువారం లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు తొలిదశలో (ఏప్రిల్ 11న) పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 35 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కలిపి లెక్కింపు కోసం 126 హాళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. -
మరికొద్ది గంటల్లో!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. 41 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు నేటితో తెరపడనుంది. రాష్ట్రంలోని 17లోక్సభ స్థానాలతోపాటు దేశంలోని 542 లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్లను గురువారం లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నా రు. నేడు జరగనున్న కౌంటింగ్కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కు మార్ ప్రకటించారు. బుధవారం సచివాలయంలో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వివరించా రు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ని ర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. రా ష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు తొలిదశలో (ఏప్రిల్ 11న) పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటలకు ప్రారంభం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 35 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కలిపి లెక్కింపు కోసం 126 హాళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎన్నికల పరిశీలకుడు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లోక్సభ స్థానాల పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లను లెక్కించనున్నారు. ప్రతి శాసనసభ స్థానం పరిధిలో పోలైన ఓట్లను లెక్కించడానికి ఒక హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి రికార్డు సంఖ్యలో 185 మంది బరిలో ఉన్నందున అక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలైన ఓట్లను రెండేసి హాళ్లలో లెక్కించనున్నారు. ఒక్కో హాల్లో 18 చొప్పున మొత్తం 36 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న మల్కాజ్గిరి లోక్సభ స్థానంలోని మేడ్చల్, ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను లెక్కించడానికి 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. సువిధ యాప్లో ఫలితాలు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ (ఈటీపీబీ)లను లెక్కించనున్నారు. అనంతరం ఉదయం 8.20 గంటలకు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు. ఈవీఎంల రౌండ్లన్నీ పూర్తయిన తర్వాత ప్రతి శాసనసభస్థానం పరిధిలోని 5 పోలింగ్ కేంద్రాలను ర్యాండమ్ విధానంలో ఎంపిక చేసి, అక్కడ నమోదైన వీవీప్యాట్స్ ఓట్లను లెక్కించనున్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లతో వీవీప్యాట్స్ ఓట్లను సరిపోల్చి చూస్తారు. ఈవీఎం, వీవీప్యాట్స్లలోని ఓట్లలో తేడాలొస్తే వీవీప్యాట్స్ స్లిప్పుల కౌంటింగ్ను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి రౌండు పూర్తి కాగానే సువిధ అప్లికేషన్ ద్వారా ఫలితాలను రిటర్నింగ్ అధికారులు పోర్టల్లో నమోదు చేస్తారు. దీంతో ఓట్ల లెక్కింపు ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్పోర్టల్ (https://results.eci.gov.in) ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవులు ప్రకటించిందని రజత్కుమార్ తెలిపారు. గురువారం మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించామన్నారు. రిటర్నింగ్ అధికారే కింగ్! ఓట్ల కౌంటింగ్, రీ–కౌటింగ్కు సంబంధించిన ఏ విషయంలోనైనా నిర్ణయాధికారం స్థానిక రిటర్నింగ్ అధికారిదేనని రజత్కుమార్ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే స్థానిక రిటర్నింగ్ అధికారి ఫలితాలను చదివి వినిపిస్తారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు నిశ్శబ్ద సమయం ఉండనుంది. ఓట్ల లెక్కింపుపై అనుమానాలుంటే ఆ రెండు నిమిషాల్లోగా అభ్యర్థులు, వారి ఏజెంట్లు లిఖితపూర్వకంగా రీ–కౌంటింగ్ కోరాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారులు తమ విచక్షణ ఉపయోగించి రీ–కౌంటింగ్ జరపాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఒక వేళ విజ్ఞప్తిని తిరస్కరిస్తే మాత్రం ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారులు లిఖిత పూర్వకంగా తెలియచేయాల్సి ఉంటుందని రజత్కుమార్ స్పష్టం చేశారు. వీవీప్యాట్స్ ఓట్లు కీలకం! కొన్ని సందర్భాల్లో వీవీప్యాట్స్ ఓట్లు కీలకం కానున్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంల మీద ఉండే ‘క్లోజ్’మీటను నొక్కడాన్ని ప్రిసైడింగ్ అధికారులు మరిచిపోతే, మళ్లీ క్లోజ్ మీటను నొక్కే వరకు అలాంటి ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడం సాధ్యం కాదు. ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో సంబంధిత పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లను సరిచూసుకున్న తర్వాత క్లోజ్ మీటను నొక్కి ఓట్లను లెక్కిస్తారు. ఒక వేళ పోలైన ఓట్ల సంఖ్య, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యలో తేడాలుంటే, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను కాదని వీవీప్యాట్స్ స్లిప్పులను లెక్కిస్తారు. ఇప్పటి వరకు ఎక్కడా ఈవీ ఎం, వీవీప్యాట్స్ ఓట్ల మధ్య తేడాలు రాలేదని రజత్కుమార్ వెల్లడించారు. పోలింగ్ రోజు మాక్ పోల్ లో వేసిన ఓట్లను ఈవీఎం నుంచి డిలీట్ చేయడాన్ని పోలింగ్ సిబ్బంది మరిచిపోతే, వాస్తవ పోలింగ్ ఓట్లతో మాక్పోల్ ఓట్లు కలిసిపోనున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సైతం వీవీప్యాట్స్ ఓట్లను పరిగణలోకి తీసుకుంటామని రజత్కుమార్ వెల్లడించారు. తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య మార్జిన్ ఓట్ల సంఖ్య కంటే ఎక్కువ ఉంటేనే మళ్లీ తిరస్కరించిన పోస్టల్ ఓట్లకు రీ–కౌంటింగ్ చేయనున్నారు. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో?
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఫలితాలు వెల్లడవుతున్న వేళ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలయింది. పోలింగ్ జరిగిన నెలన్నర రోజుల తర్వాత వస్తున్న ఫలితాలు పార్టీ మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే ఆందోళన వారిలో నెలకొంది. ఈసారి పార్టీ ప్రముఖులు బరిలో ఉండడం, ఈ ఫలితాల ఆధారంగానే పార్టీలో సమూల మార్పులుంటాయనే సంకేతాలు ఇప్పటికే రావడం ఈ ఆందోళనకు కారణం. ప్రతికూల ఫలితాలు వస్తే మళ్లీ వలసలు షురూ అవుతాయేమోననే సందేహం పార్టీలో బలంగా వినిపిస్తోంది. దీంతో గురువారం రానున్న ఫలితాలపై గాంధీభవన్ వర్గాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయోననే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కనీసం 3,4 చోట్ల గెలిస్తేనే.. ఈ లోక్సభ ఫలితాల్లో ప్రతికూల ఫలితాలు వస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని ఆ పార్టీ నేతలే బహిరం గంగా వ్యాఖ్యానిస్తున్నారు. పోలింగ్ సరళిని బట్టి బీజేపీకి కూడా మంచి ఓటింగ్ జరిగిందని, కాంగ్రెస్తో సమానంగా సీట్లు గెలుచుకునే అవకాశముందని ఎగ్జిట్పోల్స్ తెలిపాయి. ఎన్డీయేకే మళ్లీ అధికారం వస్తుందన్న పోస్ట్పోల్ సర్వేల ఫలితాలు కూడా కాంగ్రెస్లో గుబులురేపుతున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం కూడా కష్టమేననే చర్చ జరుగుతోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కనీసం 3–4 లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంటేనే తెలంగాణలో పార్టీ బతికే పరిస్థితి ఉంటుందని, బీజేపీకి సమానంగా ఓట్లు వచ్చినా, లేదంటే అంతకంటే తక్కువ వచ్చినా పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుం దని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కూడా ఓటమి పాలైతే మళ్లీ వలసలు మొదలవుతాయని.. ఆ వలసలు ఎంత దూరం వరకు వెళ్తాయో కూడా తెలియదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా పార్టీ 3,4 సీట్లు గెలుచుకుని మిగిలిన చోట్ల కనీస ప్రదర్శన కనబరిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. పెద్దోళ్ల పరిస్థితి ఏంటో? పార్టీతోపాటు.. రాష్ట్ర పార్టీలో కీలక నేతలుగా గుర్తింపు పొందిన కొందరు నాయకుల భవిష్యత్తును కూడా ఈ ఫలితాలు నిర్దేశించ నున్నాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు రేణుకాచౌదరి, బలరాం నాయక్, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్ లాంటి ప్రముఖులంతా ఈసారి బరిలో ఉండడంతో వీరి భవిష్యత్తు గెలుపోటములపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫలితాలను బట్టి పార్టీలో కూడా మార్పులుంటాయని, ప్రజాదరణ పొందిన నేతలకే పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ నేపథ్యంలో ఈ నేతల్లో ఎవరెవరు గెలిచే అవకాశం ఉందనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మరికొద్ది గంటల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలోని కీలక నేతల భవిష్యత్తు తేలనుంది. -
ఆఖరి వరకు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుచుకుంటామని అధికార టీఆర్ఎస్ ధీమాగా ఉంది. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్కు 14–16 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే టీఆర్ఎస్ అధిష్టానం మాత్రం హైదరాబాద్ మినహా అన్ని స్థానాల్లో గెలుపు తమదనే విశ్వాసంతో ఉంది. ప్రజలు పూర్తిగా టీఆర్ఎస్కు అనుకూల తీర్పు ఇచ్చారని అధికార పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ప్రజలు ఏకపక్షంగా టీఆర్ఎస్ను దీవించారనే అంచనాలో ఉంది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో ఆశించిన ఆధిక్యత ఉండకపోయినా..అన్ని లోక్సభ స్థానాలు తమ ఖాతాలోకే పడతాయని ధీమాతో ఉంది. రెండు మూడు స్థానాల్లో మాత్రమే ఇతర పార్టీలోతో పోటీ ఉంటుందని.. మిగిలిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం ఖాయమని చెబుతోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడికానున్న నేపథ్యంలో.. లెక్కింపు ప్రక్రియలో టీఆర్ఎస్ వ్యూహాన్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు వివరించారు. పలువురు మంత్రులు, అభ్యర్థులతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఓట్ల లెక్కింపుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. టీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని, తుది ఫలితాలు వచ్చే వరకు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభ్యర్థులు, ఏజెంట్లతో మంత్రులు సమన్వయం చేయాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ల నుంచి ఆఖరి ఈవీఎం వరకు లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏజెంట్లు ఓపికగా మొత్తం పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని, ఈ మేరకు అభ్యర్థులు వారిని ఒప్పించాలని సూచించారు. ఎక్కువ స్థానాల్లో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ వస్తుందని.. అయినా ఏ ఒక్కరూ అలసత్వంతో ఉండవద్దని సూచించారు. అధికారిక, సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసుకున్న తర్వాతే లెక్కింపు కేంద్రాల నుంచి బయటికి రావాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏవైనా సందేహాలు ఉంటే టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలోని వారిని సంప్రదించాలని సూచించారు. మంత్రుల సమన్వయం గతంలో ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ సెగ్మెంట్ల లెక్కింపు ప్రక్రియ ఒకేచోట జరిగేదని.. ఇప్పుడు ఒక్కో సెగ్మెంట్ ఒక్కో చోట ఉంటోందని మంత్రులు రెండు చోట్ల సమన్వయం చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉంటూ మరో సెగ్మెంట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకోవాలని ఆదేశించారు. పరిస్థితిని బట్టి అవసరమైతే అక్కడికీ వెళ్లి రావాలని సూచించారు. ఏజెంట్లు అభ్యర్థులతో.. అభ్యర్థులు మంత్రులతో, మంత్రులు పార్టీ అధిష్టానంతో సమన్వయంతో ఉండాలని ఆదేశించారు. ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థులను అభినందించే సమయంలో పార్టీ ముఖ్యులంతా వెంటఉండేలా చూసుకోవాలని సూచించారు. -
‘పేకాటలో జోకర్లా మిగిలింది ఆయన ఒక్కడే’
హైదరాబాద్: టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చెయ్యడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శించారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ విలేకరులతో చిట్చాట్ చేశారు. తెలంగాణాలో రెండు పార్టీల విధానం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే గట్టి పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. నిజామాబాద్లో సంజయ్, అర్వింద్లు ఈరోజు ఢీ అంటే ఢీ అన్నట్లు కొట్లాడుతున్నారు అంటే అది మా పార్టీ గొప్పతనమేనని అన్నారు. దక్షిణాదిన సొంతంగా బీజేపీ ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బాబు వల్లనే బీజేపీ తీవ్రంగా నష్టపోయింది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పొత్తు పెట్టుకోవడం వల్లనే గతంలో బీజేపీ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు పరిస్థితి ఎడ్లబండిని మోస్తున్న అని అనుకుంటున్న కుక్క పిల్లలాగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో పేకాటలో జోకర్లాగా మిగిలింది చంద్రబాబు ఒక్కడేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పెట్టిన ప్రతిపక్షాల మీటింగ్కి ఎవరూ రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్లకు వాళ్లే తన్నుకు చస్తున్నారని అన్నారు. చంద్రబాబు రాజకీయాల్లో నిజాయతీ గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు. చంద్రబాబు చచ్చిన పాము.. తాము ఆయనను టార్గెట్ చెయ్యాల్సిన కర్మ పట్టలేదన్నారు. రెచ్చగొట్టింది కేసీఆరే మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కాకుండా ఇప్పుడు చేసినన్ని కుట్రలు ఇంతకుముందెన్నడూ జరగలేదని అన్నారు. హిందువులు బొందువులు అన్నది కేసీఆరే.. రెచ్చగొట్టింది కేసీఆరే.. మోదీ, అమిత్ షాలు అభివృద్ధి అంశాలు గురించి మాత్రమే ప్రచారం చేశారని అన్నారు. కేసీఆర్ దగ్గర అభివృద్ధి ఎజెండా లేదు కాబట్టే దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణాలో చాలా మార్పులు ఉంటాయన్నారు. హరీష్ రావునైనా తీసుకుంటాం మా పార్టీ విధానాలు, సిద్ధాంతాలు నమ్మి పార్టీ అనుగుణంగా పనిచేస్తే మాజీ మంత్రి హరీష్ రావునైనా పార్టీలో చేర్చుకుంటామని, అయితే రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి చేర్చుకుంటామని స్పష్టం చేశారు. గ్రామాల్లో టీఆర్ఎస్ కండువాలు వేసుకున్న వారు కూడా మోదీ పీఎం కావాలని కమలం గుర్తుపై ఓటేశారని అన్నారు. టీఆర్ఎస్ పేలిపోయే బుడగ అని ఎద్దేవా చేశారు. చాలా మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.. అమిత్ షా సమయం ఇవ్వగానే వాటి మీద నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్నగర్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని వ్యాక్యానించారు. -
‘ఇబ్బంది లేకుండా గెలవబోతున్న స్థానం ఇదే’
యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణాలో భువనగిరి పార్లమెంటు స్థానానికి ప్రత్యేకత ఉందని, తనను గెలిపించేందుకు కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. యాదాద్రిలో బుధవారం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలవబోతున్న స్థానం భువనగిరి పార్లమెంటు స్థానమేనని ధీమా వ్యక్తం చేశారు. 80 నుంచి లక్ష మెజారిటీ గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. తెలంగాణాలో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు పనిచేస్తామని అన్నారు. టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లో మంచినీళ్లు లేకపోతే పట్టించుకోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం క్యాంపు రాజకీయాలు చేస్తున్న తీరు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై స్పందించని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, గోవా క్యాంపు రాజకీయాలను ఏమనాలని ప్రశ్నించారు. ఆరుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్యాంపు రాజకీయాలు చేస్తూ జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. -
ఏర్పాట్లు ముమ్మరం
డిచ్పల్లి: రేపు నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ కౌంటింగ్ కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆయా నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీల రాజకీయ నాయకులు, కార్యకర్తలు, కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో కౌంటింగ్ కేంద్రానికి రానున్నారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. కేంద్రం ఆవరణలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులు, అధికారుల రాకపోకలకు, వాహనాల పార్కింగ్ లకు వేర్వేరుగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కెటాయించిన మార్గంలోనే కౌంటింగ్ కేంద్రంలోని రాకపోకలు సాగించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి 185 అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో కౌంటింగ్కు ఎక్కువ సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సిబ్బందికి, ఏజెంట్లకు, బందోబస్తు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు. బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ కమిషనర్ కార్తికేయ, అడిషనల్ ఎస్పీ శ్రీధర్రెడ్డి సమన్వయంలో నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాసకుమార్, ఎన్ఐబీ ఏసీపీ రాజారత్నం, సీసీఎస్ ఏసీపీ స్వామి, ఆర్మూర్ ఏసీపీ రాములు, ఏఆర్ ఏసీపీ మహేశ్వర్ పర్యవేక్షిస్తున్నారు. సుమారు 900 మంది సిబ్బంది బందోబస్తు విధులు పాల్గొంటున్నారు. -
మరో.. 24 గంటలు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మరో ఇరవై నాలుగు గంటలు గడిస్తే చాలు.. విజేతలు ఎవరో తేలిపోతుంది. ఉమ్మడి జిల్లాలోని భువనగిరి, నల్లగొండ లోకసభ స్థానాల ఫలితాలు 23వ తేదీన వెలువడనున్నాయి. గెలుపు తమదే అంటే.. తమదే అన్న ధీమాను ఇరు పార్టీల నేతలూ వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర శాసన సభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను బట్టి అధికార టీఆర్ఎస్ రెండు స్థానాల్లో తమ అభ్యర్థుల విజయంపై విశ్వాసంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అవుతుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. దీంతో టీఆర్ఎస్కు సిట్టింగ్ స్థానంగా ఉన్న భువనగిరితో పాటు, గత ఎన్నికల్లో తమకు దక్కకుండా పోయిన నల్లగొండనూ ఈ సారి కైవసం చేసుకుంటామని ప్రకటిస్తున్నారు. మరోవైపు శాసనసభ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు సంబంధమే ఉండదని, కేంద్రంలో ఏ ప్రభుత్వం కావాలన్న ఎజెండాతో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కే పూర్తి అవకాశాలు ఉంటాయని, తమ సిట్టింగ్ స్థానమైన నల్లగొండను నిలబెట్టుకోవడంతో పాటు, గతెన్నికల్లో స్వల్ప తేడాతో కోల్పోయిన భువనగిరిపై జెండా ఎగురేస్తామన్నది కాంగ్రెస్ నేతల ధీమా. మొత్తానికి ఇరు పార్టీల నాయకులు, శ్రేణులు రెండు స్థానాల్లో గెలుపై భారీ అంచనాల్లో ఉన్నారు. రెండు పార్టీల నేతల ప్రకటలు ఎలా ఉన్నా.. ఎవరి విశ్వాసం మాటెలా ఉన్నా.. ఇంతకూ ఇక్కడ గెలిచేదెవరన్న ప్రశ్న అంతకంతకూ ఉత్కంఠ రేపుతోంది. ఫలితాల కోసం రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడితో పెరిగిన రాజకీయ వేడి నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాల విజయంపై ఏ పార్టీ అంచనాలు ఆ పార్టీలకు ఉన్నా.. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొత్త చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నల్లగొండనుంచి టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోటీ చేయడం వల్ల కూడా ఈ రెండు నియోజకవర్గాల గురించి కాంగ్రెస్లో అంచనాలు పెరిగిపోయాయి. ఆయా సంస్థలు, జాతీయ మీడియా చానళ్లు వెలువరించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కాంగ్రెస్కు దక్కనున్న స్థానాలపై వచ్చిన వార్తలతో ఆ పార్టీ వర్గాల్లో గెలుపై ధీమా పెరిగింది. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలతో అటు టీఆర్ఎస్ నాయకత్వమూ ఆత్మవిశ్వాసంతో ఉంది. రెండు నియోజకవర్గాల్లో ఫలితాలు ఏకపక్షం కాదని, ఇరు పార్టీల మధ్య çలోక్సభ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగిందని తేల్చడంతో ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఫలితాలతో విశ్లేషణ మరోవైపు ఎగ్జిట్ పోల్ ఫలితాల మాటెలా ఉన్నా.. డిసెంబర్లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు, మెజారిటీ తదితర గణాంకాలను ముందేసుకుని విశ్లేషిస్తున్నారు. ఈ ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం.. రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్కే అనుకూల ఫలితాలు రావాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నల్లగొండ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో హుజూర్నగర్ సెగ్మెంట్ మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో చేరింది. అది కూడా స్వల్ప మెజారిటీతో మాత్రమే. ఇక్కడినుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలుగా ఉన్న కోదాడ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, నల్లగొండలను కోల్పోయింది. ఓట్ల మెజారిటీ కూడా భారీగానే ఉంది. ఈ ఫలితాలను బట్టి లోక్సభ ఫలితమూ తమకే అనుకూలంగా వస్తుందని, తమ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి విజయం సాధిస్తారని టీఆర్ఎస్ అంటోంది. ఇక, భువనగిరి నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, ఐదు చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. అయితే.. తుంగతుర్తి, ఇబ్రహీంపట్న (రంగారెడ్డి జిల్లా) అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్కు స్వల్ప మెజారిటీ మాత్రమే వచ్చింది. 2014 లోక్సభ ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ తక్కువ మెజారిటీతో ఓడిపోయింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇక్కడినుంచి తమ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది కాంగ్రెస్ విశ్లేషణ. ఇక్కడినుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బూర నర్సయ్య గౌడ్ రెండోసారీ పార్లమెంట్లో అడుగుపెట్టడం ఖాయమన్నది టీఆర్ఎస్ అభిప్రాయం. మొత్తంగా ఇరు పార్టీ లెక్కలు, సమీకరణలు, విశ్లేషణలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు లోక్సభ ఫలితాలపై మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. -
తొలి ఫలితం.. హైదరాబాద్దే!
సాక్షి, సిటీబ్యూరో: నగరం నుంచి ఢిల్లీ వెళ్లే ప్రతినిధులెవరో.. మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి నగరంలోని వివిధ కేంద్రాల్లో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. గ్రేటర్ పరిధిలో అతి తక్కువ ఓట్లున్న హైదరాబాద్ లోక్సభ ఫలితం తొందరగా వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఆపై సికింద్రాబాద్, చేవెళ్ల చివరకు మల్కాజిగిరి లోక్సభ ఫలితాలను ప్రకటించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో అన్ని శాసనసభ స్థానాల్లో పద్నాలుగు టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేస్తారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ప్రతి నియోజకవర్గంలో ఐదు బూత్ల్లో వీవీప్యాట్లలోని స్లిప్పులను లాటరీలో తీసి లెక్కించిన తర్వాతే తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. ఇక దేశంలోనే అత్యధిక ఓటర్లతో రికార్డు సృష్టించిన మల్కాజిగిరి లోక్సభ ఫలితం అధికారిక ప్రకటనకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కుత్బులాపూర్ ఓట్లను అత్యధికంగా 34 రౌండ్లలో మేడ్చల్, ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను 28 రౌండ్లలో లెక్కిస్తారు. అత్యధిక ఓట్లు పోలైన నియోకజవర్గాల్లో లెక్కింపు టేబుళ్లను సైతం 14 నుండి 24 వరకు ఏర్పాటు చేశారు. ఇక చేవెళ్ల నియోజకవర్గానికి సంబం«ధించి అత్యధిక ఓట్లు నమోదైన శేరిలింగంపల్లి శాసనసభ ఓట్ల కౌంటింగ్ 43 టేబుళ్ల ఏర్పాటు చేశారు..హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల ఓట్లను ఎల్బీ, కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియాలు, ఉస్మానియావర్సిటీ, రెడ్డి విమెన్స్ కాలేజీ, కోఠి విమెన్స్ కాలేజీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్, నిజాం కాలేజీ, మాసబ్ట్యాంక్ పాలిటెక్నిక్ , మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ స్థానాల ఓట్లను పాల్మాకులలోని గురుకుల పాఠశాలలో లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదలైన ఉత్కంఠ పోలింగ్ జరిగిన ఆరువారాల అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతుంటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి అనుచరుల్లో ఉత్కంఠ మొదలైంది. హైదరాబాద్ లోక్సభపై ఎంఐఎం పూర్తి భరోసా ఉండగా, సికింద్రాబాద్ లోక్సభ విజయంపై బీజేపీ, టీఆర్ఎస్, మల్కాజిగిరి లోక్సభలో టీఆర్ఎస్, కాంగ్రెస్, చేవెళ్ల లోక్సభలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు తమ విజయాలపై ఆశలు పెంచుకున్నారు. హైదరాబాద్ లోక్సభ:లెక్కించే ఓట్లు: 8,76,073 అత్యధిక ఓట్లు పోలైన అసెంబ్లీ: కార్వాన్ 1,54, 030 అత్యల్ప ఓట్లు పోలైన అసెంబ్లీ: చార్మినార్ 94863 సికింద్రాబాద్ లోక్సభలెక్కించే ఓట్లు: 9,10,437 అత్యధిక ఓట్లు పోలైన అసెంబ్లీ: జూబ్లీహిల్స్ 1,41,400 అత్యల్ప ఓట్లు పోలైన అసెంబ్లీ: నాంపల్లి 116021 మల్కాజిగిరి లోక్సభ: లెక్కించే ఓట్లు: 15,60,108 అత్యధిక ఓట్లు పోలైన అసెంబ్లీ: మేడ్చల్ 2,99,542 అత్యల్ప ఓట్లు పోలైన అసెంబ్లీ: కంటోన్మెంట్ 1,20,429 చేవెళ్ల లోక్సభ లెక్కించే ఓట్లు: 12,99,956 అత్యధిక ఓట్లు పోలైన అసెంబ్లీ: శేరిలింగంపల్లి 2,57, 970 అత్యల్ప ఓట్లు పోలైన అసెంబ్లీ: వికారాబాద్ 1,39,918 -
అంతా రెడీ!
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో గురువారం జరగనున్న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైదరాబాద్ జిల్లా పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణతోపాటు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకొని అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. హైదరాబాద్ లోక్సభ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మాణిక్రాజ్, సికింద్రాబాద్ లోక్సభ రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ రవి, నగరపోలీస్ కమిషనర్ అంజనీకుమార్లతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో కౌంటింగ్ ఏర్పాట్లను వివరించారు. జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు 14 కేంద్రాల్లో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ అధికారులకు ఇప్పటికే ఒక దఫా శిక్షణనిచ్చామని బుధవారం ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజ్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మరింత క్షుణ్ణంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. డీఈఓలు, ఆర్ఓలు, ఏఆర్ఓలకు కూడా సీఈఓ ఆధ్వర్యంలో శిక్షణ జరిగిందన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు మూడు వలయాల్లో పటిష్ట పోలీసు బలగాల భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్ పరిశీలకులతోపాటు జనరల్ అబ్జర్వర్లు కూడా ఉంటారన్నారు. 23వ తేదీన ఉదయం 6.30 గంటలకు రాజకీయ ప్రతినిధులు, పరిశీలకుల సమక్షంలో స్ట్రాంగ్రూమ్ల నుంచి ఈవీఎలను కౌంటింగ్ కేంద్రాలకు తెస్తామని, కౌంటింగ్ సిబ్బంది 6 గంటలకల్లా విధులకు హాజరు కావాల్సిందిగా ఆదేశించామన్నారు. ఏ అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లను ఎవరు లెక్కించాలనేదానికి బుధవారం తనతోపాటు ఆర్ఓ, అబ్జర్వర్ సమక్షంలో..ఆ తర్వాత గురువారం అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ సెంటర్వద్ద ఏ టేబుల్ వద్ద ఎవరుండాలనేదానికి గురువారం ఉదయం మరోమారు ర్యాండమైజేషన్ జరుగుతుందన్నారు. ఒక్కో వరుసలో 7 టేబుళ్ల వంతున రెండు వరుసల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. మైక్రో అబ్జర్వర్లకు కూడా శిక్షణ పూర్తయిందన్నారు. మోడల్ కౌంటింగ్ కూడా నిర్వహించామన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు, మీడియా ప్రతినిధులకు కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే పాస్లిస్తామని, అయితే ఎవరినీ కూడా సెల్ఫోన్లతో ఓట్ల లెక్కింపు ప్రదేశానికి అనుమతించకుండా నిషేధం ఉందన్నారు. స్టాండ్లు, ట్రైపాడ్లు లేకుండా టీవీ కెమెరాలను అనుమతిస్తామన్నారు. మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం తెలిపేందుకు, కౌంటింగ్ కేంద్రం బయట తగిన సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వేసవి దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూలర్లు, తాగునీరు, మజ్జిగ వంటి ఏర్పాట్లు కల్పిస్తామన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ–సువిధ ద్వారా.. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఏ రౌండ్కు ఆ రౌండ్ ఓట్ల వివరాలు ఈ–సువి«ధలో నమోదయ్యాక ఏఆర్ఓ ప్రకటిస్తారని, అక్కడి నుంచి మీడియాకు తెలియజేస్తామన్నారు. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా 7 గంటలలోపుగా కేంద్రాలకు చేరుకోవాల్సిందిగా కౌంటింగ్ ఏజెంట్లకు సూచించామన్నారు. తొలుత పోస్టల్, సర్వీస్ ఓట్లు లెక్కిస్తారని, పోస్టల్ ఓట్లను ఆర్ఓలే లెక్కిస్తారని పేర్కొన్నారు. వెబ్ కెమెరాలు లేకపోయినప్పటికీ, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కౌంటింగ్ కేంద్రాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామన్నారు. వీవీప్యాట్లలోని ఓట్లకు, ఈవీఎంలలోకి ఓట్లకు తేడా వస్తే..వీవీప్యాట్లలోని ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. లెక్కింపు సందర్భంగా సాంకేతిక సమస్యలు తలెత్తితే సదరు ఈవీఎంలను పక్కనపెట్టి మిగతావి లెక్కిస్తామని, విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేసి అక్కడి నుంచి అందే సూచనల మేరకు ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ సమయం.. ఫలితాల వెల్లడికి అసెంబ్లీ ఎన్నికల కంటే కొంత ఎక్కువ సమయం పడుతుందని దానకిశోర్ పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు ర్యాండమ్గా ఐదు వీవీప్యాట్లలోని ఓట్లను లెక్కించాల్సి ఉన్నందున ఎక్కువ సమయం పడుతుందన్నారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు దాదాపు 20 నుంచి 30 నిమిషాల సమయంపట్టే అవకాశం ఉందన్నారు. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల లెక్కింపు పూర్తయ్యాక పార్లమెంట్ నియోజకవర్గ ఫలితాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారని స్పష్టం చేశారు. కౌంటింగ్ సిబ్బందికాక, ఇతరత్రా సిబ్బందితో వెరసి దాదాపు 1500 మంది ఈ ప్రక్రియలో పాల్గొంటారన్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు.. ఎన్నికల సంఘం మార్గదర్శకాల కనుగుణంగా తగిన పోలీసు బలగాలతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినటుల నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద సీనియర్ ఆఫీసర్లతోపాటు తగినంత సిబ్బందిని నియమించామన్నారు.దాదాపు 5200 మంది విధుల్లో ఉంటారన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు వంద మీటర్ల వరకు 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అప్పటి వరకు విజయోత్సవ ర్యాలీలు, ప్రదర్శనలపై నిషేధం ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపులోపాల్గొనేవారు.. కౌంటింగ్ సూపర్వైజర్లు : 251 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు : 251 మంది కౌంటింగ్ అబ్జర్వర్లు : 261 మంది జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో.. సర్వీసు ఓటర్లు : 382 పోస్టల్బ్యాలెట్లు తీసుకున్నవారు.. సికింద్రాబాద్ పార్లమెంట్: 3900 హైదరాబాద్ పార్లమెంట్: 2696 ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అరగంట తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. -
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్భందీగా సాగాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆయన పోలీసు కమిషనర్ కమలాసన్రెడ్డి, ఎన్నికల పరిశీలకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్హాల్లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా ఎక్కడికక్కడ బ్యారికేడింగ్ చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ ఏజెంట్లకు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సిబ్బందికి, కౌంటింగ్ ఏజెంట్లకు వేర్వేరుగా దారులు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రతీ లెక్కింపు కేంద్రంలో 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నందున.. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 5 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 5.45 గంటలలోగా కౌంటింగ్ కేంద్రానికి రావాలని సూచించారు. ఉదయం 6 గంటలకు స్ట్రాంగ్రూంలు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరువబడుతాయని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని అన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది విధుల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి తెలపాలని అన్నారు. ఏజెంట్ల సెల్ఫోన్లు లోనికి అనుమతించబడవు... ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ ఏజెంట్ల సెల్ఫోన్లు లెక్కింపు కేంద్రాల్లోనికి అనుమతించడం లేదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. కౌంటింగ్ కేంద్ర వద్ద ఏజెంట్లు సెల్ఫోన్లు డిపాజిట్ చేసుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తమ సెల్ఫోన్లను తీసుకురావద్దని సూచించారు. లెక్కింపు కేంద్రాల సందర్శనలో సీపీ కమలాసన్రెడ్డి, ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రావీణ్య, ఎన్నికల పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, డీఆర్డీవో వెంకటేశ్వర్రావు, జిల్లా పరిషత్ సీఈవో వెంకటమాధవరావు, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్కుమార్, హుజూరాబాద్ ఆర్డీవో చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి ధీమా వారిదే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నలభై రోజులకు పైగా ఎదురుచూసిన లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరో 24 గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ నాయకులతోపాటు సామాన్యుల్లో కూడా ఉత్కంఠ పెరిగిపోతోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రధానంగా రెండు లోక్సభ నియోజకవర్గాలు ఉండగా, కరీంనగర్ స్థానంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దేశంలో తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలే అందుకు ప్రధాన కారణం. ఎగ్జిట్ పోల్ సర్వేల్లో రాష్ట్రంలో బీజేపీ గెలిచే అవకాశాలున్న స్థానాల్లో కరీంనగర్ ఒకటని పేర్కొనడంతో ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫలితంపై ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్కు కంచుకోటగా భావించే కరీంనగర్ జిల్లాలో బీజేపీ పాగా వేస్తుందా? సర్వే ఫలితాలు నిజమవుతాయా? అనే టెన్షన్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని రెండు పార్టీల నేతలు తమ యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడంతోపాటు నమ్మకమైన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించారు. ఎవరి ధీమా వారిదే లోక్సభ ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కరీంనగర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ ఎంపీ, కేసీఆర్ సన్నిహితుడు బి.వినోద్కుమార్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగగా, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సమరానికి కాలు దువ్వారు. హిందుత్వ నినాదాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకున్న బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో ఎవరికి వారే సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగినప్పటికీ, పోలింగ్ నాటి సరళి టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు విజయంపై ధీమాను పెంచింది. కారు గుర్తు, కేసీఆర్ ఛరిష్మా, సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని వినోద్కుమార్ పూర్తి విశ్వాసంతో ఉండగా, ఈసారి హిందుత్వ ఎజెండాతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు ఓడిపోయిన సానుభూతి తనకు ఉపయోగపడుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మినహా మిగతా ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ పట్ల ఓటర్లు మొగ్గు చూపారనే ధీమాతో సంజయ్ ఉన్నారు. అదే సమయంలో కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ మినహా మిగతా ఆరింట టీఆర్ఎస్కు మెజారిటీ ఓట్లు లభిస్తాయని వినోద్కుమార్తోపాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చెబుతున్నారు. మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో గెలుపు కోసం పూర్తిస్థాయిలో పనిచేశారు. ఈ రెండు పార్టీలతోపాటు సైలెంట్ ఓటింగ్ మీద కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విశ్వాసంతో ఉన్నారు. గతంలో ఎంపీగా తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, టీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత తనకు లాభించాయని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలతో మూడు పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది సర్వే ఫలితాలతో బెట్టింగ్ల జోరు జాతీయ మీడియా సంస్థలు జరిపిన సర్వేల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉన్న సీట్లలో కరీంనగర్ను చేర్చడంతో గెలుపు, ఓటములపై బెట్టింగ్లు తారాస్థాయిలో సాగుతున్నాయి. బీజేపీ గెలుస్తుందని పెద్ద ఎత్తున బెట్టింగులు కాస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ స్థానంపై స్థానికంగానే కాకుండా హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ వంటి చోట్ల కూడా భారీ ఎత్తున పందేలు కాస్తున్నారు. బీజేపీ శ్రేణుల్లో కూడా గెలుపుపై భారీ అంచనాలు ఉండడంతో ఫలితం ఆసక్తిని రేపుతోంది. టీఆర్ఎస్ ముఖ్య నేతలు మాత్రం గెలుపుపై ధీమాతో జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. పెద్దపల్లి ఫలితంపై టీఆర్ఎస్ ధీమా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో గెలుపు నల్లేరు మీద నడకగా టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్కే మెజారిటీ వస్తుందని విశ్వాసంతో ఉన్నారు. పెద్దపల్లి లోక్సభ పరిధిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో ఐదుగురు ఎమ్మెల్యేలు, మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు టీఆర్ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ నేత గెలుపు కోసం అలుపెరుగని కృషి సాగించారు. అయితే సింగరేణి కోల్బెల్ట్లో కాంగ్రెస్కు కొంత అనుకూల వాతావారణం ఉన్నట్లు పోలింగ్ సరళిలో కనిపించినా, దాన్ని పెద్దగా లెక్క చేయడం లేదు. సామాజిక సమీకరణల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ కన్నా వెంకటేష్ నేతకే అనుకూల పరిస్థితులు ఉన్నట్లు ఆపార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు భారీగా ఓట్లు పోలయ్యాయని, తమ గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ లోక్సభ ఓట్ల లెక్కింపు ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరుగనుండగా, పెద్దపల్లి ఓట్ల లెక్కింపు మంథని జెఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగనుంది. -
‘ఫలితం’ ఎవరికో!
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ ఎంపీలు ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఎన్నికలు జరిగిన 42 రోజుల తర్వాత ఫలితాలు వెలువడనుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. గతంలో లాగే టీఆర్ఎస్ జోరు కొనసాగిస్తుందా.. కాంగ్రెస్ పు నర్వైభవం సాధిస్తుందా? బీజేపీ బోణీ కొడుతుం దా?.. ఏం జరగబోతుందో మరికొన్ని గంటల్లో తెలి యనుంది. మరో 24 గంటలు గడిస్తే కౌంటింగ్ ఉండడంతో గెలుపోటములపై ఇప్పటికే జోరుగా చర్చ సా గుతోంది. ఏప్రిల్ 11న ఈవీఎంలలో ఓటు నిక్షిప్తమైం ది. అటు దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఇటు రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది అందరిని తొలు స్తుంది. ఆ ఉత్కంఠకు తెరపడే సమయం ఆసన్నమైంది. 42 రోజుల తర్వాత.. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం బరిలో టీఆర్ఎస్ నుంచి గోడం నగేశ్, కాంగ్రెస్ నుంచి రాథోడ్ రమేశ్, బీజేపీ నుంచి సోయం బాపురావులు తలపడ్డారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బొర్లకుంట వెంకటేశ్నేత, కాంగ్రెస్ నుంచి చంద్రశేఖర్, బీజేపీ నుంచి కుమార్ పోటీ పడ్డారు. దేశంలో ఏడు విడతల్లో ఎన్నికలు జరగగా, తెలంగాణలో మొదటి విడతలోనే అన్ని లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 42 రోజుల తర్వాత ఫలితాలు వెలబడనుండడంతో ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ సభ్యులుగా ఎవరు గెలుస్తారోననే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. 2014లో కారు జోరు.. 2014 సాధారణ ఎన్నికల్లో కారు జోరు కొనసాగింది. అప్పుడు ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ సభ్యులుగా గోడం నగేశ్, బాల్క సుమన్ గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి నగేశ్ మరోసారి బరిలో నిలిచారు. బాల్క సుమన్ గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈసారి పెద్దపల్లి నుంచి వెంకటేశ్ నేతకాని బరిలో నిలిచారు. డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వెంకటేశ్ నేతకాని కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికల వేళా టీఆర్ఎస్లో చేరి పెద్దపల్లి అభ్యర్థిగా ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు. అన్ని నియోజకవర్గాల్లో.. లోక్సభ 2014 ఎన్నికల్లో అభ్యర్థుల పరంగా టీఆర్ఎస్ ముథోల్ మినహా అన్ని నియోజకవర్గాల్లో జోరు కనబర్చింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గోడం నగేశ్కు ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్కు చెందిన నరేశ్ జాదవ్పై మెజార్టీ లభించింది. ఒక్క ముథోల్లో మాత్రం నరేశ్ జాదవ్దే పైచేయి అయింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బాల్క సుమన్కు పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథనితోపాటు ఉమ్మడి జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో అధిక ఓట్ల ఆధిక్యం సాధించారు. దీంతో కారు స్పీడ్ను హస్తం, సైకిల్ అందుకోలేక బొర్ల పడ్డాయి. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి మరోసారి గోడం నగేశ్, రాథోడ్ రమేశ్ బరిలో నిలిచారు. రాథోడ్ రమేశ్ కిందటి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుంచి బరిలో నిలిచిన సోయం బాపురావు టీఆర్ఎస్, కాంగ్రెస్లకు గట్టి పోటీనిచ్చారు. ఇక పెద్దపల్లిలో మూడు పార్టీల నుంచి అభ్యర్థులు మారారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు మంచి మెజార్టీ సాధించారు. దీంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రభావం.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మొదట్లో సోషలిస్ట్ పార్టీ ఒకసారి గెలుపొందింది. ఆ తర్వాత కాంగ్రెస్ తన విజయ పరంపరను కొనసాగిస్తూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ కూడా తన ప్రభావం చాటుకుంది. 2004లో టీఆర్ఎస్ బోణి కొట్టింది. 2014లో మరోసారి గెలుపొందింది. ఇక పెద్దపల్లిలో 1962 నుంచి కాంగ్రెస్ గట్టి పట్టు కలిగి ఉంది. మధ్యలో తెలంగాణ ప్రజాసమితి, తెలుగుదేశం పార్టీలే వేర్వేరు సాధారణ ఎన్నికల్లో గెలుపొందారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి 2014లో టీఆర్ఎస్ బోణి కొట్టింది. ఇక ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ ఇప్పటి వరకు బోణి చేయలేదు. -
కౌంటింగ్కు ఏర్పాట్లు
పాలమూరు: మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుంచి 17వ లోక్సభకు తమ ప్రతినిధిగా ఎవరిని పంపాలనే నిర్ణయాన్ని ప్రజలు ఓటు రూపంలో తీర్పునివ్వగా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇది చేసి 40 రోజులు దాగా అందులో దాగి ఉన్న ఓటర్ల మనోగతం తేలేందుకు గడువు సమీపిస్తోంది. ఈనెల 23న గురువారం ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించగా అదేరోజు రాత్రి 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఈవీఎంలను సీల్ చేసి జిల్లా కేంద్రంలోని జేపీఎన్ఈఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. అదే కళాశాలలో ఓట్లు లెక్కించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లు ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు అనంతరం సర్వీస్ ఓట్లు లెక్కిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ఈవీఎంలను తెరిచి రౌండ్ల వారీగా ఓట్లు లెక్కిస్తారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో రౌండ్ల వారీగా ఓట్లు లెక్కించి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని మొదటి రౌండ్లు అన్నింటినీ కలిపి పార్లమెంట్ స్థానంలో మొదటి రౌండ్గా గుర్తించి ఫలితాలు వెల్లడిస్తారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రౌండ్ల వారీగా లెక్కించిన ఓట్లను, పార్లమెంట్ స్థానంలో రౌండ్ల వారీగా లెక్కించిన ఓట్లను పార్లమెంట్ స్థానంలో రౌండ్ల వారీగా మొదట ఎన్నికల సంఘానికి చెందిన సువిద వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాతే మీడియాకు రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తారు. ఓట్లు లెక్కించే కేంద్రంలో నిరంతరం వీడియో చిత్రీకరణ జరుగుతుంది. ఇందుకోసం సీసీ కెమెరాలు బిగింపు పూర్తయింది. సీసీ కెమెరాల ద్వారా మహబూబ్నగర్ కలెక్టరేట్తోపాటు హైదరాబాద్, ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయాల్లో లైవ్గా వీక్షించే ఏర్పాట్లు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. 23న ఉద యం 8గంంటలకు ఓట్లు లెక్కింపు ప్ర క్రియ ప్రారంభమైనా మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో తుది ఫలితం రాత్రి 7గంటల తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీవీప్యాట్ చిట్టీల లెక్కింపు తొలిసారిగా వీవీప్యాట్లలోని చిట్టీలు (ఓటర్ స్లిప్) లెక్కించనున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని 5పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీప్యాట్లు తెప్పించి, వాటిలోని ఓటర్ స్లిప్లు బయటకు తీసి లెక్కిస్తారు. ఓటరు చిట్టీలు అభ్యర్థుల గుర్తులు వారీగా వేరు చేసి 25 చిట్టీలు ఒక కట్టగా కట్టి లెక్కిస్తారు. వీవీప్యాట్లలో లెక్కించిన చిట్టీలు, అంతకుముందు ఈవీఎంలలో లెక్కించిన ఓట్లు సరిపోలిన తర్వాతే ఫలితాలు వెల్లడిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా చిట్టీలు మళ్లీ లెక్కిస్తారు. వీవీప్యాట్లలోని చిట్టీలను లెక్కించేందుకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో లాటరీ పద్ధతిన 5 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేస్తారు. అలాగే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 14 టేబుళ్లు వేస్తారు. 14టేబుళ్లపై ఒకసారి లెక్కించిన ఓట్లు ఒక రౌండ్గా భావిస్తారు. ఇలా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఓటర్ల ఆధారంగా రౌండ్లు నిర్ణయిస్తారు. ఎక్కువ ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కువ రౌండ్లు ఉంటాయి. తక్కువ ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో తక్కువ రౌండ్లు ఉంటాయి. కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన మహబూబ్నగర్ న్యూటౌన్: పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ రొనాల్డ్రోస్ భగీరథకాలనీ జేపీఎన్ఈఎస్ కళాశాల వద్ద కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లు, టేబు ళ్లు, బారీకేడ్లు, కళాశాల వద్ద భద్రత వంటి విషయాలను పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత ఏఆర్వోలకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ జేసీ స్వర్ణలత, కలెక్టరేట్ ఏఓ ప్రేమ్రాజ్, జెడ్పీ సీఈఓ వసంతకుమారి, ఆర్డీఓలు శ్రీనివాస్, సీహెచ్ శ్రీనివాస్లు పాల్గొన్నారు. లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వీవీప్యాట్లలో స్లిప్పుల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రొనాల్డ్రోస్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పా టు చేసిన సమావేశంలో కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసిన వీవీప్యాట్లలో స్లిప్పులను లెక్కించాల్సి ఉందని, వీవీప్యాట్ల లెక్కిం పు అనంతరం ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఇన్చార్జి జేసి స్వర్ణలత, జెడ్పీ సీఈఓ వసంతకుమారి, ఆర్డీఓలు శ్రీనివాస్, సి.హెచ్.శ్రీనివాస్, కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
పకడ్బందీగా కౌంటింగ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ను ఈ నెల 23వ తేదీన పకడ్బందీగా చేపట్టనున్నట్లు ఖమ్మం పార్లమెంటరీ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్తో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, వాటిలో ఖమ్మం మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఈవీఎంల కౌంటింగ్ ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతుందన్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని, ఖమ్మం నియోజకవర్గానికి 23 రౌండ్స్, పాలేరుకు 20, మధిర 19, వైరా 17, సత్తుపల్లి 20, కొత్తగూడెం 18, అశ్వారావుపేట నియోజకవర్గానికి 14 రౌండ్లుగా నిర్ణయించామని చెప్పారు. ఒక్కో టేబుల్కు అభ్యర్థికొకరు చొప్పున ఏజెంట్ కూడా లెక్కింపులో ఉంటారని, లెక్కింపు కోసం 127 మంది కౌంటింగ్ అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు 128 మంది, మైక్రో అబ్జర్వర్లు 128 మంది ఉంటారని తెలిపారు. ఈవీఎంల కౌంటింగ్ అనంతరం ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి ఐదు వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించనున్నట్లు వివరించారు. ఒక వేళ ఏమైనా తేడా వస్తే చివరిగా వీవీ ప్యాట్ల స్లిప్పుల ఓట్లనే పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1683 ఉండగా.. 830 మంది ఓట్లు వేశారని, సర్వీస్ ఓటర్లు 715కి 431మంది ఓట్లు వేశారని పేర్కొన్నారు. కాగా, కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారులకు సంబంధించిన ఫోన్ల అనుమతి లేదని స్పష్టం చేశారు. జిల్లాలో 15,13,094 మంది ఓటర్లు ఉండగా 11,38,130 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 75.22 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ఫలితాలను రౌండ్ల వారీగా తెలియజేస్తామని, అంతిమ ఫలితం మాత్రం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని ఐదు వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపు అనంతరం మాత్రమే ప్రకటించనున్నట్లు వివరించారు. సువిధ వెబ్ సర్వీస్ ద్వారా ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపును పటిష్టంగా చేపట్టనుండగా భారీ బందోబస్తును నిర్వహిస్తున్నామని, 400 మంది పోలీస్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తుగా ఉంటారని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం ప్రాంగణాన్ని 6 సెక్టార్లుగా విభజించి మూడంచెల భద్రత కల్పించామని, కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ఫోన్లు, బ్లూటూత్స్, స్మార్ట్ చేతి గడియారాలు వంటి వస్తువులు అనుమతించబోమని సీపీ తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు ఎలాంటి ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో షామియానాలు, మైకులు, వాహనాలను అనుమతించేది లేదని, కౌంటింగ్ కేంద్రంలో ప్రవేశించే వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను తప్పనిసరిగా పాటించి ప్రతిఒక్కరూ సహకరించాలని సీపీ కోరారు. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ఫలితాల రోజు ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఎల్లుండి (గురువారం) జరగనుందని, అన్ని కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు ఉందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లను చేశామని, ఫలితాల తర్వాత ఎలాంటి విజయోత్సవాలకు, సంబురాలకు అనుమతి లేదన్నారు. 144 సెక్షన్ అమలు ఉన్నందున కౌంటింగ్ సెంటర్ల నుంచి 100 మీటర్ల లోపు సిబ్బంది మినహా ఎవరిని అనుమతించమని తెలిపారు. వేసవికాలం దృష్ట్యా కౌంటింగ్ సిబ్బందికి మంచినీరు, మజ్జిగ వంటి ఏర్పాట్లు చేశామన్నారు. -
పక్క పక్క వీధుల్లోనే ప్రత్యర్థులు
బంజారాహిల్స్: గత నెల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యాలు ఈ నెల 23న జరగనున్న ఓట్ల లెక్కింపులో వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో పలువురు ఒకే రోడ్డులో నివాసం ఉండటం గమనార్హం. బంజారాహిల్స్ రోడ్ నం. 12లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో ఆరుగురు సమీపంలోనే నివసిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. నల్లగొండ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉత్తమ్కుమార్రెడ్డి, టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన వేమిరెడ్డి నర్సింహారెడ్డి ఇదే రోడ్డులో పక్కపక్క కాలనీలోనే నివసిస్తుంటారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి, బీజేపీ అభ్యర్థి బి. జనార్దన్రెడ్డి నివాసాలు అత్యంత సమీపంలో ఉన్నాయి. ఇక ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకా చౌదరి, భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రోడ్ నం. 12లోనే నివాసం ఉంటారు. ఏపీ విశాఖపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మినారాయణ కూడా ఇదే రోడ్డులో నే ఉంటున్నారు. ఎన్నికల ఫలితాలపై ఒక వైపు కార్యకర్తలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోడ్డులోనూ వాతావరణంవేడెక్కింది. ఎన్నికల కౌంటింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో గతత రెండు రోజులుగా నేతలు, కార్యకర్తలు రాకపోకలతో అభ్యర్థుల నివాసాలు కిటకిటలాడుతున్నాయి. రాజకీయాలకు వేదికగా నిలిచే బంజారాహిల్స్ రోడ్ నెం. 12 ఉంటున్న రేణుకా చౌదరి గతంలోనే ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కొండావిశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు. మిగతావారంతా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. -
ఫస్ట్ ఖమ్మం... లాస్ట్ ఇందూరు
సాక్షి, హైదరాబాద్: మరో 48 గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. లోక్సభ ఎన్నికల్లో విజేతలెవరో తేలనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతోపాటు ఏ నియోజకవర్గం ఫలితం ఎప్పుడు వస్తుంది... ముందుగా ఫలితం ఎక్కడ తేలుతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఎన్నికల సంఘం కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్ల ప్రకారం చూస్తే ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపులో తొలుత ఖమ్మం ఫలితం రానుందని అంచనా. చివరగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నిజామాబాద్ ఫలితం వెలువడనుంది. అయితే ప్రతి నియోజకవర్గానికి సగటున ఐదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీప్యాట్లను లెక్కించాలన్న సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆయా పార్లమెంటు సెగ్మెంట్లలో ర్యాండమ్గా తీసుకొనే పోలింగ్ స్టేషన్లలో ఉన్న ఓట్లనుబట్టి ఫలితాల వెల్లడి స్థానాలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కౌంటింగ్’తీరూ కీలకమే... తెలంగాణలోని 35 కౌంటింగ్ కేంద్రాల్లో 17 లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేసిన ఈసీ.. ఒక రౌండ్కు 14 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కించనుంది. ఈ లెక్కన రాష్ట్రంలో తక్కువ 1,476 పోలింగ్ స్టేషన్లున్న ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ ఫలితం మొదట రానుంది. అయితే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఐదు వీవీప్యాట్లను లెక్కించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసినందున వాటి లెక్కింపునకు అదనంగా మరో ఐదు గంటలు పట్టనుంది. తొలుత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించిన అనంతరం చివరగా ర్యాండమ్ పద్ధతిలో ఐదు వీవీప్యాట్లలోని ఓట్ల ను లెక్కించనున్నారు. ఈవీఎంలలో పోలైన ఓట్ల తో వాటిని సరిపోల్చుకున్న అనంతరం విజేతను అధికారికంగా ప్రకటించనున్నారు. ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపునకు సగటున 20 నుంచి 30 నిమిషాలు పట్టనుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉన్న చోట ఈ సమ యం మరింత పట్టే అవకాశం లేకపోలేదని ఈసీ వర్గాలంటున్నాయి. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లోని పరిస్థితులు, ఎన్నికల సిబ్బంది, రిటర్నింగ్ అధికారి పనితీరు ఫలితాల వెల్లడికి పట్టే సమయంపై ప్రభా వం చూపే వీలుందని చెబుతున్నాయి. పోలింగ్ బూత్లు ఎక్కువగా ఉన్న పార్లమెంటు సెగ్మెంట్ ఫలితాలు కూడా ముందుగానే వెలువడే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నాయి. ఈవీఎం ఓట్ల కౌంటింగ్ సమయంలో ప్రతి అభ్యర్థికి పోలైన ఓట్లను రికార్డు చేయాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట్ల ఆలస్యం జరిగే అవకాశముంది. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలు తక్కువగా ఉన్న జహీరాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఫలితాలు ముందుగా వెలువడినా ఆశ్చర్యంలేదు. నిజామాబాద్లో ఆలస్యం... దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నిజామాబాద్ లోక్సభ ఎన్నికల ఫలితం ఆలస్యం కానుంది. దేశంలోనే ఆలస్యంగా ఫలితం వెలువడే లోక్సభ స్థానం ఇదే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సీటుకు 185 మంది పోటీపడుతుండటంతో ఓట్ల లెక్కింపు నెమ్మదిగా సాగనుంది. ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన ఒక్కో అభ్యర్థికి నమోదైన ఓట్లను పరిశీలించి రికార్డు చేసేందుకు సగటున ఏడు నిమిషాలు తీసుకోనుంది. దీంతోపాటు చివరగా లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని 35 పోలింగ్ కేంద్రాల్లోని వీవీప్యాట్లను లెక్కించాల్సి ఉండటంతో ఫలితం ఆలస్యం కానుంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపుతో పోలిస్తే దీనికే ఎక్కువ సమయం పట్టనుంది. అయితే అభ్యర్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. ఈ కౌంటింగ్ కేంద్రంలో 18 టేబుళ్లను ఏర్పాటు చేసింది. తద్వారా ఫలితాల వెల్లడిలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంది. మరోవైపు దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజిగిరిలోని ఎల్బీ నగర్, మేడ్చల్ అసెంబ్లీ స్థానాల పరిధిలోని 500 పైచిలుకు పోలింగ్ కేంద్రాలు ఉండటంతో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. సగటున ఇక్కడ 30 రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే మేడ్చల్, ఎల్బీ నగర్ అసెంబ్లీల పరిధిలో 28 టేబుళ్లు ఏర్పాటు చేయడంతో పార్లమెంటు కౌంటింగ్ రౌండ్లు తగ్గుతాయనే అంచనా ఉంది. అయితే అవి ఏ మేరకు తగ్గుతాయన్న దానిపై స్పష్టత లేదు. మొత్తంమీద అత్యధిక ఓటర్లు, పోలింగ్ స్టేషన్లు ఉన్న ఈ నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. -
ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరగాలి
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత పకడ్బందీగా నిర్వహించాల ని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ కన్సల్టెంట్ భన్వర్లాల్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ నెల 23న చేపట్టే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై జిల్లా ఎన్నికల ప్రధాన అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులకు సోమవారం రెండవ విడత శిక్షణ, పునశ్చరణ కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భన్వర్లాల్ పాల్గొన్నారు. ఎన్నికల అధికారులకు పలు సలహా లు, సూచనలు ఇచ్చారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన చట్టపరమైన అంశాలతోపాటూ, కౌంటింగ్కు ముందు, తర్వాత దశలవారీగా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల అధికారులకు సవివరంగా తెలియజేశారు. స్ట్రాంగ్ రూమ్లు తెరిచే సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు, పరిశీలకులు తప్పనిసరిగా అక్కడ ఉండడం వంటి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ విమర్శలకు, ఆరోపణలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చూడాలని వారికి స్పష్టం చేశారు. లెక్కింపు ప్రక్రియకు తుది రూపం ఇవ్వడానికి మొదటి రెండు రౌండ్లు దశలవారీగా ఎలా లెక్కించాలో ఆ సమయంలో ఏఆర్ఓలు ఎలా అప్రమత్తం గా ఉండాలో వివరించారు. రిటర్నింగ్ అధికారుల, పరిశీలకులకున్న పరిమితులు అలాగే వారికున్న అధికారాలు వాటిని ఎలా వినియోగించాలో వివరిస్తూ, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటింగ్ యంత్రాల భద్రత, ఎన్నికల తాలూకు రికార్డులు, పత్రాలను ఎలా సీలు వేయాలి, ఫలితాల ప్రకటనను ఎన్నికల సంఘానికి నిర్దేశిత ఫారాల్లో ఎలా నింపి పంపాలన్న విషయాలపై కూడా అవగాహన కల్పించారు. ఈటీపీబీఎస్ వంటి అధునాతన టెక్నాలజీని మొదటిసారిగా వినియోగిస్తున్నందువల్ల దానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడం, ఎన్వలప్లమీద క్యూఆర్ కోడ్ వంటివి స్కాన్ చేయడం వంటి అంశాలను దానికి సంబంధించిన విషయ నిపుణులు వివరించారు. ఓట్ల లెక్కింపులో సువిధ అనే అప్లికేషన్ను ఎలా ఉపయోగించాలో కూడా మాస్టర్ ట్రైనర్లు వివరించారు. సువిధ పోర్టల్లో డేటా ఎంట్రీ జరిగిన తర్వాతనే ఆ రౌండ్ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుందని కూడా వారికి స్పష్టం చేశారు. 21వ తేదీన ఓట్ల లెక్కింపు సన్నద్ధతను పూర్తిస్థాయిలో పరీక్షించి చూసుకోవడానికి డ్రెస్ రిహార్సల్ నిర్వహించాలని భన్వర్లాల్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరుగుతున్న దృష్ట్యా అందరి దృష్టి ఈవీఎంల మీద ఉంటుందనీ, ఎక్కడా అజాగ్రత్తకు అవకాశం లేకుండా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని రజత్ కుమార్ ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి శిక్షలు విధిస్తుందని భన్వర్ లాల్ హెచ్చరించారు. -
‘ఎగ్జిట్’ను మించి సీట్లొస్తాయ్
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు మించి రాష్ట్రంలో బీజేపీకి లోక్సభ సీట్లు దక్కనున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్లోని అసంతృప్తవాదులు, రాష్ట్ర కాంగ్రెస్లోని మరికొందరు నేతలు త్వరలో బీజేపీలో చేరనున్నారని తెలిపారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ నియంతృత్వ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజల్లో నిశ్శబ్ధ విప్లవం రాబోతోందని, బెంగాల్ తరహాలోనే రాష్ట్రంలో కూడా బీజేపీ రాజకీయాలను తిరగరాయబోతోందని అన్నారు. ఇద్దరు చంద్రుల ఫెడరల్ ఫ్రంట్.. ఫ్యామిలీ ఫ్రంట్కు టెంటు లేదని ఏపీ, తెలంగాణ సీఎంలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ సమాజం సమయం కోసం ఎదురుచూస్తోందని, రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ మీద విపక్షాలు రుజువులు అడగడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారన్నారు. ఈ దాడుల్లో దోమ కూడా చనిపోలేదని కేసీఆర్ చెప్పారని, బహుశా ఆయనకు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ చెవిలో చెప్పి ఉంటాడని ఎద్దేవా చేశారు. సైన్యం మీద కన్నా ఉగ్రవాదుల మీదే కేసీఆర్కు నమ్మకం ఎక్కువ అని ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వం అని కేసీఆర్ కాంగ్రెస్కు బయట నుంచి మద్దతు ఇస్తా అంటున్నారని, కత్తులు దూసుకునే పార్టీలు పొత్తులు పెట్టుకుంటే ప్రజలు ఒప్పుకోరని అన్నారు. చంద్రబాబు టీడీపీని సోనియా గాంధీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారన్నారు. చంద్రబాబు చక్రం తిప్పుతారని, కేసీఆర్ బొంగరం తిప్పుతారని కొన్ని మీడియా సంస్థలు తెగ ప్రచారం చేస్తున్నాయన్నారు. ఏపీలో ఎదురుకానున్న ఓటమికి చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ సాకులు వెతుకుతున్నారన్నారు. ఓ వైపు ట్యాంపరింగ్ జరిగిందంటూ.. మరోవైపు నేనే గెలుస్తానని చెప్పుకుంటూ విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారన్నారు. బీజేపీకి స్వతహాగా మెజారిటీ వస్తుందని, ఎన్డీఏకు గతంలో కన్నా ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. మోదీ ఓటమి కోసం కూటమి కట్టి, ఎజెండా లేకుండా ఎన్నికలకు వెళ్లిన విపక్షాల కూటములను ప్రజలు నమ్మలేదన్నారు. -
కాయ్.. రాజా కాయ్!
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిట్పోల్స్ వెలువడేసరికి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. మొత్తం ఏడు దశల్లో సుదీర్ఘంగా జరిగిన ఎన్నికలు కావడంతో ఇంతకాలం పందెం రాయుళ్లు స్తబ్దుగా ఉన్నారు. కానీ, ఆదివారం ఎగ్జిట్ పోల్స్ వెలువడటంతో పందేలు జోరందుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్తోపాటు పలు తెలంగాణలోని ఇతర నగరాల్లోనూ జోరుగా పందేలు సాగుతున్నాయి. పలు స్థానాలపై ఇప్పటికే పార్టీల బలాలవారీగా స్పష్టత వచ్చింది. దీంతో ఇక మెజారిటీ ఎంత వస్తుంది.. అన్న అంశాలపై బెట్టింగులు ఊపందుకున్నాయి. ఆరు స్థానాలపై ఉత్కంఠ.. ఇక తెలంగాణలో ఆరు స్థానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్కు అత్యధిక స్థానాలు వస్తా యని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ప్రతిపక్షాలకు ఒక ట్రెండు సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యం లో భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, మల్కాజిగిరి స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మూడు పార్టీలు నువ్వానేనా అన్న తరహాలో సర్వశక్తులూ ఒడ్డాయి. ఆయాస్థానాల్లో అన్ని పార్టీలు విజయంపై ధీమాగా ఉండటం విశేషం. దీంతో ఈ స్థానాలపై పందేలు కాసేందుకు పందెంరాయుళ్లు అధికంగా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుంది? ఏ పార్టీ గెలుస్తుంది? ఎంత మెజారిటీ వస్తుంది? అన్న విషయాలపై బెట్టింగులు సాగుతున్నాయి. రూ.1000 నుంచి రూ.లక్షల్లో ఈ బెట్టింగులు సాగడం విశేషం. ప్రభావం చూపని లగడపాటి.. గత తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలకు ముందు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్–తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని తన సర్వేను ప్రకటించాడు. అదేసమయంలో జాతీయ సర్వేలన్నీ రాజగోపాల్ సర్వేకు విరుద్ధంగా ఉన్నా సరే.. మెజారిటీ ప్రజలు, పందెం రాయుళ్లు రాజగోపాల్ సర్వేకే మొగ్గుచూపారు. అదే నమ్మకంతో కోట్ల రూపాయల్లో కూటమి గెలుస్తుందంటూ రెండు రాష్ట్రాల ప్రజలు జోరుగా పందేలు కాశారు. అయితే టీఆర్ఎస్ 88 స్థానాలు గెలవడం, కాంగ్రెస్ కూటమి కేవలం 21 స్థానాలకు పరిమితమవడంతో కథ అడ్డం తిరిగింది. కూటమి గెలుస్తుందంటూ రూ.వందల కోట్లలో పందేలు కాసిన వారు ఘోరంగా ఓడిపోయి.. మొత్తం డబ్బును పోగొట్టుకున్నారు. ఈసారి కూడా అదేరీతిలో లగడపాటి సర్వే ఉండటంతో బెట్టింగుబాబులు లగడపాటి సర్వేను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. టీఆర్ఎస్, వైసీపీ వైపే.. అన్ని సర్వేలు తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ విజయాన్ని ఖరారు చేయడంతో బెట్టింగుబాబులంతా ఈ రెండు పార్టీలవైపే చూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖుల విజయావకాశాలపై హైదరాబాద్లోనూ పంటర్లు పందేలు జోరుగా కాస్తున్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ ఎంత మెజారిటీ సాధిస్తుంది? అన్న విషయాల్లో పందేలు నడుస్తున్నాయి. -
హైదరాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల వివరాలు
సాక్షి, హైదరాబాద్ : జిల్లా పార్లమెంట్ ఎన్నికల వివరాలు సోమవారం విడుదలయ్యాయి. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 17,86,515 ఓట్లు పోలయ్యాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో మొత్తం 9,10, 437 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 4, 85, 913 ఓట్లు పురుషులవి కాగా 4,24,520 ఓట్లు మహిళలవి, ఇతరులవి నాలుగు ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మొత్తం 8,76,078 ఓట్లు పోలయ్యాయి. వీటిలో పురుష ఓటర్లు 4,77,929, మహిళా ఓటర్లు 4,24, 520, ఇతరులవి నాలుగు ఓట్లు ఉన్నాయి. ఇందులో సర్వీసు ఓటర్లు 382 మంది ఉన్నారు. సికింద్రాబాద్లో 3,900 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఇక హైదరాబాద్లో 2,696 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లను ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రామ్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో లెక్కించనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను నిజాం కళాశాలలో లెక్కించనున్నారు. హైదరాబాదులో మొత్తం 14 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్లు ఉంటాయి. ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. మొత్తం 588 మంది కౌంటింగ్ స్టాఫ్ ఎన్నికల ఫలితాల నాడు విధులు నిర్వహించనున్నారు. కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తయింది. ఈ నెల 23న ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం.. పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సోమవారం ట్రాఫిక్ అడిషినల్ సీపీ అనిల్కుమార్ యాకుత్పురా, చార్మినార్లలోని కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటును పరిశీలించారు. -
కౌంట్ డౌన్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఆయా పార్టీల నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఓట్ల లెక్కింపునకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో మరోసారి సర్వే అంచనాలు దగ్గర పెట్టుకుని ఫలితాలపై విశ్లేషిస్తున్నారు. ప్రతిష్టాత్మక చేవెళ్ల లోక్సభలో గెలుపుపై మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు గంపెడాశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ, విపక్ష కాంగ్రెస్ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క కాషాయదళం కూడా విజయంపై గట్టి నమ్మకంతో ఉంది. ఓట్ల లెక్కింపు సమయం సమీపిస్తుండడంతో పార్టీలు, అభ్యర్థులు నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కలు వేసుకుంటున్నారు. చేవెళ్ల స్థానానికి పోలింగ్ శాతం మరీ తక్కువగా నమోదైన విషయం తెలిసిందే. 55 శాతం మించకపోవడంతో ఆ ప్రభావం ఏ పార్టీపైన పడుతుందోనని ప్రధాన పార్టీల నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ముగ్గురిలోనూ గెలుపు ధీమా చేవెళ్ల లోక్సభకు 23 మంది పోటీ చేశారు. ఇందులో ప్రధాన, చిన్నాచితక పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులూ బరిలో నిలిచారు. అధికార పార్టీ తరఫున పోటీ చేసిన పారిశ్రామికవేత్త రంజిత్ రెడ్డి విజయంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నిక ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన.. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోక్సభ ఎన్నిక ఒకరకంగా ఆయన రాజకీయ భవిష్యత్ను నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జిల్లాకు చెందిన నేతలను కాదని స్థానికేతరుడునైన రంజిత్రెడ్డికి సీఎం కేసీఆర్ అవకాశమిచ్చారు. ఈయన గెలుపు బాధ్యతలను మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి పార్టీ అప్పగించింది. ఒకరకంగా మహేందర్రెడ్డి రాజకీయ పరపతి.. రంజిత్రెడ్డి విజయంపై ఆధారపడి ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఆయన మంత్రి పదవి రేసులో ఉన్నట్లే. రంజిత్రెడ్డి గెలిస్తే పార్టీలో మహేందర్రెడ్డి స్థానం పదిలమే. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మూడు నాలుగు నియోజకవర్గాలు.. కొండాకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాండూరు, చేవెళ్ల, వికారాబాద్ సెగ్మెంట్లలో కాంగ్రెస్కు అధికంగా ఓట్లు దక్కే వీలుందని నేతలు భావిస్తున్నారు. మిగతా పార్టీల్లో కంటే ఈయన అభ్యర్థిత్వం ముందే ఖరారు కావడం వల్ల పకడ్బందీ ప్రణాళికతో ప్రజాక్షేత్రంలో దిగారు. ఎక్కువ మంది ఓటర్లను కలుసుకునే సమయం దక్కింది. అలాగే బీజేపీ అభ్యర్థి బెక్కరి జనార్దన్రెడ్డి గెలుపు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మహేశ్వరం నియోజకవర్గంలో ఈ పార్టీకి మంచి పట్టుంది. దీనికి తోడు పోలింగ్కు కొన్ని రోజుల ముందు హైదరాబాద్కు ప్రధాని మోదీ, శంషాబాద్కు ఆ పార్టీ చీఫ్ అమిత్షా రావడం మరింత కలిసి వస్తోందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తం మీద ఏ అభ్యర్థి.. ఏ మేరకు ఓటర్లకు దగ్గరయ్యారన్నది 23న తేలనుంది. ఎమ్మెల్యేల్లో ఆందోళన చేవెళ్ల లోక్సభ ఫలితాలు అందరిలో ఉత్కంఠను రేపుతుండగా.. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో మాత్రం టెన్షన్ను పుట్టిస్తున్నాయి. ఈ ఫలితాలు ఒకరకంగా తమ రాజకీయ భవిష్యత్ను నిర్దేశిస్తాయని భావిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. శాసనసభ నియోజకవర్గాల్లో మెజార్టీ సాధిస్తేనే.. సదరు ఎమ్మెల్యేలపై సీఎం దృష్టిలో సదాభిప్రాయం ఉంటుంది. ఒకవేళ ఆయా సెగ్మెంట్లలో మెజార్టీ తగ్గితే గులాబీ దళపతికి తాము ఏం సమాధానం చెప్పుకోవాలోనని కలవరపడుతున్నారు. ముఖ్యంగా వికారాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు ఆశించిన స్థాయిలో ఓట్లు దక్కలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైనట్లు వినికిడి. ప్రధానంగా మహేశ్వరంలో కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్కు దగ్గరైన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. ఎన్నికల సమయంలో ‘మన పార్టీ అభ్యర్థిని గెలిపించుకురండి’ అని వీరికి సీఎం చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గ ఓటర్లు ఎటు వైపు ఉంటారోనని సర్వత్రా ఆసక్తి రేపుతోంది. -
కౌంటింగ్కు పటిష్ట భద్రత
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ లోక్సభ ఓట్ల లెక్కిం పు ప్రక్రియ సందర్భంగా ప టిష్ట భద్రత ఏర్పాటు చే యనున్నట్లు పోలీస్ క మిషనర్ కార్తికేయ తె లిపారు. కౌంటింగ్ నిర్వ హించే డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ క ళాశాల (సీఎంసీ) పరిసరాల్లో 144 సెక్షన్ అమ లులో ఉంటుందని చెప్పారు. సీపీ ఆదివారం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 23న జరగనున్న నిజామాబాద్ ఎంపీ స్థానం ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లెక్కింపు కేంద్రం వద్దకు అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది తప్ప ఇతరులను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లే అన్ని దారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని, అనుమతి ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రం వద్దకు పంపుతామన్నారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం వద్దకు రావద్దని సూచించారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసుశాఖలోని టాస్క్ఫోర్స్ విభాగం 2018లో గేమింగ్, గుట్కా, ఎక్సైజ్, ఎక్స్ప్లోసివ్, మైనింగ్ తదితర చట్టాల కింద 493 కేసులు నమోదు చేసిందని వివరించారు. 2019లో ఇప్పటి వరకు 14 కేసులు నమోదయ్యాయని తెలిపారు. -
పార్టీ మారి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు : భట్టి
దిల్సుఖ్నగర్/మీర్పేట: శాసనసభ విలువలను కాపాడే విధంగా సీఎం వ్యవహరించాలని, కానీ అందుకు విరుద్ధంగా ఆయనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటికే ఓటర్లు పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం తలదించుకోవాల్సి వస్తుందన్నారు. ఓటర్లను మోసం చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం మహేశ్వరం నియోజవర్గంలోని ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లలో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్నగర్లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ... కాంగ్రెస్ తరఫున గెలిచి పార్టీ మారిన సబితా ఇంద్రారెడ్డి పై 420, 405, 406 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రతిపక్షం ప్రశ్నిస్తుందనే భయంతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్నారు. సబితకు కాంగ్రెస్లో పెద్దపీట వేశామని, కానీ ఆమె పార్టీ మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏమాత్రం నైతిక నైతిక విలువలున్నా సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. సదరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో కోర్టుకు వెళ్లామన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. సబితకు కాంగ్రెస్ పెద్దపీట వేసిందని, పార్టీ మారిన ఆమెపై 420 కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తుందని, కేసీఆర్ అందరికంటే ముందే పోయి కాళ్లు మొక్కుతాడని వ్యాఖ్యానించారు. సభలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, నాయకులు కుసుమకుమార్, భానుప్రకాశ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి, జంగారెడ్డి, నరసింహాæరెడ్డి, హర్షిలత, శిరీష తదితరులు పాల్గొన్నారు. చట్టసభలు దేవాలయాలతో సమానం... ప్రజాస్వామ్యంలో చట్టసభలు దేవాలయాలతో సమానమని, అలాంటి చోట పవిత్రమైన మనుషులే ఉండాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర’లో భాగంగా ఆయన ఆదివారం బాలాపూర్, మల్లాపూర్, కుర్మల్గూడ, నాదర్గుల్, బడంగ్పేట, అల్మాస్గూడ, మీర్పేట, జిల్లెలగూడ మున్సిపాలిటీల మీదుగా రోడ్షో నిర్వహించారు. అనంతరం జిల్లెలగూడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చేసేలా ఒత్తిడి తేవాలన్నారు. సభాపతి చట్టాలను చట్టాలను గౌరవించి, వారి సభ్యత్వాలను రద్దు చేయాలని కోరారు. ‘కార్పొరేట్’తో ప్రభుత్వ వ్యాపారం... ప్రభుత్వం కార్పొరేట్ జూనియర్ కళాశాలలతో రూ.వేల కోట్ల వ్యాపారం చేస్తూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. కార్పొరేట్ కళాశాలలతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లే రాష్ట్రంలో దాదాపు 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థతో కోట్లలో ఒప్పందం కుదుర్చుకొని ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుందన్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశా>రు. లేని పక్షంలో అందులో ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లేనని అన్నారు. సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ విప్ అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, నర్సింహారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి వంగేటి ప్రభాకర్రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్, బడంగ్పేట మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి, జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ మారి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు : భట్టి మీర్పేట: టీఆర్ఎస్ హయాంలో వేసిన ఓటుకు విలువ లేకుండా పోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా జిల్లెలగూడ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేశ్వరంలో కాంగ్రెస్పై అభిమానంతో 1.26 లక్షల మంది ఓటు వేసి గెలిపిస్తే సబితా ఇంద్రారెడ్డి ఓటర్లను మోసం చేసి పార్టీ మారారని దుయ్యబట్టారు. ఓ పార్టీలో గెలిచిన అనంతరం మరోపార్టీలో చేరిన వారిపై, ప్రోత్సహించిన సీఎం కేసీఆర్పై ఆర్టికల్ 356 ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పి నిధులన్నీ దోచేస్తోందని అన్నారు. -
ఇక నాలుగు రోజులే..
జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన నిజామాబాద్ ఎంపీ స్థానం ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు నాలుగు రోజుల్లో తెరపడనుంది. మరోవైపు బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నారు. ఏయే వర్గాలు ఎవరిని ఆదరించాయి.. గ్రామీణ , అర్బన్ ప్రాంత ఓటర్లు ఎవరికి బాసటగా నిలిచారు.. మైనారిటీలు ఎవరికి మద్దతు పలికారు..యువత ఎటువైపు ఉంది, పింఛనుదారుల ఓట్లు ఎవరికి పడ్డాయి.. తదితర అంశాలపై రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ షురువైంది. ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడింది. జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన నిజామాబాద్ ఎంపీ స్థానం ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు నాలుగు రోజుల్లో తెరపడనుంది. ఎవరు విజయం సాధిస్తారనేది బుధవారం ఓట్ల లెక్కింపు అనంతరం తేలనుంది. బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉండగా, విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపై ఇటు రాజకీయవర్గాల్లో సర్వత్రా చర్చ సాగుతోంది. ఏయే వర్గాలు ఎవరిని ఆదరించాయి... గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు.. పట్టణ, నగర ఓటర్లు ఎవరికి బాసటగా నిలిచారు. మైనారిటీలు ఎవరికి మద్దతు పలికారు..యువత ఏ అభ్యర్థికి బాసటగా నిలిచింది. పింఛనుదారుల మద్దతు ఎవరికి దక్కింది.. ఇలా ఎవరివారే లెక్కలేసుకుంటున్నారు. రాజకీయ వర్గాలతో పాటు, సామాన్య ఓటర్లు సైతం అభ్యర్థుల గెలుపు, ఓటములపై చర్చించుకుంటున్నారు. ఏ నలుగురు కలిసినా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైనే మాట్లాడుకుంటున్నారు. మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నిక దేశం దృష్టిని ఆకర్షించిన విషయం విదితమే. దీంతో ఈ నియోజకవర్గం ఫలితంపై స్థానిక ఓటర్లతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్కు భారీ ఏర్పాట్లు.. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిం చేం దుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలోని ఓట్లను డిచ్పల్లిలోని సీఎంసీ మెడికల్ కళాశాలలో లెక్కించనున్నారు. అలాగే కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పరిధిలోని ఓట్ల కౌంటింగ్ కోసం జగిత్యాలలో వీఆర్కే సొసైటీ భవనం లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ఫలితం వెల్లడించడానికి ఎక్కువ సమయం పట్టనుంది. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపై అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లకు చూపించాల్సి ఉంటుంది. దీంతో ప్రతి రౌండ్లోనూ ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీన్ని అధిగమించేందుకు టేబుళ్ల సంఖ్యను పెంచుకోవడం ద్వారా వీలైనంత తొందరగా లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపగా, నిర్ణయం రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. -
మొదటి రౌండ్కు రెండు గంటలు
ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఓట్ల లెక్కంపులో మొదటి రౌండ్ ఫలితం రావడానికి రెండు గంటలకు పైగా పట్టవచ్చని కలెక్టర్ రామ్మోహన్ రావు పేర్కొన్నారు. రెండో రౌండ్ నుంచి సమయం తగ్గుతుందన్నారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు 16 రౌండ్లు, జగిత్యాల, కోరుట్లకు 15 రౌండ్లు, బాల్కొండ, బోధన్లకు 14 రౌండ్లు, ఆర్మూర్కు 13 రౌండ్లు ఉంటాయన్నారు. కాగా కౌంటింగ్ ఏజెంట్ల నియామకం కోసం అభ్యర్థులు మూడు రోజుల ముందుగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెల 23న కౌటింగ్ నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు డిచ్పల్లిలోని సీఎంసీలో, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు జగిత్యాలలో లెక్కింపు జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అవుతుందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 18 టేబుళ్లు ఏర్పాటు చేస్తామని, అదనంగా మరో టేబుల్ ఆర్వో కోసం ఉంటుందన్నారు. ఇందుకు గాను పోటీ చేసే అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. ఇందుకు ఫారం–18 ద్వారా ఏఆర్వోకు దరఖాస్తు చేయాలన్నారు. నిజామాబాద్కు ప్రత్యేకంగా 36 టేబుళ్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతివ్వాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించామని, అనుమతి వస్తే ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరూ రహస్యాన్ని పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్ హాల్ లోనికి సెల్ఫోన్ తనుమతి లేదన్నారు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయిన తరువాత ప్రతి నియోజకవర్గం పరిధిలో ర్యాండంగా ఐదు వీవీ ప్యాట్లను ఒక దాని తరువాత ఒకటి లెక్కించనున్నట్లు తెలిపారు. మొదట కౌటింగ్కు, వీవీప్యాట్ కౌటింగ్లో తేడా వస్తే, వీవీప్యాట్ ఓట్లనే ప్రమాణికంగా తీసుకుంటాన్నా రు. అయితే 2013 నుంచి ఇప్పటి వరకు కౌంటింగ్లో ఎలాంటి తేడాలు రాలేదన్నారు. పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల వివరాలు అందించాలి– కలెక్టర్ రామ్మోహన్ రావు ఇటీవల నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ రోజు వారి ఖర్చుల వివరాలను వచ్చే జూన్ 21వ తేదీలోగా అందజేయాలని కలెక్టర్ రామ్మోహన్ రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖర్చుల వివరాలను సమర్పించడంలో సందేహాలు, సలహాలు తీసుకోవడానికి ఎన్నికల వ్యయ నోడల్ అధికారి(జిల్లా సహకార) కార్యాలయంలో ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పోటీ చేసిన అభ్యర్థులకు ఈ–ఫైలింగ్పై అవగాహన కల్పించడానికి జూన్ 15 అవగాహన కార్యక్రమం, 18న ప్రగతిభవన్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున అభ్యర్థులందరూ తప్పక హాజరు కావాలన్నారు. -
లోక్సభ ఓట్ల కౌంటింగ్కు చకచకా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 23వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్కు కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. దీంతో అటు అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు, ప్రజలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్ సూపర్ వైజర్లకు, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వడం పూర్తయ్యింది. ఎలాంటి వివాదాలకు తావులేకుండా కౌంటింగ్ ప్రక్రియను వీడియో రికార్డు చేయనున్నారు. ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు అందితే వెబ్ కాస్టింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ లో క్సభ స్థానానికి ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరగగా 15,85,433 మంది ఓటర్లకు గాను.. 11,75,129 మంది ఓ టర్లు (74.12 శాతం )తమ ఓట్లు హక్కు వినియోగించుకున్నారు.మిర్యాలగూడ రోడ్డులోని దుప్పలపల్లిలోని వేర్హౌస్ గోదాముల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. పార్టీల ఏజెంట్లు అంతా 6.30 గంటల వరకే కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటారు. వారి సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ల సీల్ను తీస్తారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తీసుకొస్తారు. అదంతా వీడియో రికార్డింగ్ జరుగుతుంది. కాగా, 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఒక్కో ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆర్ఓ టేబుల్ వద్దనే లెక్కిస్తారు. ఆ తర్వాత ఆయా నియోజకవర్గాల వారీగా 14 టేబుళ్లలో ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్తో పాటు ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు. వీడియో రికార్డింగ్తో పాటు మైక్రో అబ్జర్వర్ కూడా ఓట్ల లెక్కింపు వద్ద ఉండి పరిశీలిస్తారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 1990 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలైన ఓట్లను మొత్తంగా 144రౌండ్లలో లెక్కిస్తారు. ఒక్కో నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ స్టేషన్ల ఆధారంగా కౌంటింగ్ కొనసాగుతుంది. దేవరకొండ నియోజకవర్గంలో 308 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుండగా, నాగార్జున సాగర్లో 293 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అవి 21 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. అదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో 256 పోలింగ్ స్టేషన్లు 19 రౌండ్లలో, హజూర్నగర్ నియోజకవర్గంలోని 302 పోలింగ్ స్టేషన్లు 22 రౌండ్లలో, కోదాడలోని 286 పోలింగ్ స్టేషన్లు 21 రౌండ్లలో, సూర్యాపేటలో 264 పోలింగ్ స్టేషన్లు 19 రౌండ్లలో పూర్తవుతుండగా నల్లగొండ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉండగా 20 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తికానుంది. అంటే ఒక గంటలో 3 నుంచి 4 రౌండ్ల కౌంటింగ్ పూర్తయినా.. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈవీఎంల తర్వాత వీవీప్యాట్ల లెక్కింపు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 ఈవీఎంలకు సంబంధించిన వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించనున్నారు. అవి కూడా డ్రా పద్ధతిన ఎంపిక చేసి వీవీ ప్యాట్లలోని స్లిప్పులను లెక్కిస్తారు. ఆతర్వాత కౌంటింగ్ పూర్తవుతుంది. కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. శనివారం దుప్పలపల్లి గోదామును జాయింట్ కలెక్టర్ వి.చంద్రశేఖర్తో కలిసి సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. ఈనెల 23న కౌంటింగ్ నిర్వహించనున్నందున సత్వరం ఏర్పాట్లు చేయాలని, ఈ నెల 21న ఈసీఐ డ్రెస్ రిహార్సల్స్ నాటికి కౌంటింగ్ హాల్లలో ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారి గదిలో పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్, సర్వీస్ ఓటర్ల లెక్కింపు ఏర్పాట్లపై చర్చించారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ హాల్లు పర్యటించి చేయాల్సిన ఏర్పాట్లపై చర్చిస్తూ, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందికి వేర్వేరుగా దారులు, సైన్బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కౌం టింగ్ సెంటర్ పెయిడ్ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. పారి శుద్ధ్యం, పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ హాల్ వారీగా ఏర్పాట్లు జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించాలని, మౌలిక వసతులు రిపోర్టింగ్, ఇతరత్రా జిల్లా రెవెన్యూ అధికా రి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారివెంట డీఆర్ఓ రవీంద్రనాథ్, ఆర్డీఓ జగదీశ్రెడ్డి, సర్వే ఏడీ శ్రీనివాసులు, పంచాయతీ రాజ్ డీఈ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షించాలి నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల కౌం టింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేలా సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కా ర్యాలయంలో ఉదయాదిత్య భవన్లో కౌంటింగ్ ప్రక్రియపై పరిశీలనకు నియమించిన 140మంది సూక్ష్మ పరిశీలకులకు నియమించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు ధనంజయ్ దేవాంగన్ నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, ఎల్ఎస్కెన్ అదనపు పరిశీలకులు నల్లగొండ, కోదా డ, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ పరిశీలిస్తారని వివరించారు. ఎన్నికల పరిశీలకుల తరఫున సూక్ష్మ పరిశీలకులుగా నియమించిన బ్యాంక్, ఎల్ఐసీ, ఇతర ఉద్యోగులు కౌం టింగ్ రోజున బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ రవీంద్రనాథ్, నల్లగొం డ ఎల్డీఎం సూర్యం, సూర్యాపేట ఎల్డీఎం శ్రీనివాస్, జేడీఏ శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద విజిటింగ్ సంతకం చేస్తున్న కలెక్టర్ -
కాంగ్రెస్లో టెన్షన్.. టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ఫలితాల సమయం సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరవైఫల్యం తర్వాత కీలక నేతలంతా బరిలోకి దిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం దగ్గరపడుతున్న పార్టీలో ఆందోళన ఎక్కువవుతోంది. పార్టీలోని రాష్ట్ర ముఖ్య నేతలం దరికీ అగ్నిపరీక్షగా మారిన ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి? సానుకూలంగా ఉంటే ఏం జరగబోతోంది? ప్రతికూలంగా ఫలితాలు వస్తే పార్టీలో ఎలాంటి మార్పులుంటాయి? అసలు పార్టీ మనుగడ, భవిష్యత్తు ఏమవుతుందనే ప్రశ్నలు నాయకులతో పాటు పార్టీ శ్రేణులను కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పోలింగ్ సరళిని బట్టి ఐదారు స్థానాల్లో పార్టీకి మంచి ఓటింగ్ జరిగిందని భావిస్తున్నా.. నేడు వెలువడనున్న ఎగ్జిట్పోల్ ఫలితా లు ఏం చెబుతాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. చావో.. రేవో! ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చావో రేవో సమస్యగా పరిణమించాయి. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురవడం.. పార్టీ నేతలంతా వలసబాట పడుతుండడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా మనుగడ సాగించాలంటే.. లోక్సభ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. దీనికితోడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్రెడ్డి, పొన్నం ప్రభాకర్, రాష్ట్రంలో కీలక నేతలుగా గుర్తింపు పొందిన కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు ఏఐసీసీ స్థాయి నేతలుగా చెలామణి అవుతున్న రేణుకాచౌదరి, మధుయాష్కీగౌడ్, కేంద్ర మాజీ మంత్రి మల్లురవి లాంటి నేతల భవితవ్యంపై ఈ ఎన్నికలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయనే చర్చ పార్టీలో జరుగుతోంది. దీంతో ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన ఈ నేతల్లో ఎవరు విజయబావుటా ఎగరేస్తారు? ఎవరు తేలిపోతారనేది కాంగ్రెస్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ముఖ్యంగా ఉత్తమ్, రేవంత్, కోమటిరెడ్డి బ్రదర్స్ నాయకత్వ పటిమకు అగ్నిపరీక్షగా మారింది. ఈ ఫలితాలను బట్టే రాష్ట్ర కాంగ్రెస్లో మార్పులుంటాయనే చర్చ కూడా ఈ ఉత్కంఠకు కారణమవుతోంది. ఈ ఎన్నికల్లో ప్రజామోదం వచ్చిన వ్యక్తికే పార్టీ పగ్గాలిస్తారన్న అంచనాలు కూడా ఉత్కంఠను రెట్టింపు చేస్తున్నాయి. ముఖ్యంగా పోలింగ్ సరళిని బట్టి మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ గెలుస్తుందనే అంచనాలు, ఐదారు స్థానాల్లో తమ కన్నా బీజేపీ మెరుగైన ప్రదర్శన చేసిందనే లెక్కలు ఈ ఆందోళనకు కారణమవుతు న్నాయి. అయితే, నల్లగొండ, భునవగిరి, మల్కాజ్గిరి, ఖమ్మం, చేవెళ్ల, మహబూబాబాద్ స్థానాలపై ఆశలు సన్నగిల్లకపోయినా వీటిలో ఎన్ని స్థానాలు గెలుస్తామన్న దానిపై పార్టీ అంతర్గత సర్వేల్లోనూ స్పష్టత రావడంలేదు. -
గెలిచేదెవరు.. ఓడేదెవరు?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఓ వైపు లోక్సభ... మరోవైపు ప్రాదేశిక ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం సమీపిస్తోంది. ఏప్రిల్ 11వ తేదీన లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగగా.. 43 రోజుల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా జరిగిన విషయం విదితమే. ఇందులో వరంగల్, మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఆ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జెడ్పీలు లక్ష్యంగా టీఆర్ఎస్ సర్వశక్తులొడ్డగా.. 27న వెలువడే ఫలితాలతో ఎవరి ఆశలు ఎంత మేరకు ఫలించాయనేది బయటపడనుంది. మూడు రోజుల వ్యవధిలో అటు పార్లమెంట్, ఇటు ప్రాదేశిక ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీల నాయకులతో పాటు ఇటు ఓటర్లలో చర్చలు మొదలయ్యాయి. బరిలో 3,166 మంది వరంగల్, మహబూబాబాద్ లోక్సభ పార్లమెంట్ స్థానాల్లో పార్టీలు, స్వతంత్రులు కలిపి 29మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఆరు జిల్లాల పరిధిలోని 70 జెడ్పీటీసీ స్థానాలకు 403 మంది, 780 ఎంపీటీసీ స్థానాలకు 2,734 మంది రంగంలో ఉన్నారు. అంటే మొత్తంగా విజయం కోసం 3,166 మంది నిరీక్షిస్తున్నారు. ఈనెల 23వ తేదీన వెల్లడయ్యే లోక్సభ నియోజకవర్గాల ఫలితాల్లో ఇద్దరు మాత్రమే విజేతలుగా నిలవనున్నారు. ఈ రెండు స్థానాల్లో ఫలితం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు భారీగానే ఆశల్ని పెట్టుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల జోరును ఇక్కడ కూడా చూపిస్తామనే ధీమాతో గులాబీ దళంలో ఉండగా.. ఫలితం తమకు అనుకూలంగా వస్తుందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెబుతున్నాయి. ఇక వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగాం, భూపాలపల్లి జయశంకర్, ములుగు జిల్లాల్లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోరులో 18 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవిపోగా 70 జెడ్పీటీసీ, 762 ఎంపీటీసీ స్థానాల్లో తామే గెలుస్తామంటూ 3,137 మంది అభ్యర్థులు ఎవరికి వారు చెబుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే పోటీ ఉన్నా.. అక్కడక్కడా స్వతంత్రులు గెలుపు బాటలో పయనించే అవకాశముందనే ప్రచారంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. అందరిలోనూ ఆశలే ఈనెల 23, 27.. ఈ రెండు తేదీలపైనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు బోలెడు ఆశల్ని పెట్టుకున్నారు. అటు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతోపాటు ఇటు ప్రాదేశిక సమరంలో తలపడిన అభ్యర్థులంతా గెలుపు తమదేనన్న ఆశల లోకంలో విహరిస్తున్నారు. పనిలో పనిగా తమకు ఎన్ని ఓట్లు వస్తాయి.. మెజార్టీ ఎంత రావొచ్చంటూ లెక్కలేసుకుంటున్నారు. పార్టీల ఉనికిని కీలకంగా పరిగణించే ఈ ఫలితాల తీరుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రెండు ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమనే చెబుతున్నారు. కాగా రాబోయే ఐదేళ్లపాటు జిల్లాలో తమదైన ఉనికి సాగించాలనుకునే పార్టీలకు ఈ రెండు ఎన్నికల ఫలితాలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ జోరుకు అనుకున్న స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్, బీజేపీ శక్తివంచన లేకుండా చేసిన కృషి ఏ మేరకు ఫలితమిస్తుందోననేది వేచిచూడాలి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో గులాబీ పార్టీలో సరికొత్త ఉత్సాహం నెలకొనగా.. లోక్సభ ఎన్నికల్లోనూ అదే ఊపు కోసం ప్రయత్నించింది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వచ్చే సరికి అన్ని పార్టీలు అభ్యర్థులను బరిలోకి దింపాయి. చకచకా ఏర్పాట్లు అభ్యర్థుల అంచనాలను పక్కన పెడితే.. ఇంకోపక్క అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపునకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఏనుమాముల మార్కెట్లో, మహబూబాబాద్ లోక్సభ స్థానం ఈవీఎంలను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో భద్రపరిచారు. ఆయా కేంద్రాల్లో 24 గంటల భద్రత కొనసాగుతుండగా.. 23వ తేదీన జరిగే లెక్కింపునకు చేయాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాజాగా శుక్రవారం ఏనుమాములలో వరంగల్ లోక్సభ రిటర్నింగ్ అధికారి, అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మహబూబాబాద్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శివలింగయ్య ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని సూచించిన వారు.. కౌంటింగ్ హాళ్లలో బారికేడ్లు, ఫెన్సింగ్ను పరిశీలించారు అధికారులకు సూచనలు చేశారు. -
ఇద్దరి మధ్యే యుద్ధం
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోరు టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే నడవనుంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులే తుది బరిలో నిలిచారు. టీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్రెడ్డి తలపడుతున్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ప్రతాప్రెడ్డితోపాటు కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన కొమ్మరెడ్డి ఉదయ్మోహన్రెడ్డి బరి నుంచి తప్పుకొన్నారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, శ్రమజీవి పార్టీ అభ్యర్థి జాజుల భాస్కర్ తమ నామినేషన్లను ఉపసంహరించకున్నారు. దీంతో మహేందర్రెడ్డి, ప్రతాప్రెడ్డి ఇద్దరే పోటీలో నిలిచారు. కాంగ్రెస్ తమసానుకూల ఓటర్లనుశనివారమే జిల్లాదాటించేందుకుప్రయత్నాలు చేస్తోంది.వీరిని బెంగళూరుకు తరలించేందుకుఅవసరమైన ఏర్పాట్లుపూర్తిచేసినట్లుసమాచారం. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే ఇరు పార్టీలు క్యాంపు రాజకీయాలపై దృష్టిసారించాయి. వీలైనంత ఎక్కువ మంది ప్రాదేశిక సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తమవైపు తిప్పుకొనేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లను సమీకరించి శిబిరాలు నిర్వహించే ఏర్పాట్లలో ఉన్నాయి. టీఆర్ఎస్ కంటేముందే కాంగ్రెస్ పార్టీ మేల్కొనడం విశేషం. తమ సానుకూల ఓటర్లను శనివారమే జిల్లా దాటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీరిని బెంగళూరుకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సమాచారం. అందరినీ ఒకేసారి తీసుకెళ్లడం కష్టమని భావించిన ఆ పార్టీ.. విడతల వారీగా ఓటర్లను శిబిరానికి చేర్చనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నిక జరిగే 31వ తేదీ ముందు రోజు వరకు అక్కడే బస చేసే వీలుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ రాష్ట్రం సురక్షితమని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే శిబిరం నిర్వహణకు బెంగళూరు నగరాన్ని ఎంచుకున్నట్లు కాంగ్రెస్కు చెందిన ఓ నేత వెల్లడించారు. జూన్ 4నుంచి ‘బడిబాట’ ధారూరు: అన్ని గ్రామాల్లో 2019– 20 సంవత్సరానికి సంబంధించిన ఫ్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జూన్ 4నుంచి 12వ తేదీ వరకు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం డీఈఓలు, ఎక్స్అఫీషియో ప్రాజెక్టు ఆఫీసర్లకు ఆదేశాలు అందాయి. దీంతో పాటు బడిబాట కార్యాచరణ, మార్గదర్శకాలను రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ టి.విజయకుమార్ ఇందులో పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమ నిర్వాహణ కోసం విద్యాశాఖ నుం చి ప్రతి పాఠశాలకు రూ.వెయ్యి రూపాయల చొప్పున విడుదల చేసి డీఈఓలకు బాధ్యత అప్పగించారు. టీఆర్ఎస్ పరిశీలనలో మూడు ప్రాంతాలు అధికార టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు భిన్నంగా వ్యవహరిస్తోంది. అందరినీ ఒకే చోటుకు చేర్చితే నిర్వహణ కష్టమని భావించిన ఆ పార్టీ.. మూడు చోట్ల క్యాంపు ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు, విశాఖపట్నంతోపాటు నగర శివార్లలోని ఓ ప్రాంతాన్ని ప్రాథమిక ఎంచుకున్నట్లు సమాచారం. ఎంటీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్.. ఇలా కేటగిరీలుగా విభజించి ఆయా నిర్దేశిత శిబిరాలకు తరలించే అంశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థాయిని బట్టి మర్యాదలు చేయ డంతోపాటు ప్యాకేజీలు కేటాయించడం సులభమవుతుందని ఆ పార్టీకి చెందిన ఓ నేత తెలి పారు. అయితే ఓటర్లను సమీకరణ మరో రెండు రోజుల తర్వాతే ఉంటుందని తెలిసింది. ఆలోగా శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు ఎవరిని ఎక్కడికి తరలించాలన్న అంశంపై కార్యాచరణ సిద్ధం చేస్తారని సమాచారం. -
కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలన
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): పార్లమెంట్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు శుక్రవారం జగిత్యాలలో పర్యటించారు. అక్కడి కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా, జాయింట్ కలెక్టర్ రాజేశం స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వీఆర్కే కళాశాలలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూంలను, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్ రూం నుంచి నేరుగా కౌంటింగ్ హాలుకు వచ్చే దారిని పరిశీలించారు. అలాగే ఒక హాలులో 18 టేబుళ్లు చొప్పున జగిత్యాలకు రెండు హాళ్లను, కోరుట్లకు రెండు హాళ్లను పరిశీలించారు. కౌంటింగ్ వివరాలు ఏజెంట్లకు తెలుపడానికి ఏర్పాటు చేసిన టీవీలు, ఏర్పాట్లను చూసి సంతృప్తి చెందారు. కలెక్టర్ వెంట జగిత్యాల ఎస్పీ సిందూశర్మ, సబ్ కలెక్టర్ గౌతమ్, డీఆర్వో అరుణ, ఇతర అధికారులున్నారు. -
ఓట్లు లెక్కించేందుకు సర్వం సిద్ధం: సీఈవో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఈ నెల 23న ఓట్లు లెక్కించేందుకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 18 జిల్లాల్లోని 35 ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన 82 హాళ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈనెల 23న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇందుకు మొత్తంగా 1,841 టేబుళ్లు ఏర్పాటు చేయను న్నట్లు వివరించారు. 110 సెగ్మెంట్లలో ఒక్కో సెగ్మెంట్లో 15 (14+1) టేబుళ్లను, నిజామాబాద్లోని 7 సెగ్మెంట్లలో 19 (18+1) టేబుళ్లను, మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మేడ్చల్, ఎల్బీనగర్లోని 2 సెగ్మెంట్లలో 29 (28+1) టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి టేబుల్కు ఒక సూపర్వైజర్, ఒక లెక్కింపు సహాయకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉంటారని చెప్పారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక అదనపు లెక్కింపు సహాయకుడు, ఇద్దరు అదనపు సూక్ష్మ పరిశీలకులు, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్స్, ఇద్దరు కార్మికులు, ఒక డీఈవో ఉంటారని వివరించారు. వీరితోపాటు 61 మంది కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఉంటారని, మొత్తం 6,745 మంది లెక్కింపులో పాల్గొంటారని తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే పూర్తయిందని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ర్యాండమ్గా ఎంపిక చేసిన 5 వీవీ ప్యాట్లలోని పేపర్ స్లిప్పులను కూడా లెక్కిస్తామని పేర్కొన్నారు. దీంతో ఎన్నికల ఫలితాల ప్రకటన 3 గంటలు ఆలస్యం కావొచ్చని రజత్ కుమార్ తెలిపారు. -
భారీ ఏర్పాట్లు
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా అధిక సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి పోలింగ్బూత్లో ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది అభ్యర్థులందరి పోలింగ్ ఏజెంట్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇలామొత్తం 1,788 పోలింగ్ కేంద్రాల్లో 185 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి రౌండ్కు సమయం పడుతుంది. సాధారణంగా అన్ని ఎంపీ స్థానాలకు పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి 14 నుంచి 18 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లు లెక్కించనున్నారు. నిజామాబాద్లో రెట్టింపు ఏర్పాట్ల కోసం అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. సాధారణంగా అన్ని ఎంపీ స్థానాలకు పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి 14 నుంచి 18 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లు లెక్కించనున్నారు. నిజామాబాద్ స్థానం విషయానికి వస్తే 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో 18 టేబుళ్ల ద్వారా లెక్కిస్తే ఫలితాలు వెల్లడించడానికి అధిక సమయం పడుతుంది. టేబుళ్ల సంఖ్యను పెంచడం ద్వారా వీలైనంత తొందరగా ఫలితాలను ప్రకటించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం 36 టేబుళ్లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వాలని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. ఒకటీ రెండు రోజుల్లో ఈ అంశంపై ఎన్నికల సంఘం నుంచి నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి 18 టేబుళ్ల ద్వారానే కౌంటింగ్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈసీఐ అనుమతిస్తే టేబుళ్ల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ని జామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ స్థానానికి దేశంలో ఎక్కడా లేనివిధం గా 185మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి పోలింగ్బూత్లో ఒక్కో అభ్యర్థి కి ఎన్ని ఓట్లు వచ్చాయనేది అభ్యర్థులం దరి పోలింగ్ ఏజెంట్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈవీఎంలోని కంట్రోల్ యూ నిట్లో వచ్చే డిస్ప్లేను అందరు ఏజెంట్లు చూసుకోవాల్సి ఉంటుంది. ఇలామొత్తం 1,788 పోలింగ్ కేంద్రాల్లో 185 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి రౌండ్కు సమయం పడుతుంది. దీంతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఫలితం రావడం ఆలస్యమవుతుంది. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఓట్ల లెక్కింపు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థా నాల పరిధిలోని ఓట్ల లెక్కింపు డిచ్పల్లి లోని సీఎంసీలో ఏర్పాటు చేశారు. మొత్తం 15.53 లక్షల మంది ఓటర్లు ఉండగా, 10.61 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
కౌంట్ డౌన్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల ఫలితాలకు కౌంట్డౌన్ మొదలైంది. 42 రోజుల నుంచి నెలకొన్న లోక్సభ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. హోరాహోరీగా జరిగిన లోక్సభ పోరులో అభ్యర్థుల భవితవ్యం మరో ఐదు రోజుల్లో తేలనుంది. దీంతో దాదాపు నెలన్నర రోజుల పాటు స్తబ్దతగా ఉన్న పార్టీ నేతల్లో మళ్లీ హడావుడి మొదలైంది. పోలింగ్ తర్వాత వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమైన లోక్సభ అభ్యర్థుల్లో ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరుగుతోంది. ఇప్పటికే గెలుపుపై ధీమాతో ఉన్నా.. ఓటరన్న ఎవరిని ఆశీర్వదించాడో తెలియక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గత నెల 11న జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లను ఈనెల 23న ఓట్ల లెక్కించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన మేరకు అధికారులూ కౌంటింగ్ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు.. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇటు ఎంపీ అభ్యర్థులు సైతంఓట్ల లెక్కింపు ఘట్టానికి సన్నద్ధమవుతున్నారు. ఈపాటికే కౌంటింగ్ ఏజెంట్ల ఎంపికలో తలమునకలయ్యారు. చురుకైన వారిని కౌంటింగ్ కేంద్రాల్లో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. రెండు చోట్లా హోరాహోరీ ఈసారి మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి 12 మంది, నాగర్కర్నూల్ నుంచి 11 మంది పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. ఆయా పార్టీల అభ్యర్థులందరూ గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేశారు. ఒకవైపు ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు తమ గెలుపుపై ప్రభావితం చేసే అంశాలపై దృష్టి సారించారు. మహబూబ్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డికి బీజేపీ అభ్యర్థి డి.కె.అరుణ గట్టి పోటీ ఇచ్చారు. నాగర్కర్నూల్లోనూ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోరు కొనసాగింది. కాగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, షాద్నగర్, కోస్గి అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 15,05,151 ఓట్లు ఉండగా 9,82,888 పోలయ్యాయి. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 15,87,281 మంది ఓట్లు ఉంటే.. 9,92,226 పోలయ్యాయి. ఇక పోలింగ్ ముగిసిన వెంటనే బూత్ల వారీగా నమోదైన ఓట్ల వివరాలు తెప్పించుకున్న పార్టీలు ఇప్పటికే ఎవరి గెలుపుపై వారు ధీమాతో ఉన్నారు. అయితే ఓటరన్న ఎవరిని ఆశీర్వదించాడో ఓట్ల లెక్కింపు రోజే తేలనుంది. రెండు స్థానాలు.. మూడు కౌంటింగ్ కేంద్రాలు జిల్లాలో మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలు ఉండగా.. అధికారులు మూడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మహబూబ్నగర్ పార్లమెంటు ఓట్ల లెక్కింపునకు జిల్లా కేంద్రంలోని భగీరథకాలనీ వద్ద ఉన్న జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ (జేపీఎన్సీఈ) లో ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికారులు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో హాలు ఏర్పాటుచేశారు. ప్రతి నియోజకవర్గ హాలులో 14 టేబుళ్లు ఉంటాయి. మొత్తం 18 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఒక్కో టేబుల్కు ఒక్కో ఏజెంటు చొప్పున నియమించుకునే అవకాశం అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం కల్పించింది. వీరితోపాటు ఏజెంట్లందరికీ కలిపి మరో ఏజెంట్లను నియమించుకోవచ్చని సూచించింది. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 5.30 గంటలకు అన్ని పార్టీల అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్రూం తెరుస్తారు. తర్వాత పోలింగ్ ప్రారంభం కానుంది. ముందుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు వీవీప్యాట్లను ఆయా రిటర్నింగ్ అధికారుల ముందు లెక్కిస్తారు. తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇదిలావుండగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 615ను మహబూబ్నగర్ హాల్లోనే లెక్కిస్తారు. ∙నాగర్కర్నూల్ లోక్సభ స్థానానికి సంబంధించి రెండు చోట్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. వనపర్తి, కల్వకుర్తి, గద్వాల, అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను నాగర్కర్నూల్ శివారులోని ఉయ్యాలవాడలోని ప్రైవేట్ బీఎడ్ కాలేజీలో లెక్కించనున్నారు. నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేసిన అధికారులు వీడియో, సీసీ కెమెరాల నిఘాలో ఓట్లు లెక్కిస్తారు. ఇప్పటికే ఓట్ల లెక్కింపు సిబ్బందిని నియమించిన అధికారులు వారికి శిక్షణ ఇచ్చారు. అలాగే ఓట్ల లెక్కింపు, ఏర్పాట్లకు సంబంధించి అభ్యర్థులతో భేటీ అయిన రిటర్నింగ్ అధికారులు వారికి అవగాహన కల్పించారు. -
లెక్కింపు పకడ్బందీగా చేపట్టాలి
ఖమ్మంసహకారనగర్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. ఈనెల 23వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుపై గురువారం నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ విధి విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండి.. ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా కంట్రోల్ యూనిట్లోని ఓట్ల వివరాల లెక్కింపు, అందులోని దశలు, ప్రతి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్లలో గల వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్ కొండపల్లి శ్రీరామ్ శిక్షణ ఇచ్చారు. అనంతరం మైక్రో అబ్జర్వర్లకు సైతం శిక్షణ నిర్వహించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడిం బా, కలెక్టరేట్ ఏఓ మదన్గోపాల్, ఎన్నికల డీటీ రాంబాబు, ఈడీఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
‘కౌంట్’డౌన్
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతుండడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందికి రెండు విడతల శిక్షణ కార్యక్రమాలతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ తెలిపారు. ఈనెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగే విషయం తెలిసిందే. లెక్కింపు పనులకు అవసరమైన సిబ్బందితో పాటు మరో 20 శాతం మంది రిజర్వులో ఉంచినట్టు ఆయన వివరించారు. జిల్లా పరిధిలోని రెండు లోక్సభ స్థానాల్లో వెరసి 14 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను 14 కేంద్రాల్లో లెక్కించనున్నారు. ఒక్కో సెగ్మెంట్ ఓట్లు లెక్కించేందుకు 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్ఓల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఓట్ల లెక్కింపులో తొలుత ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారని దానకిశోర్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ల పరిధిలోని పోస్టల్ బ్యాలెట్లను సదరు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులైన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలకుల సమక్షంలో లెక్కిస్తారని వివరించారు. హైదరాబాద్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు నిజాం కాలేజీలోను, సికింద్రాబాద్ ఓట్ల లెక్కింపు ప్రొఫెసర్ జి. రామిరెడ్డి దూర విద్యాకేంద్రంలో ఉంటాయన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి గందరగోళానికి తావులేకుండా, పొరపాట్లకు ఆస్కారం లేకుండా లెక్కింపు సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా తొలి విడత శిక్షణ కార్యక్రమం గురువారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో జరిగింది. తొలివిడత శిక్షణ లోక్సభ నియోజకవర్గాల వారీగా రెండు నియోజకవర్గాలకు వెరసి రెండు బ్యాచ్లుగా జరగ్గా, 22వ తేదీన నిర్వహించే రెండో విడత శిక్షణలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 14 బ్యాచ్లకు శిక్షణ ఉంటుందన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లకు ఓట్ల లెక్కింపు సిబ్బందిని కేటాయించేందుకు 22వ తేదీ ఉదయం 6 గంటలకు ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ర్యాండమైజేషన్ జరుగుతుందని వివరించారు. 23వ తేదీన లెక్కింపు కేంద్రంలో ఏ టేబుల్కు ఎవరిని నియమించాలో కూడా ర్యాండమైజేషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారన్నారు. అనంతరం 8.30 నుంచి అసలు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్లను లెక్కించనున్నట్లు ఆయన తెలిపారు. సంబంధిత అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే వీవీప్యాట్ స్లిప్లను ప్రత్యేక చాంబర్లో లెక్కిస్తారని తెలిపారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు ఇలా.. ♦ కౌంటింగ్ సెంటర్లు: 14 ♦ ఒక్కో సెంటర్లో టేబుళ్లు: 14 ♦ ఒక్కో టేబుల్ వద్ద ఒక కౌంటింగ్సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్తో పాటు ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ♦ మొత్తం కౌంటింగ్ సిబ్బంది: 588 ♦ వీరితో పాటు మరో 20 శాతం మందిరిజర్వులో ఉంటారు -
నెలాఖర్లో మంత్రివర్గ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గరపడుతోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అదే సంఖ్యలో కీలక పదవులలో ఉన్న వారు అవసరం. దీంతో జూన్ 2లోపే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని, ప్రభుత్వంలోని కీలకమైన పదవులన్నీ భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మే 23న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు, కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం.. వంటి అంశాల ఆధారంగా మంత్రులుగా ఎవరెవరికి అవకాశం వస్తుందనేది పూర్తి స్పష్టత రానుంది. మరోవైపు కాంగ్రెస్ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరి చేరిక ఖాయమైంది. ఈ నేపథ్యంలో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ శాసనసభ పక్షం టీఆర్ఎస్లో విలీనం కానుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే విస్తరణకు ముహూర్తం ఖరారవుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకుతోడు కొత్తగా వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత కల్పించేలా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. సమీకరణల ఆధారంగా రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వంలో సీఎంతోపాటుగా 17 మంది మంత్రులు ఉంటారు. ప్రస్తుత మంత్రివర్గంలో 11 మంత్రులే ఉన్నారు. మరో ఆరుగురు కొత్తగా మంత్రులు చేరే అవకాశం ఉంటుంది. గత ఏడాది డిసెంబరు 13న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అప్పుడు కేసీఆర్ సీఎంగా, మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణం చేశారు. 2నెలల తర్వాత (ఈ ఏడాది ఫిబ్రవరి 18న) మంత్రివర్గ విస్తరణ జరిగింది. అప్పుడు మరో 10మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో మరో ఆరుగురు మంత్రులుగా చేరే అవకాశం ఉంది. ప్రస్తుత రెడ్డి సామాజికవర్గం నుంచి ఐదుగురు, బీసీల నుంచి ముగ్గురు, ఎస్సీ, మైనారిటీ, వెలమ వర్గాల నుంచి ఒక్కరు చొప్పున మంత్రులుగా ఉన్నారు. మంత్రివర్గంలో ఎస్టీలకు, మహిళలకు ప్రాతినిధ్యం లేదు. వీటితోపాటు ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటు దక్కనుంది. మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టారు. కొత్తగా చేర్చుకునే ఆరుగురి విషయంలో ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చారు. లోక్సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఈ జాబితాలో మార్పులు జరిగే అవకాశముంది. ఉమ్మడి జిల్లాలు, సామాజికవర్గాల సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఉమ్మడి జిల్లాల సమీకరణాల ఆధారంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఒక సీనియర్ మంత్రిని తొలగించి అదే జిల్లా నుంచి టీఆర్ఎస్ కీలక నేతకు అవకాశం ఇస్తారని టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రస్తుతం ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ మంత్రులుగా ఉన్నారు. గత ప్రభుత్వంలోనూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఈటల రాజేందర్, కేటీఆర్ మంత్రులుగా పనిచేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తదుపరి విస్తరణలో కచ్చితంగా చోటుదక్కే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న ఇద్దరినీ కొనసాగిస్తూ కొత్తగా కేటీఆర్ ప్రభుత్వంలో చేరితే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రుల సంఖ్య మూడుకు చేరుతుంది. అయితే ఒకే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా ఉంటారా అని టీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రిగా ఉన్నారు. గత ప్రభుత్వంలో వరంగల్ ఉమ్మడి జిల్లా స్పీకర్, 2 మంత్రి పదవులు దక్కాయి. ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఇదే రకమైన ప్రాధాన్యత ఉండనుంది. మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించాల్సి ఉంది. అలాగే ఎస్టీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ఎస్టీ మహిళా కోటాలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్కు మంత్రిగా అవకాశం ఉండనుంది. ఎస్సీ లోని ప్రధానమైన మాదిగ సామాజికవర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్కు అవకాశం దక్కనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి చామకూర మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు. ఈ జిల్లా నుంచి మరొకరికి మంత్రిగా అవకాశం దక్కే పరిస్థితి ఉంది. మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం ఉండా లని కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.సబితారెడ్డి శాసనసభలో సూచించారు. దీనికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రకటించారు. అనంతరం పరిణామాలతో సబితారెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ సీఎల్పీ విలీనం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రివర్గంలో సబితారెడ్డికి చోటు దక్కే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మెదక్ ఉమ్మడి జిల్లా నుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మంత్రులుగా ఎవరూ లేరు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ కీలకనేత టి.హరీశ్రావు మంత్రిగా ఉన్నారు. తదుపరి విస్తరణలో హరీశ్రావుకు మంత్రివర్గంలో చోటు దక్కనుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో టీఆర్ఎస్ ఒకే స్థానంలో గెలిచింది. బీసీల్లోని ప్రధాన మున్నూరుకాపు సామాజికవర్గం నుంచి ఈసారి మంత్రివర్గంలో ఎవరికీ చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరుఫున గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావుకు అవ కాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే శాసనమండలి చైర్మన్గా నేతి విద్యాసాగర్కు అవకాశం ఇస్తే వనమాకు అవకాశం విషయంలో పరిస్థితి మరోరకంగా ఉండనుంది. అలాగే మంత్రివర్గంలో ప్రస్తుతం ఎస్సీల్లోని ప్రధానమైన మాదిగ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేదు. సత్తుపల్లిలో టీడీపీ తరుఫున గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి వేముల ప్రశాంత్రెడ్డి మంత్రిగా ఉన్నారు. కీలకమైన శాసనసభ స్పీకర్గా ఇదే జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస్రెడ్డి వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ జిల్లాకు మంత్రి, విప్ పదవులు దక్కాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇప్పటికే రెండు కీలక పదవులు ఉన్న నేపథ్యంలో మూడో పదవి వచ్చే అవకాశాలు తక్కువే ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి జగదీశ్రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ శాసనమండలి తాత్కాలిక చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. విద్యాసాగర్ను త్వరలోనే పూర్తిస్థాయి చైర్మన్గా నియమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరో మంత్రి పదవి దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మంత్రిగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఈ జిల్లాకు 2 మంత్రిపదవులు, చీఫ్ విప్ పదవి దక్కింది. సామాజిక సమీకరణ నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు మరొకరు మంత్రిగా ఉండే అవకాశం కనిపించడంలేదు. ఈ జిల్లా ఎమ్మెల్యేల్లో ఒకరికి చీఫ్ విప్/విప్ పదవి వరించే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రస్తుతం ఎస్.నిరంజన్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్ మంత్రులుగా ఉన్నారు. గత ప్రభుత్వంలోనూ ఈ జిల్లా నుంచి ఇద్దరు మంత్రివర్గంలో ఉన్నారు. ఈ జిల్లా నుంచి ఎవరికీ అవకాశం ఉండదని తెలుస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి మహమూద్ అలీ, తలసాని మంత్రులుగా, టి.పద్మారావు శాస నసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. హైదరాబాద్ నుంచి కొత్తగా ఎవరికీ పదవి దక్కే అవకాశం లేదని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇతర కీలక పదవులు శాసనమండలి చైర్మన్గా నేతి విద్యాసాగర్కు అవకాశం ఇవ్వనున్నారు. డిప్యూటీ చైర్మన్ పదవిని ఎవరికి కట్టబెడతారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే శాసనసభలో చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. శాసనమండలిలో చీఫ్ విప్గా ఉండే పాతూరి సుధాకర్రెడ్డి ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం శాసనమండలి విప్గా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డికి ఈ పదవిని ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే మరొకరికి విప్గా అవకాశం దక్కనుంది. కీలక పదవుల కేటాయింపులో సీనియర్ ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, గంగుల కమలాకర్, బాజిరెడ్డి గోవర్దన్, కోనేరు కోనప్ప, గంప గోవర్దన్, ఆత్రం సక్కు, గొంగిడి సునీతల పేర్లను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. -
ఖమ్మంలో నా గెలుపు ఖాయం : రేణుకా చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యానికి మూల స్తంభం పారదర్శక ఎన్నికలు అని, ఎన్నికల్లో ఎటువంటి అవకతవకలు జరుగకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ... లోక్సభ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత తెలంగాణలో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు కావడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతోనే పోటీ చేసిందని, ఖమ్మంలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇంటర్ అవకతవకల్లో విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కేసీఆర్ ప్రభుత్వ వైఖరే కారణమని మండిపడ్డారు. కాగా తెలంగాణ పీసీసీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, రేణుకా చౌదరి, నిరంజన్..శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. లోక్సభ ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల తర్వాత భారీ ఎత్తున ఓటింగ్ నమోదు కావడంపై ఫిర్యాదు చేశారు. నిజామాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, హైదరాబాద్లలో ఐదు గంటల తర్వాత లక్షల ఓట్లు పోలింగ్ కావడంపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు. చేవెళ్లలో విచిత్రంగా మైనస్ ఐదు శాతం ఓట్లు నమోదయ్యాయి ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరగాలి. 5 గంటల తర్వాత క్యూలో ఉన్న ఎంతమందికి కాల్చిట్టీలు ఇచ్చారనే రికార్డులు బయట పెట్టాలి’ అని డిమాండ్ చేశారు. -
మోదీపై పోటీ ; ఆ వార్తలన్నీ ఫేక్..!
సాక్షి, నిజామాబాద్ : పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో వినూత్న నిరసన తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి 170కి పైగా రైతులు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. దాంతో అక్కడ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహించారు. అయితే, అదే స్ఫూర్తితో తాజాగా ప్రధాని మోదీ పోటీచేస్తున్న వారణాసి నుంచి కూడా పసుపు రైతులు భారీ స్థాయిలో ఎన్నికల పోటీకి దిగనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలు అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. వారణాసిలో పోటీకి దిగుతున్న అభ్యర్థులెవరూ పసుపు రైతులు కాదని అన్నారు. అక్కడ పోటీకి దిగుతున్నవారు తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పనిచేసిన వారేనని వెల్లడించారు. నిజామాబాద్ తరహాలో వారణాసిలో కూడా రైతులు భారీ ఎత్తున పోటీకి దిగుతున్నారని విడుదలైన ప్రెస్ నోట్ తప్పు అని అన్నారు. వీరు మొన్నటి నిజామాబాద్ ఎన్నికల్లో కూడా పోటీచేసినవారు కాదని తెలిపారు. రాజకీయ డ్రామాల కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే బోనస్ ఎందుకు ఇప్పించలేదని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను ప్రశ్నించారు. బీజేపీకి పట్టం కడితే పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు.. పసుపు బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టామని అరవింద్ గుర్తు చేశారు. (మోదీపై నిజామాబాద్ రైతుల పోటీ) -
తొలిరోజు ‘జెడ్పీటీసీ’కి 91 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: తొలి విడత జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల దాఖ లు పర్వం మొదలైంది. వచ్చేనెల 6న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ విడతలో భాగంగా 195 మండలాల్లో 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు తొలిరోజు సోమవారం 197 జెడ్పీటీసీ స్థానాలకు 91 మంది అభ్యర్థులు 91 నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో కాంగ్రెస్ నుంచి అత్యధికంగా 38, టీఆర్ఎస్ నుంచి 31 మంది, బీజేపీ నుంచి ఆరుగు రు, సీపీఐ, టీడీపీల నుంచి చెరొక అభ్యర్థి, ఇండిపెం డెంట్లు 14 మంది నామినేషన్లు వేశారు. సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా పదేసి చొప్పున నామినేషన్లు సమర్పించారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నామినేషన్ల దాఖలుకు సంబంధించిన వివరాలు ప్రకటించింది. ఎంపీటీసీ 665.. తొలి విడతలో భాగంగా 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 656 స్థానాల్లో 665 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో అత్యధికంగా టీఆర్ఎస్ నుంచి 296, కాంగ్రెస్ నుంచి 212, బీజేపీ నుంచి 30, సీపీఎం నుంచి 6, సీపీఐ, టీడీపీల నుంచి రెండే సి, ఇండిపెండెంట్లు 113, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయపార్టీలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టరయిన రాజకీయ పార్టీల నుంచి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఎవరా ఇద్దరు?
సాక్షి, హైదరాబాద్: కొంత విరామం తర్వాత మళ్లీ వలసల వ్యవహారం తెరపైకి రావడం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పార్టీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలను దాదాపుగా తమ పక్షాన చేర్చుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ మరో ఇద్దరికీ ఆహ్వానం పలికి కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని (సీఎల్పీ) విలీనం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసిందన్న వార్తలు ప్రతిపక్ష కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం పార్టీలో మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో చేజారిపోతున్న ఆ ఇద్దరు ఎవరనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాస్త మరుగునపడిన వలసల వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో.. రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు కూడా అప్రమత్తం అవుతున్నారు. తమపార్టీ నుంచి ఎమ్మెల్యేలెవరూ వెళ్లడం లేదని ధీమా వ్యక్తం చేస్తూనే.. ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు. గండ్ర కూడా కారెక్కిన తర్వాత మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల్లో పార్టీని వీడి వెళ్లొచ్చనే భావిస్తున్నవారు ఏం చేస్తున్నారనే దానిపైనా దృష్టి సారించారు. వారి ఆలోచనలను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ పార్టీని వీడి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం కూడా ఈ అంశంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. సీఎల్పీ కూడా విలీనం చేసుకునే దిశలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయన్న విషయం తెలుసుకున్న ఢిల్లీ పెద్దలు కూడా పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరుంటారు? ఎవరు వెళ్లిపోతారనే దానిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సంతకాలు పెట్టేశారా? గతేడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయాలంటే మొత్తం సంఖ్యలో 2/3 వంతుకు ఒకరు అదనంగా అంటే.. 13 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారికంగానే టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. తాజాగా సోమవారం గండ్ర కూడా కారెక్కుతున్నట్లు స్పష్టం చేశారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు వీరికి తోడయితేనే అది సాధ్యమవుతుంది. ఆ ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారని, ఈనెల 24న లేదంటే అసెంబ్లీ సమావేశాలు మళ్లీ మొదలయ్యేలోపు సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తవుతుందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ 11 మంది ఎమ్మెల్యేలతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు విలీనం నోటీసులపై సంతకాలు కూడా చేసేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఆ ఇద్దరు ఎవరన్న దానిపై గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ గిరిజన ఎమ్మెల్యేతోపాటుగా ఆసక్తికర వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎమ్మెల్యే ఒకరు ఈ జాబితాలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నా.. ఆయన మానసికంగా సిద్ధం కాలేదని కొందరంటున్నారు. స్వరం పెంచిన సీఎల్పీ నేత తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్వరం పెంచారు. సీఎల్పీని విలీనం చేసే దిశలో అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. సోమవారం గాంధీభవన్లో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ సీఎల్పీని విలీనం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదంటూనే.. ‘విలీనం చేసి చూడు. నీ ప్రభుత్వం ఉంటుందో? నువ్వుంటావో? మేమూ చూస్తాం. రాజ్యాంగ సంక్షో భం సృష్టించైనా నీ ప్రభుత్వం లేకుండా చేస్తాం’అని సీఎం కేసీఆర్నుద్దేశించి వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లుగా అన్నీ భరించి మౌనంగా ఉన్నామని, ఇప్పుడు ఊరూరా తిరిగి నిలదీస్తామని భట్టి హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరగబడతారని, భవిష్యత్తులో కేసీఆర్ను కుక్కలు కూడా కానవన్నారు. ఎంత మంది ఎమ్మెల్యేలు మిగిలినా వారితో కలిసి యుద్ధం చేస్తామే తప్ప నీ ముందు మోకరిల్లే ప్రసక్తే లేదని ఆయన కేసీఆర్నుద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. ఐదుగురే మిగులుతారా? ఇప్పటికిప్పుడే కాకపోయినా.. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాతే వలసలు ఉండొచ్చని జోరుగా చర్చ జరుగుతోంది. లోక్సభ ఫలితాలు తారుమారైతే.. ప్రస్తుతం మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల్లో మరో నలుగురు చేజారడం ఖాయమని, కేవలం ఐదుగురు మాత్రమే మిగులుతారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. దీనికి అనుగుణంగానే ఓ ఎమ్మెల్యే మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ నిర్ణయం తీసుకునేందుకు ఓ బలహీన క్షణం సరిపోతుందని, అయితే ఆ క్షణం కోసం మే 23వ తేదీ తర్వాతే ఆలోచిస్తానని వ్యాఖ్యా నించడం గమనార్హం. మొత్తంమీద ప్రస్తుత పరిస్థితుల్లో సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేస్తారా? ఎప్పుడు చేస్తారు? మళ్లీ వలసలుంటాయా? ఉంటే ఇప్పుడే ఉంటాయా? లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాతేనా? పార్టీని వీడి వెళ్లిపోయేది ఎవరు? ఉండేదెవరు? అనే దానిపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుండటం గమనార్హం. -
‘చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు’
సాక్షి, నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చంద్రబాబు పర్యటన చేస్తున్నారని.. ఆయన ప్రచారం వల్ల బీజేపీకి లాభమే కానీ నష్టం లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ గాని, ఫెడరల్ ఫ్రంట్ గాని బీజేపీతో సరితూగే పరిస్థితి లేదని పేర్కొన్నారు. తమ పార్టీ 300 పైగా సీట్లు గెల్చుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో ఎంపీ కవిత ఓటమి అంచుల్లో ఉన్నారని తెలిపారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తాయి కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల కోసం హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని అన్నివిధాల ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. -
ఢిల్లీ పీఠానికి ‘దక్షిణ’ ద్వారం
లోక్సభ ఎన్నికలంటే అందరికీ గుర్తొచ్చే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఢిల్లీ పీఠానికి దగ్గరి దారిగా దీనికి పేరుంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 80 స్థానాలున్న ఆ రాష్ట్రంపైనే అందరి కన్ను.. ఎందరో ప్రధానులు ఆ గడ్డపై నుంచి వచ్చిన వారే. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు పోటీ చేసేది ఆ రాష్ట్రం నుంచే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్సభ బరిలోకి దిగేది కూడా యూపీ నుంచే. హిందువులకు పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రాలుగా పరిగణించే కాశీ, అయోధ్య కూడా ఆ గడ్డపైనే ఉన్నాయి. కానీ 130 లోక్సభ స్థానాలున్న దక్షిణాది రాష్ట్రాల గురించి జాతీయ పార్టీలు ఎందుకు పట్టించుకోవు? 2009 ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 33 మంది ఎంపీలను గెలిపించి యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన విషయం జాతీయ స్థాయి నాయకులకు గుర్తుండదా? అవసరమైనప్పుడల్లా కాంగ్రెస్ అగ్ర నేతలు సేఫ్ సీటుగా భావించి దక్షిణాది రాష్ట్రాలకే వస్తారే మరి.. అయినా, ఈ రాష్ట్రాలు కేంద్రంలో ఎందుకు చక్రం తిప్పలేకపోతున్నాయి? బీజేపీకి కూడా దక్షిణాదిపై నిర్లక్ష్యం ఎందుకు? ఈసారి ఆ పరిస్థితి మారుతుందా?.. 2014 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఏకంగా 71 స్థానాలు గెలుచుకొని విజయకేతనం ఎగురవేయడంతో అందరూ యూపీ జపం చేస్తున్నారు కానీ ఈసారి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలే కీలకంగా మారుతాయనే అంచనాలున్నాయి. ఎన్నికల సమయంలో ఉత్తర భారతంలో ఎక్కడ చూసినా యూపీపైనే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత బిహార్ రాష్ట్రం గురించి మాట్లాడతారు. సామాన్య జనాన్ని ఎవరిని కదిలించినా ఆ రాష్ట్రాల్లో పార్టీలు, నాయకులు, మతపరమైన విభజన రాజకీయాలపైనే చర్చలు సాగుతుంటాయి. కానీ ఈసారి ఎన్నికలు కాస్త భిన్నంగానే కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై కూడా ఉత్తరాదిన చర్చ జరుగుతోంది. అందుకు కారణం ఆ రాష్ట్రంలో దీదీని ఢీకొట్టే వ్యక్తి మోదీ తప్ప మరెవరూ లేరన్న ప్రచారమే. బీజేపీ క్షేత్రస్థాయిలో అక్కడ పట్టు పెంచుకోవడంతో సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు అందరూ ఆ రాష్ట్రం వైపే చూస్తున్నారు. ‘దక్షిణాది’ రూటే సెపరేటు దక్షిణాది రాష్ట్రాల్లో సహజంగానే ఓ వైవిధ్యం కనిపిస్తుంది. కేవలం భాషాపరమైన వైవిధ్యం మాత్రమే కాదు సాంస్కృతిక, సామాజిక, రాజకీయ పరమైన వైరుధ్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ప్రాపంచిక విషయాలపై అవగాహన ఎక్కువ. అభివృద్ధిలోనూ, ఆదాయంలోనూ ఈ రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. అందుకే ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. 2014 ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించారు కానీ ఇప్పటికీ కర్ణాటక, తమిళనాడులో ప్రత్యేక గళాలు అడపాదడపా వినిపిస్తూనే ఉంటాయి. ఈ వైవిధ్యానికి అనుగుణంగా రాజకీయ అడుగులు వేయడం బీజేపీకి సాధ్యం కావడం లేదు. పాకిస్తాన్కు సరిహద్దు ప్రాంతం కాకపోవడమో, సహజంగానే దేశభక్తి వంటి అంశాలకు దక్షిణాది ప్రజలు తక్కువ ప్రాధాన్యం ఇవ్వడమో కానీ పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రయిక్స్ ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల ప్రచారం అస్త్రంగా మారింది కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో అది జరగలేదు. ఇక రామ మందిర నిర్మాణం వంటి వివాదాస్పద అంశాలే ఎజెండాగా మార్చుకున్న బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ ఎజెండా అమలు చేయలేకపోయింది. పైపెచ్చు రాజకీయ దురంధరుడిగా పేరున్న కరుణానిధి ‘లంకకు వారధి నిర్మించడానికి ముందు రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడో చెప్పగలరా’ అంటూ బీజేపీని సూటిగా ప్రశ్నించి ఒకప్పుడు వార్తల్లోకెక్కారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకున్న తేడాను చెప్పడానికి. ‘హిందూత్వ’ ఇక్కడ ఎజెండా కాదు! హిందూత్వ ఎజెండాను అమలు చేయలేక, దానిని పాటించడం లేదని ఇతర పక్షాలను విమర్శించనూ లేక బీజేపీ సతమతమవుతోంది. కేసీఆర్, దేవెగౌడ, కుమారస్వామి వంటి నాయకులు తరచూ దేవాలయాలు సందర్శిస్తూ, జాతక చక్రాలను నమ్ముతూ హిందూత్వ పంథాలోనే నడిచారు. కేసీఆర్ ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేశారు కానీ హిందూత్వను రాజకీయ ఎజెండాగా మలచుకోలేదు. ఇఫ్తార్ విందులకు హాజరయ్యారు. ముస్లింలకూ రిజర్వేషన్లు కల్పించారు. సెక్యులర్ వాదిగానే ప్రచారం చేసుకుంటూ తాను చేయదలచుకున్నది చేస్తున్నారు. శబరిమలలో మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చినప్పుడు జరిగిన రగడను ఒక్కో పార్టీ ఒక్కో దృక్కోణంలో చూశాయి. బీజేపీ మతపరంగా సమాజాన్ని విభజించే కోణంలోనే తన ఎజెండాను అమలు చేసింది. కానీ మత ఘర్షణగా ఈ వివాదం రూపుదాల్చలేదు. మత విశ్వాసం, సంప్రదాయం ఒకవైపు, కోర్టులు, చట్టాలు మరోవైపుగా హోరాహోరీ పోరు సాగింది. అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కోర్టు తీర్పుని యథాతథంగా అమలు చేస్తే, కాంగ్రెస్ పార్టీ మత విశ్వాసం వైపు నిలబడి రాజకీయంగా లబ్ధి పొందిందన్న విశ్లేషణలున్నాయి. మొత్తంగా చూస్తే కర్ణాటక మినహా మరే దక్షిణాది రాష్ట్రంలోనూ బీజేపీకి పట్టు లేదనే చెప్పాలి. అందుకే ఈ రాష్ట్రాల్లో ఆశలను వదిలేసుకున్న బీజేపీ తూర్పు రాష్ట్రాల్లో బలం పెంచుకోవడానికి కసరత్తు చేస్తోంది. అరుదైన కాంబినేషన్ తూర్పు–దక్షిణం ఈ ఎన్నికల్లో తూర్పు రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల అరుదైన కలయికే కేంద్రంలో ప్రభుత్వాన్ని శాసిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో జేడీ (ఎస్) అధినేత హెచ్.డి.దేవెగౌడ ప్రస్తుత ఎన్నికల్లో యూపీఏ భాగస్వామిగానే ఉన్నప్పటికీ, తెరవెనుక ఆయన కేసీఆర్తో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతూనే ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన వైపే మొగ్గు చూపిస్తున్నారు. దీదీ ఎప్పటికీ మోదీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే ఉండదు. అందుకే ఈసారి ఎన్నికల్లో దక్షిణ–తూర్పు రాష్ట్రాల ఫలితాలే కేంద్రంలో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఒడిశాలో బీజేపీ అంతో ఇంతో బలం పుంజుకున్నప్పటికీ బిజూ జనతాదళ్ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్పై చేయి సాధిస్తారని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ‘వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, బీజేడీ.. ఈ మూడు పార్టీలకు కలిపి 45–50 సీట్ల వరకు వస్తాయి. ఆ 50 సీట్లతోనే కేంద్రంలో చక్రం తిప్పొచ్చు’ అని నవీన్ పట్నాయక్ సహచర నేతలతో వ్యాఖ్యానించినట్టు సమాచారం. కులాల నిచ్చెన మీదుగా ‘కర్ణాటక’కు.. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పట్టున్నది కర్ణాటకలో మాత్రమే. ఆ రాష్ట్రంలో మఠాలు, స్వామీజీలు ఎక్కువగా ఉండడంతో బీజేపీ తన జెండా ఎగుర వేయగలిగింది. అలాగని అక్కడ పూర్తిగా హిందూత్వ ఎజెండాతోనే బీజేపీ నెగ్గిందని చెప్పలేం. కులపరమైన సమీకరణలు కూడా కలిసి వచ్చాయి. లింగాయత్ జనాభా అధికంగా ఉన్న కర్ణాటకలో అదే సామాజిక వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్ప కమలానికి అండదండగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్ కంటే యడ్యూరప్ప ఇమేజ్పైనే ఈ రాష్ట్రంలో పార్టీ ఆధారపడి ఉంది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ర్యాలీల్లో నరేంద్ర మోదీ పేరు ప్రస్తావించి హేళన చేసిన కాంగ్రెస్ అభ్యర్థులంతా నెగ్గడం ఒక విశేషంగానే చెప్పుకోవాలి. లింగాయత్లకు పట్టున్న ఉత్తర కర్ణాటకలో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. యూపీఏతో పొత్తు కుదుర్చుకున్న జేడీ (ఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ 85 ఏళ్ల వయసులో తుమకూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారంటే కచ్చితంగా బీజేపీ హవాని అడ్డుకోవడానికే. అందుకే ఈ రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. సాంస్కృతికంగా, రాజకీయంగా ఎన్నో వైరుధ్యాలున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఒకే పార్టీ, ఒకే జాతి, ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే భాష వంటి బీజేపీ సిద్ధాంతాలకు రాజకీయంగా లాభం చేకూరడం లేదు. అందుకే ఈసారి కేంద్రంలో ఏ పార్టీకీ మెజారీటీ రాకపోతే దక్షిణాదే ఏ పార్టీకైనా దిక్కు. కేరళ, తమిళనాడులో యూపీఏ హవా? కేరళలో ఎప్పటి నుంచో రెండు కూటములదే హవా. అయితే వామపక్షాల ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ లేదంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్. ఇప్పటివరకు బీజేపీ ఖాతా తెరిచిందే లేదు. ఈసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగడంతో పార్టీ కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహం వచ్చింది. హఠాత్తుగా యూడీఎఫ్ కూటమి బలం పెరిగినట్టయ్యింది. అలాగని ఇక్కడ ఎల్డీఎఫ్ని తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. బెంగాల్లో కమ్యూనిస్టులు రిటైర్ అయినట్టుగా భావిస్తుంటే, కేరళ కమ్యూనిస్టుల్లో పోరాట పటిమ ఎక్కువ. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో మొత్తం 20 లోక్సభ స్థానాలున్న కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు 14 నుంచి 16 సీట్ల వరకు వస్తాయని వివిధ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇక తమిళనాడులో జాతీయ పార్టీలకు స్థానమే లేదు. కొన్ని దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే రాష్ట్రాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. వాళ్లతో పొత్తు పెట్టుకోవడం మినహా కాంగ్రెస్, బీజేపీకి మరో మార్గం లేదు. తమిళ రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. కరుణానిధి వారసుడిగా స్టాలిన్ డీఎంకే పార్టీపై పట్టు సాధించారు. ఈ పార్టీ యూపీఏలో భాగస్వామిగా ఉంది. ఇక బీజేపీ అన్నాడీఎంకేతో పాటు ఎనిమిది పార్టీలున్న కూటమితో జతకట్టి కేవలం అయిదు స్థానాల్లోనే పోటీ చేస్తోంది. అన్నాడీఎంకే నాయకత్వ లేమితో, అంతర్గత పోరుతో సతమతమవుతోంది. అందుకే ఈసారి ఎన్నికల్లో 39 స్థానాలకు గాను యూపీఏ 31–33 స్థానాలు గెలుచుకోవచ్చునని సర్వేలు చెబుతున్నాయి. నాడు యూపీఏను నిలబెట్టిన వైఎస్సార్ దక్షిణాది రాష్ట్రాల్లో 130 లోక్సభ సీట్లు ఉన్నాయి. సంఖ్యాపరంగా చూస్తే వీటిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది అండదండ ఉండడంతోనే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. యూపీఏ–2 ప్రభుత్వం ఏర్పాటు వెనుక దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కృషిని విస్మరించలేం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీఎంగా అప్పట్లో వైఎస్ తనకున్న వ్యక్తిగత చరిష్మాతోనే 42 లోక్సభ స్థానాలకు గాను 33 స్థానాల్లో అభ్యర్థుల్ని గెలిపించారు. నాడు ఏపీ అండ లేకపోతే యూపీఏ–2 ప్రభుత్వం ఏర్పాటయ్యేది కాదనేది చరిత్ర చెప్పే నిజం. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు ఉంటుంది. 2009 ఎన్నికల్లో డీఎంకే 18 స్థానాలను గెలుచుకొని యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు తన వంతు సహకారాన్ని అందించింది. ్డ దక్షిణాది రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాలు 130 ►2009 ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోటీ చేసిన లోక్సభ స్థానాలు. ఒక్కచోటా గెలవలేదు. ►2009లో కర్ణాటకలో బీజేపీ గెలిచిన లోక్సభ స్థానాలు - 20 ►2014 ఎన్నికలు:దక్షిణాదిన బీజేపీ బలం ►3 ఏపీ, తెలంగాణలో గెలిచిన సీట్లు ►కర్ణాటకలో గెలిచిన లోక్సభ స్థానాలు -17 ►తమిళనాడులో గెలిచిన స్థానం - 1 ►కేరళలో ఖాతా తెరవలేదు -
బెట్టింగ్ బంగార్రాజులు
మహబూబ్నగర్ క్రైం: క్రీడాభిమానులకు ఐపీఎల్ జ్వరం పట్టుకున్నట్లు.. రాజకీయ అభిమానులకు కూడా అదే జ్వరం పట్టుకుంది. మహబూబ్నగర్ పార్లమెంట్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడు.. అనే దానిపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. నిన్న మొన్నటి వరకు రాజకీయ రణక్షేత్రంలో హోరాహోరీగా తలపడిన నేతల్లో విజేత ఎవరోననే ఉత్కంఠ రేపుతోంది. అభ్యర్థులు, వారి అనుచరులతోపాటు రాజకీయ నేతలతో పాటు ప్రజలు కూడా ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చేనెల 23 వరకు ఆగాల్సిందే.. పోటీలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలడానికి ఇంకా సమయం ఉంది. అందుకే ఫలితాలపై ఆసక్తి పెరగడంతో లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు. ప్రభుత్వ వ్యాపారులు, యువత, నాయకులు, ఉద్యోగులు సైతం బెట్టింగ్పై దృష్టి పెట్టారంటే పోరు ఎంత రసవత్తరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహబూబ్నగ్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ఈ అంశమే వినవస్తోంది. ఎన్నికలు ముగిసి వారం కావస్తున్నా అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న కార్యాలయాల్లో, హోటళ్లలో, దుకాణాల్లో అందరినోటా ఇదే ముచ్చట వినపడుతోంది. ఎవరి అంచనాలో వారు.. ఈనెల 11న సాయంత్రం 5గంటలకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసింది. అప్పటి నుంచి ఎవరి అంచనాల్లో వారున్నారు. మరోవైపు కొందరు ఎవరు నాయకుడు అవుతాడనే అంశంపై బెట్టింగ్ వేస్తున్నారు. ఇప్పటికే ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువరించినా.. పార్టీల వారీగా ఉన్న కార్యకర్తలు, అభిమానులు ఎవరి ధీమాలో వారున్నారు. ఇ అంతట ఇదే చర్చ పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై అందరు ఇదే చర్చ జరుగుతోంది. ఉదయం వేళ మైదానంలో రన్నింగ్ చేస్తున్న వారి దగ్గరి నుంచి సాయంత్రం టీ దుకాణాల దగ్గర ముచ్చట్లు పెట్టే వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు ఫలితాలు ఎట్లుంటయోనని ఒకటే ముచ్చట్లు పెడుతున్నారు. టీ కొట్లు, హోటల్స్, స్నాక్స్ దుకాణాలు, పని చేసే ప్రదేశాలు, వాకింగ్ మైదానాలు ఇలా ఎక్కడికి వెళ్లినా ఫలితాలపైనే ఆసక్తికర సంభాషణలు నడుస్తున్నాయి. ఫలానా వ్యక్తి గెలువబోతున్నారని ఒకరంటే.. కాదు కాదు ఇంకో వ్యక్తి గెలుస్తారంటూ వాదనలకు దిగుతున్నారు. ఏదేమైనా ఫలితాల ఎలా ఉండబోతున్నాయని తెలుసుకోవాలంటే వచ్చేనెల 23వరకు ఆగాల్సిందే. -
‘ప్రాదేశికం’పై గులాబీ గురి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నోటిఫికేషన్ విడుదలకు ముందే ఉమ్మడి జిల్లాలో ‘ప్రాదేశిక’ ఎన్నికల సందడి మొదలైంది. ఒకవైపు వారం రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు జరుగుతుంటే.. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తి.. లోక్సభ ఎన్నికల ఫలితాలపై గెలుపు ధీమాతో ఉన్న గులాబీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్స్వీప్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు జెడ్పీ చైర్మన్ పదవులపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యేలు ఆ మేరకు కసరత్తు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ ఇన్చార్జ్గా వ్యవహరించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ ఈనెల 13న స్థానిక జేజేఆర్ గార్డెన్స్లో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ సైతం ఈనెల 15న హైదరాబాద్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో సమావేశమై గెలుపు వ్యూహాలపై సలహాలు, సూచనలు చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం.. అనుసరించాల్సిన వ్యూహాలు..తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలతోపాటు స్థానిక, జిల్లా నేతల మధ్య సమన్వయం కోసం ఐదు జిల్లా పరిషత్లకు ఇన్చార్జ్లను నియమించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కు మహబూబ్నగర్, నారాయణపేట; వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డికి వనపర్తి, జోగుళాంబ గద్వాల; ఇటీవల లోక్సభ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి పార్టీ తరఫున పోటీ చేసిన పోతుగంటి రాములుకు అదే జిల్లా పరిషత్ ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. పోటెత్తుతున్న ఆశావహులు సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఎంపీటీసీ, జెడ్పిటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఆయా ఎమ్మెల్యేలకే అప్పగించిన విషయం విదితమే. పార్టీ విధేయులు, ప్రజలకు సేవ చేసే సంకల్పం ఉన్న వారిని గుర్తించి వారికే బీ–ఫారాలు ఇవ్వాలని సూచించారు. దీంతో ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో గులాబీ జెండా ఎగిరేలా చూడాల్సిన పూర్తి భారం ఎమ్మెల్యేలపై పడింది. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఎదురులేని శక్తిగా అవతరించిన టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు క్యూ కడుతున్నారు. గ్రామాల్లో గులాబీ గాలి వీస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇతర పార్టీల నుంచి చాలా మంది నాయకులు పెద్ద సంఖ్యలో కారెక్కారు. ఆ తర్వాత అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు విస్తృత ప్రచారం నిర్వహించారు. తాజాగా ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న వీరు తమను గుర్తిస్తారనే ధీమాతో ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అభ్యర్థుల ఎంపిక మాత్రం ఎమ్మెల్యేలకు సవాలుగా మారింది. ఒక్కో గ్రామం, మండలంలో భారీ పోటీ నెలకొనడంతో ఎవరికి బీ–ఫారం ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆశావహులు అభ్యర్థిత్వాల ఖరారు కోసం ఎమ్మెల్యేలను ప్రాధేయపడుతున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాజకీయం మరింత వేడెక్కనుంది. గెలుపు ధీమాలో పార్టీ శ్రేణులు ఇప్పటికే అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన గులాబీ శ్రేణులు ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ గెలుపు ధీమాతో ఉన్నారు. 2014, 2018 అసెంబ్లీ, ప్రాదేశిక ఎన్నికల తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి చాలా మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు ఇతర పార్టీలు వీడి గులాబీ కండువా కప్పుకొన్నారు. ప్రస్తుతమున్న స్థానాల్లో అత్యధికంగా టీఆర్ఎస్కు చెందిన వారు ఉండడమూ తమకు కలిసొచ్చే అంశంగా గులాబీ నేతలు భావిస్తున్నారు. దీంతోపాటు ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధే తమ గెలుపునకు సహకరిస్తుందనే విశ్వాసంతో ఉన్నారు. వీటిపై క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని.. ముఖ్యంగా పెన్షన్లు, రైతుబీమా, రైతుబంధు, కులవృత్తులకు పెద్దపీట, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో ఆయా గ్రామాల్లో లబ్ధి పొందిన వారి వివరాలు సేకరించి ప్రచారం చేపట్టాలని నేతలు ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
..ఐతే ఓకే లేకుంటే షాకే
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ నేతల భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. కనీస స్థాయిలో ఓట్లు, సీట్లు దక్కించుకునే వారికే పదవులపరంగా పార్టీలో ఇబ్బంది ఉండదని, ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం కీలక నేత భవిష్యత్తుపై కచ్చితంగా ప్రభావం ఉంటుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఈసారి లోక్సభ బరిలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలను అధిష్టానం బరిలో దింపింది కూడా ఇదే వ్యూహంతోనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీనియర్ నేత రేవంత్రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి హోదాలో రాహుల్ కోటరీ నేతగా గుర్తింపు ఉన్న మధుయాష్కీ గౌడ్, కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిలకు పార్టీలో రాజకీయ భవిష్యత్తుపై ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని చెబుతున్నా యి. ఉత్తమ్ (నల్లగొండ), కోమటిరెడ్డి (భువనగిరి), రేవంత్ (మల్కాజిగిరి) పోటీ చేసిన స్థానాల్లో గెలుపోటములు, వారికి వచ్చిన ఓట్ల ఆధారంగా అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ స్థానాల్లో గెలిచిన నేతకు పార్టీ రాష్ట్ర పగ్గాలు ఇచ్చినా ఆశ్చర్యం లేదని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ఉత్తమ్కు ఊరట లభించేనా...? ఈసారి లోక్సభ ఎన్నికలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి కీలకం కానున్నాయి. ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎదుర్కొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైనా అధిష్టానం ఆయనపై చర్యలకు పూనుకోకపోగా లోక్సభ ఎన్నికల రూపంలో రాహుల్ గాంధీ ఆయనకు మరో పరీక్ష పెట్టారని పార్టీ వర్గాలంటున్నాయి. ఆయనే పట్టుబట్టి మరీ నల్ల గొండ లోక్సభ నుంచి ఉత్తమ్ను పోటీ చేయించారని, ఇప్పుడు ఫలితం తారుమారైతే టీపీసీసీ చీఫ్ మార్పు అంశం మళ్లీ తెరపైకి వస్తుందని అంటున్నారు. ఎమ్మెల్యే పదవిని పణంగాపెట్టి మరీ ఉత్తమ్ను లోక్సభ బరిలో దింపగా ఆయన గెలిస్తే అదే ఊపు మీద హుజూర్నగర్ అసెంబ్లీని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని, లేదంటే ఆయన ఎమ్మెల్యేగానే మిగిలే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ సమర్థతకు కూడా ఈ ఎన్నికలు పరీక్ష కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబట్టి తెచ్చుకున్న ఐదు స్థానాల్లో కేవలం రెండింటినే వారు గెలుచుకోగా వాటిలో వెంకట్రెడ్డి ఓటమిపాలయ్యారు. అయినా పట్టుబట్టి ఆయన భువనగిరి లోక్సభ టికెట్ తెచ్చుకున్నారు. తన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి సహకారంతో లోక్సభ బరిలో దిగిన వెంకటరెడ్డి... ఈ ఎన్నికల్లనూ ఓడిపోతే పార్టీలో కూడా సైలెంట్గానే ఉండాల్సి వస్తుందని, వచ్చే ఎన్నికల వరకు అలాగే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. రేవంత్కు కీలకం... మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్న రేవంత్రెడ్డి భవిష్యత్తుకు కూడా ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఓటమిపై ఆశ్చర్యపోయిన రాహుల్ గాంధీ... రేవంత్కున్న ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని గెలుపు అవకాశాలున్న మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి ఆయనకు మరో అవకాశమిచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేవంత్ గెలిస్తే పార్టీలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలకంగా మారతారని, లేదంటే ఆయన మరోసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చే వరకు ఎదురుచూడాల్సిందేననే చర్చ జరుగుతోంది. మొత్తంమీద ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్లో ఎవరు గెలుస్తారు.. ఓడిపోతారనే దాన్ని బట్టి రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు, నాయకత్వం ఆధారపడి ఉంటుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. వారి భవిష్యత్తూ ప్రశ్నార్థకమే! ఖమ్మం నుంచి పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి రేణుక, నిజామాబాద్ నుంచి బరిలో నిలిచిన మధుయాష్కీ గౌడ్, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్కు సైతం ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రూపు గొడవలు, టికెట్ల కోసం పోటీని తట్టుకొని సోనియా కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో రేణుకా చౌదరి చివరి నిమిషంలో ఎంపీ టికెట్ తెచ్చుకోగలిగారు. సొంత ఇమేజ్పై గెలిచి వస్తానని అధిష్టానానికి ఆమె మాటిచ్చారు. ఇప్పుడు ఫలితం సానుకూలంగా వస్తే అధిష్టానం వద్ద రేణుక ఇమేజ్ పెరుగుతుందని, లేదంటే ఈసారి టికెట్ తెచ్చుకోవడం కూడా కష్టమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో ముఖ్యనేత, రాహుల్కు సన్నిహితుడు అయిన మధుయాష్కీ గౌడ్ భవిష్యత్తూ ఈ ఎన్నికలతోనే ముడిపడి ఉంది. పార్టీతోపాటు నియోజకవర్గపరంగా కూడా ఆయనకు ఈ ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన భువనగిరి నుంచి పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరగ్గా అధిష్టానం నల్లగొండ స్థానానికి ఆయన పేరును పరిశీలించి చివరికి పాత స్థానమైన నిజామాబాద్ టికెట్నే యాష్కీకి కేటాయించింది. ఇప్పుడు ఆయన ఓడిపోతే నియోజకవర్గంలో భవిష్యత్తు గడ్డుగానే మిగిలిపోతుందని అంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కోరిమరీ టికెట్ తెచ్చుకుని మహబూబాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా అధిష్టానం ఆయనకు మహబూబాబాద్ లోక్సభ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు గెలిస్తే నాయక్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కేంద్ర మంత్రి స్థాయిలో కొనసాగవచ్చని లేదంటే ఆయన భవిష్యత్తూ అంధకారమేననే చర్చ జరుగుతోంది. ఎప్పుడూ జడ్చర్ల అసెంబ్లీ నుంచి పోటీ చేసే టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానమైన నాగర్కర్నూల్ నుంచి పోటీ చేశారు. ఇప్పటికే చాలాసార్లు ఓడిన ఆయన మళ్లీ ఎంపీగా పోటీ చేశారని, ఇప్పుడు ఓడిపోతే ఈసారి జడ్చర్ల అసెంబ్లీ సీటు కూడా కష్టమేనని పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తంమీద రాష్ట్ర కాంగ్రెస్లోని ముఖ్య నాయకుల భవిష్యత్తును మే 23న వెలువడనున్న లోక్సభ ఎన్నికల ఫలితాలు నిర్దేశించనున్నాయి. -
ఆమే కింగ్ మేకర్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్లలో వెల్లివిరిసిన చైతన్యం ఎవరికి ప్రయోజనం చేకూర్చనుందనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ పార్లమెంట్ ని యోజకవర్గంలో పురుషులతో పో ల్చితే మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్సాహంగా పోలింగ్ పోలిం గ్ బూత్లకు వచ్చి ఓటేశారు. అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కీలకంగా మారిన ఈ మహిళలు ఎవరికి పట్టం గడతారనేదానిపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే లెక్కలేసుకుంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరి«ధిలో మొత్తం 15.53 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 7.37 లక్షల మంది పురుష ఓటర్లు కాగా, 8.15 లక్షల మంది మహిళా ఓటర్లు న్నారు. వాస్తవానికి పురుషుల కంటే మహిళ ఓటర్లు సుమారు 78 వేలు (సుమారు పది శాతం) అధికంగా ఉన్నారు. గురువారం జరిగిన పోలింగ్ రోజు 5.87 లక్ష ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 4.73 లక్షల మంది ఓట్లేయగా, వారికి 1.13 లక్షల మంది మహిళల ఓట్లు అధికంగా పోలయ్యాయి. మొత్తం 68.33 శాతం పోలింగ్ జరిగింది. 64.22 శాతం మంది పురుషులు ఓటేస్తే., మహిళలు 72.06 శాతం ఓటేశారు. అంటే సుమారు 7.64 శాతం మహిళల ఓట్లు అధికంగా పోలయ్యాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మహిళా ఓటింగ్ శాతం అత్యధికంగా ఉంది. ఏకంగా 27,277 మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఓట్లేశారు. భారీగా పెరిగిన ఈ పోలింగ్ తమకే అనుకూలమంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. ఆసరా పింఛన్లు, బీడీ కార్మికుల భృతి, వితంతు పింఛన్లు, ఒంటరి మహిళలు.. ఇలా రకరకాల పింఛన్ల పొందుతున్న లబ్ధిదారులు తమకే పట్టం కడతారని టీఆర్ఎస్ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వీరికి ప్రతినెల రూ.వెయ్యి చొప్పున పింఛన్లు ఠంచనుగా అం దుతున్నాయి. ఈ పింఛను మొత్తాన్ని వచ్చే నెల నుంచి రూ.2,016కు పెంచుతామని ఇటీవల టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. వీటితో పాటు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను మహిళల నుద్దేశించి పకడ్బందీగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమ లు చేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కల్వకుంట కవిత కూడా తన ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా మహిళలతో మమేకమయ్యారు. దాదాపు అన్ని ప్రచార సభల్లోనూ మహిళ ల సందడే అధికంగా కనిపించింది. తన ఎన్నికల ప్రచార ప్రసంగాల్లోనూ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలో పెరిగిన మహిళా ఓటింగ్ తమ కు అనుకూలమని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇటు బీజేపీ కూడా మహిళా ఓటర్లపై ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పింఛనులో కేంద్ర సర్కారు వాటా అధికంగా ఉందనే అంశాన్ని ఆ పార్టీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తన ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో మహిళలకు వివరించారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఉపాధి హామీ, మరుగుదొడ్ల వంటి పథకాలను ప్రస్తావించి మహిళా ఓటర్లను ప్రస న్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. తనను గెలిపిస్తే ఉచితంగా గృహాల నిర్మాణం వంటి పథకాలను అమలు చేయిస్తానని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీలతో పోల్చితే కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రంగానే సాగినా.. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు తంటాలు పడింది. రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేదనే అంశాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లి అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం ఆ పార్టీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ చేశారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీయేనని, అమ్మ రుణం తీర్చుకోవాలనే సెంటిమెంట్ను అనుకూలంగా మార్చుకునేందుకు అడుగులు వేశా రు. మరోవైపు కాంగ్రెస్ ఆ పార్టీ మహిళా అధ్యక్షులు నేరెళ్ల శారద, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి వంటివారిని ప్రచారంలో భాగస్వామ్యులను చేసింది. మొత్తం మీద ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేశారు. గెలుపు ఓటములను నిర్దేశించే ఈ మహిళా ఓటర్లు ఎవరి కి పట్టం కట్టబెడతారనే అంశంపై ఉత్కంఠ ఫలితాల వెల్లడి వరకు కొనసాగనుంది. -
ఆమెదే ఆధిపత్యం
పాలమూరు: అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్న మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో కూడా ముందు వరుసలో ఉంటున్నారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి గురువారం జరిగిన లోక్సభ ఎన్నికల వరకు మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో పురుషుల కంటే అధికంగా ఓటేసి తమ బాధ్యతను నెరవేర్చుకున్నారు. నాలుగు సెగ్మెంట్లలో.. మహబూబ్నగర్ లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో పురుషుల కంటే అధిక సంఖ్యలో మహిళలు ఓటేశారు. పార్లమెంట్ పరిధిలో 15,05,190 మంది ఓటర్లు ఉండగా వీటి లో 9,82,890 మంది ఓటు వినియోగించుకున్నారు. అందులో మహిళలు 4,89,453, పురుషులు 4,93,435 మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే మహిళలు పురుషుల కంటే కేవలం 3,982 ఓట్లు మాత్రం తగ్గాయి. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే నాలుగింటిలో వారే ముందంజలో ఉన్నారు. దీంట్లో కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లో 64,158 మంది పురుషులు ఓటు వేయగా, 67,454మంది మహిళలు ఓటువేశారు. అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గంలో 63,702మంది పురుషులు ఓటు వేయగా, 65,680మంది మహిళలు ఓటు వేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో 71, 572మంది పురుషులు ఓటు వేయగా, మహిళలు 71728 మంది ఓటు వేశారు. మక్తల్ నియోజకవర్గంలో 69,910మంది పురుషులు ఓటు వేయగా 71,608మంది మహిళలు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. -
‘అందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లాడు’
సాక్షి, నల్లగొండ : ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించి చంద్రబాబు నాయుడు కుంటిసాకుగా ఢిల్లీకి పారిపోయి ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి తప్పదని ఈవీఎంలపై చంద్రబాబు దమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. ఐటీ టెక్నాలజీకి కేరాష్ అడ్రస్ తానేనని చెప్పుకునే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఈవీఎంలపై రాద్ధాంతం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలక శక్తిగా మారబోతున్నారన్నారు. -
ఆమె.. అనాసక్తి
సాక్షి, సిటీబ్యూరో: లోక్సభ ఎన్నికలపై సిటీజనులు అనాసక్తి చూపగా... అందులోనూ మహిళల ఓటింగ్ శాతం మరింత పడిపోవడం చర్చనీయాంశమైంది. నగరంలోని అన్ని నియోకజవర్గాల్లోనూ మహిళల ఓటింగ్ శాతం పురుషులతో పోలిస్తే తక్కువగా ఉండడం గమనార్హం. హైదరాబాద్ లోక్సభ పరిధిలో మొత్తంగా 47.21 శాతం పురుషులు ఓటు వేస్తే... మహిళల్లో కేవలం 42.12 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యల్పంగా యాకుత్పురాలో 34.76 శాతం, మలక్పేటలో 35.78 శాతం మహిళల ఓటింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో పురుషుల ఓటింగ్ 53.73 శాతం నమోదైతే... మహిళల ఓటింగ్ 52.68 శాతానికే పరిమితమైంది. నాంపల్లిలో అత్యల్పంగా 36.48 శాతం, సికింద్రాబాద్లో 42.12 శాతం ఓటింగ్ నమోదైంది. మల్కాజిగిరి లోక్సభ పరిధిలోనూ మహిళల ఓటింగ్ తక్కువగానే నమోదైంది. ఈ నియోజకవర్గంలో పురుషుల ఓటింగ్ 50.20 శాతం, మహిళల ఓటింగ్ 48.81 శాతం. అత్యల్పంగా ఎల్బీనగర్లో 43.48 శాతం, ఉప్పల్లో 45.65 శాతం నమోదైంది. అయితే కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోకజవర్గాల్లో మాత్రమే పురుషులతో సమానంగా మహిళలు ఓటింగ్లో పాల్గొనడం విశేషం. కూకట్పల్లిలో పురుషుల ఓటింగ్ 50.82 శాతం ఉండగా.. మహిళల ఓటింగ్ 50.62 శాతం. కుత్బుల్లాపూర్లో పురుషుల ఓటింగ్ 49.86 శాతం ఉండగా... మహిళల ఓటింగ్ 49.37 శాతం. ఇక చేవెళ్ల లోక్సభ పరిధిలో పురుషుల ఓటింగ్ 41.97 శాతం, మహిళల ఓటింగ్ 41.62 శాతం నమోదైంది. మహిళల ఓటింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడంతో ఆయా పార్టీల జయాపజయాలు, మెజారిటీల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
రాజకీయాల్లో మార్పులకు బీజం?
-
నేతల భవిత భద్రం!
మహబూబ్నగర్ క్రైం: పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తమ తీర్పు తెలపగా.. ఈవీఎంలలో నేతల భవిత భద్రంగా ఉంది. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 12మంది అభ్యర్థులు బరిలో ఉండటం తెలిసిన విషయమే. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలన్నింటినీ ఇప్పుడు జిల్లా కేంద్రంలోని జేపీఎన్సీఈ కళాశాల భవనాల్లో ఉంచారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఈవీంలు, వీవీప్యాట్లు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఇక అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లో దాగి ఉంది. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. అంటే సరిగ్గా 38రోజుల సమయం ఉంది. ఇన్ని రోజులు అభ్యర్థులు ఓపిక పట్టక తస్పదు. ఇప్పుడు అందరి చూపు జేపీఎన్ఈఎస్ కళాశాల వైపే ఉంది. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు మహబూబ్నగర్, షాద్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చిన ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. భవనంలోని కింది అంతస్తులో మూడు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలు, పైన అంతస్తులో నాలుగు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక స్ట్రాంగ్ రూం, ఒక ఓట్ల లెక్కింపు గదిని ఏర్పాటు చేశారు. అధికారులు, అభ్యర్థులు కూర్చునేందుకు, అలాగే మీడియా పాయింట్కు వేర్వేరు గదులను కేటాయించారు. నిఘా నేత్రాలతో పర్యవేక్షణ భవనం లోపల ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలో ఇతర విలువైన ఎన్నికల సామాగ్రి ఉన్నందున నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు అంతస్తుల్లోని స్ట్రాంగ్ రూంలు, గదులు తలుపులకు, హాళ్లలో, విధులు నిర్వహించే పోలీసుల గదుల వద్ద, భవనం, బయట కెమెరాలు బిగించారు. ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన గదులు, హాల్లో కనీసం కలిపి దాదాపు 30వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భవనం బయట, లోపల అన్ని గదులు సీసీ కెమెరాల నిఘా నేత్రంలో నిక్షిప్తమవుతున్నాయి. బందోబస్తు నిర్వహించే పోలీసులు అప్రమత్తంగా ఉండేందుకు ఇవి దోహదపడటమే కాకుండా ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పని చేస్తాయి. భవనం లోపల, పైన ఆరుబయట ప్రాంగణం మొత్తంలో ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేశారు. పారామిలటరీ పోలీసుల ఆధీనంలో.. జేపీఎన్ఈఎస్ భవనాన్ని సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్), పారామిలటరీ పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 40మంది సీఆర్పీఎఫ్, 20మంది జిల్లా పోలీసులు నిత్యం ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. భవనం లోపల పారామిలటరీ పోలీసులే ఉంటారు. సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అనుమతి లేనిదే ఎవరినీ లోనికి పంపరు. జిల్లా లోకల్ పోలీసులను కూడా లోనికి అనుమతించారు. స్ట్రాంగ్ రూంల వద్ద బందోబస్తు నిర్వహించే సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి డ్యూటీ వేస్తారు. భవనం లోనికి వెళ్లే ప్రధాన ద్వారంతో పాటు పక్కన, వెనుక ఉన్న గేట్ల వద్ద బందోబస్తు పెట్టారు. ఉన్నతాధికారుల అనుమతితో పని నిమిత్తమై వచ్చే ఆర్వో, ఏఆర్వోలను అప్పుడప్పుడూ అధికారులకు లోపలికి వెళ్లడానికి మాత్రం అవకాశం కల్పిస్తారు. అలాగే భవనం చుట్టూ పోలీసులు పికెటింగ్లు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. భవనం వద్ద బందోబస్తుపై లోకల్ పోలీసులకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచనలు చేశారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ ప్రాంగణంలోనికి రానివ్వద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. -
తెలంగాణ పాలిటిక్స్లో కొత్త కలర్స్!!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందా? ప్రతిపక్ష స్థానం కోసం కాంగ్రెస్కు బీజేపీ గట్టిపోటీ ఇచ్చే స్థాయికి చేరుకోబోతోందా? వరుస ఓటములు, భారీ వలసలతో డీలాపడిన కాంగ్రెస్కు దీటుగా బీజేపీ దూసుకెళ్తోందనే చర్చ ఊపందుకుంది. లోక్సభ ఎన్నికల్లో ఏకంగా ఆరుచోట్ల రెండోస్థానంలో బీజేపీ ఉండ నుందనే అంచనాలే ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న మార్పుల ప్రకారం.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపిస్తేమాత్రం.. రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తు సంకటస్థితిలో పడిపోవడం ఖాయమని రాజకీయ వర్గాలంటున్నాయి. అదే జరిగి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానం కోసం బీజేపీతో తలపడాల్సిన పరిస్థితే వస్తే.. బీజేపీ నాయకత్వం రాష్ట్ర రాజ కీయాలపై దృష్టి సారిస్తుందని విశ్లేషకులంటున్నారు. చిత్రం మార్చిన ఎన్నికలు ఈనెల 11న జరిగిన పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళి, స్థానిక రాజకీయ వర్గాల సమాచారం పై చర్చకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గానూ.. హైదరాబాద్ స్థానంలో వన్మ్యాన్షోగా మజ్లిస్ హవా నడుస్తుందని, మిగిలిన 16 స్థానాల్లో ఆరింట బీజేపీ టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చి కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు దక్కించుకుం టుందని పరిశీలకులంటు న్నారు. ఇందులో సికింద్రాబాద్, మహబూబ్నగర్, జహీరా బాద్, నిజా మాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాలున్నాయని తెలు స్తోంది. గెలుపోటములను పక్కన పెడితే 6 చోట్ల బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని, కేవలం 60% స్థానాల్లోనే టీఆర్ఎస్తో కాంగ్రెస్ తలపడిందనే సమాచారం గాంధీభవన్ వర్గాలను కలవరపరుస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే! ప్రస్తుత సమాచారం ప్రకారం కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం కమలనాథులు వ్యూహాన్ని మార్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి చెప్పుకోదగిన స్థాయిలో వలసలను తీసుకోగలిగిన బీజేపీ లోక్సభ ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలపై తీవ్రంగా దృష్టి కేంద్రీకరిస్తుందని అంటున్నాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, త్రిపుర, అస్సాంల్లో అనుసరించిన వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేయాలనే యోచనలో బీజేపీ ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్కు ఇన్నాళ్లు అండగా ఉండి చేయూతనిచ్చిన ఓ ప్రధాన వర్గాన్ని ఆకర్షించే వ్యూహానికి బీజేపీ పదును పెడుతుందని, తద్వారా రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం కోసం బరిలో నిలిచే అవకాశాలను బలోపేతం చేసుకుంటుందని విశ్లేషకులంటున్నారు. ఇప్పటికే ఆ దిశలో ఒకరిద్దరు నేతలను తమ బుట్టలో వేసుకున్న కమలనాథులు ఈసారి బిగ్షాట్స్పై దృష్టి పెట్టి కాంగ్రెస్ను కోలుకోకుండా చేసి ఆ స్థానాన్ని ఆక్రమించే కసరత్తు చేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ కోలుకుంటుందా? వాస్తవానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితిని బట్టి లోక్సభ ఫలితాలు తారుమారైతే మాత్రం కోలుకునే పరిస్థితులు ఇప్పట్లో లేవనేది బహిరంగ రహస్యమే. వందల సంఖ్యలో కేడర్ను, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కోల్పోయిన ఆ పార్టీ లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకే ఆపసోపాలు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా పార్టీ ఇంటి మనుషుల్లాంటి పొంగులేటి సుధాకర్రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్ లాంటి నాయకులు కూడా పార్టీని వీడివెళ్లిపోవడం, పార్టీ నాయకత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేయడం మొదట్నుంచీ పార్టీ జెండా మోసిన కేడర్ను నైరాశ్యంలోకి నెట్టింది. దీనికితోడు గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన వీహెచ్ లాంటి నేతలు కాంగ్రెస్లో సామాజిక న్యాయం అమలు కావడం లేదని, రాహుల్గాంధీకి జ్ఞానోదయం కావాలని తాజాగా వ్యాఖ్యలు చేసిన తీరు ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. ఓ వైపు వలసల జోరు, మరోవైపు ఓటముల హోరు నడుమ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ ప్రభ మసకబారిపోతుందనే చర్చ జోరందుకుంది. అయితే, ఈ పరిస్థితులను అంచనా వేస్తున్న గులాబీ శిబిరంలో మరికొంత ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు ప్రతిపక్ష స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితే వస్తే తమకు చాలా వెసులుబాటు కలుగుతుందని, ఆ రెండు పార్టీల పోరాటం ఓ కొలిక్కి వచ్చేసరికి 2023 అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయనే అంచనాలో ఆ పార్టీ నేతలున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కమలనాథులు రాష్ట్రంలో పుంజుకుని ప్రతిపక్ష పార్టీగా ఎదుగుతారా? కాంగ్రెస్ కోలుకుని కష్టంగానయినా బరిలో నిలుస్తుందా? ఈ రెండు జాతీయ పార్టీల్లో ఎవరు టీఆర్ఎస్కు రాజకీయ ప్రత్యర్థిగా మిగులుతారన్నది లోక్సభ ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. జెండాలు మారాయిలా! 1950 నుంచి 80వ దశకం వరకు తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే మొదటి మూడు సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య పోటీ ఉండేది. కాంగ్రెస్ గెలిచేది.. కమ్యూనిస్టులు పోటీ ఇచ్చి ఓడిపోయేవాళ్లు. అప్పుడు రాజకీయ రణక్షేత్రంలో పోటీ అంతా కాంగ్రెస్ జెండా – ఎర్రజెండాల మధ్యే ఉండేది. ఆ తర్వాత కొన్నాళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్కు ఎదురే లేకుండా పోయింది. 1980వ దశకంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్–తెలుగుదేశం పార్టీల మధ్య అధికారం దోబూచులాడింది. క్రమంగా ఎర్రజెండా కనుమరుగై మూడురంగుల జెండా – పచ్చ జెండాల మధ్య పోటీ పెరిగింది. ఇక, 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాజకీయ క్షేత్రం ఉన్నట్టుండి మారిపోయింది. అధికారం కోసం పోరు కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య నడిచింది. ఈ పోరాటంలో రెండుసార్లూ గులాబీ జెండాదే పైచేయి అయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కూడా కాంగ్రెస్ జెండా వెలవెలబోయింది. ఈ జెండాకు మరో 10 రకాల రంగులను కలుపుకుని 2018 అసెంబ్లీ రణక్షేత్రంలో పోరాడినా ఓటమి తప్పలేదు. 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు ధీటుగా మరో పార్టీ పుంజుకునే పరిస్థితి వస్తే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం రంగులు మారనున్నాయి. తొలిసారి కాంగ్రెస్ పోటీలో కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
16 సీట్లలోనూ మాదే గెలుపు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ 16 లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని... కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్పై అందరితో మాట్లాడుతూనే ఉన్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తేనే ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేసినట్లుగా భావించవద్దన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోతుందని, మరికొన్ని చోట్ల మూడో స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రజల్లో విశ్వసనీయత లేదని, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా లాభం ఉండదన్నారు. తెలంగాణ సమాజంలో బీజేపీకి స్థానం లేదని, రాష్ట్రంలో ఆ పార్టీకి ఒక్క సీటూ రాదని జోస్యం చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో మెదక్లో టీఆర్ఎస్కు అత్యధిక మెజారిటీ వస్తుందని, ఆ తర్వాత రెండో స్థానంలో వరంగల్, మూడు లేదా నాలుగో స్థానంలో కరీంనగర్ ఉండొచ్చన్నారు. సెటిలర్లు ఆంధ్రప్రదేశ్కు వెళ్లకుండా ఉండి ఉంటే టీఆర్ఎస్కు ఇంకా మెజారిటీ పెరిగేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రగతికి ఆటంకం కాకూడదనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మే 23లోగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేటీఆర్ చెప్పారు. అన్ని ఎన్నికలు ముగిస్తే నాలుగున్నరేళ్లు పూర్తిగా అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. రెవెన్యూఉద్యోగుల్లో అత్యధికులు మంచివారే అవినీతిని పారద్రోలాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టం తీసుకొస్తోందని కేటీఆర్ తెలిపారు. పటిష్టమైన మున్సిపల్ చట్టం తీసుకురావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. అందువల్ల మున్సిపల్ ఎన్నికలు మే నెల తర్వాతే జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల్లో సింహ భాగం మంచివాళ్లేనని, అయితే కొద్దిమంది ఉద్యోగులవల్ల ఉద్యోగులందరికీ చెడ్డపేరు రావడం మంచిది కాదన్నారు. పంచా యతీ ఎన్నికలు ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. చంద్రబాబు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేసినట్లా? ‘తెలంగాణలో ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో దేశమంతా చూసింది. పక్క రాష్ట్రంలో (ఏపీ) ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. తెలంగాణలో ఎన్నికలు జరిగిన తీరు చూస్తే ప్రభుత్వ పాలన ఎంత పారదర్శకంగా ఉందో అర్థమవుతోంది. టెక్నాలజీ నా వల్లే వచ్చిందని చెప్పే చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించడం హాస్యాస్పదం. చంద్రబాబువి సిల్లి కామెంట్స్. 2014లో ఆయన గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పని చేసినట్లా? పెడబొబ్బలు పెట్టడం చంద్రబాబుకే మంచిది కాదు. ఆయన తీరుతో టీడీపీ కార్యకర్తలు సైతం తమకు ఓటమి తప్పదని అంగీకరిస్తున్నారు. మే 23న ఏం జరుగుతుందో తేలిపోతుంది. ఒకవేళ పొరపాటున చంద్రబాబు గెలిస్తే ఈవీఎంలపై ఇప్పుడు చేసిన ఆరోపణల సంగతి ఏమిటి? సమాచారం ఎస్సెమ్మెస్ ద్వారా పంపితే ఏమిటి? లేఖ ద్వారా పంపితే ఏమిటి? ఎన్నికలు బ్యాలెట్ ద్వారా జరిగితే ఏమిటి? ఈవీఎంల ద్వారా జరిగితే ఏమిటి? రెండు రోజుల్లో తెలంగాణ పోలింగ్ పర్సెంటేజీలు మారాయన్న ఆరోపణలు సరికాదు. పదేళ్ల నుంచి చూడండి. పోలింగ్ శాతం వివరాలు ప్రతిసారీ రెండో రోజు మారుతుంటాయి. మొదటి రోజు పోలింగ్ వివరాలు దాదాపుగా అంటారే తప్ప కచ్చితంగా అం దవు. ఏ ఒక్క పథకంతో పార్టీలు అధికారంలోకి రావు. బహుళ అంశాలు ప్రభావం చూపుతాయి (పసుపు కుంకుమ, మహిళలు టీడీపీకి ఓటేశారన్న అంశంపై). కేసీఆర్, జగన్లు మోదీ పెంపుడు కుక్కలని చంద్రబాబు అంటారా? నాలుగేళ్లు మోదీతో అంటకాగిన చంద్రబాబును పెంపుడు కుక్క అని మేము అనలేమా? మాకు సంస్కారం ఉంది కాబట్టి మేం అలా మాట్లాడం. జగన్, కేసీఆర్ హుందాగా వ్యవహరించారు. ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం దాటలేదు. వై.ఎస్. పులివెందుల దాటలేదు. కేసీఆర్ రాష్ట్రంలోని చాలా చోట్ల పోటీ చేశారు. జనామోదం ఉంటే ఎక్కడైనా గెలుస్తారు. అది కేసీఆర్కు మాత్రమే ఉంది’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఓట్ల తొలగింపును ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదు ఓట్ల తొలగింపు ప్రక్రియను ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఎన్నికల సంఘంలో సంస్కరణలు అవసరం. నిబంధనల విషయంలో చర్చ జరగాలి. ప్రజలు ఓటు వేయడానికి ఎందుకు రావడంలేదో రాజకీయ పార్టీలన్నీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. బీజేపీకి చెందిన రూ. 8 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు నుంచి డ్రా చేస్తే ఈసీ దీనిపై కనీసం ప్రశ్నించలేదు సరికదా 24 గంటల్లోనే ఐటీశాఖ బీజేపీకి క్లీన్చిట్ ఇచ్చింది’అని కేటీఆర్ గుర్తుచేశారు. అంబేడ్కర్ తత్వంతోనే తెలంగాణ: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిజమైన దార్శనికుడని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు. తెలంగాణభవన్లో ఆదివారం జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకలో కేటీఆర్ ప్రసంగించారు. ‘అందరికీ అంబేడ్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేడ్కర్ ఒక కులానికో, వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదు. గాంధీ, నెహ్రులకు ఏ మాత్రం తీసిపోని దార్శనికుడు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం శాసనసభలో మెజారిటీ అవసరంపై రాజ్యాంగం రచించేటప్పుడు కేటీషా, అంబేడ్కర్ల మధ్య వాదనలు నడిచాయి. అసెంబ్లీలో మెజారిటీ ఉంటేనే కొత్త రాష్ట్రం ఏర్పాటు కావా లనే వాదనను తోసిపుచ్చి అల్ప సంఖ్యాకుల గొంతు కకు అంబేడ్కర్ బలమిచ్చారు. అంబేడ్కర్ తత్వంతోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ సాధించారు. అంబేడ్కర్ స్ఫూర్తితోనే తెలంగాణలో సంక్షే మం అమలవుతోంది. శనివారం పంజగుట్టలో అంబే డ్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నా. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రభుత్వాన్ని కోరుతున్నాం..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంత్రులు మహమ్మద్ మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్యేలు వివేకానంద, బాల్క సుమన్, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. -
పది ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీవే
సాక్షి, తిప్పర్తి : తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో పది ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునేందుకు, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనకు, దేశ రక్షణకు పాటుపడిన ఉత్తమ్ కుమార్రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు ఓటు వేశారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. రెండు సార్లు మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, గత ఐదేళ్ల పాలనలో దళితులకు అన్ని విధాలా అన్యాయం చేశారని విమర్శించారు. అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుస్తుందని చెబుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ, పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరించిందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే.. పేదలకు ఏడాదికి రూ.72 వేల ఆర్థిక సాయం అందిస్తారని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
అత్యుత్సాహం అరెస్ట్కు దారితీసింది
సాక్షి, హైదరాబాద్: ఓ పోలింగ్ ఏజెంట్ ప్రదర్శించిన అత్యుత్సాహం అతని అరెస్ట్కు దారి తీసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లో ఫొటో దిగడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. టీఆర్ఎస్ మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డికి ఆ పార్టీకి చెందిన నాయకుడు వెంకటేశ్ పోలింగ్ ఏజెంట్గా ఉన్నారు. అయితే గురువారం పోలింగ్ ముగిశాక అధికారులు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను భోగారంలోని హోలీమేరి కళాశాలలో భద్రపరిచారు. అయితే పోలింగ్ ఏజెంట్గా అధికారులతో కలిసి అక్కడికి వెళ్లిన వెంకటేశ్ స్ట్రాంగ్ రూమ్లోని ఈవీఎంలు, వీవీప్యాట్ల వద్ద నిలుచుని ఫొటో దిగారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై కీసర పోలీసులకు ఫిర్యాదు రావడంతో అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. కాగా, వెంకటేశ్పై క్రిమినల్ కేసు నమోదైనట్టు కీసర సీఐ నరేందర్గౌడ్ తెలిపారు. -
అందుకే బావతో ఛాలెంజ్ చేశా : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణల లోక్సభ ఎన్నికల్లో వంద శాతం టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో 16 ఎంపీ సీట్లను గెలుస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీలో మొదక్ మొదటి స్థానంలో, వరంగల్ రెండో స్థానంలో, కరీంనగర్ మూడు లేదా నాలుగో స్థానంలో నిలుస్తాయన్నారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలను ఉత్తేజపరచడానికే తన భావ హరీశ్ రావుతో సరదాగా ఛాలెంజ్ విసిరానని చెప్పారు. మెదక్ సీఎం కేసీఆర్ ఇలాక అని, అక్కడ కచ్చితంగా టీఆర్ఎస్కు భారీ మెజారిటీ వస్తుందన్నారు. ఇక ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ఆ రాష్ట్ర అధికారులను ఎన్నికల సంఘం మారిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల పట్ల నమ్మకం లేకనే ఆయన ఢిల్లీలో వీధినాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా తీర్పును స్వాగతించాలి కానీ చంద్రబాబులా గగ్గోలు పెట్టొద్దన్నారు. గెలిస్తే సాంకేతికత భేష్ అని, లేకపోతే ఈవీఎంల తప్పు అని చంద్రబాబు అనడం సరికాదన్నారు.ఆయన వాదనల్లో విశ్వసనీయత ఉంటే ప్రజలు ఆధరిస్తారని చెప్పారు.40ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న వ్యక్తి ఇంత చిల్లర అరుపులు ఎందుకు అరుస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. వంగి వంగి దండాలు పెట్టినప్పుడే చంద్రబాబు పని అయిపోయిందని అందరికి అర్థమైందన్నారు. రాహుల్ గాంధీ దక్షిణాదిన పోటీ చేసినంత మాత్రాన ఆయన ప్రభావం ఇక్కడ ఉండదన్నారు. మే 20లోపు లోకల్ బాడీస్ ఎన్నికలు పూర్తి మే 20 లోపు లోకల్ బాడీస్ ఎన్నికలు పూర్తచేయాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమని కేటీఆర్ అన్నారు. ఎన్నికలు పూర్తయితే అభివృద్ధిలో ముందుకెళ్లొచ్చునని అభిప్రాయపడ్డారు. కొత్త మున్సిపల్ చట్టం తేవడం, రెవెన్యూ శాఖను ప్రక్షాలన చేయడం సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. లంచం,అవినీతి నిర్మూలించడమే టార్గెట్గా పెట్టుకొని తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. -
‘నిజామాబాద్లో బీజేపీ గెలవబోతోంది ’
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ గెలవబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఓట్ల శాతంతో పాటు సీట్లు కూడా పెరుగుతాయన్నారు. సీఎం కేసీఆర్ మీద రైతులు తిరుగుబాటు చేశారని, నిజామాబాద్లో సీఎం కూతురు కవిత కచ్చితంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్, కేటీఆర్లు హిందూవులను కించపరిచి వారి మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఓవైసీని మచ్చిక చేసుకోవడం కోసం హిందూవులను అవమానించారని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ చొరబాటుదారులకు మతం రంగు పులుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అబద్దపు పునాదుల మీద రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. అవార్డుల వాపసి, అసహనం బ్యాచ్తో పాటు ఇప్పుడు రిటైర్డ్ సైనికులతో సంతకాల సేకరణ అంటూ కొత్త నాటకాలు వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ స్పష్టమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా అవతరిస్తోందని, ఎన్నికల ఫలితాల తార్వత పెనుమార్పులు వస్తాయన్నారు. రాజకీయ పార్టీ గుర్తులతో జరగాల్సిన పరిషత్ ఎన్నికలను ఆదరా బాదరాగా చేస్తున్నారని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికలపై పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
4 లక్షల మంది ఓటుకు దూరం
ఆదిలాబాద్అర్బన్: భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించిన ఓటు హక్కు సద్వినియోగం కాలేకపోతోంది. ఓటు అనే వజ్రాయుధాన్ని పౌరులు సక్రమంగా వినియోగించుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో కనిపించిన చైతన్యం లోక్సభ ఎన్నికల్లో కానరాలేదు. సుమారు 72 శాతం మంది ఓటింగ్లో పాల్గొనగా, ఇంకా 28 శాతం మంది ఓటు వినియోగానికి దూరంగా ఉన్నట్లు ఈ నెల 11న జరిగిన పోలింగ్ ద్వారా స్పష్టమైంది. ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి గురువారం పోలింగ్ జరగగా, నియోజకవర్గ పరిధిలో 14,88,353 మంది ఓటర్లు ఉన్నారు. అయితే 10,69,333 మంది ఓటర్లు ఓటింగ్లో పాల్గొనగా, మిగతా 4,24,617 మంది ఓటర్లు ఓటు వినియోగానికి దూరంగా ఉన్నారు. ఇదిలా ఉండగా, లోక్సభ ఓటర్లలోనే కాదు.. పోలింగ్లోనూ పురుషుల కంటే మహిళలే అధికంగా ఓటింగ్లో పాల్గొని ముందు వరుసలో నిలబడ్డారు. ఖానాపూర్, ముథోల్ అసెంబ్లీ పరిధిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనగా, మిగతా నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో జరిగిన ఓటింగ్లో పురుషులు ముందున్నారు. ఓటుకు దూరంగా 4 లక్షల మంది.. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గంలో 70 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. వెనువెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతం తగ్గింది. పోలింగ్ 75 నుంచి 80 శాతం నమోదవుతుందని అధికార యం త్రాంగం అంచనా వేసినా.. పోలింగ్ లక్ష్యం చేరుకోలేకపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 14,88,353 మంది ఓటర్లు ఉండగా, 10,63,439 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మిగతా 4.24 లక్షల మంది ఓటర్లు ఓటు వినియోగానికి దూరంగా ఉన్నారు. సద్వినియోగం చేసుకున్న వారిలో 5,22,969 మంది పురుషులు ఉండగా, 5,39,862 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 56 మంది ఉండగా, 13 మంది ఓటేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 2,03,165 మంది ఓటర్లు ఉండగా, 1,41,232 మంది ఓటేశారు. మిగతా 30,424 మంది పురుషులు, 31,507 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో 69.52 శాతం పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 1,99,498 మంది ఓటర్లు ఉంగడా, 1,47,643 మంది ఓటు వినియోగించుకున్నారు. మిగతా 24,202 మంది పురుషులు, 27,647 మంది ఓటర్లు ఓటేయలేదు. దీంతో ఈ అసెంబ్లీ పరిధిలో పోలింగ్ 74.01 శాతం నమోదైంది. ఖానాపూర్ అసెంబ్లీ పరిధిలో 2,03,746 మంది ఓటర్లు ఉండగా, 1.44.986 మంది ఓటేశారు. 31,201 మంది పురుషులు, 27,554 మంది మహిళలు ఓటుకు దూరంగా ఉన్నారు. ఇక్కడ 71.16 శాతం నమోదైంది. ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 2,19,612 మంది ఓటర్లు ఉండగా, 1,54,446 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. మిగతా 29,777 మంది పురుషులు, 35,383 మంది మహిళలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేదు. దీంతో 70.33 శాతం పోలింగ్ నమోదైంది. బోథ్ పరిధిలో 1,93,373 మంది ఓటర్లు ఉండగా, 1,47,137 మంది ఓటేశారు. మిగతా 46236 మంది ఓటేయలేదు. ఇందులో పురుషులు 21,105 మంది పురుషులు ఉండగా, 25,128 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ పోలింగ్ 76.09 శాతం నమోదైంది. నిర్మల్ నియోజకవర్గంలో 2,38,371 మంది ఓటర్లు ఉండగా, 1,59,531 మంది ఓటర్లు ఓటేశారు. మిగతా 78,840 మంది ముఖం చాటేశారు. ఇందులో 40,183 మంది పురుషులు ఉండగా, 39,247 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే ఈ సెగ్మెంట్లో పోలింగ్ 66.93 శాతం నమోదైంది. ఇక ముథోల్ అసెంబ్లీలో 2,30,588 మంది ఓటర్లు ఉండగా, 1,68,464 మంది ఓటేశారు. మిగతా 30,372 మంది పురుషులు ఉండగా, 31736 మంది ఓటు వినియోగానికి దూరంగా ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో పోలింగ్ 73.06 శాతం నమోదైంది. ఓటర్లలో కానరాని చైతన్యం.. లోక్సభ ఎన్నికలు–2019లో ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో పోలింగ్ 75 నుంచి 80 శాతం నమోదవుతుందనుకున్న అధికార యంత్రాంగం అంచనాలు తారుమారయ్యాయి. 14.88 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 10.63 లక్షల మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొనడంతో 71.45 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, లోక్సభ పరిధిలోని మూడు జిల్లాల యంత్రాంగం గత మూడు నెలల నుంచి ఓటు హక్కు వినియోగం, ఓటు విలువ గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించినా ఫలితం కనిపించలేదు. ఇటు యంత్రాంగం, అటు ఎన్నికల సంఘం పోలింగ్పై ఎన్ని విధాలుగా ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు, ఓటరు ర్యాలీలు చేపట్టినా ఓటర్లలో చైతన్యం రాలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో కనిపించిన ఓటరు ఉత్సాహం లోక్సభ ఎన్నికల్లో కన్పించలేదని పలువురు చర్చించుకుంటున్నారు. -
స్ట్రాంగ్ రూంలకు పటిష్ట భద్రత
నర్సాపూర్: ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. నర్సాపూర్లోని స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచి.. గదులకు సీలు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెదక్ లోక్సభ నియోజకవర్గంలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్లను నర్సాపూర్లోని బీవీరాజు ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చినట్లు చెప్పారు. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్కు చెందిన ఈవీఎంలను పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలో భద్రపరిచామన్నారు. సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్లను పట్టణంలోని అల్లూరి సీతరామరాజు గిరిజన గురుకుల విద్యాలయంలోని స్ట్రాంగ్ రూంలలో నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్యారా మిలిటరీ బలగాలతో గట్టి భద్రత కల్పించినట్లు పేర్కొన్నారు. ఒక్కో స్ట్రాంగ్ రూం వద్ద ఒక సెక్షన్ ప్యారామిలిటరీ బలగాలు భద్రతగా ఉంటాయని, ఆయుధాలు కలిగిన ఇద్దరు జవాన్లు నిరంతరం పహారా కాస్తారని కలెక్టర్ వెల్లడించారు. స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసిన భవనాల బయట స్థానిక పోలీసులు ఉంటారన్నారు. ఎన్నికల అబ్జర్వర్ సంజయ్మీనా పర్యవేక్షణలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సూచించిన ఆయా పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలకు సీలు వేసినట్లు చెప్పారు. ఆయా పార్టీల అభ్యర్థులు సూచించిన ప్రతినిధులు స్ట్రాంగ్ రూంలను చూడాలని భావిస్తే స్ట్రాంగ్ రూంలు ఉన్న భవనంలోని ఒక గదిలో సీసీ కెమెరాల మానిటర్ ఏర్పాటు చేశామని, మానిటర్లో భద్రత చర్యలను చూసుకునే వీలుంటుందన్నారు. దగ్గరుండి సీలు వేయించిన కలెక్టర్, అబ్జర్వర్.. ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలకు ఎన్నికల అబ్జర్వర్ సంజయ్మీనా, కలెక్టర్ ధర్మారెడ్డి దగ్గరుండి పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీలు వేయించారు. సీలు వేసే సమయంలో కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గురుకుల విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం వద్ద కరెంటు వైర్లను సరి చేయించాలని సూచించారు. ఎస్పీ చందనా దీప్తి స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత, ఇతర అంశాలపై కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి ఎన్నికల అబ్జర్వర్ సంజయ్మీనాతో చర్చించారు. ఇదిలాఉండగా స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసిన భవనాల వద్ద ముందస్తు జాగ్రత్తగా ఒక్కో ఫైరింజన్ను అందుబాటులో ఉంచారు. పార్టీ ప్రతినిధులకు పత్రాలు అందజేత.. మెదక్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వివరాలు, వినియోగించిన ఈవీఎంల వివరాలు, పోలైన ఓట్ల వివరాలతో కూడిన పత్రాలను అధికారులు శుక్రవారం పోటీలో ఉన్న అభ్యర్థులు సూచించిన ఆయా పార్టీల ప్రతినిధులకు అందజేశారు. స్ట్రాంగ్ రూంలకు సీలు వేసే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి నియమించిన ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ నియమించిన ఆ పార్టీ ప్రతినిధులు ఆంజనేయులుగౌడ్, మల్లేష్ ఉన్నారు. -
ధీమా అందరిది.. విజయం ఎవరిదో!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్సభ స్థానంలో గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అంచనాల్లో వారు నిమగ్నమయ్యారు. ఒక పక్క మునుపెన్నడూ లేని విధంగా తగ్గిన పోలింగ్ శాతం దడ పుట్టిస్తున్నా.. గెలుపుపై అందరూ నమ్మకం పెట్టుకున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు చాలా మంది పోలింగ్కు దూరంగా ఉన్నారు. కనీసం 50 శాతం మార్క్ను కూడా అధిగమించలేదు. గ్రామీణ ఓటర్లలో మాత్రం చైతన్యం వెల్లివిరిసింది. గత లోక్సభ ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం తగ్గినప్పటికీ పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువగానే నమోదైంది. రెండింటి మధ్యే.. చేవెళ్ల స్థానానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ జరిగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాలు టీఆర్ఎస్కు సానుకూలంగా ఉండగా.. ఇంకొన్ని కాంగ్రెస్కు అండగా నిలిచినట్లు క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి అవగతమవుతోంది. ఒకటి రెండు సెగ్మెంట్లలో బీజీపీ కూడా అధిక ఓట్లను తన ఖాతాలో వేసుకున్నట్లు అంచనా. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో చూస్తే చేవెళ్లలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. 71.05 శాతం పోలైన ఓట్లలో కాంగ్రెస్ది పైచేయి ఉన్నట్లు తెలుస్తోంది. రైతులు, నిరుద్యోగ ఓటర్లను కాంగ్రెస్ బాగా ఆకర్షించినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పూర్తిగా పట్టణ ప్రాంతమైన శేరిలింగంపల్లిలో పోలింగ్ శాతం గణనీయంగా పడిపోయింది. ఇక్కడ 41.80 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడి ఓటర్లలో అత్యధికులు సెటిలర్లే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వీరు టీఆర్ఎస్ వైపు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ వలస ఓటర్లందరూ ఓటేసేందుకు తమ సొంత ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్కు వెళ్లారు. ఇక మిగిలిన వారిలో అత్యధికులు స్థానికులు. వీరిలో అధిక ఓటర్లు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు అంచనా. రాజేంద్రనగర్ సెగ్మెంట్లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నువ్వా నేనా అన్న రీతిలో పోరు నడిచినట్లు తెలుస్తోంది. ఇక్కడి సెటిలర్లలో చాలామంది తమ సొంత స్థలాలకు వెళ్లారు. ఇందులో దాదాపు టీఆర్ఎస్ సానుకూల ఓటర్లే ఎక్కువగా ఉంటారని రాజకీయ విశ్లేషకుల భావన. దీంతో టీఆర్ఎస్కు కొంతమేర గండి పడినట్లు తెలుస్తోంది. ఈ లోటును ముస్లిం ఓటర్లు భర్తీ చేసినట్లు వెల్లడవుతోంది. బహిరంగంగానే ఎంఐఎం.. టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం వల్ల వారి ఓట్లన్నీ కారు గుర్తు వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. సగం పట్టణ, మిగిలిన సగభాగం గ్రామీణంగా ఉన్న మహేశ్వరంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడినట్లు స్పష్టమవుతోంది. పట్టణ ప్రాంతవాసులు బీజీపీ పట్ల మొగ్గుచూపినట్లు ఆయా వర్గాలను బట్టి తెలుస్తోంది. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ రీతిలో ఓట్లు దక్కడం, తాజాగా లోక్సభ ఎన్నికలకు రెండురోజుల ముందు ఆ పార్టీ చీఫ్ అమిత్షా సభ కొంత ప్రభావం పడినట్లు కనబడుతోంది. ఇక పల్లె ప్రాంతాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అనే రీతిలో ఓట్లను రాబట్టుకున్నట్లు వెల్లడవుతున్నాయి. వికారాబాద్లో కారు, హస్తం మధ్యం రసవత్తర పోరు నడిచినట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే వెంట నడిచేందుకు మొగ్గుచూపని నేతలు ప్రచారానికి పెద్దగా ఆసక్తి చూపనట్లు చర్చ జరుగుతోంది. దీని కారణంగా ఓట్లు హస్తం వైపు మళ్లినట్లు తెలుస్తోంది. పరిగి నియోజకవర్గంలో కారు జోరు కొనసాగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సెగ్మెంట్పై పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించి విస్తృత ప్రచారం చేసినట్లు క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. ఫలితంగా అధిక శాతం ఓటర్లు కారు వైపు ఉన్నట్లు వెల్లడవుతోంది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్కు ఓట్లు దక్కినట్లు తెలుస్తోంది. తాండూరులో కాంగ్రెస్ గాలి వీచినట్లు వెల్లడవుతోంది. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. పైగా కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడు కావడంతో కొండా గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా హస్తానికి అధిక ఓట్లు పడినట్లు స్పష్టమవుతోంది. గ్రామీణంలో ‘స్థానికత’ అస్త్రం చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల స్థానికత అంశం బాగా పనిచేసినట్లు ఆయా వర్గాల ఓటర్లు చెబుతున్నారు. స్థానిక అభ్యర్థి అయితే తమకు అందుబాటులో ఉంటారని వారు భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక అభ్యర్థి అంశం.. ఓట్లు సాధించేందుకు కొంత అస్త్రంగా పనిచేసి ఉండొచ్చని అంచనా. ఇదే జరిగితే కాంగ్రెస్ అభ్యర్థికి కలిసిరావొచ్చు. -
పరిషత్ పోరుకు రెడీ
హన్మకొండ: జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పూర్వ వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ స్థానంలో కొత్తగా ఆరు జెడ్పీలు ఏర్పాటు కానున్నాయి. ఎన్నికల అనంతరం ఇవి రూపాంతరం చెందనున్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా ప్రజా పరిషత్ల వారీగా ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ సజావుగా, చురుకుగా సాగేందుకు ప్రస్తుత వరంగల్ జిల్లా ప్రజా పరిషత్లోని ఉద్యోగుల మధ్య పని విభజన చేశారు. జిల్లాకు ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్టు చొప్పున కేటాయించారు. వీరు ఆయా జిల్లా కలెక్టర్, నోడల్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కలెక్టర్లే ఎన్నికల అధికారులుగా ఉన్నారు. వీరు ఎన్నికల కమిషన్ ఆదేశాలు, సూచనల మేరకు ప్రక్రియను ముందుకు తీసుకుపోతున్నారు. ఆరు జిల్లా పరిషత్లు.. పూర్వ వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ స్థానంలో కొత్తగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లా ప్రజా పరిషత్లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుత వరంగల్ జిల్లా ప్రజా పరిషత్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు కొత్త జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో సూపరింటెండెంట్ వెంకటరమణ, సీనియర్ అసిస్టెంట్ పాషా, టైపిస్టు సూర్యప్రకాష్, వరంగల్ రూరల్ జిల్లాలో సూపరింటెండెంట్ ఎం.శ్రీనివాస్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ పాషా, టైపిస్టు, జనగామలో సూపరింటెండెంట్ రవీందర్, సీనియర్ అసిస్టెంట్ సోమనర్సయ్య, టైపిస్టు రాజ్కుమార్, జయశంకర్ భూపాలపల్లిలో సూపరింటెండెంట్ సునిత, సీనియర్ అసిస్టెంట్ నర్సింగరావు, ములుగులో సూపరింటెండెంట్ వెంకటరమణ, సీనియర్ అసిస్టెంట్ వినీత్, మహబూబాబాద్లో సూపరింటెండెంట్ ఎగ్బాల్, సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్, టైపిస్టు ప్రదీప్ ఎన్నికల ఏర్పాట్లను చూస్తున్నారు. వీరు జోనల్, రూట్ల గుర్తింపు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాల గుర్తింపు వంటి కార్యక్రమాలతోపాటు ఓటరు జాబితా తయారీ ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రకటన వంటి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 18న కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, నోడల్ ఆఫీసర్లకు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులోనే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్పై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మండల కేంద్రాల్లోనే జెడ్పీటీసీల నామినేషన్ల స్వీకరణ జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాని(జెడ్పీటీసీ)కి పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను గతంలో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వీకరించే వారు. ఈసారి మండల కేంద్రాల్లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కేంద్రంలో జెడ్పీటీసీ నామినేషన్లు స్వీకరిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు కొత్త జిల్లాల్లో మొత్తం 71 జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలున్నాయి. ఈ స్థానాల నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులు మండల కేంద్రాల్లోనే నామినేషన్ వేసేలా సౌకర్యం కల్పిస్తున్నారు. క్లస్టర్ల వారీగా ఎంపీటీసీలనామినేషన్ల స్వీకరణ ఎంపీటీసీల నామినేషన్లు ఈసారి క్లస్టర్ల వారీగా స్వీకరించనున్నారు. గతంలో మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్లో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించే వారు. ఈ ప్రక్రియ సులువుగా కొనసాగేందుకు క్లస్టర్లుగా విభజించారు. ప్రతి మూడు ఎంపీటీసీ స్థానాలకు ఒక క్లస్టర్ చొప్పున ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్కు ఒక రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోనే క్లస్టర్ల కేంద్రాలు ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరిస్తారు. 20న తుది ఓటరు జాబితా.. జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాను ఈనెల 20న విడుదల చేయనున్నారు. ఈనెల 8న డ్రాఫ్ట్ జాబితాను ప్రదర్శించారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 17వ తేదీ వరకు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను క్రోడీకరించి ఈనెల 20న తుది జాబితాను విడుదల చేస్తారు. ప్రత్యేక అధికారుల నియామకం.. ఎన్నికల పనులు త్వరితగతిన, సజావుగా జరిగేందుకు ఒక్కో కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఒక్కో జిల్లా స్థాయి అధికారిని నియమించారు. బ్యాలెట్ బాక్స్ల నిర్వహణ, వాహనాలు సమకూర్చడం, ఎన్నికల నియమావళి అమలు, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ వంటి కార్యక్రమాలకు వేర్వేరుగా అధికారులను నియమించారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
ఎక్కడ తేడా..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ఓటింగ్ సరళిపై తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం పూర్తిస్థాయిలో విశ్లేషిస్తోంది. తెలం గాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ అంచనాలు వేసిన సీట్లలో కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి రెండు స్థానాలు ఉన్నప్పటికీ... బీజేపీ బలం పెరగడంపై ఆరా తీస్తోంది. ప్రధానంగా కరీంనగర్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇవ్వడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వేలాది ఓట్ల మెజారిటీ వచ్చిన నియోజకవర్గాల్లో సైతం కమల వికాసం గురించి చర్చలు జరుగుతుండడంపై ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఆందోళనకు కారణమవుతోంది. గ్రామాల నుంచి మండల, అసెంబ్లీ స్థాయిల వరకు పటిష్టమైన యంత్రాంగం టీఆర్ఎస్ సొంతమైతే... పట్టణాల్లో తప్ప పల్లెల్లో పెద్దగా ప్రభావం చూపని పార్టీగా బీజేపీ ఉంది. కాంగ్రెస్కు ఉన్న ఓటుబ్యాంకు కూడా గ్రామాల్లో బీజేపీకి లేదు. అలాంటి పార్టీ గెలిచేస్తోంది అనే ప్రచారం జరగడానికి గల కారణాలను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వంతోపాటు ఎమ్మెల్యేలు కూడా విశ్లేషించే పనిలో పడ్డారు. ఏడుగురు ఎమ్మెల్యేలు, 90 శాతానికి పైగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు టీఆర్ఎస్ వాళ్లే ఉండగా, బీజేపీ గెలిచిపోతుందనే ప్రచారం ఎందుకు జరుగుతోందని ఆ పార్టీ నేతలు తల పట్టుకుంటున్నారు. గ్రామాల వారీగా సేకరించిన లెక్కల ప్రకారం టీఆర్ఎస్ 2లక్షల మెజారిటీతో గెలుస్తుందని చెపుతున్నప్పటికీ, అంతు చిక్కని పోలింగ్ సరళితో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్లే ఉన్నా... కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అధిష్టానం నుంచి వచ్చిన కచ్చితమైన ఆదేశాలతోపాటు ప్రతీ ఒక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ విజయం కోసం అహోరాత్రులు శ్రమించారనడంలో ఎలాంటి తేడా లేదు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ 20 రోజులుగా వినోద్కుమార్ గెలుపు కోసం ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూనే ప్రచారంలో నిమగ్నమయ్యారు. మంత్రి, ఎమ్మెల్యేల సతీమణులు, కుటుంబసభ్యులు కూడా కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేల వరకు టీఆర్ఎస్ అభ్యర్థి కోసం శ్రమించినా, రెండో శ్రేణి నాయకుల్లో కొందరు బీజేపీకి పరోక్షంగా మద్ధతు పలికినట్లు తెలుస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్లోని కొందరు కార్పొరేటర్లతోపాటు గ్రామాల్లో కొందరు ప్రజాప్రతినిధులు కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారనే సమాచారాన్ని ఆ పార్టీ నేతలు ఇప్పటికే సేకరించారు. మంత్రి ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలను బీజేపీ నేతలు కూడా తోసిపారేయడం లేదు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్కు పోటీ ఇచ్చారే తప్ప బీజేపీ కాదనేది స్పష్టమవుతోంది. అలాగే సిరిసిల్ల, హుస్నాబాద్లలో కూడా టీఆర్ఎస్కు మొగ్గు ఉంటుందని చెబుతున్నారు. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టీఆర్ఎస్తో బీజేపీ నువ్వా నేనా అనే స్థాయిలో ఢీకొట్టిందని పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది. కరీంనగర్ అసెంబ్లీ పరిస్థితులకు మిగతా చోట్లకు తేడా ఉన్నా... కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ 2009, 2014లలో పోటీ చేసి ఓడిపోయారు. 48వ డివిజన్ కార్పొరేటర్గా కూడా వ్యవహరిస్తున్న సంజయ్కు కరీంనగర్లో గట్టిపట్టు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలిచినంత పనిచేసిన సంజయ్ 14వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ మైనారిటీ వర్గం బలంగా ఉండడంతో మెజారిటీ వర్గాల్లో బీజేపీ పట్ల సానుకూలత ఉంది. కానీ గ్రామీణ ఓటర్లు అధికంగా ఉండే మానకొండూరు, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు పడ్డట్టు వస్తున్న సమాచారం టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడడం లేదు. ఈ నియోజకవర్గాల్లో పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామాల్లో కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయా అన్నదే ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాలు ఆరా తీస్తున్న అంశం. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఓట్లు రాలుస్తాయని టీఆర్ఎస్ భావిస్తుండగా, యువత, కొత్త ఓటర్ల ప్రభావం ఆయా కుటుంబాలపై పడిందని, బీజేపీకి గ్రామాల్లో కూడా ఆధిక్యత లభిస్తుందని ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ ‘సాక్షి ప్రతినిధి’తో వ్యాఖ్యానించారు. హిందుత్వం, మోదీ ప్రచారాస్త్రాలుగా.. కరీంనగర్ అసెంబ్లీలో ఓడిపోయిన తరువాత బండి సంజయ్ పార్లమెంటుపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. కరీంనగర్లో 60వేల ఓట్లు కురిపించిన హిందుత్వ నినాదాన్ని గ్రామ స్థాయిలో విస్తరించేందుకు అప్పటి నుంచే పావులు కదిపారు. పార్లమెంటు పరిధిలోని బీజేపీ నేతలు, అనుబంధంగా పనిచేసే ఏబీవీపీ, విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్ వంటి సంస్థల నాయకులతో సంబంధాలు పెంచుకొని చాపకింది నీరులా విస్తరించే ప్రయత్నం చేశారు. రెండుసార్లు ఓడిపోయాడనే సానుభూతితోపాటు హిందుత్వ నినాదం కూడా బలంగా వ్యాపింపజేయడంలో కృతకృత్యులయ్యారు. వీటికి తోడు దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న యుద్ధ వాతావరణం, మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు యువతకు బీజేపీని కొంత దగ్గరికి చేర్చింది. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు కాదనే వాదన కూడా కొంత పనిచేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటన్నింటి పరిణామాల్లో పెరిగిన బీజేపీ ఓట్లు సంజయ్ను గట్టెక్కిస్తాయో లేదో తెలియదు గానీ గులాబీ శిబిరంలో మాత్రం తెలియని ఆందోళనకు కారణమవుతోంది. -
లెక్కల్లో నేతలు!
హోరాహోరీగా కొనసాగిన లోక్సభ ఎన్నికల పోరులో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? పక్షం రోజుల నుంచి విస్తృత ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీల్లో అంతిమంగా ఓటరు ఎవరి వైపు మొగ్గుచూపాడు? ప్రతిష్టాత్మకంగా మారిన పాలమూరు సీటుపై పాగా వేసేదెవరు? ఇప్పటి వరకు గెలుచుకోని నాగర్కర్నూల్ సీటు ఈ సారైనా గులాబీ పరమవుతుందా? సర్వత్రా ఇప్పుడిదే చర్చ. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలపై మొదలైన విశ్లేషణలు ప్రధాన పార్టీలనే కాదు సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి రేపుతున్నాయి. బూత్ వారీగా పోలైన ఓట్లపై లెక్కలేసుకుంటున్న వైనం పాలమూరులో టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చిన బీజేపీ నాగర్కర్నూల్లో దూసుకెళ్లిన ‘కారు’ తగ్గిన పోలింగ్ శాతంపై అన్ని పార్టీల్లో ఆందోళన ఎవరు గెలిచినా మెజార్టీ అంతంతే 41 రోజుల వరకు ఇదే ఉత్కంఠ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా, ఏ నాలుగురు కలిసినా లోక్సభ ఎన్నికల గెలుపోటములపైనే చర్చ జరుగుతోంది. పార్టీల వారీగా ఎవరికి వారే తమ పార్టీనే గెలుస్తోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బుధవారం తమ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో పర్యటించి పోలింగ్ సరళి పరిశీలించిన అభ్యర్థులు.. పోలింగ్ తర్వాత తమ అనుచరులతో ప్రజల నాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూనే.. మరోవైపు పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్ల వివరాలు సేకరించుకున్న అభ్యర్థులు గెలుపోటములపై లెక్క లేసుకుంటున్నారు. పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడంతో.. ఎన్నికల ఫలితాలకు ఇంకా 41 రోజులు మిగిలి ఉండడంతో అప్పటి వరకు ఎదురుచూసే పరిస్థితి రావడం అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపుతోంది. పోలింగ్శాతం తగ్గడంతో ప్రచార పర్వంలో ప్రజల ఆదరణను చూసి తాము లెక్కలేసుకున్న మెజార్టీపై అభ్యర్థులు ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు, నాగర్కర్నూల్ అభ్యర్ధి పోతుగంటి రాములు మూడు లక్షల మెజార్టీతో గెలుస్తారని ఆ పార్టీ నాయకులు భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో అంత మెజార్టీ రావడం అనుమానమే అని గులాబీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. గెలుపు ధీమాలో గులాబీ శ్రేణులు.. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానాలపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ స్థానాలతో పాటు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్కు చెందిన వారే అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుపొంది గులాబీ పార్టీ జిల్లాలో ఎదురులేని శక్తిగా అవతరించింది. ఇదే స్ఫూర్తితో ఆయా పార్టీ శ్రేణులందరూ రెండు లోక్సభ స్థానాల పరిధిలో విస్తృత ప్రచారం చేశారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో ‘కారు..సారు..పదహారు..సర్కారు’ అనే నినాదంతో దూసుకెళ్లిన టీఆర్ఎస్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ ఫథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన ఎజెండాగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇవే తమకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్న ఆ పార్టీ పోలింగ్ తగ్గినా ఫర్వాలేదని.. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ప్రజలు తమను ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు మహబూబ్నగర్, నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్రెడ్డి, పోతుగంటి రాములు తమతమ అనుచరులతో సర్వేలు నిర్వహిస్తున్నారు. కమల విలాపమా? వికాసమా? లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్థులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రెండు లోక్సభ స్థానాలూ తమవే అంటోన్న కాషాయ శ్రేణులు పట్టణాలతో పాటు గ్రామీణ ఓటర్లూ ఈసారి తమను ఆదరించారనే పూర్తి విశ్వాసంతో ఉన్నారు. పోలింగ్ శాతం తగ్గడం.. టీఆర్ఎస్కు ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. తమకు అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్న ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల వివరాలు సేకరించుకుని లెక్కలేసుకుంటున్నారు. పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే.. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, టీఆర్ఎస్ అభ్యర్థికి గట్టిపోటీ ఇచ్చారు. బీజేపీ ఓటు బ్యాంకు ఉన్న నారాయణపేట, మక్తల్, షాద్నగర్లతో పాటు జడ్చర్లలోనూ ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపారని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇందులో పార్లమెంట్ పరిధిలోని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటి కంటే షాద్నగర్ సెగ్మెంట్లోనే అత్యధికంగా 70శాతం పోలింగ్ జరగడం, బీజేపీ తనకు కలిసొచ్చే అంశంగా భావిస్తోంది. ఇటు నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఓటు బ్యాంకు ఉన్న కల్వకుర్తి, వనపర్తిలో పోలైన ఓట్లపై ఆ పార్టీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్కు కలిసొచ్చేనా..? ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల్లో గె లుపు కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారింది. 2014 ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి పోటీ చేసిన జైపాల్రెడ్డి సిట్టింగ్ ఎంపీ జితేందర్రెడ్డి 2,590 స్వ ల్ప ఓట్లతో ఓడిపోయారు. కాగా నాగర్కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థి నందిఎల్లయ్య గెలుపొందారు. అ యితే గతంలో పోటీ చేసిన ఇద్దరూ ఈసారి పోటీకి దూరంగా ఉండడంతో పార్టీ అధిష్టానం స్థానికేతరులైన వంశీచంద్రెడ్డికి మహబూబ్నగర్ నుంచి, మల్లురవిని నాగర్కర్నూల్ నుంచి బరిలో దింపింది. వీరిద్దరూ విస్తృత ప్రచారం నిర్వహించడంతో పాటు కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లపైనే భరోసాతో ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికలు జాతీయ రాజకీయాలకు సంబంధించినవి కావడంతో బీజేపీ, కాంగ్రెస్ల వైపే ప్రజలు మొగ్గుచూపుతారని భావించిన పార్టీ శ్రేణులు రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ మైనార్టీ ఓట్లన్నీ తమకే పోలయ్యాయనే ధీమాతో ఉన్నారు. మహబూబ్నగర్ పరిధిలో 2.40లక్షలు, నాగర్కర్నూల్లో 1.90లక్షల ఓట్లు ఉండగా వాటిలో సింహభాగం ఓటర్లు హస్తం వైపు మొగ్గుచూపారనే ఆశతో ఉన్నారు. -
భవితవ్యం భద్రం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. లోక్సభ పరిధిలో 11,37,231 మంది ఓట్లు వేయగా.. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరి అంచనాల్లో వారు నిమగ్నమయ్యారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 67.9 శాతం ఓటింగ్ జరిగినట్లు తొలుత అధికారులు ప్రకటించగా.. 5గంటల తర్వాత కూడా అనేక మంది ఓటర్లు క్యూలో నిల్చోవడం.. వారంతా ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఓటింగ్ శాతం 75.16కు చేరింది. పోలింగ్ సరళినిబట్టి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి.. తమకెన్ని ఓట్లు వస్తాయని లెక్కలేసుకుంటున్నారు. ఖమ్మం లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వాటి పరిధిలో 15,13,094 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 7,39,600 మంది, 7,73,428 మంది మహిళలు, 66 మంది ఇతరులు ఉన్నారు. వీరిలో 11,37,231 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 5,59,387 మంది పురుషులు, 5,77,812 మంది మహిళలు, 32 మంది ఇతరులు ఉన్నారు. దీంతో మొత్తం పోలింగ్ 75.16 శాతం జరిగినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఉదయం సమయంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో మొదట పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం వరకు ఓటర్లు చాలా తక్కువ మంది పోలింగ్ బూత్లకు వచ్చారు. అయితే ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం తర్వాత ఓటర్లు బూత్ల వద్దకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ సమయం దాటిన తర్వాత కూడా ఓటు వేసేందుకు వచ్చిన వారు మిగిలిపోవడంతో అప్పటి వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈవీఎంలలోనే.. ఖమ్మం లోక్సభ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలు, వీవీ ప్యాట్లను తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్లో భద్రపరిచారు. ఇక్కడ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి దశలో కేంద్ర బలగాలు, రెండో దశలో రాష్ట్రస్థాయి బలగాలు, మూడో దశలో జిల్లాస్థాయి బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. మే 23వ తేదీ వరకు స్ట్రాంగ్రూమ్లలో అభ్యర్థుల భవిష్యత్ నిక్షిప్తమై ఉంటుంది. అప్పటి వరకు అభ్యర్థుల తరఫున కూడా బందోబస్తు నిర్వహించే అవకాశం కూడా కల్పించారు. ఈసారి ఎన్నికల నిర్వహణకు, ఫలితాల ప్రకటనకు దాదాపు 40 రోజుల గడువు ఉంది. అంచనాల్లో పార్టీలు.. ఎన్నికలు ముగియడంతో వివిధ పార్టీల నాయకులు, అభ్యర్థులు అంచనాల్లో మునిగిపోయారు. పోలింగ్ సరళి ఎలా నమోదైంది.. తమ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఎక్కడ ఉంటుంది.. ఎక్కడ ఓట్లు పడలేదనే దానిపై లెక్కలు వేయడంలో అభ్యర్థులు లీనమయ్యారు. ఫలితాల వెల్లడికి ఎక్కువ రోజులు గడువు ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠతో కూడిన ఆందోళన నెలకొంది. అయితే విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలతోపాటు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, జనసేన అభ్యర్థులు పోలింగ్ సరళినిబట్టి తమకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందనే దానిపై అంచనాలకు వస్తున్నారు. పాలేరులో అత్యధికంగా పోలింగ్.. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 75.16 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాలేరు నియోజకవర్గంలో అత్యధికంగా 82.87 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 2,16,622 మంది ఓటర్లు ఉండగా.. 1,79,518 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత మధిర నియోజకవర్గంలో 81.40 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 2,10,358 మంది ఓటర్లు ఉండగా.. 1,71,232 మంది ఓటు వేశారు. వైరాలో 79.15 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 1,83,286 మంది ఓటర్లు ఉండగా.. 1,45,077 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సత్తుపల్లిలో 77.84 శాతం ఓటింగ్ జరిగింది. ఇక్కడ మొత్తం 2,30,426 మంది ఓటర్లు ఉండగా.. 1,79,353 మంది ఓటు వేశారు. అశ్వారావుపేటలో 77.72 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 1,50,205 మంది ఓటర్లు ఉండగా.. 1,16,735 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో 66.77 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 2,28,597 మంది ఓటర్లు ఉండగా.. 1,52,641 మంది ఓటర్లు ఓటు వేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 65.63 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 2,93,600 మంది ఓటర్లు ఉండగా.. 1,92,675 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలను తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో గల స్ట్రాంగ్రూమ్లో భద్రపరిచారు. భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ శుక్రవారం పరిశీలించారు. స్ట్రాంగ్రూమ్ను దగ్గరుండి సీల్ చేయించారు. అలాగే ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కూడా సందర్శించారు. స్ట్రాంగ్రూమ్కు సీల్ వేస్తున్న దృశ్యం -
లెక్క మారెన్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో పోలింగ్ శాతం లెక్క మారింది. లెక్కింపులో గందరగోళం నెలకొంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్సభ స్థానాలకు గాను తొలుత తక్కువ పోలింగ్ శాతం ప్రకటించిన అధికారులు.. ఆ తర్వాత సరిదిద్దారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు గురువారం జరిగిన విషయం విదితమే. ఆ రోజు రాత్రి వరకు అధికారులు అందించిన సమాచారం ప్రకారంహైదరాబాద్లో 39.20 శాతం, సికింద్రాబాద్లో 44.99 శాతం, మల్కాజిగిరిలో 49.21 శాతం పోలింగ్ నమోదైంది. అయితేఅధికారులు మళ్లీ శుక్రవారం తుది గణాంకాలు విడుదల చేశారు. దీని ప్రకారం హైదరాబాద్లో 44.75 శాతం, సికింద్రాబాద్లో 46.26 శాతం, మల్కాజిగిరిలో 49.40 శాతంపోలింగ్ నమోదైంది. ఈ లెక్కన పోలింగ్ పెరిగినప్పటికీ... గతంతో పోలిస్తే ఈ మూడు నియోజకవర్గాల్లోనూ తక్కువే నమోదైంది. సికింద్రాబాద్లో 39.20 శాతం పోలింగ్ నమోదైందని తొలుత ప్రకటించిన అధికారులు.. గురువారం రాత్రికి దాన్ని 44.99 శాతంగా పేర్కొన్నారు. మళ్లీ శుక్రవారం 46.26 శాతంగా ప్రకటించారు. అదే విధంగా హైదరాబాద్ విషయంలోనూ తొలుత 39.49 శాతం పేర్కొనగా.. అంతిమంగా 44.75 శాతంగా తేల్చారు. దీంతో ప్రజలు కొంత అయోమయానికి గురయ్యారు. తుది లెక్కల మేరకు హైదరాబాద్ జిల్లా పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. పోలింగ్ జరిగిన గురువారం రాత్రి వరకు హైదరాబాద్లో 39.49శాతం, సికింద్రాబాద్లో 44.99శాతం పోలింగ్తో వెరసీ జిల్లాలో 42.24శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే తుది లెక్కల అనంతరం హైదరాబాద్లో 44.75శాతం, సికింద్రాబాద్లో 46.26శాతం పోలింగ్ జరగడంతో జిల్లాలో మొత్తం 45.51శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. ♦ హైదరాబాద్ లోక్సభ పరిధిలో 19,57,772 మంది ఓటర్లుండగా... 8,76,078 మంది ఓటు వేశారు. వీరిలో 4,77,929 మంది పురుషులు, 3,98,145 మంది మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు. ♦ సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో 19,68,147 మంది ఓటర్లుండగా... 9,10,437 మంది ఓటు వేశారు. వీరిలో 4,85,913 మంది పురుషులు, 4,24,520 మంది మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు. ♦ మల్కాజిగిరిలో మొత్తం ఓటర్లు 31,49,710 మంది ఉండగా... 15,60,108 ఓటు వేశారు. వీరిలో 8,22,098 మంది పురుషులు, 7,37,975 మంది మహిళలు, ఇతరులు 35 మంది ఉన్నారు. ♦ హైదరాబాద్ లోక్సభ పరిధిలో గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 53.51శాతం పోలింగ్ నమోదు కాగా...అత్యల్పంగా మలక్పేట సెగ్మెంట్లో37.40 శాతం నమోదైంది. ♦ సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో అంబర్పేట అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 52.70 శాతం పోలింగ్ నమోదవగా... అత్యల్పంగా నాంపల్లిలో 38.77శాతం పోలింగ్ జరిగింది. ♦ మల్కాజిగిరి లోక్సభ పరిధిలో మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 56.58 శాతం పోలింగ్ నమోదు కాగా... అత్యల్పంగా ఎల్బీనగర్లో 44.49 శాతం నమోదైంది. ♦ హైదరాబాద్ జిల్లా పరిధిలో (హైదరాబాద్, సికింద్రాబాద్ రెండూ కలిపి) సగటున 45.51 శాతం పోలింగ్ నమోదైంది. ♦ ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటర్లు 39,25,919 మంది ఉండగా... 17,86,515 మంది ఓటు వేశారు. వీరిలో 9,63,842 మంది పురుషులు, 8,22,665 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారు. హైదరాబాద్ లోక్సభ మొత్తం ఓటర్లు: 19,57,772 పోలైన ఓట్లు: 8,76,078 పోలింగ్ శాతం: 44.75 సికింద్రాబాద్ లోక్సభ మొత్తం ఓటర్లు: 19,68,147 పోలైన ఓట్లు: 9,10,437 పోలింగ్ శాతం: 46.26 మల్కాజిగిరి లోక్సభ మొత్తం ఓటర్లు: 31,49,710 పోలైన ఓట్లు: 15,60,108 పోలింగ్ శాతం: 49.40 -
కాయ్ రాజా.. కాయ్..!
దిల్సుఖ్నగర్: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక మిగిలింది ఎన్నికల ఫలితాలే.. ఫలితాలకు ఇంకా 42 రోజుల గడువు ఉండటంతో అప్పటి వరకు ఆగలేని నాయకులు తమ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడని అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. దీంతో రంగంలోని దిగిన బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఎన్నికల సమరంలో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి, ఇష్టం ఉన్నా లేకున్న ముఖంపై రంగు పులుముకొని అందరినీ పేరుపేరునా పిలుస్తూ, యోగక్షేమాలు తెలుసుకుంటు ప్రచారం నిర్వహించారు. మరికొందరు లేని చుట్టరికాన్ని కలుపుకుంటూ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తు చేసిన ప్రచారం పోలింగ్తో ముగిసింది. ఇక తేలాల్సింది అభ్యర్థుల భవితవ్యమే. బూతుల వారీగా లెక్కింపులు.. ఆయా లోక్సభ సెగ్మెంట్లలో శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ భవితవ్యంపై తమ అనుచరగణంతో బూతుల వారీగా లెక్కలు తెప్పించుకుని సరి చూసుకుంటున్నారు. మరికొంతమంది చిన్నాచితకా పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ ఓటమిని ముందుగానే నిర్ణయించుకుని ఎంచక్కా వేసవి విడిదికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. బెట్టింగుల జోరు.. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టిన తమకు విజయం వరిస్తుందని గంపెడాశతో అభ్యర్థులు ఉన్నారు. అయితే ఆయా నియోజక వర్గాల్లోని నాయకులు, చోటామోటా నేతలు తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటే తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని పెద్ద ఎత్తున బెట్టింగ్లకుపాల్పడుతున్నారు. ఈ బెట్టింగ్లు కార్యకర్తలమధ్య అయితే వేలల్లోనూ మోస్తరి నాయకులమధ్య అయితే లక్షల్లోనూ సాగుతున్నట్లు వినికిడి. గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. ఎన్నో నెలలుగా ఎంతో కష్టపడి తమ నాయకుని పక్షాన ప్రచారం చేశామని, ఇప్పుడు తమ నాయకుడు ఓడిపోతాడని అవతలి పక్షం వారు లెక్కలు కట్టి తేల్చి చెబుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ విధంగా బెట్టింగ్లు కట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. చేవెళ్ల పరిధిలో జోరుగా.. చేవెళ్ల లోక్సభ పరిధిలో ఎక్కువగా బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో తమ అభ్యర్థలు గెలిస్తే తమకు పూర్తి సంతోషంతో పాటు డబుల్ దమాకాగా బెట్టింగ్ కట్టిన డబ్బులకు రెండింతలు వస్తాయని లేకపోతే అభ్యర్థి ఓటమితోపాటు తమ డబ్బులు కూడా పోతాయని వాపోతున్నారు. ఈ బెట్టింగ్ల విషయం తెలియని అభ్యర్థులు మాత్రం తమ భవితపై ఎన్నో ఆశలతో ఉన్నారు. మరో నలభై రెండు రోజులపాటు ఈ టెన్షన్ అనుభవించక తప్పదు మరి. -
‘స్థానిక’ టికెట్లకు..‘సెలెక్ట్ అండ్ ఎలక్ట్’ విధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణ యం తీసుకుంది. రానున్న స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల్లో ‘సెలెక్ట్ అండ్ ఎలక్ట్’అనే విధానాన్ని మళ్లీ తీసుకువచ్చే యోచన చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) పనిచేసిన సమయంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అనుసరించిన ఈ విధానా న్ని మళ్లీ అమలుచేయాలని భావిస్తోంది. స్థానిక టికె ట్లు గాంధీభవన్ నుంచి కాకుండా క్షేత్రస్థాయి నుంచే ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ ముఖ్యుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం జరిగే సమావేశంలో వీటి విధివిధానాలు రూపొందించనున్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పోలింగ్ సరళిని సమీక్షించడంతో పాటు స్థానిక ఎన్నికల వ్యూహ రచన కోసం అందుబాటులో ఉన్న నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జెట్టి కుసుమకుమార్, మహ్మద్ అజారుద్దీన్, టీపీసీసీ ముఖ్య నేతలు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య , చిన్నారెడ్డి, వంశీ చందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అనిల్ కుమార్, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా లోక్సభ ఎన్నికలు జరిగిన తీరుపై నేతలు సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు గాను 10 చోట్ల పార్టీ అభ్యర్థులు టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చారని, కచ్చితంగా ఆరింట విజయం సాధిస్తామనే అంచనాకు వచ్చారు. ముఖ్యంగా మల్కాజ్గిరి, చేవెళ్ల, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాకు వచ్చారు. పాత పద్ధతికి పోదామా..? ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన టీపీసీసీ ముఖ్య నేతలు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను మం డల కాంగ్రెస్ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జులకు అప్పగించాలని నిర్ణయించారు.ఎమ్మెస్సార్ పీసీ సీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘సెలెక్ట్ అండ్ ఎలక్ట్’ పేరుతో మండల కాంగ్రెస్ అధ్యక్షుల నుంచే ముం దుగా ప్రతిపాదనలు తెప్పించుకుని, ఆయా పేర్లపై చర్చించి చాలా తక్కువ స్థానాల్లోనే మార్పులు చేశారనే అంశం చర్చకు వచ్చింది. దీనిపై నేతలు కూడా సానుకూలతను వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో సమావేశాలు జరిపి, అక్కడి నుంచే మండల అధ్యక్షుల నుంచి అభ్యర్థుల ప్రతిపాదనలు తెప్పించుకో వాలని స్థూలంగా నిర్ణయించారు. అయితే, దీనిపై మరోసారి భేటీ అవుదామని, వచ్చే వారంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈనెల 15లోగా మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా మండలాల్లో సమావేశాలు జరిపి అభ్యర్థుల ముసాయిదా జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లాపరిషత్ చైర్మన్ల ఎంపిక మాత్రమే టీపీసీసీ స్థాయిలో చేయాలని, పార్టీ మండలాధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులు లేని చోట్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకోండి: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలోనే రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కేడర్ కష్టపడిందని, ఎన్నికల్లో పనిచేసిన నేతలు, పార్టీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం కోసం క్షేత్రస్థాయి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. కాగా, లోక్సభ ఎన్నికల ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద తమ పార్టీ కేడర్, వాలంటీర్లతో భద్రత ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ శుక్రవారం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రెండు, మూడు అంచెల్లో తమ కేడర్తో భద్రత ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినివ్వాలని ఈ లేఖలో ఆయన కోరారు. -
ఫొటో తీశాడు.. బుక్కయ్యాడు!
సాక్షి, వీపనగండ్ల: చట్టప్రకారం పోలింగ్ కేంద్రంలో ఫొటోలు తీయడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం నేరంకాగా, పోలింగ్ కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారే ఆ దృశ్యాలను చిత్రీకరించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సంఘటన మండలంలోని బొల్లారం గ్రామం 139వ పోలింగ్ కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామంలోని 139పోలింగ్ కేంద్రంలో లింగాల డీఆర్డీఏ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రమేష్నాయక్ ఓపీఓగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లను, ఈవీఎం వద్దకు వెళ్లి ఓటు వేస్తున్న దృశ్యాలను తన కెమెరాతో చిత్రీకరించారని ఈ విషయమై ఆ గ్రామానికి చెందిన ఓటర్లు ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ ఫొటోలు చిత్రీకరించిన అధికారిపై విచారణ చేపట్టారు. తనకు వీడియోకాల్ వస్తే మాట్లాడాను తప్పా ఫొటోలు తీయలేదని సదరు ఓపీఓ సమాధానం ఇచ్చినట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశానుసారం ఫొటోలు చిత్రీకరించిన ఫోన్çను స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయి విచారణ చేపట్టి అధికారులు నివేదికలు పంపనున్నట్లు తెలిపారు. -
పోలింగ్ను బహిష్కరించిన చెక్కి క్యాంప్
బోధన్రూరల్(బోధన్): మండలంలోని చెక్కి క్యాంప్ గ్రామాన్ని బోధన్ మున్సిపాలిటీలో వీలినం చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ను బహిష్కరించారు. గురువారం మండలంలోని చెక్కి క్యాంప్ గ్రామంలో అధికారులు తెలిపిన ప్రకారం 556 మంది ఓటర్లు ఉండగా పోలింగ్ కేంద్రం నెంబర్ 45లో ఉదయం 8గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 20మందే ఓటు వేశారు. మిగిలిన ఓటర్లు తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దని ఓటింగ్లో పాల్గొనకుండా నిరసన తెలిపారు. సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్ పాల్గొనకుండా భీస్మించారు. గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో అధిక శాతం ప్రజలు ఉపాధిహామీ పనుల మీద ఆధారపడ్డారన్నారు. గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడం ద్వారా ఉపాధి కోల్పోవడంతో పాటు పన్నుల భారంతో ఇబ్బందులు పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను అధికారులు, ప్రభుత్వం గుర్తించి గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయకుండా కొత్త జీపీగా ఏర్పాటు చేయాలని కోరారు. తమకు కచ్చితమైన హామీ లభించేవరకు పోలింగ్లో పాల్గొనేది లేదన్నారు. దీంతో సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రానికి ఓటర్లు రాక వెలవెలబోయింది. అనంతరం సాయంత్రం సమయంలో గ్రామస్తులందరు పునారోచన చేసి సమస్య సాధనకు కార్యాచరణ రూపొందించుకుని కలసికట్టుగా పోరాటం చేద్దామని నిర్ణయించుకుని తిరిగి సాయంత్రం 6నుంచి8గంటలవరకు ఓటింగ్లో పాల్గొన్నారు.మొత్తం68.52శాతం ఓటింగ్ నమోదైనట్లు పీవో తెలిపారు. అధికారులు పోలింగ్ సమయం పెంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. -
సిరాను చెరిపేసి.. రెండోసారి ఓటేసి!
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్): కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలు అక్కడ పనిచేయలేదు.. ఒక ఓటరు ఒక రోజు ఒకే రాష్ట్రానికి ఓటేయ్యాలని నిబంధన ఉన్నప్పటికీ అక్కడి ఓటర్లలో కొందరు రెండు రాష్ట్రాలకు ఓటేసినట్లు సమాచారం. తెలంగాణ, మహారాష్ట్ర వివాదాస్పద సరిహద్దు గ్రామాల్లోని ఓటర్లు గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు తెలంగాణతో పాటు మహారాష్ట్ర పోలింగ్ బూత్ కేంద్రాలోనూ ఓటు హక్కును విని యోగించుకున్నారు. తమ ఎడమ చేతి చూపుడు వేలుకు ఉన్న సిరా చుక్కను చెరిపేసి రెండో ఓటు కూడా వేశారు. ఈ సంఘటనలు పరందోళి, ముకదంగూడ, అంతాపూర్ పోలింగ్ కేంద్రాల్లో జరిగి నట్లు సమాచారం. నిమ్మకాయతో చెరిపేసి.. ఓటర్లు వివిధ క్రియలతో రెండు ఓట్లను ఉపయోగించుకున్నారు. కొందరు తలకు నూనే రాసుకుని వచ్చారు. ఎన్నికల కేంద్రంలో అధికారులు వేలికి సిరాను అంటించంగా బయటికి వచ్చేసి ఆ వేలిని తలకు రాయడంతో సిరా కనిపించకుండా పోతుం ది. అలాగే కొందరు వేలికి అంటిన సిరాను నిమ్మకాయ రసంతో చెరిపేస్తున్నారు. ఇంకొందరు నిమ్మకాయ రసంలో నాన్చిన పుల్లతో సిరాను చేరి పేసి రెండో సారి ఓటు వేశారు. మిగిలిన కుటుం బాల్లో సగం తెలంగాణ, మరోసగం మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. కెరమెరి మండలంలోని మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్ కేంద్రాలతో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదు పోలింగ్ బూత్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగిందని సమాచారం. ప్రయాణానికి ఇబ్బంది పడిన ఓటర్లు మండలంలో భోలాపటార్ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కేంద్రానికి రావాడానికి ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేక లేక కొందరు కాలినడకతో రాగా.. మరి కొందరు ప్రైవేటు వాహనాలను ఎంగేజ్ చేసుకుని రావడం కనిపించింది. వృద్ధులు, వికలాంగులకు ఎలాంటి సౌకర్యం లేక ఇబ్బంది పడ్డారు. ఉదయం పది గంటల వరకు మందకోడిగా సాగిన పోలింగ్ తర్వాత ఊపందుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరందోలి పోలింగ్ కేంద్రంలో (పరందోలి, తాండ, లేండిజాల, చింతగూడ, శంకర్లొద్ది) ముకదంగూడలో (మహరాజ్గూడ, ముకదంగూడ) భోలాపటార్లో (భోలాపటార్, గౌరి, లేండిగూడ)అంతాపూర్లో (అంతాపూర్, ఏసాపూర్, నారాయణగూడ, ఇంద్రానగర్, పద్మావతి) గ్రామాలున్నాయి. మహారాష్ట్రలోని పోలింగ్ కేంద్రాల్లోనూ మన గ్రామాలున్నాయి. పరందోలి పోలింగ్ బూత్లో (ముకదంగూడ, లేండిజాల, కోటా, పరందోలి) వణిలో ( శంకర్లొద్ది), మహరాజ్గూడలో (మహారాజ్గూడ), భోలాపటార్లో (పలస్గూడ, ఏసాపూర్, లేండిగూడ, నారాయణగూడ, భోలాపటర్) పుడ్యాన్మొహదాలో (పద్మావతి, అంతాపూర్) గ్రామాలున్నాయి. -
నిజామాబాద్లో 68 శాతం పోలింగ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూసిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పోలింగ్ సజావుగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎండను సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. యువత, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓటుహక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 68.10 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 15,52,838 మంది ఓటర్లకు గాను 10,57,483 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్పోలింగ్ ప్రక్రియను చేపట్టిన అధికారులు, 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. 185 మంది అభ్యర్థులు ఉండటంతో మాక్పోలింగ్కు అధిక సమయం పట్టింది. పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు కారణంగా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. దీంతో తొలి గంట సమయం.. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు కేవలం 3.60 శాతమే పోలింగ్ నమోదైంది. 11 గంటల వరకు 13.80 శాతానికి చేరుకున్న పోలింగ్ తర్వాత పుంజుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 38.10 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత ఎండ కారణంగా రెండు గంటల పాటు పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయా యి. మధ్యాహ్నం 3 గంటల వరకు 45.29 శాతాని కి పెరిగింది. మళ్లీ సాయంత్రం 4 తర్వాత పోలింగ్ పుంజుకుంది. 5 గంటల వరకు 54.20 శాతానికి చేరుకుంది. బాల్కొండ నియోజకవర్గం వడ్యాట్, సుంకెట్, నల్లూరు, కొడిచర్ల, హాసకొత్తూరు, జక్రాన్పల్లి మండలం పడకల్ 6 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. బోధన్ మండలం చెక్కి క్యాంపులో రాత్రి 7.30 గంటల వరకు పోలింగ్ జరిగింది. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు వెబ్క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును సీపీ కార్తికేయ పరిశీలించారు. ఊపిరి పీల్చుకున్న అధికారులు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పోలింగ్ సజావు గా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ప్రత్యేకంగా ఎం–3 రకం ఈవీఎంలను వినియోగించి పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు అధికారులు నిర్విరామంగా పనిచేశారు. కొందరు అధికారులు, సిబ్బంది రాత్రీపగలు తేడా లేకుండా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. 12 బ్యాలెట్ యూనిట్లు పోలింగ్ కేంద్రాలకు తరలింపు., అదనపు పోలింగ్ సిబ్బంది.. ఇలా అన్ని రకాలుగా అదనపు ఏర్పాట్లు చేయాల్సి రావడంతో అధికారులు నిర్విరామంగా పనిచేయాల్సి వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ జరిగింది. స్ట్రాంగ్ రూంలకు ఈవీఎంలు.. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్టాం గ్రూంలకు తరలించారు. డిచ్పల్లి మండలం సు ద్దపల్లిలోని సీఎంసీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రపరిచారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంల లెక్కింపు ఈ సీఎంసీలో నిర్వహించాలని ని ర్ణయించారు. మిగిలిన కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల ఓట్లను జగిత్యాలలో లెక్కించనున్నారు. ఓట్లేసిన అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు.. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ కుటుంబసభ్యుల తో కలిసి పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత తన కుటుంబసభ్యులతో కలిసి నవీపేట్ మండలం పోతంగల్లో ఓటు వేశారు. బీజేపీ అ భ్యర్థి ధర్మపురి అర్వింద్ తన సతీమణి ప్రియాంక తో కలిసి నగరంలోని కాకతీయ కాలేజీ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నా రు. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ గంగాస్థాన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. వేల్పూర్ మండ ల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తన సతీమణితో కలిసి వచ్చి ఓటేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు.. 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికల సంఘం చరిత్రలోనే తొలిసారిగా ఎం–3 ఈవీ ఎంలతో పోలింగ్ నిర్వహించారు. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించినప్పటికీ ఇంజనీర్లు వాటిని సరిచేసి, పోలింగ్ను ప్రారంభించారు. భీంగల్ మండలం పల్లికొండ, బోధన్ మండలం సాలూర, నవీపేట్ మండలం పోతంగల్, ఇందల్వాయి మండలం తిర్మన్పల్లి, ఆర్మూర్ మండలం పెర్కిట్, మోర్తాడ్ మండలం వడ్యాడ్, నందిపేట్, మెండోరా, ఇందల్వాయి, ధర్పల్లి, భీంగల్ మండల కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. బోధన్ పట్టణంలోని నాలుగు పోలింగ్ కేంద్రాలు, సిరికొండ మండలం చీమన్పల్లి, రావుట్లలో, నిజామాబాద్ రూరల్ మండలంలోని ఖానాపూర్లో, నందిపేట్ మండలం వెల్మల్, కుద్వాన్పూర్లలోనూ ఈవీఎంల మొరాయింపు కారణంగా కాస్త ఆలస్యంగా పోలింగ్ షురువైంది. మోపాల్ మండలం సిర్పూర్లో, మెండోరా మండలంలో వెల్గటూరు, డిచ్పల్లి మండలం సాంపల్లిలోనూ ఈవీఎంలలో సాంకేతిక సమస్య తలెత్తితే ఇంజనీర్లు సరిచేశారు. హాసకొత్తూర్లో 75మంది పోలింగ్ ఏజెంట్లు 175 మంది రైతులు బరిలో ఉండగా, పలు పోలిం గ్ కేంద్రాల్లో ఈ అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకున్నారు. కమ్మర్పల్లి మండలం హాసకొత్తూర్ పోలింగ్బూత్లో 75 మంది ఏజెంట్లు పోలింగ్ విధుల్లో పాల్గొన్నారు. ఇందులో సగానికి పైగా మహిళా రైతులు ఉన్నారు. ఇదే గ్రామంలో మరో బూత్లో 35 మంది ఏజెంట్లు ఉన్నారు. అధిక సంఖ్యలో ఏజెంట్లు ఉండటంతో ఇక్కడ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్బూత్ బయట టెంట్లు, కుర్చీలు వేసి అందులో కూర్చోబెట్టారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. బాల్కొండ, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొన్ని పోలింగ్ బూతుల్లోనే రైతు అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకున్నారు. బెట్టు చేసిన చెక్కిక్యాంపు వాసులు.. బోధన్ మండలం తమ గ్రామాన్ని బోధన్ మున్సి పాలిటీలో విలీనం చేయవద్దని చెక్కి క్యాంపు గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించాలని మొదట నిర్ణయించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎవరూ పోలింగ్కేంద్రానికి రాలేదు. దీంతో పలు పార్టీల అభ్యర్థులు వెళ్లి గ్రామస్తులకు సర్ది చెప్పడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలో స్వల్ప లాఠీచార్జి.. నిజామాబాద్ నగరంలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి స్వల్పంగా లాఠీచార్జి చేసి, ఇరు వర్గాలను చెదరగొట్టారు. -
మళ్లీ ‘కారు’దే.. కన్నారం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల విజయాలతో ఊపు మీదున్న తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సత్తా చాటిందా..? కారు... సారు... పదహారు నినాదం సానుకూల ప్రభావం చూపిందా..? కరీంనగర్లో కాషాయ జెండా ఎగరేయాలన్న బండి సంజయ్ కల నెలవేరుతుందా..? కకావికలమై పోయిన కాంగ్రెస్ టీఆర్ఎస్కు పోటీ ఇచ్చిందా...? ఓటరు మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. పార్లమెంటు లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సాగింది. తొలుత మందకొడిగా మొదలైన పోలింగ్ మధ్యాహ్నం తరువాత ఊపందుకుంది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 69.40 శాతం పోలింగ్ నమోదు కాగా, పెద్దపల్లిలో 59.24 శాతం ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. కాగా రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ఒక్కో చోట ఒక్కో విధంగా ఓటర్లు తమ విజ్ఞతను ప్రదర్శించినట్లు ప్రాథమికంగా అర్థమమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగిన టీఆర్ఎస్ హవా కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు లోకసభ నియోజకవర్గాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం పోలింగ్ సరళిలో స్పష్టంగా కనిపించింది. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల స్థాయిలో ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు జరగకపోయినా, గ్రామాల్లో ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్లకు వచ్చి ఓట్లేశారు. వృద్ధులు, ఆసరా పెన్షన్ల లబ్ధిదారులు, రైతులు బూత్లలో క్యూ కట్టిన తీరు టీఆర్ఎస్కు అనుకూల గాలిని స్పష్టం చేసింది. అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేస్తే అభివృద్ధి పనులు జరుగుతాయనే ధోరణితో ఓటర్లు కనిపించారు. పట్టణాల్లో కొంత మార్పు కనిపించినప్పటికీ, మహిళలు, ముస్లిం మైనారిటీలు టీఆర్ఎస్ను ఆదరించినట్లు స్పష్టమైంది. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును కొంత కోల్పోయినా, విజయానికి అవసరమైన ఓట్లు పెద్ద సంఖ్యలోనే పోలయినట్లు ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటులోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రామగుండంలో స్వల్ప తేడా కనిపించినా, మిగతా ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగింది. కోల్బెల్ట్ ఏరియాలో మాజీ ఎంపీ వివేక్ ప్రభావం కొంత కనిపించిందని పోలింగ్ సరళితో అర్థమవుతోంది. కరీంనగర్లో టీఆర్ఎస్కు బీజేపీ సవాల్ కరీంనగర్లో టీఆర్ఎస్కు బీజేపీ సవాల్ విసిరినట్లు అంచనాలను బట్టి తెలుస్తోంది. కరీంనగర్తోపాటు పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం భారీగానే పెరిగినట్లు తెలుస్తోంది. మైనారిటీ ప్రభావం అధికంగా గల కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంటులో సంజయ్ మెరుగైన ఫలితాన్ని రాబడతారని భావిస్తున్నారు. ఇక మానకొండూరు, చొప్పదండి, వేములవాడల్లో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. సిరిసిల్లలో కేటీఆర్ ప్రభావం ఉన్నప్పటికీ టీఆర్ఎస్కు బీజేపీనే పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్, హుస్నాబాద్లలో బీజేపీ ఓటర్లను ఆకర్షించడంలో సఫలీకృతం కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంజయ్ హిందుత్వ ఎజెండా, మోదీ పాలన, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలన్నీ కరీంనగర్లో బీజేపికి అనుకూలంగా పనిచేసినట్లు భావిస్తున్నారు. యువత, కొత్త ఓటర్లు చేసిన హంగామా ఈవీఎంలలో ఓట్ల రూపంలోకి మారిందా అనేది ప్రశ్నార్థకం. ఓవరాల్గా 1998, 1999 ఎన్నికల తరువాత కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం గమనార్హం. కాగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాత్రం తనదే విజయమనే ధీమాతో ఉన్నారు. ఇక పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్ ప్రభావం చూపలేకపోయారని పోలింగ్ తీరును బట్టి తెలుస్తోంది. యువత, కొత్త ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తున్నా.. టీఆర్ఎస్ను ఢీకొట్టలేక పోయింది. పొన్నం 2009 నాటి ఓటు బ్యాంకు పదిలమా..? అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి, మూడోస్థానంలో నిలిచినప్పటికీ.. ఎంపీగా 2009లో గెలిచిన నాటి పరిస్థితులు పునరావృతమవుతాయనే నమ్మకంతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మరోసారి బరిలో దిగారు. కరీంనగర్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆనాటి ఓటుబ్యాంకు తిరిగి సమకూర్చుకోలేక పోయినట్టు గురువారం నాటి పోలింగ్కు వచ్చిన ఓటర్ల నాడిని బట్టి అర్థమవుతోంది. కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి, వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో టీఆర్ఎస్కు బీజేపీ నువ్వానేనా అనే స్థాయిలోనే పోటీ ఇవ్వగా, కాంగ్రెస్కు ఆ పరిస్థితి కనిపించలేదు. హుజూరాబాద్, హుస్నాబాద్లలో మాత్రం టీఆర్ఎస్కు కాంగ్రెస్ పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిరిసిల్లలో సైతం టీఆర్ఎస్ తరువాత స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడ్డట్టు తెలుస్తోంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ విఫల ప్రయోగమేనా? పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్కు చెందిన మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ను ఆ పార్టీ దిగుమతి చేసింది. జిల్లాకు చెందిన మాదిగ సామాజిక వర్గం నాయకులను సైతం కాదని చంద్రశేఖర్ను తీసుకురాగా, ఉన్న వారు సైతం తగిన సహకారం అందించలేదు. కాంగ్రెస్కు చెందిన రెండో శ్రేణి నాయకత్వం పూర్తిగా టీఆర్ఎస్లోకి చేరిన పరిస్థితుల్లో చంద్రశేఖర్కు ఏమాత్రం సహకారం లభించలేదు. మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్బాబు, పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండంలో మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, మంచిర్యాలలో కొక్కిరాల ప్రేంసాగర్రావు మినహా చెప్పుకోదగ్గ నాయకులు లేకుండా పోయారు. ఇక్కడ కూడా రెండోస్థాయి నాయకుల్లో అధిక శాతం గులాబీ కండువాలే కప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రశేఖర్ తన సామాజిక వర్గం ఓట్లతోపాటు కాంగ్రెస్ ఓటుబ్యాంకు మీదే ఆధారపడ్డారు. అనేక నియోజకవర్గాల్లో ఓటు వేయమని అడిగే నాథుడు కూడా లేకపోవడం, ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురాలేని పరిస్థితి నెలకొనడంతో చంద్రశేఖర్ ప్రయోగం ఆశించిన స్థాయిలో కూడా సఫలం కాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి కారు హవా రెండు లోక్సభ నియోజకవర్గాల్లో కూడా కనిపించనుందని తెలుస్తోంది. వచ్చేనెల 23న ఫలితాల వరకు వేచి చూస్తూ ఎవరి అంచనాల్లో వారు ఉండడం మిగిలింది. -
పోలింగ్ తగ్గెన్.. ఓటింగ్ ముగిసెన్
సాక్షి, జగిత్యాల: లోక్సభ సమరం ముగిసింది. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో 70.04 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం భారీగా తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో 77.61 శాతం నమోదైంది. జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 62.53శాతం నమోదైంది. జగిత్యాల నియోజకవర్గంలో 69.20 శాతం, కోరుట్ల నియోజకవర్గంలో 68.85శాతం ఓటింగ్ నమోదైంది. ఎండ తీవ్రంగా ఉండడంతో మధ్యాహ్నం వరకే చాలా కేంద్రాలు బోసిపోయి కనిపించాయి. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. తగ్గిన ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 77.61 శాతం పోలింగ్ నమోదుకాగా ప్రస్తుతం 70.04 శాతానికి పరిమితమైంది. ధర్మపురి నియోజకవర్గంలో అసెంబ్లీలో 78.02శాతం ఓటింగ్ జరిగితే ఈసారి 62.53, కోరుట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో 75.45 శాతం, లోక్సభ ఎన్నికల్లో 68.85, జగిత్యాలలో 79.35 శాతం నుంచి 69.20 శాతానికి పడిపోయింది. తగ్గిన ఓటింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుందనే చర్చ ఆసక్తిగా మారింది. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మాక్పోలింగ్ నిర్వహణ జాప్యం కావడంతో పోలింగ్ సైతం ఆలస్యంగా ప్రారంభమైంది. రాయికల్ మండలం మూటపల్లి, మైతాపూర్ బూత్ నంబరు 46, పెగడపల్లిలోని 262 పోలింగ్కేంద్రంలో, సారంగాపూర్తోపాటు కోనాపూర్ గ్రామాల్లో 9 గంటలకు పోలింగ్ మొదలైంది. కోరుట్ల మండలం పైడిమడుగులో 114 పోలింగ్కేంద్రం, కోరుట్లలోని 181 ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. మల్లాపూర్తోపాటు రాఘవపేటలోని 84 పోలింగ్కేంద్రంలో, మల్లాపూర్ మండలం వెంకట్రావ్పేటలోని 59 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు సీజ్ చేశారు. జగిత్యాల మండలం ధరూర్లో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. జిల్లా కేంద్రంలోని 164 పోలింగ్కేంద్రంలో ఈవీఎంలు పనిచేయక 9 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. లింగంపేటలో, మెట్పల్లిలోని 196 కేంద్రంతోపాటు కోరుట్లలోని కల్లూరు 141 కేంద్రాల్లో ఉదయం 9 గంటల తర్వాత పోలింగ్ మొదలైంది. జగిత్యాలలోని కొత్తవాడలో ప్రభుత్వ బాలికల పాఠశాల, జగిత్యాల మండలం కల్లెడ, పొరండ్ల గ్రామాల్లో పోలింగ్ ముగింపు సమయంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ జాప్యమైంది. కేంద్రాలు సందర్శించిన అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని బీట్బజార్ 192 పోలింగ్ కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత సందర్శించారు. గొల్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ సందర్శించారు. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలు స్ట్రాంగ్రూమ్లకు చేరాయి. పటిష్ట బందోబస్తు మధ్య ఈవీఎంలను ఎన్నికల అధికారులు జిల్లా కేంద్రంలోని వీఆర్కే కళాశాలకు తరలించారు. ఓటింగ్ ముగియడంతో నిజామాబాద్ స్థానం నుంచి బరిలో ఉన్న 185 మంది అభ్యర్థుల భవితవ్యం ఇప్పు డు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఈ ఎన్నికపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజా తీర్పు మే 23న వెలువడనుంది. -
ఈవీఎంలలో దాగిన భవితవ్యం
సాక్షి, మహబూబాబాద్: లోక్సభ ఎన్నికలు గురువారం ముగియటంతో అందరి దృష్టి ఫలితాలపై పడింది. ఈవీఎంలలో ఎంపీ అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. మే 23వ తేదీ గురువారం రోజున కౌంటింగ్ జరగనుంది. ఫలితాల పై అభ్యర్థులతో పాటు ప్రజల్లో కూడా ఉత్కంరత నెలకొంది. గెలుపు ఎవరిని వరిస్తుందో అంచనాలకు అందడం లేదు. ఓటింగ్ శాతం అనూహ్యంగా తగ్గటంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. మానుకోట పార్లమెంట్ నియోజకవర్గంలోని పోలింగ్ 1737 కేంద్రాల్లో జరిగింది. సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం, వీవీప్యాట్)లను పోలింగ్ కేంద్రాల నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అలాగే సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాల పైనే చర్చ జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ ఎంపీ అభ్యర్థులు పోలింగ్ సరళిని విశ్లేషించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు గతంలోలాగా కాకుండా వేరువేరుగా రావటంతో, పోలింగ్ శాతం తగ్గవచ్చని రాజకీయ పార్టీలు అంచనా వేశాయి. అంచనాలకు అనుగుణంగా పోలింగ్ శాతం గతంలో కంటే తగ్గింది. దీంతో ఓటింగ్ ప్రభావాన్ని విశ్లేషించుకునేందుకు ఎంపీ అభ్యర్థులు పోలింగ్ బూత్ల వారీగా ఓట్ల లెక్కలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రేపు, ఎల్లుండి ప్రధాన పార్టీల రాజకీయ పార్టీల అభ్యర్థులు పార్టీ ముఖ్యనాయకులు, బూత్ కన్వీనర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. ఈ సమావేశంలో ఓటింగ్ తీరు తెనులతోపాటు పార్టీ విజయావకాశాలను ఎంపీ అభ్యర్థులు విశ్లేషించుకోనున్నారు. -
ఆగుతూ.. సాగుతూ పోలింగ్
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాలకు పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. చెదురు ముదురు టనలు మినహా పోలింగ్ సజావుగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధికారులు సమస్యాత్మకంగా గుర్తించిన జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 4గంటలకే ముగియగా.. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అరగంట నుంచి గంట ఆలస్యం పోలింగ్ ప్రారంభం సమయంలో వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో అక్కడక్కడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) మొరాయించడంతో అరగంట నుంచి గంటన్నర ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. దీంతో చాలాచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. అయితే, నిర్ణీత సమయం లోగా కేంద్రాలకు వచ్చిన వారందరూ ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. కాగా వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో జరిగిన పోలింగ్ వివరాలను గురువారం రాత్రి అధికారులు వెల్లడించారు. వరంగల్ లోక్సభ పరిధిలో 60.41 శాతం, మహబూబాబాద్లో 64.46 శాతంగా నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల పేరిట విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కాగా, గత ఎన్నికలతో పోలిస్తే ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ పోలింగ్ శాతం భారీగా తగ్గడం గమనార్హం. మందకొడిగా ప్రారంభమై.. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో అన్ని చోట్లా ఉదయం ఏడు గంటలకు మందకొడిగా మొదలైన పోలింగ్ 9 గంటల తర్వాత పుంజుకుంది. చాలాచోట్ల ఈవీ ఎంలు మొరాయించడం కారణంగా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ముగిసే సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న ఉన్నవారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. సమస్యాత్మక నియోజకవర్గం భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 4 గంటలే కాగా, మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడా రాత్రి వరకు పోలింగ్ కొ నసాగించారు. సాయంత్రం 5 గంటల వరకు వరంగల్ పార్లమెంట్ పరి«ధిలో 60.41 శాతం, మహబూబాబాద్ పరిధిలో 64.46 శాతంగా పోలింగ్ నమోదైనట్లు రాత్రి 10.30 గంటలకు ఆయా జిల్లాల రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. మొరాయించిన ఈవీఎంలు అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు ఆలస్యం జరిగినా... మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అధికారులు ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఓటర్లకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం కంఠాత్మకూరు, చిల్పూరు మండలం మల్కాపూర్, హసన్పర్తి మండలం మడిపెల్లి, వరంగల్ 27వ డివిజన్ ఏవీవీ కళాశాల పోలింగ్ బూత్ 87, పర్వతగిరి మండలం చింతనెక్కొండలో 238, ఆత్మకూరులో 105 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు చాలాసేపు మొరాయించాయి. మహబూబాబాద్ లోక్సభ పరిధి నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం కొనపురం బూత్ నెంబర్ 195, బొజేరువులో 221 పోలింగ్ కేంద్రాల్లోను ఈవీఎంలు మొరాయించాయి. వీటితో పాటు చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించగా.. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు పరిస్థితులను చక్కదిద్ది పోలింగ్ సజావుగా సాగేలా చూశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆయా జిల్లాల పోలీసు కమీషనర్లు, ఎస్పీలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, తదితర ప్రాంతాల్లోని సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు పహారా కాశాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ప్రాంతాలు, సమస్యాత్మక గ్రామాల్లో గస్తీ బందాలు, స్రైకింగ్ ఫోర్సు, పోలీసుల పహారా పెంచారు. ఓటేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు లోక్సభ ఎన్నికల సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఎస్పీలు గురువారం తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున, కుమారుడు, కూతురు, కోడలుతో కలిసి వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆయన సతీమణి ఉషా దయాకర్ పర్వతగిరిలో ఓటేశారు. ఇక రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఆయన కుమారుడు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్కుమార్ వారి స్వగ్రామం హుజూరాబాద్ మండలం సింగాపురంలో ఓటు వేశారు. హన్మకొండ టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కుటుంబసభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.బొల్లికుంటలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్, కుటుంబ సభ్యులు, నక్కలగుట్ట వాటర్ట్యాంక్ బూత్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కుటుంబసభ్యులు, వడ్డెపల్లి ప్రభుత్వ పాథమిక పాఠశాలలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్భాస్కర్, కుటుంబసభ్యులు, వరంగల్ పెరుకవాడలో తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ కుటుంబీకులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ట్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, జాయింట్ కలెక్టర్ దయానంద్, హన్మకొండలో వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, జులైవాడలోని ఎస్టీ హాస్టల్ పోలింగ్ బూత్లో టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి, కుటుంబ సభ్యులు ఓటు వేశారు. గణనీయంగా తగ్గుదల 2014 సాధారణ ఎన్నికల పోలింగ్తో పోలిస్తే ఈసారి గణనీయంగా తగ్గింది. వరంగల్ లోక్సభ పరి«ధిలో 2014లో 76.56 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 63.08 శాతానికే పరిమితమైంది. అంటే 13.48 శాతం పోలింగ్ తగ్గినట్లు. అదే విధంగా మహబూబాబాద్ లోక్సభకు 2014లో 82.81 శాతం పోలింగ్ జరగగా, ఈసారి 13.70 శాతం తగ్గి 69.11 శాతానికే పరిమితమైంది. కాగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో తొలుత పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ తీరును ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఎన్నికల పరిశీలకులు వీణా ప్రదాన్, అమిత్కుమార్ సింగ్లు పలు కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రశాంత్ జీవన్ పాటిల్, శివలింగయ్య, కలెక్టర్లు హరిత, వినయ్కృష్ణారెడ్డి, వాసం వెంకటేశ్వర్లులు పోలింగ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. -
ఆదిలాబాద్..తగ్గిన పోలింగ్
సాక్షి, ఆదిలాబాద్ : ఓట్ల పండగ ముగిసింది.. తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, ఆసిఫాబాద్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ముగియగా, ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ముథోల్, ఖానాపూర్లలో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. నిర్దేశిత సమయానికి పోలింగ్ కేంద్రాల్లో వరుసలో ఉన్నవారిని సమయం ముగిసిన తర్వాత కూడా ఓటు వేసేందుకు అనుమతించారు. రాత్రి 8.30 గంటల వరకు కూడా పోలింగ్ శాతం వివరాలు అన్ని నియోజకవర్గాల నుంచి రాలేదు. సాయంత్రం 5గంటల వరకు ఉన్న వివరాల ప్రకారం 66.76 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి. దేశంలో ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా తొలి విడతలో మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం మరో 42 రోజులు వేచి చూడాల్సిందే. తగ్గిన పోలింగ్ శాతం.. గత 2014 లోక్సభ ఎన్నికలకు ఈ ఎన్నికలకు పోలింగ్ శాతం తగ్గింది. అదే సమయంలో గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతానికంటే ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం తక్కువగా నమోదైంది. 2014 లోక్సభ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం ఇంకా 10 శాతం తక్కువ నమోదైంది. ఇక శాసనసభ ఎన్నికలకంటే 13 శాతం తక్కువగా నమోదైంది. పోలింగ్ సరళి.. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎండ తీవ్రత ఉండడంతో పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయమే ఓటర్లు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సమయంలోనే కేంద్రాల్లో ఓటర్లు వరుస కట్టిన దృశ్యాలు కనిపించాయి. అయితే ఉదయం ఆశించిన స్థాయిలో ఓటర్లు తమ ఓటును వేయలేకపోయారు. 11గంటల వరకు 30 శాతం లోపల పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఎండకు ఓటర్లు బయటకు రాకపోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ కనబడలేదు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల్లోపు పలువురు ఓటర్లు కేంద్రాలకు చేరుకోవడంతో కొద్దిగా పోలింగ్ శాతం పెరిగింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరైతే వరుసలో ఉన్నారో వారిని ఓటేసేందుకు అనుమతించి పోలింగ్ కేంద్రాల గేట్లు మూయించారు. ఓటు వేసిన ప్రముఖులు.. లోక్సభ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్ బజార్హత్నూర్ మండలం జాతర్లలో ఓటు వేశారు. బోథ్ మండలం ఘన్పూర్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్ ఉట్నూర్లో సాయంత్రం 4.50 గంటలకు ఓటు వేశారు. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆయన సహాయకుడితో కలిసివచ్చి ఓటు వేశారు. నిర్మల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ముథోల్ నియోజకవర్గం దేగాంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి, సిర్పూర్ కాగజ్నగర్లో కోనేరు కోనప్ప, ఖానాపూర్లో రేఖానాయక్, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో తిర్యాణి మండలం లక్మీపూర్లో ఎమ్మెల్యే ఆత్రం సక్కులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అధికారుల పరంగా చూస్తే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దివ్యదేవరాజన్ దంపతులు, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్, జేసీ సంధ్యారాణి ఆదిలాబాద్లో ఓటు వేశారు. నిర్మల్లో కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ సి.శశిధర్రాజు, కుమురంభీం కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, ఎస్పీ మల్లారెడ్డి ఓటు వేశారు. ఆదిలాబాద్కు ఈవీఎంలు.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను పోలింగ్ అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి తరలించి స్ట్రాంగ్రూమ్లలో భద్రపరుస్తున్నారు. రాత్రి వరకు కొన్ని నియోజకవర్గాల నుంచి ఈవీఎంలు చేరుకున్నాయి. అన్ని నియోజకవర్గాల నుంచి అర్ధరాత్రి వరకు ఈవీఎంలు చేరుకుంటాయని అధికారులు పేర్కొన్నారు. టీటీడీసీ కేంద్రంలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆసిఫాబాద్, కాగజ్నగర్, పాలిటెక్నిక్ కళాశాలలో నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరుస్తున్నారు. మే 23న ఫలితాలు వెలవడనున్నాయి. ఎక్కువ రోజుల వ్యవధి ఉండడంతో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రత వ్యవస్థను కల్పించారు. డీఎస్పీ స్థాయి అధికారితో భద్రతను పర్యవేక్షించనున్నారు. సీఆర్పీఎఫ్ పోలీసు బలగాల అధీనంలో ఈ స్ట్రాంగ్రూమ్లు 24 గంటలు ఉండనున్నాయి. ఈ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా అధికారులు వెబ్కాస్టింగ్ ద్వారా అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఓటరు ఎటువైపో.. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆ సరళిని బట్టి పార్టీలు అంచనాలు వేయడం మొదలుపెట్టారు. సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా జిల్లాల్లో పార్టీల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు సమావేశమై చర్చించారు. ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై ఒక అంచనాకు వచ్చారు. అయితే ఫలితాలు ఎలా ఉంటాయోనని వారిలో ఉత్కంఠ ఉంది. ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని మొదటి నుంచి అంచనా వేస్తూ వచ్చారు. ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైన ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు గోడం నగేశ్, సోయం బాపూరావులు గిరిజనుల్లోని ఒక తెగకు చెందినవారు కావడంతో ఈ ఓట్లు చీలిపోయి మరో తెగకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్ లాభం చేకూర్చవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ నెలకొందన్న చర్చ సాగుతోంది. మరో పార్టీకి నామమాత్రంగా ఓట్లు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మే 23 వరకు ఫలితాల కోసం నిరీక్షించాల్సిందే. మహిళలే అధికం.. పోలింగ్ సరళిని పరిశీలిస్తే పురుషుల కంటే మహిళలే అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషన్ వందశాతం పోలింగ్ లక్ష్యం పెట్టుకున్నప్పటికీ నెరవేరలేదు. ఓటర్లను ఆకట్టుకునేందుకు మోడల్, మహిళ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళ పోలింగ్ కేంద్రాలతో పాటు జనరల్ పోలింగ్ కేంద్రాల్లోనూ మహిళలే అధికంగా ఓటు వేస్తూ కనిపించారు. -
ఎండదెబ్బతో పోల్ డౌన్
సాక్షి, భూపాలపల్లి: గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ములుగు, భూపాలిపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రస్తుత ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది. పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశించిన అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రాకపోవడం, పోలింగ్ స్లిప్పులను పంచకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండడం వంటి అంశాలు గురువారం జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్పై ప్రభావం పడినట్లు తెలిసింది. మహబూబాబాద్ ఎంపీ పరి«ధిలోని ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో 66.08 శాతం, వరంగల్ ఎంపీ పరిధిలోని భూపాలపల్లి అసెంబ్లీ నియోజకర్గంలో 52 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. పెద్దపల్లి ఎంపీ పరిధిలోని మంథని అసెంబ్లీ సెగ్మెంట్లో 58.25 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండూ ఒకే సారి రాకపోవడమే.. రాష్ట్రంలో 2014లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి నిర్వహించారు. ఈ సారి సీఎం కేసీర్ఆర్ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడంతో ప్రస్తుత లోక్సభ ఎన్నికలపై ప్రజలు ఆసక్తి చూపించలేదనే విషయం స్పష్టమవుతోంది. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 80 శాతానికి మించి పోలింగ్ నమోదైంది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. వరుసగా ఎన్నికలు రావడం కూడా లోక్సభ ఎన్నికలపై తీవ్రప్రభావం పడింది. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నవారితో పాటు విద్యార్థులు సొంత ఊళ్లకు రావడానికి విముఖత చూపినట్లు సమాచారం. భానుడి భగభగ.. ఓటింగ్ శాతంపై ఎండలు తీవ్ర ప్రభావం చూపాయి. రెండు జిల్లాల్లో ఉదయం ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మందకొడిగానే సాగింది. ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో జనాలు మధ్యాహ్నం పూట బయటకు రావడానికి జంకారు. దీంతో ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లతో ఓటింగ్ శాతం తగ్గింది. ఎండ తీవ్రత కారణంగా ఉదయం 7 గంటల నుంచి నుంచి 11 గంటల వరకే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు చాలా తక్కువగా పోలింగ్ నమోదైంది. 3 గంటల తర్వాత పోలింగ్ ముగిసే వరకు మళ్లీ పోలింగ్ ఊపందుకుంది. అంతంత మాత్రంగా ప్రచారం.. పల్లెల్లో ఎన్నికల వాతావరణంకనిపించలేదు. గత అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. ఈసారి మాత్రం గ్రామాల్లో ఆ జోషే లేదు. చాలా వరకు అభ్యర్థుల ప్రచారాలు, రోడ్ షోలు పట్టణాలకే పరిమితమయ్యాయి. దీంతో గ్రామాల్లోని రాజకీయ పార్టీల కార్యకర్తలు కానీ, నేతలు కానీ కనీసం ప్రచారం కూడా చేయలేదు. దీంతో పల్లెల్లో ఎన్నికల కళ తప్పింది. గత ఎన్నికల్లో ఇంటింటికి వచ్చి ఓటేశారా లేదా అని ఆరా తీసిన నేతలు ప్రస్తుతం మొహం చాటేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పార్టీల సందడే కనిపించలేదు. గ్రామాల్లో కనీసం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు కూడా తెలియని పరిస్థితి ఉంది. నియోజకవర్గాల పరిధి పెద్దది కావడంతో ఈసారి గ్రామాల్లో కార్యకర్తలను, నేతలను అభ్యర్థులు పట్టించుకోలేదనే వాదన నేతల్లో ఉంది. గడిచిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. ఈసారి ఆ పరిస్థితి కనపడలేదు. ఇన్ని కారణాలతో కిందిస్థాయి కార్యకర్తలు, నేతలు లోక్సభ ఎన్నికలపై ఆసక్తి చూపించలేదు. -
ఓట్ల పండుగ.. జనం నిండుగ
సాక్షి,మెదక్: మెదక్ నియోజకవర్గంలో గురువారం జరిగిన లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల సాంకేతిక లోపంతో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 273 పోలింగ్ కేంద్రాల్లో 72.84 శాతం పోలింగ్ జరిగింది. ఇందులో చిన్నశంకరంపేట మండలంలో 75 శాతం పోలింగ్ నమోదై నియోజకవర్గంలోనే ముందంజలో ఉంది. ఇక చిన్నశంకరంపేట మండలంలో 75 శాతం పోలింగ్ కాగా రామాయంపేట మండలంలో 73.76 శాతం, నిజాంపేటలో 69.49 శాతం, పాపన్నపేట మండలంలో 71.46 శాతం, రేగోడ్ మండలంలో 66 శాతం, పెద్దశంకరంపేట మండలంలో 69 శాతం, టేక్మాల్ మండలంలో 68.33 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలో గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలోని 27 వార్డుల్లో మొత్తం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలనుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటింగ్లో యువకులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సందర్శించి ఓటింగ్ సరళిన అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను ఆకట్టుకునేందుకు బెలూన్ల తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. నవాబుపేటలో మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, ఆయన సతీమణి గాయత్రి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే వైస్చైర్మన్ రాగి అశోక్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న యువకులు సెల్పీలు దిగుతూ సందడి చేశారు. శభాష్ పోలీస్ పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుగా నిర్వహించిన పలువురు కానిస్టేబుళ్లు తమ సేవా ధృక్పదాన్ని చూపి పలువురి చేత శభాష్ పోలీస్ అనిపించుకున్నారు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే కేంద్రాలకు వచ్చిన వృద్ధులకు, వికలాంగులను సేవలందించారు. నడవలేని వికలాంగులు, వృద్ధులను ఎత్తుకొని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. మహిళల కోసం వెయింటింగ్ హల్.. చిన్నశంకరంపేట(మెదక్): ఓటు వేసేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాలి. అయితే ఓ గ్రామ సేవకుడి ఐడియా మహిళలకు క్యూౖలో నిలబడె శ్రమను తప్పించింది. మండలంలోని మడూర్లోని ఓ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారి కోసం వెయింట్ హాల్ ఏర్పాటుచేశారు. దీంతో ఎండలో వచ్చినవారు వెయింట్ హాల్ కూర్చొని సేదతీరారు. గ్రామ సేవకుడు యాదగిరిని పలువురు అభినందించారు. -
ఓటు హక్కును వినియోగించుకోని పాలమూరు కూలీలు
సాక్షి, పెద్దవూర: తెలుగు రాష్ట్రాలలో మొదటి విడతలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు పాలమూరు కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన మహబూబ్నగర్, నాగర్కర్నూలు జిల్లాలకు చెందిన వందలాది మంది జడ్చర్ల–కోదాడ రోడ్డు విస్తరణ పనులలో కూలీ పనులు చేస్తున్నారు. వీరిని సంబందిత కాంట్రాక్టర్ నెలవారీ వేతనంతో కుటుంబాలకు, కుటుంబాలే జీతం చేస్తున్నారు. వీరి స్వగ్రామాలలో గురువారం లోక్సభ ఎన్నికలు జరుగుతున్నా ఓటు హక్కును వినియోగించుకోలేని దీన పరిస్థితిలో ఉన్నారు. తాము కేవలం సర్పంచ్ ఎన్నికల సమయంలోనే మా స్వగ్రామమైన దేవరకద్రకు వెళ్లి ఓట్లు వేసినట్లు, శాసనసభ ఎన్నికల్లోనూ ఇక్కడే ఉండి కూలీ పనులు చేసినట్లు తెలిపారు. ఓటు వేయటానికి ఊరికి వెళ్తే ఒక్కొక్కరికి రూ.300 ఖర్చు అవుతుందని, దీనికి తోడు పనికి రాకుంటే నాకాలు వేస్తారని దీనంగా పేర్కొన్నారు. -
నల్గొండ: ఎన్నికలు ప్రశాంతం
సాక్షి, యాదాద్రి : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే గత ఎంపీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ బాగా తగ్గింది. డిసెంబర్లో జరగిన శాసనసభ ఎన్నికల్లోనూ 90శాతానికి మించి పోలింగ్ నమోదు కాగా లోక్సభ ఎన్నికల్లో 75.11శాతానికి పడిపోయింది. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఆయా పార్టీల నేతల్లో కనిపించిన జోష్, హడావుడి ఈ ఎన్నికల్లో కనిపించలేదు. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. మరో వైపు ఎండ తీవ్రత అధికంగా ఉండడం కూడా ఓటింగ్ శాతంపై తీవ్ర ప్రభావం చూపింది. అంతేకాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లకు రవాణా ఇతరత్రా ఖర్చులు ఇచ్చి పోటాపోటీగా తీసుకురావడంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఆ రెండు ఎన్నికల్లో ఓటర్ల ఆలనాపాలనా చూడటంతోపాటు పెద్ద ఎత్తున నజరానాలు, మద్యం, డబ్బు పంపిణీ జరిగింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో ఓటింగ్పై తీవ్ర ప్రభావం చూపింది. చాలా పోలింగ్ కేంద్రాలు ఉదయం నుంచే బోసిపోయాయి. అత్యధికంగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో.. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్(ఎస్సీ), తుంగతుర్తి(ఎస్సీ), ఆలేరు, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 81.70 శాతం ఓట్లు పోలయ్యాయి. ఉదయం నుంచే పోలింగ్ మందకొడిగా సాగింది. 7నుంచి 9గంటల వరకు 13శాతం పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అతి తక్కువగా 8.20శాతం, జనగామలో 8.37శాతం తుంగతుర్తిలో 18శాతం, మునుగోడులో 16.2శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 9నుంచి 11గంటల వరకు 26.95శాతం పోలింగ్ నమోదైంది. జనగామలో 16.50శాతం, ఇబ్రహీంపట్నంలో 22శాతం, తుంగతుర్తిలో 37.85శాతం నమోదైంది. 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.99శాతం పోలింగ్ నమోదు కాగా, అనూహ్యంగా జనగామ నియోజకవర్గంలో పుంజుకుని 48.65శాతం నమోదైంది. మునుగోడులో 44.15శాతం, నకిరేకల్లో 33.74శాతం ఓట్లు పోలయ్యాయి. ఒంటి గంట నుంచి 3 గంటల వరకు 57.41శాతం పోలింగ్ జరిగింది. తుంగతుర్తిలో 66.70శాతం, ఆలేరులో 64.50శాతం, ఇబ్రహీంపట్నంలో 45.60శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3నుంచి 5గంటల వరకు 68.25శాతం పోలింగ్ జరిగింది. భువనగిరిలో అత్యధికంగా 81.70శాతం, ఆలేరులో 75.25శాతం, మునుగోడులో 72.50శాతం, తుంగతుర్తిలో 69.13శాతం, ఇబ్రహీంపట్నంలో 65 శాతం, నకిరేకల్లో 64.75శాతం, జనగామలో 62.23శాతం ఓట్లు నమోదయ్యాయి. 5 గంటల అనంతరం తెలిసిన వివరాల ప్రకారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 81.70 శాతం, ఆలేరులో 79.96శాతం, ఇబ్రహీంపట్నం 68.57శాతం, మునుగోడు 78.45శాతం, నకిరేకల్ 75.95శాతం, తుంగతుర్తి 72.38 శాతం, జనగామ 68.73శాతం పోలింగ్ ఓటింగ్ నమోదైంది. అందని పోల్ చిట్టీలు ఎన్నికల కమిషన్ పోల్ చిట్టీలను ఇంటింటికీ పంపిణీ చేయాలని ఆదేశించింది. కానీ, ఓటర్లందరికీ పోల్ చిట్టీలు అందలేదు. దీంతో చాలా మంది పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయారు. అలాగే కొందరికి చిట్టీలు అందినా గుర్తింపు కార్డు కావాలని ఎన్నికల సిబ్బంది చెప్పడంతో వెనుదిరిపోయారు. పోలింగ్ కేంద్రాల వద్ద 11 రకాల గుర్తింపు కార్డుల జాబితాను ప్రదర్శించాల్సి ఉన్నా చాలా చోట్ల అది జరగలేదు. ఆలేరులో పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వచ్చిన కేంద్ర ఎన్నికల పరిశీలకుడి దృష్టికి ఓటర్లు ఈవిషయాన్ని తీసుకువచ్చారు. ఆయన వెంటనే గుర్తింపు కార్డులకు సంబంధించిన బ్యానర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించి వెళ్లారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో ఓట్ల శాతం గణనీయంగా తగ్గింది. 2014లోక్సభ, 2018శాసనసభ ఎన్నికలతో పోల్చితే లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతం పడిపోయింది. 2014లోక్సభ ఎన్నికల్లో 79.68శాతం, ప్రస్తుతం 75.11శాతం నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే 4.57శాతం ఓటింగ్ తగ్గింది. డిసెంబర్ 2018లో శాసనసభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ పరిధిలో 88.69శాతం ఓట్లు పోలవగా ప్రస్తుతం 75.11శాతం నమోదైంది. మూడు నెలల్లోనే 13.58శాతం ఓటింగ్ తగ్గింది. తీవ్రమైన ఎండలు ఎండ తీవ్రత కూడా పోలింగ్ సరళిపై తీవ్ర ప్రభావం చూపింది. ఉదయం 10.30గంటల నుంచే భానుడు భగ్గుమనడంతో జనం పోలింగ్ కేంద్రాలకు రావడానికి అనాసక్తి కనబరిచారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన వసతులు కూడా లేకపోవడం ఎండలో నిలబడి ఓట్లు వేయడానికి ఆసక్తి చూపలేదు. అరకొరగా వేసిన టెంట్లు, ఓటర్లకు ఇబ్బందులు కలిగించాయి. -
ఎన్జీ కొత్తపల్లిలో ఉద్రిక్తత
సాక్షి, శాలిగౌరారం : మండలంలో గురువారం నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికలు మండలంలోని ఎన్జీ కొత్తపల్లి, ఆకారం, చిత్తలూరు గ్రామాల్లో ఘర్షణలు, ఆందోళనలకు దారితీశాయి. ఎన్నికల సందర్భంగా ఎన్జీ కొత్తపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న పోలింగ్ కేంద్రం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మరో వ్యక్తి పట్ల దుర్భాషలాడటంతో గొడవ మొదలయ్యింది. ఓటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి కొన్ని నిముషాల ముందే గొడవ జరుగడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. దీంతో సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ గోపాలరావు సిబ్బందితో హుటాహుటిన ఎన్జీ కొత్తపల్లి గ్రామానికి చేరుకొని ఇరువర్గాలకు చెందిన వారిని చెదరగొట్టాడు. ఈ క్రమంలో స్వల్ప లాఠీచార్జ్ జరగడంతో ప్రజలు తోపులాటకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎంపీటీసీ గన్నపురెడ్డి కళమ్మలక్ష్మారెడ్డితో పాటు మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాఠశాలకు వెళ్లే రోడ్డుపై ధర్నాకు దిగారు. అదే సమయంలో ఈవీఎంలకు రక్షణగా వచ్చిన పోలీసు వాహనాన్ని అడ్డుకొని చుట్టుముట్టారు. చేసేదేమిలేక పోలీసులు కిందకు దిగి పోలింగ్ కేంద్రానికి నడిచివెళ్లారు. ఇదిలా ఉండగా పోలీసుల లాఠీచార్జితో స్వల్ప గాయానికి గురైన సంకటి శ్రీను అనేవ్యక్తి అవమానంతో పురుగులమందు తాగాడు. అదే సమయంలో వచ్చిన పోలీసులకు చెందిన మరో వాహనంలో బాధితుడిని వెంటనే నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే రాత్రి కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలింగ్ కేంద్రంవద్ద ఉన్న పోలీసులను అడ్డుకునేందుకు వెళ్లారు. పరిస్థితిని గమనించిన ఎస్ఐ గోపాలరావు గుట్టుచప్పుడుకాకుండా డొంకమార్గంలో ఎన్నికల సిబ్బందిని, ఈవీఎంలను తరలించారు. దీంతో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆందోళనకారులు అక్కడ పోలీసులు, ఎన్నికల సిబ్బంది లేకపోవడంతో తీవ్రంగా ఆగ్రహిస్తూ ఈవీఎంలను, బందోబస్తు పోలీసులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పరిస్థితిని తెలుసుకున్న సీఐ క్యాస్ట్రోరెడ్డి ఎన్జీ కొత్తపల్లి గ్రామానికి చేరుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాధిత వ్యక్తులతో మాట్లాడి సమస్య సద్దుమణిగేలా చేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకుంటామన్న సీఐ హామీతో ఆందోళనను విరమించారు. అప్పటికే రాత్రి తొమ్మిది గంటలు కావడంతో గ్రామంలో ఏమి జరుగుతుందోనని ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ఇదిలా ఉండగా ఆకారం గ్రామంలో రెండు ప్రధాన పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్ల మధ్య గొడవ ప్రారంభమై ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరువురు బాహాబాహికి దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకిదిగి సమస్యను సద్దుమణిగించారు. అదేవిధంగా చిత్తలూరు గ్రామంలో కూడా రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు గొడవలకు పాల్పడటంతో పోలీసులు ఆయా వర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ పాదూరి శంకర్రెడ్డికి లాఠీ దెబ్బలు తగలడంతో నాయకులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. గొడవలు పడుతున్న కార్యకర్తలను చెదరగొట్టే క్రమంలో లాఠీలు తగిలాయని, పోలీసులు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. -
ఎవరి ఆశలకు గండి..?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలో తక్కువగా నమోదైన పోలింగ్ శాతం ఎవరి విజయావకాశాలకు గండికొడుతుందోనన్న బెంగ రాజకీయ పార్టీల్లో మొదలైంది. గత లోక్సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. తాజా లోక్సభ ఎన్నికల్లో 53.84 శాతం పోలింగ్కాగా.. 2014లో జరిగిన ఎన్నికల్లో 60.51 శాతం మంది ఓటేశారు. అంటే పోలింగ్ 6.67 శాతం తగ్గింది. ఈ లోక్సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. మూడు నియోజకవర్గాల్లో కనీసం 50 శాతం కూడా పోలింగ్ నమోదు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో చాలా మంది ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉన్నారు. కొందరు సెటిటర్లు వారి స్వస్థలాలకు వెళ్లడంతో పాటు ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలకు వరుస సెలవులు ఉండటంతో ఉద్యోగులు కుటుంబాలతో సహా పల్లెబాట పట్టారు. అలాగే ఎండల తీవ్రత కూడా పోలింగ్పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. బయటకు వచ్చేందుకు సాహసించలేదని తెలుస్తోంది. ఈ కారణాల వల్లే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తగ్గిందన్నది అందరి విశ్లేషణ. మరోపక్క వరుస ఎన్ని కలు రావడంతో చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లి ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇటీవల కాలంలోనే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాతి కొద్ది కాలానికే లోక్సభ ఎన్నికలు రావడంతో.. సొంత ఊళ్లకు వెళ్లేందుకు మొగ్గుచూపలేదని తెలుస్తోంది.ఎండల తీవ్రత, వ్యయ ప్రయాసాలను చూసి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. పైగా స్థానిక, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే.. అభ్యర్థుల ప్రచారం పెద్దగా లేదు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. వీటన్నింటి నేపథ్యంలోనే పోలింగ్ శాతం తగ్గిందని తెలుస్తోంది. మరోపక్క పూర్తిగా గ్రామీణ ప్రాంతాలైన చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఇక్కడ గణనీయంగా పోలింగ్ శాతం నమోదైంది. -
కోదాడలో దొంగ ఓటు..!
సాక్షి, కోదాడఅర్బన్ : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన పోలింగ్లో పట్టణంలో బా లుర ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ బూత్లో దొంగ ఓటు పోలైంది. పట్టణంలోని 1వ వా ర్డుకు చెందిన షేక్ సైదులు అనంతగిరి రోడ్డులోని శ్రీరామ్నగర్లో నివాసం ఉంటున్నాడు. తనకు చెందిన ఓటు బాలుర ఉన్నతపాఠశాలలోని 170/ 90 పోలింగ్ బూత్లో 436 సిరియల్ నంబర్లో ఉంది. అతను వేరే ఊరుకు కూలి నిమిత్తం వెళ్లి ఓటు వేసేందుకు ఉదయం 9గంటలకు కోదాడకు చేరుకున్నాడు. తన తమ్మడు మైకు నాగులు వద్ద ఉన్న పోల్ చిట్టీని తీసుకుని పోలింగ్ బూత్ ఓటు వేసేందుకు వెళ్లాడు. తాను క్యూలైన్లో వెళ్లి పోలింగ్ అధికారికి తన ఓటరు చిట్టి ఇవ్వగా సీరియల్ నంబర్ను పరిశీలించిన పోలింగ్ సిబ్బంది అప్పటికే ఈ ఓటు వేశారని తెలపడంతో ఆవాక్కయ్యా డు. ఈ నేపథ్యంలో తన వెంట ఉన్న తన తమ్ముడు మైకు నాగులు తన అన్న ఓటు వేసేందుకు ఇప్పుడే వస్తే ఇప్పటికే మరెవరో ఓటు వేయడం ఏమిటని పోలింగ్ సిబ్బందిని నిలదీశాడు. వారు ఇంతకు ముందు వచ్చిన వ్యక్తిన ఏజెంట్లు షేక్ సైదులేనని నిర్ధారించడంతో తాము ఆయనతో ఓటు వేయించడం జరిగిందని వారు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓటరు షేక్ సైదులు తన ఓటు వేరే వారు వేస్తే ఎలా అని, తనకు చాలెంజ్ ఓటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడంతో పోలింగ్ అధికారులు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరాడు. పోలింగ్ అథికారులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమస్యను వివరించి ఆయన అనుమతితో సైదులకు చాలెంజ్ ఓటు ఇవ్వడంతో అతను తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. చాలెంజింగ్ ఓటు తుంగతుర్తి : అధికారుల తప్పిదంతో డిగ్రీ చదువుతున్న విద్యార్థి ఓటు వేయకుండా వినియోగించుకున్నట్లు ఓటరు లిస్ట్లో ఉంది. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన కలెంచర్ల సతీష్ గురువారం ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ తన ఓటరు స్లిప్ను అధికారులకు చూపగా అప్పటికే ఆ విద్యార్థి ఓటు ఈడీసీలో (పోస్టల్ బ్యాలెట్) ద్వారా ఉపయోగించుకున్నట్లు ఓటరు లిస్టు ఉందని చెప్పారు. దీంతో ఓటే వేసే అవకాశం లేకపోవడంతో విద్యార్థి ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశాడు. దీంతో తహసీల్దార్ పాండు నాయక్ స్పందించి పోలిం గ్ కేంద్రానికి వెళ్లి ఆ విద్యార్థితో రాతపూర్వకంగా లేఖ రాయించుకుని ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. -
మహబూబ్నగర్ లో 65.30శాతం పోలింగ్
సాక్షి , మహబూబ్నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా టెక్నికల్ సిబ్బంది వెంటనే స్పందించి వాటిని సరిచేస్తూ అవసరమైన చోట ఈవీఎంలు మారుస్తూ ఆటంకం లేకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసుశాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ అక్కడక్కడ కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నా పోలింగ్ కు ఇబ్బంది లేకుండా వ్యవహరించారు. 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో.. మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో పోలీసులు, ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గత పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా తగ్గింది. మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో 7.95 శాతం, నాగర్కర్నూల్ పరిధిలో 12.49 శాతం పోలింగ్ తగ్గింది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు రెండు లోక్సభ స్థానాల్లోనూ మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయినా ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి కనబరచలేదు. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఉక్కపోత తట్టుకోలేక చాలామంది ఓటర్లు ఓటింగ్కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనేక చోట్ల సాయంత్రం 4 గంటల తర్వాత పోలింగ్ పుంజుకుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల సిబ్బందితో మాట్లాడి సమస్యలను ఎప్పటికప్పుడు అదిగమించారు. మహబూబ్నగర్లో 1,871, నాగర్కర్నూల్లో 1,936 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ల ద్వారా ఎన్నికల సరళిని అధికారులు పరిశీలించారు. మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7,53,935 మంది మహిళా ఓటర్లు ఉండగా 4,89, 453 మంది ఓటేశారు. అలాగే 7,51,216 మంది పురుషుల్లో 4,93,435 మంది ఓటేశారు. బహిష్కరణల పర్వం ఒక్క జడ్చర్ల మండలంలోనే ప్రజలు మూడు చోట్ల ఎన్నికలు బహిష్కరించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులు తమకు సరైన పరిహారం ఇవ్వలేదని, ఇచ్చే పరిహారం రూ.15 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎన్నికలను బహిష్కరించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయించారు. మహబూబ్నగర్ ఆర్డీఓ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వటంతో 10 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అదే మండలంలోని బూరెడ్డిపల్లి గ్రామం బాదేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయటాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు పోలింగ్ కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ సునితలు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చివరకు ఎస్పీ రెమా రాజేశ్వరి అక్కడికి చేరుకుని పోలింగ్ కేంద్రానికి అడ్డుగా కూర్చోవటం చట్టరిత్యా నేరమని, సమస్యలు ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని మహిళలకు సముదాయించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించటంతో ధర్నా విరమించారు. దీంతో బూరెడ్డిపల్లిలో గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని, తమ సమస్యలను ఎవరు పట్టించుకోవటం లేదంటూ జడ్చర్ల మండల కేంద్రం బాదేపల్లి గంజ్ పోలింగ్ కేంద్రంలో బుడగజంగం కులస్తులు ఎన్నికను బహిష్కరించి పోలింగ్ కేంద్రం ముందు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుని వారితో మాట్లాడారు. దీంతో అక్కడ గంటసేపు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటి స్ధానంలో ఇతర ఈవీఎంలు అమర్చారు. దీంతో పలు చోట్లా పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. -
వలస ఓటర్లేరి?
సాక్షి,అడ్డాకుల: ఊర్లలో వరుసగా ఎన్నికలు...నాలుగు నెలల వ్యవధిలో మూడు ఎన్నికలు. నాలుగు నెలలుగా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఊర్లలో ఉండే ఓటర్లు ముందు జరిగిన రెండు ఎన్నికల్లో అంతా ఓట్లేశారు. పొట్టకూటి కోసం వలస వెళ్లిన ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఓటర్లు రెండు ఎన్నికల్లో ఓట్లు వేయడానికి కొంత ఉత్సాహం కనబర్చడంతో జిల్లాలో దేవరకద్ర నియోజకవర్గంలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది. కానీ గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఓట్లు వేయడానికి ఓటర్లు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. వరుస ఎన్నికలకు తోడు వేసవికాలం ఎండలు తోడు కావడం లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపింది. వలస ఓటర్లే కాకుండా గ్రామాల్లో ఉన్న ఓటర్లు కూడా ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాలను వెళ్లకపోవడంతో ఈసారి పోలింగ్ శాతం తగ్గిపోయింది. పోలింగ్ శాతం తగ్గడంతో ఏ పార్టీకి లాభం కలుగుతుంది, ఏ పార్టీకి నష్టం కలుగుతుందన్న దానిపై నేతలు లెక్కలేస్తున్నారు. తగ్గిన పోలింగ్ శాతం.. 2018 డిసెంబర్ 7న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 84.6శాతం పోలింగ్ నమోదైంది. అదే 2014 శాసనసభ ఎన్నికల్లో 71.67శాతం జరిగింది. ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 65.95శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 18శాతం తక్కువ పోలింగ్ జరిగింది. దేవరకద్ర మండలంలో 65.98శాతం, అడ్డాకుల 59.67 శాతం, కొత్తకోట 64.02శాతం, మూసాపేట 63. 23శాతం, మదనాపురంలో 67.04శాతం, భూ త్పూర్ 69.5శాతం, చిన్నచింతకుంట మండలం లో 69.14శాతం పోలింగ్ నమోదైంది. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా అడ్డాకుల మండలంలో అత్యల్పంగా 59.67శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. నియోజకవర్గ వ్యాప్తంగా 71,572 మంది పురుషులు, 71,728 మంది మహిళలు కలిపి మొత్తం 1,43,300 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వలస ఓటర్లు రాకపోవడంతోనేనా..! నియోజకవర్గంలోని గ్రామాలకు చెందిన కూలీలు ఎక్కువ మంది హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వారంతా ఎన్నికలప్పుడు ఊర్లకు వచ్చి ఓట్లు వేసి వెళ్తారు. మొన్న జరిగిన శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో నేతలు వలస ఓటర్లను ఊర్లకు రప్పించి ఓట్లు వేయించుకున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో మాత్రం వలస ఓటర్లపై నేతలు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పోలింగ్పై ప్రభావం పడింది. ఎండల తీవ్రత మూలంగా ఇతర గ్రామాలకు వెళ్లి ఓట్లు వేయాల్సిన చోట ఊర్లలో ఉండి కూడా చాలా మంది ఓట్లు వేయడానికి వెళ్లలేదని తెలుస్తోంది. -
దొంగ ఓట్లు వేయించారు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం నగరంలోని సిద్ధారెడ్డి కళాశాల పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు దొంగ ఓట్లు వేయించారని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి ఆరోపించారు. గురువారం పోలింగ్ జరుగుతున్న తరుణంలో కొద్ది మంది దొంగ ఓట్లు వేస్తున్నారనే సమాచారం అందటంతో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించానని తెలిపారు. అనంతరం ఆమె పోలింగ్ సరళిని తెలుసుకొని అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో పసి పిల్లలతో వచ్చిన వాళ్లను, వృద్ధులను పోలింగ్ కేంద్రంలోకి పంపించాలన్నారు. ఈ క్రమంలోనే సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించగా.. దొంగ ఓట్లు వేస్తున్నారని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. -
ఓటెత్తని గ్రేటర్ సీన్ రిపీట్
సాక్షి, సిటీబ్యూరో: ప్చ్ మళ్లీ అంతే... సీన్ రిపీట్ అయింది.గ్రేటర్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. గతఎన్నికలతో పోలిస్తే మరింత పడిపోయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల.. నాలుగు నియోజకవర్గాల్లోనూ గురువారం జరిగిన లోక్సభఎన్నికల్లో గతం కంటే తక్కువ స్థాయిలో పోలింగ్నమోదైంది. హైదరాబాద్లో 39.49 శాతం,సికింద్రాబాద్లో44.99 శాతం, మల్కాజిగిరిలో 49.21 శాతం, చేవెళ్లలో 54.83 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో హైదరాబాద్ లోక్సభనియోజకవర్గం ఉండడం గమనార్హం. గ్రేటర్లో గతఎన్నికల్లోనూ తక్కువ పోలింగ్ నమోదు కావడంతో ఈసారి అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఓటింగ్పై విస్తృతంగా ప్రచారం చేశారు. అవగాహన సదస్సులు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలుకల్పించారు. అయినా నగరవాసుల్లో మార్పు రాలేదు. సిటీజనులు పోలింగ్పై ఆసక్తి చూపలేదు. రాష్ట్రంలోనే హైదరాబాద్ నియోజకవర్గంలో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. గురువారం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా చెప్పుకోదగ్గ రద్దీ కనిపించలేదు. ఉదయం 11గంటల లోపు ఆయా పోలింగ్ బూత్లలో సందడి కనిపించినప్పటికీ ఆ తర్వాత కనిపించలేదు. తిరిగి పోలింగ్ ముగిసే గంటన్నర ముందు మళ్లీ సందడి నెలకొంది. ♦ హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఉదయం 9గంటల వరకు 6.34 శాతం, 11గంటల వరకు 12.12 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 20.59 శాతం, 3గంటల వరకు 27.79 శాతం నమోదైంది. సాయ ంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసే నాటికి 39.49 శాతానికి పరిమితమైంది. ♦ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉదయం 9గంటల వరకు 6.50 శాతం, 11గంటల వరకు 12.12 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 23.85 శాతం, 3గంటల వరకు 30.20 శాతం నమోదైంది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ ముగిసే నాటికి 44.99 శాతానికి పరిమితమైంది. ♦ మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 6.71 శాతం, 11 గంటల వరకు 15.77 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 27.07 శాతం, 3గంటల వరకు 33.39 శాతం, సాయంత్రం 5 గంటల వరకు 42.75 శాతం నమోదైంది. పోలింగ్ ముగిసే నాటికి 49.21 శాతానికి పరిమితమైంది. ♦ చేవేళ్ల లోక్సభ నియోజకవర్గంలో ఉదయం 9గంటల వరకు 9.08 శాతం, 11గంటల వరకు 21.02 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 29.69 శాతం, 3గంటల వరకు 45.06 శాతం నమోదైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి 54.83 శాతానికి పరిమితమైంది. హైదరాబాద్ జిల్లాలో ఇలా... హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలుండే హైదరాబాద్ జిల్లాలో గతంతో పోలిస్తే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. ఇటీవల జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 48.89 శాతం నమోదు కాగా... ఈసారి మరింత దిగజారి 42.24 శాతానికి పరిమితమైంది. అంటే అప్పటితో పోలిస్తే 6.65శాతం పోలింగ్ తగ్గింది. గత రెండు దశాబ్దాల కాలంలో ఇంత తక్కువ పోలింగ్ నమోదు కావడం ఇదే ప్రథమమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించినా, అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసినా, మొబైల్ వాహనాల్లో ప్రచారం చేసినా, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించినా పోలింగ్ శాతం మాత్రం పెరగలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా ఓటర్లు పెరిగినప్పటికీ... పాత జాబితాలో డూప్లికేట్ ఓట్లను తొలగించడంతో పెరిగిన ఓటర్ల ప్రభావం కూడా కనిపించలేదు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగడంతో చాలామంది అక్కడికి తరలివెళ్లారు. ఇది పోలింగ్పై ప్రభావం చూపిందని అధికారులు భావిస్తున్నారు. అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎన్జీలు తమవంతుగా అవగాహన కల్పించినప్పటికీ... వివిధ కారణాలతో పోలింగ్ శాతం తగ్గింది. పార్టీ విధానాలు నచ్చితే అభ్యర్థి నచ్చక... అభ్యర్థి నచ్చితే పార్టీ నచ్చని విచిత్ర పరిస్థితి సిటీజనులకు ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది ఓట్లేసేందుకు ఉత్సాహం చూపలేదని పలువురు పేర్కొంటున్నారు. శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే ఆదివారం వరకు వరుసగా నాలుగు రోజులు కలసి రావడంతో నగరం విడిచి వెళ్లినవారూ ఉన్నారు. కొత్త ఓటర్లు పెద్దగా నమోదు కాకపోవడం, చాలామంది ఇతర ప్రాంతాల్లో, స్వగ్రామాల్లో ఓట్లేసేందుకు వెళ్లడం, కొందరు సెలవుగా తప్ప ఓటేద్దామనుకోకపోవవడం తదితర కారణాలతో ఎప్పటిలాగే హైదరాబాద్లో పోలింగ్ శాతం తగ్గింది. బస్తీలే బెటర్... ఎప్పటిలాగే పేదలు, బస్తీల్లోని ప్రజలే పోలింగ్కు వచ్చిన వారిలో ఎక్కువగా ఉన్నారు. డూప్లికేట్ ఓట్లను భారీగా తొలగించినప్పటికీ, ఓటరు జాబితాలో ఇంకా డూప్లికేట్ ఓట్లు ఉండటం కూడా పోలింగ్ శాతం పెరగకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. డూపికేట్ ఓట్లు తొలగించే ప్రయత్నాల్లో కొందరివి ఒక్క చోట కూడా ఉంచకుండా పూర్తిగా తీసేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చేవెళ్లలో ఇలా... సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్సభ స్థానంలో ఈసారి పోలింగ్ తగ్గింది. ఇక్కడ 54.83 శాతం పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో 60.51శాతం పోలింగ్ నమోదు కాగా.. ప్రస్తుతం 6శాతం తగ్గింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల స్పందన చాలా తక్కువగా ఉంది. ఈ రెండు సెగ్మెంట్లలో ఆంధ్రప్రదేశ్కు చెందినవారు అధిక సంఖ్యలో ఉంటారు. ఆ రాష్ట్రంలోనూ గురువారం ఎన్నికలు జరగడంతో అక్కడికి వెళ్లారు. ఈ కారణంగా ఇక్కడ పోలింగ్ శాతం తగ్గినట్టు తెలుస్తోంది. అత్యధికంగా చేవెళ్ల శాసనసభ నియోజకవర్గంలో 70.42 శాతం, అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 35.52 శాతం పోలింగ్ నమోదైంది. మందకొడిగా.. ఉదయం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకు ఇదే వరుస కనిపించింది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ.. పోలింగ్ బూత్లు ఖాళీగా కనిపిస్తూ వచ్చాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఓ మోస్తారుగా ఓటర్లు కనిపించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 2:30 గంటల వరకు చాలా పోలింగ్ బూత్లు వెలవెలబోయాయి. పోలింగ్ శాతం ఇలా... -
ఎవరి ఆశలకు గండి పడుతుందో?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్సభ పరిధిలో తక్కువగా నమోదైన పోలింగ్ శాతం ఎవరి విజయావకాశాలకు గండి కొడుతుందోనన్న బెంగ రాజకీయ పార్టీల్లో మొదలైంది. గత లోక్సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే గణనీయంగా పోలింగ్ శాతం తగ్గింది. తాజా లోక్సభ ఎన్నికల్లో 53.84 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2014లో జరిగిన ఎన్నికల్లో 60.51 శాతం మంది ఓటేశారు. అంటే ఈసారి పోలింగ్ 6.67 శాతం తగ్గింది. ఈ లోక్సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. మూడు నియోజకవర్గాల్లో కనీసం 50 శాతం కూడా పోలింగ్ నమోదు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో చాలా మంది ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో అత్యధికంగా సెటిలర్లు ఉన్నారు. గురువారమే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉండటంతో.. సెటిలర్లు తమ సొంత ప్రాంతంలో ఓటేసేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. దీనికితోడు ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలకు వరుస సెలవులు ఉండడంతో ఉద్యోగులు కుటుంబాలతో సహా పల్లెబాట పట్టారు. అలాగే ఎండల తీవ్రత కూడా పోలింగ్పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. బయటకు వచ్చేందుకు సాహసించలేదని తెలుస్తోంది. ఈ కారణాల వల్లే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తగ్గిందన్నది అందరి విశ్లేషణ. మరోపక్క వరుస ఎన్నికలు రావడంతో చాలామంది సొంత గ్రామాలకు వెళ్లి ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇటీవల కాలంలోనే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాతి కొద్ది కాలానికే లోక్సభ ఎన్నికలు రావడంతో..సొంత ఊళ్లకు వెళ్లేందుకు మొగ్గు చూపలేదని తెలుస్తోంది. ఎండల తీవ్రత, వ్యయ ప్రయాసాలను చూసి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. పైగా స్థానిక, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే అభ్యర్థుల ప్రచారం పెద్దగా లేదు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. పైగా లోక్సభ ఎన్నికల ప్రాధాన్యతపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడమూ ఒక కారణంగా చెప్పవచ్చు. వీటన్నింటి నేపథ్యంలోనే పోలింగ్ శాతం తగ్గిందని తెలుస్తోంది. మరోపక్క పూర్తిగా గ్రామీణ ప్రాంతాలైన చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఇక్కడ గణనీయంగా పోలింగ్ శాతం నమోదైంది. క్షీణించిన పోలింగ్ శాతం ఎవరి గెలుపు అవకాశాలను కొంపముంచుతుందోనన్న బెంగ అభ్యర్థులను వెంటాడుతోంది. గత రెండు దఫాల్లో చేవెళ్లలో నమోదైన పోలింగ్ శాతం -
పక్కా వ్యూహంతో ప్రశాంతం
సాక్షి, సిటీబ్యూరో: దాదాపు రెండు నెలలుగా అధికారులు తీసుకున్న చర్యలు, పోలీసుల వ్యూహం ఫలించాయి. ఫలితంగా గురువారం కనీసం ఒక్క ఉదంతం కూడా లేకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బషీర్బాగ్లోని కమిషనరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) నుంచి ఉన్నతాధికారులు పరిస్థితుల్ని ఆద్యంతం పర్యవేక్షించారు. నగర కోత్వాల్ అంజనీ కుమార్తో పాటు ప్రత్యేకాధికారిగా వచ్చిన ఐజీ శశిధర్రెడ్డి సైతం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బేరీజు వేయడంతో పాటు డీజీపీ కార్యాలయంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పరిస్థితిని సమీక్షించారు. 2014 ఎన్నికల నేపథ్యంలో సిటీలో మొత్తం 24 కేసులు నమోదు కాగా... ఈసారి ఒక్కటీ నమోదు కాకపోవడం గమనార్హం. మూడు విభాగాలుగా విభజించి.. ఎన్నికల నోటిషికేషన్ వెలువడిన నాటి నుంచి రంగంలోకి దిగిన సిటీ ఎలక్షన్ సెల్ వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరించి విశ్లేషించింది. పోటీ చేసే అభ్యర్థులు, వారి వివరాలు, అనుచరుల కదలికలు తదితర అంశాలను పక్కాగా బేరీ జు వేయగలిగింది. నగర నిఘా విభాగమైన స్పెష ల్ బ్రాంచ్ (ఎస్బీ) అధికారులు, క్షేత్రస్థాయి సి బ్బంది అందించిన సమాచారం కీలకంగా మారింది. వీటి ఆధారంగా పోలీసులు అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను పక్కాగా గుర్తించగలిగారు. ఫలితంగా నాలుగు నియోజకవర్గాలతో పాటు పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలను ఈ కేటగిరీల్లోకి తీసుకువచ్చారు. షాడో పార్టీల సమాచారంతో.. దాదాపు ప్రతి అభ్యర్థితో పాటు అనుచరుల్లోనూ కీలకమైన వారిని అనునిత్యం వెంటాడటానికి నగర పోలీసులు షాడో టీమ్స్ను రంగంలోకి దింపారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు వారి కదలికల్ని కనిపెట్టి సమాచారం అందిస్తూ వచ్చాయి. వీటి ఆధారంగా ఆయా ప్రాంతాల్లో బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. పోలింగ్ రోజున కూడా దాదాపు 100 పార్టీలు విధుల్లో ఉన్నాయి. ఫలితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పక్కాగా చర్యలు తీసుకోగలిగారు. మరోపక్క రెండు నెలలుగా రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులకు కౌన్సిలింగ్, బైండోవర్లపై టాస్క్ఫోర్స్ పోలీసులు దృష్టి పెట్టారు. నగరం బయట, అజ్ఞాతంలో ఉన్న వారి వల్లా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆ ‘రెండు’ గంటలు.. పోలింగ్ రోజు చివరి రెండు గంటలు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 మధ్య సమయం అత్యంత కీలకం. ఈ వేళల్లోనే దొంగ ఓట్లు ఎక్కువగా పడటం, ఘర్షణలు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్కు రాని వారి వివరాలు సేకరించే కొన్ని పక్షాలు వారి పేర్లతో వేరే వారిని పంపి దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నింస్తుంటారు. దీన్ని అడ్డుకోవడానికి ఇతర పార్టీలు ప్రయత్నాలు చేయడం ఘర్షణలు, గొడవలు దారి తీస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం ‘ఆ రెండు’ గంటలూ అత్యంత అప్రమత్తమైంది. రిజర్వ్లో ఉన్న బలగాలను సైతం ఏరియాల్లోకి పంపించి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. ఈసారి పోలింగ్ బూత్లబాధ్యత కేంద్ర బలగాలకు.. కేంద్ర ఎన్నికల సంఘం గతానికి భిన్నంగా ఈసారి పోలింగ్ బూత్ల బాధ్యతల్ని కేంద్ర సాయుధ బలగాలకు అప్పగించింది. స్థానికంగా పని చేసే పోలీసు అధికారులు ఫలానా వ్యక్తి గెలుస్తాడనో, ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో పరోక్షంగా వారికి సహకరించే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడం కోసం ఈసారి కూడా ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేసిన విధానాన్నే ఇక్కడా అమలు పరిచింది. అక్కడ నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే స్థానిక పోలీసుస్టేషన్ ఇన్చార్జ్ (జిల్లాల్లో ఎస్ఐ, కమిషనరేట్లలో ఇన్స్పెక్టర్)లతో పాటు పోలీసు సిబ్బందికి బూత్ల బాధ్యతలు అప్పగించలేదు. అక్కడి భద్రత, బందోబస్తుల్ని కేంద్ర బలగాలకు అప్పగించింది. ఇదే వి«ధానాన్ని ఇక్కడా అమలు చేస్తూ ఎస్ఎస్బీ బలగాలను పోలింగ్ బూత్ ఎంట్రన్స్ల వద్ద మోహరించింది. సైబరాబాద్, రాచకొండ పరిధిలో.. సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చేవెళ్ల, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే జీడిమెట్ల, భగత్సింగ్ నగర్, చింతల్, షాపూర్నగర్, గాజులరామారం, ఎల్లమ్మబండ, మూసాపేట్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, రాజేంద్రనగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నౌ నంబర్, సిక్ చావనీ, ఎన్ఎఫ్డీబీ, హసన్నగర్, మైలార్దేవ్పల్లిలోని పద్మశాలీపురం, శాస్త్రిపురం, కాటేదాన్ పోలింగ్ కేంద్రాలను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు తాగునీరు, టెంట్లు, వృద్ధులకు వీల్ చైర్లు తదితర వసతులను పరిశీలించారు. అంతకు ముందు నాంపల్లిలోని వ్యాయామ్ శాల హై స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో భార్య అనుపతో కలిసి ఓటు హక్కును సజ్జనార్ వినియోగించుకున్నారు. అలాగే మల్కాజ్గిరి, భువనగిరితో పాటు మరో మూడు లోక్సభ నియోజకవర్గాల్లోని ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. భువనగిరి, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల్లోని పొలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి భద్రతా ఏర్పాట్లను వీక్షించారు. -
పార్కింగ్ ఘర్షణ
సాక్షి, సిటీబ్యూరో: లోక్సభ ఎన్నికల పోలింగ్ సిటీలో ప్రశాంతంగా ముగిసింది. అత్యంత సమస్మాత్మంగా భావించిన ప్రాంతాలు, ప్రధాన పార్టీల ప్రాబల్యం ఉన్న ఏరియాల్లోనూ అవాంఛనీయ ఘటనలు లేకుండానే ఓటింగ్ ఘట్టం పూర్తయింది. అయితే అనేక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడానికి పార్కింగ్ ఒక కారణమైంది. ఓటింగ్ జరిగే రోజు పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరం నుంచి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్ అమలులో ఉంటాయి. దీన్ని నిర్దేశిస్తూ అధికారులు గీత కూడా గీస్తారు. సాధారణంగా ఈ ‘గీతదాటే’ అంశంలో నిత్యం పోలీసులు, అభ్యర్థుల వెంట ఉండే అనుచరులు, ఓటర్ స్లిప్పులు పంచేందుకు సిద్ధమైన పార్టీల కార్యకర్తల మధ్య తరచుగా వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి. ఈసారి దీనికి భిన్నంగా ‘గీత’ ఓటర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణలకు తావిచ్చింది. ఉదయం 7 గంటలకు ముందే పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఓటర్లు ఆయా ప్రాంతాలు ఖాళీగా ఉండటంతో తమ వాహనాలను ఈ గీత దాటించి ముందకు తీసుకువెళ్లారు. ఆపై బందోబస్తు పూర్తి స్థాయికి చేయడంతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారి వాహనాలను ఈ గీత లోపలి ప్రాంతంలో పార్కింగ్ చేయడానికి పోలీసులు అంగీకరించలేదు. ఓటింగ్కు వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలూ కల్పించలేదు. అయితే అప్పటికే పార్క్ చేసిన వాహనాలు గీత లోపల ఉండటం, తమవి మాత్రం వద్దంటూ పోలీసులు వారిస్తుండటంతో ఓటర్లు అసహనానికి లోనయ్యారు. ఈ అంశంపైనే అనేక చోట్ల వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో ఎదురైన పార్కింగ్ వాగ్వాదాలతో మేల్కొన్న పోలీసులు ఆ తరవాత చాలాచోట్ల ‘గీత’ దగ్గరే సిబ్బందిని ఏర్పాటు చేసి వ్యక్తిగత వాహనాలను అనుమతించలేదు. కేవలం వృద్ధులు, వికలాంగుల్ని తీసుకువస్తున్న వాటినే ముందుకు వెళ్లనిచ్చారు. ఏ లోటూ రానివ్వని కమిషనర్లు.. సాధారణంగా బందోబస్తు విధులంటే పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తాగడానికి నీళ్లుండవు, తినడానికి తిండి దొరకదు, పోనీ ఉన్న పాయింట్ను వదిలి దాహం, ఆకలి తీర్చుకుందామంటే ఏమవుతుందో అనే సందేహం. రిపోర్ట్ చేసిన అధికారి కార్యాలయం నుంచి డ్యూటీ పాయింట్కు వెళ్లాలంటే నానా యాతనా పడాల్సిందే. అయితే ఈసారి మాత్రం సిబ్బందికి ఇలాంటి ఇబ్బందుకు రాకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు అంజనీకుమార్, వీసీ సజ్జనార్, మహేష్ భగవత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలింగ్ నేపథ్యంలో గురువారం ‘గ్రేటర్’ వ్యాప్తంగా స్థానిక పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు కలిపి దాదాపు 27 వేల మందిని వినియోగించారు. సిబ్బంది మొత్తం రిపోర్ట్ చేసిన ప్రాంతం నుంచి విధులు నిర్వర్తించాల్సిన పాయింట్కు చేరడానికి, అవసరమైన పక్షంలో ప్రత్యేక గస్తీలు నిర్వహించడానికి కమిషనరేట్స్లో ఉన్న వాటికి తోడు అదనంగా దాదాపు 800 వాహనాలు అద్దెకు తీసుకున్నారు. గురువారం రాత్రి నుంచి నిర్విరామంగా విధుల్లో ఉన్న ఈ సిబ్బందికి అల్పాహారం, టీ, భోజనం, తాగునీరు తదితరాలన్నింటినీ వారు విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాలకు చేరేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ బాధ్యతలను స్థానిక పోలీసులకు అప్పగించడంతో పాటు పర్యవేక్షణ బాధ్యతల్ని ఉన్నతాధికారులకు అప్పగించారు. పోలింగ్ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6 నుంచి విస్తృత స్థాయి బందోబస్తు ప్రారంభమైంది. రాత్రి ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లు స్ట్రాంగ్రూమ్లకు చేరే వరకు ఈ ఏర్పాట్లు కొనసాగాయి. -
శోభన కామినేని ఓటు గల్లంతు
సాక్షి, సిటీబ్యూరో: నాంపల్లి నియోజకవర్గం విజయనగర్కాలనీలో నివాసం ఉండే అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ శోభన కామినేని ఓటు గల్లంతయింది. పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఆమె ఓటు వేసేందుకు నగరానికి వచ్చారు. తీరా పోలింగ్ కేంద్రానికి వెళ్లాక అక్కడ తన ఓటు తొలగించినట్లు తెలుసుకొని నివ్వెరపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓటు ఇప్పుడెలా పోయిందంటూ ఎన్నికల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ పౌరురాలినైన తనకు ఇది ఎంతో విచారకరమైన రోజని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దేశ పౌరురాలిని కాదా ? నాకు ఓటు ముఖ్యం కాదా ? అంటూ ప్రశ్నించారు. ఓటు వేశాననే సంతృప్తి కోసం చాలెంజ్ ఓటు వేయవచ్చునని సిబ్బంది చెప్పారని, లెక్కింపునకు నోచుకోని ఓటెందుకని ఆమె ప్రశ్నించారు. బీఎల్ఓపై వేటు.. శోభన కామినేని ఓటు తొలగింపునకు బాధ్యుడైన బీఎల్ఓ (బూత్ లెవెల్ ఆఫీసర్)గా విధులు నిర్వహిస్తున్న హెల్త్ విభాగం ఉద్యోగి ఓం ప్రకాశ్ను సస్పెండ్ చేయడంతోపాటు ఔట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న నరేందర్రెడ్డిని సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మెహదీపట్న ం సర్కిల్లోని విజయనగర్కాలనీ పోలింగ్బూత్ 49లో శోభన కామినేనికి చట్టవిరుద్ధంగా రెండు ఓట్లున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ఈ రెండింటిలో ఒకదాన్ని తొలగించాల్సిందిగా సహాయ ఎన్నికల అధికారి బీఎల్ఓను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంబంధిత 7ఏ నోటీసులు లిఖితపూర్వకంగా జారీ చేయకుండా శోభనకు చెందిన రెండు ఓట్లను బీఎల్ఓ తొలగించారు. చెక్ చేయకుండానే రెండు ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఎన్నికల ప్రక్రియలో శిక్షణ వ్యవహారాల నోడల్ ఆఫీసర్గా ఉన్న జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ డైరెక్టర్ శశికిరణాచారిని నియమించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఉపాసన శోభన ఓటు గల్లంతుపై ఆమె కుమార్తె ప్రము ఖ హీరో రామ్చరణ్ తేజ్ భార్య ఉపాసన ట్విట్టర్ వేదికగా స్పందిచారు. పది రోజుల క్రితం ఓటరు జాబితాలో ఉన్న తన తల్లి పేరు ఇప్పుడు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. తన తల్లి కూడా ప్రభుత్వానికి పన్ను కడు తోందని, భారత పౌరురాలిగా ఆమెకు విలువ లేదా? అంటూ ఘాటుగా స్పందించారు. -
‘తార’లొచ్చారు
బంజారాహిల్స్: సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో పలువురు సినీతారలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. గురువారం లోక్సభ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పోలింగ్ బూత్లో సినీనటుడు అల్లు అర్జున్ ఓటు వేశారు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో చిరంజీవి, ఆయన భార్య సురేఖ, కుమారుడు రాంచరణ్, కోడలు ఉపాసన ఓటు వేశారు. ఎఫ్ఎన్సీసీలో సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సానియా మీర్జా తన ఓటుహక్కును ఎఫ్ఎన్సీసీలోనే వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్– 45లోని ఉమెన్ కో– ఆపరేటివ్ సొసైటీలో ఓటు వేసిన అక్కినేని అమల ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అలాగే వైస్సార్ సీపీ నాయకుడు, నటుడు మోహన్బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె మంచు లక్ష్మి ఓటు వేశారు. కేంద్రీయ విద్యాలయలో జయసుధ.. గచ్చిబౌలి: సినీనటి, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకు రాలు జయసుధ కపూర్, కుమారుడు నిహార్ కపూర్ గచ్చిబౌలిలోని జీపీఆర్ఏ క్వార్డ్టర్స్లోని కేంద్రీయ విద్యాలయలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. నానక్రాంగూడలో కృష్ణ, నరేష్.. రాయదుర్గం: గచ్చిబౌలి డివిజన్ నానక్రాంగూడలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పలువురు సినీతారలు ఓటు వేశారు. అలనాటి నటుడు కృష్ణ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్, ఆయన కుమారుడు నవీన్ విజయకృష్ణ, అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. నటుడు వేణు ఓటేశారు. -
పాతబస్తీలో ఫలించని మంత్రం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ లోక్సభ పరిధిలో పోలింగ్ శాతం పెంపుపై ఎన్నికల యంత్రాంగం, ప్రధాన రాజకీయ పక్షాలు చేసిన ప్రయోగం ఫలించలేదు. లోక్సభ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిపోయింది. ప్రతి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరుగుతున్న పోలింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. ఈసారి కొత్తగా నమోదైన యువ ఓటర్లపై ఎన్నికల యంత్రాంగంతో పాటు మజ్లిస్ పార్టీ దృష్టి సారించినా ఫలితం లేకుండా పోయింది. ఏకంగా లెర్న్ ప్రాజెక్టును ప్రారంభించి కళాశాల విద్యార్ధులతో టాక్విత్ అసదుద్దీన్ పేరుతో ముఖాముఖి, టౌన్హాల్ కార్యక్రమాలను నిర్వహించింది. పాదయాత్రలతో పోలింగ్ శాతం పెంపుపై అవగాహన కూడా కల్పించింది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో వన్సైడ్గా పోలింగ్ జరిగే ఆనవాయితీ ఉన్నా.. మెజార్టీకి పోలింగ్ శాతమే ప్రాణం. వాస్తవంగా పాతబస్తీ పరిధిలో విస్తరించి ఉన్న లోక్సభ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీకి గట్టి పట్టు ఉంది. మెజార్టీ ఒకే సామాజిక వర్గం కావడంతో గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. గుండుగుత్తగా ఓట్లు పడతాయి. సదరు సామాజికవర్గం వారు ఓట్లు వేశారంటే కచ్చితంగా ఆ పార్టీ ఖాతాలో పడినట్లే నమ్మకం. ప్రజలపై విశ్వాసం. కానీ ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పడిపోయింది. పాతబస్తీలో పురుష ఓటర్లతో పోల్చితే మహిళా పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యింది. సాధారణంగా ఇంటి పనులతో తీరికలేకపోవడం, కట్టుబాట్లు, ఇతరత్రా కారణాలతో ప్రత్యేక సమయం కేటాయించి బయటకి వెళ్లి ఓటింగ్లో పాల్గొనేందుకు మహిళలు పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు. ప్రతిసారీ మహిళా పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం గమనార్హం. -
61 శాతం పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గురువారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైంది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 61% అంచనా పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్కుమార్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం కచ్చితమైన పోలింగ్ గణాంకాలను వెల్లడిస్తామన్నారు. మే 23న లోక్సభ ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 16 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ సమయం ముగిసే వరకు క్యూల్లో నిలబడిన ఓటర్లందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల సంఘం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడా రీపోలింగ్ ఉండదు! నిజామాబాద్, కరీంనగర్ లోక్సభ స్థానాల పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 7.30 గంటల వరకు పోలింగ్ జరుగుతూనే ఉందని రజత్కుమార్ వెల్లడించారు. పోలింగ్ వేళలు ముగిసిన అనంతరం గురువారం రాత్రి ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 3 లక్షల మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది, భద్రతా బలగాలకు రజత్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలను విజయవంతం చేసేందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు అభినందనలు తెలిపారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాలేదన్నారు. హింసా, దౌర్జన్యాలు, బూత్ల స్వాధీనం వంటి ఘటనలు జరగలేదన్నారు. ఒక పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి పడిందంటూ సోషల్ మీడియాల్లో వస్తున్న ఫొటోల విశ్వసనీయతను రజత్ కుమార్ ప్రశ్నించారు. ఈ ఫొటోలపై విచారణకు ఆదేశించామని, ఇలాంటి ఘటనలు తన దృష్టికి రాలేదన్నారు. పోలింగ్పై భానుడి ప్రతాపం పోలింగ్ ఉదయంపూట జోరుగానే సాగింది. ఉదయం 9 గంటల వరకు 10.6%, 11 గంటలకు 22.8%, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 38.80% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఎండ తీవ్రత కారణంగా మందకొడిగా సాగింది. మధ్యాహ్నం 3 గంటలకు 48.95% పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఎండ తీవ్రత తగ్గిన తర్వాత మళ్లీ పుంజుకుంది. సాయంత్రం 5 గంటల నాటికి 61 శాతానికి చేరింది. కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభం షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈవీఎంలు మొరాయించడంతో పలు కేంద్రాల్లో గంట నుంచి రెండు గంటల పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5.30–6.45 గంటల మధ్య మాక్పోలింగ్ నిర్వహించిన తర్వాత పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. మాక్పోలింగ్లోనే ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఎన్నికల్లో మొత్తం 64,512 బ్యాలెట్ యూనిట్లు, 34,635 కంట్రోల్ యూనిట్లు, 34,770 వీవీప్యాట్స్ వినియోగించగా, మాక్ పోలింగ్ సందర్భంగా 541 బ్యాలెట్ యూనిట్లు, 639 కంట్రోల్ యూనిట్లు, 843 వీవీప్యాట్స్ను మార్చాల్సి వచ్చింది. ఉదయం 7 గంటలకు వాస్తవ పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా కొన్ని చోట్ల యంత్రాలు మొరాయించాయి. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ సారి ఈవీఎంల సమస్యలు తగ్గాయని రజత్కుమార్ పేర్కొన్నారు. బద్ధకించిన జంటనగరాలు ఓటేసేందుకు జంటనగరాల ప్రజలు మళ్లీ బద్దకించారు. సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన పోలింగ్ శాతం అంచనాల ప్రకారం.. సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో అత్యల్పంగా 44.99% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో 39.49%, మల్కాజ్గిరి స్థానం పరిధిలో 49.21% పోలింగ్ నమోదైంది. మెదక్ లోక్సభ పరిధిలో అత్యధికంగా 68.60% పోలింగ్ జరిగింది. గ్రామీణ ప్రాంతాలతో కూడిన చేవెళ్ల లోక్సభలో 54.8% పోలింగ్ నమోదైంది. జంటనగరాల పరిధిలో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదు కావడంపై సీఈఓ రజత్కుమార్ స్పందించారు. గురువారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత, బలమైన అభ్యర్థులు బరిలోలేకపోవటం, జాతీయస్థాయిలో రాజధాని అంశాలు ఎజెండాలో లేకపోవటం, విస్తృత ప్రచారానికి సమయం లేకపోవటం, నగరంలో ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు అందకపోవటం వంటి కారణాలతోనే పోలింగ్ తక్కువగా నమోదైందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85%, ఎమ్మెల్యే ఎన్నికల్లో 70–75% పోలింగ్ జరిగిందన్నారు. ప్రజలతో అనుసంధానమై ఉండే వ్యక్తిని ఎన్నుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారన్నారు. ఎంపీలతో ప్రజలకు నేరుగా అనుబంధం ఉండదని, దీంతో సాధారణంగా లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ తక్కువే ఉంటుందన్నారు. పోలింగ్ శాతం పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. సికింద్రాబాద్లో అత్యల్పంగా.. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో అత్యంత తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఈ నియోజకవర్గంలో మధ్య, దిగువ మధ్య తరగతి జనాలు ఎక్కువగా ఉండే అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో 30.19%, ముషీరాబాద్ నియోజకవర్గంలో 36.70% ఓటింగ్ నమోదైంది. సంపన్నుల కేంద్రమైన ఖైరతాబాద్ నియోజకవర్గంలో 38% మంది ఓటేశారు. ఇక హైదరాబాద్ లోక్సభ పరిధిలో యాకుత్పురా నియోజకవర్గంలో 32%, మలక్పేట నియోజకవర్గంలో 33.60% ఓటింగ్ నమోదైంది. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా నివసించే గోషామహల్లో 45.70% ఓట్లు పోల్కావడం విశేషం. 220 కోట్లు విలువైన జప్తులు! మే 23న ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని రజత్కుమార్ తెలిపారు. పోలింగ్ ముగియడంతో తనిఖీలు ఉండవన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా మొత్తం రూ.74.56 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశామన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో రూ.76 కోట్లు విలువైన జప్తులు కలిపితే ఈ మొత్తం రూ.220 కోట్లకు పెరుగుతుందన్నారు. 2014లో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇది మూడు రెట్లు అధికమని రజత్కుమార్ స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూంలకు ఈవీఎంలు! పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కలెక్షన్ సెంటర్కు తరలిస్తారని రజత్కుమార్ వెల్లడించారు. అక్కడ ఉండే సహాయ రిటర్నింగ్ అధికారి ఫారం–17సీ, ఈవీఎం, వీవీప్యాట్స్ను పరిశీలించి చూస్తారన్నారు. మొత్తం ఓట్లు, పోలైన ఓట్లను సరిచూసుకుంటారన్నారు. తర్వాత ఎన్నికల పరిశీలకుడు దీన్ని ధ్రువీకరిస్తూ సంతకం చేస్తారన్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను సంబంధిత లోక్సభ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్కు తరలిస్తారన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద రెండంచెల భద్రత ఉంటుందన్నారు. కేంద్ర సాయుధ బలగాలతో తొలి అంచె, రాష్ట్ర పోలీసు బలగాలతో రెండో అంచె బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. అక్కడ సీసీటీవీల నిఘా ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను కాపలాగా పెడతామని కోరుకుంటే, వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ముగిసిన తర్వాత 45 రోజుల వరకు ఈ భద్రత ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, వాటిని సవాలు చేస్తూ 45 రోజుల్లోగా న్యాయ స్థానంలో పిటిషన్ వేయడానికి అవకాశముందని, అందుకే వీటికి భద్రత కల్పిస్తామన్నారు. గిన్నిస్బుక్లో ఇందూరు ఎన్నికలు! నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీ చేసినా, అక్కడ పోలింగ్ విజయవంతంగా ముగిసిందన్నారు. ఇందుకు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల ఎన్నికల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. 185 మంది అభ్యర్థులకు ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం ప్రపంచరికార్డు అని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు కల్పించాలని ఆ సంస్థకు లేఖ రాశామన్నారు. నిజామా బాద్ పోలింగ్ సందర్భంగా 261 బ్యాలెట్ యూని ట్లు, 55 కంట్రోల్ యూనిట్లు, 87 వీవీప్యాట్స్ను మార్చాల్సి వచ్చిందన్నారు. -
పట్టణాల్లో అనుకూలం.. పల్లెల్లో ప్రతికూలం
సాక్షి, హైదరాబాద్: లోక్సభ పోరులో మిశ్రమ ఫలితాలు వస్తాయని ప్రతిపక్ష కాంగ్రెస్ అంచనా వేస్తోంది. పోలింగ్ సరళిని బట్టి 6 లోక్సభ నియోజకవర్గాల్లో గట్టి పోటీనిచ్చామని, 3 లేదా 4 స్థానాల్లో గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలంటున్నారు. 8 స్థానాల్లో మాత్రం పూర్తిగా వెనుకబడిపోయామని భావిస్తున్నారు. పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం చేవెళ్ల, ఖమ్మం, ఆదిలాబాద్, భువనగిరి, నల్లగొండ, మల్కాజ్గిరి స్థానాల్లో టీఆర్ఎస్ను గట్టిగానే ఎదుర్కొన్నామనే ధీమా వ్యక్తమవుతోంది. పెద్దపల్లి, జహీరాబాద్, మహబూబాబాద్ స్థానాల్లోనూ పెద్ద సంఖ్యలో ఓట్లు వస్తాయని, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ స్థానాల్లో పూర్తిగా వెనుకబడిపోయామనే భావన పోలింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. ఆ నాలుగు... ఆదుకుంటాయా? అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. స్థానిక పరిస్థితుల దృష్ట్యా పార్టీ నేతలు, కేడర్లో పలు రకాల విశ్లేషణలు జరుగుతున్నా మొత్తం మీద తమను నాలుగు అంశాలు ఆదుకుంటాయనే ధీమా కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా కుమారుడు రాహుల్గాంధీని ప్రధానిని చేయాలనే ఆకాంక్ష, జాతీయస్థాయి ఎన్నికల్లో రాహుల్ కార్డుతో పాటు మోదీపై ఉన్న వ్యతిరేకత, పోటీలో ఉన్న అభ్యర్థుల చరిష్మా, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం పెద్దగా ఉండదనే అంచనాలో కాంగ్రెస్ నేతలున్నారు. ఈ కోణంలోనే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందని అంటున్నారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని కేడర్లో నెలకొన్న నైరాశ్యం తమ పుట్టి ముంచే అవకాశాలున్నాయని, ప్రచారం సరిగ్గా జరగని లోక్సభ స్థానాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన విధంగా పోలింగ్ జరగలేదని అంచనా వేస్తున్నారు. కానీ, నల్లగొండ, భువనగిరి, మల్కాజ్గిరి, చేవెళ్ల లోక్సభ స్థానాల్లో చరిష్మా ఉన్న నేతలు బరిలో ఉన్నందున తమ ఓటు బ్యాంక్తో పాటు సామాజిక సమీకరణలు, స్థానిక అంశాలు లాభం చేకూరుస్తాయని అంటున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయా... ఆదిలాబాద్లో లంబాడీ సామాజిక వర్గానికి చెందిన తమ అభ్యర్థికి సామాజిక సమీకరణలు మేలు చేకూరుస్తాయా.. లాంటి విశ్లేషణలు కూడా పార్టీ నేతల్లో జరుగుతున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన ముస్లింలు ఈసారి మోదీకి వ్యతిరేకంగా తమకు లాభం చేకూరుస్తారని, ముస్లిం మైనార్టీ ఓటర్లు తమ వైపే మొగ్గు చూపారని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయి అంశాల వైపే ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు కూడా మొగ్గు చూపితే మాత్రం నిశ్శబ్ద ఓటింగ్ తమకు సానుకూల ఫలితాలను తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో పట్టు సడలింది.. లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ నుంచి జరిగిన వలసల కారణంగా పెద్ద ఎత్తున కుదేలైన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కోలుకోలేకపోయిందని ప్రచార సరళిని బట్టి అర్థమవుతోంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ స్థాయి నేతలు వరుసగా పార్టీని వీడి వెళ్లిపోవడంతో గ్రామాల్లో కేడర్ను కదలించే నాథుడే లేకుండా పోయిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి తోడు లోక్సభ ఎన్నికల తరుణంలో నేతలంతా పార్టీని వీడటంతో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కూడా పెద్దగా ఉత్సాహం కనిపించలేదని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఉత్తమ్కుమార్రెడ్డి (నల్లగొండ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి) కొండా విశ్వేశ్వర్రెడ్డి (చేవెళ్ల), రేవంత్రెడ్డి (మల్కాజ్గిరి)లు మాత్రమే ప్రచారంలో టీఆర్ఎస్కు దీటుగా దూసుకెళ్లినట్టు కనిపించగా.. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు ప్రచార జోరులో పూర్తిగా వెనుకబడిపోయారు. దీంతో అడపాదడపా జరిగిన సభలు, ర్యాలీలతోనే లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిపోయిందని, గ్రామాల్లో బూత్స్థాయికి వెళ్లి ఓటర్లను పలకరించి ఓటేయమని అడిగే పరిస్థితి లేకుండా పోయిందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. దీంతో గ్రామాల్లోని సంప్రదాయ ఓటు బ్యాంకుకు అదనంగా పెద్దగా ఓట్లు రాలే అవకాశాల్లేవని, కనీసం ఏజెంట్లను నియమించుకోవడం కూడా కష్టమైందంటేనే క్షేత్రస్థాయి కేడర్లోని నిస్తేజం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని టీపీసీసీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్న వారిని అయినా పలకరించి నాలుగు ఓట్లు అడగాలనే ఆలోచన కూడా పార్టీ అభ్యర్థులకు రాలేదని, ప్రచార సరళిని బట్టి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ తమకు ప్రతికూలంగానే ఉంటుందని అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. -
లాభమే తప్ప... నష్టమేం లేదు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల పోలింగ్సరళి తమకు కలసివస్తుందని కమలనాథులు అభిప్రాయపడుతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో గెలిచిన సికింద్రాబాద్ స్థానాన్ని కచ్చితంగా గెలవడంతోపాటు అదనంగా ఒకట్రెండు స్థానాలు బోనస్గా లభిస్తాయని అంచనా వేస్తున్నారు. నరేంద్రమోదీ చరిష్మాతోపాటు పోటీ చేసిన అభ్యర్థుల పలుకుబడి, జాతీయపార్టీగా సానుకూలత వెరసి మంచి ఫలితాలు వస్తాయని, గత ఎన్నికలతో పోలిస్తే ఓట్లశాతం కూడా పెరుగుతుందని కమలంపార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద సికింద్రాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్ స్థానాలపై ఆశలు పెట్టుకున్న బీజేపీ నేతలు ఆదిలాబాద్, నిజామాబాద్లలో కూడా గట్టిపోటీ ఇచ్చామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐదింట ప్రభావం..! రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకుగాను ఐదుచోట్ల పార్టీ పక్షాన గట్టిపోటీ ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్లలో టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొన్నామని, అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిష్మాకు తోడు పార్టీకి ఉన్న బలం, నమో మంత్రం కలిసి వచ్చాయని అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్లో కూడా గణనీయంగా ఓట్లు తెచ్చుకుంటామని చెబుతున్న బీజేపీ నేతలకు నిజామాబాద్లో క్రాస్ఓటింగ్ ఆశలు రేకెత్తిస్తోంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్లు తమకే క్రాస్ అయ్యాయని బహిరంగంగానే చెబుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్లో ఓటర్లు అధికసంఖ్యలో బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేసినట్లు పార్టీ నేతలు అంచనాకు వచ్చారు. సికింద్రాబాద్ బరిలో నిలిచిన కిషన్రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా ఈసారి సానుభూతి ఓట్లు తమకు అనుకూలించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పట్టణ ఓటర్లు ఎక్కువశాతం బీజేపీకే ఓట్లు వేశారన్న ధీమాతో పార్టీ ఉంది. మహబూబ్నగర్లోనూ మాజీమంత్రి డీకే అరుణకు ఉన్న పార్టీ కేడర్తో, కాంగ్రెస్ నుంచి కూడా ఓట్లు భారీగా వేశారని భావిస్తున్నారు. కరీంనగర్లోని పలు నియోజకవర్గాల్లో పార్టీకి మొదటి నుంచి ఉన్న ఓటు బ్యాంకుతోపాటు టీఆర్ఎస్పట్ల ఉన్న వ్యతిరేకత బాగా కలిసి వచ్చిందని, భారీగా ఓట్లు వస్తాయని పార్టీవర్గాల పేర్కొంటున్నాయి. బలీయశక్తిగా ఎదుగుతామా? లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి బీజేపీ భవిష్యత్తుపై ఆ పార్టీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ తమ ఓటుబ్యాంకు రెట్టింపు అవుతుందని, భవిష్యత్తులో పోటీ తమకు, టీఆర్ఎస్కేనని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీకి మంచి నాయకత్వం వస్తుందని, కొత్తగా బలమైన నేతలు తెరపైకి వస్తారని, మళ్లీ ఎలాగూ మోదీ ప్రధాని అవుతారు కనుక పార్టీ బలోపేతం అవుతుందని చెప్పడం గమనార్హం. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లభిస్తుందని పేర్కొంటున్నారు. -
పదహారు మావే
సాక్షి, హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళిపై తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తి ధీమాతో ఉంది. తాము నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 16 లోక్సభ స్థానాల్లో విజయం ఖాయమని అంచనాకు వచ్చింది. 17 లోక్సభ సెగ్మెంట్లలో జరిగిన పోలింగ్ సరళిని, క్షేత్రస్థాయిలో ఓటింగ్ తీరుపై వచ్చిన సమాచారాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సేకరించి సమీక్షించారు. ఈ వివరాల ఆధారంగా పలువురు మంత్రులతో, అభ్యర్థులతో ఫోన్లో చర్చించారు. ‘రాష్ట్ర ప్రజలు మరోసారి టీఆర్ ఎస్ను దీవించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా చేసిన ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషించే విషయంపై ప్రజలు సానుకూలంగా స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు విస్తృతం కావాలంటే మన పార్టీవారినే లోక్సభకు పంపాలని భావించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలోనూ సానుకూలంగా ఓటింగ్ జరిగింది. 16 లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తున్నారు. హైదరాబాద్లో ఎప్పటిలాగే ఎంఐఎం భారీ మెజారిటీతో గెలుస్తోంది. కాంగ్రెస్ ఎక్కడా పోటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ చేతులెత్తేయడంతో 2, 3 చోట్ల బీజేపీ రెండో స్థానంలో నిలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలను ప్రజలు పట్టించుకోలేదు. మన పార్టీ ఎమ్మెల్యేలు కష్టపడ్డారు. మంత్రులు సమన్వయం చేస్తూ బాగా పని చేశారు. ప్రచారంలోనే మన పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమైంది. పోలింగ్తో గెలుపు పూర్తయింది’అని అన్నారు. సీఎం కేసీఆర్ పలువురు అభ్యర్థులకు అభిందనలు తెలిపినట్లు తెలిసింది. అన్నింట్లో ఆధిక్యత... గత లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 11 స్థానాల్లో గెలించింది. ఈసారి 16 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా బరిలోకి దిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ప్రత్యర్థి పార్టీల కంటే అన్నింట్లోనూ ముందంజలో ఉంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, నాగర్కర్నూల్, వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో భారీ ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని ఆ పార్టీ అంచనాలో ఉంది. మహబూబ్నగర్, నల్లగొండ, మల్కాజిగిరి, చేవేళ్ల, భువనగిరి, ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాల్లోనూ స్పష్టమైన ఆధిక్యంతో గెలుస్తామనే అంచనాలో ఉంది. మొత్తంగా అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఖాయమని ధీమాతో ఉంది. పథకాలపై సానుకూలత... తమ ప్రభుత్వం ఐదేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు లోక్సభ ఎన్నికల్లోనూ బాగా కలిసి వచ్చి ఉండొచ్చని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అన్ని సెగ్మెంట్లలో గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు పూర్తిగా మద్దతు తెలిపారని లెక్కలేసుకుంటున్నారు. సంక్షమ పథకాల లబ్ధిదారులు, రైతులు, వారి కుటుంబాలు ఏకపక్షంగా తమకే ఓటు వేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక ప్రగతి గ్రేటర్ హైదరాబాద్లోనూ ఓటింగ్ను బాగా ప్రభావం చూపి ఉంటాయని భావిస్తున్నారు. ప్రచారంలో ప్రభావం... లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం ప్రజలకు బాగా చేరిందని ఆ పార్టీ నిర్ధారణకు వచ్చింది. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర... బీజేపీ, కాంగ్రెస్ల వైఖరిపై కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజల్లోకి బాగా వెళ్లినట్లు టీఆర్ఎస్ అంచనాకు వచ్చింది. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని వివరిస్తూ కేసీఆర్ చేసిన ప్రసంగాలు ఓటర్లపై బాగా ప్రభావం చూపాయని టీఆర్ఎస్ భావిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రచారం చేసిన 14 స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు ఖాయమైనే అంచనాలో ఉంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్లో అన్నీతానై వ్యవహరించారు. చేవేళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ సెగ్మెంట్లలో రోడ్ షోలు నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధి కొనసాగింపులో ఎంపీల పాత్రపై ప్రచారంలో స్పష్టంగా ప్రజలకు తెలియజేశారు. ప్రజల మద్దతు టీఆర్ఎస్కే: కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు మద్దతు తెలిపారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్, క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం 16 స్థానాల్లోనూ టీఆర్ఎస్ గెలుస్తోందని హైదరాబాద్లో ఎంఐఎం విజయం సాధిస్తోందని తెలిపారు. ‘మండు వేసవిలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన టీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. మీరు చేసిన కష్టంతో ప్రజలు టీఆర్ఎస్ను ఆశీర్వదిస్తున్నారు’ అని పోలింగ్ ముగిసిన అనంతరం కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అధికార యంత్రాంగం, ఎన్నికల కమిషన్, అన్ని పార్టీల కార్యకర్తలు, ప్రజల తీరు గర్వంగా ఉంది. అయితే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గడం ఒక్కటే నిరాశ కలిగించింది’ అని మరో ట్వీట్ చేశారు. -
‘నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నా’
సాక్షి, కరీంనగర్ : తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నానని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో 68.8 శాతం పోలింగ్ నమోదు కావడం సంతోషమన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారని అన్నారు. ఎంపీగా వినోద్ కుమార్ గెలిస్తే.. కేంద్రమంత్రి అవుతారని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టిఆర్ఎస్ భారీ మెజార్టీ వస్తుందన్నారు. అన్ని కుల సంఘాలు, కరీంనగర్ ప్రజలు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయమని అన్నారు. -
స్నేహితురాలి కోసం... అమెరికా నుండి జల్లీకి..
సాక్షి, చెన్నారావు పేట: చిన్నానాటి స్నేహితురాలికి కోసం అమెరికా నుండి జల్లీ గ్రామానికి చేరుకుని ఓ స్నేహితురాలు ఓటు హక్కును వినియోగించుకుంది. వివరాల్లోకి వెళితే జల్లీ గ్రామానికి చెందిన తొగరు చేతన అమెరికాలోని పిట్స్బర్గ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. కాగా చేతన ఖాజీపేటలోని ఫాతిమ హైస్కూల్లో మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితతో కలిసి పదవ తరగతి వరకు(1996) చదువుకుంది. తాను టీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పడంతో తన స్వగ్రామమైన జల్లీ గ్రామంలో ఓటు వేయడానికి బుధవారం వచ్చింది. గురువారం జరిగిన లోకసభ ఎన్నికల్లో స్నేహితురాలు కవితకు తన తల్లి తొగరు విజయతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసినట్లు తెలిపింది. తన స్నేహితురాలి గెలుపు కోసం తన ఓటు ఉపయోగ పడటం సంతోషంగా ఉందని తెలిపారు. ఖండాంతరాలు దాటివచ్చి ఓటేసిన వెంకటేష్... పల్లెటూరులో జన్మించాడు, ఉన్నత విద్యను అభ్యసించాడు. ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లి విద్యాభ్యాసం అనంతరం కాలిపోర్నియాలో ఉద్యోగంలో స్ధిరపడ్డాడు. 10 ఏళ్లుగా అక్కడే ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఈనెల 10న స్వగ్రామం దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి వచ్చాడు. మొదటిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటు వేసిన అనంతరం తన సంతోషం వ్యక్తం చేశాడు. ఎంత దూరంలో ఉన్నా పుట్టిన ఊరిలో ఓటు వేయడం చాలా ఆనందంగా ఉందని వెంకటేష్ తెలిపారు. -
తెలంగాణ లోక్సభ ఎన్నికలు ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరగగా, ప్రారంభంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మొత్తంగా 70 శాతం వరకు పోలింగ్ నమోదైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మండుటెండలను కూడా లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారుల తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే నగరంలోని సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో పోలింగ్ మందకొడిగా సాగింది. 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి బూత్లో 12 ఈవీఎంలను వినియోగించారు. తెలంగాణ వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా.. నిజామాబాద్లో 6 గంటల వరకు కొనసాగింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల యత్రాంగం ఊపిరి పీల్చుకుంది. -
ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్కే
సాక్షి, వేములవాడ: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తమకే ఉందని, ఈసారి తప్పకుండా పొన్నం ప్రభాకర్ విజయం సాధిస్తారన్న ధీమా ఉందని, నియోజకవర్గ ప్రజలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారని రాజన్న ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ అన్నారు. తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి పోలింగ్ ఏర్పాట్లను బుధవారం పరిశీలించిన ఆయన తదనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసేందుకు పొన్నం ప్రభాకర్కు ఓటేసి గెలిపించాలని ఆది శ్రీనివాస్ కోరారు. దేశానికి రాహుల్గాంధీ తప్పకుండా ప్రధానమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఏళ్లకు తీరిన ఓట్ల కష్టం
కెరమెరి(ఆసిఫాబాద్): అదో కుగ్రామం. కెరమెరి మండలానికి అతి సమీపం. ఏ కాలంలో.. ఏ సందర్భంలో ఆ గ్రామాన్ని సిర్పూర్(యూ) మండలంలో చేర్పించారో ఎవరికి తెలియదు. అనాదిగా వారు కష్టాలు అనుభవిస్తున్నారు. సమస్యల్లోనే కాదు ఓట్లు వేయడంలోనూ వారికి ఇబ్బందులే.. అదే సిర్పూర్(యూ) మండలంలోని బాబ్జిపేట్ గ్రామ పంచాయతీలోని మెట్టిగూడ గ్రామం. అక్కడ నివసిస్తున్నది గోండు తెగలు, ఆదివాసీలు. మొత్తం జనాభా 129, పురుష ఓటర్లు 31, మహిళా ఓటర్లు 38 మొత్తం కేవలం 69 మంది మాత్రమే ఉన్నారు. ఏళ్ల తర్వాత తీరిన సమస్య! ప్రతిసారి జరిగే ఎన్నికల్లో వారు ఓటు వేయాలంటే 24కిలో మీటర్ల దూరంలోని పంగిడి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓట్లు వేయకతప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన శాసన సభ ఎన్నికల్లో మాత్రం వారు 6కిలో మీటర్ల సమీపంలోని బాబ్జిపేట్ (ఖాతీగూడ) గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. దేశంలో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ నుంచి వారు ప్రతిసారి జరిగే ఎన్నికల్లో 24కిలో మీటర్ల దూరం వెళ్లి ఓటు వేయాల్సి వచ్చేది. రెండు గుట్టలు ఎక్కడం.. రాళ్లు రప్పల రహదారి. విషప్రాణులు సంచరించే అభయారణ్యం అయినా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలనే తపనతో వారు ఎంత దూరమైన కాలిబాటతో వెళ్లి ఓటు వేసేవారు. కానీ ఈసారి ఎన్నికల నిబంధన ప్రకారం రెండు కిలో మీటర్ల దూరంలో పోలింగ్స్టేషన్ ఉంటే స్వంత గ్రామంలోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయవచ్చనే నిబంధన వారి సమస్యకు చెక్ పడినట్లయింది. రికార్డుకెక్కిన ఆదివాసీ గ్రామం... తెలంగాణ రాష్ట్రంలోని అతితక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్ కేంద్రంగా మెట్టిగూడ రాష్ట్ర రికార్డుల్లో చేరింది. తమ గ్రామంలోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో అక్కడి ఆదివాసీల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇన్నాళ్లు రాళ్లు రప్పలు, వాగులు వంకలు దాటి అష్టకష్టాలు పడేవాళ్లమని కానీ అధికారులు మాపై కరుణ చూపారని వారు పేర్కొంటున్నారు. -
అంబులెన్స్లో వచ్చి ఓటు వేశారు..
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముఖేశ్ గౌడ్ అంబులెన్స్లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముఖేశ్ గౌడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఎలాగైనా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని భావించిన ముఖేశ్ గౌడ్ను కుటుంబ సభ్యులు అంబులెన్స్లో పోలింగ్ బూత్కు తరలించారు. దీంతో ఆయన అబిడ్స్ పోస్టాఫీస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ముఖేశ్ గౌడ్ని ఈ పరిస్థితుల్లో చూసిన ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొనాలని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు. -
కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
సాక్షి, కొడిమ్యాల(చొప్పదండి): లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ది ఎక్స్ట్రా ప్లేయర్ పాత్రేనని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం అన్నారు. కొడిమ్యాలలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని పదవి కోసం జరుగుతున్న లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉందన్నారు. టీఆర్ఎస్కు ఎదురుగాలి తప్పదన్నారు. కేసీఆర్ అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. బోయినపల్లి వినోద్కుమార్ తన పదవీకాలంలో ఢిల్లీకే పరిమితమయ్యారని, ప్రజాసమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. తన సొంత మెడికల్ కాలేజీ కోసం జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ను ఎంతో అభివృద్ధి చేశారని, ఈసారి ఎంపీగా గెలిపించుకోవాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ చిలివేరి నారాయణగౌడ్, మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్రెడ్డి, ఉపసర్పంచ్ గడ్డం జీవన్రెడ్డి, నాయకులు శ్రీనివాస్గౌడ్, సాయి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
పైకి ధీమా.. లోలోన భయం!
సాక్షి, జగిత్యాల: నిజామాబాద్ లోక్సభ ఎన్నికలలో గెలుపుపై అభ్యర్థులు లోలోన భయపడుతున్నా.. పైకి మాత్రం ధీమాగా కనిపిస్తున్నారు. దేశంలో ఎప్పుడూ.. ఎన్నడూ లేని విధంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడం.. అందులో అత్యధికం 178 మంది రైతులే ఉండడంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో భయం మొదలైంది. వీరి పోటీ ఎవరి ఓట్లకు ఎసరు పెడుతుందనే ఆందోళన మొదలైంది. పదిహేను రోజులపాటు ప్రచారాలతో హోరెత్తించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్నారు. స్థానిక సమస్యలైన పసుపుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధరపై చర్చ జరగాలనే ఉద్దేశంతో అత్యధిక సంఖ్యలో రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. ఏదైతే లక్ష్యంతో వారు నామినేషన్లు వేశారో.. అది దాదాపు విజయవంతంగా చేరుకున్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానం ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం రైతుల ప్రధాన డిమాండ్లు అయిన పసుపుబోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధరలపై హామీలు ఇచ్చారు. అయితే నిజామాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న రైతుల ఓట్లు ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తాయనే ఆందోళనలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో ఓట్ల చీలికపై కూడా భయం పట్టుకుంది. అందరి దృష్టి వారిపైనే.. తమ సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ బరిలో నిలవాలని పసుపు, ఎర్రజొన్న రైతులు సంకల్పించుకున్నారు. అనుకున్నట్లుగానే పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి దేశం దృష్టిని ఆకర్షించారు. రైతుల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు రావడం, ఉపసంహరించుకోకపోవడంతో ఒకదశలో ఎన్నిక వాయిదా పడుతుందని.. పేపరు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించ వచ్చనే చర్చ జరిగింది. అయితే ఎన్నికల సంఘం ఎం3 తరహా ఈవీఎంలతో ఎన్నికలను నిర్వహిస్తామని చాలెంజ్గా తీసుకుంది. దీంతో ఒకటికి బదులుగా 12 ఈవీఎంల బ్యాలెట్ యూనిట్ ద్వారా ప్రత్యేకమైన ఎన్నికలు ఇక్కడ జరుగబోతున్నాయి. ఎన్నికలకు ముందు రైతులంతా తమ ఓట్లు తమకే వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు మంగళవారం ఆర్మూర్లో రైతు ఐక్యత వేదిక ద్వారా తీర్మానించుకున్నారు. రాజకీయపార్టీల అభ్యర్థులకు కాకుండా అభ్యర్థులుగా ఉన్న రైతులకే తమ ఓట్లు వేయాలని ప్రకటించారు. వీరి నిర్ణయంతో ఎవరి ఓట్లకు గండి పడనుందోనని టెన్షన్ మొదలైంది. -
రాహుల్ ప్రధాని కావడం ఖాయం
సాక్షి, తిరుమలాయపాలెం: దేశంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి అన్నారు. బుధవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయని ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. అత్యధిక పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుందని, డబ్బు, ప్రలోభాలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతుందని, దేశంలో రాహుల్ ప్రభంజనం నడుస్తుందని భావి ప్రధాని రాహుల్ గాంధీ అని అన్నారు. ప్రజలు ప్రలోభాలకు గురికావద్దని, ఖమ్మం ఎంపీ సీటు రేణుకాచౌదరి గెలవబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పాలేరులో ఈసారి అత్యధిక మెజార్టీ సాధించబోతున్నామని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు రాధాకిషోర్, ఆర్.నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు బెల్లం శ్రీనువాస్, సంకీర్త్రెడ్డి, అరవిందరెడ్డి పాల్గొన్నారు.