breaking news
batukamma festival celebrations
-
ట్యాంక్బండ్పై 700 బతుకమ్మలతో సంబరాలు
సాక్షి,హైదరాబాద్: బతుకమ్మ వేడుకల కోసం ట్యాంక్ బండ్ ముస్తాబైంది. వందలాది మంది మహిళలు అక్కడకు చేరుకుని బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో 500 మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. అమర జ్యోతి స్థూపం నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు 700 బతుకమ్మలతో ర్యాలీ చేయనున్నారు. -
విదేశీ పూలతో వింతగా..!
తెలంగాణలోనే అత్యంత ఖరీదైన బతుకమ్మను పేర్చి కూకట్పల్లికి చెందిన పలువురు అబ్బురపరుస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన గుండాల అర్చన విదేశాల నుంచి పూలను తెప్పించి గత మూడేళ్లుగా వింతగా బతుకమ్మను పేరుస్తున్నారు. మొదట తామర పువ్వు ఆకారంలోనూ, రెండో ఏడాది హంస ఆకారంలోనూ, ఈ ఏడాది ఏనుగు బొమ్మలతో కూడిన బతుకమ్మను పేర్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈసారి బతుకమ్మ కోసం థాయిలాండ్ ఆర్చిడ్స్, సింగపూర్ రోజెస్, బ్యాంకాక్ కాచెన్స్, బెంగళూరు బెజస్, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ నుంచి జిప్సోమియా పూలను తెప్పించినట్లు చెబుతున్నారు. ఆకట్టుకున్న ‘భక్తి శక్తి’ నవరాత్రుల అర్థాన్ని బెంగళూరుకు చెందిన కూచిపూడి కళాకారులు నృత్యరూపకంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న సంగీత నృత్యోత్సవాలు– బతుకమ్మ సంబరాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు నాట్య గురువు వీణా మూర్తి విజయ్ శిష్య బృందం భక్తి శక్తి పేరిట ప్రదర్శించిన కూచిపూడి దృశ్యాంశాలు వీక్షకులను సమ్మోహన పరిచాయి. పవిత్ర జలం, రంగోలి, ధూపం, దీపం, జాజ్రాలతో వేదికను శుద్ధి చేసే నృత్యం ఆసక్తికరంగా సాగింది. అదేవిధంగా నర్తకి శ్యామక్రిష్ణ, జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నవదుర్గ తోలుబొమ్మలాట ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల, ఆర్ వినోద్ కుమార్ పలువురు కళాకారులు పాల్గొన్నారు. (చదవండి: విరామ భోగ్‘: అక్కడ నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా..!) -
కెనడాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఒట్టావా: తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ (TDF), కెనడా ఆధ్వర్యంలో బ్రాంప్టన్ నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో NRI లు కుటుంబ సమేతంగా హాజరై ఆట, పాటలతో బతుకమ్మ పండుగ ను జరుపుకున్నారు.తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్,కెనడా నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేసి, పసందైన తెలంగాణా వంటకాలతో భోజనాలు కూడా ఏర్పాటు చేసారు. కెనడాలోనే పుట్టిపెరిగిన తెలుగు పిల్లలు మన పండగల ప్రత్యేకత తెలుసుకోవటం ఇలాంటి కార్యక్రమాలతో సాధ్యమౌతుందని టీడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీఫ్ కెనడా ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ సురేందర్ పెద్ది, అమితా రెడ్డి, టీడీఫ్ కెనడా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గంటా రెడ్డి మాణిక్ రెడ్డి స్మారక విశేష సేవా పురస్కారాన్ని మహేష్ మాదాడి, రజిని దంపతులకు టీడీఫ్ కెనడా కమిటీ తరపున అందజేశారు. 21 సంవత్సరాల నుండి కెనడాలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి తోడ్పాడుతున్న ప్రతీ ఒక్కరికి టీడీఎఫ్ కెనడా కమిటీ ధన్యవాదములతో అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపింది. -
అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ప్రవాస తెలంగాణీయులు అబుదాబిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎడారి ప్రాంతమైన అబుదాబిలో పూలు దొరకడం కష్టమైన నేపథ్యంలో, సంఘ నాయకత్వం ప్రత్యేకంగా తెలంగాణ నుండి వందలాది కిలోల పూలను తెప్పించి నగరాన్ని పూల వనంగా మార్చారు. శనివారం రాత్రి ఉదయం సామూహిక బతుకమ్మ తయారీతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యు.ఏ.ఈ.లోని భారత రాయబార కార్యాలయం నుంచి శ్జార్జీ జార్జ్ (First Secretary, Community Welfare and Coordination) ముఖ్య అతిథిగా విచ్చేసి, తెలంగాణ సంస్కృతిని ప్రశంసించారు. ఆయన ప్రవాస భారతీయుల సాంస్కృతిక అంకితభావాన్ని కొనియాడుతూ, “ఇలాంటి ఉత్సవాలు భారతీయతను ప్రపంచానికి పరిచయం చేస్తాయి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ గౌరవ అధ్యక్షుడు జయచంద్రన్ నాయర్, గౌరవ ఉపాధ్యక్షుడు శ్షాజీ వి.కె., కర్ణాటక రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సర్వోత్తమ్ శెట్టి, మహారాష్ట్ర మండల్ అధ్యక్షుడు విజయ్ మానె, బీహార్ మరియు ఝార్ఖండ్ సంఘ అధ్యక్షుడు దివాకర్ ప్రసాద్, ఇండియా ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ సంఘ అధ్యక్షుడు వినాయక్ ఆవాటే, సంపంగి బ్యుటికా సంస్థల యాజమాన్యం ప్రత్యేక అతిథులుగా పాల్గొని, ప్రవాస తెలంగాణీయుల సాంస్కృతిక చైతన్యాన్ని అభినందించారు. అలాగే, తమిళ సంఘం, మలయాళి సంఘం, కన్నడ సంఘం, మరాఠీ సంఘం, గుజరాతీ సంఘం, పంజాబీ సంఘం తదితర రాష్ట్ర సంఘాల ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి, బతుకమ్మ ఉత్సవాన్ని తమ హాజరుతో మరింత వైభవవంతం చేశారు. భారతీయ సమైక్యతకు ప్రతీకగా, వారు తమ సంఘాల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ కవి, గాయకుడు డా. కోకిల నాగరాజు, యువ గాయని సోనీ యాదర్ల ప్రత్యేకంగా ఇండియా నుంచి విచ్చేసి తమ బతుకమ్మ ఆట పాటలతో అందరినీ ఉర్రూతలూగించారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలతో బతుకమ్మ ప్రాంగణం మరో తెలంగాణ ను తలపించింది. అందమైన బతుకమ్మలకు, ముందుగా వచ్చిన బతుకమ్మలకు, నాట్యం చేసిన మహిళలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఇండియా నుండి తెప్పించిన పిండి వంటలు—అరిసెలు, గారెలు, బోబట్ల వంటి వంటకాలు—అందరినీ ఆకట్టుకున్నాయి. బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం మరింత ప్రాశస్త్యం పొందుతూ అందరి మన్ననలు పొందుతున్నందుకు కార్యవర్గానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని కార్య నిర్వాహకులు రాజా శ్రీనివాస రావు, గంగారెడ్డి, వంశీ సందీప్, గోపాల్, సతీష్, పావని, అర్చన, దీప్తి, పద్మజ తదితరులు తెలియ జేశారు “విదేశాల్లో కూడా బతుకమ్మను ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం” అని నిర్వాహకులు తెలిపారు.(చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు) -
ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఆస్ట్రేలియా బ్రిస్బేన్ నగరంలోని గ్రేటర్ స్ప్రింగ్ ఫీల్డ్లో బతుకమ్మ సంబరాలను తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మలను పేర్చి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీ మాత పూజను నిర్వహించారు. ‘బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్’ ఆధ్వర్యంలో స్థానిక స్ప్రింగ్ ఫీల్డ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు, ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో మహిళలు చిన్నపిల్లలు పాల్గొని తెలంగాణ సాంప్రదాయ నృత్యాలను కనుల విందుగా ప్రదర్శించారు.కాగా, దసరా నవరాత్రులతో పాటు తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి. ఈ వేడకలు భాద్రపద బహుళ అమావాస్య– అంటే మహాలయ అమావాస్య నుంచి మొదలవుతాయి. అంటే బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి నాటితో ముగుస్తాయి. అప్పుడే ఈ బతుకమ్మ వేడుకలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ వెన్నముద్ద బతుకమ్మని ఆరాదిస్తారు. ఈ రోజున నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.;(చదవండి: మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు) -
మంచు పొరలపై బతుకమ్మ, దాండియా సంబరాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆట, పాటలతో బతుకమ్మను పూజిస్తారు. గుజరాతి, రాజస్థానీలు దుర్గాదేవిని పూజించే క్రమంలో దాండియా నృత్యాలు చేస్తారు. దసరా నవరాత్రుల సందర్భంగా కొండాపూర్ శరత్ సిటీమాల్లోని స్నో కింగ్డమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దాండియా సంబురాలను ఒకే వేదికపై చేపట్టారు. ముంచు కొండలు, మంచుతో కప్పిన ప్యాలెస్లు, బ్లాక్ సీల్స్, ఇగ్లూ, ఓక్ చెట్లు, దృవపు ఎలుగుబంట్ల సెట్ల మధ్య ఈ ఉత్సవాలను ఆదివారం ప్రారంభించారు. ఇవి 11 రోజుల పాటు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. రెండో రోజు బతుకమ్మ ప్రత్యేకత..బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక్కో విశిష్టత కలిగి ఉంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా జరుపగా, రెండో రోజు అటుకుల బతుకమ్మ నిర్వహిస్తారు. రెండో రోజు రంగు రంగుల పూలతో బతుకమ్మను తయారు చేసుకుని గౌరమ్మను తయారు చేసుకుంటారు. అందులో గౌరమ్మను పెట్టి పూజిస్తారు. ఆరోజు అమ్మవారికి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం కూడా ఉంది. అందుకే అటుకులు బతుకమ్మ అని పేరు వచ్చింది. తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మ వేడుకలు జరుపుతారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరీదేవిగా భావించి మహిళలు జరుపుకునే పండుగే ఇది. తొమ్మిది రోజులపాటు ఈ వేడుకులు జరుగుతాయి. ఒకవైపు నవరాత్రులు, మరోవైపు బతుకమ్మను ఘనంగా జరుపుకొంటారు. (చదవండి: సరదా పాటలు..దాండియా ఆటలు..!) -
బలాన్నిచ్చే బతుకమ్మ ఫలహారం
తెలంగాణ ఆడపడుచుల్లో ‘బతుకమ్మ’ పండుగ ఆరోగ్యకాంతులను వెలిగిస్తోంది. బతుకమ్మ ఆడిన తర్వాత ‘సద్ది’ పేరుతో ‘ఇచ్చిన్నమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం’ అంటూ అతివలు ఫలహారాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. వీటిలో అనేక పోషక విలువలు ఉన్నాయంటున్నారు వైద్యులు. ఆటపాటలు, మానసికోల్లాసమే కాదు.. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను ఫలహారాల రూపంలో బతుకమ్మ అందిస్తోంది. బతుకమ్మ సద్దిలో ‘ఐరన్’.. భారతీయ మహిళల్లో ఐరన్ లోపం కనిపిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రభావం పిల్లల్లోనూ ఉంటుంది. బతుకమ్మ వేడుకల్లో తయారు చేసుకునే సద్దిలో ఐరన్ శాతం అధికంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. బతుకమ్మ మానవ సంబంధాలకే పరిమితం కాకుండా అతివలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తొమ్మిదిరోజులు తొమ్మిది రకాల ఫలాహారాలను తయారు చేస్తారు. ఇందులో సత్తుపిండి, సద్ద ముద్దలు, నువ్వులు, కొబ్బరి, పల్లిపొడి లేదా ముద్దలు తదితర ఫలహారాలు ఉంటాయి. ఇవన్నీ పండుగ సమయానికి చేతికి వచ్చే చిరుధాన్యాలు.. వీటిని తింటే ఆరోగ్యకరమని పెద్దలు చెబుతున్నారు. ఒక్కో రోజు ఒక్కో తీరు పిండి వంట తయారు చేస్తుంటారు. సద్దుల్లో పోషకాలు.. బతుకమ్మ ఉత్సవాలు వస్తే అందరికీ సద్ద ముద్దలు(సజ్జ ముద్దలు) గుర్తుకొస్తాయి. ఈ పేరుతోనే పెద్దబతుకమ్మకు సద్దుల బతుకమ్మ అని పేరు వచి్చందని చెబుతారు. సందె వేళలో చేసే బతుకమ్మ కాబట్టి.. సద్దుల బతుకమ్మ అంటారని మరో చరిత్ర. సజ్జలను పిండిగా పట్టించి బెల్లం కలిపి ముద్దలు చేస్తారు. కొందరు వీటికి నెయ్యి కూడా కలుపుతారు. వీటిలో పీచు పదార్థాలు ఎక్కువ. కార్పోహైడ్రేట్స్ తక్కువ. ప్రొటీన్స్, కాల్షియం అధికంగా ఉంటాయి. త్వరగా జీర్ణం అవుతుంది. దీనికి బెల్లం కలపడంతో ఐరం శాతం పెరిగి మహిళల రుతుక్రమ సమస్యల నివారణ, గొంతు నొప్పి తగ్గిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. నువ్వుల ముద్దలు.. బతుకమ్మ పండుగలో నువ్వులు ప్రాధాన్యం అంతాఇంతా కాదు. వీటితో పొడి చేస్తారు. నువ్వుల్లో ఎమినోయాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ముఖ్యమైనవి. జింక్, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. జింక్ మెదడును చురుకుగా ఉంచుతుంది. కాల్షియం ఎమకల దృఢత్వాన్ని పెంచుతుంది. పెసర ముద్దలు.. పెసళ్లను ఉడకబెట్టి బెల్లం కలిపి ముద్దలుగా తయారు చేస్తారు. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. జీర్ణ సంబంధిత వ్యాధులనూ తగ్గిస్తాయి. కొబ్బరి పొడి... కొబ్బరిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మహిళల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. పెరుగన్నం, పులిహోర... పెరుగన్నం, పులిహోర ఇటీవల సద్దిగా ఇస్తున్నారు. పెరుగన్నంలో పల్లీలు, వివిధ రకాల ధాన్యాలు కలుపుతున్నారు. చింతపండు లేదా నిమ్మరసంతో చేసిన పులిహోర కూడా ప్రసాదంగా వాడుతున్నారు. దేశంలో దాదాపు 6 వేల ఏళ్లుగా పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా.. పంటల్లో ముఖ్యమైన దినుసుగా వాడుతున్నారు. చిన్న గాయాల నుంచి క్యాన్సర్ వరకు పసుపు విరుగుడుగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. చింతపండు గుజ్జులో విటమిన్ ‘సి’ అత్యధికంగా ఉంటుంది. పెరుగులో పోషక విలువలు మెండు. అన్నం కలిపి కమ్మనైన నైవేద్యాన్ని సమరి్పస్తారు. ఇందులో ప్రొటీన్, కాల్షియం, రిబోప్లా విటమిన్, విటమిన్ బి –6, బి12, వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే పెరుగులో లాక్తో బసిల్లె అధికంగా ఉంటుంది. అపెండిసైటీస్, డయేరియా, డిసెంట్రీ వంటి వ్యాధులకు కారణమయ్యే బాక్టీరియాను లాక్టిక్ యాసిడ్ నాశనం చేస్తుంది. పెరుగులో ఉండే విటమిన్ నిరోధక శక్తిని పెంచుతుంది. పల్లిపిండి.. పల్లిపిండి శరీర ఎదుగుదలలో అత్యంత ప్రధానమైనది. అధిక ప్రొటీన్లతోపాటు రుచికరంగా ఉంటాయి. చాలామంది ఇష్టంగా తింటారు. దీనికి బెల్లం జోడించడంతో పోషకాలూ లభిస్తాయి.పోషకాలు పుష్కలం బతుకమ్మ పండుగకు తయారు చేసే సత్తుపిండిలో వ్యాధి నిరోధక శక్తి పెంచే పోషకాలు ఉంటాయి. రుచికరంగా ఉండే సత్తుపిండి పిల్లలకు ప్రొటీన్స్ అందిస్తాయి. కండరాల పటిష్టత, ఎముకల గట్టితనం, పిల్లల ఎదుగుదల.. ఇలా అనేక ఉపయోగాలున్నాయి. సంప్రదాయ పిండివంటలను ప్రతీఒక్కరు తినాలి. బతుకమ్మ ఆరోగ్యాన్ని పంచే ప్రత్యేకమైన పండుగ. – దండె రాజు, ఆర్ఎంవో, గోదావరిఖని జీజీహెచ్ -
వాడవాడలా పూలగోపురాల హడావిడి
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ.. గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ.. గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ.. ఆట చిలుకలార గౌరమ్మ.. పాట చిలుకలార గౌరమ్మ.. అంటూ సాంస్కృతిక నగరమైన హైదరాబాద్లో బతుకమ్మ ఉత్సవాల సందడి మొదలైంది.. నేటి (ఆదివారం) నుంచి.. తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేందుకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. వాడవాడలా పూల గోపురాల హడావుడి మొదలైంది. పలు ప్రాంతాల్లోని ప్రాంగణాల్లో పండుగ సంబరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.. విద్యుత్ దీపాల వెలుగులతో ప్రత్యేక అలంకరణ చేసింది..ప్రధాన కూడళ్లు మొదలు.. చెరువులు, కుంటలు ఉత్సవాలకు వేదికలు కానున్నాయి.. పూలపండుగకు మహానగరం సన్నద్ధమైంది. బతుకమ్మ ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించేందుకు ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ట్యాంక్ బండ్, నెక్లెస్రోడ్డు తదితర ప్రాంతాల్లోనూ విద్యుత్ వెలుగులతో ప్రత్యేక అలంకరణలు చేశారు. ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించారు. సాధారణ మహిళల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకూ అన్ని వర్గాల వారూ వేడుకల్లో భాగస్వాములయ్యే విధంగా ఏర్పాట్లు చేపట్టింది. గ్లోబల్సిటీగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన హైదరాబాద్ సాంస్కృతిక నగరంగా కూగా ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగి ఉంది. నిజాం కాలం నుంచే నగరంలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. వైవిధ్యభరితమైన సంస్కృతుల పాదులాంటి భాగ్యనగరంలో శతాబ్దాల క్రితమే అందమైన బంతిపూల బతుకమ్మలు, నూటొక్కతీరు పూల బతుకమ్మలు కొలువుదీరాయి. అప్పట్లో ప్రతి సంవత్సరం స్వచ్ఛంగా, నిండుగా ప్రవహించే మూసీనది ఒడ్డున ఎంగిలిపూల బతుకమ్మలు మొదలుకొని సద్దుల బతుకమ్మల వరకూ తొమ్మిది రోజుల పాటు మహిళలు వేడుకలను నిర్వహించేవారు. దీంతో మూసీనది పరీవాహక ప్రాంతమంతా నిలువెత్తు శతాబ్దాల చరిత్ర..ఇంద్రధనస్సు నేలపై పరుచుకున్నట్లు అందంగా తళుకులీనుతూ కనువిందు చేసేది. వందలాది చెరువులు, కుంటలతో, అందమైన ఉద్యానవనాలతో కూడిన భాగ్యనగరానికి బతుకమ్మ పండుగ మొదటి నుంచి బంగారు కాంతులద్దింది. కుతుబ్షాహీల కాలం నుంచే హైదరాబాద్లో ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగ చేసుకున్నారు. అప్పటి రాజు ఇబ్రహీం కులీకుతుబ్షాను పొగుడుతూ మహిళలు పాడుకున్న బతుకమ్మ పాటలే ఇందుకు నిదర్శనమని ఇంటాక్ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డి తెలిపారు. ఆ తరువాత నిజాం కాలం నాటికి బతుకమ్మ పండుగ మరింత వైభవోపేతంగా జరిగింది. ప్రకృతి ఉత్సవం.. పెత్తరమవాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ ఆఖరు రోజు నవమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, ముత్యాలపూలు, కట్ల పువ్వులు, తీగెమల్లె పువ్వులు, డిసెంబరాలు వంటి పూలతో అమ్మాయిలు బతుకమ్మలను పేర్చుతారు. ఇంట్లో అమ్మాయిల వయసుకు తగిన విధంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బతుకమ్మ ఎత్తు పెంచుకోవడం, తమ స్థాయికి తగిన విధంగా పెద్ద పెద్ద బతుకమ్మలను అలంకరించుకొనే సంప్రదాయం నగరంలో బలంగానే ఉంది. కూకట్పల్లి, మియాపూర్, తదితర చోట్ల ఏటా బాహుబలి బతుకమ్మలను ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ సారి ఎల్బీస్టేడియంలోనూ అతిపెద్ద బతుకమ్మను అలంకరించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేపట్టింది. సద్దుల సమర్పణ.. సజ్జ, మొక్కజొన్న, జొన్న వంటి తృణధాన్యాలు, బెల్లంతో మలీద ముద్దలు చేసి సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మకు సద్దులు సమరి్పస్తారు. బతుకమ్మ పండుగ రోజున పసుపుతో చేసిన గౌరమ్మను పూలమధ్యలో అలంకరించి పూజిస్తారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాస దీక్షలో మహిళలు బతుకమ్మ పండుగ అనంతరం తాము తెచ్చిన సద్దులు ఆరగించి దీక్ష విరమిస్తారు. నిలువెత్తు పూలగోపురాల్లా, ఎత్తయిన పూల శిఖరాల్లా రంగురంగుల పూలతో ఎంతో అద్భుతంగా కనిపించే బతుకమ్మ ఇక్కడి ప్రజలకు ఆరాధ్యం. ‘బతుకమ్మ’ అంటే బతుకును ఇచ్చే తల్లి అని అర్థం. ఆ మాటకొస్తే కాకతీయుల కాలంలో పోరుభూమిలో ఉన్న రాణి రుద్రమ దేవిపై శతృవు కత్తి దూసినప్పుడు ఓ మహిళ అడ్డంగా వెళ్లి ఆమె ప్రాణాలు కాపాడి బతుకునిచి్చందనే అభిప్రాయం బలంగా ఉంది. ఇలా అనేక శతాబ్దాలుగా తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలకు హైదరాబాద్ నగరం ఆది నుంచి వేదికగా నిలిచింది. మూసీనది ఒడ్డున.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ మహిళలు పాడుకునే పాటలతో తొమ్మిది రోజుల పాటు నగరంలో సందడి కనిపించేది. ఈ వేడుకలకు నిజాం నవాబులు తగినవిధంగా ఏర్పాట్లు చేసేవారు. పండుగ సందర్భంగా చెరువులు, కుంటల వద్ద, మూసీనది ఒడ్డున మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకొనేవారు. మహబూబ్ అలీఖాన్ కాలంలో హిందువుల పండుగలకు అనూహ్యమైన ఆదరణ, ప్రాచుర్యం లభించాయి. మూసీనది వరదలు పోటెత్తి నగరాన్ని అతలాకుతలం చేసినప్పుడు, ఎంతోమంది ఆ వరదల్లో విగత జీవులయ్యారు. ఆ విషాదాన్ని గుర్తు చేసుకుంటూ మహిళలు బతుకమ్మ పాటలు పాడారు. ‘తళతళ మెరుపులు మెరవంగా ఉయ్యాలో, పెళపెళ పిడుగులు రాలంగా ఉయ్యాలో, కురిసింది వాన ఉయ్యాలో.. పట్నంబులోన ఉయ్యాలో.. పొంగిందీ మూసీ ఉయ్యాలో.. మునిగిందీ ఊరు ఉయ్యాలో..’ అంటూ ఆ నాటి విషాదాన్ని పాటల రూపంలో పాడుకున్నారు. (చదవండి: బతుకమ్మ సంబరాలకు సర్వం సిద్ధం: ఉత్సవాల షెడ్యూల్ ఇదే!) -
ఐర్లాండ్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఐర్లాండ్లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) బతుకమ్మ వేడుకలను గణంగా నిర్వహించారు . డబ్లిన్ నగరంలో 30 మంది వాలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా ఈ బతుకమ్మ వేడుకలని వాలంటీర్లు మరియు దాతల సహాయంతో ఉచితంగా నిర్వహిస్తున్నారు. సుమారు ముప్పై మంది వాలంటీర్లు మరియు నలభై మంది దాతలు ముందుకొచ్చి బతుకమ్మ వేడుకలు జరుపుటకు ప్రతి సంవత్సరం సహాయ సహకారాలు అందిస్తున్నారు.ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు 900 మంది హాజరయ్యారు. ఈ వేడుకలో అమ్మాయిలు బతుకమ్మ, కోలాటం, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ మరియు దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో Telanganites Of Ireland వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లలకు మేజిక్ షో ఏర్పాటు చేశారు. బతుకమ్మను పేర్చి తీసుకువచ్చిన ఆడపడుచులకు బహుమతి ప్రధానం చేశారు. వచ్చిన అతిధులకు ప్రసాదం, సాయంత్రం తేనీరు, స్నాక్స్, రాత్రి రుచికరమైన వంటలు వడ్డించారు. ఈ బతుకమ్మ సంబరాలు జరుపుటకు మాకు సహకరించిన వాలంటీర్లు, దాతలు సిల్వెని శ్రీనివాస్, ప్రభోద్ మేకల, కోలన్ కమలాకర్ రెడ్డి, జగన్ మేకల, సాగర్ సిద్ధం, నవీన్ గడ్డం, ప్రదీప్ రెడ్డి యాలుక, షరీష్ బెల్లంకొండ, రమణ రెడ్డి యానాల, శ్రీనివాస్ అల్లే, వెంకట్ తిరుకోవలురు, సుమంత్ చావా, ప్రవీణ్లాల్, రామకృష్ణ కాటేపల్లి, రాజా రెడ్డి, బాచి రెడ్డి, నగేష్ పొల్లూరు, శశిధర్ మర్రి, శ్రీధర్ రాపర్తి, రవి కిరణ్ కుంచనపల్లి, బలరాం కొక్కుల, సునీల్ పాక, శంకర్ బెల్లంకొండ, వెంకట్ జూలూరి, శ్రీనివాస్ కార్ఫె, శ్రీనివాస్ అల్లంపల్లి, పటేల్ శ్రీనివాస్, శ్రీనివాస్ వెచ్చ, దయాకర్ కొమురెల్లి, సంతోష్ పల్లె, శ్రీధర్ యమసాని, నరేందర్ గూడ, సంపత్ రాజ్, భాను సామ, భాను ప్రకాష్ నడుకుడ, భాను బొబ్బల, కృష్ణ మోహన్ రెడ్డి, గోపి కల్లూరి, అరవింద్ కరింగుల, ఓం ప్రకాష్, రామ బొల్లగొని, రాకేష్ ఆకుల, విజేయేందర్ సంతపూరు, మధు పోలం, మహేష్ అలిమెల్ల, కళ్యాణ్ కుసుమ, వినోద్ నీలం, శంకర్ కురుగుంట్ల, లింగమూర్తి, ప్రకాష్ గుండవేని, అరుణ్ కథేరీ, సంతోష్ పారేపల్లి, శ్రీధర్ మేడిశెట్టి, వెంకట్ మంచుకొండ, సాయినాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కొసనం, వెంకట్ రామిడి, సురేష్ వసుకుల, విద్యనాథ్ మాదారపు, ఉపేందర్ గార్లపాటి, అనిల్ దుగ్యాల, వీరకుమార్ తిక్క, ప్రకాష్ గందె, రవికాంత్ దూలం, త్రినేష్ అందుర్తి, భువనేశ్వర్ రెడ్డి, సంకీర్త్ రెడ్డి .(చదవండి: యూకేలో రీడింగ్లో బతుకమ్మ వేడుకలు ఘనం) -
యూకేలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
యూకేలోని రీడింగ్లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. రీడింగ్ జాతర బృందం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వేడుకలకు సుమారు వెయ్యి మంది హాజరైనట్లు అధ్యక్షులు విశ్వేశ్వర మంథని, ఉపాధ్యక్షులు ప్రసాద్ అవధానుల తెలిపారు. ఈ వేడుకను రంజిత్, రమేష్, రఘు, చైతన్య, నటరాజ్, చందు, ప్రవీణ్, రామ్రెడ్డి, శ్రీనివాస్ నేతృత్వంలోని కోర్ టీమ్ ఎంతో శ్రద్ధగా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు సంప్రదాయ దుస్తులు ధరించి ఆడిన బతుకమ్మ, దాండియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అందరూ భక్తిశ్రద్ధలతో అష్టలక్ష్మీ పూజలు చేసుకున్నారు. ఈ వేడుకలో ప్రముఖ గాయని కారుణ్య సంప్రదాయ బతుకమ్మ పాటలతో మరింత ఉత్సాహాన్ని నింపి అలరించారు ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి వలంటీర్లు తెలంగాణ ప్రత్యేక వంటకాలు వడ్డించారు, విందులో మామిడి లస్సీ కూడా అందజేయడం అందరినీ ఆకట్టుకుంది.ఈ వేడుకలు ప్రవాసులకు వారి జన్మస్థలంలోని సంప్రదాయాలను గుర్తుచేయడమే గాక సాంస్కృతిక ఐక్యతను పెంపొందిస్తాయని నిర్వాహకులు అన్నారు. ఈ వేడుకలో పాల్గొన్నవారు 360 ఫోటో బూత్ను ఉపయోగించి బతుకమ్మతో ఫోటోలు దిగి ఆనందాన్ని పంచుకున్నారు. తర్వాత దుర్గా దేవికి ఆరతితో కార్యక్రమం ముగుస్తుంది. సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుకలో ఉన్నతమైన సాంస్కృతిక వైభవం, భక్తి మరియు ఆనందాన్ని ప్రతిబింబించింది.(చదవండి: కెనడాలో ఘనంగా బతుకమ్మ పండగ సంబరాలు) -
బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా..
ఇవాళ సద్దుల బతుకమ్మ. తెలంగాణ అంతటా స్త్రీలు పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో గౌరమ్మను కొలుస్తారు. ఈ సందర్భంగా స్థానిక సంస్కృతిలో బతుకమ్మ విశిష్ఠతను వివరిస్తున్నారు ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు జయధీర్ తిరుమలరావు.ఆదివాసీ సంస్కృతులలో అమ్మతల్లి ఆరాధన గురించి..?ఆదివాసీ సంస్కృతిలో, వారి జీవితంలో స్త్రీ దేవతారాధన విడదీయరానిది. ఆదివాసీలలోనే కాదు శ్రామిక జీవితంలో, జానపద సమాజంలో అమ్మదేవతలు విశిష్ట స్థానంలో ఉంటారు. ఆదిమ కాలంలో వ్యవసాయానికి స్త్రీలే పునాది వేశారు. బీజం, క్షేత్రం స్త్రీ అనుభవం. పునరుత్పత్తి భావనకి స్త్రీ ఆలంబన. విత్తనాలు నాటడం, కలుపు తీయడం, కోత కోయడం అంతా స్త్రీలే. పొలంలో పంట తీయడం, గర్భంలో శిశువుని మోయడం రెండూ స్త్రీల వంతే. అంతేకాదు, దానికి కావలసిన భాషని సృజించుకున్నదీ స్రీయే. భాషని సాహిత్యీకరించినదీ వారే. అనేక రకాల పాటలు పాడటం, పూజకు కావల్సిన కర్మకాండని తీర్చిదిద్దినదీ వారే. ఆ విధంగా స్త్రీ అనేక రంగాలలో, అనేక రూపాలతో తన శక్తి సామర్థ్యాలను వ్యక్తం చేసింది. మహత్తులను చూపి అమ్మదేవతారాధనకి ఆలంబన అయ్యింది. ఒక్కో అంశానికి ఒక్కో దేవతని ఏర్పరుచుకుని ఆయా రుతువులలో, పంటల కాలంలో దేవతారాధన చేశారు. ఆయా దేవతలను జ్ఞాపకం చేసుకోవడం, పూజించడం, రాబోయే తరాలకు వారిని జ్ఞాపకం చేయడం జరుగుతోంది. మాతృస్వామ్య వ్యవస్థ ప్రాధాన్యత అమ్మతల్లి ఆరాధనకు పట్టుగొమ్మ. అందులో భాగమే బతుకమ్మ. జన్మనిచ్చి, బతకడానికి అన్ని రకాలుగా చేయూతనిచ్చే ఆరాధన ఉంది. ప్రస్తుత కాలంలో ఆదివాసుల సమ్మక్క సారలమ్మలు, మైదాన ప్రాంతాల బతుకమ్మ పండగలు రోజు రోజుకూ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ పరంపరను ఎలా అర్థం చేసుకోవాలి?బతుకమ్మ పండగ ప్రధానంగా తెలంగాణ స్త్రీల పండగ. దీనినే పూల పండగ అంటారు. ఎలాంటి బలి తంతు లేకుండా జరిగే క్రతువు. ఆ రోజు శాకాహారమే. బతుకమ్మలో ఆహారం, నృత్యం, పాట, సంగీతం అన్నీ సమపాళ్లల్లో కలగలసి ఉంటాయి. చాలారకాల ఆదివాసుల నృత్యాలు వర్తులాకార నృత్యాలే. పాల్గొనే స్త్రీలు అందరూ గుండ్రంగా చేరతారు. గుండ్రంగా కదులుతూ వంగుతూ, లేస్తూ, చప్పట్లు కొడుతూ చక్కని సంగీతాన్ని సృష్టిస్తారు. వారు తమ శరీర లయకు అనుగుణంగా పాటల్ని పాడతారు. ఒకరు ప్రధాన గాయనిగా పాటని అందుకుంటే మిగతావారు సామూహికంగా లయాత్మకంగా పాడతారు. బొడ్డెమ్మ, బతుకమ్మ వంటి ఆటపాటలలో, పండగలో స్త్రీలదే ప్రధాన పాత్ర. ఈ పండగలో స్త్రీలు అందరూ సమానమే. పాటల రాగం చేతులతో చప్పట్లు మోగించే శైలిలో పాడబడుతుంది. ఇదే విధానం తెలంగాణ అంతటా కనిపించడం విశేషం. ప్రతిరోజు కొత్త ధాన్యంతో రకరకాల పిండివంటలు చేసి అందరూ కలిసి పంచుకుని భుజించడం ఆనవాయితి. ఇక్కడ కులాల, అంతస్తుల ప్రమేయం కనిపించదు. కాని మారిన కాలంలో కులాలవారీగా కట్టుకున్న అపార్టమెంట్ల మాదిరిగా అక్కడక్కడా కులభావన కనిపించడం మరీ ఆధునికం. కాని బతుకమ్మ పండగలో స్త్రీల సంప్రదాయ బలం లోతు చాలా ఎక్కువ. అందుకే దేశంలోని వేరే రాష్ట్రాలలో జరిగే పూల పండగల కన్నా ఎంతో విలక్షణంగా, ప్రత్యేకంగా నేటికీ జరుగుతున్నది. ఈ పరంపర తెలంగాణకి ప్రత్యేకం. సుమారు వేయి సంవత్సరాల చరిత్ర దీనికి ఉందని చెప్పవచ్చు. పండగ సందర్భంగా సోదరిని పుట్టింటికి తీసుకురావడం అనే ఆచారం కూడా కొనసాగడం గమనించాలి. బతుకమ్మ ఆంధ్ర, రాయలసీమలో ఎందుకు కానరాదు?నిజానికి పూల పండగ మనదేశంలో కేరళ రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్ర్రాలలో జరుపుతారు. విదేశాలలో కూడా జరుపుతారు. అంటే పూలను ప్రేమించడం, సేకరించడం, ఊరేగించడం, తలమీద ఎత్తుకుని తీసుకు΄ోవడం అనే ఆచారం ఉంది. కానీ తెలంగాణాలో జరిగే రీతి రివాజు మరెక్కడా కనపడదు. బతుకమ్మ పండగ విధానం కాదు. అది స్వభావం. దాని లక్ష్యం కుటుంబ అభివృద్ధి. స్త్రీని అత్తవారింటికి పంపి ఊర్కోవడం కాదు. పెళ్లి తదితర ఫంక్షన్లకి రావడం కాదు. హక్కుగా తల్లిగారింటికి వచ్చి పూలతో ఇంటిని వెలిగించడం ముఖ్యం. అన్న లేదా తమ్ముడు సోదరిని తోలుకుని వచ్చి గౌరవించడం, కట్నకానుకలను పెట్టడం తప్పనిసరి. ఇలాంటి సంప్రదాయాలు వేరే చోట్ల బలంగా కనబడవు. కాని పూలను పేర్చి పండగ చేయడం కృష్ణానది కింద చూశాను. ప్రకృతి ఆరాధన కూడా ఈ పండగలో ఒక ముఖ్య భాగం. నిండిన చెరువుల దగ్గర, కుంటల దగ్గర, జలాశయాల దగ్గర ఆట ఆడి ఆ నీటిలోనే పూలను కలుపుతారు. ఏ జలం ఆధారంగా పూసిన పువ్వులు ఆ జలానికే అంకితం కావడం ఒక గొప్ప తాత్వికత. ఇక్కడ ఆడపిల్లలు బొడ్డెమ్మలు ఆడతారు. ఆంధ్రాప్రాంతంలో గొబ్బెమ్మలు ఆడతారు. తెలంగాణ గ్రామీణంలో దసరా ప్రత్యేకత ఏమిటి?దసరా మంచికి, చెడుకి మధ్య జరిగిన యుద్ధం. జమ్మిచెట్టు చిన్నదే. కాని పాండవులు తమ ఆయుధాలు దానిపై దాచి ఉంచారు. కాబట్టి జమ్మి ఆకుని ‘బంగారం’ అంటారు. ఆ ఆకుని ఇచ్చిపుచ్చుకుని అలాయి బలాయి తీసుకుంటారు. అదేరోజు సాయంకాలం చాలా చోట్ల రావణుడి బొమ్మని తయారుచేసి, దానిని కొలుస్తారు. అలా కాకుండా చాలా ఆదివాసీ ప్రాంతాలలో సమూహాలలో రావణుడిని పూజిస్తారు. అక్కడ మనలా దసరా పండగ జరపరు. తెలంగాణలో దసరా పండగ రోజున మద్యం, మాంసం తప్పనిసరి. బంధువులు, స్నేహితులతో కలిసి పేదలు సైతం పండగని ఘనంగా జరుపుకుంటారు. కుల భావన లేకుండా ఆలింగనం చేసుకుంటారు. కొన్ని తావులలో వైషమ్యాలు మరిచి కలసిపోతారు. బతుకమ్మ పండగకి ఇంటికి సోదరి వస్తుంది. దసరాకి అల్లుణ్ణి పిలుచుకుంటారు. లేదా సోదరిని దసరాకి అత్తగారింటికి పంపిస్తారు. ఆ విధంగా తెలంగాణ లో దసరా అతి పెద్ద పండగ. ఈ రెండు పండగలు ఒకే రుతువులో ఒకే వారంలో, ఒకదాని తరువాత మరొకటి జరగడం గమనించాలి. బతుకమ్మ స్త్రీల పండగ. దసరా ఒక రకంగా పురుష ప్రధానమైన పండగ. (చదవండి: పూల పండుగ..తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ.. ) -
జర్మనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ 11వ బతుకమ్మ కార్యక్రమాన్ని బెర్లిన్లోని గణేష్ ఆలయంలో నిర్వహించింది. ఈ సందర్భంగా, బెర్లిన్లోని భారత రాయబార కార్యాలయం నుంచి మంత్రి (పర్సనల్) డాక్టర్ మన్దీప్ సింగ్ తులి, అతని కుటుంబ సభ్యులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ తులి సంప్రదాయానికి గౌరవ సూచకంగా బతుకమ్మను తలపై ఎత్తుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్, డాక్టర్ రఘు చలిగంటి, రుచికరమైన తెలంగాణ ఆహారాన్ని తయారు చేసిన వాలంటీర్లకు, ముఖ్యంగా వంట టీమ్, క్లీనింగ్ అండ్ డెకరేషన్ టీమ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీఏజీ కార్యవర్గానికి చెందిన రామ్ బోయినపల్లి, శరత్ రెడ్డి కమ్డి, నటేష్ చెట్టి గౌడ్ యోగానంద్ నాంపల్లి, బాల్రాజ్ అందె, శ్రీనాథ్ రమణి, అమూల్య పోతుమంచి, అవినాష్ రాజు పోతుమంచి, స్వేచ్ఛా రెడ్డి బీరెడ్డి, వేణుగోపాల్రెడ్డి బీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో పూజ చేసినందుకు ప్రశాంత్ గోలీకి, ఫోటోలు తీసినందుకు నిదాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: కెనడాలో ఘనంగా బతుకమ్మ పండగ సంబరాలు) -
పూల పండుగ..తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా చేసుకునే పండుగే ఈ బతుకమ్మ. ఆడబిడ్డలంతా ఆట, పాటలతో జానపద గేయాలతో హుషారు తెప్పించే సంప్రదాయ పండుగ. చూస్తుండగానే ఎనిమిదిరోజుల వేడుకలు ముగిసి..తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా గౌరమ్మని కొలుస్తారు. ఈ రోజు అత్యంత పెద్దదిగా బతుకమ్మను తయారు చేసి ఆట పాటలతో సందడి చేస్తారు. ఈ చివరి రోజు వేడుకను ఊరు, వాడ దద్దరిల్లేలా పండుగను ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. సద్దుల బతుకమ్మ రోజున ఎన్ని రకాల పూలు దొరికితే, అన్ని రకాల పూలు అమర్చుకుని ఎత్తైన బతుకమ్మను తయారుచేస్తారు.ఈరోజు బతుకమ్మను నిమజ్జంన చేసిన అనంతరం.. పెరుగన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడి, పులిహోర, ఇలా పలు రకాల నైవేద్యాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. సద్దుల బతుకమ్మతో తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.(చదవండి: దుర్గాపూజను శక్తిమంతంగా మార్చిన క్రెడిట్ ఆ సమరయోధుడికే దక్కుతుంది..!) -
కెనడాలో ఘనంగా బతుకమ్మ పండగ సంబరాలు
కెనడా ప్రముఖ నగరం టొరంటోలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ స్థిరపడిన వందలాది మంది తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరై బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) కెనడా నేతృత్వంలో పనిచేసే తంగేడు సాంస్కృతిక సంస్థ ఈ వేడుకలను నిర్వహించింది.పుట్టి పెరిగిన తెలంగాణ నేలకు వేల మైళ్ల దూరంలో ఉన్నా, తమ సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించాలని, కెనడాలో పుట్టిన పిల్లలకు పండగల ప్రాధాన్యతలను తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ప్రతీ యేటా బతుకమ్మతో సహా బోనాలు, ఇతర పండగలను నిర్వహిస్తున్నామని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ తెలిపింది.ప్రకృతి, పర్యావరణంతో అలరారే కెనడాలో లభించే రంగురంగుల పూలతో పేర్చన బతుకమ్మలు పండగ సంబరాలకు మరింత వన్నె తెచ్చాయి. టొరంటోలో బ్రాంప్టన్ వేదికగా విశాలమైన సెకండరీ స్కూల్ ఈ వేడుకలకు వేదిక అయింది. సుష్మ సాయి, అమితా రెడ్డిలు సమన్యయం చేసి పెద్ద సంఖ్యలో మహిళలు కుటుంబాలతో సహా పాల్గొనేలా చేశారు.పండగలో పాల్గొన్న అందరికీ కమిటీ పసందైన తెలంగాణ వంటలతో విందును ఏర్పాటు చేసింది. కెనడాలో స్థిరపడినా తమ మూలాలు, అస్థిత్వం కొనసాగించాలనే ఉద్దేశ్యంతో గత ఇరవై ఏళ్లుగా తెలంగాణ ఉత్సవాలను, బతుకమ్మ పండగను ప్రతీ యేటా నిర్వహిస్తున్నామని టీడీఎఫ్ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ సురేందర్ పెద్ది అన్నారు. పండగ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ టీడీఎఫ్ (కెనడా) ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీకాంత్ నేరవేట్ల, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ ధర్మపురి, వెంకట రమణా రెడ్డి మేద, తదితరులు పాల్గొన్నారు.(చదవండి: చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో దుర్గా పూజ..!) -
పూల పండుగ..ఏడోరోజు వేపకాయల బతుకమ్మ..
తెలంగాణలో అమ్మవారిని పుష్పాలతో బతుకమ్మలా తయారు చేసుకుని ఆరాధిస్తారు. ఇది ప్రకృతి ఆరాధనకు చిహ్నంగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టేలా సాగే పండుగ బతుకమ్మ. ఈ వేడుకలు ఏడో రోజుకి చేరుకున్నాయి. ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతరాలు పేర్చి ఆటపాటలతో సంబరంగా జరుపుకుంటారు. నిన్న అలిగిన బతుకమ్మతో మూగబోయిన ప్రతి ఇల్లు ఇవాళ పూల జాతరలా సందడిగా ఉంటుంది.ఈ బతుకమ్మకు బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లు ఆకారంగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వాటినే పేరంటాళ్లు వాయనంగా ఇచ్చుకుంటారు. లేదా పప్పు, బెల్లంలను కూడా బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. తమ కష్టాలన్నీ తొలగిపోయి జీవితాలు పూల మకరందం వలె సుమనోహరంగా సాగిపోవాలని ప్రార్థిస్తారు.(చదవండి: బతుకమ్మ దశ దిశలా చాటే సంస్కృతి) -
కాన్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కాన్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. దాదాపు 1500 మంది తెలుగు వారు వచ్చిన ఈ సంబరాలు చాలా ఉత్సాహంగా జరిగాయి. ఎంతో మంది చక్కగా బతుకమ్మ లను చేసుకొని వచ్చి, మొదటి నుంచి చివరి వరకు తెలంగాణ జానపద పాటలకు, బతుకమ్మ పాటలకు ఆడి, పాడి ఆనందించారు. దేవాలయ పూజారి నిర్వహించిన అమ్మ వారి పూజ తో సంబరాలు ఆరంభం అయ్యాయి. పెద్ద వాళ్ళే కాకుండా, చిన్నపిల్లలు, యువతులు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు నృత్యం చేశారు. బతుకమ్మలు తెచ్చిన వారికి రాఫెల్ టికెట్స్ ఇచ్చి మధ్య మధ్యలో రాఫెల్స్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. బతుకమ్మలన్నింటిలో మంచిగా చేసిన 8 బతుకమ్మలకు బహుమతులు ఇచ్చారు.చివరన బతుకమ్మలను నిమజ్జనం చేసి అందరూ ఒక కుటుంబం వలె ప్రసాదం పంచుకొని సంబరాలని ముగించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన సంఘం కార్యవర్గ సభ్యులకి, స్పాన్సర్కి సంఘం అధ్యక్షుడు యక్కలి చంద్ర, ట్రస్ట్ ఛైర్ శివ తియగూర ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: అమెరికా వర్జీనియా నగరంలో వైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు!) -
అమెరికాలో బతుకమ్మ సంబరాలు..!
తెలంగాణ సంస్కృతికి చిహ్నహైన బతుకమ్మ సంబరాలు దేశ విదేశాల్లోనూ అంబరాన్నంటేలా ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడున్న వారి సంస్కృతి, నేపథ్యం మరువమని చెప్పేలా అంతా ఒకచోట చేరి పండుగలు చేసుకోవడం విశేషం. అమెరికాలో నార్త్ కరోలినా కాంకార్డ్ కానన్ రన్ ప్రన్థమ్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో ... బతుకమ్మ పాటలతో తెలంగాణ సంప్రదాయం మురుసింది.. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో తళుక్కుమనారు. (చదవండి: అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు) -
పూల పండుగ..ఆరో రోజు అలిగిన బతుకమ్మ..
తెలంగాణ ప్రకృతి పండుగ అయిన బతుకమ్మ సంబరాలు ఆరో రోజుకి చేరుకున్నాయి. ఆరో రోజు బతుకమ్మ అత్యంత స్పెషల్. ఎందుకంటే పేరుకి తగిన విధంగా ఆరోజు ఆరాధన విలక్షణంగా ఉంటుంది. మరీ ఇంతకీ ఈ రోజు ఏం చేస్తారంటే..ఆ రోజు ఎవరూ బతుకమ్మను ఆడరు. అంటే.. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. దేవి భాగవతంలో అమ్మవారి మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాలలో రాక్షస సంహారం చేశారు. బండాసురుడు ని, చండ ముండల్ని సంహరించిన తర్వాత రాక్షస సంహారం చేసిన అమ్మవారు బాగా అలసిపోయారు. ఆరోజు ఆమెకు విశ్రాంతి ఇవ్వాలని భావించి మహిళలు ఆరో రోజు బతుకమ్మను పేర్చరు. ఎవరు బతుకమ్మను ఆడరు. దీనినే అర్రెం అని, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. ఆరోజు అలిగిన బతుకమ్మ వల్ల ఎవరు వేడుకలు జరపరు.మళ్లీ ఏడవ రోజు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు.మరొక కథనం ప్రకారం..దేవీభాగవతంలో మహాకాళి, మహాసరస్వతితో పాటు మహాలక్ష్మి రూపాలలో అమ్మవారు రాక్షసుల్ని సంహరించడంతో అమ్మవార్లు బాగా అలసిపోయారట. అందుకే అమ్మకి విశ్రాంతి కల్పించాలన్న ఉద్దేశంతోనే భక్తులు బతుకమ్మను ఒకరోజు వాయిదా వేసినట్టు చెబుతున్నారు. మరుసటి రోజు నుంచి యథావిధిగా బతుకమ్మలు పేర్చి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అలానే ఎప్పటిలానే అమ్మవారికి పలు నైవేద్యాలు సమర్పిస్తారు.నైవేద్యం: స్త్రీలంతా ఉపవాసం ఉండి ఆమె అలక తీరాలని ప్రార్థిస్తారు. పైగా ఈ రోజు అమ్మవారు అలకతో ఉండటం వల్ల బతుకమ్మకు ఎలాంటి నైవేద్యం సమర్పించరు.(చదవండి: శరన్నవరాత్రులు..ఐదోరోజు మహాచండీ అలంకారం..!) -
ఉజ్జీవన్ బ్యాంకు రంగురంగుల పూలతో అతిపెద్ద బతుకమ్మ..!
దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని, తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన ప్రకృతి పండుగకు నివాళులర్పిస్తూ పెద్ద ఇండోర్ బతుకమ్మను ఏర్పాటు చేసింది ఉజ్జీవన్ బ్యాంక్. హైదరాబాద్లోని పంజాగుట్టలో వున్న గలేరియా మాల్లో ఈ అతిపెద్ద బతుకమ్మను ఏర్పాటు చేసింది. సుమారు 14 అడుగులు మేర ఎత్తు వరకు అద్భుతమైన బతుకమ్మను ఏర్పాటు చేశారు. రంగురంగుల పూల ప్రదర్శనతో ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సామాజికి స్ఫూర్తిని మా బ్యాంకు గౌరవిస్తుందని సదరు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ బతుకమ్మ వద్ద ఉజ్జీవన్ సెల్ఫీ స్టేషన్లతో సహా ఇంటరాక్టివ్ బూత్లను కూడా ఏర్పాటు చేశామని, అలాగే బ్యాంక్ బ్యాంకింగ్ ఉత్పత్తులు అండ్ సేవలను అన్వేషించడానికి కస్టమర్లకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. (చదవండి: నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..!) -
ఐదో రోజు అట్ల బతుకమ్మ..!
తెలంగాణ పెద్ద పండుగగా పేరుగాంచిన పూల సంబురం సందడే వేరు. జీవితాన్ని ఎలా అద్బుతంగా మలుచుకోవాలో నేర్పించే కలర్ఫుల్ పండుగా ఈ బతుకమ్మ పండుగా. తొమ్మిది రోజుల పాటు సాగే పండుగను రోజుకో ప్రత్యేక పేరుతో అందంగా పూలను పేర్చుకుని ఆనందంగా ఆడిపాడి చేసుకునే పండుగా. బతుకమ్మ సంబరాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి (ఆదివారం) రోజున తెలంగాణ ఆడబిడ్డలంతా అట్ల బతుకమ్మగా ఆరాధిస్తారు. ఈ బతుకమ్మ ప్రత్యేకతలేంటి, ఏం నైవేద్యం సమర్పిస్తారు వంటివి తెలుసుకుందామా..!. బతుకమ్మ వేడుకల్లో అయిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి (ఆదివారం) నాడు బియ్యాన్ని నానబెట్టి, దంచి చేసిన అట్లను గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి ‘అట్ల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజున గునుగు, చామంతి, మందార, బీర, తంగెడు, గునుగు, గుమ్మడి తదితర పూలతో అయిదు ఎత్తుల్లో లేదా ఐదు అంతరాల్లో బతుకమ్మను పేరుస్తారు. నానబెట్టిన బియ్యం దంచి లేదా మర పట్టించి పిండిగా చేసి అట్లు పోస్తారు. అట్లను ముందుగా గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత ముతైదువులు తాము దేవతకు సమర్పించిన అట్లను ఒకరికొకరు వాయినంగా ఇచ్చి పుచ్చుకుంటారు.(చదవండి: నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..!) -
పూల పండుగ..మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ
తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగ మూడో రోజుకి చేరుకుంది. బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో అంటూ ప్రారంభమయ్యే ఈ పండుగ ఆటపాటల సందడితో ఆనందభరితంగా ఉంటుంది. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకునే ఈ బతుకమ్మ పండుగలో మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మగా ఆరాధిస్తారు. ఈరోజు మూడో రోజు కాబట్టి తెలంగాణ ఆడబిడ్డలంతా ముద్దపప్పు బతకమ్మను జరుపుకుంటారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ ఆటలు ఆడిన మహిళలు, అటుకుల బతుకమ్మను ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను జరుపుకుంటారుబతుకమ్మ పండుగలో మూడవ రోజు ‘విదియ’ కాబట్టి ఈ రోజున‘ముద్దపప్పు బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి, అందంగా అలంకరిస్తారు. నైవేద్యంగా..ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి గౌరమ్మకి నివేదిస్తారు. ఆపై ప్రసాదాన్ని ఒకరికొకరు పంచుకుంటారు. ముద్దపప్పు బతుకమ్మ రోజున కొందరు పుట్నాల పిండి, బియ్యప్పిండి, బెల్లం, ఎండు కొబ్బరి, నువ్వులు, పాలతో ‘చలివిడి’ ముద్దలు చేస్తారు. ఇంకొందరు గారెలు చేస్తారు.(చదవండి: Dussehera 2024 : బతుకమ్మ బిడ్డ, బొడ్డెమ్మ పండుగ గురించి తెలుసా?) -
పూల సంబరం..రెండో రోజు 'అటుకుల బతుకమ్మ'
తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన పూల సంబరాలు మొదలయ్యాయి. ప్రతి ఇల్లు పూల రంగులతో కళకళలాడుతుంటుంది. ఎటు చూసిన జానపద గీతాల సందడులే. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రజలంతా బతుకమ్మ పండుగకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు సంబరాలు అంబారాన్నంటేలా అంగరంగ వైభవంగా సాగాయి. ఇక రెండో రోజు అంటే ఈరోజున(అక్టోబర్ 03) అటుకుల బతుకమ్మను సిద్ధం చేసి ఆడిపాడతారు. గునుగు పూలు, తంగేడు,బంతి, చామంతి, గుమ్మడి, బీర, కట్ల వంటి పూలతో బతుకమ్మను పేర్చి అందంగా తీర్చి దిద్దుతారు.. గౌరమ్మ పాటలతో రంగురంగుల పూలను కీర్తిస్తూ బతుకమ్మ పండుగ వేడుకగా చేసుకుంటారు. అయితే దీన్ని చిన్నారులే ఎక్కువగా చేసుకోవడంతో ఈ బతుకమ్మకు అటుకల బతుకమ్మ అనే పేరు వచ్చిందని కథనం. అయితే పిల్లలు ఆటకు అటుకులు, పప్పులు, బెల్లమే కదా ఉపయోగిస్తారు. అందుకనే ఈ బతుకమ్మకు చిన్నిపిల్లలు ఇష్టంగా తినే అటుకులనే నైవేద్యంగా సమర్పిస్తారు. (చదవండి: బతుకమ్మ సంబరాలకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ) -
దసరా.. ఆ సరదానే వేరు..!
తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు..రంగురంగుపూల బతుకమ్మలు.. ఇంటింటా పిండి వంటలు.. ఆనందోత్సాహాలతో ఆలింగనాలు..పిల్లల కేరింతలు... పెద్దల పలకరింపులు.. రాత్రుళ్లు దీపాల కాంతులు.. టపాసుల మోతలు ఇవే కదా.. దసరా సంబురాలు..చిన్నపండుగొస్తుందంటే నెల ముందు నుంచే హడావిడి మొదలైపోతుంది. అలాంటిది అన్నింట్లోనూ పెద్ద పండుగ. . అలాంటిది అన్నింట్లోనూ పెద్ద పండుగ. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ దసరా వచ్చిందంటే.. ఊరూవాడంతా సంబురాలే. పట్నం విడిచి పల్లెకు పోవడానికి రెండు మూడు నెలల ముందే టికెట్స్ బుకింగ్ అయిపోతాయి. షాపింగ్ మాల్స్ జనంతో కిటకిటలాడతాయి. స్వీట్ షాపుల్లో ఆర్డర్లు పెరిగిపోతాయి. ఇలా... చెప్పుకుంటూ పోతే పండుగ రోజుల్లో ప్రతి క్షణం మనసుకు సంతోషాన్నిచ్చేదే.తొమ్మిది రోజుల పండుగతొమ్మిది రోజులు జరిగే ఈ పండుగలో.. ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో పూజిస్తారు. అమ్మవారి తొమ్మిది రూపాల పేర్లు.. శైల పుత్రి, బాలా త్రిపుర సుందరి, గాయత్రీ దేవి, మహాలక్ష్మి దేవి, అన్నపూర్ణేశ్వరీ దేవి, లలితా త్రిపుర సుందరీ, మహా సరస్వతి దేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, శ్రీరాజరాజేశ్వరి దేవి.ఇక పదవ రోజు.. విజయదశమి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. పొద్దున్నే లేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసి, తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటారు. రకరకాల ఆకులు, పండ్లు కూరగాయలు, ధూపదీపనైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేస్తారు.పురాణాల్లో రాక్షస వధ కోసంమహిషాసుర మర్దిని స్తోత్రందసరా రోజున మహిషాసుర మర్దిని దేవిని పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని మొక్కుతూ ‘అయిగిరి నందిని' స్తోత్రం చదివితే కొత్త శక్తి వస్తుంది అంటారు. దసరా రోజునే కాకుండా మిగతా రోజుల్లోనూ ఈ స్తోత్రం చదవొచ్చు. జీవితంలో నిరాశ కలిగినా, అనుకున్న పని చేయలేకపోతున్నా అమ్మవారిని తలచుకుంటే కొత్త శక్తి వస్తుందని చాలామంది నమ్ముతారు.*అయిగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందనుతే! గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే! భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే!జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యకపర్దిని శైలసుతే!!*మంచి తరపున పోరాడిన వాళ్లు తమ ఆయుధాలకి పని చెప్పిన సందర్భం ఇదే. కాబట్టి చెడు తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయుధపూజ చేస్తారు. రంగురంగుపూలతో బతుకమ్మ పేరుస్తారు. ఆడపడుచులంతా బతుకమ్మ చుట్టూ చేరి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...' అంటూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మ ఎంగిలిపూల, అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్న ముద్దల, సద్దుల బతుకమ్మ అంటూ పూజిస్తారు.జమ్మి చెట్టు కథమహాభారతంలోని ఒక కథ కూడా విజయదశమి పండుగ నేపథ్యంగా ఉంది. పాండవులు రాజ్యాన్ని విడిచి అరణ్యవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చిన రోజు.. వాళ్లకు సంబంధించిన ఆయుధాలన్నింటినీ ఒక మూట కట్టి, 'తిరిగొచ్చేవరకూ వాటిని చూసుకో” అని జమ్మి చెట్టుకి కడతారు. అరణ్యవాసం పూర్తయ్యాక వాళ్లు ఆశ్వయుజ మాసంలోని దశమి రోజున తిరిగొచ్చి తమ ఆయుధాలను తీసుకుంటారు. ఆ తర్వాత కౌరవులపై యుద్ధం చేసి తిరిగి తమ రాజ్యాన్ని పాండవులు దక్కించుకున్న విషయం తెలిసిందే. వాళ్లు దశమిరోజున జమ్మిచెట్టు దగ్గరకు తిరిగి రావడం వల్లే దసరా పండుగను జరుపుకుంటారు. ప్రత్యేకంగా ఆరోజున జమ్మి చెట్టుకి పూజలు కూడా చేస్తారు. అదే రోజు పాండవులు జమ్మిచెట్టుపై ఒక పాలపిట్టను చూశారు. అందుకని దసరా రోజున పాలపిట్టను చూసి, జమ్మిచెట్టుకు మొక్కితే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ కారణంగానే ఆయుధపూజ చేస్తారు.దసరా రోజు రావణ సంహారం ఎందుకు ?దసరా రోజున రామాలయాలు రామనామంతో మారుమోగిపోతాయి. ఎందుకంటే రామాయణ నేపథ్యంలో కూడా దసరా గురించి ఒక పురాణ కథ ఉంది. శ్రీరాముడు లంకలో రావణుడ్ని చంపింది దశమిరోజే. రాముడు దేవుడు.. రావణుడు రాక్షసుడు. ఇలా చూసినా చెడుపై మంచి గెలవడమే ఉంది. కాబట్టి దసరా రోజున రామున్నిస్మరించుకుంటారు. పెద్ద మైదానాల్లో రావణుడి బొమ్మను దహనం చేస్తారు. పది తలల రావణుడి బొమ్మను చేసి, దాన్ని బాణాసంచాతో కాలుస్తారు. దసరా తర్వాత 21 రోజులకు దీపావళి వస్తుంది. రావణుడ్ని చంపిన తర్వాత రాముడు తన పరివారంతో అయోధ్యను చేరింది కూడా అప్పుడే.విజయదశమి విజయగాథదసరా రోజున ప్రతి ఒక్కరూ మహిషామర్ధిని కథ చెప్పుకుంటారు. మహిషాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఇంద్రుడి పదవి కోసం దేవతలతో యుద్ధం చేసి వాళ్లను ఓడిస్తాడు. ఆ తర్వాత స్వర్గలోకాన్నే కాకుండా విశ్వాన్నంతటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ రాక్షసుడి బారి నుంచి లోకాన్ని కాపాడాలని ఇంద్రుడు త్రిమూర్తులతో చెప్పుకుంటాడు. అప్పుడు ఆ త్రిమూర్తులకు వచ్చిన కోపం ఒక ప్రకాశవంతమైన శక్తిగా మారుతుంది. ఆ శక్తే ఒక స్త్రీ రూపమై జన్మిస్తుంది. త్రిమూర్తులతో శివుని శక్తి ముఖంగా, విష్ణువు శక్తి భుజాలు, చేతులుగా, బ్రహ్మ శక్తి పాదాలుగా ఆ స్త్రీ మహిషాసురుడిని చంపే శక్తిగా అవతరిస్తుంది. శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణ దేవుడు పాశాన్ని.. ఇలా ఒక్కో దేవుడు ఒక్కో ఆయుధాన్ని ఇచ్చి మహిషాసుర మర్దిని దేవిని యుద్ధానికి పంపిస్తారు.ఆ యుద్ధంలో భీకరంగా పోరాడి మహిషాసురుడ్ని మట్టుబెడుతుంది అమ్మవారు. చెడుపై మహిషాసుర మర్దిని సాధించిన ఈ విజయానికి గుర్తుగా ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమినాడు దసరా పండుగ జరుపుకుంటారు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ఉగ్రరూపం 'మహిషాసుర మర్దిని' రూపమే. అందుకే దసరా అనగానే దేవీ నవరాత్రి ఉత్సవాలు కళ్లముందుకొచ్చేస్తాయి.అలయ్ బలయ్జమ్మి చెట్టు ఆకుల్ని ‘బంగారం'తో పోలుస్తారు. అందుకని జమ్మి చెట్టుకు మొక్కినాక జమ్మి ఆకుల్ని తెంపి బంధువులకు, స్నేహితులకు ఇస్తారు. అంటే బంగారాన్ని చేతిలో పెట్టి కౌగలించుకోవడం అన్నమాట. ఈ సంప్రదాయం పేరే అలయ్ బలయ్. మగవాళ్లు ఆడబిడ్డల కాళ్లకు దండం పెట్టి జమ్మి ఆకులని చేతికిస్తారు. నాన్నమ్మ, అమ్మమ్మ, మేనత్త, అమ్మ, చిన్నమ్మలే కాదు.. అక్క, చెల్లి, వదినల కాళ్లు కూడా మొక్కుతారు. ఇలాంటి సంప్రదాయం ఒక్క తెలంగాణలోనే ఉంది. జమ్మి చెట్టును పూజిస్తూ చదివే స్తోత్రం..శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశినీ అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ!! కరిష్యమాణ యాత్రాయా యథాకాలమ్ సుఖం మయా తత్ర నిర్విఘ్న కర్రీత్వం భవ శ్రీరామ పూజితా!!ఆయుధ పూజ విశేషంకులవృత్తులు చేసేవాళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధమే వాళ్లకు జీవితాన్నిస్తుంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీది నుంచి తీసిన రోజున దసరా. అందుకే ఆయుధపూజ చేయిస్తారు. బండి, మెషిన్, నాగలి, కొడవలి, పిల్లలకైతే పుస్తకాలు కూడా ఆయుధాలే. ఆయుధపూజ చేయించడం ద్వారా విజయం మనవైపే ఉంటుందని నమ్ముతారు.వంటింటి ఘుమఘుమలుదసరా వస్తుందంటేనే రకరకాల పిండి వంటలు చేయడానికి రెడీ అయిపోతారు. అరిసెలు, అప్పలు, సకినాలు, లడ్డూలు.. ఇలా ఎన్నో రకాల స్వీట్లు, హాట్లు వండిపెడతారు. వీటితోపాటు అమ్మవారికి రోజుకో వెరైటీలు నైవేద్యంగా పెడతారు. అంతేకాదు.. దసరా పండుగకు నోరూరించే నాన్వెజ్ స్పెషల్స్ అస్సలు మిస్సవ్వరు.(చదవండి: బతుకమ్మ సంబరాలకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ) -
బతుకమ్మకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ
తెలంగాణ సంస్కృతి చిహ్నం ఈ బతుకమ్మ పండుగ. ప్రకృతితో మమేకమై పండుగ ఇది. జానపద గీతాలతో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆడుతూ పాడుతూ చేసుకునే గొప్ప పండుగ. రంగురంగుల పూలతో తెలంగాణలోని ప్రతి గ్రామం శోభాయమానంగా మారిపోతుంది. ప్రకృతి రమణీయత కొట్టొచ్చినట్లుగా కనిపించే కలర్ఫుల్ పండుగ ఇది. ఇవాళ నుంచే (అక్టోబర్ 2) బతుకమ్మ సంబరాలు మొదలవుతున్న నేపథ్యంలో ఆ పండుగ విశిష్టత, తొలిరోజు జరుపుకునే ఎంగిలి బతుకమ్మ పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది తదితర విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.బతుకు అంటే తెలుగులో జీవించే లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు. అంటే.. జీవితమంతా సంతోషకరంగా సాగిపోవాలనేది ఈ బతుకమ్మ పండుగ ఆంతర్యం. ఈ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది.దీన్ని తెలంగాణలో పెత్ర అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి.. వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడి పాడడం సంప్రదాయం. అయితే ఇలా తొలిరోజున పేర్చిన బతుకమ్మను 'ఎంగిలిపూల బతుకమ్మ'గా పేర్కొంటారు. అలాగే ఈ రోజున అమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆట పూర్తయిన తర్వాత మహిళలు ఈ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా తొలి రోజు బతుకమ్మ పూర్తవుతుంది.ఆ పేరు ఎలా వచ్చిందంటే..బతుకమ్మ తయారీ కోసం ఒక రోజు ముందే పూలను సేకరించి అలా నిద్ర చేసిన పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారని కథనం. కొన్ని ప్రాంతాలలో తిన్న తర్వాత బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఏది ఏమైనా బతుకమ్మ ఓ కమనీయ పూల సంబరం. ఈ రోజున మహిళలు చక్కగా ముస్తాబై గునుగు, తంగేడు, కట్ల, మొల్ల, సీత జడలు, రుద్రాక్ష, మందార, పారిజాతం, కమలం, తామర, గన్నేరు వంటి రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు పాడుతూ ఎంగిలిపూల బతుకమ్మకు స్వాగతం పలుకుతారు. ముందుగా ఇంట్లో బతుకమ్మను పూజిస్తారు. ఆ తర్వాత సాయంత్రం సమీపంలో ఉన్న దేవాలయాలు, చెరువుల వద్ద మహిళలంతా గుమిగూడి సమిష్టిగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారునైవేద్యంగా..నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!
ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదో వార్షికోత్సవ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో వెస్ట్ గేట్ స్పోర్ట్స్ సెంటర్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన తేలు విజయగారు బతుకమ్మ ఆట పాటలతో అందర్నీ అల్లరించారు. ఈ కార్యక్రమం గత పది సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నామని ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బైరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవ్వడానికి ముఖ్య కారణము కమిటీ కార్యవర్గ సభ్యులు స్పాన్సర్స్, వాలంటీర్స్ అని అనిల్ బైరెడ్డి తెలిపారు. ఇకముందు కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మన ఆటపాటలను ముందు తరాల వారికి అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మినిస్టర్స్ కౌన్సిల్ మేయర్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏటీఏఐ కార్యవర్గ సభ్యులు కిరణ్ పాల్వాయి, ఫణికుమార్ , వంశీ కొట్టాల, రవి దామర, మహేష్ రెడ్డి ,శ్రీనివాస్ కర్ర, కిషోర్ యానం, మధుపైల, రఘు కోట్ల,దీపక్ హరి, కృష్ణ ఒడియాల, పుల్లారెడ్డి బద్దం, రాజవర్ధన్ రెడ్డి, మహేష్ బద్దం ,అమరేందర్ రెడ్డి, ప్రవీణ్ దేశం, సతీష్ పటి, శ్యాం లింగంపల్లి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అబుదాబిలో బతుకమ్మ సంబరాలు!) -
అడిలైడ్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అడిలైడ్ నగరంలోని ఎల్డర్ పార్క్ లో ఉన్న ఆడిలైడ్ ఫెస్టివల్ సెంటర్లో ఈ వేడుకల్ని జరిపారు. సౌత్ ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్లో తొలిసారి నిర్వహించిన ఈ వేడుకల్లో సుమారు 500 మంది పాల్గొన్నారు. వీరిలో పలువురు ఆస్ట్రేలియన్లు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ వేడుకల్లో పాల్గొన్న ఆస్ట్రేలియాలోని స్థానిక ప్రజలు తెలంగాణ సంప్రదాయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకుని మరీ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎల్డర్ పార్క్లో ఈ వేడుకల్ని నిర్వహించిన తర్వాత టోరెన్స్ నదిలో వీడ్కోలు పలికారు. ఈ వేడుకల్లో టోరెన్స్ ఎంపీ వొర్టీ, సాంస్కృతిక శాఖా మంత్రి జోబెట్టిసన్ హాజరయ్యారు. ఎల్డర్ పార్కులో ఈ వేడుకల్ని తెలంగాణ సంప్రదాయబద్ధంగా నిర్వహించి టోరెన్స్ నదిలో సాగనంపారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా టోరెన్స్ ఎంపీ డానా వొర్ట్లీ, సాంస్కృతిక శాఖ మంత్రి జో బెట్టిసన్ హాజరయ్యారు. అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షురాలు హరితారెడ్డి బతుకమ్మ వేడుకల ప్రాముఖ్యతను వివరించారు. వైస్ ప్రెసిడెంట్ మమతా దేవా, ట్రెజరర్ ప్రత్యూష, సెక్రటరీ నిక్కిల్ మరియు కమిటీ సభ్యులు సౌజన్య, సృజనా రెడ్డి, అనిల్, ప్రశాంత్ రెడ్డి, చరిత్ రెడ్డిలు ఈ బతుకమ్మ సంబరాల్ని సక్సెస్గా నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారు. శివగర్జన టీమ్లోని వాలంటీర్లైన స్టీఫెన్ వాట్స్, శ్రీనివాస్ వడ్లకొండ, సంజయ్ మెంగర్, తదితర వాలంటీర్లు ఈ వేడుక విజయవంతంగా జరగడానికి కృషి చేశారు. ఈ బతుకమ్మ సంబరాల్లో చాలా మంది భారతీయులు కూడా పాల్గొని సందడి చేశారు. -
దసరాకు ఆర్టీసీ ‘ స్పెషల్’!
యాదాద్రి: తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన దసరాకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ఏటా స్పెషల్ బస్సులు నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులతో మంచి ఆదాయాన్ని అర్జిస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 13వ తేదీ నుంచి 15 వరకు, తిరిగి 19 నుంచి 22వ తేదీ వరకు నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 409 బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నారు. ఇక ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నియామకం తర్వాత వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తుండగా.. రాఖీ సందర్భంగా సత్ఫలితాలు ఇచ్చిన గిఫ్ట్ల కార్యక్రమాన్ని ఈ పండుగకు ప్రవేశపెట్టనున్నారు. 10 మందికి రూ.9,900 చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నారు. 10 మంది ప్రయాణికులకు గిఫ్ట్లు ప్రయాణికుల ఆదరణ పొందడం.. తద్వారా మంచి ఆదాయాన్ని గడించేందుకు వినూత్న కార్యక్రమాలతో ఆర్టీసీ ముందుకు వస్తోంది. రాఖీ సందర్భంగా చేపట్టిన బహుమతుల పథకానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ దసరాకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం రీజియన్ పరిధిలో ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులను ఎంపిక చేయనున్నారు. పండుగకు ముందు ఈనెల 21 నుంచి 23 వరకు, పండుగ తర్వాత 28నుంచి 30వ తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ టికెట్ వెనుక పేరు, ఫోన్నంబర్ రాసి.. ఆర్టీసీ ఏర్పాటు చేసే బాక్సుల్లో వేయాల్సి ఉంటుంది. ఈ బాక్సులను నల్ల గొండ, దేవరకొండ, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట హైటెక్ బస్టాండ్, కొత్తబస్టాండ్, యాదగిరిగుట్ట కొత్త బస్టాండ్, పాతబస్టాండ్, భువనగిరి బస్టాండ్లలో ఏర్పాటు చేయనున్నారు. రద్దీ రోజులను గుర్తించి.. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నల్లగొండ, నార్కట్పల్లి, మిర్యాలగూడ, దేవరకొండ, కోదాడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట మొత్తం ఏడు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లావాసులు ఉద్యోగాలు, ఇతర పనులు, విద్య కోసం రాజధాని హైదరాబాద్లోనే అధికంగా ఉంటుంటారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ఉండడం, బతుకమ్మ, దసరా అతి పెద్ద పండుగలు కావడంతో పెద్దఎత్తున జనం సొంత గ్రామాలకు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఆయా డిపోలకు వచ్చే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. మొదట్లో విద్యాసంస్థలకు సెలవు ఉండడంతో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు, తర్వాత సాధారణ జనం రద్దీ కారణంగా 19నుంచి 22వ తేదీ వరకు.. ఇలా మొత్తంగా ఏడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ ఉంటుందని భావించి ఆయా తేదీల్లో రాజధానికి అదనపు బస్సులు నడపనున్నారు. 409 బస్సులు.. సాధారణ చార్జీలు పండుగ నేపథ్యంలో ఆర్టీసీ నల్లగొండ రీజియన్ పరిధిలో మొత్తం 409 బస్సులతో అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. మొదటిరోజు శుక్రవారం ఏడు డిపోల నుంచి 56 బస్సులను నడిపారు. ఇక 14వ తేదీన 36 బస్సులు నడపనున్నారు. 15వ తేదీన 35 బస్సులు తిప్పుతారు. తిరిగి ఈనెల 19న 71 బస్సులు, 20వ తేదీన 56 బస్సులు, 21వ తేదీన 75 బస్సులు, 22వ తేదీన 80 బస్సులు నడపనున్నారు. అయితే గతంలో స్పెషల్ బస్సులను నడిపితే 20 శాతం మేర చార్జీలు అదనంగా వసూలు చేసేవారు. 2022లో బస్ చార్జీలు రెండుసార్లు పెంచడం, చిల్లర సమస్యతో మరోసారి పెంచడంతో గతేడాది దసరా స్పెషల్ బస్సులకు చార్జీలను పెంచలేదు. ఈ సారి కూడా రోజువారీగా వసూలు చేసే చార్జీలనే తీసుకోనున్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి బతుకమ్మ, దసరా పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నల్లగొండ రీజియన్ పరిధిలో 409 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికులు స్పెషల్ బస్సులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికుల రద్దీని బట్టి ఇంకా అదనంగా సర్వీసులు నడుపుతాం. ఈ పండుగకు నగదు బహుమతులు అందిస్తున్నాం. – ఎస్.శ్రీదేవి, ఆర్టీసీ ఆర్ఎం, నల్లగొండ -
సంబురాలు షురూ!
జవహర్నగర్లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు జిల్లాలో షురూ అయ్యాయి. పాఠశాలల్లో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలతో.. వివిధ రకాల పూలను తెచ్చి బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం స్కూలు ఆవరణలో మహిళా ఉపాధ్యాయులతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఉపాధ్యాయులు బతుకమ్మపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు.