CLP
-
సీఎం రేవంత్ రెడ్డి CLP మీటింగ్కు ఆ MLAలు దూరం
-
రేవంత్ రెడ్డిని CLP లీడర్ గా ఎన్నుకున్నట్లు తెలిపిన నేతలు
-
ప్రమాణ స్వీకారం రోజునే 6 గ్యారంటీలపై సంతకాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతగా టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్రెడ్డిని ఎంపిక చేశామని, ఈ నెల 7న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని ‘ఆరు గ్యారంటీ’ల అమలుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ప్రకటించిన విధంగా ప్రమాణ స్వీకారోత్సవం రోజునే ఆరు గ్యారెంటీలపై సంతకాలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానంగా మహిళలు, రైతులు, విద్యార్థులు, ఇళ్లు లేని పేద కుటుంబాలు, నిస్సహాయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను ప్రకటించడంతో ఆయా వర్గాల్లో భారీగా ఆశలు రేకెత్తాయి. కాగా ఈ హామీల అమలుకు ఏటా కనీసం రూ.88 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని ఓ అంచనా. అయితే పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తే మాత్రం నిధుల అవసరాలు రూ.లక్ష కోట్లకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వీటి అమలుకు మరిన్ని రూ.వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఎన్నికల హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీల అమలుకు అవసరం కానున్న నిధులపై ‘సాక్షి’విశ్లేషణాత్మక కథనం.. మహాలక్ష్మికి రూ.10 వేల కోట్లు! మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 చొప్పున ఆర్థిక సహాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షలకు పైగా నిస్సహాయ పేద మహిళలకు కొత్తగా నెలకు రూ.2500 చొప్పున సహాయం అందించాల్సి ఉండనుందని అంచనా. ఈ లెక్కన ఏటా రూ.6 వేల కోట్ల వ్యయం కానుంది. ♦ ప్రస్తుతం హైదరాబాద్లో 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను రూ.955కు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లుండగా, రోజుకు 1.8 లక్షల నుంచి 2 లక్షల సిలిండర్లను విక్రయిస్తున్నారు. ఈ లెక్కన రూ.500కే గ్యాస్ సిలిండర్ను అందించడానికి ఏటా కనీసం రూ.2,923.65 కోట్ల గ్యాస్ సబ్సి డీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. గ్యాస్ ధర పెరిగిన కొద్దీ ఈ భారం పెరుగుతుంది. ♦ మహిళలకు ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడానికి సుమారుగా రూ.2,200 కోట్ల వ్యయం కానుంది. కేవలం పల్లె వెలుగు బస్సుల్లో ఈ సదుపాయం కల్పిస్తే రూ.750 కోట్లు కానున్నాయి. రైతు భరోసాకు రూ.29 వేల కోట్లు! రైతు భరోసా పథకం కింద రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 చొప్పున, వ్యవసాయ కూలీలకు రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం, వరి పంటకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతు కూలీలున్నట్టు అంచనా. వీరికి రూ.12 వేలు చొప్పున ఇవ్వడానికి ఏటా రూ.3 వేల కోట్లు అవసరం కానున్నాయి. అలాగే ఎకరానికి రూ.15 వేలు చొప్పున రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు ఇచ్చేందుకు ఏటా రూ.22,500 కోట్లు, 6 లక్షల మంది కౌలు రైతులకు ఏటా రూ.3,000 కోట్ల సాయం అందించాల్సి ఉంటుంది. ఏటా సుమారు కోటిన్నర టన్నుల ధాన్యం సేకరిస్తుండగా, టన్నుకు రూ.500 చొప్పున రూ.750 కోట్లను ఇవ్వాల్సి ఉండనుంది. ఈ లెక్కన మొత్తం రైతు భరోసాకు ఏటా సుమారు రూ.29 వేల కోట్లు అవసరం అని అంచనా. ఇందిరమ్మ ఇళ్లకు రూ.15 వేల కోట్లు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యమకారు లకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దశల వారీగా ఈ పథకం అమలు చేసే అవకాశం ఉంది. ఏటా ఎన్ని కుటుంబాలకు వర్తింపజేస్తారన్న అంశంపై స్పష్టత వచ్చాకే అందుకు అవసరం కానున్న నిధులపై స్పష్టత రానుంది. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఇళ్లు లేని కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇళ్లులేని పేద కుటుంబాలు దాదాపుగా ఇదే సంఖ్యలో ఉంటాయని అంచనా వేయవచ్చు. ఐదేళ్ల టర్మ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 15 లక్షల కొత్త ఇళ్లను నిర్మించాలని నిర్ణయిస్తే, ఏటా కనీసం 3 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏటా రూ.15 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా. యువ వికాసానికి రూ.10 వేల కోట్లు? విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు విషయంలో.. ఏ స్థాయి విద్య కోసం ఎంత మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు అనే అంశంపై స్పష్టత వస్తేనే ఈ పథకం అమలుకు అవసరం కానున్న నిధులను అంచనా వేయడానికి వీలుంది. ఏటా 2 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తే రూ.10 వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి. గృహజ్యోతికి రూ.3,431.03 కోట్లు.. గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరాకు ఏటా రూ.3,431.03 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు అందిస్తున్న సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలను కొనసాగిస్తూ అదనంగా ఈ మేరకు నిధులివ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం గృహ కేటగిరీ విద్యుత్ కనెక్షన్లు 1.20 కోట్లు కాగా, అందులో 1.05 కోట్ల కనెక్షన్లు (87.9 శాతం గృహాలు) నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ను మాత్రమే వినియోగిస్తున్నాయి. చేయూతకు రూ. 21 వేల కోట్లు చేయూత పథకం కింద నెలకు రూ.4వేల పెన్షన్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలు చేస్తామ ని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద మొత్తం 43,68,784 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, కల్లు గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్ బాధితులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పెన్షన్లు అందుకుంటున్నారు. వీరికి రూ.4 వేల పెన్షన్ చెల్లిస్తే ఏటా సుమారు రూ.20,970 కోట్లు అవసరం అవుతాయి. రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలుకు అదనంగా నిధులు అవసరం కానున్నాయి. -
సామాజిక కోణంలో కేబినెట్ కూర్పు
సాక్షి, హైదరాబాద్: కొత్త ప్రభుత్వ ఏర్పాటులో సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర కేబినెట్తో పాటు ఇతర కీలక పదవుల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యం కల్పించే దిశలో కసరత్తు చేస్తోంది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఈ ప్రక్రియ బుధవారం కూడా కొనసాగనుంది. కొత్త సీఎల్పీ నాయకుడిగా ఎంపికైన రేవంత్రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, హైకమాండ్ పెద్దలు కేసీ వేణుగోపాల్, డి.కె.శివకుమార్, మాణిక్రావ్ ఠాక్రేల సమక్షంలో చర్చించిన తర్వాత రాహుల్, ఖర్గేలతో మాట్లాడి వారి అనుమతి మేరకు కీలక పదవులపై నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా కేబినెట్లో ఎంతమందిని తీసుకోవాలి? ఎవరెవరిని తీసుకోవాలి? ఏయే సామాజిక వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యమివ్వాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుని గురువారం ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులందరి చేత ప్రమాణం చేయించనున్నారు. డిప్యూటీ సీఎంలు ఒకరా... ఇద్దరా? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్రెడ్డిని సీఎంగా నిర్ణయించిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవిపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఒకరిని నియమించాలా లేదా ఇద్దరికి అవకాశమివ్వాలా అన్న దానిపై టీపీసీసీ ముఖ్యులతో సమాలోచనలు జరుపుతోంది. ప్రస్తుతమున్న సమాచారం మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేరు ఇప్పటికే ఖరారైనట్టు తెలుస్తోంది. దళిత సామాజిక వర్గానికి చెందిన భట్టి గతంలో పలు పదవులు నిర్వహించారు. ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న ఆయనకు తగిన గౌరవం ఇవ్వాల్సిన దృష్ట్యా కేబినెట్లో కీలక శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే ఉప ముఖ్యమంత్రి హోదాను భట్టికి మాత్రమే పరిమితం చేస్తారని, అలాగే భట్టితో పాటు మరొకరికి కూడా ఇస్తారనే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏ సామాజిక వర్గం నుంచి ఎంతమంది? కొత్త మంత్రివర్గాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న దానిపై అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏ సామాజిక వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారనే అంశంతో పాటు ఏ సామాజిక వర్గానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్న కోణంలో కసరత్తు చేస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 25 మంది ఎంపిక కాగా.. సీఎంతో పాటు నాలుగు లేదా ఐదు బెర్తులు వారికి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (నల్లగొండ), పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (ఖమ్మం), సుదర్శన్రెడ్డి (నిజామాబాద్)లకు మంత్రివర్గంలో స్థానం ఖరారైనట్టేనని తెలుస్తోంది. టి.రామ్మోహన్రెడ్డి (రంగారెడ్డి), దొంతి మాధవరెడ్డి (వరంగల్)ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకటి లేదా రెండు విప్ పదవులు కూడా ఈ సామాజిక వర్గానికి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విప్లుగా ఉన్నత విద్యావంతులైన మహిళలు పరణికారెడ్డి, యశస్వినిరెడ్డిల్లో ఒకరికి అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. వీరితో పాటు మల్రెడ్డి రంగారెడ్డి (రంగారెడ్డి), కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (నల్లగొండ)లకు కూడా ప్రభుత్వంలో ప్రాధాన్య పదవులు లభించే అవకాశాలున్నాయి. ఇక వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేంసాగర్రావు, జూపల్లి కృష్ణారావులలో ఒకరికి లేదంటే ఇద్దరికీ మంత్రిగా అవకాశం దక్కనుంది. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు మరోమారు కేబినెట్ మంత్రి బాధ్యత అప్పగించడం ఖాయమేనని, ఆయనకు విద్య లేదా ఐటీ శాఖ అప్పగించవచ్చనే చర్చ జరుగుతోంది. బీసీలలో వీరికే.. తాజా ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్)కు కేబినెట్ బెర్తు ఖరారయిందనే చర్చ జరుగుతోంది. ఈయనతో పాటు మహిళా కోటాలో కొండా సురేఖ (వరంగల్ ఈస్ట్) పేరు ప్రకటన కూడా లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు మరొకరికి అవకాశం ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన ఆది శ్రీనివాస్ (మున్నూరు కాపు), వాకిటి శ్రీహరి (ముదిరాజ్), బీర్ల అయిలయ్య (యాదవ్)లలో ఒకరికి చాన్స్ దొరకొచ్చని అంటున్నారు. ఎస్సీ కోటాలో రాజనర్సింహ ఖరారు దళిత ఎమ్మెల్యేలకు కూడా కొత్త కేబినెట్లో తగిన ప్రాధాన్యం ఇచ్చేలా అధిష్టానం కసరత్తు సాగుతోంది. మాల సామాజిక వర్గానికి చెందిన భట్టిని ఉప ముఖ్యమంత్రిగా నియమించనున్న నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహ (ఆంథోల్)కు కీలక శాఖ అప్పగించవచ్చని తెలుస్తోంది. ఆయనతో మాదిగ వర్గానికే చెందిన మరొక నాయకుడికి కూడా అవకాశాలున్నాయని అంటున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన ఓయూ విద్యార్థి నాయకుడు మేడిపల్లి సత్యంకు విప్ పదవి వస్తుందని, ఆయనతో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వేముల వీరేశం (నకిరేకల్)కు కూడా విప్ హోదా కల్పించే ప్రతిపాదనలున్నాయని సమాచారం. ఇక ఎస్టీ కోటాలో ధనసరి అనసూయ (సీతక్క)కు మంత్రి పదవి ఖాయమైనట్టే. ఆమెకు డిప్యూటీ సీఎం హోదా ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆదివాసీ వర్గాలకు చెందిన ఆమెతో పాటు లంబాడా సామాజిక వర్గం నుంచి ఎన్.బాలూనాయక్ (దేవరకొండ), రామచంద్రనాయక్ (డోర్నకల్)ల పేర్లు వినిపిస్తున్నాయి. ఖాళీగా కొన్ని బెర్తులు? పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో ముఖ్యమంత్రిని, మంత్రులుగా మరో 17 మందిని నియమించే అవకాశం ఉండడంతో ఆ మేరకు ఒకేసారి భర్తీ చేస్తారా.. రెండు నుంచి నాలుగు బెర్తులను ఖాళీగా ఉంచి తొలిసారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ప్రాంతాల వారీ ప్రాధాన్యతల దృష్ట్యా హైదరాబాద్ లాంటి జిల్లాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలంటే ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాల్సి ఉన్న నేపథ్యంలో అని బెర్తులనూ నింపకపోవచ్చని తెలుస్తోంది. ఇలా మంత్రివర్గంలో స్థానంపై ఆశలు పెట్టుకున్న అనేకమంది.. ఏఐసీసీ పెద్దలు, తమకు సన్నిహితులై ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతో లాబీయింగ్ చేస్తుండటం గమనార్హం. -
TS: సీఎం ప్రమాణస్వీకారం వాయిదా
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్తో పాటు మరో నలుగురు అబ్జర్వర్లు కూడా ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పరిశీలకులు సమావేశమవనున్నారు.దీంతో ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లేనని సమాచారం. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల(సీఎల్పీ)సమావేశం సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని ఎల్లాహోటల్లో జరిగింది. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. ఏకాభిప్రాయం రాకపోవడంతో సీఎల్పీ నేతల ఎన్నిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాఖ్య తీర్మానం చేసి హైకమాండ్కు పంపారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత పేరుపై క్లారిటీ వస్తుందని అంతా ఎదురు చూశారు. కానీ చివరకు డీకే శివకుమార్ సహా నలుగురు ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో సీఎల్పీ నేత ఎంపిక వాయిదా పడింది. మరోపక్క తెలంగాణ రెండవ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ మూడో శాసనసభను గెజిట్లో నోటిఫై చేశారు. జీఏడీ అధికారులు కూడా సీఎం ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్ని కూడా రెడీ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎల్పీ నేత ఎవరో వెల్లడించిన వెంటనే కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని అంతా భావించారు. చివరకు పరిశీలకులు ఢిల్లీ వెళ్లడంతో సీఎల్పీనేత ఎంపికతో పాటు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఇవాళ లేనట్లేనని తేలిపోయింది. సీఎం ప్రమాణ స్వీకారం వాయిదాపడిందని తెలియడంతో రాజ్భవన్ నుంచి పోలీసులు, అధికారులు వెళ్లిపోయారు. ఇదీచదవండి..తెలంగాణలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. అప్డేట్స్ -
రాజ్భవన్కు సీఈవో.. అసెంబ్లీ రద్దు ప్రతులతో సెక్రటరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటునకు రంగం సిద్ధమవుతోంది. ఏఐసీసీ నుంచి సీఎల్పీ నేత ఎంపికపై స్పష్టత రాగానే.. సాయంత్రం రాజ్భవన్లో సీఎం ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి కూడా. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు టెక్నికల్ క్లియరెన్స్ పనిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బిజీగా ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ రద్దుకు సంబంధించిన ఏర్పాట్లు రాజ్భవన్లో నడుస్తున్నాయి. అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి రాజ్భవన్కు చేరుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు శాసనసభ రద్దు ప్రతులను అందజేశారు. ఆ వెంటనే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(సీఈవో) వికాస్ రాజ్, ఈసీ ప్రత్యేక అధికారితో కలిసి రాజ్భవన్కు వెళ్లారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నివేదికను గవర్నర్కు సీఈవో అందజేశారు. ఈ ఫార్మాలిటీస్ పూర్తి కాగానే.. కొత్త అసెంబ్లీ ఏర్పాటు కోసం గెజిట్ ఇచ్చేందుకు గవర్నర్ ఆదేశాలు జారీ చేస్తారు. ఈ అధికార ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. ఈ రాత్రికే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో.. ప్రోటోకాల్ అధికారులు రాజ్ భవన్ చేరుకున్నారు. మరోవైపు రాజ్భవన్ వద్ద కోలాహలం నెలకొంది. ఆహ్వానం లేకపోయినా కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నాయి. దీంతో.. భారీగా పోలీసులు మోహరించారు. -
సీఎం ఎవరనేది అప్పుడే తేలుస్తాం: డీకే శివకుమార్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావవేశంలో సోమవారం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటామని డీకే శివకుమార్ తెలిపారు. గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరాతమన్నారు. గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలతో సమావేశం అనంతరం బయటికి వచ్చిన డీకే మీడియాతో మాట్లాడారు. హోటల్ నుంచి గవర్నర్ను కలవడానికి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, పార్టీ ఇంఛార్జ్ థాక్రే, డీకే శివకుమార్, ఉత్తమ్కుమార్ రెడ్డి వెళ్లారు. సీఎం ఎవరన్నది ఫైనల్ కాలేదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం ఎవరన్నది ఫైనల్ కాలేదని, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాతే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సీఎం ఎవరనేది ఏఐసీసీలో ఇంకా నిర్ణయం కాలేదన్నారు. సీఎల్పీ సమావేశం సోమవారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారా.. లేదంటే నిర్ణయం మళ్లీ వాయిదా పడుతుందా అనేదానిపై క్లారిటీ లేదు. -
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ను పరిశీలించిన సీఎల్పీనేత భట్టి విక్రమార్క
-
సీపీఐ, సీపీఎంలతో పొత్తు తమకెంతో ముఖ్యం: భట్టి విక్రమార్క
-
భట్టిని ఓర్వలేకనే ఎమ్మెల్యేలను కొన్న కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దళిత వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా ఎన్నుకుంటే సీఎం కేసీఆర్ ఓర్వలేకపోయారని.. భట్టికి సీఎల్పీ నేత హోదా ఉండకుండా చేసేందుకే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆరోపించారు. దేశంలో దళితులకు సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందని చెప్పారు. దళితుడిని అధ్యక్షుడిని చేసే దమ్ము దేశంలోని ఏపార్టీకి ఉందని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేను ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. శనివారం గాంధీభవన్ ఆవరణలో దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. రేవంత్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దళితులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ, అభిమానానికి మల్లికార్జున ఖర్గేనే ఉదాహరణ అని చెప్పారు. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ పేదలకు భూములు పంచితే బీఆర్ఎస్ వాటిని గుంజుకుంటోందని.. బీజేపీ దీన్ని చోద్యం చూస్తోందని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత క్రిస్టియన్లకు కచ్చితంగా రిజర్వేషన్లు కల్పిస్తామని.. ప్రతీ మండలంలో ఒక క్రిస్టియన్ çశ్మశానవాటికను ఏర్పాటు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల కోసమే రాహుల్ పాదయాత్ర సాగిస్తున్నారన్నారు. బీఆర్ఎస్కు వేసే ఓటు పరోక్షంగా మోదీకే చేరుతుందని.. బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు మహేశ్కుమార్గౌడ్, చిన్నారెడ్డి, మల్లు రవి, వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో ముసలం: రేవంత్రెడ్డిపై సీనియర్ల తిరుగుబాటు
సాక్షి, కాంగ్రెస్: తెలంగాణ కాంగ్రెస్లో కొత్తగా ఏర్పాటైన కమిటీలు కాకరేపుతున్నాయి. తమకు సరైన ప్రాధాన్యం లభించలేదంటూ సీనియర్ నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీల్లో ఉన్న సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చిన వారేనని, అసలు ఒరిజినల్ కాంగ్రెస్ తమదేనని స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి కొత్త కమిటీలపై తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు కొత్త కమిటీలు, నేతల అసంతృప్తిపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో టీకాంగ్రెస్ నేతలు శనివారం సమావేశమయ్యారు. ఈ భేటీపై మీడియాతో మాట్లాడారు సీనియర్ నేతలు. ‘కమిటీల్లో అన్యాయం జరిగిందని చాలా మంది చెప్పారు. అసంతృప్తిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవటం ప్రతి ఒక్కరిపై ఉంది. సేవ్ కాంగ్రెస్ కార్యక్రమంతో ముందుకు సాగాలని నేతలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. కొందరు కావాలనే బలమైన నేతలు, పార్టీకి నష్టం చేకూర్చేలా ప్రవర్తిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని చర్చకు వచ్చింది.’ అని తెలిపారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చినవారే: ఉత్తమ్ సీఎల్పీ నేత ఇంట్లో జరిగిన సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీ అని పేర్కొన్నారు. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తున్నామని, కాంగ్రెస్ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ‘కొంతమందిని అవమానించడానికే కొత్త కమిటీ ప్రకటించినట్లుంది. 108 మందిలో సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చినవారే ఉన్నారు. సోషల్ మీడియాలో నేతలపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. కొంత మంది అసత్యప్రచారం చేయిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నవారు చేయలేనిది రేవంత్ చేస్తారా? అధిష్టానానికి అవగాహన లేకుండానే కొందరు చెబితే కమిటీ వేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ను కాపాడుకోవడమే మా లక్ష్యం. కావాలని సోషల్ మీడియాలో మాపై బురదజల్లుతున్నారు. సీఎల్పీ నేతను అవమానిస్తున్నారు. ’ అని ధ్వజమెత్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదీ చదవండి: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో అప్పుడు చెబుతాను.. ట్విస్ట్ ఇచ్చిన కోమటిరెడ్డి! -
నన్ను సంప్రదించకుండానే పీసీసీ కమిటీలను ప్రకటించారు: భట్టి
-
ఎమ్మెల్యేల అరెస్టు ప్రభుత్వ దుర్మార్గపు చర్య: రేవంత్
సాక్షి, హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, సీతక్క, పోదెం వీరయ్యలను అరెస్ట్ చేయడం ప్రభుత్వ దుర్మార్గ చర్య అని, వారి అరెస్టులను, నిర్బంధ కాండను తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని, సీఎం కేసీఆర్కు ప్రజల చేతిలో శిక్ష తప్పదని మంగళవారం ఒక ప్రకటనలో రేవంత్ హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతికి పాల్పడకపోతే పరిశీలనకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు. సీఎల్పీ బృందానికి ప్రభుత్వమే దగ్గరుండి ప్రాజెక్టులను చూపించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడతామని రేవంత్ హెచ్చరించారు. -
ఆంక్షల నడుమ సీఎల్పీ బృందం పర్యటన
భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీలోని ముంపు ప్రాంతాల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష(సీఎల్పీ) బృందం పర్యటనకు అడుగడుగునా పోలీసు ఆంక్షలు ఎదురయ్యాయి. ముంపు బాధితుల పరామర్శకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వాన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, శ్రీధర్బాబు, సీతక్క, కిసాన్సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి తదితరులతో కూడిన బృందం మంగళవారం వచ్చింది. భద్రాచలంలో శ్రీసీతారామ చంద్రస్వామిని దర్శించుకున్నాక స్థానికంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామానికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో పాటు గోదావరి వరద పెరుగుతున్నందున దుమ్ముగూడెం పర్యటన వాయిదా వేసుకోవాలని భద్రాచలం ఏఎస్పీ రోహిత్రాజ్ కోరినా నేతలు ససేమిరా అన్నారు. దీంతో పోలీసుల కళ్లుగప్పి సీఎల్పీ నేతల కాన్వాయ్ దుమ్ముగూడెం మండలం వైపు వెళ్తుండగా పోలీసులు సినీఫక్కీలో ఛేజ్చేస్తూ గుర్రాలబైలు వద్ద అడ్డుకున్నారు. పోలీసులు ఎంతకూ అనుమతించకపోవడంతో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. చివరకు గుర్రాలబైలు నుంచి లచ్చిగూడెం, మారాయిగూడెం, చేరుపల్లి మీదుగా భద్రాచలానికి సీఎల్పీ నేతల కాన్వాయ్ను మళ్లించారు. ఆపై భద్రాచలంలో విలేకరులతో మాట్లాడిన నేతలు బూర్గంపాడు మీదుగా అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బ్యారేజీ పరిశీలనకు బయలుదేరారు. అయితే, సీఎల్పీ బృందాన్ని బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీఎల్పీ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు నేతల వాహనాలను బలవంతంగా కొత్తగూడెం వైపు మళ్లించి రాకపోకలను పునరుద్ధరించారు. అక్కడినుంచి నేతలను కొత్తగూడెం మీదుగా కాళేశ్వరం వెళ్లాలని సూచించిన పోలీసులు మార్గమధ్యలో పాల్వంచ పోలీసుస్టేషన్కు తీసుకొచ్చారు. ఆపై సీఎల్పీ బృందాన్ని వాహనాల్లో బందోబస్తు నడుమ ఇల్లెందుకు తరలించారు. అనంతరం కాళేశ్వరం మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా నాయకులు వాహనాల నుంచి కిందకు దిగారు. దీంతో ఇల్లెందులోని సింగరేణి గెస్ట్హౌస్కు తీసుకెళ్లారు. అయితే, గెస్ట్హౌస్ తాళాలు లేకపోవడంతో 11గంటల వరకు ఆవరణలోనే నాయకులు పడిగాపులు కాశారు. చివరకు తాళాలు తీసుకురాగా, భోజనం అనంతరం కాళేశ్వరం బయలుదేరనున్నట్లు నాయకులు వెల్లడించారు. తెలంగాణనా.. పాకిస్తానా? ఇది తెలంగాణనా లేకపోతే పాకిస్తానా.. అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముందస్తు సమాచారమిచ్చి గోదావరి ముంపు ప్రాంతాలు, ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తున్న తమను టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుందని ఆరోపించారు. దుమ్ముగూడెం పర్యటనకు వెళ్తుంటే మావోల ప్రభావిత ప్రాంతమని, అశ్వాపురం వెళ్తుంటే అనుమతులు లేవని అడ్డుకున్నారని తెలిపారు. ఇదిలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పాతరేయడం ఖాయమన్నారు. గోదావరి వరద ముంపు బాధితుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని భట్టి విక్రమార్క తెలిపారు. -
లౌకికవాదమే దేశానికి శ్రీరామరక్ష: భట్టి
పెనుబల్లి: లౌకిక వాదమే దేశానికి శ్రీరామరక్షని... విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని మతం, కులాల పేరుతో ప్రజల్లో చిచ్చు రగులుస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా కూసుమంచి నుంచి ‘ఆజాదీ కా గౌరవ్’ పేరుతో చేపట్టిన 75 కి.మీ. పాదయాత్ర ఆదివారం రాత్రి పెనుబల్లి మండలం వీఎం బంజర్ రింగ్ సెంటర్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో భట్టి మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశ ప్రజలకు చెప్పుకోదగ్గ ఒక్క పథకాన్ని కూడా రూపొందించలేదని విమర్శించారు. ఆహార భద్రత, ఉపాధి హామీ, అటవీ భూములకు పట్టాలు, బహుళార్థసాధక ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు కాంగ్రెస్ పాలనలోనే జరిగాయని ఆయన గుర్తు చేశారు. బీజేపీ పార్టీ స్వాతంత్య్రోద్యమాన్ని పక్కదారి పట్టించే కుట్రలు చేస్తోందని విమర్శించారు. బహుళజాతి సంస్థలు, భూస్వాములు, పెట్టుబడిదారుల కింద ప్రతి ఒక్కరూ బానిసలుగా బ్రతకాల్సి వస్తుందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ..కాంగ్రెస్ త్యాగాలతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించగా, బీజేపీ నేతలు తామే స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చినట్లుగా చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. -
రాహుల్ సారథ్యం వహించాలి
సాక్షి. హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) తీర్మానించింది. సోనియా, రాహుల్ల నాయకత్వమే అటు దేశా నికి, ఇటు పార్టీకి శ్రీరామరక్ష అని, గాంధీ–నెహ్రూ ల కుటుంబమే పార్టీ బాధ్యతలు తీసుకుని కేడర్ను ముందుకు నడపాలని కోరింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, సీతక్కలు హాజ రు కాగా, నియోజకవర్గ పర్యటనలో ఉన్న మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హాజరు కాలేదు. సమావేశంలో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, సీడబ్ల్యూసీ సమావేశంలో జరిగిన చర్చ, జీ–23 నేతల వ్యాఖ్యలు, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ చర్చ అనంతరం సోనియా, రాహుల్ల నాయకత్వంపై విశ్వాసం ప్రకటిస్తూ తెలంగాణకు చెందిన పార్టీ ఎమ్మెల్యేల పక్షాన తీర్మానం చేశారు. ఈ తీర్మాన ప్రతిపై భట్టి విక్రమార్క, టి.జీవన్రెడ్డిలు సంతకాలు చేశారు. అసెంబ్లీలో సమయం ఇవ్వలేదు బడ్జెట్ సమావేశాలపై చర్చిస్తూ.. ప్రజల పక్షాన మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీకి తగిన సమయం ఇవ్వలేదని, అటు స్పీకర్ సహకరించలేదని, ఇటు మంత్రులు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని రెచ్చగొట్టేలా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. ఇటీవల మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి నివాసంలో సీనియర్లు భేటీ కావడం, ఈ భేటీకి ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డిలు హాజరుకావడంపై ఎమ్మెల్యే సీతక్క ఆరా తీసినట్టు తెలిసింది. సోనియా, రాహుల్పై విమర్శలు తగవు: భట్టి సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి భట్టి విలేకరులతో మాట్లాడారు. ప్రధాని పదవి చేపట్టే అవకాశాలు వచ్చినా సోనియా, రాహుల్లు ఆ పదవిని వద్దనుకుని దేశం కోసం నిలబడ్డారని చెప్పారు. కపిల్ సిబాల్ లాంటి నాయకులు సోనియా, రాహుల్లపై విమర్శలు సరికావన్నారు. 1970లో అధికారాన్ని కోల్పోయి 1980లో పూర్వ వైభవం సంతరించుకున్న తరహాలోనే 2014లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ హవా 2023– 24లో దేశంలో వీస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పారు. -
సీఎల్పీ విలీనంపై స్పీకర్కు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దాఖలైన తాజా వ్యాజ్యంలో రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ అధిపతిగా వ్యవహరించే శాసనసభ స్పీకర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన పైలట్ రోహిత్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డి.సుధీర్రెడ్డి, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగ కాంతారావు, ఆత్రం సక్కు, వనమా వెంకటేశ్వరరావు, జె.సురేందర్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు ఇచ్చింది. గతంలో ఇదే తరహాలో దాఖలైన మరో రెండు వ్యాజ్యా లతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. శాసనమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయడం చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇప్పటికే రిట్ దాఖలు చేశారు. ఈ కేసులో పదో షెడ్యూల్ నిబంధనల ప్రకారం ట్రిబ్యు నల్గా వ్యవహరించే మండలి చైర్మన్కు, ఇతర ప్రతి వాదులకు హైకోర్టు మంగళవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మండలిలో మాదిరిగా అసెంబ్లీలోనూ చేయనున్నారంటూ గత ఏప్రిల్ 29న కాంగ్రెస్ నాయకులు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క దాఖలు చేసిన కేసులోనూ అదే తరహా నోటీసులు శాసనసభ స్పీకర్, ఇతరులకు జారీ అయ్యా యి. బుధవారం జరిగిన తాజా రిట్ను కూడా ఉత్తమ్, భట్టిలే దాఖలు చేశారు. ఈ కేసులన్నింటినీ కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. -
‘పదో షెడ్యూల్ ప్రకారమే పార్టీ మారాం’
సాక్షి, హైదరాబాద్ : రాజ్యాంగ బద్ధంగానే తాము టీఆర్ఎస్లో చేరామని పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగ కాంతారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్రూపిజంతో సతమతమవుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని వీడటానికి గల కారణాలను లేఖ ద్వారా స్పష్టంగా వివరించామని తెలిపారు. అవసరమైతే రాజీనామా చేస్తామని కూడా లేఖలో పేర్కొన్నామన్నారు. రాజ్యాంగ బద్ధంగా తమకున్న హక్కుతోనే సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయమని స్పీకర్కు వినతి పత్రం ఇచ్చామని స్పష్టం చేశారు. పార్టీ విలీనం గురించి పదో షెడ్యూల్లో స్పష్టంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలకు చదువురాదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని రేగా మండి పడ్డారు. తమ మీద అనవసర ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. పరిషత్ ఎన్నికల్లో ఉత్తమ్, భట్టి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవి చూసిందని ఆయన విమర్శించారు. అమ్ముడుపోవడానికి జంతువులం కాదు : గండ్ర ప్రలోభాలకు లొంగిపోవడానికి.. పదవులకు అమ్ముడుపోవడానికి మేం గొర్రెలు, బర్రెలం కాదని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపై తమకున్న అసంతృప్తిని చాలాసార్లు అధిష్టానానికి తెలియజేశామన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారమే టీఆర్ఎస్లో చేరామని తెలిపారు. ఎవరూ పాలన చేసినా రాజ్యాంగం ప్రకారమే చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు పార్టీని వీడుతున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చేరికలు జరుగుతున్నాయన్నారు. తన నిర్ణయాన్ని ప్రజలు సమర్థించారని.. అందుకే జడ్పీ ఎన్నికల్లో తన భార్య జ్యోతి 10 వేల మెజార్టీతో గెలిచిందన్నారు. రాష్ట్ర సంక్షేమమే తన మొదటి ప్రాధాన్యమన్నారు గండ్ర. -
టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం.. హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో శాసనసభ స్పీకర్, కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా చేశారు. గతంలో దాఖలు చేసిన ఇదే తరహా కేసు విచారణ కూడా ఇవాళ ఉందని చెప్పడంతో రెండింటినీ కలిపి విచారిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. మరోవైపు 12 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్లో ఉంది. -
భట్టి దీక్ష భగ్నం, నిమ్స్కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు సోమవారం ఉదయం భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా నిమ్స్కు తరలించారు. భట్టి విక్రమార్క బీపీ, షుగర్ లెవల్స్, ఎర్ర రక్తకణాలు పడిపోవడంతో తక్షణమే వైద్యం అందించాలని ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు ...ఆయనను అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించగా, వైద్యం చేయించుకునేందుకు భట్టి నిరాకరిస్తున్నారు. -
టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైన సీఎల్పీ
-
టీఆర్ఎస్లో సీఎల్పీ.. త్వరలో వీలినం?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనానికి రంగం సిద్ధమైంది. మున్సిపల్, రెవెన్యూ కొత్త బిల్లుల ఆమోదం కోసం మే నెలలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లోపే టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం పూర్తి కానుంది. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరికపై వారం రోజుల్లోపే అధికారికంగా ప్రకటన వచ్చే చాన్సుంది. తర్వాత టీఆర్ఎస్లో సీఎల్పీ విలీన ప్రక్రియ వేగంగా పూర్తి కానుంది. దీనికి సంబంధించి అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. సీఎల్పీ విలీనానికి అవసరమైన న్యాయ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఈ విషయాన్ని ఇటీవలే ధ్రువీకరించారు. విలీనం ఖాయమని దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్లో ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ మిగలరని చెప్పారు. కాగా.. కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితే టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనానికి అవసరమైన అంశాలన్నీ పూర్తయినట్లేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే రాష్ట్రంలో కొత్త రాజకీయానికి తెరలేవనుంది. తెలంగాణ అసెంబ్లీలో మొదటిసారిగా మజ్లిస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించనుంది. హైదరాబాద్ నగరానికి పరిమితమైన పార్టీగా భావించే మజ్లిస్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా కీలకపాత్ర పోషించనుంది. టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం తర్వాత మజ్లిస్కు ఏడుగురు, కాంగ్రెస్కు ఆరుగురు ఎమ్మెల్యేలు మిగలనున్నారు. సీఎల్పీ విలీనం తర్వాత కాంగ్రెస్ సభ్యుల బలం ఇంకా తగ్గే అవకాశం ఉందని టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. లెక్కలన్నీ పక్కాగా వేసుకుని 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ ఆధిక్యంతో రెండోసారి అధికారం చేపట్టింది. టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ 19, మజ్లిస్ 7, టీడీపీ 2, బీజేపీ 1, ఏఐఎఫ్బీ 1, స్వతంత్ర అభ్యర్థిæ ఒకచోట గెలిచారు. ఫలితాల అనంతరం ఏఐఎఫ్బీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ (రామగుండం), స్వతంత్ర ఎమ్మెల్యే లావుడ్య రాములునాయక్ (వైరా) టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు ఆసక్తి కనబరిచారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలస మొదలైంది. కాంగ్రెస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, పట్లోళ్ల సబితారెడ్డి, బానోత్ హరిప్రియానాయక్, కందాల ఉపేందర్రెడ్డి, దేవిరెడ్డి సుధీర్రె రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, వనమా వెంకటేశ్వర్రావు, జాజుల సురేందర్, గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరు ఎమ్మెల్యే చేరికకు రంగంసిద్ధమైంది. నలుగురు ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉందని.. ప్రస్తుతం ఇద్దరు చేరతారని టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడిన వెంటనే టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం ప్రక్రియ పూర్తి కానుంది. కాంగ్రెస్ను వీడుతున్న 13 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ విలీనంపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి ఉమ్మడిగా లేఖ ఇవ్వనున్నారు. వెంటనే దీనిపై స్పీకర్ ప్రకటన జారీ చేయనున్నారు. అనంతరం అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఆరుకు తగ్గనుంది. దీంతో సభలో ఏడుగురు సభ్యులున్న మజ్లిస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించనుంది. నిబంధనల ప్రకారం మజ్లిస్కు అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేకున్నా.. సంఖ్యా బలం ప్రకారం ప్రధాన ప్రతిపక్షంగా మారనుంది. ఇంటర్ వివాదం నేపథ్యంలో పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు ముందే సీఎల్పీ విలీనం ప్రక్రియ పూర్తవుతుందని టీఆర్ఎస్ ముఖ్యులు భావిస్తూ వచ్చారు. అయితే ఇంటర్మీడియట్ మార్కుల వివాదం నేపథ్యంలో రాజకీయ నిర్ణయాలను కొన్ని రోజులు వాయిదా వేయాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ఇంటర్మీడియట్ వివాదం విషయం సద్దుమణిగిన తర్వాతే సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తవుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా అసెంబ్లీ సమావేశాలలోపే సీఎల్పీ విలీనం జరిగి.. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరం కానుంది. టీడీపీ సైతం.. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ శాసనసభాపక్షాన్ని సైతం టీఆర్ఎస్లో విలీనం దిశగా అధికార పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట) ఎమ్మెల్యేలుగా గెలిచారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే ప్రకటించారు. లోక్సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా మరో ఎమ్మెల్యేను చేర్చుకునేలా టీఆర్ఎస్ ఏర్పా ట్లు చేస్తోంది. ఇద్దరు ఒకేసారి చేరడంతో టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసే అవకాశముంది. దీనికి అనుగుణంగానే సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికీ అధికారికంగా తమ పార్టీలో చేరలేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో సీఎల్పీని విలీనం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ పిటషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హైకోర్టు పేర్కొంది. అనంతరం ఈ పిటిషన్పై తదుపరి విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది జంద్యాల రవిశంకర్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాగా, కాంగ్రెస్ను టీఆర్ఎస్లో విలీనం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఆ పార్టీ శాసనసభ పక్షనేత మల్లు భట్టివిక్రమార్క హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ‘విలీనం’పై జోక్యం చేసుకోండి -
ఎవరా ఇద్దరు?
సాక్షి, హైదరాబాద్: కొంత విరామం తర్వాత మళ్లీ వలసల వ్యవహారం తెరపైకి రావడం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పార్టీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలను దాదాపుగా తమ పక్షాన చేర్చుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ మరో ఇద్దరికీ ఆహ్వానం పలికి కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని (సీఎల్పీ) విలీనం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసిందన్న వార్తలు ప్రతిపక్ష కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం పార్టీలో మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో చేజారిపోతున్న ఆ ఇద్దరు ఎవరనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాస్త మరుగునపడిన వలసల వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో.. రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు కూడా అప్రమత్తం అవుతున్నారు. తమపార్టీ నుంచి ఎమ్మెల్యేలెవరూ వెళ్లడం లేదని ధీమా వ్యక్తం చేస్తూనే.. ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు. గండ్ర కూడా కారెక్కిన తర్వాత మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల్లో పార్టీని వీడి వెళ్లొచ్చనే భావిస్తున్నవారు ఏం చేస్తున్నారనే దానిపైనా దృష్టి సారించారు. వారి ఆలోచనలను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ పార్టీని వీడి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం కూడా ఈ అంశంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. సీఎల్పీ కూడా విలీనం చేసుకునే దిశలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయన్న విషయం తెలుసుకున్న ఢిల్లీ పెద్దలు కూడా పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరుంటారు? ఎవరు వెళ్లిపోతారనే దానిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సంతకాలు పెట్టేశారా? గతేడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేయాలంటే మొత్తం సంఖ్యలో 2/3 వంతుకు ఒకరు అదనంగా అంటే.. 13 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారికంగానే టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. తాజాగా సోమవారం గండ్ర కూడా కారెక్కుతున్నట్లు స్పష్టం చేశారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు వీరికి తోడయితేనే అది సాధ్యమవుతుంది. ఆ ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారని, ఈనెల 24న లేదంటే అసెంబ్లీ సమావేశాలు మళ్లీ మొదలయ్యేలోపు సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తవుతుందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ 11 మంది ఎమ్మెల్యేలతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు విలీనం నోటీసులపై సంతకాలు కూడా చేసేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఆ ఇద్దరు ఎవరన్న దానిపై గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ గిరిజన ఎమ్మెల్యేతోపాటుగా ఆసక్తికర వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎమ్మెల్యే ఒకరు ఈ జాబితాలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నా.. ఆయన మానసికంగా సిద్ధం కాలేదని కొందరంటున్నారు. స్వరం పెంచిన సీఎల్పీ నేత తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్వరం పెంచారు. సీఎల్పీని విలీనం చేసే దిశలో అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. సోమవారం గాంధీభవన్లో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ సీఎల్పీని విలీనం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదంటూనే.. ‘విలీనం చేసి చూడు. నీ ప్రభుత్వం ఉంటుందో? నువ్వుంటావో? మేమూ చూస్తాం. రాజ్యాంగ సంక్షో భం సృష్టించైనా నీ ప్రభుత్వం లేకుండా చేస్తాం’అని సీఎం కేసీఆర్నుద్దేశించి వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లుగా అన్నీ భరించి మౌనంగా ఉన్నామని, ఇప్పుడు ఊరూరా తిరిగి నిలదీస్తామని భట్టి హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరగబడతారని, భవిష్యత్తులో కేసీఆర్ను కుక్కలు కూడా కానవన్నారు. ఎంత మంది ఎమ్మెల్యేలు మిగిలినా వారితో కలిసి యుద్ధం చేస్తామే తప్ప నీ ముందు మోకరిల్లే ప్రసక్తే లేదని ఆయన కేసీఆర్నుద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. ఐదుగురే మిగులుతారా? ఇప్పటికిప్పుడే కాకపోయినా.. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాతే వలసలు ఉండొచ్చని జోరుగా చర్చ జరుగుతోంది. లోక్సభ ఫలితాలు తారుమారైతే.. ప్రస్తుతం మిగిలిన 8 మంది ఎమ్మెల్యేల్లో మరో నలుగురు చేజారడం ఖాయమని, కేవలం ఐదుగురు మాత్రమే మిగులుతారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. దీనికి అనుగుణంగానే ఓ ఎమ్మెల్యే మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ నిర్ణయం తీసుకునేందుకు ఓ బలహీన క్షణం సరిపోతుందని, అయితే ఆ క్షణం కోసం మే 23వ తేదీ తర్వాతే ఆలోచిస్తానని వ్యాఖ్యా నించడం గమనార్హం. మొత్తంమీద ప్రస్తుత పరిస్థితుల్లో సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేస్తారా? ఎప్పుడు చేస్తారు? మళ్లీ వలసలుంటాయా? ఉంటే ఇప్పుడే ఉంటాయా? లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాతేనా? పార్టీని వీడి వెళ్లిపోయేది ఎవరు? ఉండేదెవరు? అనే దానిపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుండటం గమనార్హం. -
సీనియర్లకు త్యాగాలు తప్పవు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ జోరుపెంచారు. ఇటీవల ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశమైన రాహుల్ శనివారం దేశవ్యాప్తంగా ఉన్న పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్ వార్రూమ్లో దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ సూచించారు. రైతన్నల కష్టాలు, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి కీలకాంశాలను ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మలచుకోవాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో రఫేల్ కుంభకోణమే ప్రధాన ప్రచారాంశంగా ఉంటుందన్న రాహుల్.. మోదీ ప్రభుత్వం తీసుకున్న రైతు, మహిళా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒక కుటుంబం–ఒకే టికెట్ యువ నాయకత్వం కోసం పార్టీలోని సీనియర్ నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో 2–3 సార్లు ఓటమిపాలైన నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ‘ఓ కుటుంబానికి ఒక టికెట్’ మాత్రమే ఇస్తామనీ.. తమ సన్నిహితులు, కుటుంబసభ్యుల కోసం నేతలు లాబీయింగ్ చేయొద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు నేతలంతా త్యాగాలకు సిద్ధం కావాలన్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దన్నారు. తప్పని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోక్సభ ఎన్నికల్లో పోటీచేయడంపై ఆయా రాష్ట్రాల పీసీసీలు నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. పొత్తులపై పీసీసీలకు పూర్తి స్వేచ్ఛ లోక్సభకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరి 25లోగా సమర్పించాలని పీసీసీ, సీఎల్పీ నేతలను రాహుల్ ఆదేశించారు. ఒక్కో లోక్సభ స్థానానికి గరిష్టంగా ముగ్గురు అభ్యర్థుల పేర్లను సూచించాలన్నారు. ఎన్నికల్లో విజయం కోసం స్థానిక, ఉపప్రాంతీయ పార్టీలతో పొత్తుల విషయంలో పీసీసీలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు. బూత్స్థాయిలో పార్టీని పటిష్టం చేసి ‘శక్తి యాప్’ ద్వారా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక సమస్యలపై దృష్టి సారించాలనీ, వాటిని ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీకి పంపాలని రాహుల్ సూచించారు. అలాగే ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన సార్వత్రిక కనీస ఆదాయ పథకాన్ని, యూపీఏ–1, యూపీఏ–2 హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో మోదీ హయాంలో జరిగిన అవినీతిని ఎండగట్టాలన్నారు. భేటీ అనంతరం రాహుల్ స్పందిస్తూ..‘ఈరోజు సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులతో సమావేశమయ్యాను. ఈ భేటీలో ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎన్నికల సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలు సహా పలు అంశాలపై చర్చించాం’ అని ట్వీట్ చేశారు. -
సీఎల్పీ లీడర్ను రాహుల్ నిర్ణయిస్తారా..?!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత (సీఎల్పీ) ఎన్నిక సమావేశం గాంధీభవన్లో హాట్హాట్ మొదలైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశమయ్యింది. శాసనసభ పక్ష నేతగా ఎవరిని నియమించాలనే నిర్ణయాధికారాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కట్టబెడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ ప్రక్రియకు అధిష్టానం తరఫున పరిశీలకుడిగా నియమితుడైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు చేరుకుని.. సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియపై కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని ఏఐసీసీకి అందించారు. వాటి ఆధారంగా సీఎల్పీ నేతను అధిష్ఠానం నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఇవాళే పూర్తవుతుందని, సాయంత్రానికల్లా సీఎల్పీ నేతను ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలతో పాటు టీకాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియా సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, సీఎల్పీ నేతగా భట్టివిక్రమార్క పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్బాబు కూడా రేసులో ఉన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పేరును పార్టీలోని కొందరు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. సీఎల్పీ లీడర్ పదవి తనకే కావాలంటూ పలువురు పట్టుబట్టడంతో గురువారం ఉదయం ప్రారంభమైన సీఎల్పీ సమావేశంలో గందరగోళం నెలకొంది. పాత నాయకత్వాన్ని పూర్తిగా బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారికి అవకాశమివ్వాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. సీఎల్పీ నేతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించాలని అన్నారు. అయితే, సీనియర్ నాయకుడిని అయినందున సీఎల్పీ లీడర్గా తనకే అవకాశమివ్వాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి డిమాండ్ చేశారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని అన్నారు. గత డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
సీఎల్పీ రేసులో ఉన్నా..!
మునుగోడు: తాను సీఎల్పీ రేసులో ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లా మునుగోడులో శనివారం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎల్పీ పదవి అప్పగిస్తే ప్రభుత్వంపై గట్టిగా పోరాడతానని పేర్కొన్నారు. అయితే.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తనకు పీసీసీ బాధ్యతలు అప్పగించి ఉంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్లు కేటాయించి 100 సీట్లలో గెలిపించేవాడినని వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నియంత వైఖరి వల్ల తాను ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు నెలరోజులైనా కనీసం ప్రమాణ స్వీకారం చేయలేదని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. సీఎం ఒంటెత్తు పోకడలకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత ఎంపికకు సన్నద్ధమైందని తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జరిగిన ఆలస్యం వల్లే రాష్ట్రంలో ప్రజా కూటమి ఓటమిపాలైందని ఆయన అభిప్రాయపడ్డారు. సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలతో పొత్తు కుదరక మూడు నెలల పాటు చర్చలు జరపడంతో అభ్యర్థుల ఎంపిక చాలా ఆలస్యమైందని పేర్కొన్నారు. అదే టీఆర్ఎస్ రెండు నెలల ముందే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి గ్రామాల్లో ఓటర్లని ప్రసన్నం చేసుకొని అధికస్థానాలు గెలవగలిగిందని వెల్లడించారు. అన్ని రోజులు కొట్లాడి అనుకున్న స్థానాలు తీసుకున్న సీపీఐ, జన సమితి పార్టీలు కనీసం ఒక సీటు కూడా గెలవకపోవడం విచారకరమన్నారు. -
సీఎల్పీ నేతగా ఎన్నికయ్యేదెవరో?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ఈ నెల 16 లేదా 17న జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు 17 నుంచి జరగనున్న నేపథ్యంలో సమావేశాల ప్రారంభానికి ముందే సీఎల్పీ సమావేశం నిర్వహిస్తారని చెబుతున్నా.. 17న అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులుగా ప్రమాణం చేసిన అనంతరమే సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఈ సమావేశానికి అధిష్టానం దూతగా కేరళకు చెందిన లోక్సభ సభ్యు డు, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ 15న రాత్రి హైదరాబాద్ రానున్నారు. ఈయన సమక్షంలో పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక జరగనుంది. దీంతో సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారన్నది పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేసిన మల్లు భట్టి విక్రమార్క, మాజీ మం త్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, సబి తా ఇంద్రారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, లోక్సభ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవమున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నా యి. వీరిలో ఉత్తమ్, భట్టిలను సీఎల్పీ నేతగా నియమించే విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సీఎల్పీ రేసులో రాజగోపాల్రెడ్డి, శ్రీధర్బాబుల పేర్లూ వినిపిస్తున్నాయి. రాజగోపాల్రెడ్డి పేరును అధిష్టానం తీవ్రంగానే పరి శీలిస్తోందని, ఇందుకు తగినట్టు గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మద్దతు కూడగట్టుకునే పనిలో రాజగోపాల్రెడ్డి కొంత చురుకుగానే ఉన్నారని ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ విప్ గా, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవమున్న శ్రీధర్బాబు కూడా రేసు లో ముందున్నట్టు తెలుస్తోంది. సీఎల్పీ నేతగా మహిళకు అవకాశం ఇవ్వాలనుకుంటే సబితా ఇంద్రారెడ్డిని నియమించే అవకాశాలున్నాయి. మొత్తంగా సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకుంటా రనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
టీపీసీసీ, సీఎల్పీ సమావేశాలు నిర్వహించాలి
పొంగులేటి సుధాకర్రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు, కుంభకోణాలు, వ్యవసాయంపై కార్యాచరణ కోసం టీపీసీసీ, సీఎల్పీ విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి కోరారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరుతూ బాధ్యులకు లేఖలు రాసినట్టుగా వెల్లడించారు. -
మంత్రి హరీష్రావుకు పొన్నం సవాల్
కరీంనగర్ : ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందని ప్రజలను రెచ్చగోట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు చేసిందేమిటో తెల్చుకునేందుకు బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు సవాల్ విసిరారు. కరీంనగర్లో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో 2013 భూసేకరణ చట్టాన్ని అమోదించడం జరిగిందని అప్పుడు ఇప్పటి టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం లోక్సభ సభ్యుడేనని గుర్తు చేశారు. 2013 భూసేకరణ చట్టం రైతులను ముంచే విధంగా ఉందని పదేపదే వల్లేవేస్తున్న మంత్రి హరీష్రావు కేసీఆర్ ఆ చట్టానికి ఆమోదం ఎలా తెలిపి ఓటు వేశాడో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెడుతూ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట కాలయాపన చేస్తూ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం హరీష్రావుకు తగదని సూచించారు. తాజాగా 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉభయసభల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోదం జరిపి రైతులను, భూనిర్వాసితుల నోట్లో మట్టికోట్టే చర్యలకు టీఆర్ఎస్, బీజేపీలు ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. 2013 భూసేకరణ చట్టం లో ఉన్న వాటి కంటే భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇస్తే స్వాగతిస్తామని ఏ ఒక్క నిబంధన రైతులకు హనీ కలిగే విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. -
జానా కాగితం పులి మాత్రమే
నాగార్జునసాగర్ : సీఎల్పీ నేత, సీనియర్ శాసనసభ్యుడు కె జానారెడ్డిపై టీఆర్ఎస్ నాయకుడు నోముల నర్సింహయ్య విరుకుపడ్డారు. జానారెడ్డి ఒక కాగితం పులి లాంటి వారని విమర్శించారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జానారెడ్డి రైతుల కోసం ఏమీ చేయలేకపోయారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరుతడుల ద్వారా సాగర్ ఆయకట్టుకు రెండు పంటలకు నీరిచ్చి రైతులకు అండగా నిలిచారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సాధమయ్యేనా అని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న జానారెడ్డి ఒక్కసారైనా ఎడమకాల్వపై పర్యటించారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ 16 వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్బంగా నిర్వహిస్తున్న వరంగల్ భహిరంగసభ చరిత్ర సృష్టిస్తుందని తెలిపారు. సంవత్సరానికి రెండు పంటలకు సంబంధించి 8 వేల రూపాయలు ఇస్తానని ప్రకటించడం పట్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. అదే విధంగా యాదవులు, నాయీబ్రాహ్మణులు, గిరిజనులు, ముస్లింలు సైతం ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. సంతోషాన్ని వరంగల్ సభకు భారీగా రావడం ద్వారా వారు తెలుపనున్నారన్నారు. నియోజకవర్గంలో 57వేలకు పార్టీ సభ్యత్వాలు చేరాయని, చేరిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా వరంగల్ బహిరంగ సభ పోస్టర్ను వారు విడుదల చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కేవీ రామారావు, పగిల్ల సైదులు, అంకతి వెంకటరమణ, రాం అంజయ్యయాదవ్, బొల్లం శ్రీను, బొల్లం రవి, కావేటి రాము, మన్నెం రంజిత్ యాదవ్, పరమేష్, సుజయ్, కేశబోయిన జానయ్య, పిల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాల్లో నా స్టైల్ నాకుంది
నా పనితీరు బాగోలేదని ఎవరూ అన్లేదు: జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: శాసనసభలో తన పనితీరు బాగోలేదని ఎవరూ చెప్పలేదని సీఎల్పీ నేత కె.జానారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘సీఎల్పీ పనితీరు బాగాలేదని, మారుస్తారని మీడియాలో రాసే రాతలకు భయపడను, బాధపడబోను. పెద్ద మనిషి తరహాలో నేను సీఎల్పీ నేతగా వ్యవహరిస్తున్నా. ఇప్పటి పోటీ రాజకీయాలకు నేను సరిపోననే అభిప్రాయం కొందరికి ఉంటే ఉండొచ్చు. రాజకీయాల్లో ఎలా పనిచేయాలనే దానిపై నాకో స్టైల్ ఉంది. పార్టీ వ్యూహాలు, ఎత్తుగడలు పరిస్థితులను బట్టి మారుతుంటాయి. వాటిని ఎమ్మెల్యేలైనా, ఇంకెవరైనా ముందుగానే లీక్ చేయడం సరికాదు. నా పని తీరు బాగాలేదని ఎవరూ నాతో చెప్పలేదు’ అని పేర్కొన్నారు. సీఎల్పీ పదవిపై ఎవరికైనా ఆసక్తి ఉంటే చెప్పాలని తమ ఎమ్మెల్యేలకు ముందుగానే సూచించానన్నారు. -
సిద్ధుపై స్వపక్షం గరం గరం
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం (సీఎల్పీ) వాడివేడిగా సాగింది. స్వపక్ష నాయకులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని సమాధాన పరచడానికి సీఎం సిద్ధు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని సమాచారం. శీతాకాల సమావేశల సందర్భంగా ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన బెళగావిలో బుధవారం సీఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... సమావేశం ప్రారంభమైన వెంటనే రాష్ట్రంలో కరువు నిర్వహణ పనులు సరిగా సాగడం లేదని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై రూపొందించిన నియమ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. ట్యాంకర్ల ద్వారా కనీసం తాగునీటి సరఫరా సాగడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని సిద్ధరామయ్య దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎన్ని గోశాలలు, పశుగ్రాసం బ్యాంకులు ఏర్పాటు చేశారన్న విషయంపై ప్రభుత్వ అధికారుల వద్దే సమాధానం లేదన్నారు. ఇక చెరువుల్లో పూడిక తీతకు ఇది సరైన సమయమని అరుుతే ఇన్ఛార్జ్ మంత్రుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఆ పనులు చాలా చోట్ల ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత మంత్రుల వద్ద మాట్లాడటానికి ప్రయత్నించినా ’సమయం లేదన్న’ సమాచారం అమాత్యుల నుంచి వస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పరిస్థితి ఇలా ఉంటే తాము నియోజకవర్గాల్లో ఎలా తిరగాలని సిద్ధరామయ్యను నేరుగా ప్రశ్నించాలరు. రుణమాఫీ విషయమై స్పష్టత ఏదీ? రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసి కూడా రుణమాఫీ విషయంపై తీసుకునే నిర్ణయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని సీఎం సిద్ధరామయ్యను నిలదీశారు. మీరు ఒక మాట చెబుతుంటే మంత్రులు మరో మాట చెబుతున్నారంటూ సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ను ఉద్దేశించి కొంతమంది ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కర్ణాటకలో బలవన్మరణాలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు అందజేసే పరిహారం విషయంలో కూడా మనం నిర్లక్ష్యంగా వ్యవహరించామని సీఎం సిద్ధరామయ్యతో స్వపక్ష నాయకులు పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచి కర్ణాటకకు అందిన నిధుల్లో రూ.67.90 లక్షలను ఎందుకు వెనక్కు పంపించాల్సి వచ్చిందని నిలదీశారు. ఈ విషయం తాము చెబుతున్నది కాదని కంప్ట్రోలర్ అండ్ అడిట్ జనరల్ (కాగ్) నివేదికలో ఇందుకు సంబంధించిన వివరాలు స్పష్టంగా పేర్కొందని ఆయనకు వివరించారు. దీంతో సీఎం సిద్ధరామయ్య అక్కడే ఉన్న మంత్రుల పై కొంత గరం అయ్యారు. క్షేత్రస్థారుులో ఇన్ని ఇబ్బందులు ఉంటే ఎందుకు తన దృష్టికి తీసుకురాలేదని కనీసం మంత్రి మండలి సమావేశాల్లో కూడా ఎందుకు చర్చించలేదని కోపగించుకున్నారు. అటు పై సహచరలను శాంతపరుస్తూ...’సహకార బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అందుకోసమే నివేదిక తయారు చేస్తున్నాం. ఈ విషయంలో ఎంటుంటి అపోహలు వద్దు. ఇక కేంద్రం నుంచి పరిహారం నిధులు వెనక్కు వెళ్లడానికి సదరు పరిహారం అందించడానికి రూపొందించిన నిబంధనలే కారణం. నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించకూడదు కదా? అరుునా ఇకపై ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుందాం. మన మధ్య పొరపొచ్చలు వద్దూ’ పలు విధాలుగా సహచరులకు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు సీఎల్పీ సమావేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఇక తన్వీర్ సేఠ్ను నీలి చిత్రాలను చూస్తూ దొరికి పోరుున విషయానికి సంబంధించి చట్టసభల్లో విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించవచ్చవచ్చునని సీఎల్పీ సమావేశంలో సీఎం సిద్ధు పేర్కొన్నారు. అందువల్ల అందరూ కలిసికట్టుగా ఉంటూ విపక్షాల ఆరోపణలను ఎదుర్కొనాలని ఆయన సహచరులకు దిశానిర్దేశం చేశారు. -
హామీలను అమలు చేయడం లేదు
నార్కట్పల్లి : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయకుండా ప్రజలను, రైతులను మాటల గారడీతోనే పాలన వెల్లబుచ్చుతున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతులు అడగక ముందుకే రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ రుణమాఫీ చేయకుండా విడతలుగా ఏర్పాటు చేసి అదీ కూడా ఇవ్వకుండా రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ నిరుద్యోగుల సమస్య ఈనాటికి పరిష్కారం కాలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, మూడెకరాల భూమి ఎస్సీలకు ఇస్తామని చెప్పి కేవలం తన జిల్లాకే ఇస్తే రాష్ట్రమంతటా ఇచ్చినట్టా అని ప్రశ్నించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకువచ్చేందుకు రైతులు, ప్రజలే ముందుకు వస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, ఎంపీటీసీలు ఐతరాజు యాదయ్య, కన్నెబోయిన వెంకటాద్రి, దాసరి కృష్ణ, సర్పంచ్ కొండూరు శంకర్, దేవస్థాన మాజీ చైర్మన్ మేకల రాజిరెడ్డి, నాయకులు జహంగీర్, శ్రీనివాస్రెడ్డి, రవీందర్, శశిధర్రెడ్డి, సైదులు, సత్తిరెడ్డి, సత్తి, మనోహర్, వెంకటచారి, శంకర్, సలీం తదితరులున్నారు. -
రైతులను విస్మరించిన ప్రభుత్వం
తిప్పర్తి : పూర్తిస్థాయి రుణమాఫీ చేయకుండా.. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరించిందని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. మంగళవారం తిప్పర్తి మండలం రాజుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. రైతులను పట్టించుకోకుండా ప్రజా ప్రతినిధుల జీతాలు పెంచి ఏం ఘనకార్యం సాధించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. రెండేళ్లుగా రైతులు కరువుతో ఇబ్బందులు పడ్డ రైతుల కష్టాలను పట్టించుకునే దిక్కే లేకుండా అయ్యిందన్నారు. తనకు పదవీ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉంటూ పేదల అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారం చేపట్టిన కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని.. ఇంత దరిద్రమైన పాలన ఎక్కడా, ఎప్పుడూ లేదన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, జూకురి రమేష్, వెంకట్రాంరెడ్డి, కోఆప్షన్ అబ్దుల్ రహీం, సంకు ధనలక్ష్మి, మెరుగు వెంకన్న, మర్రి యాదయ్య, జానయ్య, ప్రసాద్, శంకర పరశురాములు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, త్వరలోనే అధికార పార్టీలో చేరతారని సొంత పార్టీ శ్రేణులే కామెంట్లు చేస్తుండటంపై సీఎల్పీ నేత జనారెడ్డి ఘాటుగా స్పందించారు. తాను టీఆర్ఎస్ లోకి వెళుతున్నాననే వార్తలు పీసీసీ ఆఫీస్ బేరర్లే రాయించారని మండిపడ్డారు. తనపై నమ్మకం లేకుంటే సీఎల్పీ పదవి నుంచి తప్పుకుంటానన్నారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన సీఎల్పీ భేటీలో జానారెడ్డి ప్రసంగం.. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలను కలవరపాటుకు గురిచేసింది. 'పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎవరైనా ఆరోపణలు చేస్తే సీఎల్పీ నేతగా నేను వెంటనే ఖండిస్తా. అలాంటిది చాలా రోజులుగా నాపై సాగుతోన్న దుష్ప్రచారాన్ని ఎవ్వరూ ఖండించలేదు. నేను టీఆర్ఎస్ లో చేరుతానంటూ వచ్చిన వార్తలను ఉత్తమ్ కుమార్ ఖండించి ఉండాల్సింది. నిజానికి పీసీసీ ఆఫీస్ బేరర్లే ఆ వార్తలు రాయించారు. నా నాయకత్వంపై నమ్మకం లేకుంటే చెప్పండి.. సీఎల్పీ పదవి నుంచి తక్షణమే తప్పుకుంటా' అని జానారెడ్డి ఎమ్మెల్యేలతో అన్నారు. ఒక్కసారిగా సీఎల్పీ నేత అలా మాట్లాడటంతో విస్తుపోయిన ఎమ్మెల్యేలు.. క్షణాలపాటు బిత్తరపోయి, వెంటనే తేరుకున్నారు. 'మీరే మా నాయకుడిగా ఉండాలి' అని మూకుమ్మడిగా జనారెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత సాగునీటి ప్రాజెక్టులపై ఇవ్వాలనుకున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆలస్యం అవుతుండటంపై సీఎల్పీ చర్చించింది. వీలైనంత తొందరగా ప్రెజెంటేషన్ కు ఏర్పాట్లు పూర్తిచేయాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సమావేశానికి హాజరైనవారిలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతా రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి, పద్మావతి, జీవన్ రెడ్డి, భాస్కర్ రావు, సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు. -
ఆత్మహత్యలపై సభలో సమరమే
కాంగ్రెస్ శాసనసభాపక్షం నిర్ణయం * అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ * స్పీకర్, మండలి చైర్మన్పై అవిశ్వాసానికి యోచన * సమావేశాలు 20 రోజులు జరపాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్యలు, కరవుపై చర్చించేదాకా శాసనసభలో పట్టుబట్టాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నిర్ణయించింది. మంగళవారం అసెంబ్లీ కమిటీహాల్లో సీఎల్పీనేత కె.జానారెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఎంపీలు సమావేశమయ్యారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈ నెల 23న ప్రారంభమయ్యే అవకాశమున్న నేపథ్యంలో అందులో అనుసరించాల్సిన వ్యూహంపై సుమారు 4 గంటలపాటు చర్చించారు. రైతు ఆత్మహత్యలు, కరవును పట్టించుకోకపోవడం, ప్రత్యామ్నాయ వ్యవసాయవిధానం ప్రకటించకపోవడం, వాటర్గ్రిడ్లో అక్రమాలు, ప్రాజెక్టుల డిజైన్ల మార్పు, సబ్ప్లాన్ అమలులో నిర్లక్ష్యం, పార్టీ ఫిరాయింపులు వంటివాటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. ఎన్నో ప్రజా సమస్యలున్నందున సమావేశాలను నాలుగైదు రోజులకే పరిమితం చేయకుండా కనీసం 20 రోజులపాటు నిర్వహించేలా కోరాలని నిర్ణయించారు. రైతు ఆత్మహత్యలపై, కరవుపై చర్చించాలని శాసనసభ మొదటిరోజున వాయిదా తీర్మానం ఇస్తామని, దీనిపై చర్చించేదాకా సభా కార్యకలాపాలను అడ్డుకోవాలని నిర్ణయించినట్టుగా ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, ఫారూఖ్ హుస్సేన్ మీడియాకు వెల్లడించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలుచేయకుండా, కోర్టు నోటీసులను తీసుకోకుండా ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తున్న స్పీకరుపై, శాసనమండలి చైర్మన్పై అవిశ్వాసం పెట్టడానికి కూడా వెనుకాడబోమని చెప్పారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్సీలకు మూడెకరాల భూపంపిణీలో వైఫల్యం వంటివాటిపైనా చర్చకు పట్టుపడతామన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలుకోసం మండల రెవెన్యూ, ఆర్డీఓ, కలెక్లర్ల కార్యాలయాల వద్ద నిరసనలు చేపడతామని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులా? మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సమావేశంలో తమ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై సీఎల్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విపక్ష ఎమ్మెల్యేపై అధికారపక్షానికి చెందిన గువ్వల బాలరాజు దాడిచేయడం, ఆ మరునాడే ఆ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనకు తీసుకుపోవడంపై మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో భద్రాచలం, దుమ్ముగూడెం, గిరిజన ఆదివాసీలు ముంపుబారిన పడకుండా డిజైను మార్చాలంటూ అసెంబ్లీ మొదటి సమావేశాల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసినా పట్టించుకోవడం లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. ముఖ్యమైన ఈ అంశంపై జానారెడ్డితో సహా సీనియర్ ఎమ్మెల్యేలెవరూ సరైన రీతిలో స్పందించడం లేదని, దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెబుతూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం ఆధ్వర్యంలో నిర్మాణం జరిగేలా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ను, ప్రధానిని, అధిష్టానాన్ని కలుస్తానని చెప్పారు. చాలా అంశాల్లో వ్యతిరేకత మూ టగట్టుకున్న ప్రభుత్వాన్ని రైతు వ్యతి రేక ప్రభుత్వంగా ఈ శాసనసభ సమావేశాల్లో నిరూపిం చాలని ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి సూచించారు. జానా తీరుపై జీవన్రెడ్డి ఆగ్రహం ప్రాజెక్టుల డిజైన్ల మార్పుపై సీఎల్పీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రాజెక్టు రీడిజైన్లపై అధ్యయనం చేసిన తరువాతే అభిప్రాయాలు చెబితే బాగుంటుందన్న సీఎల్పీ నేత జానారెడ్డి వ్యాఖ్యలపై సీనియర్ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డిజైన్ల మార్పును వ్యతిరేకించాల్సిందేనని, దీనిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని జీవన్రెడ్డితో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్రెడ్డి, మాగం రంగారెడ్డి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టుల డిజైన్లను మార్చడాన్ని సభలో గట్టిగా వ్యతిరేకించాలని వారు కోరారు. శాసనసభ్యుల సూచనలు, కోరిక మేరకే నడుచుకుంటానని, ప్రభుత్వాన్ని నిలదీసే వారికి మద్దతుగా ఉంటానని వాదనల తరువాత జానా చెప్పారు. సీఎల్పీ నాయకునిగా మద్దతు ఇవ్వడానికే పరిమితం కాకుండా, సభ్యులకు నాయకత్వం వహిస్తూ ప్రభుత్వంపై పోరాడాలని జీవన్రెడ్డి సూచించారు. -
'అవసరమైతే అవిశ్వాసతీర్మానం'
హైదరాబాద్: అసెంబ్లీ కమిటీహాల్లో తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్షం మంగళవారం సమావేశమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల పై చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణాలు మొత్తం మాఫీ చేసేలా ప్రభుత్వం పై పోరాడాలని సీఎల్పీ తీర్మానం చేసింది. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం దిగొచ్చేవరకు అసెంబ్లీ స్తంభింప చేయాలని సీఎల్పీ నిర్ణయించింది. ప్రజా సమస్యలు చర్చకు రానీయకపోతే అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ ఛైర్మన్ పై అవసరమైతే అవిశ్వాస తీర్మనం పెట్టాలని సీఎల్పీలో నిర్ణయించారు. ప్రజా సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొందాం!
సీఎల్పీ అత్యవసర భేటీలో నేతలు సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై దాడిని కాంగ్రెస్ శాసనసభాపక్షం తీవ్రంగా పరిగణించింది. అధికార టీఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కోవాలని, నేరుగా పోరాట పంథాకు దిగాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం జరిగిన అత్యవసర భేటీలో ఈ మేరకు తీర్మానించారు. ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడుతున్న టీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నరుకు వినతిపత్రాన్ని ఇచ్చి, ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమిద్దామని జానా, ఉత్తమ్ తదితరులు అభిప్రాయపడగా... ఇంకా గవర్నర్కు, సీఎంకు వినతిపత్రాలంటూ కాలయాపన అనవసరమని పలువురు ఎమ్మెల్యేలన్నారు. వాటి ద్వారా ఒరిగేదేమీ లేదని ఎంపీ వి.హనుమంతరావు వాదించారు. విపక్ష ఎమ్మెల్యేలపై దాడులతో టీఆర్ఎస్ నేతలు రెచ్చిపోతున్నారని మాజీ మంత్రి డి.కె.అరుణ విమర్శించారు. అవసరమైతే టీడీపీతో సహా అన్ని పార్టీలతో కలిసి టీఆర్ఎస్ను ఎదుర్కొందామన్నారు. దానివల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి తదితరులన్నారు. ఎన్టీఆర్ వంటివారినే ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ను ఎదుర్కోవడం పెద్ద విషయం కాదన్నారు. సౌమ్యులుగా పేరున్న చిన్నారెడ్డి, చిట్టెంలపైనే దాడికి దిగితే తనవంటి వారి పరిస్థితేమిటని ఎమ్మెల్యే సంపత్కుమార్ ప్రశ్నించారు. గవర్నర్ను కలవకుండానే నేరుగా సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిద్దామని యువ ఎమ్మెల్యేలన్నారు. అపాయింట్మెంట్ తీసుకున్నాక కలవకపోవడం సరికాదని సీనియర్లు అనడంతో రాజ్భవన్కు బయల్దేరారు. 7న జిల్లా కేంద్రాల్లో నిరసనలు: ఉత్తమ్ టీఆర్ఎస్ దురాగతాలను నిరసిస్తూ, రైతు సమస్యల పరిష్కారం కోరుతూ ‘రైతును రక్షించండి-ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి’ నినాదంతో 7న సోమవారం జిల్లా కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు నిర్వహించాలని ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. సాగును నిర్లక్ష్యం చేయడం, రైతు ఆత్మహత్యలను పట్టించుకోకపోవడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ భౌతిక దాడులు తదితరాలను నిరసిస్తూ ప్రభుత్వంపై పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
సర్కారుపై సమరమే...
-
సర్కార్పై దూకుడు పెంచుదాం
కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై దూకుడు పెంచాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నిర్ణయించింది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ల మార్పుపై టీఆర్ఎస్ సర్కారును రాజకీయంగా ఎదుర్కోవాలని నిశ్చయించింది. అలాగే పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ను నిలదీయాలని నిర్ణయం తీసుకుంది. ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎల్పీ నేత జానారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ సాగింది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కూడా హాజరయ్యారు. ‘ప్రాణహిత’ చుట్టూ చర్చ... ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సాంకేతికంగా అధ్యయనం చేశాకే స్పష్టమైన వైఖరి తీసుకోవాలంటూ పలువురు సభ్యులు అభిప్రాయపడగా ఈ ప్రతిపాదనను మెజారిటీ సభ్యులు వ్యతిరేకించారు. కాంగ్రెస్ హయాంలో మొదలైన ప్రాజెక్టులను కేసీఆర్ సర్కారు రాజకీయ కోణంలోనే సాంకేతిక కారణాల పేరిట మారుస్తోందని వాదించారు. దీనిపై సీఎల్పీ నేత జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్కకు మధ్య కొంత వాదన జరిగింది. ప్రాణహితపై లోతుగా అధ్యయనం చేశాకే ఉద్యమించాలంటూ జానారెడ్డి చేసిన సూచనలపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రాణహితను పాత డిజైన్తో పూర్తి చేస్తే కాంగ్రెస్కు పేరొస్తుందనే సీఎం కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్ మారుస్తున్నారు. ఈ ప్రాజెక్టును పాత డిజైన్తోనే పూర్తి చేయాలని ప్రభుత్వంపై మనం కొట్లాడాలి. దీనికి సాంకేతిక కారణాల సాకుతో మెతక వైఖరి మంచిది కాదు’ అని వాదించారు. దీనిపై జానా స్పందిస్తూ ‘ఏ అంశమైనా లోతుగా పరిశీలించాకే పోరాటం మొదలుపెడతా. ఈ విషయంలో నా వైఖరిని తప్పుబడుతూ కొందరు మీడియాకు లీకులిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మనం చేసిందేమిటి, టీఆర్ఎస్ చేస్తున్నదేమిటి, దానివల్ల ప్రజలకు జరిగే నష్టం ఏమిటనే విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడి నా స్థాయిని దిగజార్చుకొని అభాసుపాలు కాలేను. నా వైఖరి నచ్చకుంటే నాకు సెలవు ఇప్పించండి’ అన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ ‘పాత డిజైన్తో ప్రాణహితకు జాతీయహోదా సాధ్యం కాదని ఇటీవల జరిగిన పార్లమెంటు జలవనరులశాఖ స్టాండింగ్ కమిటీలో నిపుణులు నివేదించారు. దీనికి జాతీయ హోదా కోసం మార్పులు అవసరమవుతాయి’ అని అభిప్రాయపడ్డారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడటానికి సమయం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మధ్యలోనే వెళ్లిపోయారు. టీపీసీసీ కార్యక్రమాలపై సరైన సమాచారం ఉండటంలేదని ఎమ్మెల్సీ ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బర్తరఫ్కు తీర్మానం రైతుల ఆత్మహత్యలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రాధామోహన్సింగ్ను బర్తరఫ్ చేయాలని సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ పర్యటన ఉన్నందుకే 15 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసకుంటోందని, లక్ష ఉద్యోగాల భర్తీకోసం పోరాడాలని కొందరు సభ్యులు సూచించారు. కొందరు నేతలు పార్టీ ప్రయోజనాలను పక్కనబెట్టి వ్యక్తిగత ఎజెండా కోసం పాకులాడుతున్నారని ఖమ్మం జిల్లాకు చెందిన సభ్యుడొకరు విమర్శించారు. ఫిరాయింపులపై ధర్నాలు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా స్వయంగా సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే వారిపై వేటు వేయకుండా స్పీకర్ తాత్సారం చేస్తున్నారని సభ్యులు విమర్శించారు. ఈ విషయంలో స్పీకర్కు హైకోర్టు నోటీసులను ఆసరాగా చేసుకుని దీనిపై తొలుత ప్రభుత్వానికి లేఖ రాయాలని, స్పందించకుంటే ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. తక్షణమే శాసనసభను సమావేశపర్చాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టుల డిజైన్ల మార్పు, రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు వంటివాటిపై చర్చించడానికి తక్షణమే శాసనసభను సమావేశపర్చాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చామని, ఇక నుంచి ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రుణమాఫీ అమలు చేయకపోవడం, ఇష్టారాజ్యంగా సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ల మార్పు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉల్లంఘన, వాటర్గ్రిడ్ వంటి అంశాలపై చర్చించడానికి తక్షణమే శాసనసభ సమావేశాలను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేసింది. సమావేశం వివరాలను కాంగ్రెస్ విప్ సంపత్కుమార్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రాణహిత, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల డిజైన్లు మార్చేందుకు ప్రభుత్వం చూపుతున్న కారణాల్లో అనేక అనుమానాలు ఉన్నాయని, వీటిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని సమావేశం డిమాండ్ చేసిందని తెలిపారు. కొత్త ప్రాజెక్టులను చేపట్టడం మంచిదేనని, అయితే కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టుల్లో 90 శాతం పూర్తయిన వాటికి నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదని వారు ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనకపోయినా వాటర్గ్రిడ్ను చేపట్టడం వెనక కారణాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినా ఇప్పటిదాకా ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రకటించలేదని విమర్శించారు. విత్తనాలు, ఎరువుల కొరత, వ్యవసాయ పంటరుణాల మాఫీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి ఉందని, రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్ వరకే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించిందని, జిల్లాల్లో కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వీటిపై వాస్తవాలను ప్రజలకు చెప్పడానికి వెంటనే శాసనసభను సమావేశపర్చాలని సమావేశం డిమాండ్ చేసిందని పేర్కొన్నారు. -
వరంగల్కు రాహుల్ గాంధీ
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరును మరింత ఉదృతం చేయాలని భావిస్తోన్న కాంగ్రెస్ పార్టీ తమ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణలో పలు సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. ఆదివారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయానికి వచ్చారు. సమావేశం అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు రెండో లేదా మూడో వారంలో వరంగల్, హైదరాబాద్ నగరాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, ఓటుకు కోట్లు కేసు తదితర అంశాలను కూడా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ చర్చించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరును మరింత ఉదృతం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఇక ‘ఫిరాయింపు’లను వదిలేద్దాం!
సీఎం తీరును ఎండగట్టగలిగాం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతృప్తి సీఎల్పీ నేత తీరుపై కొందరు అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: సభలో సీఎం కేసీఆర్పై, ప్రభుత్వంపై దాడి చేయడంపై కాంగ్రెస్ సభ్యులు ఒకింత సంతృప్తిగా ఉన్నారు. రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల్లో తమ ఆందోళనకు ఫలితం దక్కిందన్న అభిప్రాయంలో వారు ఉన్నారు. పార్టీ ఫిరాయింపులపై సీఎం కేసీఆర్ తీరును ఎండగట్టామని.. వాస్తవాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకు పోగలిగామని వారు పేర్కొంటున్నారు. శాసనసభ సమావేశాల్లో తమ వాయిదా తీర్మానంపై చర్చకు అవకాశం దొరక్కపోయినా.. విషయంపైకి బాగానే దృష్టి మరల్చామని, గవర్నర్ ఫిర్యాదు కూడా చేసినందువల్ల దీనిని ఇంతటితో వదిలేద్దామని నిర్ణయానికి వచ్చారు. ‘ఎలాగూ సీఎం కేసీఆర్ తీరును ఎక్స్పోజ్ చేశాం. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేసి.. ప్రజా సమస్యలపై పట్టుబడతాం. ప్రభుత్వంపై దాడిలో వెనక్కి తగ్గేది లేదు..’ అని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అయితే బుధవారం పెన్షన్ల అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వాలన్న ఆలోచనలో కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ సోమవారం వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్.. మంగళవారం కూడా దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టింది. మూడు సార్లు సభను వాయిదా వేసిన స్పీకర్.. అనంతరం 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. వాస్తవానికి పరిస్థితిని వివరించేందుకు కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో ఉదయం 9.30 గంటలకే స్పీకర్తో భేటీ అయి, చర్చకు అవకాశమివ్వాలని కోరారు. అయినా అవకాశం రాకపోగా.. ఒక రోజు సస్పెండ్ అయ్యారు. కానీ పార్టీ సభ్యులందరిదీ ఒక దారి.. నాయకుడిది మరో దారిలా ఉందన్న అభిప్రాయం వారిలో వ్యక్తమైంది. పట్టు వదిలితే ఎలా? సభలో మంగళవారం కూడా వాయిదా తీర్మానంపై పట్టుబట్టాలనే విషయంలో కాంగ్రెస్ సభ్యుల మధ్య కొంత చర్చ జరిగినట్లు సమాచారం. సభ ఆరంభం కాగానే సీఎల్పీ నేత జానారెడ్డి, ఉప నేత జీవన్రెడ్డి మధ్య ఇదే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఒకింత దూకుడుగా జీవన్రెడ్డి పోడియం వద్దకు వెళ్లడం, ఆయనను మిగతా ఎమ్మెల్యేలు అనుసరించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అనంతరం జానారెడ్డి చాంబర్లో వీరంతా సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి? ఏయే అంశాలను ప్రస్తావించాలో మాట్లాడుకున్నారు. కానీ ఆ తర్వాత సీఎంపై దాడి కంటే, ప్రభుత్వంపై విమర్శలు చేసిన జానారెడ్డి ఎక్క డా వాయిదా తీర్మానంలో పేర్కొన్న అంశాన్ని ప్రస్తావించకపోవడంతో... కాంగ్రెస్కు చెందిన మెజారిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ గొడవంతా ఎందుకన్న ధోరణిలో తమ నేత ఉన్నారని అభిప్రాయపడ్డారు. అయితే 14 మంది కాంగ్రెస్ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేసినప్పుడు... ప్రతిపక్ష నేతగా ‘ప్రొటెస్టు’ తెలిపే అవకాశం ఉన్నా జానారెడ్డి ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. తమ సభ్యులతో పాటే బయటకు వచ్చేశారు. ‘ఆయన కనీసం నిరసన తెలిపి ఉండాల్సింది..’ అని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. కలసిరాని సీఎల్పీ నేత! సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసెంబ్లీ ఆవరణలో పదమూడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. సుమారు అరగంట పాటు సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో కూడా జానారెడ్డి సీఎల్పీ కార్యాలయంలో కూర్చున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు గవర్నర్ను కలిసేందుకు రాజ్భవన్కు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడడానికి కూడా రాలేదు. దాంతో డిప్యూటీ నేత జీవన్రెడ్డి మాట్లాడారు. -
'నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ను బహిష్కరిస్తాం'
ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నియంతలా వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను వ్యతిరేకిస్తూ టీ-సీఎల్పీ ఓ తీర్మానం చేసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ సీఎల్పీ నేతలు సోమవారం సమావేశమయ్యారు. ఈ భేటీకి సీనియర్ నాయకులు జానారెడ్డి, డీఎస్, టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అయితే, ఈ సమావేశానికి మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గైర్హాజరయ్యారు. కేసీఆర్ నియంతృత్వ పాలనను అసెంబ్లీలో ఎండగడతామని సీఎల్పీ తెలిపింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, రాజకీయం చేస్తున్న అంశాన్ని సభలో లేవనెత్తుతామన్నారు. కరెంటు కోతలు, రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగావకాశాలు, ప్రజారోగ్యం లాంటి అంశాలపై సభలో నిలదీస్తామని సీఎల్పీ నాయకులు తెలిపారు. -
సీఎల్పీ ఉపనేతలుగా గీతా, జీవన్, కోమటిరెడ్డి
ఏడుగురు నేతలకుకార్యవర్గంలో చోటు కార్యదర్శి పోస్టుకే భట్టి పరిమితం జానా తీరుపై డీఎస్ అసంతృప్తి హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యవర్గ జాబితాను సీఎల్పీ నేత కె.జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇందులో ఏడుగురు నేతలకు చోటు కల్పించారు. సీనియర్ ఎమ్మెల్యేలు జె.గీతారెడ్డి, టి.జీవన్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉప నాయకులుగా నియమించారు. అలాగే కార్యదర్శులుగా మల్లు భట్టి విక్రమార్క, టి.రామ్మోహన్రెడ్డి, కోశాధికారిగా పువ్వాడ అజయ్కుమార్, పార్టీ విప్గా వి.సంపత్ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి కూడా జానారెడ్డి తెలిపారు. అయితే ఈ జాబితాపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో తనను కనీసం సంప్రదించకపోవడంపై మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిపి సీఎల్పీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం పార్టీలో ఆనవాయితీగా వస్తోందని, ఎన్నికల ముందు వరకు కొనసాగిన కార్యవర్గమే ఇందుకు నిదర్శనమని డీఎస్ సన్నిహితులు పేర్కొన్నారు. ఈసారి జానారెడ్డి ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సీఎల్పీ కార్యవర్గాన్ని డీఎస్ నియమించుకుంటారన్న ఉద్దేశంతోనే తాజా జాబితాలో వారికి చోటు కల్పించలేదని జానారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. డీఎస్ వర్గీయులు మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఖ్య మొత్తం 30కి మించే పరిస్థితి లేదని, అలాంటప్పుడు వేర్వేరు కార్యవర్గాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం సీఎల్పీ జాబితాపై పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, రెడ్యానాయక్, చిన్నారెడ్డిలకు ఇందులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. సామాజిక సమతుల్యం లేదని, ఎస్టీ నేతకు ఇందులో చోటు లేకపోవడం బాధాకరమని వాఖ్యానించారు. పీఏసీ రేసులో ఆ నలుగురు శాసనసభ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించనున్న నేపథ్యంలో కాంగ్రెస్లో నలుగురు ఎమ్మెల్యేలు ఆ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో డీకే అరుణతోపాటు రెడ్యానాయక్, రాంరెడ్డి వెంకటరెడ్డి, కిష్టారెడ్డి ఉన్నారు. అయితే డీకే అరుణకు మినహా మిగిలిన ముగ్గురు నేతలకు చెరో ఏడాది చొప్పున పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని జానారెడ్డి యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆ నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. -
సీనియర్లకు దక్కని చోటు, డీకె అరుణకు భంగపాటు
హైదరాబాద్ : సీఎల్పీ కార్యవర్గంలో సీనియర్లకు భంగపాటు ఎదురైంది. కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) కార్యవర్గాన్ని ప్రతిపక్షనేత జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. డిప్యూటీ లీడర్లుగా గీతారెడ్డి, జీవన్ రెడ్డి, కోమటి రెడ్డి వెంటకరెడ్డి, కార్యదర్శులుగా భట్టి విక్రమార్క, రామ్మోహన్ రెడ్డి నియమితులయ్యారు. విప్గా సంపత్, కోశాధికారిగా పువ్వాడ అజయ్ కుమార్ నియామకం అయ్యారు. మరోవైపు మాజీ మంత్రులు, పార్టీ సీనియర్లకు భంగపాటు ఎదురైంది. రెడ్యా నాయక్, రాంరెడ్డి వెంకట రెడ్డి, డీకే అరుణలకు సీఎల్పీ కార్యవర్గంలో చోటు దక్కలేదు. కాగా గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత పదవి కోసం జానారెడ్డి, డీకె అరుణ పోటీ పడిన విషయం తెలిసిందే. -
ఒకే గదిని రెండు రాష్ట్రాలకు కేటాయించారు
-
ఒకే గదిని రెండు రాష్ట్రాలకు కేటాయించారు
హైదరాబాద్ : రాష్ట్రాలు విడిపోయినా రాష్ట్ర విభజన చిక్కులు వీడటం లేదు. తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ్యులకు గదుల కేటాయింపు గందరగోళానికి దారి తీసింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటేరియట్ టీఆర్ఎస్ ఎల్పీకి కేటాయించిన గదులనే ఆంధ్రపద్రేశ్ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులకు కేటాయించటం జరిగింది. దాంతో ఒకే గదిని రెండు రాష్ట్రాలకు కేటాయించటంతో వివాదం నెలకొంది. ఇక అసెంబ్లీ ప్రాంగణంలో ఆయా రాజకీయ పార్టీలకు కార్యాలయాలను కేటాయిస్తూ అసెంబ్లీ కార్యదర్శి సదారాం శుక్రవారం సర్క్యూలర్ జారీ చేశారు. సీఎల్పీ కార్యాలయాన్ని టీఆర్ఎస్ఎల్పీకి, టీఆర్ఎస్ఎల్పీ ఆఫీస్ను సీఎల్పీకి కేటాయించారు. డిప్యూటీ స్పీకర్ కార్యాలయాన్ని యథావిధిగా కొనసాగించనున్నారు. -
'మంచికి మద్ధతిస్తాం.. చెడును వ్యతిరేకిస్తాం'
-
సీఎల్పీ రేసులో డీకే అరుణ,భట్టి?
-
సీఎల్పీ రేసులో భట్టి!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా జిల్లాకు చెందిన మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పేరు వినిపిస్తోంది. తెలంగాణ నూతన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించే అవకాశం జిల్లాకు దక్కుతుందనే ప్రచారం టీపీసీసీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అయితే, ఈ పదవికి ఎంపిక చేసే నేతకు సంబంధించి అనేక అంశాలను ఏఐసీసీ పరిగణనలోకి తీసుకుంటుందని, అందులో భాగంగా కొన్ని అంశాలు భట్టికి సానుకూలంగా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా చీఫ్విప్, డిప్యూటీస్పీకర్ పదవులను సమర్థవంతంగా నిర్వహించిన భట్టిని సీఎల్పీ నేతగా ఎన్నుకోవాలని కొందరు ప్రతిపాదిస్తున్నారు. అయితే, సీనియార్టీ ప్రాతిపదికన నల్లగొండ జిల్లాకు చెందిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కె.జానారెడ్డి పేరు కూడా వినబడుతోంది. వీరిద్దరిలో ఒకరికి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. యువనాయకత్వంతో పాటు సామాజిక కోణం సీఎల్పీ నేతగా భట్టి పేరు పరిగణనలోకి తీసుకోవడం వెనుక పలు కారణాలున్నాయి. ముఖ్యంగా ఆయన సామాజిక వర్గం అనుకూలించే అంశంగా ఉంది. దళిత సామాజిక వర్గానికి చెందిన నేతను పార్టీ శాసనసభాపక్ష నాయకునిగా చేస్తే పార్టీకి మంచి పేరు వస్తుందన్నది కాంగ్రెస్లోని కొందరు పెద్దల ఆలోచన. దీనికి తోడు టీఆర్ఎస్ ముందునుంచీ దళితుడిని తెలంగాణ తొలిముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి చివరకు కేసీఆర్ను ఎంపిక చేసిందని, అదే సమయంలో కాంగ్రెస్ పక్షాన దళితుడిని సీఎల్పీ నాయకుడిగా చేస్తే సామాజిక కోణంలో కలిసివస్తుందనే వాదన వినపడుతోంది. దీనికి తోడు అటు అసెంబ్లీ లోపల, బయట భట్టికి మంచి సంబంధాలున్నాయి. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. ఎమ్మెల్యేగా ఎన్నికయిన తొలిసారే ప్రభుత్వ చీఫ్విప్ పదవిని నిర్వహించారు. ఈ క్రమంలో శాసనసభ్యులందరినీ సమన్వయపరచడంలో సఫలీకృతులయ్యారు. అంతేగాక కీలక సమయంలో అసెంబ్లీ డెప్యూటీస్పీకర్ పదవిని కూడా చేపట్టారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా స్పీకర్ స్థానంలో ఆయన కూర్చోవాల్సి వచ్చినప్పుడు కూడా భట్టి పూర్తి సమయస్ఫూర్తితో వ్యవహరించారు. దీనికి తోడు యువనాయకుడిగా పార్టీలో ఇప్పటికే మంచి గుర్తింపు పొందారు. ఈకోణంలో ఐదేళ్ల పాటు టీఆర్ఎస్ను ఎదుర్కోవడంలో భట్టి పేరును అధినాయకత్వం సీరియస్గానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
సీఎల్ఫీ కార్యాలయంలో టీ కాంగ్రెస్ నేతల భేటి