hizbul mujahideen
-
ఉగ్రవాదులతో సంబంధాలు.. నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
శ్రీనగర్: ఉగ్రవాదులతో సంబంధాలున్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం వేటు వేసింది. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్కు చీఫ్నని ప్రకటించుకున్న సయ్యద్ సలాహుద్దీన్ కుమారుడు, జైల్లో ఉన్న వేర్పాటువాద నాయకుడు బిట్టా కరాటే భార్యతో సహా నలుగురిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ శనివారం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారత్కు వ్యతిరేకంగా పని చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్న వారితో సంబంధాలుండడంతో వారిని ఉద్యోగుల నుంచి తీసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాద సంస్థలతో లింకులుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం ప్రభుత్వ పరమైన ఎలాంటి విచారణ చేయకుండా ఉద్యోగాలను తొలగించే అధికారం ప్రభుత్వాలకి ఉంటుంది. వాణిజ్య, పరిశ్రమల శాఖలో పని చేస్తున్న సయ్యద్ అబ్దుల్ ముయీద్, జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ అసాబ్ ఉల్ అర్జామంద్ ఖాన్ (ఫరూక్ అమ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటె భార్య) , కశ్మీర్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తగా పని చేస్తున్న డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్, కశ్మీర్ యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ప్రొఫసర్గా పని చేస్తున్న మజీద్ హుస్సేన్ ఖాద్రిలు ఉద్యోగాలు కోల్పోయారు. సోంపెరాలోని జమ్మూ కశ్మీర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (జేకేఈడీఐ) కాంప్లెక్స్లో జరిగిన పేలుళ్లతో అబ్దుల్ ముయీద్కు సంబంధం ఉంటే, అర్జామంద్ఖాన్కు పాస్పోర్టు కోసం తప్పుడు సమాచారం అందించారు. డాక్టర్ ముహీత్ అహ్మద్ భట్ యూనివర్సిటీల్లో విద్యార్థుల్ని భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా పాఠాలు బోధిస్తూ ఉంటే, మరో ప్రొఫెసర్ మజీద్ హుస్సేన్కు నిషిద్ధ లష్కరేతోయిబా సహా పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి. సయ్యద్ సలాహుద్దీన్ కుమారులు ఇద్దరు గతంలోనే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మూడో కుమారుడిపైన కూడా వేటు పడింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలతో లింకులున్న దాదాపుగా 40 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. -
11 మంది ‘ఉగ్ర’ ఉద్యోగుల తొలగింపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. వారికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని, బలగాల కదలికలను గురించి ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చారనే అభియోగాల మీద జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత అధికారులు వారిని తొలగించినట్లు శనివారం ప్రకటించారు. తొలగింపునకు గురైన వారిలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ చీఫ్ సలాహుద్దీన్ కుమారులు సయీద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసుఫ్లు ఉన్నారని పేర్కొన్నారు. తొలగించిన వారిలో పోలీస్, విద్య, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, విద్యుత్, ఆరోగ్య శాఖలకు చెందిన వారు ఉన్నారని వెల్లడించారు. వీరిలో నలుగురు అనంతనాగ్, ముగ్గురు బుద్గమ్కు చెందిన వారు కాగా.. బారాముల్లా, శ్రీనగర్, పుల్వామా, కుప్వారా జిల్లాల నుంచి ఒకరు చొప్పున ఉన్నట్లు తెలిపారు. వీరందరిని భారత రాజ్యాంగంలోని 311వ ఆర్టికల్ ద్వారా తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ ద్వారా ఉద్వాసనకు గురైతే వారు హైకోర్టులో మాత్రమే ఆ నిర్ణయాన్ని సవాలు చేయగలరు. రెండు సమావేశాల్లో.. కశ్మీర్కు చెందిన ఉన్నతాధికారుల కమిటీ ఇటీవల రెండు సార్లు సమావేశమైందని అధికారులు వెల్లడించారు. ఇందులో మొదటి సమావేశంలో ముగ్గురిని, రెండో సమావేశంలో 8 మందిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తొలగింపునకు గురైన వారు పలు రకాలుగా ఉగ్రవాదులకు సాయం అందించారని ఆరోపిం చారు. హవాలా ద్వారా డబ్బును పొందినట్లు వెల్లడించారు. భద్రతా బలగాలు చేపట్టబోయే కార్యకలాపాల వివరాలను చేరవేసి ఉగ్రవాదులకు సాయపడినట్లు అభియోగాలు మోపారు. -
హిజ్బుల్ ముజాహిద్దీన్ అగ్ర నేత హతం
శ్రీనగర్: ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన అగ్ర కమాండర్ మెహ్రాజుద్దీన్ హల్వై అలియాస్ ఉబెయిద్ హతమయ్యాడని కశ్మీర్ డీజీపీ విజయ్కుమార్ ట్వీట్ చేశారు. కుప్వారా జిల్లాలోని గాండర్స్ ప్రాంతంలో పోలీసులు బుధవారం సాధారణ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వాహనంలో గ్రెనేడ్ ఉండటంతో పోలీసులు హల్వైని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారిస్తుండగా, ఆయన హిజ్బుల్ మొజాహిద్దీన్కుచెందిన ఉగ్రవాదిగా గుర్తించారు. విచారణలో భాగంగా ఆయుధాలు దాచిన స్థలాన్ని పోలీసులకు వెల్లడించాడు. అనంతరం పోలీసులు హల్వైని ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడి చేరుకున్న తర్వాత ఆయుధాల గదిలోని ఏకే 47తో భద్రతా బలగాలపై కాల్పులు జరిపాడు. దీంతో బలగాలు కూడా తిరిగి కాల్పులు జరపడంతో హల్వై హతమయ్యాడు. మరణించిన ఉగ్రవాది అగ్ర కమాండర్ అని, వృద్ధనేత అని డీజీపీ పేర్కొన్నారు. పోలీసులు, ప్రజలు సహా పలు ఉగ్ర దాడుల్లో పాల్గొన్న హల్వై హతం కావడం భద్రతా బలగాలకు గొప్ప విజయమని అభిప్రాయపడ్డారు. లొంగిపోయేందుకు ఉగ్రవాది నిరాకరించి కాల్పులు ప్రారంభించడంతో పరిస్థితి ఎన్కౌంటర్గా మారిందన్నారు. ఘటనా స్థలంలోని ఆయుధాలను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసుల రికార్డు ప్రకారం ఉగ్రవాది ఏ++ కేటగిరీకి చెందినవాడని కశ్మీర్ పోలీస్ ప్రతినిధి చెప్పారు. యువకులను ఉగ్రవాద కార్యకలాపాల్లోకి దించే పనుల్లో హల్వై హస్తం ఉందని చెప్పారు. -
హిజ్బుల్ చీఫ్ సైఫుల్లా హతం
శ్రీనగర్: మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సైఫుల్లా మిర్ అలియాస్ డాక్టర్ సైఫుల్లా(31)భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. ఈ ఏడాది మేలో హిజ్బుల్ చీఫ్గా ఉన్న రియాజ్ నైకూ భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందడంతో సైఫుల్లా ఆ బాధ్యతలు చేపట్టాడు. ‘సైఫుల్లా మృతి మామూలు ఘటన కాదు. పోలీసులకు, భద్రతా బలగాలకు దక్కిన భారీ విజయం’అని ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పరిశీలించిన కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ అభివర్ణించారు. పుల్వామా జిల్లా మలంగ్పోరాకు చెందిన ఇతడు మెడికల్ ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసిన ఇతడిని డాక్టర్ అని పిలుస్తుంటారు. 2014 అక్టోబర్లో హిజ్బుల్ ముజాహిదీన్లో చేరాడు. కశ్మీర్ లోయలో భద్రతాబలగాలపై జరిగిన పలు ఘటనలకు సూత్రధారిగా ఉన్న సైఫుల్లా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. సైఫుల్లా ఓ ఇంట్లో దాగున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆదివారం ఉదయం శ్రీనగర్ శివారులోని రంగ్రేత్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టాయి. అదే సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు వారి పైకి కాల్పులకు దిగగా బలగాలు దీటుగా స్పందించాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోగా, మరొకరు పోలీసులకు పట్టుబడ్డాడు. మృతుడిని సైఫుల్లాగా గుర్తించారు. అతని వద్ద ఆయుధాలు, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ హతం..
కశ్మీర్ : జమ్ముకశ్మీర్లో ఆదివారం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సైఫుల్లా హతమయ్యాడు. శ్రీనగర్ సరిహద్దులో ఈ ఎన్కౌంటర్ జరిగింది. కాగా మరో ఉగ్రవాది తమ అదుపులో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. కాగా శ్రీనగర్లోని రంగ్రేత్ ప్రాంతంలోని ఒక ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు శనివారం రాత్రి సమాచారం అందడంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదులు దాగినట్లు అనుమానించిన ప్రాంతానికి చేరగానే మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ప్రతిగా కాల్పులు జరుపగా హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ సైఫుల్లా అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సైఫుల్లా( ఫైల్ ఫోటో) కాగా పోలీసులు ఎన్కౌంటర్ స్థలంలో ఉగ్రవాదుల నుంచి ఏకే-47, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ ఐజీపీ విజయ్కుమార్ మట్లాడుతూ.. పుల్వామా జిల్లాలోని మలంగ్పోరాకు చెందిన అతడు 2014 అక్టోబర్లో హిజ్బుల్ ముజాహిదీన్లో చేరినట్లు తెలిపారు. రియాజ్ నాయకూ అతడ్ని నియమించి ఘాజీ హైదర్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. భద్రతా దళాలు సైఫుల్లాను మట్టుబెట్టడం తమకు గ్రేట్ ఎచీవ్మెంట్ అని ఆయన పేర్కొన్నారు. -
కశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్, కుల్గామ్ జిల్లాల్లో జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హత మయ్యారు. మృతుల్లో ఒకరిని షకూర్ ఫరూక్ లాంగూగా గుర్తించారు. గత మే 20న ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను చంపిన కేసులో నిందితుడు. బీఎస్ఎఫ్ జవాన్ కు చెందిన రైఫిల్ను సైతం జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో హతుడు షహీద్ అహ్మద్ భట్ కాగా, ఇంకొకరిని గుర్తించాల్సి ఉంది. వీరు హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్లకు చెందిన వారు. అలాగే, కుల్గామ్ జిల్లాలో తయాబ్ వలీద్ అలియాస్ ఇమ్రాన్ భాయ్, అలియాస్ గజీ బాబా అనే పాకిస్తానీ హతమయ్యాడు. జైషే మొహమ్మద్ కమాండర్గా ఉన్న ఇతడు బాంబుల తయారీలో సిద్ధహస్తుడు. -
శ్రీనగర్లో ఎన్కౌంటర్; ఉగ్రవాది హతం
శ్రీ నగర్ : జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్లోని నవకాడల్ ఏరియాలో హిజ్బుల్ మొజాహిద్దీన్ ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు సోమవారం రాత్రి స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కాగా మంగళవారం తెల్లవారుజామున నవకాడల్ ఏరియాలో ఉగ్రవాదులు దాగి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో జవాన్లు ఎదురుకాల్సులకు దిగారు. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఒక ఉగ్రవాది హతమయ్యాడని, ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. -
హిజ్బుల్ చీఫ్ రియాజ్ నైకూ హతం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో బుధవారం సుదీర్ఘంగా సాగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజహిదీన్ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ నైకూ మరణించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ చీఫ్ రియాజ్ నైకూ ఎనిమిదేళ్లుగా భద్రతా దళాల కన్నుగప్పి తిరుగుతున్నాడు. రంజాన్ సందర్భంగా తల్లితండ్రులను పరామర్శించేందుకు గ్రామానికి వచ్చాడన్న సమాచారం అందుకున్నభద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి రియాజ్ను మట్టుబెట్టాయి. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టి బీగ్బోరా గ్రామాన్ని జల్లెడపడుతుండగా ఎన్కౌంటర్ జరిగిందని ఇది బుధవారం మధ్యాహ్నం వరకూ కొనసాగిందని భద్రతా దళాలు పేర్కొన్నాయి. బేగ్పురాలోని తన ఇంటిలో రియాజ్ నైకూ ఉన్నాడనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు 40 కిలోల ఐఈడీతో ఇంటిని పేల్చివేశాయి. కశ్మీర్లో మిలిటెన్సీ పోస్టర్ బాయ్గా పేరొందని బుర్హాన్ వనీ మరణానంతరం హిజ్బుల్ పగ్గాలను రియాజ్ నైకూ చేపట్టారు. కాగా, పుల్వామాలో నైకూను మట్టుబెట్టిన అనంతరం జిల్లాలోని మరో గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. ఇక హంద్వారాలో కొద్దిరోజుల కిందట ఉగ్రమూకల దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. చదవండి : భీకర పోరు : ఐదుగురు జవాన్ల మరణం -
ఉగ్రవాదులకు పోలీసు సాయం..
శ్రీనగర్: ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఓ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ దావిందర్ సింగ్ శనివారం ఇద్దరు ఉగ్రవాదులను కారులో తీసుకెళుతూ పట్టుబడ్డాడని కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) విజయ్ కుమార్ వెల్లడించారు. డీఎస్పీ స్థాయిలో ఉండి, ఉగ్రవాదులకు సహాయం చేయడం హీనమైన చర్య అని పేర్కొన్నారు. వీరిలోని మరో ఉగ్రవాది నవీద్ కూడా కానిస్టేబుల్గా పనిచేశాడు. 2017లో పోలీసు వృత్తిని వదలి హిజ్బుల్ ముజాహిదీన్లో చేరాడు. పలువురు పోలీసులను, పౌరులను చంపినట్లు ఇతడిపై 17 కేసులున్నాయని తెలిపారు. పార్లమెంటు దాడి కేసులో వీరి ప్రమేయం ఉందన్న ఆరోపణలను ఐజీపీ కొట్టిపారేశారు. దీనిపై తమకు ఏ సమాచారం లేదని, అయినప్పటికీ ఈ విషయం గురించి వారిని విచారిస్తామని చెప్పారు. దొరికారిలా.. శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు ఇద్దరు ఉగ్రవాదులు ఓ వాహనంలో ప్రయాణిస్తున్నారని సోపియన్ ఎస్పీకి ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది. ఆ ఎస్పీ ఐజీపీకి, ఐజీపీ డీఐజీకి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కాపు కాసి వారి కారును ఆపి తనిఖీలు నిర్వహించి ఉగ్రవాదులను పట్టుకున్నారు. అనంతరం విచారణ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆర్ఏడబ్ల్యూ, సీఐడీ వంటి ఇంటెలిజెన్స్ వర్గాలన్నింటికీ సమాచారం ఇచ్చామని ఐజీపీ చెప్పారు. ఉగ్రవాదులను తరలిస్తున్న డీఎస్పీ దావిందర్ సింగ్ను కూడా ఉగ్రవాదిగానే పరిగణించి విచారిస్తున్నామని చెప్పారు. విచారణ కొనసాగుతున్నందున అంతకు మించి వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. ఒక పోలీస్ ఉగ్రవాదులకు సాయపడినంత మాత్రాన కశ్మీర్ పోలీసులంతా అంతేననే ఆలోచన సరికాదని చెప్పారు. కీలక మిలిటెంట్లు హతం.. జమ్మూకశ్మీర్లోని ట్రాల్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు కీలక ఉగ్రవాదులు మృతిచెందారని పోలీసులు తెలిపారు. వీరంతా హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్లని చెప్పారు. మృతులను ఉమర్ ఫయాజ్ లోనె , ఫైజాన్ హమిద్, అదిల్ బాషిర్ మిర్ అలియాస్ అబు దుజనగా గుర్తించారు. ఇందులో ఫయాజ్ లోనెపై 16 కేసులు ఉన్నట్లు చెప్పారు. -
నలుగురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
శ్రీనగర్: లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూపునకు చెందిన నలుగురు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. సోమవారం కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లతోపాటు ఒక పోలీసు గాయపడ్డారు. పుల్వామా జిల్లాలోని లస్సిపోరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు సోమవారం ఆర్మీ గాలింపు చేపట్టింది. జవాన్లను చూడగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. కాగా, కశ్మీర్లోని పూంచ్ లో నియంత్రణ రేఖ వెంబడి సోమవారం పాక్ జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ అధికారి, మరో ఐదేళ్ల బాలిక మరణించారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లుసహా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. షాపుర్ సబ్ సెక్టార్లో ఓ ఇంటి వద్ద బాంబు పేలడంతో సోబియా అనే ఐదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. -
9వ తరగతి విద్యార్థి లంచ్బాక్స్లో గ్రెనేడ్ తీసుకొచ్చి
-
జమ్మూలో గ్రెనేడ్ దాడి చేసింది 9వ తరగతి విద్యార్థి!
జమ్మూ: జమ్మూలో గ్రెనేడ్ దాడి జరిపింది 9వ తరగతి విద్యార్థేనని నిఘావర్గాలు పేర్కొన్నాయి. నిందితుడు గ్రెనేడ్ను లంచ్ బాక్స్లో తీసుకొచ్చి జమ్మూ ఆర్టీసీ బస్టాండ్ లక్ష్యంగా దాడి జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 32 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దాడి జరిపి తిరుగు ప్రయాణమైన దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్కు చెందిన నిందితుడిని పోలీసులు జమ్ముకు 20 కిలోమీటర్ల సమీపంలోని చెక్పాయింట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మైనర్ అయిన నిందితుడు యూట్యూబ్ సాయంతో గ్రేనేడ్ తయారు చేశాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇక నిందితుడు జమ్ముకు రావడం ఇదే తొలిసారని, అతను కారులో బుధవారమే ఇక్కడికి చేరాడని పేర్కొన్నారు. అతన్ని తీసుకొచ్చిన కారు డ్రైవర్ కోసం కూడా గాలిస్తున్నామన్నారు. మైనర్ అయిన నిందితుడు ఒక్కడే 250 కిలోమీటర్లు ఎలా ప్రయాణించాడు? అది వన్వే ట్రాఫిక్ కలిగిన శ్రీనగర్-జమ్ము నేషనల్ హైవేపై ఎలా సాధ్యం అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిని నగ్రోటా టోల్ప్లాజా దగ్గర పట్టుకున్నామనీ, హిజ్బుల్ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్తో అతను మాట్లాడినట్లు తేలిందని చెప్పారు. ఫరూఖ్ తనకు గ్రెనేడ్ను కుల్గాంలో అందజేశాడనీ, గురువారం ఉదయం జమ్మూ చేరుకున్నానని విచారణలో నిందితుడు చెప్పాడన్నారు. జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
జమ్మూలో గ్రెనేడ్ దాడి
జమ్మూ: జమ్మూలో ఉగ్రవాదులు గురువారం జరిపిన గ్రెనేడ్ దాడిలో మహ్మద్ షరీక్ (17) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 32 మంది గాయపడ్డారు. జమ్మూ ఆర్టీసీ బస్టాండ్లో ఈ దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు యాసిన్ జావీద్ భట్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతనికి హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆ సంస్థే జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడిందన్నారు. ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిని నగ్రోటా టోల్ప్లాజా దగ్గర పట్టుకున్నామనీ, హిజ్బుల్ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్తో అతను మాట్లాడినట్లు తేలిందని చెప్పారు. ఫరూఖ్ తనకు గ్రెనేడ్ను కుల్గాంలో అందజేశాడనీ, గురువారం ఉదయం జమ్మూ చేరుకున్నానని విచారణలో యాసిన్ చెప్పాడన్నారు. చనిపోయిన మహ్మద్ ఫరీక్ ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లాకు చెందిన వాడు. గతేడాది మే నుంచి చూస్తే జమ్మూ ఆర్టీసీ బస్టాండ్లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడటం ఇది మూడోసారి. ఎన్కౌంటర్లో జైషే ఉగ్రవాది హతం శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్కు చెందిన ముష్కరుడు మరణించాడని పోలీసులు చెప్పారు. హంద్వారాలోని క్రల్గుండ్లో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా సమాచారం మేరకు పోలీసులు బుధవారం రాత్రి నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదిని పాకిస్తాన్ జాతీయుడైన అన్వర్గా గుర్తించామనీ, ఇతనికి జైషే మహ్మద్ సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాల వంటి నేరారోపక వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. యూపీలో కశ్మీరీలపై దాడి చితక్కొట్టిన బజరంగ్ దళ్ సభ్యులు లక్నో: ఉత్తరప్రదేశ్లో ఉగ్రవాదులనుకుని కశ్మీర్కు చెందిన యువకులపై బజరంగ్ దళ్కు చెందిన వ్యక్తులు దాడి చేశారు. బుధవారం సాయంత్రం ఆ రాష్ట్రంలోని దాలిగంజ్ బ్రిడ్జిపై డ్రై ఫ్రూట్స్ను అమ్ముతున్న కొందరు కశ్మీర్ యువకులపై బజరంగ్ దళ్కు చెందిన కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ కశ్మీరీ యువకులపైకి రాళ్లతో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. దాడిలో ప్రధాన నిందితుడు, బజరంగ్దళ్ సభ్యుడు, విశ్వ హిందూదళ్ అధ్యక్షుడు సోంకర్, హిమాన్షు గార్గ్, అనిరుధ్, అమర్ కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు డ్రైఫ్రూట్స్ అమ్మేందుకు కశ్మీర్ నుంచి ఉత్తర్ప్రదేశ్కు వచ్చినట్లు తెలుస్తోంది. -
భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదుల హతం
జమ్ము కశ్మీర్ : జమ్ము కశ్మీర్లో భద్రతాదళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదులు హతం అయ్యారు. బుద్గామ్, సోఫియాన్లలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ముగ్గురు తీవ్రవాదులను భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. దాడి జరిగిన ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మృతులు షంసుల్ హక్ మేంగ్నూ, అమీర్ సోహైల్ భట్, సోహైబ్ అహ్మద్ షాలుగా గుర్తించారు. పోలీసుల రికార్డుల ప్రకారం వీరందరూ తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన వారుగా తెలుస్తోంది. -
కశ్మీర్లో హిజ్బుల్ ఉగ్రవాది ఎన్కౌంటర్
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. పుల్వామాలోని బబ్గుంద్లో ఉగ్రవాదులు నక్కిఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు శుక్రవారం రాత్రి కార్డన్ సెర్చ్ చేపట్టాయి. బలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ సాగిన ఈ ఎన్కౌంటర్లో ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యుడు సబీర్ అహ్మద్ దార్ హతం కాగా, మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. -
ముగ్గురు పోలీసులను హత్యచేసిన ముష్కరులు
-
ముగ్గురు పోలీసుల కిడ్నాప్.. ఆపై హత్య
జమ్మూ: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్లో షోపియాన్ జిల్లాలో గురువారం రాత్రి కిడ్నాప్ చేసిన ముగ్గురు పోలీసులను హత్యచేశారు. శుక్రవారం ఉదయం పోలీసులు వారి మృతదేహాలను గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. నిన్న అర్ధరాత్రి జిల్లాలోని రెండు గ్రామాల్లోకి చోరబడ్డ ఉగ్రవాదులు ముగ్గురు ప్రత్యేక బలగాలకు(ఎస్పీవో) చెందిన పోలీసులతో పాటు మరో పోలీసును అపహరించుకుపోయారు. కిడ్నాప్ అయిన వారిలో పోలీసు మాత్రం గ్రామస్తుల సహాయంతో బయటపడగలిగారు. మిగత వారిని ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా హత్యచేశారు. కిడ్నాప్ చేసిన పోలీసులపై తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిందిగా ఒత్తిడి చేశారని హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల ముందు హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన ఉగ్రవాదులు ఓ వీడియోను పంపారు. ఆ వీడియోలో పోలీసు అధికారులు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆ పత్రాన్ని అన్లైన్లో ఉంచాలి లేకపోతే తమ చేతుల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. -
సోదరీమణులారా బీ కేర్పుల్...
కశ్మీర్: సోషల్ మీడియాలో సైనికులతో చాటింగ్ చేయ్యెద్దంటూ ఇస్తామిక్ ఉగ్రవాద సంస్థ ‘ హిజ్బుల్ ముజాహిదీన్ ’ కశ్మీర్ యువతులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ నైకో ఓ ఆడియో క్లిప్పును విడుదల చేశారు. ఆ ఆడియో క్లిప్ ఇప్పుడు కశ్మీర్లో వైరల్ అయింది. ‘ భద్రతా దళాలు, పోలీసులు కశ్మీర్ యువతులో సంబంధం ఏర్పాటు చేసుకొని మా గురించి సమాచారం లాగుతున్నారు. ముఖ్యంగా పాఠశాల యువతను టార్గెట్ చేశారు. వారితో సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకొని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. అపరిచితులతో పరిచయాలు పెంచుకోకండి. మీతో చాట్ చేసి మిమ్మల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. వారు అడిగిన సమాచారం చెప్పకపోతే మీ రహస్యాలు బయటపెడతామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సోదరీమణులారా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని సోషల్ మీడియాకి దూరంగా ఉంచండి. మీ పిల్లలు భద్రతా దళాలతో సంబంధాలు పెట్టుకుంటే మిమ్మల్ని మేము విడిచిపెట్టం జాగ్రత్త’ అని హెచ్చరిస్తూ ఉన్న పది నిమిషాల ఆడియో క్లిప్ జమ్మూ-కశ్మీర్లో వైరల్ అయింది. ఈ ఆడియో క్లిప్ను అందరికి షేర్ చేయాలని కూడా రియాజ్ నైకో కశ్మీర్ యువతను కోరారు. కాగా కొద్దిరోజుల క్రితం ఆర్మీ మేజర్ నితిన్ లీతుల్ గోగోయ్ శ్రీనగర్లోని ఓ హోటల్లో ఓ యువతతో పట్టుబడిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారానే వారు పరిచయం అయ్యారు.ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద సంస్థ ఆడియో క్లిప్ ను విడుదల చేసింది. గోగోయ్ విషయాన్ని కూడా ఆడియో క్లిప్లో గుర్తుచేశారు. -
వైరల్ ఫొటో.. వాళ్ల ఫేట్ రివర్సైంది!
జమ్ము: వేర్పాటువాదం తలకెక్కించుకున్న ఆ యువకులు తుపాకులు చేతబట్టి దిగిన ఆ ఫొటో.. వాళ్ల తలరాతను మార్చేసింది. జమ్ముకశ్మీర్లోని షోఫియాన్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో బుర్హాన్ వనీ గ్యాంగ్ చివరి సభ్యుడు సద్దాం పద్దేర్ కూడా హతమయ్యాడు. రెండేళ్ల కిందటి ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఆ ఫొటోలో ఉన్న 10 మందిని వేర్వేరు ఎన్కౌంటర్లలో భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. అరెస్టైన ఒక్కడు మాత్రం జైలులో ఉన్నాడు. ఆదివారం నాటి ఎన్కౌంటర్లో వనీ అనుచరుడైన పద్దేర్ సహా హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చిచంపాయి. ఎన్కౌంటర్లను నిరసిస్తూ లోయలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న కాల్పుల్లో మరో ఐదుగురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లోయలో వరుస ఘటనలపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. తుపాకులు, రాళ్లను చేతబడుతున్నది పేదలేనని, అలాంటి యువకుల ప్రాణాలు కాపాడుకోవడానికి ఏదో ఒక మధ్యంతర విధానం అవసరం ఉన్నదని ఆమె అన్నారు. ఒక్కరోజు ఉగ్రవాది: షోఫియాన్ ఎన్కౌంటర్లో చనిపోయిన రఫీభట్.. కశ్మీర్ విశ్వవిద్యాలయంలోని సోషియాలజీ విభాగంలో సహాయ అధ్యాపకుడిగా పనిచేసేవాడు. శుక్రవారమే హిజ్బుల్ ముజాహిదీన్లో చేరిన అతను.. ఆదివారానికి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయమే భట్ తన తండ్రికి ఫోన్ చేసి, ‘మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను అల్లా వద్దకు వెళ్తున్నందున ఇదే నా చివరి ఫోన్ కాల్’ అని చెప్పాడు. (చదవండి: ఐదుగురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్) -
ఆరుగంటల్లో.. 5గురు ఉగ్రవాదులు హతం
షోఫియాన్: జమ్మూ-కశ్మీర్లోని షోఫియాన్ జిల్లా బడిగాం వద్ద ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఐదుమంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బడిగాంలోని ఇమాన్ సాహిబ్ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ‘ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కుని వారిపై కాల్పులు జరిపారు. దీనికి భారతసైన్యం ధీటుగా సమాధానమిచ్చింది. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. హతులను హిజ్యుల్ ముజాహిద్దీన్ ముఠాకు చెందిన వారిగా గుర్తించారు. కశ్మీర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ కూడా ఈ కాల్పుల్లో మరణించారు. ఈ ఆపరేషన్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ఐదుగురు పౌరులు కూడా మరణించారు.’ అని ఓ అధికారి తెలిపారు. ఈ ఆపరేషన్ విజవంతం చేసిన దళాలను అభినందిస్తూ జమ్మూ-కశ్మీరు డీజీపీ శేష్ పాల్ వైద్ ట్వీట్ చేశారు. ‘ షోఫియాన్ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను అంతం చేశాం. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ-కశ్మీరు పోలీసులు చేసిన కృషికి అభినందనలు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కానీ, ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందడంతో దక్షిణ కశ్మీర్లో పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. ముఖ్యంగా షోఫియాన్, పుల్వామా, తదితర దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో పౌరులు ఆందోళన చేపట్టారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. భద్రతా దళాలను నిరోధించేందుకు స్థానికులు రాళ్ళదాడికి పాల్పడ్డారు. దీంతో అదనపు సీఆర్పీఎఫ్ బలగాలను ఈ ప్రాంతానికి తరలించారు. ఈ సందర్భంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
సివిల్స్కు ప్రిపేర్ అవ్వాలనుంది..!
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ కావాలని ఉందని యంగ్ టెర్రరిస్ట్ డానిష్ ఫరూఖ్ భట్ చెబుతున్నాడు. తాను చేసిన భారీ తప్పిదాన్ని తెలుసుకుని 22 ఏళ్ల ఫరూఖ్ పశ్చాత్తాపపడుతున్నాడు. గతేడాది హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ సబ్జార్ అహ్మద్ భట్ అంత్యక్రియల్లో పాల్గొనడంతో కొందరు ఉగ్రవాదులతో కలిసి తొలిసారిగా వెలుగులొకి వచ్చాడు ఈ కశ్మీర్ యువకుడు. ఇటీవల పోలీసులు చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన, మార్పులు కార్యక్రమాలతో ప్రేరణ పొందినట్లు చెబుతున్నాడు. ‘కొందరు ఉగ్రవాదులు, దేశ వ్యతిరేఖ శక్తులు నన్ను చెడువైపు ప్రోత్సహించాయి. దాంతో కాలేజీ చదువు మధ్యలోనే వదిలేసి ఉగ్రవాదులతో కలిసి తిరిగాను. మా కాలేజీ (డూన్ పీజీ కాలేజీ ఫర్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ) యాజమాన్యం నన్ను మళ్లీ చేర్చుకుని అవకాశం ఇస్తుందని భావిస్తున్నాను. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ కావాలనేది నా ధ్యేయం. చెడు మార్గాన్ని వదిలేసి మంచివాడిగా బతకాలనుకుంటున్నాను. కొన్ని రోజులు సోషల్ మీడియా ద్వారా ఉగ్ర గ్రూపులతో సంబంధాలు కొనసాగించాను. భవిష్యత్తులో అలాంటి తప్పులు మళ్లీ చేయను. కుటుంబం కోసం, దేశం పనిచేయాలని నిర్ణయించుకున్నానని’ ఫరూఖ్ భట్ వివరించాడు. ఫరూఖ్ తండ్రి ఫరూఖ్ అహ్మద్ భట్ మీడియాతో మాట్లాడారు. ‘నా కుమారుడి ఫోన్ కొన్నిరోజులు స్విచ్ ఆఫ్ కావడంతో ఎంతో ఆందోళన చెందాను. ఉగ్రవాది అంటూ పేరు పడుతుందని చాలా బాధపడ్డాం. చివరికి పోలీసుల సహకారంతో చెడు విధానాలకు స్వస్తి పలికాడు. వాడు తప్పు తెలుసుకుని మారినందుకు సంతోషంగా ఉందని’ చెప్పారు అహ్మద్ భట్. -
'మీ అక్క కోసమైనా తిరిగొచ్చేయ్రా నాన్నా'
సాక్షి, శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో కనిపించకుండా పోయిన ఓ పీహెచ్డీ స్కాలర్ గన్ తో ప్రత్యక్షమై అందరికీ షాకిచ్చాడు. అది కూడా ఉగ్రవాదులు ఉపయోగించే గన్తో కనిపించి. అంతేకాదు, అతడు తమ సంస్థలో చేరినట్లు ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కూడా స్పష్టం చేసింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తోన్న మనన్ బషిర్ వాని ఇటీవలె ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు సైతం హైరానా పడుతున్న తరుణంలో అనూహ్యంగా అతడు ఏకే 47 గన్ పట్టుకొని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర రోదనలో మునిగిపోయారు. మరోపక్క, అతడు ఉగ్రవాద సంస్థలో చేరినట్లు హిజ్బుల్ ముజాహిదీన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ స్పందిస్తూ భారత్ నిర్లక్ష్యం కారణంగా, ఆర్థిక పరిస్థితుల కారణంగా కశ్మీర్ యువత తమతో చేతులు కలుపుతోందంటూ ప్రకటన చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మనన్ తల్లి తిరిగి రావాలని మీడియా ద్వారా తన కుమారుడికి విజ్ఞప్తి చేస్తూ బోరున విలపించింది. 'నాన్న మనన్.. మీ అమ్మ ఏడుస్తోంది రా.. దయచేసి వెనక్కి వచ్చేయి. మీ అక్క పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూడు. మీ అక్క కోసం అయినా తిరిగొచ్చేయిరా.. నువ్వు ఎప్పుడూ మీ అక్కకు అండగా ఉన్నావు' అంటూ మనన్ తల్లి షమీమా రోధించింది. -
కశ్మీర్లో విధ్వంసానికి పాక్ కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో భారీ విధ్వంసానికి ఆల్ఖైదా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలు కుట్రలు చేస్తున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆల్ఖైదా కమాండర్ జాకీర్ ముసా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో కలిసి లోయలో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని అంతర్గత నిఘా సంస్థలు తెలిపాయి. జాకీర్ముసా, మరికొందరు హిజ్బుల్ ఉగ్రవాదులు కశ్మీర్లోని పుల్వామా జిల్లాలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జాకీర్ ముసా, మరో ఇద్దరు ఉగ్రవాదులు అక్టోబర్ 26న పుల్వామాలోని ఒక రహస్య ప్రాంతంలో సమావేశమయినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక విధ్వంసం కోసం కొత్తగా శిక్షణ తీసుకున్న 12 మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ నియంత్రణ రేఖ గుండా భారత్లోకి ప్రవేశపెట్టిందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం 14 మంది ఉగ్రవాదులు కశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో రహస్యంగా దాక్కున్నారని.. వీరు ఎప్పుడైనా విధ్వంసం సృష్టించే ప్రమాదముందని నిఘావర్గాలు చెబుతున్నారు. -
సెల్ఫోన్ వాడారో... చచ్చారే!
► మొబైల్స్, సోషల్ మీడియా వాడొద్దంటున్న హిజ్బుల్ ► వాడితే ప్రమాదం తప్పదని హెచ్చరికలు ► సైన్యం సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించే అవకాశం శ్రీనగర్: మొబైల్స్, సోషల్ మీడియానును ఇకపై వినియోగించడం మానుకోవాలని వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ తన సభ్యులకు హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ సిగ్నల్స్ఆధారంగా సైన్యం మిలిటెంట్లను మట్టు పెడుతోందని హిజ్బుల్ ముజాహిద్దీన్ సుప్రీమ్ కమాండర్ సయ్యద్ సలావుద్దీన్ పేర్కొన్నారు. గత నెల్లో సైన్యం చంపిన హిజ్బుల్ టాప్ కమాండర యాసీన్, మరో 12 మంది మిలిటెంట్ల ఆచూకీని సిగ్నల్స్ ఆధారంగానే సైన్యం గుర్తించిందని ఆయన చెప్పారు. ఎంత ఎక్కువగా సాంకేతికతను ఉపయోగించుకుంటే అంత త్వరగా సైన్యానికి చిక్కుతారని.. సలావుద్దీన్ ఈ సందర్భంగా మిలిటెంట్లను హెచ్చరించారు. టెక్నాలజీ లేని రోజుల్లో.. 1990 ప్రాంతంలో భారత్పై ఎన్నో విజయవతంమైన దాడులు చేశామని.. ఇప్పుడు సాంకేతిక అవసరం లేదని మిలిటెంట్లకు సూచించారు. హిజ్బుల్ ముజీహిదీన్ టాప్కమాండర్ ప్రకటనపై స్పందించిన పోలీసులు అధికారులు.. కొంత కాలంగా హిజ్బుల్ మిలిటెంట్లను సెల్ఫోన్స్ సిగ్నల్స్, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా గుర్తించినట్లు చెప్పారు. చాలామంది టెర్రరిస్టుల ఫోన్కాల్స్ ట్రాక్ చేశామని వెల్లడించారు. -
భారీ ఎన్కౌంటర్.. టాప్ హిజ్బుల్ కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా షోపియన్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో భద్రతా దళాల చేతుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన ఉగ్రవాదుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ యాసిన్ యాతూ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు-ఆర్మీ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు భారత సైనికులు కూడా అమరులు అయ్యారు. షోషియన్ జిల్లాలోని అన్వీరా గ్రామంలో శనివారం సాయంత్రం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల ఏరివేతతో ఆదివారం ఉదయం తెల్లవారుజామున ముగిసింది. -
సీఆర్పీఎఫ్ క్యాంపుపై గ్రెనేడ్ దాడి
శ్రీనగర్: సీఆర్పీఎఫ్ క్యాంపును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు చేసిన గ్రెనేడ్ దాడిలో ఓ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్ము కశ్మీర్లోని పుల్వామ జిల్లా ట్రాల్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని అరిబల్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసుల ఉమ్మడి క్యాంప్ పై గుర్తుతెలియని దుండగులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవానుకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వని తొలి వర్ధంతిని పురస్కరించుకొని ఈ ఉగ్రదాడి జరిపినట్లు హిజ్బుల్ ముజాహిద్దీన్ గ్రూప్ ప్రకటించింది. -
భారత్లో ఉగ్రదాడులు చేశాం: సలాహుద్దీన్
లాహోర్/న్యూఢిల్లీ: భారత్లో ఇప్పటివరకు చాలాసార్లు ఉగ్ర దాడులకు పాల్ప డినట్లు హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్(71) అంగీకరించాడు. అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన అనంతరం ఆయన జియో చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ‘మేం ఇప్పటివరకు కశ్మీర్లోని భారత బలగాలే లక్ష్యంగా దాడులు నిర్వహించాం. భవిష్యత్తులో కూడా వారిపైనే దాడులు కొనసాగుతాయి’ అని చెప్పాడు. కశ్మీర్ను తన ఇంటిగా అభివర్ణించిన ఆయన.. బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాతే లోయలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. భారత్లో ఎక్కడైనా, ఏ సమయంలోనైనా దాడి చేయగల సామర్థ్యం తమకుందని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచే తాము ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు భారత్లో చాలామంది మద్దతుదారులు ఉన్నారని వెల్లడించారు. తమ ఉద్యమానికి పాక్, చైనాలు దౌత్యపరంగా నైతికంగా మద్దతు ఇచ్చాయని వెల్లడించారు. -
‘అతడు ఉగ్రవాదే.. అమెరికా సరిగ్గా పేరు పెట్టింది’
న్యూఢిల్లీ: హిబ్జుల్ ముజాహిదీన్ సంస్థ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ ముమ్మాటికీ ఉగ్రవాదేనని భారత్ స్పష్టం చేసింది. అతడు ఇటీవల మాట్లాడిన తీరే అతడు ఉగ్రవాది అని స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. అమెరికా అతడికి ప్రపంచ ఉగ్రవాది అని పేరు పెట్టిందని, దానికి అతడు తగినవాడంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. భారత్లోపల ఎక్కడంటే అక్కడ తాము దాడులు చేయగలం అని సలావుద్దీన్ ఈ నెల 1న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి అశోక్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ సయ్యద్ భారత్కు వ్యతిరేకంగా చేసిన మాటలే అతడు ఉగ్రవాది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ‘అతడు అంతర్జాతీయ ఉగ్రవాది అని అమెరికా అతడికి తగిన పేరే పెట్టింది’ అని అన్నారు. -
బుర్హాన్ వనీ వారసుడు కూడా..!
-
బుర్హాన్ వనీ వారసుడు కూడా..!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో అలజడి రేపుతున్న వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిబ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ స్థానంలో అతని వారసుడిగా పగ్గాలు చేపట్టిన మరో ఉగ్రవాది సబ్జార్ అహ్మద్ కూడా భద్రతా దళాల ఎన్కౌంటర్లో మృతిచెందాడు. శనివారం జమ్మూకశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు మరణించారు. ఇందులో సబ్జార్ కూడా ఉన్నాడని భద్రతా దళాలు తెలిపాయి. పుల్వామా జిల్లాలోని ట్రాల్ సెక్టార్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఏరివేయగా.. బారాముల్లా జిల్లాలోని రాంపూర్ సెక్టార్లో ఎల్వోసీ మీదుగా చొరబాటుకు ప్రయత్నించిన ఆరుగురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. ట్రాల్లోని ఓ ఇంటిలో అబు జరార్ అలియాస్ సబ్జార్ అహ్మద్, ఓ పాకిస్థానీ ఉగ్రవాదితో కలిసి నక్కి ఉండగా.. భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుమట్టాయి. ఈ సందర్బంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ ఇద్దరూ ప్రాణాలు విడిచాడు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్లో మృతిచెందడంతో కశ్మీర్లో ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇక, ఉడీకి సమీపంలో ఉన్న రాంపూర్లో తెల్లవారుజామున ఎల్వోసీ మీదుగా అనుమానాస్పద కదలికలు ఉండటంతో వెంటనే అలర్ట్ అయిన సైన్యం ఈ భారీ ఆపరేషన్ను చేపట్టింది. ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసింది. ఉడీ సెక్టార్లో శుక్రవారం జరిగిన చొరబాటు యత్నాన్ని సైన్యం సమర్థంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. పాక్ బార్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్)కు చెందిన ఇద్దరు చొరబాటుదారులు ఉడీ సెక్టార్లోకి వచ్చేందుకు ప్రయత్నించగా.. వారిని సైన్యం ఏరిపారేసింది. -
శాలువాలు అమ్మేవాడిగా వచ్చిన ఉగ్రవాది
మహారాజ్గంజ్(ఉత్తరప్రదేశ్): ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ఉగ్రవాది దొరికిపోయాడు. లక్నోకు చెందిన శషస్త్ర సీమ బల్(ఎస్ఎస్బీ) చేతికి అతడు శనివారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో చిక్కాడు. అతడిని నజీర్ అహ్మద్ అకా సాధిక్గా గుర్తించిన పోలీసులు ఓ పాకిస్థాన్ పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు. బన్హియాల్ ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణ పొందిన నజీర్ 2002 నుంచే రంబాన్ జిల్లాలో ఉగ్రవాదులకు అనుబంధంగా ఉంటూ పలు ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడు. 2003లో పాక్కు వెళ్లి హిజ్బుల్లో చేరాడు. నవంబర్ 2003 నుంచి జనవరి 2004 వరకు ఆయుధాలను ఎలా ఉపయోగించాలనే అంశంపై ప్రత్యేక శిక్షణను పొందాడు. అలాగే, ఐసిస్తోపాటు పాకిస్థాన్ ఆర్మీ నుంచి కూడా అతడు శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. ఏకే-47, ఏకే-56, ఎస్ఎల్ఆర్, రాకెట్ లాంచర్, అస్సాల్ట్ రైఫిల్(జీ3, జీ2)వంటి ఆయుధాలు ఎలా ఉపయోగించాలనే అంశంపై తర్ఫీదును తీసుకున్నాడు. ప్రస్తుతం భారత్పై పెద్ద మొత్తంలో విధ్వంసానికి ప్రణాళిక రచించుకున్న నజీర్ అందులో భాగంగా మే 10న ఖట్మాండులో దిగాడు. మహ్మద్ షఫీ అనే మరో ఉగ్రవాదితో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి పాకిస్థాన్ మీదుగా ఇక్కడి వచ్చాడు. భారత్ భూభాగంలోకి చొరబడేందుకు కుట్ర చేసి భారత్ ఖట్మాండు సరిహద్దుకు బస్సులో వచ్చాడు. ప్రత్యేక కార్పెట్లు, కశ్మీర్ శాలువాలు విక్రయదారుగా నేపాల్ సరిహద్దు నుంచి భారత్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నం చేసిన అతడిని ఎస్ఎస్బీ బలగాలు ప్రశ్నించగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపించలేకపోయాడు. అతడిని తనిఖీ చేయగా పాక్ పాస్ పోర్టు ఒకటి లభించింది. దీంతో అప్రమత్తమైన బలగాలు వెంటనే అదుపులోకి తీసుకున్నాయి. -
‘తలలు నరికి వేలాడదీస్తా..’
శ్రీనగర్: తమ ఉద్యమానికి అడ్డొస్తే తలలు నరికి లాల్ చౌరస్తాలో వేలాడాదీస్తానంటూ కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హుర్రియత్కు చెందిన నాయకులను హెచ్చరిస్తూ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ఉగ్రవాది జాకీర్ మూసా ఒక సంచలన ఆడియోను విడుదల చేశాడు. ఇస్లాం స్థాపనకోసం తామెంతో పోరాడుతున్నామని, దీనికి అడ్డంకులు సృష్టిస్తే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని, వారు హుర్రియత్ నాయకులైనా తలలు నరికిపడేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఆడియోను ముజఫరా బాద్ నుంచి విడుదల చేశాడు. అయితే, ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హిజ్బుల్ నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. మూసా ప్రకటనకు తమ ఉద్యమానికి సంబంధం లేదని, అది అతడి వ్యక్తిగత అభిప్రాయం అని అన్నారు. ముసా ఇచ్చిన ప్రకటనకు తమకు ఎలాంటి బాధ్యత లేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న హుర్రియత్ నేతలు సయ్యద్ అలీ షా గిలానీ, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్ ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. ఇస్లామిక్ స్టేట్, అల్ కాయిదా ఇతర ఉగ్రవాద సంస్థలకు కశ్మీర్లో ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మరోపక్క హిజ్బుల్ సంస్థ అధికారిక ప్రతినిధి సలీం హష్మీ స్పందిస్తూ గందరగోళం సృష్టించే ఏ ప్రకటన ఉన్నా అది పోరాటాన్ని దెబ్బతీస్తుందని, ముసా ప్రకటనకు తమకు సంబంధం లేదంటూ స్పష్టం చేశారు. హిజ్బుల్ సంస్థ పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండి ఉగ్రవాద చర్యలకు దిగుతోంది. మరోపక్క, పోలీసులు రంగంలోకి దిగి ఆ ఆడియో టేపును పరిశీలించే పనిలో పడ్డారు. ఇదిలాఉండగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ముసా ప్రకటించాడు. అయితే, అతడిని తమతో కొనసాగించుకునేందుకు హిజ్బుల్ సంస్థ నిరాకరించడంతో అతడు వేరే ప్రత్యామ్నాయం లేక సంస్థను వదిలేశాడు. -
సంచలనం సృష్టిస్తున్న హిజ్బుల్ వీడియో
శ్రీనగర్: ఉగ్రవాదులు ఆయుధాలు చేతపట్టిన హిజ్బుల్ మొజాహిద్దీన్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. భద్రతా దళాల చేతిలో జులైలో హతమైన యువనాయకుడు బుర్హాన్ వానీ గురించి ప్రచారం చేపట్టేందుకే హిజ్బుల్ ఈ వీడియోని పోస్టు చేసినట్లు పేర్కొంది. కాగా, వీడియోలో టెర్రరిస్టులు చేతుల్లో ఆయుధాలు పట్టుకుని నవ్వుతూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. దాదాపు నాలుగున్నర నిమిషాల నిడివి కలిగిన వీడియోలో మొత్తం 12 మంది ఉగ్రవాదులు కనిపించారు. వానీ పద్దతిలోనే తిరిగి కశ్మీరీ యువతను ఆకర్షించేందుకు హిజ్బుల్ ప్రయత్నిస్తోందని అనడానికి ఇది చాలా చక్కని ఉదాహరణ. సోషల్ మీడియాలో ఆయుధాలతో ఫోటోలు, వీడియోలను పోస్టు చేయడం ద్వారా వానీ యువతను మిలిటెంట్ గ్రూపులోకి ఆకర్షించేవాడు. హిజ్బుల్ విడుదల చేసిన మరో వీడియోలో గ్రూపు కొత్త నాయకుడు జకీర్ రషీద్ భట్ యువత గ్రూపులో చేరి భద్రతా దళాల నుంచి ఆయుధాలు చోరీ చేయాలని పిలుపునిచ్చాడు. గత కొద్ద నెలలుగా భద్రతా దళాల నుంచి ఆయుధాలు దొంగిలించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పటివరకూ 67 రైఫిళ్లను చోరీ చేసినట్లు సమాచారం. -
'భారత్ తో అణుయుద్ధం తప్పదు'
కరాచీ: కశ్మీర్ అంశంపై భారత్ తో అణుయుద్ధం తప్పదని హిజ్బుల్ ముజాహిదీన్ నేత సయీద్ సలాహుదీన్ హెచ్చరించారు. కశ్మీర్ పోరాటానికి అన్నివిధాల మద్దతు ఇవాల్సిన బాధ్యత పాకిస్థాన్ పై ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్ అండగా నిలిస్తే రెండు దేశాల మధ్య అణుయుద్ధం వచ్చే అవకాశముందన్నారు. కశ్మీర్ ప్రజలు రాజీ పడడానికి సిద్ధంగా లేరని, నాలుగో ప్రపంచ యుద్ధం రానుందని జోస్యం చెప్పారు. ప్రపంచం, పాకిస్థాన్ మద్దతు ఇవ్వకపోయినా, ఐక్యరాజ్య సమితి తన కర్తవ్యం నిర్వహించకపోయినా కశ్మీర్ ప్రజలు తమ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాలని సలాహుదీన్ పిలుపునిచ్చారు. సాయుధ యుద్ధం చేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదని కశ్మీర్ ప్రజలు నిర్ణయానికి వచ్చారని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం ముక్తి ప్రసాదించకపోతే అణచివేతకు గురవుతున్న కశ్మీర్ ప్రజలు సాయుధ తిరుగుబాటు చేస్తారని చెప్పారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమాజం విస్మరించినా, పాకిస్థాన్ ప్రయత్నాలు ఫలించకపోయినా, భారత్ వేధింపులు ఆపకపోయినా.. ఇండియా మూల్యం చెల్లించుకోక తప్పదని సలాహుదీన్ హెచ్చరించారు. -
హిజ్బుల్ ముజాహిదీన్ కు కొత్త కమాండర్
శ్రీనగర్: హిజ్బుల్ ముజాహిదీన్ జమ్ము కశ్మీర్ కమాండర్ గా మహ్మద్ ఘజ్వానీ అలియాస్ సబ్జార్ అహ్మద్ భట్ ను నియమిస్తున్నట్టు ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈమేరకు హిజ్బుల్ ఛీఫ్ సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. దక్షిణ కశ్మీర్ లోని రత్ సునాకు చెందిన ఘజ్వానీ బుర్మాన్ వనీ కి అత్యంత సన్నిహితుడు. కాగా ఘజ్వానీ నియామకాన్ని భద్రతా దళాలు దృవీకరించాల్సి ఉంది. శుక్రవారం భద్రతా దళాల చేతిలో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ 22 ఏళ్ల బుర్మాన్ వనీ హతమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆరాష్ట్రంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మృతుల సంఖ్య 25 కు చేరింది. -
అతడిని పట్టిస్తే 10 లక్షలిస్తా..
కశ్మీర్ యువకుడు బుర్హాన్ ముజఫర్ ను పట్టుకునేందుకు ఓ టెర్రరిస్టు గ్రూపు హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ చేసిన ప్రయత్నం సంచలనం సృష్టిస్తోంది. కశ్మీర్ కు చెందిన ఓ యువకుడిని ఉగ్రసంస్థలోకి చేర్చుకోవడాన్ని సోషల్ మీడియాలో భాగమైన ఫేస్ బుక్, వాట్సాప్ లలో ఆ వీడియోను ముజఫర్ ఆప్ లోడ్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తుంది. తన ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో పోలీసులకు ఆధారమైన ఆ వీడియోను అప్ లోడ్ చేసిన ముజఫర్ ను పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తానంటూ ఆ కమాండర్ ప్రకటించేశాడు. బుర్హాన్ ముజఫర్ వాణి దక్షిణ కశ్మీర్ లోని సంపన్న కుటాంబానికి చెందిన ఓ యువకుడు. అయితే 2010లో తన సోదరుడిని ఆర్మీ బలగాలు చంపాయన్న కారణంగా 15 ఏళ్ల వయసులోనే ఉగ్రవాద గ్రూపులో చేరిపోయాడు. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బుర్హాన్ ముజఫర్ మిలిటెంట్ల ఫొటోలను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. బుర్హాన్ తన ప్రసంగాలతో యువకులను మిలిటెంట్లుగా మారేందుకు ఉత్తేజ పరిచేవాడని సమాచారం. త్రాల్ అడవుల్లో బుర్హాన్ ను కలిసేందుకు యత్నించిన ముజాహిద్దీన్ సంస్థ కమాండర్ సోదరుడు ఆర్మీ కాల్పుల్లో ఈ ఏడాది మరణించిన విషయం తెలిసిందే. గత ఆరు నెలల్లో సుమారు 60 మంది యువకులను మిలిటెంట్లుగా మార్చాడని బుర్హాన్ పై ఆరోపణలున్నాయని ఓ పోలీస్ అధికారి తెలిపారు. బుర్హాన్ చర్యల వల్ల దక్షిణ కశ్మీర్ ఏరియాలో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని కూడా వారు పేర్కొన్నారు. -
ఇవేం విపరీత వ్యాఖ్యలు?
మొన్నటి భారత గణతంత్ర దినోత్సవానికి చాలా కోణాల నుంచి ప్రాముఖ్యం ఉంది. ఈ పర్యాయం అమెరికా అధ్యక్షుడు (బరాక్ ఒబామా) తొలిసారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒబామా భారత్కు బయలుదేరే ముందే ఉగ్రవాద దాడుల గురించీ, పాకిస్తాన్ గడ్డ మీద విలసిల్లుతున్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలను గురించీ ఆ దేశ పాలకులను గట్టిగా హెచ్చరించారు. అదే ఉత్సవంలో యుద్ధ సేవాపతకాన్ని అందుకున్న కల్నల్ మునీంద్రనాథ్ రాయ్ మరునాడే జమ్మూ- కశ్మీర్లోని పుల్వామా జిల్లా, త్రాల్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవా దులు జరిపిన దాడిలో వీర మరణం పొందారు. ఆయనతో పాటు కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ సింగ్ కూడా చనిపోయారు. ఈ ఘటనలన్నీ వరసగా మీడియాలో కీలకమైన శీర్షికలుగా వెలువడి అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఈ ఘటనలకు పతాక సన్నివేశం అన్నట్టు వెలువడిన వార్త ఒకటి భారతీయుల చేత కనుబొమలు ముడి వేయించింది. ఉగ్రవాదులతో పోరాడుతూ చనిపోయిన రాయ్, సింగ్లది త్యాగమైతే, త్రాల్లో సైన్యంతో పోరాడుతూ చనిపోయిన ఆ ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులది కూడా అందుకు తీసిపోదని వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా జిలానీ వ్యాఖ్యానించారు. చికిత్స కోసం ఢిల్లీలోని ఒక ఆస్ప త్రిలో ఉన్న జిలానీ, అక్కడి నుంచే ఈ మెయిల్ ద్వారా ఈ ప్రకటన ఇచ్చి అందరినీ విస్తుపోయేటట్టు చేశారు. ఎందుకంటే, కశ్మీర్ ఉగ్రవాదులకు, మతం పేరుతో రెచ్చిపోతున్న మూక లకు పాకిస్తాన్ అండదండలను ఇస్తున్న సంగతి ఎన్నోసార్లు రుజు వైంది. ఆ పాకిస్తాన్ కూడా తాను కశ్మీర్ స్వేచ్ఛ కోసం జరిపే పోరాటాన్ని సమర్థిస్తాననే చెప్పగలిగింది తప్ప, భారత సైన్యంతో బాహాబాహీ తలపడిన ఉగ్రవాదులను మృతవీరులంటూ వీరతాళ్లు ప్రకటించలేదు. ఆ పని జిలానీ చేశారు. త్రాల్ ప్రాంతంలోని హందూర్ గ్రామంలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర వాదులు దాగి ఉన్నారని తెలిసి కల్నల్ రాయ్, ఆయన బృందం దాడికి వెళ్లారు. అక్కడే రాయ్, సింగ్లతో పాటు, ఇద్దరు ఉగ్రవాదులు కూడా చనిపోయారు. కల్నల్ రాయ్ ఉత్తరప్రదేశ్కు చెందినవారు. ఆ రాష్ర్ట ప్రభుత్వం రాయ్ మృతికి సంతాపం ప్రకటించి, ముప్పయ్ లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటిం చింది. జాతీయ నాయకులు కూడా నివాళి ఘటించారు. సైనిక దళాల అధిపతి దల్బీర్సింగ్ సుహాగ్ సహా పలువురు సంతాపం ప్రకటించారు. అధికార లాంఛనా లతో రాయ్ అంత్యక్రియలు జరిగాయి. రాయ్ కుటుంబ సభ్యులంతా సైన్యంలో పనిచేసినవారే. అదే సమయంలో, చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదుల కుటుంబాలను పరామ ర్శించడానికి జిలానీ ఆదేశం మేరకు ఒక బృందం వెళ్లింది. ఆ ఇద్దరు ఉగ్రవాదులు కశ్మీర్ యువకులే. ఇందులో ఒకరు రాష్ట్ర పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్ కుమా రుడు కావడం విశేషం. ఈ ఉగ్రవాది పినతండ్రి కూడా లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించినవాడే. మరొక సమీప బంధువు తుపాకీ కోసం ఒక పోలీసు కానిస్టేబుల్ను కత్తితో పొడిచిన కేసులో అరెస్టయినాడు. ఈ సందర్భంగా జిలానీ కశ్మీర్ యువత గురించి చేసిన వ్యాఖ్య కొత్తదే. ఇంతకాలం నిరుద్యో గం, పేదరికం, అవిద్యల వల్లే కశ్మీర్ యువత తుపాకీ పడుతు న్నారనీ, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారనీ వేర్పాటువాదులు, ఉగ్రవాద మద్దతుదారులు చెప్పినమాట నిజం. ఇప్పుడు జిలానీ చెప్పిన మాట ఇందుకు భిన్నంగా ఉంది. ‘కశ్మీర్ యువత హింసా మార్గంలో పయనిస్తున్నదంటే అందుకు కారణం, అది వారి అభిరుచి, లేదా నిరుద్యోగం కాదు. వారు కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్నారు. వారికి చారిత్రక పరిస్థితులు తెలుసు. కశ్మీర్ విషాదం గురించి కూడా తెలుసు’ అని జిలానీ కొత్త భాష్యం చెప్పారు. ప్రతి ముజాహిద్ (యోధుడు) త్యాగం వ్యర్థం కాబోదని కూడా ఆయన అన్నారు. కశ్మీర్లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాగల దని అంతా ఎదురుచూస్తున్న తరుణంలో, ఒబామా పర్యటన తరువాత ఉపఖండంలో సమీ కరణలు మార బోతున్న సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో జిలానీ నోటి నుంచి ఈ విధమైన భాష్యం వెలువడడం చాలా ప్రశ్నలకు కారణమయ్యేదే. -
మాజీ తీవ్రవాదిని కాల్చి చంపిన ఆగంతకులు
షోపియాన్ జిల్లాలోని రామనగరి గ్రామంలో మాజీ తీవ్రవాది షబ్బీర్ అహ్మద్ మీర్ (33) ను అతని నివాసంలో నిన్న ఆగంతకులు హత్య చేశారని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం ఇక్కడ వెల్లడించారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలోనే మరణించాడని పోలీసులు చెప్పారు. గతంలో అతడు నిషేధిత తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్లో కీలకంగా వ్యవహారించాడని తెలిపారు. అనంతరం అతడు భద్రత దళాలకు లొంగిపోయి తీవ్రవాదానికి స్వస్థి చెప్పుతున్నట్లు ప్రకటించాడు. ఆ క్రమంలో అతడు జనజీవన స్రవంతిలో కలసి తన గ్రామంలో జీవనం సాగిస్తున్నాడని పోలీసులు వివరించారు. అయితే అతడిని హత్య చేసింది తామే అని ఇప్పటి వరకు ఏ తీవ్రవాద సంస్థ పేర్కొనలేదని పోలీసులు చెప్పారు.