Tadepalli Gudem
-
మేరుగు నాగార్జునపై తప్పుడు కేసు..
-
ఆ నేషనల్ హైవేలో ఎప్పుడూ రిపేర్లేనా? ప్రమాదాలు పట్టించుకోరా?
తణుకు: జాతీయ రహదారి నిర్వహణ పేరుతో సిబ్బంది అవలంభిస్తున్న విధానాల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి అభివృద్ధి పనుల పేరుతో ఇటీవల మరమ్మతులు చేపట్టారు. అయితే గత కొన్నేళ్లుగా మరమ్మతుల పేరుతో నిత్యం ట్రాఫిక్ మళ్లిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సుదీర్ఘంగా సాగుతున్న పనులు తద్వారా పలువురు వాహనదారులు మృత్యువాత పడుతుండగా పదుల సంఖ్యలో వాహనదారులు గాయాల పాలవుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి నిర్వహణ పనులకు వినియోగిస్తున్న భారీ వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా తణుకు మండలం దువ్వ జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హైవే నిర్వహణ వాటర్ ట్యాంకర్ వాహనం ఢీకొని పదో తరగతి చదువుతున్న బాలిక మరణించింది. ఇలాగే గతంలో సైతం పలువురు మృత్యువాత పడ్డారు. నిత్యం ట్రాఫిక్ మళ్లింపే పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి తాడేపల్లిగూడెం వరకు దాదాపు 50 కిలోమీటర్లు మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. జాతీయ రహదారి నిర్వహణ, మరమ్మతులు చేపట్టేందుకు దాదాపు రెండేళ్ల క్రితం ఒక కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఇందులో భాగంగా ఈ రోడ్డులో నిత్యం మరమ్మతులు చేస్తుండటంతో ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు. దీంతో రోడ్డుకు మధ్య భాగంలో ట్రాఫిక్ కోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. కిలోమీటర్ల మేర వీటిని ఏర్పాటు చేస్తుండటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. * మంగళవారం దువ్వలో జరిగిన ప్రమాదంలో రోడ్డు డివైడర్లో మొక్కలకు నీళ్లు పోసే వాటర్ట్యాంకర్ మోటారు సైకిల్ ను ఢీకొట్టడంతో బాలిక అక్కడిక్కడే మరణించింది. * ఇటీవల డీమార్ట్ సమీపంలో సైతం మోటారు సైకిల్పై వెళ్తున్న మహిళ రోడ్డు డివైడర్పై పడి మృతి చెందారు. * పెరవలి మండలానికి చెందిన మరో వ్యక్తిని హైవే నిర్వహణ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. * ఉండ్రాజవరం జంక్షన్ వద్ద సిగ్నల్ వద్ద వేచి ఉన్న యువకుల మోటారు సైకిల్ను వెనుక నుంచి వాహనం ఢీకొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. * ఇటీవల అలంపురం సెంటర్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులో భాగంగా రోడ్డు దాటుతున్న మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తణుకు పట్టణానికి చెందిన మహిళ మృతి చెందగా ఆమె కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. * దువ్వ జాతీయ రహదారిపై డివైడర్ మధ్యలో గొయ్యిలో పడి ఒక యువకుడు మృతి చెందాడు. నాసిరకం పనులు జాతీయ రహదారి నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టడంతో నిత్యం మరమ్మతులకు గురవుతున్నాయి. మరోవైపు పగలు సమయాల్లో మాత్రమే మరమ్మతు పనులు చేపడుతూ రోడ్డు మళ్లింపు చేపట్టాల్సి ఉంది. అయితే జాతీయ రహదారి నిర్వహణ సిబ్బంది మాత్రం రాత్రి సమయాల్లో సైతం ట్రాఫిక్ కోన్స్ అలాగే వదిలేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కోసారి మరమ్మతు పనులు చేయపోయినప్పటికీ రోడ్డు మార్గం మళ్లిస్తుండటంతో సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి ఆనుకుని గ్రామాల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా జాతీయ రహదారి నిర్వహణ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
‘ప్రేమోన్మాది కల్యాణ్ను కఠినంగా శిక్షిస్తాం’
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామంలో ఓ యువతిపై ప్రేమోన్మాది దారుణానికి పాల్పడిన ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్య స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్న వాసిరెడ్డి పద్మ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నిందితుడు కల్యాణ్ను కఠినంగా శిక్షిస్తామన్నారు. ‘ఇది ఒక ప్రేమోన్మాది దాడి. కల్యాణ్ అనే యువకుడు ఒక పశువులా అర్ధరాత్రి ప్రవర్తించాడు. బాధిత యువతి డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ కోర్స్ చేస్తోంది. పవర్ కట్ చేసి మరీ దాడికి పాల్పడ్డాడు. కరెంట్ పోవడంతో ఇంటిలోని వారు బయటకు వచ్చారు. యువతితో పాటు తల్లి, చెల్లి చేతులు, మెడపైన కత్తితో దాడి చేశాడు. వారి ట్రీట్మెంట్కు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఆ ప్రేమోన్మాదిపై చార్జ్షీట్ వేసి హత్యాయత్నం కింద కేసు పెట్టి రౌడీ షీట్ తెరవాలని ఎస్పీని కోరాం. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతుంది’ అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. -
ఈ నెల 26 నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర
సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యత నేపథ్యంలో ఈ నెల 26 నుంచి వైఎస్సార్ సీపీ బస్సు యాత్ర చేపట్టనుంది. సామాజిక న్యాయం పేరిట ఈ యాత్ర చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వ ఏవిధమైన ప్రాధాన్యత ఇస్తోందనేది ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. ఈ మేరకు మొత్తం శ్రీకాకుళం, అనంతపురం, రాజమండ్రి, నరసరావుపేట నాలుగు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించి బహిరంగ సభలు నిర్వహించనున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీలకు చెందిన మొత్తం 17 మంత్రులు ఈ బస్సు యాత్రలో పాల్గొంటారు. ఈ నెల 26న శ్రీకాకుళం లేదంటే విజయనగరంలో బహిరంగ సభ 27న రాజమండ్రిలో సభ 28న నరసరావుపేటలో బహిరంగ సభ.. ఆ రాత్రికి నంద్యాలలో బస, 29న అనంతపురంలో బహిరంగ సభ (చదవండి: తీరిన బొగ్గు కొరత.. ఏపీలో ఇక నిరంతరాయ విద్యుత్ సరఫరా) -
వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
ఉగాది వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు
-
తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ ఇళ్లు సీజ్
సాక్షి, హన్మకొండ(కాజీపేట): ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్యప్రకాష్రావు ఇళ్లు, ఆస్పత్రులపై బుధవారం తెల్లవారుజామున సీబీఐ, ఏసీబీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. తెలంగాణలోని హన్మకొండ జిల్లా కాజీపేట రహమత్నగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఉండే డైరెక్టర్ ఇళ్లపై విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలకు చెందిన సీబీఐ సీఐ ఎ.సంతోష్కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ఇళ్లకు తాళాలు వేసి సీజ్ చేశారు. చదవండి: (కొత్త జిల్లాల్లో మౌలిక వసతులపై కసరత్తు) -
‘టీడీపీ తెలుగు తాలిబన్ పార్టీగా మారింది’
-
విద్యుత్ వెలుగులతో ముస్తాబయిన ఏపీ సీఎం జగన్ కార్యాలయం
-
సంక్షేమం..అభివృద్ధే గెలిపించాయి..
తాడేపల్లి: ప్రజల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకాలు, చేసిన అభివృద్ధి మున్సిపల్ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించాయని జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పరిధిని, 108, 104 సేవలను కూడా పెంచామన్నారు. కొత్తగా మరో 16 మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. నూతనంగా, 3 పోర్టులు, 4 షిప్పింగ్ హర్బర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలవరం, రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను తీసుకొచ్చామన్నారు. తమ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉందన్నారు. మాట మాట్లాడితే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ప్రజలు చెంప చెళ్లుమనిపించేలా బుద్ధి చెప్పారన్నారు. అధికార పార్టీని ఏం పీకుతారు అన్న బాబుకి , ప్రజలే డిపాజిట్లు కూడా లేకుండా జెండా పీకేశారని విమర్షించారు. 2019 అసెంబ్లి ఎన్నికల్లో ప్రజలు బాబుని పీకేశారు. ఇక 2024లో టీడీపీ జెండాను కూడా పీకి పడేస్తారని అన్నారు. అయితే తమకు ఇంత భారీ మెజార్టీనిచ్చిన ప్రజలకు తమ ప్రభుత్వం ఎప్పటికి రుణపడి ఉంటుందని అన్నారు. చదవండి: నిన్న వలంటీర్లు.. నేడు కౌన్సిలర్, కార్పొరేటర్లు -
‘వీడియోలో మాట్లాడినప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నారు’
తాడేపల్లిగూడెం: కరోనా మహమ్మారికి మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు బలికావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సహృదయుడైన మాణిక్యాలరావు మనల్ని విడిచివెళ్లిపోవడం చాలా బాధను మిగిల్చిందన్నారు. మాణిక్యాలరావు మృతివార్తను తెలుసుకుని ఎంతో కలత చెందానన్నారు. మాణిక్యాలరావు మృతిపై కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘క్రమశిక్షణ, నిబద్దత గల మాణిక్యాలరావు.. కరోనా వచ్చినపుడు కూడా ఎంతో మనోధైర్యంతో భయపడకుండా వీడియోలో మాట్లాడారు. (మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత) ఉదయం కూడా వారి అల్లుడి తో ఫోన్ లో మాట్లాడి యోగక్షేమాలు కనుక్కుంటే బాగానే ఉందని చెప్పగా ఎంతో సంతోషపడ్డాం. భారతీయ జనతా పార్టీలో పేరెన్నిన నాయకుడు. ఇలాంటి పరిస్థితుల్లో దూరమవ్వడం చాలా బాధాకరంగా ఉంది. మాణిక్యాలరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అని సంతాపం వ్యక్తం చేశారు. ఎంతోమంది కరోనాను జయించి తిరిగి వస్తున్న సందర్భంలో మాణిక్యాలరావు ఇలా మృతి చెందడం విచారించదగ్గ విషయమన్నారు. కొన్ని రోజుల క్రిత కరోనా వైరస్ బారిన పడ్డ పైడి కొండల మాణిక్యాలరావు శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.(‘ఈరోజు ఉదయమే ఆయన కూతురితో మాట్లాడా’) -
మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత
-
ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ
సాక్షి, తాడేపల్లి: పాఠశాల విద్య, గోరుముద్ద కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. ‘కిండర్ గార్డెన్పై ప్రత్యేక దృష్టి సాధించాలి. పాఠశాల విద్య పరిధిలోకి పీపీ–1, పీపీ–2లను తేవాలి. స్కూళ్ల పక్కనే అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టీచర్ల కోసం శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పాఠశాలల విద్యార్థుల్లో ఇంగ్లీష్ పరిజ్ఞానంపై టోఫెల్ తరహాలో పరీక్ష నిర్వహించాలి. లెర్న్ టు లెర్న్ కాన్సెప్ట్కు హైస్కూల్లోనే నాంది పడాలి. డిజిటల్ విద్య, డివైజ్లపై అవగాహనకు తరగతులు ఉండాలి. హైస్కూల్లో లైఫ్ స్కిల్స్, కెరీర్ కౌన్సెలింగ్ ఇవ్వాలి. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, స్కూళ్లలో బాత్రూమ్ల శుభ్రతకు ప్రాధాన్యంత కల్పించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందిని సంపూర్ణంగా వినియోగించుకునేందుకు బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. (‘సత్వర న్యాయం కోసమే దిశ చట్టం’) -
రాష్ట్రంలో పనీపాటా లేనిది బాబు ఒక్కరే
సాక్షి, తాడేపల్లిగూడెం: ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం మొత్తం మీద పనీపాటా లేని వ్యక్తి బాబు ఒక్కరేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం ఆయన తాడేపల్లిగూడెంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా వైరస్కు బయపడి రాష్ట్రం వదిలిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడని విమర్శించారు. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకునే చర్యలు ఆయనకు కనిపించడం లేదని దుయ్యబట్టారు. దేశంలోనే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఎక్కువ మందికి పరీక్షలు చేయడం వల్లే ఎక్కువ కేసులు బయటపడతాయని, టెస్టులు చేయకపోతే కేసులు బయటకురావన్నారు. (వాస్తవాల వస్త్రాపహరణం) ప్రధానిని ప్రశ్నించే దమ్ముందా? దేశం మొత్తంలో కరోనా పాజిటివ్ కేసుల శాతం 4.1 ఉంటే ఏపీలో ఇది 1.4 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపారు. ర్యాపిడ్ కిట్లు కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు.. కానీ కేంద్రం ర్యాపిడ్ కిట్లను రూ. 790లకు కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. దీనిపై ముందు దేశ ప్రధాని మోదీని ప్రశ్నించి ఆ తర్వాత రాష్ట్ర పరిస్థితిని ప్రశ్నించే దమ్ముదా? అని సవాలు విసిరారు. ఇటువంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేయకూడదనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని కొట్టు సత్యనారాయణ తెలిపారు. (‘పవన్వి పనికిమాలిక రాజకీయాలు’) -
'ఈ సమయంలో రాజకీయాలు చేయడం తగదు'
సాక్షి, పశ్చిమ గోదావరి : కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విపత్కర సమయంలో రాజకీయాల గురించి మాట్లాడడం క్షమించరాని నేరమని ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీలు అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విజయసాయిరెడ్డి పై నీచమైన కామెంట్లు చేసినందుకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారన్నారు. బీజేపీకి అండగా అండగా ఉంటున్న జనసేనతో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారని విమర్శించారు. కరోనా కట్టడిలో ప్రపంచంలో భారత దేశం ముందుంటే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందని జాతీయ మీడియా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్థవంతమైన పాలన చూసి ఓర్వలేకనే చంద్రబాబు సహా ఇతర టీడీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రికి నివేదించానంటూ కొట్ట సత్యనారాయణ పేర్కొన్నారు. అంతకముందు తాడేపల్లిగూడెం పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన వాణిజ్య, వ్యాపార, డ్వాక్రా మహిళలు తదితర వర్గాలు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనాపై పోరాటానికి మద్దతుగా ఇచ్చిన విరాళాలను బుధవారం అమరావతిలో సీఎంను కలిసి రూ. 2 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. మంచి సమాజం రావాలంటే అందరూ సహకరించాలి అలా సహకరించాలని పేర్కొన్నారు. -
దానికి టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి!
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సకాలంలో సమర్థవంతమైన చర్యలు తీసుకుని కరోనావైరస్ను అరికట్టడంలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ కొనియాడారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... తాడేపల్లిగూడెంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న రాజకీయాలపై మండిపడ్డారు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్తో పోరాడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం దానితో సంబంధం లేకపోవడం మన దౌర్భాగ్యం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం తమకు ప్రజల కష్టాలు పట్టనట్లు హైదరాబాద్ వెళ్ళి పోయి అక్కడి నుంచి తప్పు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 1000రూపాయిలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా చెబుతున్న నాయకులు దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాజకీయలకు దూరంగా ఉండాలనుకున్నా ప్రతిపక్షాలు చేస్తున్న చౌకబారు ప్రకటనలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కోటి ముప్ఫై లక్షల కుటుంబాలకు న్యాయం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. కరోనాను అరికట్టడంలో రాష్ట్ర పనితీరును దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంసించడాన్ని ప్రతిపక్షనాయకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు చేస్తున్న విమర్శలను రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్ద పై మిలటరీ ఆసుపత్రి సిబ్బంది చేసిన సర్వేలో రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించిన విషయం ప్రతిపక్షాలకు మాత్రం కనిపించకపోడం శోచనీయమని సత్యనారయణ అన్నారు. -
గన్నవరంలో చిరంజీవికి ఘన స్వాగతం
-
గన్నవరంలో చిరంజీవికి ఘన స్వాగతం
సాక్షి, గన్నవరం: మెగాస్టార్ చిరంజీవికి గన్నవరం విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం 9.00 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. చిరంజీవి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెళ్లనున్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు సెంటర్లో నెలకొల్పిన తొమ్మిది అడుగుల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరిస్తారు. సెంటర్కు ఎస్వీఆర్ సర్కిల్గా నామకరణం చేస్తారు. కాగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ కృషితో విగ్రహ ఆవిష్కరణకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం, చిరంజీవితో మాట్లాడటం, తేదీనిక ఖరారు చేయడంతో ఎట్టకేలకు ఆదివారం ఉదయం విగ్రహ ఆవిష్కరణ జరుగనుంది. మరోవైపు చిరంజీవి రాక సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు హాజరు అయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
'మాణిక్యాలరావు మతిభ్రమించి మాట్లాడుతున్నారు'
సాక్షి, తాడేపల్లిగూడెం : మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, బీజేపీలో గుర్తింపుకోసం చవకబారు ప్రకటనలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ విమర్శించారు. శనివారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు మర్చిపోవడంతో ఏదోక రకంగా గుర్తింపు కోసం సంబంధం లేకుండా మాణిక్యాలరావు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్లు చూసి బీజేపీ మర్చిపోతుందేమోనన్న భయంతో అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ2 లా వైఎస్సార్సీపీ మారిందని మాణిక్యాలరావు అనడం విడ్డూరంగా ఉందన్నారు. దేవదాయ శాఖ భూముల్ని తాడేపల్లిగూడెంలో ఆక్రమించి అమ్ముకొని, వాటాలు తీసుకోవడం మినహా ఆ శాఖ అభివృద్ధికి ఆయన చేసింది సున్నా అని అన్నారు. దేవదాయ శాఖ భూముల్ని పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు. కార్పొరేట్ ద్రోహులను కాపాడుతున్నారు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాష్ట్రంలో పరిపాలన దేశానికి ఆదర్శంగా ఉందని చెబుతుంటే మాణిక్యాలరావు ఇలా మాట్లాడటం సరికాదన్నారు. రివర్స్ టెండరింగ్ విధానంపై అవగాహన లోపంతో మాట్లాడుతున్నారన్నారు. రాజధాని భూములపై అప్పటి సీఎం చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడితే చోద్యం చూశారని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే వలంటీర్ల వ్యవస్థని కించపర్చేలా మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ ద్రోహులను కాపాడుతున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. అవినీతికి చిరునామాగా మారిన టీడీపి ఎంపీలను చేర్చుకొని రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎరువుల మాఫియాకు, దొంగనోట్లు మార్చే వారికి మాత్రమే మాణిక్యాలరావు న్యాయం చేశారన్నారు. అధికారం ఉన్న సమయంలో అహంకారంతో అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టించిన సంగతులు మరిచిపోయి రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం దృష్టికి గోయంకా కళాశాల అంశం పట్టణంలోని డీఆర్ గోయంకా మహిళా కళాశాల విషయంపై సీఎంతో మాట్లాడానని ఎమ్మెల్యే కొట్టు తెలిపారు. ఈ విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారని, దాతల మనోభావాలు, విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రయత్నాలు జరుగుతాయన్నారు. ఎస్టీవీఎన్ హైస్కూలు విషయంపై పరిశీలన చేస్తున్నామన్నారు. ఎస్వీ రంగారావు విగ్రహ ఆవిష్కరణకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నామన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే విషయంలో సినీనటుడు చిరంజీవి తనతో పలుమార్లు మాట్లాడారని, అక్టోబరు మొదటి వారంలో ఆవిష్కరణ జరగవచ్చన్నారు. విలేకర్ల సమావేశంలో పార్టీ నాయకులు కర్రి భాస్కరరావు, నిమ్మల నాని, కొట్టు విశాల్, గుండుబోగుల నాగు, గొర్రెల శ్రీను, మానుకొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి చేసుకుని మొహం చాటేశాడు..
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : పెళ్లి చేసుకుని మొహం చాటేస్తున్నాడంటూ ఓ భార్య భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగిన సంఘటన తాడేపల్లిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. ఇంటిముందు టెంట్ వేసి, ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించిన రాణిని భర్త బంధువులు అడ్డుకుని దుర్భాషలాడారు. పెట్రోలు పోసి తగలబెడదామని బెదిరించారు. దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి భార్యను పోలీస్స్టేషన్కు తరలించడంతో ఆందోళన సద్దుమణిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆకుల ఎస్తేరురాణి (రాధిక)కు, ఆకుల పవన్కృష్ణకు ఈ ఏడాది జనవరి నెలలో గూడెం రైల్వేస్టేషన్ వద్ద పరిచయం అయింది. స్థానిక జువ్వలపాలెంకు చెందిన టాక్సీ డ్రైవర్ అయిన పవన్కృష్ణ అప్పట్లో ఎస్తేరురాణిని స్వగ్రామం మౌంజిపాడుకు కిరాయి నిమిత్తం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఒకరి ఫోన్ నంబర్లను మరొకరు తీసుకుని తరచూ ఫోన్లలో మాట్లాడుకునే వారు. వీరద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమ వ్యవహారానికి దారితీసింది. మే నెలలో పాలంగి గ్రామంలోని శివాలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఎస్తేరురాణిని భర్త పవన్కృష్ణ రాధికగా అతని తల్లిదండ్రులకు, బంధువులకు పరిచయం చేశాడు. ఈ క్రమంలో దఫదఫాలుగా రాణి నుంచి పవన్ సుమారు రూ.3.30 లక్షలను తీసుకున్నాడు. కొన్ని రోజులకు తన నుంచి తన భర్త తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన ఎస్తేరురాణి అత్తవారింటికి వెళ్లింది. వారు ఆమెను బైటకు గెంటివేశారు. ఈ నేపథ్యంలో పవన్కృష్ణ బంధువులు ఎస్తేరురాణిపై పలుమార్లు దాడికి దిగారు. దీంతో ఉండ్రాజవరం, పెంటపాడు, తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో ఆయా ప్రాంతాల పోలీసులు కేసులు నమోదు చేశారు. తన భర్తను తనకు అప్పగించాలని శనివారం అత్తవారి ఇంటి వద్ద ఆందోళనకు దిగిన ఎస్తేరురాణిని పవన్ తల్లిదండ్రులు, బంధువులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వివాద సమాచారం అందుకున్న పోలీసులు రావడంతో సద్దుమణిగింది. ఎస్తేరురాణిని పోలీస్స్టేషన్కు తరలించగా ఆమె ఇచ్చిన ఫిర్యాదును అందుకున్న సీఐ ఆకుల రఘు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్తేరురాణి సమస్యను పరిష్కరిందుకు మాతా శిశు సంరక్షణ శాఖ వార్డుల సూపర్వైజర్ మంగతాయారు, మానవహక్కుల కమిషన్ కార్యదర్శి విజయకుమారి, కేవీవీ లక్ష్మి, డి.గాయత్రిదేవిలు ఆమె వెంట ఉన్నారు. -
నిట్లో 800 సీట్లు
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : ఏపీ నిట్లో సీట్ల సంఖ్య 800 పెరుగనుంది. దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నుంచి తాజాగా ఉత్తర్వులు వచ్చాయి. ఏపీ నిట్లో ప్రస్తుతం 480 సీట్లు ఉన్నాయి. వీటిలో 240 సీట్లను హోమ్ స్టేట్ కోటా కింద రాష్ట్రంలోని విద్యార్థులకు, 240 సీట్లను దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తున్నారు. గూడెం నిట్కు దేశవ్యాప్తంగా ఫలితాలు, ఉద్యోగ అవకాశాల కల్పనలో దేశంలోని 31 నిట్లలో తొమ్మిదో స్థానం ఉంది. ఏపీ నిట్ శాశ్వత భవనాల నిర్మాణ పనులు చేపట్టిన ఎనిమిది నెలల కాలంలో దాదాపు పూర్తి కావచ్చాయి. 2019–20 విద్యాసంవత్సరం తరగతులు శాశ్వత భవనాలలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీ నిట్లో సీట్లు ఒక్కసారిగా మరో 320 పెరుగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నుంచి అనుమతి వచ్చింది. ప్రస్తుత మున్న 480 సీట్లతో పాటు, సూపర్ న్యూమరరీ సీట్ల కింద మరో 120 సీట్లు పెరుగనున్నాయి. వీటిలో 60 సీట్లను రాష్ట్రంలోని విద్యార్థులకు, మరో 60 సీట్ల దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులతో భర్తీ చేస్తారు. ఎకనమికల్లీ వీకర్స్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్ ) కోటా ఈ ఏడాది దేశంలోని 20 నిట్లలో మాత్రమే సీట్లను పెంచుకునే అవకాశం కల్పించారు. వచ్చే విద్యాసంవత్సరం 2020–21 నుంచి ఏపీ నిట్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 200 సీట్లు అదనంగా భర్తీ చేసుకునేందుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీ నిట్లో సీట్ల సంఖ్య 480 నుంచి 800కు పెరుగనుంది. ఆగస్టు 5 నుంచి తరగతులు ఈ ఏడాది నిట్ విద్యార్థులకు తరగతులు ఆగస్టు ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు తెలిపారు. నిట్ సీట్ల భర్తీకి సంబం«ధించి ఏడో రౌండ్ ఈ నెల 18న ముగియనుంది. ఇప్పటికే ఏపీ నిట్లో ఉన్న అన్ని సీట్లు 486 (సూపర్ న్యూమరరీ సీట్లు ఆరుతో కలిపి) విద్యార్థులు ఆప్షన్ను ఎంచుకున్నారు. ప్లోటింగ్. ఫ్రీజింగ్, స్టైడింగ్ పద్ధతిలో ఆప్షన్లు ఇచ్చినందున ఏడో రౌండ్ ముగిసిన తర్వాత మాత్రమే ఏ నిట్లో ఎంత మంది చేరతారనే అంకె తేలనుంది. 23 నాటికి ఎక్కడ ఎంత మంది విద్యార్థులు చేరారనే విషయం తేలుతుంది. ఏపీ నిట్ తరగతులు ఈ విద్యాసంవత్సరం విమానాశ్రయ భూముల దగ్గర ఉన్న శాశ్వత ప్రాంగణంలో ప్రారంభం అవుతాయి. ల్యాబ్ అవసరాలు, ఇతర సదుపాయాలు ఆఖరి సంవత్సరం విద్యార్థులకు అవసరం కావడంతో, తాత్కాలిక వసతిగా ఉన్న వాసవీ ఇంజనీరింగ్ కళాశాల, ఆకుల గోపయ్య ఇంజనీరింగ్ కళాశాల, ఏపీ నిట్ శాశ్వత భవనాలలో తరగతులు నిర్వహిస్తారు. అక్టోబరులో స్నాతకోత్సవం ఈ ఏడాది అక్టోబర్లో నిట్ స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అప్పటికి నిట్ తొలి దశ పనులు పూర్తవుతాయి. స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ మంత్రి హాజరు కానున్నారు. అదనంగా రూ.92 కోట్లు ఏపీ నిట్ వన్, వన్బి పనుల కోసం కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ అదనంగా మరో ,రూ.92 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. నిట్ రెండు దశల భవనాల పనుల కోసం తొలుత రూ.465 కోట్లు కేటాయించారు. తొలిసారిగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ (హెఫా) ను ఈ పనులకు నిధులు విడుదల చేయడానికి ఏర్పాటు చేశారు. నిట్ భవనాల కోసం అయ్యే ఖర్చులో ఏడు శాతం నిధులను కెనరా బ్యాంకు, 93 శాతం నిధులను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇస్తుంది. రెండు« దశల పనుల నిమిత్తం కేటాయించిన రూ.465 కోట్లలో ఇప్పటికే రూ.275 కోట్లను విడుదల చేశారు. వన్బీ భవనాల పనులను తొలి దశ భవనాల నిర్మాణం చేపట్టిన పూనాకు చెందిన బీఎం.షిర్కే కంపెనీకే ఇచ్చారు. భవనాల నిర్మాణాలకు రూ.465 కోట్లు సరిపోవని, ఇంకా నిధుల అవసరం ఉందని డైరెక్టర్ సీఎస్పీ.రావు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖను కోరారు. దీంతో భవనాల నిర్మాణం కోసం మరో రూ.92 కోట్లు మంత్రిత్వశాఖ కేటాయించింది. వాస్తవానికి కేంద్రం పర్యవేక్షణలో నిర్మించే భవనాల పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించే నిధులు రూ.500 కోట్లు జీఎస్టీతో కలిపి చేరితే నీతి ఆయోగ్ అనుమతి తీసుకోవాలి. నిట్ భవనాల ప్రాధాన్యత దృష్ట్యా , తక్కువ కాలంలోనే సాధించిన ప్రగతిని బేరీజు వేసుకొని మొత్తం నిధులు రూ.557 కోట్లు కేటాయించారు. రెండోదశ (వన్బీ) పనులు నిమిత్తం భవనాల డ్రాయింగ్లు సిద్ధమయ్యాయి. అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్సు, తరగతి గదులు, ల్యాబ్ కాంప్లెక్సు, రెండు బాలుర హాస్టల్స్, వీటిలో ఒకటి నాలుగు అంతస్తులతో, ఒకటి సింగిల్ అంతస్తుతో నిర్మిస్తారు. వన్బీ పనుల కోసం రూ.196 కోట్లు వెచ్చిస్తారు. -
గల్ఫ్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, తాడేపల్లిగూడెం : గల్ఫ్ దేశాలు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టిం మాణిక్యాలరావు అన్నారు. బుధవారం స్థానిక కార్యాలయం వద్ద జరిగిన గల్ఫ్ హెల్ప్లో పలువురు మాణిక్యాలరావుకు వినతులు అందించారు. కొవ్వూరుకు చెందిన జి.నాగేశ్వరరావు జీవనోపాధి నిమిత్తం మూడేళ్ల క్రితం సౌదీ అరేబియా దేశం వెళ్లగా, అక్కడ అనారోగ్యం కారణంగా జూలై 4న మృతి చెందాడని, మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని మృతుని సోదరుడు ముత్యాలరావు వినతిపత్రం అందించాడు. ఘంటావారిగూడెం గ్రామానికి చెందిన తన తల్లి ఎస్.నాగమణి పది నెలల క్రితం కుటుంబ అవసరాల నిమిత్తం కువైట్ వెళ్లిందని, ఆమెతో ఎక్కువ పనిచేయించుకుంటూ జీతం ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారని, తన తల్లిని స్వదేశం రప్పించాలని కుమార్తె జ్యోతి వినతిపత్రం అందించింది. భీమవరానికు చెందిన వీరమళ్ల దేవి రెండేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం సౌది అరేబియా దేశానికి వెళ్లగా అగ్రిమెంట్ ప్రకారం రెండేళ్ల తరువాత ఇండియాకు పంపాల్సి ఉన్నా ఇండియాకు పంపడం లేదని, తన కుమార్తెను ఇండియాకు రప్పించాలని తండ్రి జి.సోమేశ్వరరావు వినతిపత్రం సమర్పించారు. మాణిక్యాలరావు మాట్లాడుతూ భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి న్యాయం జరిగే విధంగా చూస్తానని బాధితులకు వివరించారు. -
సమస్యలు.. సైడ్ ట్రాక్
సాక్షి,తాడేపల్లిగూడెం : ఎర్ర కాలువపై ఉన్న పాత అక్విడెక్ట్ తొలగించినా...గట్లు ఎత్తు పెంచి ఆధునీకరించినా, ముంపు సమస్య నివారణకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఆధునీకరణలో భాగంగా గట్లు ఎత్తు పెంచారు. అయితే, గట్లను రివిట్మెంట్ చేయకపోవడంతో చిన్నపాటి వర్షానికే గత ఏడాది జూలైలో గట్లు జారిపోయాయి. దీనికి తోడు అదే ఏడాది ఆగస్టులో కురిసిన వర్షాలకు మారంపల్లి వద్ద రైల్వే ట్రాక్ను ఆనుకుని గట్లు పూర్తి స్థాయిలో అనుసంధానించకపోవడమే ముంపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో నందమూరు, మారంపల్లి, ఆరుళ్ల గ్రామాల వైపు, జగన్నాథపురం, మాధవరం గ్రామాల వైపు వేలాది ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో రైతాంగం అపార నష్టం చవి చూసింది. పలు చోట్ల చేలలో ఇసుక మేటలు వేసింది. ఈ ముంపునకు సంబంధించి రైతాంగానికి ప్రభుత్వం నుంచి రావలసిన పరిహారం అందని పరిస్థితి. మరో మూడు నెలలు గడిస్తే ముంపునకు ఏడాది పూర్తి కావస్తుంది. మళ్లీ వర్షాకాలం వచ్చింది. గట్లు జారిన చోట పటిష్ట చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో మళ్లీ రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రైల్వే ట్రాక్ భద్రత కోసమే...! ఎర్ర కాలువ నిర్మాణం జరిగిన సమయంలోనే మారంపల్లి వద్ద రైల్వే ట్రాక్ సమీపం వరకు గట్లు వేయలేదని తెలుస్తోంది. ట్రాక్ అతి దగ్గరగా గట్లు వేయడం వల్ల పై నుంచి వరద నీరు ఉధృతంగా వస్తే ట్రాక్ భద్రత ఇబ్బందుల్లో పడుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో ట్రాక్కు చేరువగా గట్లు వేయడానికి అనుమతి నిరాకరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ట్రాక్కు ఆనుకుని వరద నీరు పోయేలా కాలువలను తవ్వింది. ఆ కాలువలు కాలక్రమంలో ఆక్రమణలకు గురై పూడుకుపోవడంతో వరద నీరంతా మారంపల్లి రైల్వే ట్రాక్ సమీపం నుంచి చేలను ముంచెత్తుతుంది. దీన్ని గుర్తించని రైతులు పాత అక్విడెక్ట్ను పట్టుబట్టి తొలగించారు. అయితే, ముంపును నివారించాలంటే మారంపల్లి వద్ద రైల్వే ట్రాక్ కానాలను పెంచడం, గట్లను ట్రాక్ వరకు పొడిగించడం చేయవలసి ఉంది. ఇది జరిగితేనే ఎర్ర కాలువ ముంపు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. గట్లు పొడిగిస్తే ముంపు నివారణ మారంపల్లి రైల్వే ట్రాక్కు రెండు వైపులా ఉన్న ఖాళీ ప్రాంతాన్ని గట్లు వేసి పూడ్చడం వల్ల ముంపును నివారించవచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన ఎంపీపీ గన్నమని దొరబాబు ఈ మేరకు రైల్వే అధికారులను తీసుకొచ్చి ముంపు ప్రాంతాన్ని చూపించినా ప్రయోజనం లేకపోయింది. జంగారెడ్డిగూడెం వద్ద కొంగువారిగూడెం ప్రాజెక్టు నుంచి వదిలిన వరద నీరు ఎర్ర కాలువకు చేరుతుంది. ఇలా వస్తున్న వరద నీరు నందమూరు అక్విడెక్ట్ వద్ద లాగకపోవడం ముంపునకు మరో కారణంగా కనిపిస్తోంది. దీంతో వేలాది ఎకరాలు ముంపునకు గురవుతూ వచ్చాయి. మారంపల్లి వద్ద ట్రాక్ కానాలు పెంచడంతో పాటు దువ్వ వద్ద వెంకయ్య – వయ్యేరు కాలువ కానాలను పెంచితేనే గానే పూర్తి స్థాయిలో వరద నీరు లాగే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. -
తాడేపల్లిగూడెంలో జిల్లా జైలు
సాక్షి, తాడేపల్లిగూడెం : మూడెకరాల సువిశాల విస్తీర్ణంలో అధునాతనంగా పట్టణంలోని విమానాశ్రయ భూముల్లో సబ్జైలు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు మూడెకరాల భూమిని జైళ్లశాఖకు కే టాయిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు భూమిని జిల్లా సబ్జైళ్ల అధికారి అప్పలనాయుడు పట్టణానికి వచ్చి ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించి వెళ్లారు.ప్రభుత్వ విధాన నిర్ణయాలలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పడితే ఈ జైలునే జిల్లా జైలుగా మార్చే విధంగా నిర్మాణాలు ఉంటాయని సమాచారం. జిల్లాలో ఉన్న సబ్జైళ్లలో ఖైదీల సంఖ్యను పాత సంవత్సరాల ఆధారంగా తీసుకొని, నేర ప్రవృత్తి, సబ్జైళ్లకు పంపించే రిమాండ్ ఖైదీలు, ముద్దాయిలు, నిందితులు ఎంత మంది ఉంటారనే అంచనాల ఆధారంగా అవసరమైన విధంగా కొత్త జైలును నిర్మించడంతో పాటు, ఖైదీలు పారిపోకుండా ఉండే విధంగా పక్కాగా రక్షణ ఏర్పాట్లు చేస్తారు. జైళ్లశాఖ డీజీ పర్యవేక్షణలో పోలీసు హౌసింగ్ సొసైటీ ద్వారా ఇక్కడి జైలు నిర్మాణ పనులకు అధికారిక ఆమోదం అనంతరం పనులు చేపట్టనున్నారు. స్థల బదలాయింపు వ్యవహారం ఏడెనిదిమిది నెలల క్రితం పూర్తి కావాల్సి ఉంది. ఈలోపు ఎన్నికలు రావడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో స్థల బదలాయింపు ఆలస్యం అయ్యింది. గతంలోనే కొత్త జైలు నిర్మాణాలకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లడం, కొత్తగా ప్రస్తుతమున్న తాలూకా ఆఫీస్ ప్రాంగణం నుంచి విమానాశ్రయ భూములకు సబ్జైలును తరలించే విధంగా, కొత్త జైలు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. పాత సబ్జైలులో అసౌకర్యాలు ఉండటం, పల్లపు ప్రాంతంగా ఉండటంతో వానలు కురిసిన సమయంలో నీరు బ్యారక్లలోకి వెళ్లడంతో జైలులో కొత్తగా పనులు చేపట్టాలని అంచనాలు వేశారు. పనుల కోసం టెండర్లు పిలిచే సమయంలో ఈ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పారిపోవడంతో జైలులోని రక్షణ వ్యవహారంలో డొల్లతనం బహిర్గతమైంది.ఇద్దరు ఉద్యోగులపై వేటు కూడా పడింది. ఈ నేపథ్యంలో నూతన ప్రతిపాదన ఆధారంగా పట్టణానికి దూరంగా మూడెకరాల సువిశాల విస్తీర్ణంలో సబ్జైలు నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈలోపు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ప్రక్రియ ఆలస్యమైంది. భూ బదలాయింపు వ్యవహారం పూర్తి కావడంతో, ని ర్మాణ ప్రతిపాదనల కోసం పైలు జైళ్లశాఖ డీజీకి జిల్లా సబ్జైళ్ల శాఖ నుంచి వెళ్లనుంది. వెళ్లిన తర్వాత నిర్మాణ ప్రతిపాదనలు, బడ్జెట్ కేటా యింపు, ప్లానుల ఆమోదం అనంతరం టెండర్లు పనుల కోసం పిలువనున్నారు. జిల్లాజైలుగా నిర్మించే అవకాశం ఇక్కడ త్వరలో నిర్మించబోయే సబ్జైలును జిల్లాజైలుగా కూడా నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ వి«ధాన నిర్ణయాలలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటైతే గూడెంలోనే జిల్లా జైలు నిర్మించే అవకాశాలు ఉన్నాయి. దీంతో టెండర్లు పిలిచే సమయంలో ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునే వీలుంది. తణుకు సబ్జైలుకు ఖైదీలు తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఖైదీలను తణుకు సబ్జైలుకు పంపుతున్నారు. వాస్తవానికి 2017 సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ఖైదీలను తణుకు సబ్జైలుకు పంపిస్తున్నారు. 2017 సెప్టెంబర్ 10వ తేదీన గూడెం సబ్జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. ఖైదీలకు క్షురకర్మ చేయించడానికి బ్యారక్ల నుంచి బయటకు తీసిన సమయంలో కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని బేతవోలు గ్రామానికి చెందిన సిరపు గణేష్, అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని నందలపాడుకు చెందిన బుగత శివ గూడెం సబ్జైలు నుంచి పారిపోయారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ ఇద్దరు సిబ్బందిని అప్పట్లో సస్పెండ్ చేశారు. ఘటన తర్వాత సబ్జైలును పరిశీలించిన అధికారులు ఖైదీలను ఉంచడానికి తాడేపల్లిగూడెం సబ్జైలు సరికాదని గుర్తించారు. అదేనెల 14న తాడేపల్లిగూడెం సబ్జైలును మూసివేస్తూ, ఖైదీలను తణుకు సబ్జైలుకు తీసుకెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ రెండేళ్లుగా సబ్జైలు ఖైదీలను తణుకు తీసుకెళుతున్నారు. కొత్త జైలు నిర్మించే వరకు తణుకే తీసుకెళ్లాలి. -
ఆర్ట్స్లో ఫెయిల్ అయిన నన్నయ పీజీ క్యాంపస్
పట్టణంలోని నన్నయ పీజీ క్యాంపస్లో ఒకటొకటిగా ఆర్ట్స్ కోర్సులు ఎత్తేస్తున్నారు. 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, అప్పటి, ప్రస్తుత ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీ పీజీ క్యాంపస్గా దీనికి శంకుస్థాపన చేశారు. అనంతరం కాలంలో ప్రారంభమైన ఈ క్యాంపస్ నన్నయ వర్సిటీ పరిధిలోకి వచ్చింది. ఏయూ పీజీ క్యాంపస్గా వైఎస్ హయాంలో ఇక్కడ ప్రారంభమయ్యాక ఆర్ట్స్ విభాగంలో ఎంబీఏ, ఎంఏ ఇంగ్లిషు, ఎంఈడీ, ఎంకాం కోర్సులు ఉండేవి. అయితే విద్యార్థులు చేరడంలేదనే ఒకే ఒక్క కారణాన్ని ఫైళ్లలో రాసుకొని ఒకటొకటిగా కోర్సులను ఎత్తేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆర్ట్స్లో మిగిలిన ఒకే ఒక ఏంబీఏ కోర్సును ఎత్తేస్తుండడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, తాడేపల్లిగూడెం : క్యాంపస్ను దశలవారీ విస్తరించడానికి అప్పట్లో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక జీఓ ద్వారా క్యాంపస్కు వంద ఎకరాల స్థలం కేటాయించారు. క్యాంపస్ నిర్మాణానికి నిధులు విడుదల చేశారు. అయితే వైఎస్ అనంతరం మారిన ప్రభుత్వాల హయాంలో వైఎస్ కేటాయించిన భూమిని పూర్తిగా క్యాంపస్ వినియోగించలేకపోవడంతో, ఆ భూమిని తిరిగి రెవిన్యూ అ«ధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక అధికారులుగా వచ్చిన కొందరి వ్యక్తిగత ప్రవర్తనల కారణంగా క్యాంపస్ ప్రాధాన్యత మసకబారింది. చక్కని కోర్సులున్నా విద్యార్థులు చేరేవారు కాదు. కొత్త కోర్సులు తీసుకువస్తామని, ఉన్న కోర్సులలో మరింతమంది విద్యార్థులు చేరడానికి సౌకర్యాలు కల్పిస్తామని అప్పటి నన్నయ వర్సిటీ ఉప కులపతి ముర్రు ముత్యాలనాయుడు పలుమార్లు ఇక్కడ మీడియాకు చెప్పారు. ఆయన తర్వాత ప్రత్యేక అ«ధికారి పాలన, ఇన్చార్జి వీసీల నేతృత్వంలో ఇక్కడ ఆర్ట్స్ కోర్సులను ఎత్తేసే పరిస్థితి వచ్చినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉన్న ఒక్క ఎంబీఏ కోర్సును.. ప్రస్తుతం ఇక్కడి పీజీ క్యాంపస్లో ఎంబీఏ కోర్సు ఒకటే ఆర్ట్స్ విభాగంలో ఉంది. 2018–20 బ్యాచ్గా విద్యార్థులు ఉన్నారు. యూనివర్సిటీ నిబంధనావళి ప్రకారం ఈ బ్యాచ్లో విద్యార్థుల సంఖ్య ఉంది. కానీ ఈ కోర్సును ఎత్తేస్తున్నామని, ప్రస్తుత ఈ బ్యాచ్ విద్యార్థులు కాకినాడ కాని, రాజమండ్రి కాని వచ్చి చదువుకోవాలని వర్సిటీ బాధ్యులు మౌఖికంగా చెప్పి విద్యార్థులను ఇక్కడి నుంచి తరలించనున్నారు. తద్వారా ఈ కోర్సును ఎత్తేసిన జాబితాలో చేర్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఒక కోర్సును రద్దు చేసే పక్షంలో ఆరు నెలల ముందు ప్రకటన రూపంలో బహిరంగపర్చాలి. ఏదైనా కోర్సులో చదివే విద్యార్థుల సంఖ్య నలుగురి కంటే తక్కువ ఉంటే మాత్రమే కోర్సును రద్దు చేయాలి. ప్రస్తుతం ఈ క్యాంపస్లో ఉన్న ఎంబీఏలో అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఈ బ్యాచ్లో విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఎంబీఏ కోర్సుకు ప్రాధాన్యం పెరుగుతోంది. జిల్లాలో ఎంబీఏ కోర్సు కలిగిన ఏకైక ప్రభుత్వ క్యాంపస్ నన్నయ క్యాంపస్ మాత్రమే. గూడెం పట్టణంలో ఉన్న ప్రయివేటు కళాశాలల్లో మూడింటిలో ఎంబీఏ కోర్సు ఉంది. ఇన్టేక్గా రెండు కళాశాలల్లో 120 సీట్లు ఉన్నాయి. అవి భర్తీ అవుతున్నాయి. మరో ప్రయివేటు కళాశాలలో కూడా ఎంబీఏకు విద్యార్థులు బాగానే చేరుతున్నారు. ఎంబీఏ చదివే విద్యార్థులకు ప్రయివేటు విద్యాసంస్థలతో పోల్చుకుంటే క్యాంపస్ ఫీజు చాలా తక్కువ. ప్రయివేటు కళాశాలల్లో ఎంబీఏ ఫీజు 60 వేల రూపాయల వరకు ఉంటే, క్యాంపస్లో ఎంబీఏ పీజు కేవలం 16,300 రూపాయలు మాత్రమే. పైగా ఇక్కడ విద్యార్థులను ఇండస్ట్రీయల్ టూర్స్కు తీసుకెళతారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో అధికారులు ఇక్కడ ఎంబీఏ కోర్సు రద్దు చేసే యోచనపై విద్యార్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. -
మా జిల్లా ప్రజల్ని ఆదుకోండి: మాజీ మంత్రి
తాడేపల్లిగూడెం: గత తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసిన ఈ జిల్లా ప్రజలను ఆంధ్రప్రదేశ్ నూతన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పైడికొండల మాణికాల్య రావు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాణిక్యాల రావు మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పశ్చిమ యువత వలసబాట పడుతున్నారని, వారిని కొత్త ప్రభుత్వం ఆదుకుని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నవించారు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని ఆ దిశగా అడుగులు వేస్తూ బెల్ట్షాపుల రద్దుకు కృషి చేస్తోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ధన్యవాదాలు అని చెప్పారు. ఈ జిల్లాలో పూర్తికాని తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తాడేపల్లిగూడెంలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు అనుమతినిచ్చిన పాత, కొత్త ప్రభుత్వాలకు ధన్యవాదాలన్నారు. తాడేపల్లిగూడెంలో మెడికల్ కాలేజీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో బాటుగా విమానాశ్రయ భూముల్లో నివాస పట్టాలు పంపిణీ కొత్త ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. -
విజయవాడ బయల్దేరిన వైఎస్ జగన్
-
తాడేపల్లిగూడెంలో జోరుగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం
-
చంద్రబాబు ఏ జిల్లాకు న్యాయం చేయలేదు
-
మాణిక్యాలరావు దిక్ష భగ్నం
-
హమీలను తక్షణమే నెరవేర్చాలి..
-
ప్రారంభమైన మాణిక్యాల రావు నిరాహార దీక్ష
సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. తాడేపల్లి గూడెంలో ‘ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల సాధనకై పోరుబాట’ పేరుతో సోమవారం ఉదయం దీక్షను ప్రారంభించారు. తొలుత తెలుగుతల్లికి, బీజేపీ వ్యవస్థాపక నేతలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పైడికొండల మాట్లాడుతూ.. జిల్లాకు ఇచ్చిన 56 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత నెల 25ననే చంద్రబాబు నాయుడుకి రాజీనామా అల్టిమేటం పంపినట్లు తెలిపారు. నెల రోజులు దాటినప్పటికి ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో ఈ రోజు నుంచి దీక్ష ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మాణిక్యాలరావుతో పాటు బీజేపీ నేతలు నరిశె సోమేశ్వర్రావు, ఈతకోట తాతాజీ, వట్టి శైలజ, కర్రి ప్రభాకర్ బాలాజీ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. -
‘టీడీపీ తప్ప ఏపార్టీతోనైనా పొత్తు’
తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ జాతీయ నేత, ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ వి. డియోదర్ మండిపడ్డారు. ఆయన చందాలు వసూలు చేసే చందా బాబు అంటూ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సునీల్ విలేకరులతో మాట్లాడుతూ.. బాహుబలి సినిమాలో కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టుగా చంద్రబాబు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఊసరవెల్లి లాగా రంగులు మార్చడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. జనవరి 6వ తేదీన ఆంధ్రాలో నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామన్నారు. టీడీపీ తప్ప ఏ పార్టీ అయినా మా దగ్గరకు వస్తే పొత్తు పెట్టుకునేందుకు పరిశీలిస్తామన్నారు. మేమైతే ఎవరి దగ్గరకు వెళ్లి పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓ గజదొంగ అని, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. చందా బాబుకు డబ్బే కావాలి ఇంకేం అవసరం లేదని వ్యంగ్యంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తన ప్రభుత్వ పథకాలుగా పేరు మార్చుకుంటూ తానే అంతా అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిలో, విశాఖపట్నం పోర్టు రైతుల నుంచి పొలాలు లాక్కుని వారిని మోసం చేశారని ఆరోపించారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ పెద్ద డ్రామా పార్టీ అని, రాబోయే రోజుల్లో ప్రజలు భూస్థాపితం చేస్తారని దుయ్యబట్టారు. బీజేపీ లేకుండా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేదని వ్యాఖ్యానించారు. అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని వెంటనే నిర్మించాలని పార్లమెంటులో చట్టం తీసుకురావాలని దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. -
తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తత
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం, బీజేపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం, ఘర్షణ చోటుచేసుకుంది. జగన్నాధపురం గ్రామంలో అక్రమంగా మట్టి రవాణాకు పాల్పడుతోన్న 30 లారీలను స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు అడ్డుకున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే పైడికొండల, అధికారులకు సమాచారమిచ్చినా స్పందించకపోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. పైడికొండలకు మద్దతుగా ఆందోళనలో వైఎస్సార్సీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆందోళనకు వ్యతిరేకంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. గ్రామంలోని అన్ని మార్గాలను తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు దిగ్బంధనం చేశారు. ఇరువర్గాల ఆందోళనలతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు మాట్లాడుతూ..మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతోన్న వారిని అరెస్ట్ చేసి వారి వాహనాలను అధికారులు తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే తెలుగుదేశం నేతలు రోడ్లు దిగ్బంధించడం సిగ్గుచేటన్నారు. రోడ్లు దిగ్బంధనం చేసిన వారిని వదిలి నా వద్దకు వచ్చి జులూం చూపితే ఖబడ్దార్ అంటూ పోలీసులకు మాణిక్యాల రావు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. మీకు(పోలీసులకు) చేతకాకపోతే చెప్పండి.. మీరు పది నిమిషాలు వెళ్లిపోండి..తానేంటో చూపిస్తానని సవాల్ విసిరారు. -
సోనియా ఇటలీ దెయ్యం.. రాహుల్ ముద్దపప్పు
తాడేపల్లిగూడెం: కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఇటలీ దెయ్యం, రాహుల్ గాంధీని ముద్ధపప్పు అని గత ఎన్నికల సమయంలో తిట్టి, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అవసరం లేదన్న వ్యక్తి చంద్రబాబు అని, మళ్లీ దేశ శ్రేయస్సు కోసం కాంగ్రెస్తో కలుస్తున్నాని చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కొట్టు సత్యనారాయణ వ్యాక్యానించారు. ఈ రోజు తన రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు వెళ్లారని విమర్శించారు. తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత జూన్లో గుంటూరులో జరిగిన రాహుల్ గాంధీ సభకు వెళ్లిన వాళ్లని రాష్ట్ర ద్రోహులు, దేశ ద్రోహులు అన్న చంద్రబాబు, ఏ మొహంతో రాహుల్ గాంధీని కలిశారని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన లాంటి రాజకీయ చీడపురుగు భారతదేశ చరిత్రలో ఎవరూ ఉండరని నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ వ్యభిచారం చేస్తోన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల మనమంతా కూడా తలదించుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ రాజకీయ చీడను త్వరగా తొలగించి ఏపీని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. తన కుట్రలన్నీ బయటపడిపోతున్నాయని, దాచుకున్న లక్షల కోట్ల రూపాయలు ఏమైపోతాయో అని, ఐటీ దాడులకు భయపడి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
168వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
168వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, తాడేపల్లిగూడెం: 168వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం తాడేపల్లిగూడెం మార్కెట్ నుంచి ఆయన పాదయాత్ర చేపట్టారు. అనంతరం పెంటపాడు, బోడపాడు క్రాస్ మీదుగా ముదునూరు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 2.45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి కాశిపాడు క్రాస్, చిలకం పాడు, వీరేశ్వరపురం క్రాస్ మీదుగా పిప్పర వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. -
అమ్మవార్లకు వైభవంగా గ్రామోత్సవం
తాడేపల్లిగూడెం రూరల్ : గ్రామదేవతలు శనివారం సాయంత్రం ఆలయాలకు చేరుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజులుగా అమ్మవారి ప్రతిరూపమైన గరగలను మాధవరం, అప్పారావుపేట, జగన్నాథపురం, దండగర్ర, ఎల్.అగ్రహారం గ్రామాల్లో ఊరేగించారు. శనివారం అమావాస్య కావడంతో అమ్మవార్లు ఆలయాలకు చేరుకున్నారు. ఉగాది పర్వదినమైన ఆదివారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయాల వద్ద ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. శనివారం స్థానిక 6, 11 వార్డుల మధ్య వేంచేసియున్న దానేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. 4వ వార్డు జీఎస్ఆర్ హైస్కూలు సమీపంలోని పుంతలో ముసలమ్మవారి ఊరేగింపు శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో అమ్మవారిని ఆదివారం ఊరేగించనున్నారు. కనకవయ్యారమ్మ, వీర -
ఉద్యోగాల పేరుతో టోకరా
తాడేపల్లిగూడెం రూరల్ : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వలవేసి రూ.49 లక్షలు వసూలు చేసిన ఘటనలో ఒక వ్యక్తిని అ రెస్టు చేసినట్టు తాడేపల్లిగూడెం రూరల్ సీఐ ఎన్.రాజశేఖర్ తెలి పారు. సోమవారం స్థానిక రూ రల్ పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఉంగుటూరుకి చెందిన దిర్శిపోము శ్యాంబాబు, విశాఖకి చెం దిన ఎం.రమణమూర్తి, కస్తూరిబాయ్ కలిసి ఎఫ్సీఐలో డైరెక్టర్లుగా పేర్కొం టూ ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పిస్తామంటూ రాష్ట్ర నలుమూలల్లో పలు వురి నుంచి రూ.49 లక్షలు వసూలు చేశారు. తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు, పెరవలి, విశాఖ, గణపవరం, అత్తిలి, ప్రత్తిపాడు, తెనాలి, హైదరా బాద్ ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారు. ఎంతకీ ఉద్యోగం రాకపోగా సొమ్ములు సైతం ఇవ్వకపోవడంతో పెంటపాడుకు చెందిన అమలాపురపు సూరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పెంటపాడు ఎస్సై సుబ్రహ్మణ్యం దర్యాప్తు చేపట్టారు. ఈనేపథ్యంలో నిందితుల్లో ఒకరు దిర్శిపోము శ్యాం బాబు స్వగ్రామం ఉంగుటూరులో ఉన్నట్టు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు సీఐ ఎన్.రాజశేఖర్ చెప్పారు. వా రి ఆచూకీ కోసం విశాఖకి బృందాన్ని పంపామన్నారు. శ్యాంబాబును కోర్టులో హాజరుపరిచామన్నారు. ఎస్సై వి.సుబ్రహ్మణ్యం, సిబ్బంది పాల్గొన్నారు. -
శరీరదానం.. కళాకారుడి ఔన్నత్యం
తాడేపల్లిగూడెం : ఆయన వృత్తిరీత్యా ఆర్టీసీ ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. ప్రవృత్తి కళారంగం. నాటకాలు, సందేశాత్మక నాటికలంటే ఇష్టం. ప్రాచీన కళారూపాలు, సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణకు కళాకారులు కారకులని నమ్ముతారు. సామాజిక రుగ్మతలను కళారూపాల ద్వారా పారద్రోలవచ్చని విశ్వసిస్తారు తాడేపల్లిగూడేనికి చెందిన ధవళసత్యం కళామిత్రమండలి కార్యదర్శి కాళ్ల నారాయణరావు. ఆయన శరీరదానం చేసి ఆదర్శంగా నిలిచారు. తన శరీరంలోని అవయవాలు పదిమంది ప్రాణం నిలపడానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. మరణానంతరం తన శరీరాన్ని పీఎంఆర్ ట్రస్టు ద్వారా ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రికి అప్పగించాలని కోరుతూ నోటరీ చేసిన అంగీకారపత్రాన్ని మంగళవారం మంత్రి మాణిక్యాలరావుకు ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. భార్య, ముగ్గురు కుమారులతో అంగీకార సంతకాలు, పాత్రికేయులు దూసనపూడి సోమసుందర్, చిట్యాల రాంబాబును సాక్షులుగా ఉంచారు. నారాయణరావు నిర్ణయాన్ని మంత్రి మాణిక్యాలరావు అభినందించారు. కవి నర్తించును ప్రజల నాలుకల యందు అన్న చందంగా కళాకారుడు నారాయణరావు శరీరదానంతో ప్రాణదానం చేయాలనుకోవడం అభినందనీయమని పలువురు కొనియాడారు. -
నిట్కు నూతన బ్యాచ్
నేడు ఓరియంటేషన్ నాలుగు కొత్త లోగోలు తయారీ ఈ ఏడాది 480కు 438 సీట్లు భర్తీ మొత్తం విద్యార్థులు 1,224 తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలోని ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ నిట్)లో కొత్తబ్యాచ్ బుధవారం రానుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు రానున్నారు. ఏపీ నిట్ ఇక్కడ ఏర్పాటుచేసిన తర్వాత అధిక శాతంలో విద్యార్థులు ఈ ఏడాది చేరారు. మొత్తం సీట్లు 480కు 438 సీట్లు భర్తీకాగా 42 మిగిలాయి. హోం స్టేట్ కోటా కింద 240 సీట్లు, ఇతర కోటా కింద 240 సీట్లు నిట్లో ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు సీటు పొందే విషయంలో ప్రాధాన్యతను ఏపీ నిట్కు ఇచ్చారు. నిట్ ఏర్పాటుచేసిన మొదటి రెండేళ్లలో 960 (480+480) సీట్లకు 786 మంది విద్యార్థులు చేరారు. అయితే ఈఏడాది 480 సీట్లకు అత్యధికంగా భర్తీ అయ్యాయి. ఈసారి సీట్ల భర్తీకి సీశాబ్ పేరిట ప్రత్యేక రౌండ్ కేటాయించడంతో నిట్లో చేరాలనుకున్న విద్యార్థుల ఆశలు నెరవేరాయి. దీంతో మరికొందరు ఇక్కడ చేరడానికి మార్గం సుగమమయ్యింది. మొత్తంగా కొత్త బ్యాచ్తో కలుపుకుని నిట్లో విద్యార్థుల సంఖ్య 1,224 (786+438)కు చేరింది. బాలికలకు వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో, బాలురకు పెదతాడేపల్లి, నల్లజర్ల, వాసవీ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న డీఎడ్ కళాశాలలో వసతి ఏర్పాటుచేశారు. కొత్త విద్యార్థుల కోసం వారం రోజుల్లో పూర్తి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. బుధవారం ఓరియంటేషన్ కార్యక్రమంలో ముఖ్య అతి«థిగా మెంటర్ డైరెక్టర్ జీఆర్పీ రెడ్డి పాల్గొంటారు. నిట్లో కోర్సులు, వాటి ప్రాధాన్యతలను వివరించనున్నారు. ఏర్పాట్లు పూర్తి బాలారిష్టాలను అధిగమిస్తూ ఏపీ నిట్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వసతిలోనే పరిశోధనశాలల, వసతి, తరగతి గదులు అవసరాలను తీర్చుకుంటోంది. కేంద్ర మానవవనరుల శాఖ ఏపీ నిట్ శాశ్వత భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తూ అంగీకారం తెలిపింది. ఈ నిధుల ద్వారా వచ్చే విద్యాసంవత్సరానికి వసతి, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. నిట్కు ఇంతవరకు ఎలాంటి లోగో లేదు. నిట్ను అధికారికంగా గుర్తిస్తూ ఇటీవల గెజిట్ విడుదలైంది. దీంతో పాటు నిట్కు నాలుగు రకాల లోగోలను ఏపీ నిట్ అధికారులు రూపొందించారు. గోదావరి జిల్లాల ప్రాశస్త్యం, పచ్చని పొలాలు, గోదావరి వంతెన, పూర్ణకలశం వంటివి లోగోలో వచ్చేలా నాలుగు రకాల లోగోలను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి , దేవాదాయశాఖ మంత్రికి, జిల్లా కలెక్టర్కు పంపించారు. వీటిలో ఏదో ఒకదానికి అధికారిక ముద్ర పడాల్సి ఉంది. నిట్లో డే స్కాలర్ పద్ధతిని ప్రవేశపెట్టడానికి గతంలో అధికారులు ప్రతిపాదించారు. అయితే విద్యార్థులకు ఆటపాటలతో వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే విద్య అందించాలన్నది నిట్ ఉద్దేశం కావడంతో ఈ ప్రతిపాదనను విరమించుకుని రెసిడెన్షియల్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. కొత్త విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నిట్ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఎస్.శ్రీనివాసు తెలిపారు. -
గోడ కూలి ఇద్దరి మృతి
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలిపడి ఇద్దరు మృతిచెందారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాత ఇంటిని ఐదుగురు వ్యక్తులు కలసి కూల్చుతున్నారు. అయితే, గోడ అకస్మాత్తుగా కూలిపడటంతో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులను గ్రామానికి చెందిన కండెల్లి రాముడు(55), గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(45)గా గుర్తించారు. వారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
ఉద్యోగుల ఉద్యమబాట
–ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగుల ధర్నా –నేడు కలెక్టరేట్ ఎదుట నిరసన తాడేపల్లిగూడెం: హెచ్ఐవీ, ఎయిడ్స్, క్షయ బాధితులకు ఎనలేని సేవలందిస్తున్న ఉద్యోగుల జీవితాల్లో మాత్రం వెలుగు కనిపించడం లేదు. శ్రమకు తగిన ఫలితం ఉండటం లేదు. చాలీచాలని వేతనాలు, హామీలకే పరిమితమైన ఇంక్రిమెంట్లు, మూడేళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నా కనికరం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీ సాక్). దిక్కుతోచని స్థితిలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఏఆర్టీ సెంటర్, వలంటరీ కౌన్సెలింగ్ టెస్టింగ్ సెంటర్లలో పనిచేస్తున్న 1,250 మంది ఉద్యోగులు సోమవారం కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాకు సన్నద్ధమయ్యారు. జిల్లాలోని నాలుగు ఏఆర్టీ సెంటర్లలో పనిచేస్తున్న 100 మంది ఉద్యోగులు ధర్నాకు దిగుతున్నారు. జిల్లాలో నాలుగు సెంటర్లు.. 100 మంది ఉద్యోగులు జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, ఏలూరులోని ఏఆర్టీ సెంటర్లలో మెడికల్ ఆఫీసర్లుగా, డాటా మేనేజర్లుగా, స్టాఫ్నర్సులుగా, ల్యాబ్టెక్నీషియన్లుగా, ఫార్మాసిస్టులుగా, కేర్ కో ఆర్డినేటర్లుగా 100 మంది పనిచేస్తున్నారు. వీరిని ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగులుగా నియమించింది. అర్హత, అనుభవం, కేడర్ను బట్టి నెలకు రూ.6 వేల నుంచి రూ.46 వేల వరకు వేతనం అందిస్తున్నారు. వేతన ఒప్పందం ప్రకారం ఏటా రూ.1,250 పెంచాలి. అయితే 2013 నుంచి వేతన పెంపుదలతో ఏపీ సాక్ తాత్సారం చేస్తోంది. చివరకు 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాత బకాయిలు మినహా, ఈ ఏడాదికి 2.5 శాతం అంటే రూ.750 వేతనం పెంచుతానని అధికారులు ప్రకటించారు. దీంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. డిమాండ్లు ఇవి –ఏఆర్టీ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి. –ఐదేళ్లు తర్వాత ఇచ్చిన వార్షిక ఇంక్రిమెంటును 20 శాతంగా, రూ.2,500 నుంచి రూ.3,000 రూపాయలు ఇవ్వాలి. –నాకో జారీచేసిన ఆర్డర్ ప్రకారం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతన స్థిరీకరణ చేయాలి. –ఏడో పీఆర్సీ ప్రకారం ఉద్యోగులందరికీ వర్తింపచేయాలి. –వేతన నిర్ణయంలో విద్యార్హతలు, సీనియారిటీ పరిగణనలోకి తీసుకోవాలి. –ఎయిడ్స్ కంట్రోల్ను మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో విలీనం చేయాలి. –ఉద్యోగులకు ఆరోగ్య పాలసీ అమలుచేయాలి. –ఆరోగ్య బీమా, గ్రూప్ ఇన్సూ్యరెన్సు అమలుచేయాలి. –సమాన పనికి సమాన వేతనం అందించాలి. –హెచ్ఆర్ పాలసీ అమలుచేయాలి. మూడేళ్లుగా పరిష్కారం లేదు ఏపీ సాక్లో పనిచేసే ఉద్యోగులకు మూడేళ్లుగా ఇస్తానన్న ఇంక్రిమెంట్లు ఇవ్వడంలేదు. ఏఆర్టీ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులు క్షయ వంటి వ్యాధులు సోకి మరణిస్తున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడంలేదు. దీంతో జాతీయ యూనియన్ పిలుపుమేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నాం. రాష్ట్రంలోని ఏఆర్టీ కేంద్రాల్లో పనిచేసే 1,250 మంది ధర్నాలో పాల్గొననున్నారు. –సీహెచ్ సత్యనారాయణ, తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రి ఏఆర్టీ సెంటర్ -
18న తాడేపల్లిగూడెంలో వీఆర్వోల సమావేశం
పెనుమంట్ర : ఈనెల 18న వీఆర్వోల జిల్లా సమావేశం తాడేపల్లిగూడెంలో జరుగుతుందని సంఘ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు బీహెచ్ రవీంద్రరాజు చెప్పారు. పెనుమంట్రలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తాడేపల్లిగూడెం రైల్వేస్టేçÙన్ ఎదురుగా ఉన్న ధన రెసిడెన్సీలో ఆదివారం మధ్యాహ్నం ఈ సమావేశం జరుగుతుందన్నారు. సమావేశానికి రాష్ట్ర వీఆర్వోల సంఘ అధ్యక్షుడు బొత్స వత్సలనాయుడు, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొంటారన్నారు -
నిట్లో 83 సీట్లు ఖాళీ
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్లో చేరేందుకు చివరిరోజుగా అవకాశం కల్పించిన బుధవారం ఒకే ఒక్క విద్యార్థి రిపోర్టు చేశారు. చివరి అవకాశం ముగిశాక ఏపీ నిట్లో 83 సీట్లు ఖాళీగా మిగిలాయి. నిట్లో 480 సీట్లు ఉండగా, హోమ్ స్టేట్ కోటా కింద 240, ఇతర స్టేట్ల కోటా కింద 240 సీట్లు భర్తీ చేస్తారు. నిట్లో చేరేందుకు విజయవాడ రిపోర్టింగ్ సెంటర్లో 420 మంది విద్యార్థులు ఇనీషియల్ డిపాజిట్ చేశారు. వారిలో చివరిరోజు బుధవారం నాటికి 397 మంది విద్యార్థులు ఏపీ నిట్లో రిపోర్ట్ చేశారు. చివరి అవకాశం కూడా అయిపోవడంతో ఇక ఈ సీట్లను భర్తీ చేసే అవకాశం లేదు. వాస్తవానికి మంగళవారం చివరి అవకాశం కాగా ఒక రోజు పెంచారు. దీనిని ఒక్క విద్యార్థి మాత్రమే వినియోగించుకున్నారని ఏపీ నిట్ రెసిడెంట్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ టి.రమేష్ తెలిపారు. నెలాఖరుకు తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నా వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో బాలికల వసతి గృహ నిర్మాణ పనులు వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తికాకపోవడంతో వచ్చేనెల 19 నుంచి తరగతులు నిర్వహించనున్నారు. మాస్టర్ ప్లాన్కు తుదిరూపు నిట్ శాశ్వత భవనాల నిర్మాణాలకు సంబంధించి మాస్టర్ ప్లాను, డీపీఆర్ నాలుగు కీలక సమావేశాల అనంతరం తుది రూపు తీసుకువచ్చారు. గత శనివారం దీనిపై సమావేశం జరిగాక ఢిల్లీలోని ఎడ్యూసెల్, ఏపీ నిట్, వరంగల్ నిట్, పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంట్ అధికారులు కలిసి మాస్టర్ప్లాను, డీపీఆర్ సిద్ధం చేశారు. ప్లాను, వివరాలను కేంద్ర మానవవనరుల అభివద్ధి మంత్రిత్వశాఖకు పంపించేందుకు నిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సదరు మంత్రిత్వశాఖ మాస్టర్ ప్లాను ఆమోదించి, అక్కడి నుంచి క్యాబినెట్ సబ్ కమిటీకి పంపించాలి. క్యాబినెట్ సబ్ కమిటీ అధికారికంగా ఆమోదం తెలిపిన తర్వాత నిర్మాణాలకు సంబంధించి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇదంతా జరగడానికి పది రోజులకుపైనే సమయం పట్టవచ్చు. 2030 వరకు నిట్లో ఎంతమంది ఫ్యాకల్టీలు అవసరమవుతారని, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు ఎంత మంది అనే విషయాలతో పాటు అప్పటికీ రూ.1,000 నుంచి రూ.1,500 కోట్లు అవకాశం కాగలరనే అంచనాలు డీపీఆర్లో పొందుపరిచినట్టు సమాచారం. -
నిట్కు వెళ్లే దారేది
► ప్రధాన రహదారి కోసం అన్వేషణ ► రహదారి ఏర్పాటుకు ఆక్రమణల అడ్డంకి ► హైవే బైపాస్ నుంచీ దారి కరువు తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) శాశ్వత భవనాల నిర్మాణాలకుగాను మాస్టర్ ప్లాన్ సిద్ధమయ్యింది. ఏ భవనం ఎక్కడ ఎంత విస్తీర్ణంలో నిర్మించాలి. ఎలా నిర్మించాలి అనే విషయాలకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సిద్ధమవుతోంది. అన్నీ కుదిరితే మరో రెండు నెలల తర్వాత నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కానీ ఇప్పుడు నిట్కు ఎలా వెళ్లాలి అనేది పరిష్కారం దొరకని సమస్యగా మారింది. నిట్ ఎక్కడ ఉన్నా జాతీయ రహదారికి ఆనుకుని గాని, 80 నుంచి 100 అడుగుల రోడ్డు పక్కన గాని భవనాల నిర్మాణం చేపడతారు. తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల్లో నిట్ కోసం కేటాయించిన భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం పూర్తిచేశారు. అప్పారావుపేట రోడ్డులో జాతీయ రహదారి బైపాస్కు అభిముఖంగా వాస్తు రీత్యా ప్రధాన గేటును కూడా ఏర్పాటుచేస్తున్నారు. దీనికి గా ను ఇప్పటికే బాలికోన్నత పాఠశాల సమీపంలో పట్టణానికి దగ్గరగా గణేష్నగర్కు సమీపంలో ఉన్న నిట్ ప్రహరీ గోడను అధికారులు మూసివేశారు. ప్రధాన రహదారి సమస్య నిట్కు చేరుకోవాలంటే పట్టణం నుంచి అప్పారావుపేట రోడ్డు ఒక్కటే శరణ్యం. ఈ రోడ్డు ప్రస్తుతం 20 అడుగులకు మించి లేదు. ఈ రోడ్డు నుంచి పట్టణంలోకి రావాలంటే ఆర్టీసీ డిపో గోడ పక్కగా గణేష్ నగర్కు వచ్చే రహదారి మాత్రమే అందుబాటులో ఉంది. ఎఫ్ఎంబీ ప్రకారం ఇది రికార్డుల్లో 80 అడుగులు ఉంది. గతంలో ఇక్కడ విమానాశ్రయం ప్రతిపాదన ఉన్న సమయంలో ఈ రహదారిని ప్రధాన రహదారిగా గుర్తించి సర్వే చేశారు. ఆక్రమణల వివరాలను రెవెన్యూ అధికారులు నమోదుచేశారు. ఎయిర్పోర్టు ప్రతిపాదన ఆగడంతో ఈ దారి గురించి విస్మరించారు. తాజాగా నిట్ కో సం ఇదే ర హదారిని పరిగణనలోకి తీసుకున్నా రు. 80 అడుగుల మేర ఉండాల్సిన ఈ మార్గం లో ఆర్టీసీ గేటుకు రెండో పక్కన దారిని ఆక్రమించి కొన్ని పూరి గుడిసెలు, మరికొన్ని బహు ళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. గతంలో ఈ ఆక్రమణల వ్యవహారంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు అభ్యంతరాల కారణంగా తొలగింపు ప్రక్రియ ముందుకు సాగలేదు. తిరిగి నిట్ రహదారి కోసం ఈ రహదారిని ఎంచుకోడానికి గాను ఆక్రమణదారుల వివరాలను అధికారులు సేకరించారు. హైవే బైపాస్ నుంచి.. తాడేపల్లిగూడెం మీదుగా జాతీయ రహదారి బైపాస్ వెళ్లినా పట్టణంలో ఎక్కడా కూడా దీనికి అప్రోచ్ రోడ్ గాని, సర్వీస్ రోడ్డు గాని లేవు. మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ కేంద్ర మంత్రి బోళ్ల బులిరామయ్య నిర్వాకంతోనే ఇలా జరిగిందనే విమర్శలూ ఉన్నాయి. ఆయన తణుకు మీద ప్రేమతో తాడేపల్లిగూడెం వాసులకు కష్టాలు తెచ్చిపెట్టారనే వాదన ఉంది. దీంతో తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి బైపాస్కు అప్రోచ్, సర్వీస్ రోడ్లు లేవు. దీంతో నిట్కు సమీపంలో ఉన్న జాతీయ రహదారి బైపాస్ నుంచి నిట్కు చేరుకోవడానికి ఉన్న తాత్కాలిక అనధికారిక రహదారే శరణ్యంగా మారింది. రికార్డుల్లో అప్రోచ్ రోడ్డుగా కాని, సర్వీస్ రోడ్డుగా కాని ఈ మార్గాన్ని ఎవరు అభివద్ధి చేస్తారనే ప్రశ్న ఉంది. మొత్తంగా చూసుకుంటే నిట్కు దారేది అనే సమస్య మళ్లీ మొదటికొచ్చింది. -
స్వగ్రామానికి నాగమణి మృతదేహం
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్లైన్ : కువైట్లో మృతిచెందిన యాళ్ల నాగమణి మృతదేహం కైండ్నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావు కృషితో శుక్రవారం రాత్రి ఆమె స్వగ్రామం వీరవాసరం మండలం మెంటేపూడికి చేరింది. ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్లోని ఇంటర్నేషల్ ఎయిర్పోర్టుకు చేరిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. జీవనోపాధి కోసం నాగమణి రెండున్నర సంవత్సరాల క్రితం కువైట్ వెళ్లింది. అనారోగ్య కారణంగా ఈనెల 4వ తేదీన అక్కడ మృతి చెందింది. ఆమె భర్త వెంకటేశ్వరరావు తన భార్య మృతదేహాన్ని ఇండియాకు రప్పించాల్సిందిగా కైండ్నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావుకు విన్నవించుకున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు సహకారంతో ఆయన ఇరు దేశాల్లోని రాయబార కార్యాలయాలను సంప్రదించారు. నాగమణి మృతదేహాన్ని ఇండియాకు రప్పించారు. హైదరాబాద్లోని మైగ్రెంట్రైట్స్ కౌన్సిల్ సహకారంతో ప్రభుత్వం ద్వారా ఉచితంగా అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. రాత్రి తాడేపల్లిగూడెంలో అంబులెన్స్ను నిలుపుదల చేసి గట్టిం మాణిక్యాలరావు, నార్ని బావాజీలు మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మాణిక్యాలరావు, పెంటపాటి పుల్లారావులకు మృతురాలి భర్త వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ సభ్యులు తిరుమళ్ల పాండురంగారావు, ధర్మవరపు శ్రీనివాస్, మేడవరపు రామలింగేశ్వరరావు, బత్తుల ప్రసాద్ పాల్గొన్నారు. -
తండ్రికిచ్చిన మాట కోసం.. సినీ పరిశ్రమకు దూరం
తాడేపల్లిగూడెం: ప్రముఖ సినీ హాస్యనటుడు పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య ఏకైక వారసుడు సత్యనారాయణ బాబు (75) కన్నుమూశారు. వారం రోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం ఆయన భౌతిక కాయానికి హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య కుసుమకుమారి, నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్యనారాయణబాబు మృతితో తాడేపల్లిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నటన కలగానే మిగిలింది. బాల్యం నుంచి సత్యనారాయణ బాబుకు నటనంటే అమితాసక్తి. మద్రాసులో ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్కందాతో కలసి సత్యనారాయణ బాబు సినిమాలో నటించారు. నాటకాలలో ప్రవేశమున్న బాబు మూడుసార్లు ఉత్తమ నటునిగా అవార్డు అందుకున్నారు. నగేశ్ లాంటి మంచి కమెడియన్ కావాలనేది ఆయన కోరిక. బాలానందం అనే సినిమాలో హీరో, విలన్గా బాబు నటించారు. చట్టాలు మారాలి అనే తెలుగు సినిమాను తమిళంలోకి డబ్బింగ్ చేసి నిర్మాతగా కూడా అవతారమెత్తారు. అనంతరం సినీ రంగాన్ని వీడిన 75 ఏళ్ల వయసులోను తనలో ఉన్న నటనా ఆసక్తిని వదులుకోలేక, తన చిన్న కుమారుడు హేమంత్కు నటనలో శిక్షణ ఇప్పించారు. హేమంత్ను నటునిగా చూడాలని, గూడెంలో ఉన్న రేలంగి చిత్రమందిర్ను మల్లీఫ్లెక్సుగా తీర్చిదిద్దాలని ఆయన కన్న కలలు నెరవేరకుండానే దివికేగారు. బాబు పెద్దఅల్లుడు మెదక్ జిల్లా సదాశివపేట చైర్మన్గా పనిచేశారు. కొడుకులు ఇద్దరు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు. తండ్రి మాట కోసం.. నవ్వుల రేడు రేలంగి తనయుడు కావడంతో ఆ రోజుల్లోనే సత్యనారాయణ బాబుకు నాయకునిగా, ప్రతినాయకునిగా, హాస్యనటునిగా అనేక అవకాశాలు వచ్చాయి. అయితే కొన్ని సినిమాల్లో నటించినా ఆ తర్వాత తండ్రికి ఇచ్చిన మాట కోసం సినీ పరిశ్రమకు దూరంగా ఉండిపోయారు. తండ్రి జీవితంలో నేర్చుకున్న పాఠాలసారం నుంచి గ్రహించిన అనుభవంతో చెప్పిన మాటలను తు.చ. తప్పకుండా పాటించి, రేలంగి మెచ్చిన రాముడిలా బాబు జీవితకాలం మెలిగారు. చెన్నపట్నాన్ని వదిలి తాడేపల్లిగూడెంలో ఉంటూ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లారు. గూడెంలో తండ్రి నిర్మించిన రేలంగి చిత్రమందిర్ బాధ్యతలను చూసుకుంటూ సత్యనారాయణ బాబు ఇక్కడే ఉండిపోయారు. అనంతరం ఆయన కుటుంబం మొత్తం హైదరాబాద్లో స్థిరపడ్డా, ఎక్కువ కాలం గూడెంలో థియేటర్ వెనుక ఉన్న గెస్ట్హౌస్లోనే ఉండేవారు. తన కుటుంబానికి గుర్తింపునిచ్చిన గూడెంలో ఉండటానికే మక్కువ చూపేవారు. -
తాడేపల్లిగూడెంలో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం
పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో గత రాత్రి భారీ వర్షం కురిసింది. దాంతో పట్టణంలోని పలు వార్డులు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. అలాగే తాడేపల్లి గూడెం గ్రామీణ మండలంలోని పెద్ద తాడేపల్లిలోని చెరువుకు గండి పడింది. దీంతో ఇళ్లలోకి చేరువు నీరు వచ్చి చేరింది. అధికారులు వెంటనే అప్రమత్తమై వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే గూడెం శివారు ప్రాంతంలోని ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ కాలువ సమీపంలోని గ్రామాలు బంగారుగూడెం, వీరంపాలెం, పశ్చిమపాలెం, జగన్నాధపురం, నందమూరు, మారెంపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలతో పాలకొల్లులోని ఫైర్ స్టేషన్, పశువుల ఆస్పత్రి, హౌసింగ్ బోర్డ్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులతో పాలకొల్లు - భీమవరం రహదారిలోని లంకలకోడేరు వద్ద భారీ చింతచెట్టు కుప్పకూలింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. -
సాక్షి చైతన్యపథం - తాడేపల్లి గూడెం