నాతవరం : నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి పటాన్ సియాజ్ఖాన్ సుడిగాలి పర్యటన చేశారు. మండలంలో తాండవ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, చమ్మచింత బాలుర వసతి గృహం, రామన్నపాలెంలో గిరిజన ఆశ్రమ పాఠఽశాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాతవరం ఎస్సీ బాలుర బాలికలు, బీసీ బాలుర వసతి గృహాలను తనిఖీ చేశారు. తాండవ ఆశ్రమ బాలికల హాస్టల్లో విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల బోధనపై ఆరా తీశారు. కొందరు విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగారు. తాండవ రామన్నపాలెం గిరిజన హాస్టల్ సముదాయాలను స్వయంగా పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెడుతున్నారా లేదా , ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే కాస్మటిక్ సామాగ్రి తదితర వస్తువులు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జడ్జి పటాన్ సియాజ్ఖాన్ మాట్లాడుతూ హైకోర్టు నుంచి వచ్చిన అదేశాల ప్రకారం హాస్టళ్లలో తనిఖీలు జరిపామన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అంశాలతో పాటు విద్యార్థులు చెప్పిన సమస్యలను నివేదిక ద్వారా పంపించడం జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment