నిజాంపట్నం: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మండలంలోని దిండి పంచాయతీలో బుధవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగనన్న పాలనా సంస్కరణలతో గ్రామీణ ప్రాంతాలను సైతం పట్టణాలకు ధీటుగా రూపురేఖలు మారుతున్నాయన్నారు. రైతుల సేవకై రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు, సచివాలయాలతో ప్రభుత్వ పౌర సేవలు, వైద్యసేవలు అందించేందుకు అర్బన్ హెల్త్సెంటర్ల అభివృద్ధితో పాటు నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధితో ప్రజల మనస్సులను గెలిచిన ముఖ్యమంత్రిగా జగనన్న పేరొందారన్నారు. నవరత్న పథకాలతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించారని గుర్తు చేశారు. ఏ గ్రామానికి వెళ్లినా, ఏ ఇంటకెళ్లినా ప్రజ లు తాము పొందిన సంక్షేమ పథకాల వివరాలు తెలియజేసి ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికలలో బాపట్ల పార్లమెంటరీ అభ్యర్థి నందిగం సురేష్, రేపల్లె అసెంబ్లీ అభ్యర్థి అయిన తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీపీ మోపిదేవి హరనాథ్, డీసీఎంఎస్ చైర్మన్ యార్లగడ్డ భాగ్యలక్ష్మి మదన్, సర్పంచ్ యేమినేని రాంబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్థి
డాక్టర్ గణేష్