ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న దసరా ఉత్సవాలలో ఏడో రోజు దుర్గమ్మ శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని సరస్వతీదేవిగా దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 00.50 అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం దర్శనం ప్రారంభమైంది. అమ్మవారిని సరస్వతీదేవిగా సీఎం చంద్రబాబునాయుడు దంపతులు దర్శించుకుని పట్టువస్త్రాలను సమర్పించారు. డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రులు నారా లోకేష్ దంపతులు, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, దేవదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ సృజన, సీపీ రాజశేఖర్బాబు, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఈవో కేఎస్ రామరావు దంపతులతో పాటు దేవదాయ శాఖకు చెందిన పలువురు అధికారులు దర్శించుకున్నారు.
పోలీసుల అతి..
మూలా నక్షత్రం కావడంతో దేవస్థానం టికెట్ల విక్రయాలను రద్దు చేసి అన్ని క్యూలైన్లోనూ భక్తులను ఉచితంగా అనుమతించారు. ఘాట్రోడ్డులో కొండపైకి వస్తున్న భక్తులను పోలీసులు నియంత్రించే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఓ మహిళకు పోలీసు అధికారి చేయి బలంగా తగలడంతో ఆ భక్తురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు వినాయకుడి గుడి అన్ని క్యూలైన్లు కిటకిటలాడాయి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అమ్మవారికి మహా నివేదన, పంచహారతుల నేపథ్యంలో గంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో క్యూలైన్లో రద్దీ మరింత పెరిగింది. రాత్రి 12 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రికార్డు స్థాయిలో అమ్మవారి దర్శనం కల్పించినట్లయింది. అమ్మవారికి బాలభోగ నివేదన, మహా నివేదన, పంచహారతుల సమయం మినహాయిస్తే 21 గంటల పైగా అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.
ఆర్జిత సేవలలో ఉభయదాతలు
మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక లక్ష కుంకుమార్చన, ప్రత్యేక శ్రీచక్రనవార్చన, ప్రత్యేక చండీహోమంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థానం ఘాట్రోడ్డు మీదగా వచ్చే అన్ని వాహనాలను నిలిపివేసింది. ఉభయదాతల కోసం గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, పున్నమీ, భవానీ ఘాట్ల నుంచి దేవస్థానం బస్సులను నడిపింది. దీంతో ఉభయదాతలు దేవస్థాన బస్సులలో కొండపైకి చేరుకుని ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. వీఐపీల పేరిట వచ్చే వారిని పూర్తిగా కట్టడి చేశారు. క్యూలైన్ బయట నుంచి ఎవరూ కొండపైకి చేరుకోకుండా పోలీసులు ఘాట్రోడ్డులో పలు చోట్ల స్కానింగ్ చేయడంతో క్యూలైన్లలో భక్తులు త్వరత్వరగా అమ్మవారిని దర్శించుకున్నారు.
సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మకు నీరాజనం
మంగళవారం అర్ధరాత్రి నుంచే బారులు తీరిన భక్తులు 21 గంటల పాటు అమ్మవారి దర్శనం చదువుల తల్లికి పలువురు ప్రముఖులు పూజలు
Comments
Please login to add a commentAdd a comment