పేకాట శిబిరంపై దాడి | - | Sakshi
Sakshi News home page

పేకాట శిబిరంపై దాడి

Published Sat, Sep 28 2024 12:36 AM | Last Updated on Sat, Sep 28 2024 12:36 AM

-

దమ్మపేట: మండలంలోని నాగుపల్లిలో పేకాట శిబిరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి కథనం ప్రకారం.. నాగుపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఆరుగురు పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ.4,550 నగదు, రెండు బైకులు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో...

మణుగూరుటౌన్‌: మున్సిపాలిటీ పరిధిలో పేకాట స్థావరంపై మణుగూరు పోలీసులు దాడి చేసి, ఐదుగురిని అదుపులోకి తీసుకుని శుక్రవారం సాయంత్రం కేసు నమోదు చేశారు. శ్రీశ్రీనగర్‌లో ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా ఎస్‌ఐ రంజిత్‌ దాడి చేసి, ఐదుగురిని అదుపులోకి తీసుకుని, రూ.1,020 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

రెడ్డిపాలెం గ్రామంలో...

బూర్గంపాడు: నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న పేకాట స్థావరంపై శుక్రవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. పదిమందిని అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి రూ.1.72 లక్షల నగదు, 11 సెల్‌ఫోన్లు, ఒక కారు, ఒక ఆటో, ఒక మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామని, వారిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజేశ్‌ తెలిపారు.

గుట్కా ప్యాకెట్లు పట్టివేత

పాల్వంచరూరల్‌: కిరాణా దుకాణంలో విక్రయిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని సీతానగర్‌ కాలనీలోని కిరాణా దుకాణంలో ఏఎస్‌ఐ సుధాకర్‌ తనిఖీ చేయగా రూ.1,820 విలువ గల గుట్కా ప్యాకెట్లు లభించగా స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి ఉదారపు రామశాంతయ్యపై కేసు నమోదు చేశారు.

వివాహిత ఆత్మహత్య

సింగరేణి(కొత్తగూడెం): మానసిక సమస్యలతో గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం కొత్తగూడెం టూటౌన్‌ పరిధిలో చోటుచేసుకుంది. టౌన్‌ సీఐ రమేశ్‌కుమార్‌ కథనం ప్రకారం.. రామవరం 7వ నంబర్‌బజార్‌ వాసి శకుంతల పాషి కుమార్తె సంజురాణి(28)కి ఏడేళ్ల కిందట ఇల్లెందుకు చెందిన కిశోర్‌తో వివాహం కాగా వారికి పాప ఉంది. కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న సంజురాణి ఐదు నెలలుగా రామవరంలో ఉంటోంది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ రమేశ్‌ఉమార్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement