నగరి : చంద్రబాబు ఆలోచనలోనే కల్తీ ఉంది తప్ప లడ్డూలో లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానిని కలిసి లడ్డూ ప్రసాదాలు అందించే సమయంలో స్వచ్ఛమైన నేతితో చేసిన లడ్డూ అంటూ ఛమత్కరించారని పచ్చ మీడియాలో వచ్చిన వార్తలపై ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. చింత చచ్చినా పులుపు చావలేదు అన్న సామెత చంద్రబాబు కోసమే పుట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలపై విచారణ, ఆధారాలు లేకుండా రాజకీయ దురుద్దేశంతో కల్తీ ఆరోపణలు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని చెప్పారు. సుప్రీం కోర్టు చంద్రబాబు వేసిన సిట్ను పక్కకు పెట్టేసి, సీబీఐ సారథ్యంలో నూతన సిట్ ఏర్పాటు చేయడంతో పాటు రాజకీయ విమర్శలు వద్దంటూ ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. అయినా దుర్బుద్ధితోనే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పచ్చ మీడియా ప్రచారం చేస్తోందన్నారు. ఆయన మాట్లాడితే కోర్టు ధిక్కారణ అవుతుంది కనుక తన మీడియాతో కల్తీ కథనాలు ప్రచారం చేస్తున్నారని ఎండగట్టారు.
Comments
Please login to add a commentAdd a comment