మధురపూడి: కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామసభలకు శనివారం కోరుకొండలో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సచివాలయం వద్ద నిర్వహించిన సభను స్థానికులు డాక్టర్ కుంచే వెంకటరమణ ఆధ్వర్యంలో బహిష్కరించి, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలలో భాగంగా శనివారం కోరుకొండకు ఆర్డీఓ కృష్ణానాయక్ హాజరయ్యారు. స్థానికులు, రైతులు సభను అడ్డుకుని తమ భూములపై హక్కులు కల్పించకపోవడంపై నిలదీశారు. ప్రజల స్వాధీనంలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కల్పించాలని డాక్టర్ కుంచే వెంకటరమణ డిమాండ్ చేశారు. దీనికి అధికారులు సముఖతను చూపకపోవడంతో సభను బహిష్కరించారు. అనంతరం సచివాలయం సమీపంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వాగత ద్వారం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎస్సై శ్యామసుందర్ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి ఆందోళనను అడ్డుకున్నారు. ఈ ఘటనపై తాహసీల్దార్ సుస్వాగతం మాట్లాడుతూ కోరుకొండ భూములకు రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఉందన్నారు. ప్రస్తుతం రీ సర్వేలో తలెత్తిన సమస్యల పరిష్కారానికే పరిష్కార వేదికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సాయంత్రం వరకూ నిర్వహించిన సభలో పలువురు వారి సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు.
కోరుకొండలో రెవెన్యూ గ్రామసభ బహిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment