ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను ఈనెల 25 వరకు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు శనివారం తెలిపారు. ఆయా రోజుల్లో ఉదయం, సాయంత్రం గ్రామోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాల నేప థ్యంలో ఈనెల 18 నుంచి 25 వరకు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తామన్నారు.
ఉత్సవాలు ఇలా..
● 18న ఉదయం శ్రీవారు, అమ్మవార్లకు పెండ్లి ముస్తాబుతో ఉత్సవాలు ప్రారంభం. రాత్రి 7 గంటలకు గజవాహనంపై గ్రామోత్సవం.
● 19న రాత్రి 7 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ, ధ్వజారోహణ. రాత్రి 9 గంటల నుంచి హంస వాహనంపై గ్రామోత్సవం.
● 20న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం.
● 21న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై గ్రామోత్సవం. రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం. రాత్రి 8.30 గంటల నుంచి వెండి శేషవాహనంపై గ్రామోత్సవం.
● 22న రాత్రి 8 గంటల నుంచి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం. అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం. ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం.
● 23న రాత్రి 7.30 గంటల నుంచి రథోత్సవం.
● 24న ఉదయం చక్రవారి–అపభృధోత్సవం, మధ్యాహ్నం వేద సభ, రాత్రి 7 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ, రాత్రి 8 గంటలకు అశ్వవాహనంపై గ్రామోత్సవం.
● 25న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవం. రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం – పవళింపుసేవతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.