నూజివీడు: భారతీయ విజ్ఞాన మండలి, విజ్ఞాన భారతి, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన స్పేస్ ఆన్ వీల్స్ బస్సు సందర్శనకు శుక్రవారం నూజివీడులో విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. నూజివీడు పట్టణంలోని సెయింట్ థామస్ పాఠశాల ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రదర్శన కొనసాగింది. నూజివీడు డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 4,300 మంది విద్యార్థులు ప్రదర్శనను సందర్శించారు. స్పేస్ ఆన్ వీల్స్ వాహనంలోని చంద్రయాన్ 1, 2, 3 మిషన్, మంగళయాన్, ఆదిత్య ఎల్1 మిషన్, శ్రీహరికోటలోని శాటిలైట్ లాంచ్ ప్యాడ్ మోడల్, ఇండియన్ రీజినల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టం, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిస్టం, టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు వాడే ఇండియన్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టం వంటి నమూనాలను విద్యార్థులు తిలకించారు. విజ్ఞాన భారతి రూపొందించిన భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తలకు చెందిన సమాచారంతో కూడిన 108 చార్టులను ప్రదర్శించారు. డీవైఈవో ఎం.సేవియా కార్యక్రమాన్ని ప్రారంభించగా సెయింట్థామస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు బ్రదర్ చిన్నప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నూజివీడు ఆర్డీఓగా మొవిడి వాణి
నూజివీడు: నూజివీడు రెవిన్యూ డివిజన్ అధికారిగా మచిలీపట్నం ఆర్డీఓగా పనిచేస్తున్న మొవిడి వాణిని నియమితులయ్యారు. అక్కడ పనిచేస్తున్న ఆర్డీఓ వై.భవానీశంకరి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్డీఓగా బదిలీ అయ్యారు. భవానీశంకరి ఈ ఏడాది ఫిబ్రవరిలో నూజివీడు ఆర్డీఓగా రాగా, ఇంతలోనే బదిలీకావడం గమనార్హం.
నేడు దేవాలయాల్లో వైఎస్సార్సీపీ పూజలు
కై కలూరు: తిరుమల తిరుపతి దేవస్థానంపై లేనిపోని అభాండాలు వేసి వైఎస్సార్సీపీకి అపాదించే కుట్రను నిరసిస్తూ దేవాలయాల్లో శనివారం పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) శుక్రవారం కోరారు. కై కలూరులో ఏలూరు రోడ్ పార్టీ కార్యాలయం వద్ద ఉదయం 8.30 గంటలకు పార్టీ నాయకులు రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ హాజరవుతారని తెలిపారు.
మున్సిపల్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ నాయకులు శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహంకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలపై గతంలో అనేక సార్లు వినతిపత్రం ఇచ్చినప్పటికీ.. సమస్యలు పరిష్కరించలేదని అందువల్లే ఆందోళన తీవ్రతరం చేశామన్నారు. మున్సిపల్ హైస్కూల్లో తగినంత మంది సబ్జెక్ట్ టీచర్లను నియమించేలా ఎస్జీటీ, పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్లోగా అప్గ్రేడ్ పోస్టులలో మున్సిపల్ టీచర్లకు ప్రమోషన్ ఇవ్వాలని, మున్సిపల్ ప్రధానోపాధ్యాయుల్లో అర్హులైన వారిని అర్బన్ ఎంఈఓగా నియమించాలని, మున్సిపల్ టీచర్లకు సీపీఎఫ్ ఖాతాలు తెరిపించాలని కోరారు. ఆయా సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర సంఘం ఇచ్చిన కార్యచరణలో భాగంగా గాంధీ జయంతి రోజున ఏలూరు కార్పొరేషన్ పరిధిలో సత్యాగ్రహ దీక్ష చేపడతామని, అక్టోబర్ 17న డీఈఓ కార్యాలయం వద్ద సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తామని, సమస్యలు పరిష్కరించని పక్షంలో అక్టోబర్ 24న ధర్నా నిర్వహిస్తామన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ముస్తఫా ఆలీ, రవికుమార్ రుద్రాక్షి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment