జగిత్యాలజోన్: మహిళలకు మరింత చేరువగా సఖి సేవలు అందించాలని జగిత్యాల సబ్ జడ్జి ప్రసాద్ అన్నారు. స్థానిక సఖి కేంద్రంలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆపదలో ఉన్న మహిళలను అన్ని విధాలుగా ఆదుకుంటోందని, వారికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో చైల్డ్ వేల్ఫేర్ ఆఫీసర్ వాణిశ్రీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డబ్బు లక్ష్మారెడ్డి, సఖి సెంటర్ నిర్వాహకురాలు మనీల, అశ్విని, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ చంద్రమోహన్, సతీశ్, విజయకృష్ణ పాల్గొన్నారు.
జైలును సందర్శించిన న్యాయ సేవా కార్యదర్శి
జగిత్యాలజోన్: జిల్లాకేంద్రంలోని స్పెషల్ సబ్ జైలును జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కె.ప్రసాద్ శనివారం సందర్శించారు. ఖైదీలకు అందుతున్న వసతులను జైలర్ మొగిలేశ్, ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఆర్థికంగా లేనివారికి న్యాయ సేవా సంస్థ తరఫున ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. న్యాయవాదిని కూడా నియమిస్తామన్నారు. ఆయన వెంట జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ కటుకం చంద్రమోహన్, అసిస్టెంట్ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.సతీశ్, ఆర్.విజయ్కృష్ణ, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ముందుగా గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యం చెల్లించాలి
కోరుట్ల రూరల్: బీడీ కార్మికులకు ఏప్రిల్ నుంచి పెరిగిన కరువు భత్యం చెల్లించాలని బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రారష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కోరారు. పట్టణంలోని సీ ప్రభాకర్ స్మారక భవన్లో మాట్లాడారు. బీడీ కార్మికులకు ఏటా ఏప్రిల్లో ఒప్పందం ప్రకారం కరువుభత్యం పెంచాల్సి ఉంటుందన్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భత్యం ప్రకటించాలని, లేకుంటే ఈనెల 15 తర్వాత సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. బీడీ కార్మిక సంఘం నేతలు కొక్కుల శాంత, ఎండీ.ముక్రం, చెన్నా విశ్వనాథం, ఎన్నం రాధ, బాగమ్మ, అనసూయ, ఎండీజఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి వసతులు కల్పించండి
జగిత్యాల: పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి వసతులు కల్పించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాళ్ల అమర్నాథ్రెడ్డి, ఆనందరావు అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. ఎండల దృష్ట్యా రిసెప్షన్ సెంటర్లో ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి కౌంటర్లలో ఉన్న సిబ్బందికి సరిపడా కూలర్లు అమర్చాలని, ఎన్నికల సిబ్బందిని తీసుకెళ్లే వాహనాలు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలన్నారు. రిసెప్షన్ సెంటర్లలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అవరసమైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ స్పందిస్తూ చర్యలు తీసుకుంటామన్నారు.