ఉపశమనం కోసం తండ్లాట: జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే కూలర్లు, ఏసీలు, ఆన్చేసుకుని ఇంట్లోనే ఉండిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు టోపీలు, రుమాలు ధరించాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే శీతల పానియాలు, కొబ్బరిబొండాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది.
ప్రచారానికి ఎండదెబ్బ
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ వివిధ పార్టీల్లో ప్రచారం ఊపందుకుంది. ఎండను లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నప్పటికీ అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పార్టీల నాయకులు కూడా కార్యకర్తలను రమ్మనేందుకు జంకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఉదయం పూట అయితే ప్రజలు కలుస్తారని భావిస్తూ.. తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలింగ్ వరకు ఇదే ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పార్టీ ఎన్నికల ప్రచారం సప్పసప్పగా కొనసాగుతోంది. అగ్రనేతలు సైతం జిల్లాలో పర్యటిస్తున్నప్పటికీ ప్రజలు అనుకున్నంత స్థాయిలో రావడం లేదు. ఎండలో జాగ్రత్తలు తీసుకోకుండా తిరిగితే వడ దెబ్బకు గురయ్యే అవకాశాలున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకువెళ్లకూడదని చెబుతున్నారు. ప్రొటీన్ స్థాయి తగ్గిపోయి అవయవాలు పనిచేయవంటున్నారు. శరీర ఉష్ణోగ్రతలు మామూలు స్థితిలో ఉండేలా చూసుకోవాలని, చిన్నారులు, వృద్ధులు బయటకు రావద్దని చెబుతున్నారు. ఏదేమైనా జిల్లాలో పగటి పూట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు పేర్కొంటున్నారు.
వడగాలులు వీచే అవకాశం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ధర్మపురి మండలం నేరేళ్లలో 46.7, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్లో 46.3, ధర్మపురి మండలం బుర్దేశ్పల్లిలో 46.1, జైనాలో 46.0, రాయికల్ మండలం అల్లీపూర్లో 45.9, బీర్పూర్ మండలం కొల్వాయిలో 45.8, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 45.2, వెల్గటూర్ మండలం గుల్లకోటలో 45.2, ఎండపల్లి మండలం మారేడుపల్లిలో 45.2, కోరుట్ల మండలం అయిలాపూర్లో 45.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో నాలుగైదురోజులు వడగాలుల తీవ్రత ఉండే అవకాశం ఉందని, మధ్యాహ్న సమయంలో అవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నాలుగైదు రోజులపాటు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలోనే 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్లో నమోదు అయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు బయటకు వెళ్లకూడదు. మంచినీరు, కొబ్బరినీరు ఎక్కువగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. – శ్రీధర్, డీఎంహెచ్వో