శివమొగ్గ: ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి చెందిన ఘటన శుక్రవారం జిల్లాలోని తీర్ధహళ్లి తాలూకా బెజ్జవళ్లి సర్కిల్ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. బెజ్జవళ్లి సమీపంలోని తనికల్ కౌట్మనె నివాసి ప్రథమ్(16) అనే డిప్లొమా విద్యార్థి బైక్పై కాలేజీకి బయల్దేరాడు. అడ్డ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డులోకి వెళ్తుండగా శివమొగ్గ వైపు నుంచి తీర్థహళ్లి వైపు వెళ్తున్న టూరిస్టు బస్సు ఢీకొంది. ప్రమాద తీవ్రతకు బైక్.. బస్సుకిందకు దూసుకెళ్లి ప్రథమ్ గాయపడ్డాడు. తీర్థహళ్లి ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మంగళూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఘటనాస్థలాన్ని సీఐ కుమార్ పరిశీలించారు. మాళూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
గుండెపోటుతో ఏఎస్ఐ మృతి
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని కామాక్షిపాళ్య పోలీస్స్టేషన్ ఏఎస్ఐ శివశంకరాచారి గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఆయన విధినిర్వహణలో ఉండగా స్టేషన్లోనే కుప్పకూలిపయాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈడీ దాడులు రాజకీయ ప్రేరేపితం
● మాజీ ఎంపీ డీకే సురేశ్
దొడ్డబళ్లాపురం: మైసూరులోని ముడా కార్యాలయంపై ఈడీ దాడులు రాజకీయ ప్రేరితమని మాజీ ఎంపీ డీకే సురేశ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలపై ఇలాంటి దాడులు సాధారణమే అన్నారు. ముడా కేసులో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదన్నారు. చివరకు సత్యమే గెలుస్తుందన్నారు.
మెడికో దుర్మరణం
ఉరవకొండ: స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నర్రా సుజాత, రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్టు అధినేత నర్రా కేశన్న దంపతుల కుమారుడు నర్రా చైతన్య(23) శుక్రవారం బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శివమొగ్గలోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న చైతన్య బెంగళూరులో మిత్రుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా డివైడర్ను ఢీకొన్నారు. చైతన్యకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చైతన్య మృతిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, శాసనమండలి సభ్యుడు వై.శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, యువనేత వై.ప్రణయ్రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కాగా చైతన్య తండ్రి నర్రా కేశన్న ఉరవకొండ వాసులకు సుపరిచితులు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి సేవలు అందించేవారు. కుమారుడిని డాక్టర్ను చేసి ఉచిత సేవలు అందించాలని నర్రా కేశన్న దంపతుల ఆశయం. అయితే కుమారుడు నర్రా చైతన్య అర్ధంతరంగా తనువు చాలించడంతో వారి కలల సౌధం కుప్పకూలింది.
Comments
Please login to add a commentAdd a comment