వరంగల్ క్రైం: చింతపండు, యూరియా బస్తాల మధ్య గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి రూ.2.35 లక్షల విలువైన 9.5 కిలోల గంజాయితో పాటు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి తెలిపారు. ఈమేరకు శనివారం హనుమకొండ పీఎస్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. స్నేహితులైన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం పొన్నవరానికి చెందిన ఈదవ కృష్ణనాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరుకు చెందిన ఆనుమోలు వెంకటరమణ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఏపీలోని సీలేరుకు చెందిన సురేష్ వద్ద గంజాయి కొనుగోలు చేశారు. ఎవరికి అనుమానం రాకుండా చింతపండు, యూరియా బస్తాల నడుమ గంజాయి బస్తాలు పెట్టి హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ రహీం, మధ్యప్రదేశ్లోని రీవా జిల్లా మన్ఘవ్ మండలం ధారావిఘకు చెందిన శ్రీకర్ త్రిపాఠికి అందజేసేందుకు శుక్రవారం బస్సులో హనుమకొండ బస్టాండ్కు వచ్చాకు. ఈమేరకు పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన హనుమకొండ ఎస్సై శ్రవణ్కుమార్ వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. కాగా, ముఠా సభ్యుడైన ఏపీలోని సీలేరుకు చెందిన సురేష్ పరారీలో ఉన్నాడని ఏసీపీ వివరించారు.
నలుగురు అరెస్ట్.. నిందితుల్లో ఖమ్మం జిల్లా వాసి