జగ్గయ్యపేటఅర్బన్: అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పచ్చిపాల నాగేశ్వరరావు వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయన శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమక్షంలో చేరారు. ఉదయభాను ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పచ్చిపాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానాలు నచ్చి తాను పార్టీలో చేరినట్లు తెలిపారు. పెనుగంచిప్రోలు దేవస్థానం చైర్మన్ పదవి, పేట మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కూడా యాదవ సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉదయభాను ఇస్తున్న ప్రాధాన్యత స్ఫూర్తిదాయకం అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఈ విధంగా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు కుంభం వెంకటేశ్వర్లు, బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కోసూరి ప్రహ్లాద్, మండల బీసీ నాయకుడు మార్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వినూత్నంగా
ఎన్నికల ప్రచారం
విజయవాడస్పోర్ట్స్: ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహించి విజయవాడ ప్రజల దృష్టిని ఆకర్షించాడీ యువకుడు. కృష్ణలంకకు చెందిన శివకుమార్ తన ద్విచక్ర వాహనాన్ని పూర్తిగా వైఎస్సార్సీపీ స్టిక్కర్లతో చుట్టేశాడు. ఆ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ను వాహనం ముందు అమర్చి వీధుల్లో చక్కర్లు కొడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. వెల్డింగ్ వర్కర్గా జీవనం సాగిస్తున్న తాను సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడనై.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకుని పార్టీ తరఫున స్వచ్ఛందంగా ప్రచారం చేసినట్లు శివకుమార్ చెప్పారు.