● జాబ్ కార్డు ఉంటే పండ్లతోటల సాగుకు అర్హులే ● సన్న, చిన్న కారు రైతులకు ప్రాధాన్యత ● డ్వామా పీడీ అమరనాథరెడ్డి వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చిన్న, సన్న కారు రైతుల పండ్లతోటల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... 2023–24లో 6,450 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేయాలన్నది లక్ష్యమని, ఈ లక్ష్యాన్ని క్లస్టర్, మండలాల వారీగా విభజించినట్లు తెలిపారు. ఆదోని క్లస్టర్లో 1,100 ఎకరాలు, ఆలూరు క్లస్టర్లో 1050 ఎకరాలు, కర్నూలు క్టస్టర్లో 1600, పత్తికొండ క్లస్టర్లో 1700, ఎమ్మిగనూరు క్లస్టర్లో 1000 ఎకరాల ప్రకారం పండ్లతోటలు అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. 5 ఎకరాలలోపు భూమి కలిగి జాబ్ కార్డు ఉన్న వారందరూ పండ్లతోటలు అభివృద్ధి చేసుకునేందుకు అర్హులేనని ఆయన పేర్కొన్నారు. ఉపాధి కింద 100 శాతం సబ్సిడీ లభిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 1,677 మంది రైతులకు సంబంధించి 2756.33 ఎకరాల్లో పండ్లతోటల అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. 439 ఎకరాలకు రూ.7.07 కోట్లతో అంచనాలు వేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో ఉపాధి సిబ్బంది పండ్లతోటల అభివృద్ధి వల్ల కలిగే ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆసక్తి ఉన్న రైతులు 91211 03297 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment