మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో నవరాత్రి వేడుకలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ పలికారు. గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠం విద్యార్థులు, పండితులు దుర్గా సూక్తి పఠిస్తుండగా వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామిజీ ఘట స్థాపన గావించారు. అనంతరం గ్రామ దేవత మంచాలమ్మ సన్నిధానంలో పుష్ప, కుంకుమార్చనలు చేపట్టారు. మహా మంగళహారతులు పట్టి ప్రత్యేక అలంకారంలోని మంచాలమ్మను దర్శించుకున్నారు.
స్వల్పంగా పెరిగిన ఉల్లి ధర
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి ధర కాస్త పెరిగింది. మార్కెట్కు ఉల్లి తాకిడి కూడా కొంతమేర తగ్గింది. గురువారం మార్కెట్కు 245 మంది రైతులు 7,475 క్వింటాళ్ల ఉల్లి విక్రయానికి తీసుకొచ్చారు. కనిష్ట ధర రూ.495, గరిష్ట ధర రూ.4,119 లభించింది. గరిష్ట ధర కొంత మేర పెరిగినప్పటికీ సగటు ధర మాత్రం రూ.2,658 నమోదైంది. ఎక్కువ మంది రైతులు తెచ్చిన ఉల్లికి రూ.1,500 నుంచి రూ.2,800 వరకు మాత్రమే ధర లభించింది. వ్యాపారులు సిండికేట్ అవుతుండటంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. గరిష్ట ధర రూ.4,119 ఉన్నప్పుడు సగటు ధర కూడా రూ.3,600 వరకు ఉంటేనే రైతులకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆర్అండ్బీ ఎస్ఈ
బాధ్యతల స్వీకరణ
కర్నూలు న్యూసిటీ: రోడ్లు, భవనాల శాఖ జిల్లా పర్యవేక్షక ఇంజినీర్గా పి. మహేశ్వరరెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ఈఈలు, ఏఈఈలు, సిబ్బంది తదితరులు బొకేలు అందించి అభినందనలు తెలిపారు. 2013 –18 మధ్య కాలంలో ఈయన అమరావతి ప్రాంతంలో విధులు నిర్వర్తించారు. నంద్యాల, ప్రొద్దుటూరులో రెండేళ్లపాటు పని చేసి వైఎస్సార్ జిల్లాకు బదిలీ అయ్యి, అక్కడి నుంచి ఇటీవల కర్నూలు జిల్లా బదిలీ అయ్యారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
బీఈడీ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో మేలో నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) 3వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు https:// rayalaseemauniversity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 502 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 295 మంది ఉత్తీర్ణులు అయినట్లు తెలిపారు.
ఆర్టీసీ పాస్ల జారీకి కొత్త సాఫ్ట్వేర్
కర్నూలు సిటీ: ఏపీఎస్ ఆర్టీసీలో బస్సు పాసుల జారీకి వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ను మార్పు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా ప్రజా రవాణా విభాగం 2వ డిపో మేనేజర్ సర్దార్ హూసేన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సాఫ్ట్వేర్ను ఆధునికీకరిస్తుండటంతో ఈనెల 5, 6 తేదీ ల్లో బస్ పాసుల జారీ బ్రేక్ పడనుందన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించాలని, 7వ తేదీ నుంచి యథావిధిగా బస్ పాస్ల జారీ చేయ డం జరుగుతుందన్నారు.
కేజీబీవీల్లో సిబ్బంది నియామకానికి దరఖాస్తులు
కర్నూలు సిటీ: కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది(కాంట్రాక్ట్), బోధనేతర సిబ్బంది(ఆవుట్సోర్సింగ్) నియమాకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త(అదనపు) కాగిత శామ్యూల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులన్నారు. apkgbv.apcfss.in వెబ్సైట్లో రూ.250 రుసు ము చెల్లించి, ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 70750 39990, 70751 59996ను సంప్రదించవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment