గార్ల: మండలంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వరస్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది. గురువారం వేంకటేశ్వరస్వామి సమేత శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకీలో ఏర్పాటు చేసి మేళతాళాల మధ్య ఊరేగిస్తూ.. ఎదుర్కోళ్లు నిర్వహించి, ఆలయం ఎదుట ఉన్న కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. కాగా జిల్లాలోని డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామం నుంచి మల్లం గోపయ్య, మల్లం నర్సయ్య వంశస్తులు తలంబ్రాలు తీసుకురాగా.. అర్చకులు కండ్లకుంట్ల వెంకటాచార్యులు, రామాయణం అచ్చుతాచార్యులు, రామాచార్యులు, యాదగిరిస్వామి కల్యాణ తంతును ఘనంగా నిర్వహించారు. జిల్లాతో పాటు ఖమ్మం, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కల్యాణ వేడుకలను తిలకించి భక్తిపారవశ్యం పొందారు. భూక్య కస్నానాయక్, పుల్లఖండం రమేష్బాబు, పి. కుటుంబరావు, మాజీ సర్పంచ్లు అజ్మీరా బన్సీలాల్, గంగావత్ లక్ష్మణ్నాయక్, ఆలయ ఈఓ సమత, భూక్య హరి, ఎం. రాములు, పి.శ్రీనివాస్గుప్త, వేమిశెట్టి శ్రీనివాస్, బాదావత్ చంటి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment