J&K Elections: హిమసీమ చరిత్రలోనే అత్యధిక ‘ఎన్నికల’ వేడి | All eyes now on Jammu kashmir assembly Elections After 10 years | Sakshi
Sakshi News home page

హిమసీమ చరిత్రలోనే అత్యధిక ‘ఎన్నికల’ వేడి ఇదే!

Aug 27 2024 4:01 AM | Updated on Aug 27 2024 6:55 AM

All eyes now on Jammu kashmir assembly Elections After 10 years

కల్లోల కశ్మీరంలో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు 

కేంద్రపాలిత ప్రాంతంగా మారాక తొలిసారి 

370 రద్దు తర్వాత ఇదే తొలి బ్యాలెట్‌ పోరు 

ప్రజల మనోగతాన్ని పట్టివ్వనున్న ఫలితాలు 

. దశాబ్దాలుగా ఉగ్ర దాడులకు, కల్లోలానికి పర్యాయపదం. అశాంతితో అట్టుడికిపోతూ వస్తున్న ఆ ప్రాంతంలో ఉగ్ర దాడులు పెద్దగా తగ్గకున్నా కొన్నాళ్లుగా కాస్త ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పదేళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 

కు ప్రత్యేక హోదా కలి్పంచిన ఆర్టికల్‌ 370 రద్దు, నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణతో పాటు కాంగ్రెస్‌ కీలక నేత గులాం నబీ ఆజాద్‌ కొత్త పార్టీ స్థాపన వంటి కీలక పరిణామాలెన్నో ఈ పదేళ్లలో చోటుచేసుకున్నాయి. 

ఈ రాజకీయ పరిణామాలపై, లోయలో శాంతిస్థాపన యత్నాలు తదితరాలపై ప్రజల మనోగతానికి ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టే అవకాశముందని భావిస్తున్నారు. దాంతో పీడీపీ, ఎన్‌సీ వంటి స్థానిక పారీ్టలతో పాటు ప్రధాన  పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పైగా జమ్మూ కశీ్మర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ప్రజల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.      

పునర్‌ వ్యవస్థీకరణతో... 
దశాబ్దకాలంగా జమ్మూ కశీ్మర్‌ రాజకీయ ముఖచిత్రం ఊహాతీతంగా మారిపోయింది. 2026 జనగణన దాకా నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ జరపరాదన్న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని పక్కన పెట్టి 2022లో ఈ ప్రక్రియ చేపట్టారు. అసెంబ్లీ స్థానాలను 87 (లడ్ఢాఖ్‌లోని 4 స్థానాలను మినహాయిస్తే) నుంచి 90కి పెంచారు. మొత్తం సీట్ల సంఖ్య పెద్దగా పెరగకున్నా ముస్లిం ప్రాబల్య కశీ్మర్‌లో సీట్లు 47కు తగ్గి, హిందువులు ఎక్కువగా ఉండే జమ్మూలో 43కు పెరగడం విశేషం. 

జమ్మూలోని సాంబా, రాజౌరీ, కథువా జిల్లాల్లో రెండేసి సీట్లు పెరిగితే కశ్మీర్‌లో ఒక్క స్థానం (కుప్వారాలో) పెరిగింది. అంతకుముందు కశీ్మర్‌లో 46, జమ్మూలో 37, లడ్ఢాఖ్‌ ప్రాంతంలో 4 సీట్లుండేవి. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకశ్మీర్‌ జనాభాలో 43.8 శాతం మంది జమ్మూలో, 56.2 శాతం కశీ్మర్‌లో నివసిస్తున్నారు. కశీ్మర్‌లోని ఉత్తరాది జిల్లాల్లో అత్యంత సున్నిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణ కత్తిమీద సామేనని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలన్నది నిర్ణయాన్ని ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా స్వాగతించారు. ఈ క్షణాల కోసం జమ్మూ కశీ్మర్‌ ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఎల్జీదే పెత్తనం
2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పటి నుంచీ జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. నాటినుంచీ కీలక అధికారాలన్నీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతిలోనే కేంద్రీకృతమయ్యాయి. అసెంబ్లీ అధికారాలు కుంచించుకుపోయాయి. దాదాపుగా ప్రభుత్వ నిర్ణయాలన్నింటికీ ఎల్జీ ఆమోదముద్ర తప్పనిసరిగా మారింది. పోలీసు వ్యవస్థతో పాటు భూములకు సంబంధించిన అన్ని అంశాలపైనా ఎల్జీదే నిర్ణయాధికారం.

2014 ఎన్నికల్లో ఏం జరిగింది? 
→ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కశీ్మర్‌ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 65.52 శాతం ఓటింగ్‌ నమోదైంది. 
→ పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ) 28 స్థానాలతో ఏకైక అతి పెద్ద పారీ్టగా నిలిచింది. 
→ రెండో స్థానంలో నిలిచిన బీజేపీకి 25 సీట్లొచ్చాయి. 
→ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ)కి 15, కాంగ్రెస్‌కు 12 స్థానాలు దక్కాయి. 
→ స్థానిక చిన్న పారీ్టలు, స్వతంత్రులకు 7 సీట్లొచ్చాయి. 

ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడంతో చివరికి బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా సంకీర్ణ సర్కారు ఏర్పడింది. కానీ విభేదాల నేపథ్యంలో 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ఆ సర్కారు కుప్పకూలింది. ఆ తర్వాత 2020లో జిల్లా అభివృద్ధి మండళ్లకు, తాజాగా గత మేలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో  ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటువేశారు.

కాంగ్రెస్, ఎన్‌సీ పొత్తు 
ఈసారి కాంగ్రెస్, ఫరూక్‌ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పొత్తు కుదుర్చుకుని రంగంలోకి దిగుతున్నాయి. ఇందులో భాగంగా 51 స్థానాల్లో ఎన్‌సీ, 32 చోట్ల కాంగ్రెస్‌ పోటీ చేస్తాయి. సీపీఎం, పాంథర్స్‌ పారీ్టలకు ఒక్కో స్థానం చొప్పున కేటాయించాయి. మిగతా 5 చోట్ల ఎన్‌సీ, కాంగ్రెస్‌ స్నేహపూర్వక పోటీకి దిగుతుండటం విశేషం. మరోవైపు బీజేపీ 16 మంది అభ్యర్థుతో తొలి జాబితా విడుదల చేసింది. తొలుత 44 మంది పేర్లు ప్రకటించినా వాటిలో పలు పేర్లపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆ జాబితాను రద్దు చేసింది. ఇక మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ ఇప్పటిదాకా రెండు విడతల్లో 16 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. గులాం నబీ ఆజాద్‌ నేతృత్వంలోని డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ (డీపీఏపీ) కూడా 13 మందితో తొలి జాబితా విడుదల చేసింది.

ఈ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యం ఎందుకంటే... 
లో గత పదేళ్లలో అన్నివిధాలుగా సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. అటు రాష్ట్ర హోదా రద్దయి కేంద్రపాలిత ప్రాంతంగా మారడం మొదలుకుని రాజకీయంగా కూడా ఎన్నో పరిణామాలు జరిగాయి. వీటన్నింటిపైనా సగటు జమ్మూ కశీ్మర్‌ ప్రజల మనోగతానికి వారి ఓటింగ్‌ సరళి అద్దం పట్టనుంది. అందుకే ఈ ఎన్నికలను జమ్మూ కశ్మీర్‌ చరిత్రలోనే కీలకమైనవిగా భావిస్తున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement