పోచంపల్లి(జగ్గయ్యపేట):పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పారా శ్రీను (48) సమీపంలోని పంట పొలంలో పురుగుల మందు తాగి ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఈ కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కుటుంబ సభ్యులు అంటున్నారు. చిల్లకల్లు ఎస్ఐ సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోను ఢీకొన్న లారీ.. మహిళ మృతి
మరో ముగ్గురికి గాయాలు
జగ్గయ్యపేట:ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలైన ఘటన పట్టణంలోని బలుసుపాడు రోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని రెడ్డినాయక్తండ, బూదవాడ గ్రామాలకు చెందిన గుగులోతు విజయ, కూరపాటి సుధారాణి, బాణావత్ సక్కు, సాల్విలు ఆటోలో వారి గ్రామానికి జగ్గయ్యపేట నుంచి బలుసుపాడు రోడ్డు మీదుగా బయలుదేరారు. ఈ క్రమంలో బలుసుపాడు నుంచి జగ్గయ్యపేటకు వస్తున్న లారీ ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ (25) తలకు ఇనుప రాడ్డు బలంగా తగలటంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.